ఎప్పుడు తను నవల వ్రాయడం ప్రారంభించినా ఇలాగే ఉండేది. అవి సజీవ పాత్రలు. తన బుర్రలో అల్లరి చేసేవికావు. తనకు రెండో రోజు రాయాల్సిన విషయాలను చెప్పేవి. ఆ అనుభూతి వేరు. ఆ సంతృప్తి వేరు.
ఇదేమిటి ? ఇవన్నీ దయ్యాలూ - పిశాచాలూ తలలో అల్లరి చేస్తున్నాయి.
తను వ్రాసిన కథలూ, నవలలూ, ఒకప్పుడు-దాదాపు పదేళ్లక్రితం వరకు పుల్లారెడ్డి నేతి మిఠాయిల్లా అమ్ముడయేవి.
తన రచనలు అచ్చువేసి, అమ్ముకొని ఇళ్లు కట్టుకొన్నవాళ్ళున్నారు.
కారుల్లో తిరిగే స్తోమతను తెచ్చుకున్నవాళ్లున్నారు.
కేవలం తన రచనలనేకాదు తనలాంటివారి మేధలను కొని, కారుచౌకగా కొని, మార్కెట్ లో అమ్ముకొని లావెక్కిన వాళ్ళెందరో !
తన రక్తం తాగిన వాళ్ళు ఒక వైపు బలుస్తూ ఉంటే మరోవైపు తను రోజూ రోజుకూ క్షీణించిపోయాడు.
ఆనాడు తన భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. సాహిత్యపు ట్రెండు మారితే తన కుటుంబం ఏమైపోతుందని ఆలోచించలేదు. ఏ రచయితా భవిష్యత్తు గురించి, అంటే డబ్బు సంపాదించుకొని భవిష్యత్తులో సుఖపడ్డామని ఆలోచించడు. అలా ఆలోచించేవాడు రచయితేకాదు.
తనను తను సమర్ధించుకొంటున్నాడా ?
తన అసమర్థతను ఇలా సర్దుకుని తన మనసునే జో కొట్టి నిద్ర పుచ్చడానికి ప్రయత్నిస్తున్నాడా?
తను బ్రతకాల్సిందీ, తన భార్యా బిడ్డలూ బ్రతకాల్సిందీ తన రచనల మీదేననే జ్ఞానం లేకపోవడం తన నిజాయితీకి నిదర్శనంగా భావించి తృప్తి పడ్తున్నాడా?
కాదు ! కాదు ! తన ఆలోచనా విధానం వేరు.
రచనలు తను పేరు కోసం చెయ్యలేదు.
అయితే పేరు వచ్చినప్పుడూ, పది మంది ప్రశంసించినప్పుడూ తనకు ఆనందం కలగలేదని చెప్పుకోవడం ఆత్మద్రోహమే.
తను డబ్బు కోసం వ్రాయలేదు.
తన రచనకు ఎక్కువ పారితోషికం లభించినప్పుడు తనకు సంతృప్తి కలగలేదా? కలిగింది. తన కుటుంబంలోని సభ్యులు సుఖంగా జీవిస్తున్నారనే సంతృప్తి తనకు కలిగింది. అంతే! కాని, పాఠకులు ఏం కోరుకుంటున్నారు? ఏ సరకు సప్లై చేస్తే ఎక్కువ డబ్బు వస్తుందని తాను ఆలోచించలేదు.
రచయిత అయిన వాడెవ్వడూ అలా ఆలోచించడు. అందులో తన ప్రత్యేకత ఏమీలేదు.
రచయిత అంటే నిజాయితీ గల రచయిత పేరు కోసం మాత్రమే వ్రాయడు.
డబ్బు కోసం అసలే రాయడు.
మరెందుకు వ్రాస్తారని కదూ మీ సందేహం ?
వ్రాస్తారు.
వ్రాయకుండా ఉండలేరు కనక వ్రాస్తారు.
అందుకే తనూ వ్రాశాడు.
కాని ఈ రోజు ఏమైంది ?
తనను వ్రాయమని ఎవరూ అడగడంలేదు.
పత్రికలు పెరుగుతున్నాయి.
రచయితలూ పెరుగుతున్నారు.
మేధావులూ, బాగా చదివినవాళ్లూ ఈ నాటికీ తనను గొప్ప రచయితగా గుర్తిస్తూనే ఉన్నారు.
లాభం? ఆ గుర్తింపు తనకు తిండి పెడుతుందా ?
ఆ గుర్తింపు తన ఆకలి తీరుస్తుందా ?
తన భార్యా బిడ్డల పొట్టలు నింపుతోందా?
తను ఇంకా వ్రాస్తూనే ఉన్నాడు.
ఓపిక లేకపోయినా వ్రాస్తూనే ఉన్నాడు.
వ్రాసి, అభిమానం చంపుకొని, పబ్లిషర్ దగ్గరకెళ్ళి వ్రాత ప్రతిని సమర్పించుకొని ఏ వందో, రెండొందలో తెచ్చుకొంటున్నాడు. వాళ్లు తన పుస్తకాలు వేస్తూనే ఉన్నారు. తనకు ప్రత్యేక పాఠకులున్నారని తనకూ తెలుసు. అయినా పబ్లిషర్ తనమీద జాలితప్ప అచ్చువేస్తున్నట్టు ముఖం పెట్టి అయిష్టంగా ఓ రెండొందలు అందిస్తాడు.
తనకు అభిమానంతో అక్కడి కక్కడే చచ్చిపోవాలనిపిస్తుంది.
కాని తనమీద ఆధారపడిన ఆ ఇల్లాలు, ఆమె వెనక ఉన్న ఆ నలుగురు సంతానం అనబడే సైన్యం ఏం కావాలి ? రెండోవాడు తెలివైనవాడు. ఈ కొంపలో ఉంటే పొట్టనిండా తిండికూడా దొరకదని వాడు అర్థం చేసుకొన్నాడు. ఇలాంటి కుటుంబాల్లో సంప్రదాయాల పేరుతో ఉండే హిపోక్రసీని కూడా తెలుసుకొన్నాడు. అందుకే పద్దానుగేళ్ళు పూర్తి అవకుండానే వెళ్ళిపోయాడు. ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఏం చేస్తున్నాడో తెలీదు. ఇక్కడ ఈ ఇంట్లోకంటే సుఖంగానే ఉండి ఉంటాడని తన నమ్మకం. అందుకే వాడి గురించి తను పెద్దగా ఆలోచించడు. కృష్ణవేణి మాత్రం వాడ్ని తల్చుకొని ఏడుస్తూ ఉంటుంది.
"వెలుగు-చీకటి" సంపాదకుడికి అతనికి నచ్చే నవల, పాఠకులు మెచ్చే నవల ఇస్తానని ఐదు వందలు అడ్వాన్సు తెచ్చుకున్నాడు. ఇరవై పేజీలు రాశాడు. అంతే! జబ్బు పడ్డాడు పది లంఖణాలు చేశాడు.
నిన్ననే పథ్యం తీసుకొన్నాడు.
తన భార్యకు తన మీద ఇంకా ప్రేమ చావలేదు.
ఇంకా తనను గొప్పవాడిగానే గుర్తిస్తుంది.
ఆడవాళ్ళలో ఉన్న ఈ బలహీనతే వాళ్ళపరంగా అభిశాపం అయింది.
ఇంత సహనమా ?
ఒకోసారి తనకు తన భార్య మీద బోలెడంత కోపం వస్తుంది.
ఆమె సహనం మీద కోపం వస్తుంది.
ఆమె ఎదురు తిరగదేం ?
తన అసమర్థతను ఎత్తి చూపదేం ?
"నీ వ్రాతలు ఇకచాలు! కూలిచేసైనా కన్నందుకు పిల్లలకు తిండి పెట్టు" అని తన భార్య అంటే ఎంత బాగుండును అని అనిపించేది తనకు.
ఒకనాడు తను తన భార్యను రాణీ అని పిల్చేవాడు.
ఆనాడు ఆమె సర్దాగా సాదాదుస్తుల్లో ఉన్న రాణీలాగే ఉండేది.