జ్యోతి నిట్టూర్పు విడిచింది. ఒక్కొక్క అడుగే వెనక్కు వేసింది. అంతవరకూ తనను చూస్తున్న రాతి విగ్రహం రూపురేఖలు కళ్ళలో మెదిలాయి. అది ఏ దేవతో పోల్చలేకపోయింది. అనంతకోటి దేవతల్లో అదొక దేవత! దేవత పాదాలముందున్న గడ్డిపూలు వాడిపోయి వున్నాయి. గుడిలోనుంచి బయటికి వస్తూనే టార్చి ఆర్పేసింది. ధ్వజ స్తంభం దాటి అడుగులో అడుగు వేసుకుంటూ, పడిపోయిన ప్రహరీ గోడదాటి, కృష్ణ కట్టమీదకు వచ్చి నిల్చుంది. ఎటూ జన సంచారంలేదు. నది ఆవలి ఒడ్డుకేసి చూడసాగింది.
ఒడ్డును తాకుతున్న కృష్ణ అలల నురుగులో తెల్లటి వెలుగు చుట్టుకుపోతూ వుంది. తలపైకెత్తి ఆకాశం కేసి చూసింది. నల్లటి తెల్లటి మబ్బులచాటు నుంచి నెలవంక పరుగులు తీస్తోంది. కృష్ణ మీదనుంచి వస్తున్న చల్లటిగాలికి, చెంపలమీద అల్లరిగా కదులుతున్న ముంగురుల్ని వెనక్కు తోసుకుంటూ నిండుగా ప్రవహిస్తోన్న నదికేసి చూడసాగింది. గుళ్ళో ఆమె చూసిందంతా చిన్నకలలా, అలలా మెదలసాగింది. తన ఈ అనుభవాన్ని కామ్రేడ్స్ కు చెబుతుంది. దీన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారో? తన ధైర్యానికి మెచ్చుకుంటారా? లేక ఇంత చిన్న విషయాన్ని గొప్పగా చెబుతోంది అనుకుంటారా? బుసలు కొడ్తున్న పాము, గిలగిల తన్నుకుంటున్న చుంచు ఇంకా తన కళ్ళముందే మెదులుతూనే వున్నాయి.
పాము ఎందుకు వెళ్ళిపోయింది? తన శత్రువును వదిలేసి ఆహారం కోసం వెళ్ళింది. శత్రువుకంటే ఆహారమే ముఖ్యమా? ప్రమాదంలో వున్నా ప్రాణులకు ఆహారమే ముఖ్యమా?
అయితే ఈ దేశంలో వున్న కోట్లాది జనం ఎందుకు తిరగబడటం లేదూ? విప్లవాలు పేదవాళ్ళ నుంచే రావాలిగదా? అయితే తనలాంటివాళ్ళు విప్లవోద్యమాల్లో ఎందుకు చేరాలి? తరతరాల నుంచి దోపిడీ చెయ్యబడుతున్న శ్రామిక వర్గాన్ని జాగృతం చెయ్యడమే తన విప్లవకర్తవ్యం!
(మార్క్సు, ఏంగిల్స్, లెనిన్, మావో రచనల అధ్యయనం ద్వారా తను నేర్చుకున్నది) చైతన్యవంతులయిన ప్రజలు తిరుగుబాటును లేవదీస్తారు. విప్లవాలను విజయవంతం చేస్తారు. అయితే నూటికి తొంభయ్ మండి నిరక్షరాస్యుల్ని, కటిక దారిద్ర్యంలో వున్న ప్రజల్నీ చైతన్యవంతులుగా చెయ్యడానికి మార్గమేమిటి? ఈ మార్గ నిర్దేశకులు ఎవరు? ఎవరు?
ఆలోచనా పరంపరల్లో కొట్టుకుపోతున్న జ్యోతికి దూరంగా వెలుగు కన్పించింది. అంతలోనే వెలుగు మళ్లీ ఆరిపోయింది. వెలుగు కనిపించిన వైపు దృష్టి నిలిపి చూసింది. కృష్ణకట్టమీద తుమ్మచెట్ల గుబురుల్లో నుంచి మళ్ళీ ప్లాష్! జ్యోతి చేతిలోని బ్యాటరీలైట్ సమాధానం పలికింది. మళ్ళీ జవాబు వచ్చింది.
అవే సంకేతాలు! సందేహంలేదు! వాళ్ళే! అవును! వాళ్ళే! కామ్రేడ్స్ వచ్చారు. తన వైపే వస్తున్నారు. మరోక్షణంలో తన జీవితమే మారబోతోంది. విప్లవదళంలో తను చేరిపోయే మధుర క్షణాలు, కట్టమీద కామ్రేడ్స్ వేస్తున్న ఒక్కొక్క అడుగుతోపాటు దగ్గరపడుతున్నాయి. జ్యోతి వుద్రేకంతో నాలుగడుగులు ముందుకు వేసింది. పొరపాటు! తను ముందుకు నడవకూడదు. తనకు అందిన సూచనల ప్రకారం తను వున్నచోటునుంచి కదలకూడదు. వాళ్ళు పలకరించేదాకా పలక్కూడదు. తను యెంత పొరపాటు చేసింది?
గబగబా నాలుగడుగులు వెనక్కువేసి, తనకు నిర్దేశించిన గుడి ప్రహరీ మలుపులో గోడవార నీడలో నిలబడింది. ఇద్దరు కామ్రేడ్స్ చడీచప్పుడు కాకుండా నడిచి వస్తున్నారు. వాళ్ళ పేర్లు? మననం చేసుకుంది. వాళ్ళు ముందుగా అడిగే ప్రశ్న. దానికి చెప్పవలసిన సమాధానం అన్నీ గుర్తు వున్నాయి.
పది గజాల దూరంలో వాళ్ళు ఆగిపోయారు. జ్యోతి ఆతృతగా ఎదురుచూసింది.
"నది నిండుగా ప్రవహిస్తోంది."
"వెన్నెల తెల్లగా వుంది" జ్యోతి సమాధానం చెప్పింది.
అటునుంచి మళ్లీ ఏమీ వినిపించలేదు. జ్యోతి తను చెప్పిన సమాధానం, వాళ్ళు అడిగిన ప్రశ్నలో ఇమిడి వున్న అర్థాలను మరోసారి మననం చేసుకుంది.
"ఒంటరిగానే వున్నావా?" ప్రశ్న.
"నన్నెవరూ చూడలేదు!" సమాధానం.
అంతా సరిగానే వుంది. మరి వాళ్ళెందుకు ఆగిపోయారు? జ్యోతికి ఆదుర్దా ఎక్కువైంది. గాలి బిగబట్టి నిలబడి వాళ్లకేసి చూడసాగింది. వాళ్లు మళ్లీ కదిలారు. తనవైపే వస్తున్నారు. జ్యోతికి తలమీద బరువు దించినట్టుంది. వాళ్లు జ్యోతి ముందుకొచ్చి నిలబడ్డారు. మామూలు పాంటూ, షర్టుల్లో వున్నారు. సన్నగా, చామనచాయగా పొడవుగా వున్న వ్యక్తి ఒకడుగు ముందుకువేసి -
"నా పేరు సత్యం!" అన్నాడు.
"నా పేరు ప్రతిభ!"
సత్యం తన పక్కనే ఎర్రగా బొద్దుగా వున్న అతనికేసి చూశాడు.
"ఒకే. సందేహం లేదు. తర్వాత ఆ సంగతి అడగవచ్చు! ముందు మనం ఇక్కడ నుంచి కదలాలి" అన్నాడు రెండో వ్యక్తి.
"వీరు కామ్రేడ్ సుందరం" సత్యం పరిచయం చేశాడు.
జ్యోతి నమస్కారం చేసింది.
సుందరం పిడికిలి బిగించి శాల్యూట్ చేశాడు. జ్యోతి తన పొరపాటును గ్రహించింది. నాలుక కరుచుకుంది. రెండు చేతులూ జోడించడం బూర్జువా సాంప్రదాయం. తను విప్లవ శాల్యూట్ చేసి వుండాల్సింది. మళ్ళీ తను ఇప్పుడు శాల్యూట్ చెయ్యడం ఎబ్బెట్టుగానే వుంటుంది.
"కామ్రేడ్ ప్రతిభా! బయలుదేరండి! మీరు మా యిద్దరి మధ్యా నడవండి" అంటూ సత్యం కదిలాడు.
"నా సూట్ కేసూ, బ్యాగూ"! అంటూ ఆగిపోయింది జ్యోతి.
"ఎక్కడున్నాయ్?" సత్యం అడిగాడు.
"ఇదిగో ఇక్కడే! గుడిలోపల పెట్టాను."
"సూట్ కేసూ, బ్యాగుతో రమ్మని చెప్పారా?
"చెప్పలేదు." తటపటాయించి అన్నది.
"మరయితే ఎందుకు తెచ్చారు? సామానుతో వస్తున్న మమ్మల్ని చూసి ఎవరయినా అనుమానించి వెంబడిస్తే ఏమయ్యేది?"
జ్యోతికి ఏం చెప్పాలో తోచలేదు. తను చేసింది పొరపాటా? తనకు కావాల్సిన చీరలూ, జాకెట్టూ, వాళ్ళ దగ్గర ఎందుకుంటాయ్? ఒంటరిగా అర్థరాత్రిపూట ఆడపిల్ల వూరికి వెడుతుందేమోనన్నా అనుకోవడానికి ఆస్కారం వుంది. ఆ మాటే అనాలనుకుంది. కానీ అనలేకపోయింది.
"త్వరగా సామాను తీసుకురండి. ఇక్కడ ఒక్క క్షణం కూడా వుండటానికి వీల్లేదు." సుందరం కంఠం ఆజ్ఞాపిస్తున్నట్లు వుంది.
ఇద్దరిలో ఒక్కరయినా తనకు తోడు వస్తారేమోనని ఆశించింది. కాని ఎవరూ కదల్లేదు.
జ్యోతి గోడవారగా వున్న క్రీనీడలో నడిచి గుడిలో ప్రవేశించింది. పడగ విప్పిన పాము జ్యోతి మనసులో లేచి నిలబడింది. గుండె దడదడలాడింది. కాళ్ళు తడబడ్డాయి. తాచు కళ్ళముందు నిలబడ్డప్పటికన్నా ఇప్పుడే ఎక్కువ భయంగా వుంది. వాస్తవాలకంటే ఊహాజనితాలే ఎక్కువ భయాన్ని కలిగిస్తాయా? చేతిలో వున్న టార్చిలైటు వెలిగించబోయి ఆగిపోయింది. వెలుతురు తన వునికిని తెలియచేస్తుంది. ఎందుకు టార్చి వెలిగించావని ప్రశ్నిస్తే తనేం సమాధానం చెబుతుంది? పాముకే భయపడే దానివి శత్రువు ఎదురుపడితే ఏం చేస్తావని ప్రశ్నిస్తే?
జ్యోతి అడుగులో అడుగువేసుకుంటూ గుడిలోకి వచ్చింది. కిందకు వంగి సూట్ కేసు అందుకుంది. చేతికి మెత్తగా చల్లగా తగిలింది. వళ్ళు జలదరించింది. ఎగిరి వెనక్కు దూకింది. గడపదాటి జరజరా పాకుతూ వెన్నెల్లో కలిసి మెరిసిపోయింది గోధుమవన్నె కోడెనాగు. జ్యోతి సూట్ కేసూ, సంచీ తీసుకొని దాదాపు పరుగులోనే వచ్చి బయటపడింది.
సుందరం వున్నచోటే వున్నాడు. సత్యం మరో రెండు నిమిషాల్లో గుడి వెనుక నుంచి వచ్చాడు. జ్యోతికి అర్థం అయింది.
సత్యం గుడిచుట్టూ పహరా తిరిగి వచ్చాడన్నమాట! విప్లవకారులు ఎంత జాగ్రత్తగా వుండాలో తెలుసుకున్నది జ్యోతి. సుందరం వెనక సూట్ కేసూ సంచీ పట్టుకొని జ్యోతి నడుస్తోంది. ఐదు నిముషాల్లో ముగ్గురూ కట్టదిగి కృష్ణ ఒడ్డుకు వచ్చారు. ఒడ్డునవున్న పడవ పక్కన తలగుడ్డ చుట్టుకొని ఒక మనిషి నిలబడి వున్నాడు. చొక్కాలేదు. పంచ బిగించి పైకిలాగి దోపుకొని వున్నాడు. కట్టదిగిన వాళ్ళను చూస్తూనే చేహ్తిలో వున్న బీడీని నీటిలోకి విసిరివేశాడు.
"కొండయ్యా!" సుందరం పిలిచాడు.
"బాబూ! ఎక్కండి!" అన్నాడు కొండయ్య.
"నువ్వు బీడీ వెలిగించావా?"