ఇరువురును తోడుదొంగలే పరమగురులు!
హరిహరాద్వైత భావఖలాంతరమున
కలిపికొట్టిరి కొందఱు ఘనులు మిమ్ము,
రాలెనేమొ వారికిని వరాలమూట!
నేను విరక్తితో నిన్ను బయటకు నెట్టి తలుపులు వేసి గడియ బిగించాను. కాని కుంచెకోల నీచేతిలో ఉన్నదన్నమాట మరచిపోయాను. నీవు మళ్ళీ గడియతీసుకొని నాలోపల ప్రవేశించగలవు.
ఒక నిర్వేదపు వెల్లువన్ మునిగి నిన్నుద్వాసితుం జేసి భ!
ల్లుకపుంబట్టుగ నాడు గుండె గుడితల్పున్ మూసి లోనన్ బిగిం
చుకొనంగాగడే, యేమి నా తెలివి మందున్, తల్పుపై నుండి పా
యక తీయంగల కుంచెకోల యది నీ హస్తార్పితమ్మై ప్రభూ!
నావెనుక చేరి గంతులు వేయకపోతే ముందుకు వచ్చి దారి చూపరాదూ! లేకపోతె నా చేతిలోని అక్షయపాత్ర కొంచెం సేపు నీవు పట్టుకోరాదూ! భిక్షాటనం చేయటం నీకేం కొత్తకాదు కదా! (ఈ పద్యంలో వామనావతారగాధ స్పురింపజేసారు)
వెనుకం జేరియు తందానాల్ పలుకుటే వేడ్కైనచో నెట్లు, ముం
దనుసంధించియు దారి చూపు మది కాదా మోయగా భారమై
చను నీ యక్షయపాత్ర నీవును ధరించన్ వచ్చుగా కొంతసే
పనిదంపూర్వుడ వేమి కాదుగద! నీ యదిక్యముం జాటుకోన్.
'ఆటలో నేను అలసిపోయాను. ఎలదాటి నిన్ను కొట్టలేక పోతున్నాను. ఏదీ ఈసారి నీవు కూతకురా పట్టుకోగలనేమో చూస్తాను" అంటున్నారు.
కూతన్ బెట్టుచూ నెల్ల దాటియు కొట్టంగ నీయుద్దతిన్
చేత మ్ముక్కిరిబిక్కిరై మఱలుచున్ చింతాహతాశుండనై
నా తండ్రీ! యొకసారి కూతయిడుచున్ నావంక కేతేమ్ము , సం
భూతప్రజ్ఞత నిన్ను పట్టగలనెమో కొంత యత్నించేదన్.
అలసిపోయి తన అపజయాన్ని అంగీకరిస్తున్నాను -
తెలియగరాని యుద్దివిగదే జగదీశ్వర! అంతులేని యీ
బలిగుడు కూతలోన కడబట్టుచు నున్నవి ప్రాణముల్-
నిజమే భగవంతుడితో బలిగుడు అట ఆడటం ఎంత కష్టం!
ఈ క్రింది పద్యంలో తన తండ్రి గారి అచంచల భక్తిని వ్యక్తీకరించి ఆ భక్తియే అయన కుమారుడైన తనకు సంక్రమించిందని , దాని బలంతోనే నిన్ను వశపరచుకుంటానని ఉగ్గడిస్తాడు.
నా జనకుండు సర్వసుజనస్తవనీయ పవిత్రవర్తన
శ్రీ జయధాముడెల్లపుదు చిత్తమునన్ భవదీయమూర్తి సం
యోజనమై తరించిన మహోదయు, డాయన భక్తీ యేల్ల ని
ర్వ్యాజత నన్ను పట్టినది రా! నిను పట్టేదరా! ఎట్లైననున్.
ఈ క్రింది పద్యంలో మహిళామతల్లి అయిన తనతల్లి నిత్యసత్యవ్రతాన్ని నిరూపించి ఆమె సంతానమైన తనను పూజాపుష్పంగా స్వీకరించమంటున్నాడు.
నా జనయిత్రి దీనజననందిని భాస్కరమండలాంతర
భ్రాజితు నిన్ను గన్గోనక పారణసేయని నిత్యభక్తి దీ
క్షా జయలక్ష్మీ తద్విమల గర్భమునన్ చిరపుణ్యపాకమై
యీ జని విచ్చే భవ్యభవదీయపదార్చన కోక్కపూవుగాన్!
నీవెంత కమలాధీనాధుడవైనా ఈ గడ్డి పూవు పై చిన్నచూపు తగదని విన్నవించుకొంటాడు. దీనికి తగిన సుగంధం దీనికున్నదిలే అంటాడు.
పదములు నాభియున్ కనులు బాహుముఖమ్ముల దివ్య పద్మముల్
మది కమలాక్త మీ పనికి మాలిన చిల్లరగడ్డిపూవు నా
యెడ కిదియేమి యించునని యెంచక నన్ను కృతార్ధు జేయవే!
యిది తమమేన క్రొవ్వులపు లీనునులే! ఒక విష్ణుక్రాంతమై.
పై పద్యంలో ఆ గడ్డి పూవును విష్ణుక్రాంత మనటంలో చక్కని శ్లేష ఉన్నది.
భావమ్మచ్చపు కోడెత్రాచుగతి జిహ్వాల్ కోయుచున్ వక్రమా
ర్గావష్టంభత కాలకూటవ మధు వ్యాపారమై లేచు "పా
న్పై" వర్తిల్లునొ నీకు "దండకడేమై" భాసిల్లునో అంతయున్
నీ వైదగ్ధ్యము కాదటే హరిహరోన్నిద్ర ప్రభావాకృతీ!
నా మనస్సు కోడెత్రాచులాగా బుసలు కొడుతుంది. నీవు దీనిని తల్పంగా వరిస్తావో, దండకడియంలా ధరిస్తావో అని భగవంతుడి హరిహరత్వాన్ని స్పురింపజేసి తరింపచూస్తాడు.
నా పత్నీరమణీ సుధాప్రణయితా నందమ్ములం దేలితిన్
నా పుత్రీవిదుషీయశో విసరవిన్యాసమ్ములం బొంగితిన్
నా పుట్తెల్లను పండే నీదు చలువన్ మానాధ! సంసార సౌ
ఖ్యాపూర్ణమ్ముగ నేమి కావలయునయ్యా యింక నాకిచ్చటన్!
అవును. అనురాగమూర్తియైన అర్ధాంగి అమృతమయమైన ఆనందాన్ని అందించింది. విదుషీ మణులైన పుత్రికల పేరు ప్రఖ్యాతులు అనంతమైన సంతోషాన్ని సంతరించాయి. అయన జన్మ సార్ధకమైంది.
శ్రుతి సీమంతిని చెందిరంపు తళుకుల్ శుద్డంతరంగమ్ములన్
జతనమ్మై వికసించు శాంతకలికల్ సాహిత్య సౌహిత్యాసం
భ్రుతమార్గంములు తేజుకొల్పు పలుకుల్ విశ్వామయస్వస్త్య మం
చితయోగమ్ముగ సంతరించు గుళికల్ నీ వేదనావాసనల్.
పై పద్యంలో వాసుదేవుని వాసనావిలాసాలకు అనన్య సామాన్యంగా అభివర్ణించి ధన్యోస్మి అనుకున్నాడు కవి.
ఈ విధంగా శయ్యలో, చమత్కారంలో , భక్తీలో, పరిహాసంలో వేదనావాసుదేవంలోని పద్యాలు హృద్యాలై అనపద్యాలై సంవేద్యాలై అలరారుతున్నాయి. ఈ కావ్యం ఇష్టదేవమైన వేంకటేశ్వరుడికే సమర్పింపబడింది.