సత్యం - శివం - సుందరం
సత్యం
అమ్మ అమ్మాయికి నీళ్ళు పోసింది.
పసిడి పూలపట్టుగౌను వేసింది.
తలనిండా పూలు పెట్టి ముచ్చటగా ముస్తాబు చేసింది.
దిష్టి తీసింది.
కడుపునిండా పెరుగన్నం పెట్టింది.
మెత్తటి పరుపుమీద పడుకోపెట్టింది.
"నిద్రపో తల్లీ!" అంటూ చిచ్చుకొట్టింది.
పిల్లకు నిద్రపట్టలేదు; చివాలున లేచి కూర్చుంది.
పడుకో చిట్టీ!"
"నిద్రరావటంలేదే?"
"పాలుతాగుతావా?"
"వద్దు"
"పాయసం కావాలా?"
"వద్దు"
"పండ్లు తింటావా?"
"ఊహుఁ"
"మరేం కావాలి?"
"కధ కావాలి కధ"
"అనగా అనగా ఒక ఊళ్ళో ఒక...."
చిన్నపిల్ల ఊకొట్టుతూ వినసాగింది.
కధ కంచికి పోయింది. పిల్ల నిద్రపోయింది.
కధకూ మానవజీవితానికీ ఉన్న అనుబంధం అటువంటిది.
'చిన్న కధ ఎప్పుడూ పుట్టిందీ" అంటే"మనిషితోపాటే పుట్టింది" అని సమాధానం. అందుకనే కధ "సత్యసనాతనం, నిత్యనూతనం.
ఉపనిషత్తులలో అందమైన కధలు కన్పిస్తాయి. మహాభారతం నిండా చాలా చక్కని చిన్న కధలు ఎన్నెన్నో ఉన్నాయి. ఇక విష్ణుశర్మ "పంచతంత్రం" నారాయణ కవి "హితోపదేశం " గుణాధ్యుని "బృహత్కద" దండి "దశకుమారచరితం" మొదలైనవి చిన్న కధలకు పుట్టినిండ్లు . ఇవన్నీ సంస్కృత సాహిత్యానికి సంబంధించినవి.
ఇక తెలుగులోకివస్తే అనంతుని "భోజరాజీయం" జక్కన "విక్రమార్క చరిత్రం" కదరీపతి "శుకసప్తతి " మొదలైనవి ఎన్నో గోచరిస్తాయి. ఐతే ఇవన్నీ పద్య కధా సంపుటాలు.
ఇప్పటివరకూ చెప్పుకున్నదంతా ప్రాచీన కధల కధ. ఈ కధల్లో అద్భుత దృశ్యాలు అలౌకిక సన్నివేశాలూ, అవాస్తవిక సంఘటనలూ అధికంగా కనిపిస్తాయి. ఈ కధల స్వరూప స్వభావాలు వేరు; ప్రయోజనం వేరు. కాలం మారింది. అభిరుచులు మారాయి. రచయితల దృష్టి తమ చుట్టూ ఉన్న సమాజం మీదికి ప్రసరించింది.
అర్వాచీనయుగంలో అసలైన చిన్న కధకు ప్రారంభం ఇరవయ్యో శతాబ్దం ఆరంభంలో జరిగింది. ఆధునిక కాలంలో పాశ్చాత సాహిత్య ప్రభావం వల్ల తెలుగులో చిన్నకధ ఎన్నేన్నో వన్నెలూ చిన్నెలూ దిద్దుకొన్నది. ఎన్నెన్నో విన్నాణాలు సంతరించుకొన్నది. ఇతివృత్తంలో, కధనంలో, రచనా శిల్పంలో , భావప్రకటనంలో, పాత్ర చిత్రణం లో క్రొత్త పుంతలు తొక్కింది.
గురజాడ వారి 'దిద్దుబాటు" తో తెనుగులో చిన్నకధకు రూపు రేఖలు ఏర్పడినాయి. ఆనాటి ఆంధ్రవారపత్రిక, కృష్ణా పత్రిక, భారతి, గృహలక్ష్మి , వినోదిని , చిత్రగుప్త కధాసాహిత్యానికి ఎంతో దోహదం చేశాయి.
శ్రీయుతులు చింతాదీక్షితులు , వేలూరి శివరామశాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మునిమాణిక్యం నరసింహారావు ప్రభ్రుతులు రచించిన కధానికలతో కధాలత పెరిగి పెద్దదై చక్కగా చిక్కగా చిగిర్చి మొగ్గలు తొడిగింది. చలం, కొడవటిగంటి, మల్లాది రామకృష్ణశాస్త్రి పాలగుమ్మి పద్మరాజు , బుచ్చిబాబు, గోపీచంద్, కవికొండల , రావిశాస్త్రి, హితశ్రీ మధురాంతకం, కరుణకుమార్, బాపిరాజు , కొమ్మూరి వేణుగోపాలరావు, ఇత్యాది రచయితలూ - రంగనాయకమ్మ, సులోచనా రాణి, మాలతీచందూర్ , భానుమతీ రామకృష్ణ , బీనాదేవి, ఆనందరామం, పరిమళాసోమేశ్వర్ మొదలైన రచయిత్రులూ కధానీకా కల్పవల్లికి సర్వతోముఖాభివృద్ధి సమకూర్చి కొల్లలుగా పూలుపూయించారు. సమాజం ఆలవాలంగా జీవితం ఆలంబనగా సర్వాంగ సుందరంగా వికసించిన చిన్న కధ పాఠక హృదయాలలో పరిమళాలు విరజిమ్మింది. పత్రికల పుణ్యమా అని "మూడు పూలు ఆరుకాయలు" గా పరిడవిల్లింది.
అనన్య సామాన్యమైన ప్రజాదరణకు పాత్రమై, సరససాహిత్య ప్రక్రియలలో సముచితస్థానాన్ని సంపాదించుకొని , నవనవోన్మేషాన్ని పొందిన చిన్నకధ ఈనాటి యువరచయితలను ఎంతగానో ఆకర్షించింది. వర్ధమానరచయితలెందరో చక్కని కధలు రచించి తెలుగు సాహితిని సుసంపన్నం చేశారు. చేస్తున్నారు. ఇది ప్రశంసనీయమైన పరిణామం.
శివం:
ఇప్పుడు మీ కరకమలాలను అలంకరించిన పుస్తకం పేరు "పులిచెర్ల సాంబశివరావు కధలు." పుస్తకం పేరులోనే రచయిత పేరు కూడా ఇమిడిపోవడం రచనకూ రచయితకూ ఉండే సమైక్య భావానికి చక్కని నిదర్శనం అనుకుంటాను.
శ్రీ పులిచెర్ల సాంబశివరావు గుంటూరులోని జాగర్లమూడి కుప్పుస్వామి కళాశాలలో అంద్రోపన్యాసకుడు. సరసహృదయుడు. స్నేహపాత్రుడైన సరస్వతీ పుత్రుడు. మధురభాషకుడు. మానవతావాది. ఈయన వేమన పై రచించిన "స్వర్ణయోగి" అనే నవల విద్యాలయాలలో పాఠ్యగ్రంధమై బహుళ ప్రచారాన్ని పొందింది. వీరు రచించిన సారస్వతవ్యాసాలు పెక్కు పత్రికలలో ప్రచురితలై పాఠకుల ప్రశంసలు అందుకొన్నాయి. నాటికలు ఆకాశవాణిలో ప్రసారితాలై శ్రోతలను అలరించాయి.
శ్రీసాంబశివరావు ఈ విభవసంక్రాంతి శుభోదయంలో విరబూచిన ముద్దుబంతిపూలవంటి చిన్నకధలను ఏర్చి - చెండుగా కూర్చి కధా భారతి కబరీభరంలో అలక్నరించాడు.
ఈ కధాసంపుటిలో పదమూడు చిన్న కధలున్నాయి. పూలల్లోదారం లాగా అన్ని కధలలోనూ అంతస్సూత్రంగా మానవత్వం గోచరిస్తుంటుంది.
"సుమతి" అన్న కధలో పదేళ్ళ పిల్ల సుమతి సుక్ష్మబుద్ది, సుకుమార మనస్తత్వం, అమాయికత్వంతో పాటు, కాలేజీ లెక్చరర్ల గడుసుదనం , స్వార్ధపరత్వం , గోడమీది పిల్లివాటం ఎంతో సహజంగా చిత్రింపబడినాయి.


