చిక్కెడే నీవు నా ద్రుడాశ్లేషమందు
కలసిపోదము తల్లియిక్కకు ముదమున"
ప్రేయసీప్రియులది అవినాభావసంబంధం. అది యుగయుగాల సంబంధం. తరగిపోని తరతరాల సంబంధం. ప్రణయసింహసనాసీనురాలైన తన ప్రేయసీముందు తన హృదయకుసుమాన్ని కానుకగా సమర్పించి ఆత్మార్పణం చేసికొంటాడు ప్రియుడు. తనకూ ఆమెకూ ఉన్న అనుబంధాన్ని వ్యక్తీకరిస్తూ ముక్తకంఠంతో ఇలా అంటాడు -
"త్రిభువనమ్ములలో రసోద్దీపనమ్ము
వేల్లివిరియించు ప్రణయరూపిణిని నీవు,
నీ దరస్మితరోచి ప్రసాదకాంక్ష
కొనలు సాగిన ముగ్ధభిక్షుకుడ నేను."
"స్వర్గ ధామమ్ము నందు విస్పారదివ్య
శోభ లడరించు నిర్మలజ్యోతి వీపు,
విమలను స్నేహ పూరనివేదనమ్ము
లోదవ నిను బూననెంచు ప్రమ్మిదను నేను."
"సందువోయిన నా పూర్వజన్మ తపము
పట్టువఱుపంగలేని యుపాసనాధి
దైవతమ వీపు, నీదు ప్రత్యక్షమునకు
గడియ లెంచుచునుంచు భక్తుడను నేను."
"జన్మ జన్మాంతరముల నా స్వాంతవీధి
నీ సుధాస్వాదులజ్ఞావిలాసరేఖ
పఱపి కికురించి పోయిన మెఱపు వీపు,
నేను నీ మార్గములు చూచు నీరదుడను."
అవును. ఆమె ప్రణయస్వరూపిణి. అతడు ప్రేమభిక్షుకుడు. ఆమె నిర్మలజ్యోతి. అతడు స్నేహముతో నిండిన ప్రమిద. ఆమె ఉపాసనాదైవము. అతడు భక్తుడు. ఆమె మెరపు తీవె. అతడు మెరపుకై ఎదురుచూచు మేఘము. ఆమె లేనిదే అతనికి అస్తిత్వమే లేదు కనుకనే.
"నీవు జీవనదాత్రివి, నేను జీవి,
నీవు లేకున్న నా లేమియే ద్రువమ్ము"
అంటాడు.
ఈ సంసారసాగరంలో మానవజీవితం ఒక నావ వంటిది. అది ప్రయాణం సాగిస్తుంది. తరంగాల తాకిడికి ఓర్చుకొని ఆటంకాలూ , అఘాతాలూ తప్పుకొంటూ ముందుకు సాగిపోతుంది. అయితే ఆ నావ తన గమ్యస్థానం చేరుకుంటుందనే నమ్మకమేముంది? ఒకవేళ ఏ తుఫానో సంభవించి ఆ పడవ మధ్యలోనే పగిలిపోతే ఆ జేవితం అంతటితో భగ్నమై ముగిసిపోవలసిందేనా? పవిత్రమైన ప్రణయంలో అటువంటి భయానికి చొట్టు లేదు. నట్టనడి సంద్రాన ఏ గట్టుకో చట్టుకో కొట్టుకొని బ్రతుకు పడవ పగిలిపోయినా ప్రణయం మాత్రం భగ్నం కాదు. ఈ పరమసత్యం "పడవ పగిలిన" అనే ఖండికలో ఈ విధంగా ప్రకటింపబడింది. ప్రియురాలి నుద్దేశించి ప్రియుడిలా అంటాడు.
ఇది పగిలిపోవు నను భయమ్మింతవరకు
ఈ తలంపున ఆనంద మిపుడు పొంగు,
పగిలిపోయిన చెక్కల పట్టువిడువ
కీవు పాధోనిధానమ్ము నీదెదవని!
ఇది పగిలిపోవునను భయమ్మింతవరకు
ఈ తలంపున నిపుడుల్ల మిగురులెత్తు,
తునిగి పోయిన చెక్కలతో వయోధి
గర్భమున రత్నరధ మీవు కట్టేదవని!
ఇది పగిలిపోవునను భయమ్మింతవరకు
ఈ తలంపున నిపు దాత్మ కింత శాంతి,
విఱీగిపోయిన చెక్కల దరికి జేర్చి
నీ చితికి కాష్టములుగ మన్నించేదవని!
అతని జీవితమంతా ఆమెకే అంకితం. ఆమె అనురాగమూ, అభిమానమూ, అనుబంధమూ తప్ప అతనికి మరే కోర్కెలూ ఉండవు. అతడు ఏ కొంచెమైనా ఆశిస్తే ఆ "ఈప్సితలేశం" ఈ విధంగా ఉంటుంది.
అది నడుచువేళ నేల జీరాదు కుచ్చె
రేపు దుమ్మున నొక త్రసరెణువునయి
దాని తనువున బుట్టు స్వేదమున గలసి
కరిగిపోదును రూప మేర్పఱుపరాక.
అది యుషస్స్నాన మొనరించి యంత గట్టు
కొనిన పచ్చని పట్టుదుకూల మందు
నర్ధ్రమగు లే జరీయంచునై తదీయ
దేహమున గగుర్పాటులు దిద్దుకొందు.
అది శుచిర్భుతయై దేవతాళి పూజ
లైన వెనువెంట తన పూతహస్తమంటి
హరతికి వెలిగించు కర్పూరమునయి
వాసనలు చిమ్ముదును దాని వదనమందు
అంతేకాదు "ప్రణయనీవదనాంచల భాగమందు ఒక్క చిరునవ్వు తరగనై యూగుచుందు" ననీ, "ప్రణయినీ శీతల దృగంతపాత మందు కరడుగట్టిన యొక సుధాకణము నగుదు" ననీ ఉత్కంఠితుడౌతాడు.
ప్రియురాలే కాదు. ఆ తన్వంగి వంగి తొంగి చూచే కిటికీ సైతం ప్రియుడికి ఎంతో ప్రియంగా కన్పిస్తుంది. తనకు ప్రతిక్షణమూ "ప్రణయినీ ముగ్ధరూపలావణ్యరేఖ" ను దర్శన మిప్పించే అ గవాక్షానిది ఎంతటి దాక్షిణ్యమాయ హృదయమో! ఆ వాల్గంటి ఇంటి కిటికీ తన యెడల చూపించే అవ్యాజ కారుణ్యానికి పొంగి పులకించి పోతాడు ఆ ఆమాయక నాయకుడు.
ఉదయకాల సాయంకాలాల నీడల సంకోచవ్యాకోచాలను కుజన సజ్జనమైత్రితో పోల్చి కవిత చెప్పాడు ఏనాడో భర్త్రహరి -
మొదల చూచిన కడుగొప్ప, పిదప కుఱుచ,
అది కొంచెము, తర్వాత నధికమగుచు,
దనరు దినపూర్వపరభాగజనితమైన
ఛాయపోలిక కుజన సజ్జనుల మైత్రి.
ప్రియురాలి నీడలో మేడ కట్టుకొన్న నాయనివారు మరొక్క అడుగు ముందుకు పోయి ఉదయవేళ మెల్లమెల్లగా సంకోచాన్ని పొందే నీ నీడకొనల వెంబడి అరుదెంచి నీ పాదాలను చేరుకుంటానంటాడు. మధ్యాహ్నవేళ మండుటెండలో అలసిపోయిన నీనీడలో కలిసిపోయి నీ శరీరం అంచులలో కొంచెం విశ్రాంతి తీసుకుంటానంటాడు. సాయంవేళ రాగరంజితమై దూరదూరాలకు సాగిపోయే నీనీడతో పాటు కదలిపోయి అనంతదిగంతాలను అవరిస్తానంటాడు. ఎంతటి ఉదాత్తభావమో చిత్తగించండి.
ఉదయసంధ్యానవాంశవు లదుమ దద్ద
రిల్లి అశాంతముల నుండి మెల్ల మెల్ల
కుంచుకొని పోవు నీ నీడకోనలవెంట
చేరుకుందును నీ పదాంభోరుహములు.
ప్రబల మధ్యాహ్నతీక్లౌతపమున కలగి
అలసిపోయిన నీనీడ గలసిపోయి
ప్రణయ భావతి మధుర విశ్రాంతి కొఱకు
నీ శరీరంచలములాంటి నిలిచియుందు.
అపర సంధ్యార్ద్రరోచుల నమృతరాగ
మంజురంజితమై సాగి మరల దెసలు
క్రమ్ముకొని పోవు నీనీడ గలసి వెడలి
ఆ యనంత దిగంతమ్ము లావరింతు.
ప్రియుడికి ప్రియురాలి విశ్వరూపం సాక్షాత్కారించింది. అది హృదయంతరంలో అంతకంతకు పెరిగి పెద్దదైపోయింది. ప్రధమ సందర్శనంలోనే తన కనుపాపలందు ప్రవేశించిన ప్రణయినీ ప్రణయమూర్తిని సురిగిపోకుండ రెప్పలు కప్పి అదిమిపట్టినాడు. కాని ఆ మూర్తి క్రమంగా హృదయమంతటా నిండి పోయింది.