Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 5 పేజి 23

 

                                    శ్రీశైలే మల్లికార్జునమ్
    
    క్షేత్రమహిమ:

    ఆంధ్రదేశములో పవిత్ర కృష్ణవేణీ తీరమున శ్రీశైలక్షేత్రమున్నది. కైలాస పర్వతముతో సమానమైన గౌరవౌన్నత్యములు కలిగి, సర్వదా దేవబృంద సంసేవ్యమానమగుటచే శ్రీశైలమునకు "దక్షిణ కైలాస" మని ప్రసిద్ది వచ్చినది. మహాభారతమునందును, శివపురాణమునందును, పద్మ పురాణమునందును శ్రీశైల ప్రశస్తి గలదు. శ్రీశైల మహాక్షేత్రమున కేగి మల్లికార్జునుని సేవించిన వారికి అశ్వమేధ యాగా ఫలము ప్రాప్తించునని భారత ప్రమాణము, సందర్శనమాత్రముననే సకల రూపములను వికలము చేసి అఖండ మోక్ష లక్ష్మీ ప్రసాదమునను గ్రహించు పుణ్యక్షేత్రమిది. "శ్రీశైల శిఖరం దృష్టా పునర్జన్మ న విద్యతే" అని పురాణములి ఘోషించుచున్నవి.
    
    పురాణకధ:
    
    గణేశ కార్తికేయులు పార్వతీ పరమేశ్వరుల గారాబు కుమారులు. ఒకదినము వారిరువురి మధ్య వివాహ విషయమున వివాదము వచ్చినది. "నావివాహము ముందు జరుగవలె" నని గణేశుడు, "నా పెండ్లియే మొదట జరుగవలె" నని కార్తికేయుడును పరస్పరము వాదించుకొనసాగిరి. భవానీశంకరులు కుమారుల నిరువురను పిలిచి నాయనలారా! కలహము వలదు. మీ ఇద్దరిలో ఎవరు ముందు భూప్రదిక్షణ మొనర్చి వత్తురో వారి వివాహము మొదట జరిగింతు" మని ఒక నిర్ణయము చేసిరి. జననీజనకులు సూచన వినినతోడనే కార్తికేయుడు మయూర వాహనము నధిరోహించి వాయువేగ మనోవేగాములతో భూప్రదిక్షిణమునకై బయలుదేరెను. పాపమూ గణపతి స్థూలకాయుడు అయన వాహనము మూషికము. అయన క్షణకాలమిటునటు చూచెను. కొంచేమాలోచించెను. తల పంకించెను. కర్తవ్యమును గుర్తుంచెను. శరీరము స్థూలమైనను గణేశుని బుద్ది అతి సూక్షము. అయన కోక మంచి యుపాయము తట్టినది.
    వినాయకుడు వెనువెంటనే తన తల్లిదండ్రుల దగ్గరకు పరుగిడెను. వారి నిరువురిని ఒక యాసనము పై సమసీనులగావించెను. జననీజనకుల పాద పద్మములను భక్తీ పూర్వకముగ పూజించెను. వారిరువురి చుట్టును మూడు పర్యాయములు రొప్పుతూ ప్రదక్షిణ మొనర్చి సాష్టాంగనమస్కారము చేసెను. తర్వాత తల్లిని చూచి 'అమ్మా! నా వివాహమునకు సముహూర్తము పెట్టింపుము. ఇప్పటికే కాలాతీతమైనది" అనెను. తనయుని మాటలు విని "అదేమి గణపతి! భూప్రదక్షిణము చేయకయే పెండ్లి ముహూర్తమా? నీ తమ్మునితో పాటు నీవు కూడా పందెములో పాల్గొని జయమందుము" అన్నది తల్లి. గణేశుడు చిరునవ్వు నవ్వుచు "అదేనమ్మా! జననీజనకులైన మీ ఇద్దరి చుట్టూ నేను మూడుసార్లు ప్రదక్షిణము చేసితిని కదా!
    "పిత్రోశ్చ పూజనం కృత్వా ప్రక్రాంతిం చ కరోతి యః
    తస్యవై పృద్వీవీజన్యం ఫలం భవతి నిశ్చితమ్"
    అని కదా ధర్మశాస్త్రము. నేను ముమ్మారు భూప్రదిక్షణము చేసిన వాడ నైతిని. అందువలన నిక వివాహముహూర్త నిశ్చయమే నీ కర్తవ్యము " అనెను. పార్వతీ పరమేశ్వరులు పెద్ద కుమారుని బుద్ది కుశలతకు లోలోన మెచ్చుకోనిరి. విశ్వరూప ప్రజాపతి పుత్రికలైన "సిద్ది" బుద్ది" అను సుందర కన్యకారత్నాముల నిచ్చి గణపతికి కళ్యాణము కావించిరి.
    భూప్రదిక్షణమునకై వెడలిన కుమారస్వామి కొలది కాలములో తన కార్యక్రమమును ముగించుకొని తిరిగి వచ్చెను. జరిగిన మోసము తెలిసికొనెను. పసుపుబట్టలతో నున్న కల్యాణ గణేశుని గాంచి కార్తికేయునకు పట్టరాని ఆగ్రహము వచ్చెను. అతడు కోపావేశముతో వెండికొండ  విడిచి క్రౌంచపర్వతము (శ్రీశైలము) మీద అలిగి కూర్చుండెను. తమ కుమారుని అలక తీర్చి , వెంట గొని రమ్మని పార్వతీ పరమేశ్వరులు నారదమహర్షిని పంపిరి. కలహాభోజనుడెంత చెప్పినాను కార్తికేయుడు పట్టినపట్టు విడువలేదు. జగజ్జననియైన ఆ తల్లి హృదయము తనయిని కోసము తల్లడిల్లెను. ఉమామహేశ్వరులే కుమారుని కొఱకు స్వయముగా కౌంచపర్వతము మీదకు విచ్చేసిరి. కుమారుని పరిపరివిధముల బతిమాలిరి. కార్తికేయుడు కదలలేదు. మెదలలేదు. వారు పుత్ర వాత్సల్యమును వీడలేక పోయిరి. మార్గంతరమును గానక పరమశివుడు పార్వతీసమేతుడై శ్రీశైలశిఖరముపై నిలిచిపోయెను. అదే "శ్రీ మల్లికార్జున" జ్యోతిర్లింగముగా విశ్వ విఖ్యాతి గాంచెను. మల్లికాశబ్ధము పార్వతీ వాచకము. అర్జునశబ్దము పరమేశ్వర వాచకము. మల్లికార్జునులనగా పార్వతీపరమేశ్వరులని యర్ధము.

                               ఉజ్జయిన్యాం మహాకాళమ్

    క్షేత్ర మహిమ :

    మాలవదేశంతర్గతమైన ఉజ్జయినీ పట్టణములో శిప్రానదీ తీరమున శ్రీమహకాళేశ్వర జ్యోర్లింగము నెలకొని యున్నది. ఉజ్జయినీ నగరమును 'అవంతిక" అనియు నందురు. భారతదేశములోని మోక్షదాయకములైన సప్తపురములలో అవంతిక యొకటి.

    'అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా
    పురీ ద్వారవతీ దైవ సప్లైతే మోక్షదాయకాః"
    స్కందమహాపురణములోని అవంత్యిఖండములో ఈనగర వైశిష్ట్యము వైభవపెతముగా వర్ణింపబడి యున్నది. మహాభారతములోను,శివపురనాములోను ఉజ్జయిని మహిమ కొనియాడబడి యున్నది. శిప్రానదిలో స్నానము చేసిన వారి సర్వపాపములు పటాపంచలగును. సర్వదారిద్యములు దూరమైపోవును. మహతపోనిధీయైన సాందీపని ఆశ్రమమున శ్రీకృష్ణబలరాములు విద్యాభ్యాస మొనర్చిన పవిత్రస్థల మిది. మహా పరాక్రమోపెతుడైన విక్రమాదిత్యుని రాకదానీ నగరమిదియే. ఇచ్చటనే కాళిదాసాది మహాకవులు నవరత్నములై సంస్కృత సాహిత్యాకాశమున జాజ్వాల్య మానముగ ప్రకాశించిరి.

    పురాణ కధ:

    పూర్వము అవంతీ నగరమున వేదవిద్యలలో అఖండుడు, నిత్యాగ్నిహోత్రి, నిష్టాగరిష్ఠుడైన "వేదప్రియుఁ" డనుఒక ఉత్తమ బ్రాహ్మణుఁ డుండెను. ఆయనకు దేవప్రియుడు, ప్రియమేధుడు , సువ్రతుడు అను నలుగురు కుమారులుండిరి. అతడు తనయులతో కలసి శిభక్తి తత్పరుఁ డై ధర్మనిష్ఠతో కాలము గడుపుచుండెను. పట్టణ సమీపములోని రత్నమాల పర్వతము పైనున్న "దూషణుం "డను క్రూర రాక్షసుడు వేదప్రియుని కీర్తి ప్రతిష్టలు విని, సమస్తరాక్షస సైన్యముతో అవంతీపురము మీదికి దాడి వెడలివచ్చెను.
    ధర్మద్రోహియైన అరాక్షనునిచూచి ప్రజానిక మంతయు భయభ్రాంతమైనది ఉజ్జయిని నలుమూలల ఆర్తనాదములు మిన్నుముట్టినవి. కాని పరమభక్తాగ్రగణ్యుడైన వేద ప్రియుడు చలింపలేదు. అయన నిశ్చలమనస్సుతో శివదీక్షా నిమగ్నుఁడై యుండెను. రాక్షసుడు క్రోధాంధుఁడై "వీనిని నఱుకుడు, చంపు " డని హుంకరించి వేద ప్రియునిపై దురాక్రమణ మొనర్చెను. భక్తవత్సలుఁ డైన పరమశివుడు తత్ క్షణము మహాకాలరూపముతో సాక్షాత్కరించి , ఒక్క ప్రళయ హుంకారముతో దూషణుని దురహంకారమును భాస్మీకరించెను. దుష్టశిక్షణము శిష్టరక్షణ మొనరించిన మహేశ్వరు నభినందించెను. ఆ శుభసమయము నందాకాశమున దేవదుందుభులు మొరసినవి పుష్పవర్షము కురిసినది.
    భక్త వత్సలుఁడైన శంకరుడు ప్రసన్నరూపముతో వేదప్రియునికి ప్రత్యక్షమై వరము కోరుకొనుమనెను. వేదప్రియుడు చేతులు జోడించి స్వామికి నమస్కరించి "దేవదేవా! మహాదేవా! నావంటి దీనులైన భక్తులను అకాలమృత్యువునుండి రక్షించుచు సర్వకాలముల యందు ఇచ్చటనే నెలకొనియుండుము." అని ప్రార్ధించెను. 'తధాస్తు' అని భక్తుని అభీష్టానుసారము ముక్తిప్రదాయకుడైన పరమశివుడు "మహాకాళ" నామముతో జ్యోతిర్లింగమై వెలసెను.
    ఉజ్జయునీ నగరమును పరిపాలించు చంద్రసేన మహారాజు మహాశివభక్తుడు. ఒక నాఁ డతడు శివార్చనములో నమగ్నుడైయున్నసమయమున ;శ్రీకరుడు' అను ఐదేళ్ళగోపాలబాలుడు తల్లితో పాటు అక్కడ కరుందెంచెను. రాజు గారి దైవభక్తిని చూచి తన్మయుఁడై, తాను కూదా స్వయముగా భగవంతుని పరమశివుని ఆరాధించుకొనవలెనని నిశ్చయించుకొనెను. ఇంటికి వెళ్ళుచు శ్రీకరుడు వీధిలోని శిలాఖండము నొకదానిని తీసికొని వెళ్ళెను. ఆ రాతి బండనే శివలింగముగా భావించెను. పుష్పచందనాదులతో పూజించెను. శీకరుడు శివధ్యాన నిమగ్నుడై యుండెను. చాలాసేపు గడచినది. ఇంతలో తల్లి వచ్చి శ్రీకరుని భోజనమునకు రమ్మని పిలిచినది. శ్రేకరుడు తల్లి మాటలు వినిపించుకొనలేదు. కన్నులు మూసికొని తన్మయుఁడై ఉండెను. పిలిచి పిలిచి ఆమె విసిగి వేసారిపోయి చివరకు ఆశిలాశకలమును తీసి పాఱవైచినది.
    భక్తీ ప్రపూర్ణుడైన శ్రీకరుడు తన యిష్టదైవమయిన శంభుని కోసము పెద్దగా అక్రందించి అలసిపోయి మూర్చనందేను. భక్తజనవశంకరుడైన శంకరుఁడు శ్రీకరుని ముందు నిజరూపముతో ప్రత్యక్షమయ్యెను. శ్రీకరుడు కనులు విప్పి చూచుసరికి ఎదురుగా మహాకాళమందిరము. అందు దేదీప్యమానముగా విరాజిల్లుచున్న జ్యోతిర్లింగము అతనికి కనిపించినవి. అది చూచి ఆ బాలుడు ఆశ్చర్యపులకితుఁడై మరల మహాదేవునిస్తుతింప నారంభించెను. తల్లి వచ్చి ఇదంతయుచూచి ఆనందోల్లాసముతో పొంగిపోయింది. ఈ యద్భుతసంఘటనము నగర మంతయు ప్రాకినది. ఆబాల గోపాల ముచ్చతకు వచ్చినది.

 Previous Page Next Page