Read more!

అన్నం పరబ్రహ్మ స్వరూపం

 

అన్నం పరబ్రహ్మ స్వరూపం


- సూర్య ప్రదీప్

 



 

భగవంతుడు, ప్రారబ్ధం వదిలించుకొని పరమాత్మ యందు ఐక్యం కావడానికే మానవ దేహం ప్రసాదిస్తాడు. కానీ; మన ఇంద్రియాలద్వారా వివిధ అపవిత్రమైనకార్యాలు చేస్తూ, అశుద్ధఆహారాన్ని స్వీకరిస్తూ, చివరికి ఈ పవిత్రమైన దేహాన్ని మట్టికే అంకితమిచ్చి, ప్రారబ్ధాన్ని పోగొట్టుకోలేక, మరింత పోగుచేసుకొని మరిన్ని దేహాల్నీ మరల మరల పొందుతూ జనన మరణ చక్రములో పరిభ్రమిస్తూ, శ్రమిస్తూ దుఃఖితులమౌతున్నాం.
అందుకే అలా కాకుండా
ఈ దేహం యొక్క ప్రాముఖ్యతను గుర్తిద్దాం,
సత్కర్మలు ఆచరిస్తూ, సద్భావనతో చరిద్దాం,
ఆరోగ్యకరమైన శుద్దాహారమునే స్వీకరిద్దాం,
తద్వారా తరిద్దాం.

మనకి తెలుసు - మానవుని జీవనాభివృద్ధికి ఆరోగ్యవంతమైన శరీరం అవసరమని, ఆ శరీరానికి పుష్టికరమైన శుద్ధఆహారం అత్సవసరమని, ఈ శరీరము ఆహరముచే ఏర్పడుచున్నదని.
దానికి తగ్గట్లుగా భగవంతుడు ఎవరికి తగ్గ ఆహారమును వారికి ఏర్పరిచెను.
దేవానామమృతం నృణామృషీణాం చాన్న మోషధీ: |
దైత్యరక్షః పిశాచాదేర్దత్తం మద్యామిషాది చ ||
బ్రహ్మదేవుడు సృష్టిలో దేవతలకు అమృతమును, మానవులకును ఋషులకును అన్నము సస్యములు అనగా ఫలమూలములను, పశువులకు తృణపత్రములను, దైత్య రాక్షస పిశాచాదులకు మద్యము, మాంసం మొదలగునవి ఆహరములుగా సృష్టించెను.

మనం భుజించెడు ఆహారంలో గల సారం రసమై, రక్తమై, మాంసమై మేదస్సు మొదలగు సప్తధాతువులుగా పరిణమించి, దీనియొక్క సూక్ష్మాంశం మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారంగా మారును. కావున మనశ్శాంతి, మనోనిర్మలత, కారుణ్యహృదయం, వైరాగ్యాంతఃకరణం కలగాలంటే శుద్ధఆహారం తప్పనిసరి.