English | Telugu
సందడిగా జరిగిన వర్ష-ఇమ్ము పెళ్లి.. ఇమ్ము కాళ్లుకడిగిన రామ్ప్రసాద్!
Updated : Jun 29, 2021
'జబర్దస్త్' జంటల్లో సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ ఎంత పాపులారిటీ సంపాదించారో తెలిసిందే. ఈ జంటకు ఆన్ స్క్రీన్ పెళ్లి కూడా చేసేసింది మల్లెమాల సంస్థ. ఇప్పుడు మరో జంట హాట్ టాపిక్ అవుతోంది. వారే ఇమ్మానుయేల్-వర్ష. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తో ఈ జంటకి క్రేజ్ పెరిగింది. పైగా కెమెరా ముందు ఈ జంట తమ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోంది.
దీంతో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షో వారు ఇమ్మాన్యుయేల్-వర్షలకు ఆన్ స్క్రీన్ పెళ్లి చేశారు. ఇందులో హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ కామెడీ పండించే ప్రయత్నం చేశారు. "తాజ్మహల్ కడితేనే ఆ ప్రేమకు అర్థం. నీ మెళ్లో తాళి కడితేనే నా ప్రేమకు అర్థం" అని వర్షతో డైలాగ్ కొట్టాడు ఇమ్మానుయేల్. అబ్బో అన్నట్లు పొంగిపోయింది వర్ష. ఇద్దరూ కలిసి పెళ్లి పత్రికలను ఆహ్వానితులకు పంచారు. భోజనాల తర్వాత పెళ్లి జరపడం ఈ పెళ్లిలోని విశేషం. అయితే సరిగ్గా వర్ష మెడలో ఇమ్మాన్యుయేల్ తాళి కట్టే సమయంలో గెటప్ శ్రీను ఆధ్వర్యంలో పోలీసులు వచ్చి పెళ్లి ఆపారు.
"ఏంటిక్కడ యాభై మందితో పెళ్లి చేస్తున్నారా?" అని గెటప్ శ్రీను అడిగితే, "యాభై మందితో చెయ్యట్లేదండీ, ఒక్కడితోనే చేశామండీ" అని పంచ్ వేశాడు హైపర్ ఆది. 20 మందికే పర్మిషన్ ఉంటే, 40 మందితో పెళ్లి చేస్తున్నారంటూ, పెళ్లివారిని పోలీస్ స్టేషన్కు తీసుకుపోయారు. అందరూ పాటలు పాడి, డాన్సులు చేసి ఇంప్రెస్ చేయడంతో పోలీసులు వారిని వదిలిపెట్టారు. వేదికపై హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, ఇమ్మాన్యుయేల్, వర్ష అందరూ కలిసి 'అనితా ఓ అనితా' అంటూ ఓ పాట పాడారు.
పెళ్లి పీటలపై ఇమ్మాన్యుయేల్ కాళ్లు కడిగాడు రామ్ప్రసాద్. చివరలో వర్ష మెడలో ఇమ్ము తాళి కట్టినట్లు చూపించారు. పెళ్లి వేడుకలో ఉండే అరుంధతీ నక్షత్రం చూపించడం, ఉంగరాల ఆట, పూలబంతాట, ఫస్ట్ నైట్ వంటివి కూడా ఇందులో చోటు చేసుకున్నాయి. ఈ స్కిట్ ను ప్రమోట్ చేయడానికి వర్ష ఏకంగా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో తాళిబొట్టు ఫోటో షేర్ చేసింది. ఈ విషయంలో ఆమెని నెటిజన్లు బాగా ట్రోల్ చేశారు. ఏదేమైనా పెళ్లికూతురు గెటప్లో వర్ష చాలా అందంగా ఉందంటూ కామెంట్లు వచ్చాయి.