English | Telugu
సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చిన నిఖిల్ 'స్పై'
Updated : Jul 27, 2023
'కార్తికేయ-2' తర్వాత నిఖిల్ మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతాడని నమ్మకం కలిగించిన చిత్రం 'స్పై'. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా జూన్ 29న విడుదలై అంచనాలకు అందుకోలేక నిరాశపరిచింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ నేపథ్యంలో రూపొందిన సినిమాగా ప్రచారం పొందిన స్పై, మొదటిరోజు మంచి ఓపెనింగ్స్ అయితే రాబట్టింది గానీ, ప్రేక్షకులను మెప్పించలేక పరాజయం పాలైంది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయిన ఈ సినిమా, తాజాగా సైలెంట్ గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.
థియేటర్స్ లో రిజల్ట్ తో సంబంధం లేకుండా, ఓ సినిమా ఓటీటీలోకి వస్తుందంటే కాస్త ముందుగానే తేదీని ప్రకటించి ప్రచారం కల్పిస్తుంటారు. కానీ 'స్పై' విషయంలో అలా జరగలేదు. థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాలకే ఎలాంటి అప్డేట్ లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. 'స్పై' ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ముందుగా ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండానే ప్రైమ్ వీడియో ఈరోజు(జూలై 27) నుంచి 'స్పై' స్ట్రీమింగ్ స్టార్ట్ చేసింది. స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యాక స్పై సినిమాని చూసి ఆనందించండి అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కాగా, తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.