English | Telugu
ఆ పాటల వివాదాన్ని కావాలనే నా మీదకు నెట్టారు : శేఖర్ మాస్టర్
Updated : May 3, 2025
విషయం చిన్నది.. హడావిడి మాత్రం పెద్దది. గోరంతను కొండంతలు చేసి చూపించడం, దాన్ని పెద్ద వివాదంగా చిత్రీకరించడం ఈమధ్యకాలంలో మీడియా, సోషల్ మీడియా చేస్తున్న పని. వేదికలపై సరదాగా మాట్లాడిన విషయాలను కూడా వివాదాలుగా మార్చిన సందర్భాలు కూడా మనం చూశాం. శేఖర్ మాస్టర్ మాటల్లో చెప్పాలంటే.. ‘అదంతా కోడిగుడ్డుపై ఈకలు పీకడం లాంటిది’. ప్రస్తుతం మీడియా చేస్తున్నది అదే అని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఇన్స్పిరేషన్తో 1996లో ఇండస్ట్రీకి వచ్చిన శేఖర్ మాస్టర్.. బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా 6 సంవత్సరాలు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా 8 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 2007లో ‘మంత్ర’ చిత్రంతో కొరియోగ్రాఫర్గా మారారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో పాటలకు అద్భుతమైన స్టెప్స్ కంపోజ్ చేసి ప్రేక్షకుల్ని మెప్పించారు. టాలీవుడ్లోనే కాదు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో తన కొరియోగ్రఫీతో లక్షల మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు.
తన కెరీర్లో ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా క్లీన్ ఇమేజ్ సంపాదించుకున్న శేఖర్.. ఇటీవల కొన్ని వివాదాల బారిన పడ్డారు. ‘డాకు మహారాజ్’ చిత్రంలోని ‘దబిడి దిబిడి..’ సాంగ్ను బాలకృష్ణ, ఊర్వశీ రౌతెలాపై చిత్రీకరించారు. ఈ పాటలోని స్టెప్స్పై వివాదం చెలరేగింది. ఆ తర్వాత ‘పుష్ప2’లోని ‘పీలింగ్స్..’ సాంగ్లో అల్లు అర్జున్, రష్మిక మందన్నలతో వేయించిన స్టెప్స్, ‘రాబిన్హుడ్’ చిత్రంలోని ‘ఇదిదా సర్ప్రైజ్..’ పాటలో కేతిక శర్మతో చేయించిన హుక్ స్టెప్.. ఇలా ఈ మూడు పాటలూ రకరకాల విమర్శలకు లోనయ్యాయి. మీడియాలో, సోషల్ మీడియాలో ఈ పాటలపై పెద్ద దుమారం చెలరేగింది. శేఖర్ మాస్టర్ను టార్గెట్ చేస్తూ విపరీతంగా ట్రోలింగ్ నడిచింది. ఇటీవల ఓ షోలో తనపై వచ్చిన ఈ ఆరోపణలపై ఆవేదన వ్యక్తం చేశారు శేఖర్ మాస్టర్. దర్శకనిర్మాతలు అడిగింది తాను చేశానని, అందులో తన తప్పేముందని ప్రశ్నించారు. అసలు ఆ షోలో శేఖర్ మాస్టర్ ఏం మాట్లాడారో చూద్దాం.
‘నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో స్థిరపడేందుకు ఎంతో స్ట్రగుల్ అయ్యాను. సహజంగా ఎవరైనా అలా స్ట్రగుల్ అవుతారు. అందులో బాధ పడాల్సింది ఏమీ లేదు. కానీ, ఇన్ని సంవత్సరాల తర్వాత నేను చేసిన మూడు పాటల విషయంలో తప్పు జరిగింది అంటూ విమర్శలు రావడం నాకు చాలా బాధ కలిగించింది. ఏదీ మనం కావాలని చెయ్యం. నాకు ఇచ్చిన పాట ఎలా ఉంది, సిట్యుయేషన్ ఏమిటి, దానికి మనం ఏం చెయ్యాలి అనేది చూసి చేస్తాం. నాకు మొదట బాధ పడకపోయినా.. దాన్నే పదే పదే చెప్పడం వల్ల బాధ కలిగింది. నిజంగా నా వల్ల అంత పెద్ద తప్పు జరిగిందా అనిపించింది. నా కొరియోగ్రఫీ ఆ హీరోలకు, నిర్మాతలకు, దర్శకులకు నచ్చింది. ముఖ్యంగా పుష్ప2లోని పీలింగ్స్ సాంగ్పై చాలా రకాలుగా మాట్లాడారు. భార్యాభర్తలు ఒక డ్రీమ్లోకి వెళ్లినపుడు వాళ్లు ఎలా ఫీలవుతారు అనేది ఆ పాటలో చూపించాం. ఆ పాటలోని స్టెప్స్ చూసి ఎక్స్ట్రార్డినరీ అని అందరూ అన్నారు. కానీ, కొందరు కావాలని దాన్ని కావాలని కాంట్రవర్సీ చేశారు. ఇదంతా నన్ను వెనక్కి లాగాలని చేస్తున్నదే. ఒక్కమాటలో చెప్పాలంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకడం లాంటిది ఇది. ఈ విమర్శలన్నీ మీడియాలో, సోషల్ మీడియాలోనే వచ్చాయి తప్ప ఆ పాటల కంపోజింగ్ బాగా లేదు అని డైరెక్ట్గా ఒక్కరు కూడా నాతో అనలేదు’ అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు శేఖర్ మాస్టర్.