Read more!

English | Telugu

బాలీవుడ్ లో అందరివాడుగా ఎన్టీఆర్!

టాలీవుడ్ లో తన తోటి స్టార్లతో మంచి అనుబంధాన్ని కలిగి ఉండే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) ముందు వరుసలో ఉంటాడు. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వారితో ఆయన ఎంతటి అనుబంధాన్ని కలిగి ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో సైతం ఎన్టీఆర్ అందరివాడు అనిపించుకుంటున్నాడు.

హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న 'వార్ 2'(War 2)తో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. అలా షూట్ స్టార్ట్ అయిందో లేదో అప్పుడే బాలీవుడ్ లో ఎన్టీఆర్ పేరు మారుమోగిపోతోంది. తాజాగా ముంబైలో జరిగిన ఓ పార్టీలో బాలీవుడ్ స్టార్స్ తో కలిసి ఎన్టీఆర్ సందడి చేశాడు. తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి తారక్ పాల్గొన్న ఈ పార్టీకి.. హృతిక్ రోషన్- సబా ఆజాద్, రణబీర్ కపూర్- అలియా భట్, కరణ్ జోహార్, అయాన్ ముఖర్జీ తదితరులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిలో ఎన్టీఆర్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

హృతిక్ తో కలిసి 'వార్ 2' షూట్ లో పాల్గొంటున్న ఎన్టీఆర్.. ఇప్పటికే ఆయనకు బాగా దగ్గరై ఉంటాడు అనడంలో సందేహం లేదు. అలాగే 'ఆర్ఆర్ఆర్'లో అలియా భట్ తో కలిసి నటించాడు ఎన్టీఆర్. ఇందులో వీరు జంటగా నటించనప్పటికీ.. ప్రమోషన్స్ సమయంలో  తారక్-అలియా మధ్య ఫ్రెండ్ షిప్ చూసి అందరూ ఫిదా అయ్యారు. అంతేకాదు తన భర్త రణబీర్ తో కలిసి అలియా నటించిన 'బ్రహ్మాస్త్ర' మూవీ తెలుగు ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. ఆ సినిమాకి కరణ్ జోహార్ నిర్మాత కావడం విశేషం. అప్పటి నుంచి రణబీర్, కరణ్ తోనూ తారక్ కి మంచి అనుబంధం ఏర్పడింది. ముఖ్యంగా కరణ్ అయితే.. ఎన్టీఆర్ యాక్టింగ్ టాలెంట్ గురించి పబ్లిక్ గా పొగిడేస్తుంటాడు. ఇక 'బ్రహ్మాస్త్ర' దర్శకుడు అయాన్ ముఖర్జీ నే ఇప్పుడు 'వార్ 2'కి దర్శకత్వం వహిస్తుండటం మరో విశేషం. ఇలా బాలీవుడ్ స్టార్స్ కి, మేకర్స్ కి దగ్గరవుతూ తారక్ అందరివాడు అనిపించుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో ఆయన బాలీవుడ్ లో మరిన్ని సినిమాలు చేసినా ఆశ్చర్యం లేదు.