English | Telugu

శ్యామల క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు.. విచారణ తప్పదు!

ప్రస్తుతం తెలంగాణలో హాట్‌ టాపిక్‌ ఏమిటంటే.. బెట్టింగ్‌ యాప్స్‌. వీటిని ప్రమోట్‌ చేస్తున్న వారిపై వరసగా కేసులు నమోదు చేస్తున్నారు. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఇప్పటికే 35కిపైగా కేసులు నమోదయ్యాయి. వారందరికీ నోటీసులు జారీచేసి విచారణకు రావాల్సిందిగా ఆదేశిస్తున్నారు. కొందరు విచారణకు హాజరు కాగా, హర్షసాయి, ఇమ్రాన్‌ ఖాన్‌.. తమపై కేసు నమోదైన వెంటనే దుబాయ్‌ చెక్కేశారు. ఈ కేసు బారిన పడిన వారు రకరకాల కథనాలు చెప్తున్నారు. కొందరు తెలియక చేశామని, మరికొందరు అన్నీ చట్టబద్దంగా ఉన్నాయి కాబట్టే ప్రమోట్‌ చేశామని అంటున్నారు. మరికొందరు తప్పు చేసి కూడా మీడియా అడుగుతున్న ప్రశ్నలకు ఎదురు సమాధానాలు చెప్తూ బుకాయిస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. యాంకర్‌ శ్యామల ఇప్పుడు ఏపీలో కీలక వ్యక్తి అనే విషయం అందరికీ తెలిసిందే. వైసీపీ అధికార ప్రతినిధి హోదాలో ఉన్న ఆమె అంతకుముందు బెట్టింగ్‌ యాప్‌లకు సంబంధించిన ఒక వీడియో చేసిందనే అభియోగంపై ఆమెకు నోటీసులు జారీ చేశారు. దాంతో శ్యామల హైకోర్టును ఆశ్రయించింది. తనపై ఉన్న కేసును కొట్టివేయాలంటూ క్వాష్‌ పిటిషన్‌ వేసింది. దీనిపై విచారణ జరిపిన హై కోర్టు ఆమెను అరెస్ట్‌ చేయవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆమెకు నోటీసులు ఇచ్చి విచారణ కొనసాగించమని పోలీసులకు సూచించింది. హైకోర్టు నుంచి శ్యామలకు ఊరట లభించినప్పటికీ సోమవారం నుంచి విచారణలో భాగంగా పోలీసుల ఎదుట హాజరు కావాలని, వారికి సహకరించాలని శ్యామలకు కూడా సూచనలు అందించింది హైకోర్టు.

పోలీసులుగానీ, ప్రభుత్వంగానీ అవినీతికి సంబంధించి ఏదైనా చర్యలు తీసుకోవాలంటే.. ఏదైనా ఉపద్రవం జరగాలి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోవాలి. అప్పుడుగానీ రంగంలోకి దిగరు. ఇప్పుడు బెట్టింగ్‌ యాప్‌ల విషయంలో కూడా వారి ధోరణి అలాగే వుంది. గత కొన్ని సంవత్సరాలుగా బెట్టింగ్‌ యాప్‌ల వలలో పడి ఎంతో నష్టపోయారు. ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు బెట్టింగ్‌ యాప్‌ల ప్రమోషన్‌ అనే అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆత్మహత్యకు పాల్పడినవారి కేసులన్నీ బయటికి తీస్తున్నారు. ఈ సంవత్సరం బెట్టింగ్‌ యాప్‌ల వల్ల 15 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వారి ఆత్మహత్యలకు బెట్టింగే కారణమా అనే కోణంలో విచారిస్తున్నారు. ఇప్పటికే కొన్ని యాప్‌లను గుర్తించి వాటి నిర్వాహకులను కూడా నిందితులుగా చేర్చి విచారిస్తున్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారిన బెట్టింగ్‌ యాప్‌ల విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా పరిశీలించాలని కోరుతున్నారు. అక్కడ కూడా ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఈ యాప్‌లను ప్రమోట్‌ చేసేవారు అక్కడ కూడా ఉన్నారని, వాళ్ళపై కూడా కేసులు నమోదు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.