Read more!

English | Telugu

'భీష్మ' కాంబోలో మైత్రి మూవీ!

నితిన్, రష్మిక మందన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన సినిమా 'భీష్మ'. 2020 ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇప్పుడు ఈ హిట్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

నాగ శౌర్య, రష్మిక జంటగా రూపొందిన 'ఛలో'(2018)తో దర్శకుడిగా పరిచయమైన వెంకీ కుడుముల మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత 'భీష్మ'తో వరుసగా రెండో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. దాంతో ఏకంగా మూడో సినిమాకే మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. అయితే ఏవో కారణాల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దీంతో 'భీష్మ' కాంబోలోనే తన మూడో సినిమా తీయడానికి సిద్ధమయ్యాడు వెంకీ. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. మార్చి 24 లేదా 30న ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.

నితిన్ కి ఇది మైత్రి బ్యానర్ లో మొదటి సినిమా కాగా, రష్మిక ఇప్పటికే మైత్రి బ్యానర్ లో 'డియర్ కామ్రేడ్', 'పుష్ప' వంటి సినిమాలు చేసింది. ఇక వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోన్న వరుసగా మూడో సినిమాలోనూ రష్మిక హీరోయిన్ కావడం విశేషం. మొదటి రెండు సినిమాలు 'ఛలో', 'భీష్మ' తరహాలోనే ఈ మూవీ కూడా ఘన విజయం సాధిస్తుందేమో చూడాలి.