English | Telugu
ఇకనైనా ఇలాంటివి ఆపండి.. కన్నీటితో వేడుకుంటున్న నటి!
Updated : Nov 8, 2023
కొన్ని సంవత్సరాల క్రితం అవతరించిన సోషల్ మీడియా అందరికీ వరంలాంటిది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా క్షణాల్లో అందరికీ చేరవేసేందుకు సోషల్ మీడియా ఎంతగానో దోహదపడుతోంది. టెక్నాలజీ ఏదైనా సద్వినియోగం చేసుకుంటే అందరికీ మంచిది. కానీ, కొందరు దుర్వినియోగం చేస్తూ అమాయకులైన వారిని బాధపెడుతున్నారు. డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్న కొందరు తప్పుడు సమాచారాన్ని అందరికీ చేరవేస్తున్నారు. దానివల్ల సామాన్యులు ఎంతో నష్టపోతున్నారు. వీటిలో యూట్యూబ్ ఛానల్స్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. నటీనటులపై తమ ఇష్టానుసారం తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. థంబ్ నెయిల్ ఒకటి ఉంటుంది, వీడియో ఓపెన్ చేస్తే మరో మ్యాటర్ ఉంటుంది. యూ ట్యూబ్లో సినిమాలకు సంబంధించిన న్యూస్లలో సగానికి సగం ఇవే వుంటాయి.
ఇక నటీనటులపై చేసే వీడియోలు మామూలుగా ఉండవు. మరీ దిగజార్చే వార్తలతో వారిని బాధ పెడుతూ ఉంటారు. ఈ విషయంపై తాజాగా మలయాళ నటి బీనా ఆంటోని స్పందించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న మలయాళ టీవీ, సినీ నటి రెంజుషా మీనన్ మరణ వార్తకు సంబంధించి తాను చేసిన పోస్టును తమ స్వలాభం కోసం వేరే విధంగా మార్చి ఇష్టమొచ్చిన థంబ్ నెయిల్స్ పెట్టారు. అది తనకెంతో బాధ కలిగించిందని చెప్పారు.
దీనికి సంబంధించి ఇటీవల ఓ వీడియోను విడుదల చేశారు బీనా ఆంటోని. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ ‘చనిపోయిన వ్యక్తులను గౌరవించాలి. యూట్యూబ్ ఛానల్స్ నైతికత లేకుండా, తప్పుదారి పట్టించే విధంగా థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. ఇటువంటి చర్యలు సమర్ధించదగినవి కాదు. ఇటీవల చాలా మంది ప్రముఖులను మనం కోల్పోయాం. ఆ షాక్ నుంచే ఇంకా ఎవ్వరూ తేరుకోలేదు. ఇలాంటి సమయంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మమ్మల్ని బలిపశువుల్ని చేస్తున్నాయి. వారి రీచ్ కోసం ఎలా పడితే అలా వీడియోలు రూపొందిస్తున్నారు. రెంజూష మృతికి సంతాపంగా నేను ఓ పోస్టు పెడితే.. సెన్సేషన్ అవ్వడం కోసం దాన్ని వీడియోగా రూపొందించారు. దాని థంబ్ నెయిల్స్ చూసి షాక్ అయ్యాను. డబ్బుకోసం మరీ ఇంత ఛీప్గా బిహేవ్ చేస్తారా? ఈ వీడియోలు రెంజూష కుటుంబం చూడదా.. వారు తన గురించి ఏమనుకుంటారు? దయచేసి ఇలాంటివి ఆపండి’ అని కన్నీటితో వేడుకున్నారు.
బీనా ఆంటోని విడుదల చేసిన వీడియోపై నటి అవంతిక మోహన్ స్పందించారు. అమ్మా ప్లీజ్ ఇలాంటివి ఇగ్నోర్ చేయమని చెబుతూ, కొన్ని సంవత్సరాల క్రితం వీటి నుండే తాను నేర్చుకున్నానని అన్నారు. యూ ట్యూబర్లను ఉద్దేశించి మాట్లాడుతూ పందులకు బురద అంటే ఇష్టమని, అసలు మీరేంటో తమకు తెలుసునని అవంతిక మోహన్ చెప్పారు.