English | Telugu
'అమిగోస్' చూసి ఎన్టీఆర్ ఫిదా!
Updated : Feb 8, 2023
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం 'అమిగోస్'. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కళ్యాణ్ రామ్ మొదటిసారి త్రిపాత్రాభినయం పోషించిన ఈ చిత్రం ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'బింబిసార' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన సినిమా కావడంతో 'అమిగోస్'పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. విడుదలకు ముందే ఈ చిత్రానికి మంచి టాక్ వస్తోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా చూసి ఫిదా అయినట్లు తెలుస్తోంది.
ఇటీవల కళ్యాణ్ రామ్, దర్శకుడు రాజేంద్ర రెడ్డితో పాటు ఇతర మూవీ టీమ్ తో కలిసి 'అమిగోస్' చిత్రాన్ని వీక్షించిన తారక్.. సినిమా చాలా బాగుందని టీమ్ ని మెచ్చుకున్నాడట. ముఖ్యంగా దర్శకుడి పనితీరుని ప్రత్యేకంగా అభినందించాడట. 'బింబిసార' తర్వాత తన అన్న కళ్యాణ్ రామ్ నుంచి ఎలాంటి సినిమా వస్తుందా అనుకుంటే.. ఈ 'అమిగోస్' చిత్రం ఊహించిన దానికంటే అద్భుతంగా ఉందని, ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని సంతోషం వ్యక్తం చేశాడట.
కళ్యాణ్ రామ్ గత చిత్రం 'బింబిసార' సమయంలో కూడా ఎన్టీఆర్ ఇలాగే ముందుగానే సినిమా చూసి.. చాలా బాగుందని, ఖచ్చితంగా హిట్ అవుతుందని అన్నాడు. ఆయన అన్నట్లుగానే 'బింబిసార' బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు 'అమిగోస్' విషయంలో కూడా ఎన్టీఆర్ అంచనా నిజమవుతుందేమో చూడాలి.