English | Telugu

‘రుద్రాక్ష’లో ద్రాక్ష ఎవరో?

క్రియేటివ్ డైరెక్టర్‌ కృష్ణవంశీ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు ‘రుద్రాక్ష’ అనే సినిమాతో రావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పుడు టాలీవుడ్‌లో అంతా దెయ్యాలు, భూతాల ట్రెండ్ నడుస్తోంది కదా.. మొన్నటి వరకూ ట్రెండ్ సెట్టర్ అనిపించుకున్న క‌ష్ణవంశీ పాపం ఈమధ్య టైం బాగాలేకపోవడంతో ట్రెండ్‌ని ఫాలో అయిపోతున్నాడు. అందుకే ఇప్పుడున్న ట్రెండ్‌ని అందిపుచ్చుకుని ‘రుద్రాక్ష’ అనే దయ్యాలు, భూతాల సినిమా తీయబోతున్నాట్ట. స్క్రిప్టు పక్కాగా రెడీ చేసుకుని, లక్కీ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంపౌండ్లోకి ఆ స్క్రిప్టుని ప్రవేశపెట్టాడట. ఆ సినిమాకి దిల్ రాజు మాత్రమే కాదు... ప్రకాష్ రాజ్ కూడా ఒక ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తాడని సమాచారం.

ఈ సినిమా గురించి త్వరలో దిల్ రాజు కాంపౌండ్ నుంచి అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం వుందట. అంతా అనుకున్నట్టు జరిగితే వచ్చే నెలలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వచ్చే ఛాన్సుందట. అన్నట్టు ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ హారర్ మూవీ అంటున్నారు. ఆ హీరోయిన్ పాత్రలో తమన్నా నటించబోతున్నట్టు ఆమధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తమన్నా ఈ ప్రాజెక్టులో లేనట్టు ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. హీరోయిన్లను ద్రాక్షపళ్ళలా నోరూరించే చూపించడంలో కృష్ణవంశీ సిద్ధహస్తుడు.

నిజంగా ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తే ప్రేక్షకులు పాలలో ముంచిన తెల్ల ద్రాక్షను చూసినట్టుగా ఫీలయ్యేవారే. కానీ ఆ ఛాన్స్ ఉన్నట్టు కనిపించడం లేదు. ఆ అవకాశాన్ని ఏ రకుల్ ప్రీత్‌కో, రాశీఖన్నాకో ఇవ్వాలని కృష్ణవంశీ అనుకుంటున్నట్టు సమాచారం. అయితే దిల్ రాజు మాత్రం తమన్నా అయితేనే బెటరని భావిస్తున్నాట్ట. మొత్తమ్మీద ‘రుద్రాక్ష’లో ద్రాక్షపండు అయ్యే ఛాన్స్ ఏ భామని వరిస్తుందో!