Read more!

English | Telugu

కింగ్‌, బాద్‌షా, సుల్తాన్ ఉన్నంత‌కాలం బాలీవుడ్ మునుగుతూనే ఉంటుంది!

 

ఇండ‌స్ట్రీలోని ఎవ‌రికైనా.. వాళ్లు టాప్ స్టార్స్ అయిన‌ప్ప‌టికీ ఒడిదుడుకులు త‌ప్ప‌వు. ఇటీవ‌ల కాలంలో ఎన్న‌డూ లేనంత‌గా బాలీవుడ్ న‌ష్టాల‌ను చ‌విచూస్తోంది. కొవిడ్‌-19 అనేది బాలీవుడ్‌ను చాలావ‌ర‌కు మార్చేసింది. 2022 ఫ‌స్టాఫ్‌లో ఈ మార్పు చాలా స్ప‌ష్టంగా ప్ర‌పంచానికి తెలిసొచ్చింది. ప్రేక్ష‌కుల అభిరుచుల్లో వ‌చ్చిన మార్పుల‌ను అర్థంచేసుకోలేక‌పోవ‌డంతో అనేక సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కుదేల‌య్యాయి. క‌శ్మీర్ పండిట్లపై జ‌రిగిన హ‌త్యాకాండ ఆధారంగా వివేక్ అగ్నిహోత్రి తీసిన 'ద క‌శ్మీర్ ఫైల్స్' మూవీ ఆడియెన్స్‌ను అమితంగా ఆక‌ట్టుకుంది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మొద‌ట నెమ్మ‌దిగా ప్రారంభ‌మైన వ‌సూళ్లు, త‌ర్వాత ఓ ప్ర‌భంజ‌నంలా మారాయి.

లేటెస్ట్‌గా వివేక్ అగ్నిహోత్రి ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైర‌ల్‌గా మార‌డ‌మే కాకుండా, చ‌ర్చ‌కు దారితీసింది. బాలీవుడ్ టాప్ స్టార్స్ అభిమానుల్లో ఆగ్ర‌హాన్ని క‌లిగించింది. త‌న ట్విట్‌లో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్స్ అయిన షారుక్ ఖాన్‌, స‌ల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేశాడు వివేక్‌. వాళ్ల పేర్లు నేరుగా ప్ర‌స్తావించ‌కుండా, బాలీవుడ్ మునిగిపోతుండ‌టానికి వారే కార‌ణ‌మ‌ని అన్నాడు. "ఈ కింగ్‌, బాద్‌షా, సుల్తాన్ బాలీవుడ్‌లో ఉన్నంత కాలం హిందీ సినిమా మునిగిపోతూనే ఉంటుంది. ప్ర‌జ‌ల క‌థ‌ల సాయంతో ప్ర‌జ‌ల ఇండ‌స్ట్రీగా దాన్ని త‌యారుచేస్తేనే, గ్లోబ‌ల్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీని ఇది ఏల‌గ‌లుగుతుంది. ఇది వాస్త‌వం" అని ఆయ‌న ట్వీట్ చేశాడు. షారుక్‌ను 'కింగ్' అనీ, 'బాద్‌షా' అనీ అని ఫ్యాన్స్ పిలుచుకుంటార‌నీ, స‌ల్మాన్ 'సుల్తాన్' అనే సినిమాని చేశాడ‌నీ తెలిసిందే

స‌ల్మాన్ ఖాన్ త్వ‌ర‌లో 'టైగ‌ర్ 3' మూవీతో మ‌న ముందుకు వ‌స్తుండ‌గా, షారుక్ ఖాన్ 'ప‌ఠాన్' మూవీతో రానున్నాడు. మ‌రోవైపు 'ద కశ్మీర్ ఫైల్స్' త‌ర్వాత 'ఢిల్లీ ఫైల్స్' తీస్తాన‌ని గ‌తంలోనే ప్ర‌క‌టించిన వివేక్ అగ్నిహోత్రి, ప్ర‌స్తుతం దానికి సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్‌లో ఉన్నాడు.