Read more!

English | Telugu

బాలీవుడ్ స్టార్‌ డైరెక్టర్‌ కన్నుమూత!

బాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు సంజయ్‌ గాధ్వి కన్ను మూశారు. ఆయన వయస్సు 57 సంవత్సరాలు. నవంబర్‌ 19 ఆదివారం ఉదయం 9.30 గంటలకు సంజయ్‌ తుది శ్వాస విడిచారు. ఆయన భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మరో మూడు రోజుల్లో 58వ ఏట అడుగు పెట్టనున్న తరుణంలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. సంజయ్‌ పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పటికీ గుండెపోటుతో మరణించారని ఆయన పెద్ద కుమార్తె సంజినా తెలియజేసింది. సంజయ్‌ మరణంపై స్పందించిన బాలీవుడ్‌ దర్శకుడు కునాల్‌ కోహ్లీ ’ఇది ఎంతో షాక్‌కి గురిచేసిన వార్త. లంచ్‌ డబ్బాస్‌ డిస్కషన్స్‌లో చాలా సంవత్సరాలు ఆయన ఆఫీసును షేర్‌ చేసుకున్నారు. నిన్ను చాలా మిస్‌ అవుతున్నాను. ఇది రాయడానికి మనస్సు అంగీకరించడం లేదు మిత్రమా’ అంటూ ట్వీట్‌ చేశారు. 

2001లో వచ్చిన ‘తేరే లియే’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. అంతా కొత్తవారితో రూపొందించిన ఈ సినిమా ఫర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత యష్‌రాజ్‌ ఫిలింస్‌ నిర్మించిన ‘మేరే యార్‌ కి షాదీ హై’ చిత్రంతో తనదైన ముద్ర వేశాడు. ఉదయ్‌ చోప్రా, తులిప్‌ జోషి, జిమ్మీ షీర్‌గిల్‌, బిపాసా బసు ఈ చిత్రంలో నటించారు. ఆ తర్వాత చేసిన ధూమ్‌, ధూమ్‌ 2 చిత్రాలతో సంజయ్‌ పేరు మారు మోగిపోయింది. కొత్త తరహా చిత్రాలుగా ధూమ్‌ సిరీస్‌కి మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలతో ధూమ్‌ ఇంటిపేరుగా మారిపోయింది. 2004లో జాన్‌ అబ్రహం, అభిషేక్‌ బచ్చన్‌, ఉదయ్‌ చోప్రా ప్రధాన పాత్రల్లో ధూమ్‌ చిత్రాన్ని తెరకెక్కించి రిలీజ్‌ చేసారు. ఆ చిత్రం భారీ బ్లాక్‌ బస్టర్‌. 2006లో అభిషేక్‌ బచ్చన్‌, ఉదయ్‌ చోప్రా, రిమీ సేన్‌లతో ధూమ్‌ 2ని తెరకెక్కించాడు. ఈసారి అతడు హృతిక్‌ రోషన్‌, ఐశ్వర్య రాయ్‌, బిపాషా బసు లాంటి తారాగణాన్ని అదనంగా జోడిరచాడు. ఈ సినిమా ధూమ్‌ కంటే పెద్ద హిట్‌ అయింది. తన కెరీర్‌లో 7 సినిమాలకు దర్శకత్వం వహించాడు సంజయ్‌. ఈ ఏడు సినిమాల్లో ధూమ్‌, ధూమ్‌ 2 చిత్రాలతో అతనికి స్టార్‌ డైరెక్టర్‌ హోదా లభించింది. సంజయ్‌ మృతి పట్ల పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు.