Read more!

English | Telugu

ఆకట్టుకుంటున్న 'డంకీ' టీజర్.. షారుఖ్ కి మరో వెయ్యి కోట్ల సినిమా అవుతుందా?

ఈ ఏడాది ఇప్పటికే 'పఠాన్', 'జవాన్' సినిమాలతో వరుసగా రెండు వెయ్యి కోట్ల గ్రాస్ చిత్రాలతో సత్తా చాటారు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. ఈ డిసెంబర్ 22న విడుదల కానున్న 'డంకీ'తో హ్యాట్రిక్ వెయ్యి కోట్ల ఫీట్ సాధిస్తాడనే అంచనాలు ఉన్నాయి. పైగా ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరాణీ దర్శకుడు. 20 ఏళ్ళ కెరీర్ లో తీసింది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ ప్రతి సినిమాతోనే సంచలన విజయాలను అందుకున్నారు రాజ్ కుమార్. ఇప్పటిదాకా ఆయన చేసిన సినిమాలన్నీ దేశ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకున్నాయి. మరోసారి సున్నితమైన ప్రేమ, స్నేహం అనే అంశాల చుట్టూ, హాస్యభరితంగా తెరకెక్కించిన 'డంకీ' థియేటర్లో వచ్చేందుకు సిద్దంగా ఉంది.

షారుఖ్, రాజ్ కుమార్ కాంబోలో మొదటిసారిగా సినిమా వస్తుండటంలో అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. షారుఖ్ పుట్టినరోజు(నవంబర్ 2) సందర్భంగా నేడు ‘డంకీ’ నుంచి టీజర్‌ను విడుదల చేశారు. విదేశాలకు వెళ్లాలనే నలుగురు స్నేహితుల కల చుట్టూ ‘డంకీ’ కథ తిరుగుతుంది. ఈ క్రమంలో ఆ నలుగురికి ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. యదార్థ సంఘటనల ఆధారంగా తీసుకున్న ఈ కథలో ప్రేమ, స్నేహబంధాల గొప్పదనం చాటి చెప్పేలా ఉండబోతోంది. హిరాణీ తన మార్క్‌ను చూపిస్తూ ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కించారు.

టీజర్ లో బొమన్ ఇరానీ, తాప్సీ పన్ను, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చార్, అనిల్ గ్రోవర్ వంటి వారి పాత్రలను పరిచయం చేశారు. అన్ని పాత్రలకు ప్రాముఖ్యత ఉన్నట్టుగా కనిపిస్తోంది.

జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, రాజ్ కుమార్ హిరాణీ ప్రజెంటేషన్ బ్యానర్లపై సంయుక్తంగా రాబోతోన్న ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరాణీ, గౌరీ ఖాన్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రాజ్ కుమార్ హిరాణీ, అభిజాత్ జోషి, కనికా థిల్లాన్ రాసిన ఈ కథను రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించారు.