Read more!

English | Telugu

రణబీర్‌ కపూర్‌పై పోలీస్‌ కేసు.. వివాదంలో ఇరుక్కున్న ‘యానిమల్‌’ హీరో!

సినిమా తారలు ఎప్పుడు ఏ వివాదంలో ఇరుక్కుంటారో.. ఎప్పుడు ఎలాంటి అపవాదు నెత్తిమీద వేసుకుంటారో ఎవ్వరికీ అర్థం కాదు. కొంతమంది కావాలని వివాదాలు సృస్టిస్తే.. మరికొందరు అనుకోకుండా వివాదాల్లో చిక్కుకుంటారు. తాజాగా ‘యానిమల్‌’ హీరో రణబీర్‌ కపూర్‌ అలాంటి ఓ వివాదంలో చిక్కుకున్నాడు. అది కావాలని చేశారా లేక అనుకోకుండా జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. 

రణబీర్‌ కపూర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. ఇదే అతని కొంప ముంచింది. క్రిస్మస్‌ కేక్‌ని కట్‌ చేసే సందర్భంలో యంగ్‌ హీరో జహాన్‌ కపూర్‌ కేక్‌పై వైన్‌ పోశాడు. దానికి రణబీర్‌ కపూర్‌ లైటర్‌తో నిప్పు అంటించాడు. అంతటితో ఆగకుండా ‘జై మాతాది’ అంటూ నినాదం చేశాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన ఆశిష్‌రాయ్‌, పంకజ్‌ మిశ్రా అనే ఇద్దరు అడ్వకేట్స్‌ ఘట్కోపర్‌ పోలీస్‌ స్టేషన్‌లో రణబీర్‌ కపూర్‌పై ఫిర్యాదు చేశారు. రణబీర్‌ కపూర్‌ కుటుంబం సనాతన ధర్మాన్ని అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘హిందూమతంలో ఇతర దేవతలను పూజించడానికి ముందు అగ్ని దేవుడిని ఆరాధిస్తారు. అయితే కపూర్‌, అతడి కుటుంబ సభ్యులు ఇతర మతానికి సంబంధించిన పండుగ వేడుకల్లో హిందూమతంలో నిషేధిత మత్తు పదార్థాలను ఉద్దేశపూర్వకంగా ఉపయోగించారు. జై మాతా ది అని నినాదాలు కూడా చేశారు’ అని ఫిర్యాదులో వివరించారు న్యాయవాదులు. 

ఇలాంటి చర్యల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని సదరు న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. రణ్‌బీర్‌కపూర్‌పై సెక్షన్‌ 295 ఏ (మతాన్ని లేదా మత విశ్వాసాలను అవమానించడం), సెక్షన్‌ 298 (మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం), సెక్షన్‌ 500 (పరువు నష్టం), సెక్షన్‌ 34 కింద కేసు నమోదు చేయాలని కోరారు.