Read more!

English | Telugu

జాక్వ‌లిన్‌ను తీసుకోడానికి వెనుకాడుతున్న నిర్మాత‌లు.. కెరీర్ ఖ‌త‌మైన‌ట్లేనా?

 

ఒక అక్ర‌మార్జ‌న‌ కేసులో బాలీవుడ్ భామ‌ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పదే పదే సమన్లు ​​జారీ చేస్తూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఆర్థిక మోస‌గాడు సుకేష్ చంద్రశేఖర్‌పై వేసిన అక్ర‌మార్జ‌న‌ కేసులో జాక్వ‌లిన్‌కు చెందిన‌ రూ.7.27 కోట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఆమె ఇప్పుడు హిందీ చిత్ర పరిశ్రమ నుండి పూర్తిగా బహిష్కార‌ ముప్పును ఎదుర్కొంటోంది.

సుకేశ్ చంద్రశేఖర్‌పై ఆర్థిక‌ దోపిడీ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరిగా జాక్వెలిన్ పేరును ఈడీ పేర్కొన‌డంతో ఆమె కెరీర్‌పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. ఇక ఆమె ప‌ని అయిపోయిన‌ట్లేన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఆమెకు ఈడీ ప‌లుమార్లు స‌మ‌న్లు జారీ చేశాక జాక్వ‌లిన్‌ వ‌రుస‌గా ఆఫ‌ర్లు కోల్పోతూ వ‌స్తోంది. "ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన 'బ‌చ్చ‌న్ పాండే', 'విక్రాంత్ రోణ' సినిమాల్లో ఆమె క‌నిపించినా, అవి ఆమె ఎప్పుడో న‌టించిన‌వి. ఆమె ప‌రిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందోన‌నే అనిశ్చితి కార‌ణంగా ఎవ‌రూ ఆమెను కొత్త సినిమాల‌కు తీసుకోవ‌ట్లేదు" అని గ‌తంలో ఆమెతో క‌లిసి ప‌నిచేసిన ఓ నిర్మాత అన్నారు.

చంద్రశేఖర్‌పై దోపిడీ కేసులో ED జాక్వెలిన్ పేరును ఇరికించ‌డంతో ఆమెను అరెస్ట్ చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చాలామంది న‌మ్ముతున్నారు. ప‌రిస్థితి తీవ్ర‌త‌ను చూస్తే, ఈ ఎదురుదెబ్బ నుంచి ఆమె పుంజుకొనే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. "ఇది నిజంగా బాధాక‌రం. ఆమె చాలా మంచి అమ్మాయి. తానేం చేస్తున్నాన‌నే విష‌యం తెలియ‌కుండానే ఆమె చిక్కుల్లో ప‌డింది" అని జాక్వ‌లిన్‌తో క‌లిసి న‌టించిన ఓ తార చెప్పింది.