ముస్లిం రిజర్వేషన్ చట్ట విరుద్ధం హైకోర్టు సంచలన తీర్పు!

ముస్లిం ఉప కులాలకు రిజర్వేషన్‌ కల్పించేందుకు ఉద్దేశించిన ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం 2010 తరువాత ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు 77 ముస్లిం ఉప కులాలను ఓబీసీలుగా గుర్తిస్తూ తీసుకొచ్చిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమని ధర్మాసనం తెలిపింది. ముస్లిం సమాజాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఒక వస్తువుగా పరిగణిస్తున్నారని జస్టిస్‌ తపబ్రత చక్రవర్తి, జస్టిస్‌ రాజశేఖర్‌ మంథా ధర్మాసనం తెలిపింది. అయితే, ఇప్పటికే ఈ విధమైన రిజర్వేషన్లు పొందినవారు, ప్రభుత్వ ఉద్యోగాలు, సర్వీసులకు ఎంపికైనవారికి తమ తీర్పు వర్తించదనీ.. వారు ఉద్యోగాల్లో యథావిధిగా కొనసాగవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.  2010 సంవత్సరం తర్వాత నుంచి జారీ చేసిన ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) సర్టిఫికెట్లన్నీ రద్దు చేస్తూ కోల్‌కతా హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత 14 ఏళ్ళ‌ వ్యవధిలో జారీ అయిన దాదాపు 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లన్నీ రద్దయ్యాయి.  అయితే, ఓబీసీ సర్టిఫికెట్లను వాడుకొని ఇప్పటికే ఉద్యోగాలు పొందిన వారిపై, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న వారిపై ఈ ఆదేశాల ప్రభావం ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటి వారంతా ఓబీసీ కోటాలోనే కొనసాగుతరాని వెల్లడించింది. 2010 సంవత్సరం తర్వాత మ‌మ‌తా సర్కారు జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లు 1993 చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని న్యాయమూర్తులు జస్టిస్ తపోబ్రత చక్రవర్తి, జస్టిస్ రాజశేఖర్ మంథర్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 2010 ఏప్రిల్‌ – సెప్టెంబరు మధ్య 77 కులాలను ఓబీసీలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను, 2012 చట్టం ఆధారంగా కొత్తగా చేర్చిన మరో 37 కులాల ఓబీసీ హోదాను కోర్టు కొట్టివేసింది.  2012లో చేసిన ఒక చట్టం కింద కొన్ని కులాలకు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.  కలకత్తా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  స్పష్టం చేశారు. - ఎం.కె. ఫ‌జ‌ల్‌

నరసరావుపేట కోర్టులో పిన్నెల్లి లొంగుబాటు?

పోలింగ్ బూత్ లో దౌర్జన్యం చేసి ఈవీఎం ను ధ్వంసం చేసిన మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. పిన్నెల్ల ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో వెలుగులోనికి వచ్చిన తరువాత ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఆయనను తక్షణమే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించింది. దీంతో పోలీసులు పిన్నెల్లిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఆయనను అరెస్టు చేసేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బుధవారం (మే 22) ఆయన సంగారెడ్డి సమీపంలోని ఇస్నాపూర్ లో చిక్కినట్లే చిక్కి తప్పించుకు పారిపోయారు. ఆ సందర్భంగా ఆయన కారును అందులో ఉన్న ఆయన సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆయన కారు డ్రైవర్ ను కూడా అదుపులోనికి తీసుకున్నారు. ఇలా ఉండగా ఆయన తమిళనాడు వెళ్లారనీ, అక్కడ నుంచి విదేశాలకు వెళ్లే అవకాశం ఉందన్న అనుమానాల నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్నరెడ్డిపై లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇలా ఉండగా గురువారం (మే 23) ఆయన నరసరావు పేట కోర్టులో లొంగిపోయే అవకాశాలున్నాయని అందిన సమాచారం మేరకు పోలీసులు నరసరావుపేట కోర్టు వద్ద భారీగా మోహరించారు. దీంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. 

పిన్నెల్లి ఆస్తుల్ని సీజ్ చేయాలి! ఉక్కుపాదంతో అణిచేయాలి!

పల్నాడు ప్రాంతంలో జరిగిన పోలింగ్ హింసను చూసి వామ్మో అనుకుంటున్నాం కానీ... ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో జరిగే నేరపూరిత చర్యలు వింటేనే వళ్ళు జలదరిస్తుంది. తుపాకులు ధరించి యదేచ్చగా తిరిగే రాజకీయ నాయకుల అనుచరులను ఎదిరించి బ్రతికేవారు ఉండరు. వీళ్ళని స్వయంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులే పొంచి పోషిస్తూ ఉంటారు. ప్రత్యర్ధి అనేవాడు లేకుండా చేసి ఎన్నికల్లో "ప్రజాస్వామ్యబద్ధంగా" గెలుస్తారు.  కొంతకాలం క్రితం ఉత్తరప్రదేశ్ లో, పోలీస్ కస్టడిలో ఉండగా, మీడియా లైవ్ లో కాల్చి చంపబడ్డ ఆతిక్ అహ్మద్ అనే రాజకీయ నాయకుని చరిత్ర తెలుసుకున్నప్పుడు.... అధికారం చేతిలో ఉన్న రాజకీయ రౌడీల ముందు... ఎన్నికల కమిషన్, న్యాయవ్యవస్థ, భారత రాజ్యాంగం ఏమి చేయలేక చూస్తూ ఉండిపోతున్నాయి అనే విషయం మనకి అర్థం అవుతుంది. హింస, హత్య రాజకీయాలతో 40 సంవత్సరాలపాటు ఎం.పీ, ఎమ్మెల్యేగా కొనసాగిన ఈ గ్యాంగస్టర్ ను ఏ ప్రభుత్వము, ఏ వ్యవస్థ ఏమి చేయలేకపోయాయి. జడ్జీలు కూడా అతని కేసు తీసుకోవడానికి భయపడేవారట. "నీకు వ్యవస్థలు, చట్టం అంటే గౌరవం లేనప్పుడు... నీకు జీవించే హక్కు లేదు" అనే విధానాన్ని యూపీ ప్రభుత్వం అమలు చేయటం మొదలుపెట్టి, గ్యాంగస్టర్ లను నిర్ధాక్షిణ్యంగా ఎన్ కౌంటర్ చేయడం మొదలుపెట్టిన తర్వాత, ఈ నేరపురిత విష సంస్కృతి అదుపులోకి వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే... ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నంత మాఫియా పోకడ ఇక్కడ లేకపోయినప్పటికీ... రెండు పార్టీలలో రౌడీయిజాన్ని నమ్ముకుని రాజకీయాలు చేసే వారికి కొదవలేదు. తమ వ్యాపార, ఆధిపత్య పోకడలను బలోపేతం చేసుకోవడానికి, వ్యవస్థలను... ముఖ్యంగా పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయటంలో నైపుణ్యమున్న శాసనసభ్యులు అనేకమంది రెండు పార్టీలలోనూ ఉన్నారు. నేడు పల్నాడు ప్రాంతంలో జరుగుతున్నది, పూర్తిగా నిర్వీర్యమైన పోలీసు వ్యవస్థ కారణంగా వస్తున్న ఫలితం. ఒకప్పుడు రాయలసీమ, గుంటూరు పల్నాడు ప్రాంతంలో ప్రముఖంగా కనిపించిన దుర్మార్గమైన ఫ్యాక్షన్ హింస, ఇప్పుడు లేదు. ఎన్నికల సమయంలో పల్నాడు ప్రాంతంలో బయటపడిన దాడులు, ప్రతి దాడులు పోలీసుల వైఫల్యంతో జరిగినవి. ఏమాత్రం శ్రద్ధ తీసుకుని ఉన్నా ... అలాంటి హింసను అరికట్టే అవకాశం పోలీసుల చేతుల్లో ఉంది.  మే 13వ తేదీ నాడు పోలింగ్ జరుగుతున్న సమయంలో మాచర్ల ఎమ్మెల్యే, వైసిపి అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 202 పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లారు. అక్కడ EVMను ఎత్తి పడేసి నానా బీభత్సం సృష్టించారు. ఈ దృశ్యాలు సీసీ కెమేరాలో రికార్డయ్యాయి. ఎమ్మెల్యే ధ్వంసం చేస్తున్న సమయంలో పోలింగ్ ఏజెంట్ అడ్డుకునే ప్రయత్నం చేసారు. అతడిపై ఎమ్మెల్యే అనుచరులు దాడికి చేసారు.   పోలింగ్ కేంద్రంలోని ఈవీఎం ధ్వంసం చేయడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మాచర్ల నియోజకవర్గం పరిధిలో 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసం చేసినట్లు సీసీ కెమేరాల్లో రికార్డయ్యింది.  ఇవాళ ఒక ఎమ్మెల్యే ఒక ఈవీఎం ను పగల కొట్టిన దృశ్యం సంచలనంగా కనిపిస్తుంది కానీ... గతంలో బ్యాలెట్ బాక్స్ లను ఎత్తుకెళ్లి బావుల్లో పారవేసిన, ధ్వంసం చేసిన కేసులు అనేకం ఉండేవి. వెబ్ కాస్టింగ్, సిసి కెమెరాలు, మొబైల్ ఫోన్ కెమెరాల సాంకేతిక  పరిజ్ఞానం అందులోకి వచ్చినాక.... ఇలాంటి దౌర్జన్యాలు దాదాపు కనుమరుగయ్యాయి.  ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఇది తరచూ మనం వినే మాట. మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండినా...ప్రజాస్వామ్యం నిర్దేశించిన పద్ధతులు, ఫలాలు జనాలకు ఇంకా పూర్తిగా చేరలేదు అని చెప్పొచ్చు. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రజాస్వామ్యం ముసుగు వేసుకుని అనేక రకాల హింసాయుత పద్ధతులను ఆచరించి ప్రజాస్వామ్య వ్యవస్థను, దేశ రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే వారికి ఈ దేశంలో కొదవలేదు. - ఎం.కె. ఫ‌జ‌ల్‌

కొడాలి నానికి తీవ్ర అస్వస్థత

గుడివాడ సిట్టింగ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం ( మే 23) తన నివాసంలో పార్టీ మండల స్థాయి నాయకులతో మాట్లాడుతున్న సమయంలో ఒక్క సారిగా తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే నేతలు, గన్ మెన్ లు వైద్యులకు సమాచారం అందించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.   కొడాలి నాని గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నరన్న వార్తలు ఇటీవలి కాలంలో గట్టిగా వినిపించాయి. ఆయన రెండుమూడు సార్లు హైదరాబాద్ లోని బసవరామ తారకం క్యాన్సర్ ఆస్పత్రికి వచ్చినప్పటి ఫొటోలు కూడా మీడియాలో వచ్చాయి. అయితే తన  అనారోగ్యం విషయం నాని ఎప్పడూ చెప్పలేదు. ఇప్పుడు ఆయన హఠాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో ఆయన అనారోగ్యం ఏమిటన్నదానిపై చర్చ మొదలైంది. 

పిన్నెల్లి బ్రదర్స్ ఎన్‌కౌంటర్ ఖాయమా?

పిన్నెల్లి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి ఇద్దరూ ఆరితేరిన దొంగల మాదిరిగా తప్పించుకు తిరుగుతున్నారు. నిజంగానే తప్పించుకు తిరుగుతున్నారో, లేక ప్రభుత్వమే జాగ్రత్తగా తప్పిస్తోందో ఎవరికి తెలుసు? కాకపోతే బయటకి వచ్చే వార్తల లోతును తెలుసుకోలేని సాధారణ ప్రజలు పిన్నెల్లి బ్రదర్స్ పోలీసుల నుంచి తప్పించుకుంటున్నారనే అనుకుంటున్నారు. పోలీసులు వాళ్ళ వెంట పడుతున్నారని, వాళ్ళు పోలీసులకు దొరక్కుండా చాకచక్యంగా తప్పించకుంటున్నారని... ఇలా సినిమాల్లోని సీన్స్ ఊహించుకుంటున్నారు. వీళ్ళిద్దరూ పోలీసుల నుంచి ఇప్పటికే రెండుసార్లు తప్పించుకున్నారు. సాధారణంగా సినిమాల్లోగానీ, ఒక్కోసారి నిజంగా కూడా పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయేవారిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసేస్తూ వుంటారు. ఇప్పుడు పిన్నెల్లి బ్రదర్స్ కూడా అలాగే ఎన్‌కౌంటర్ అయిపోతారేమోనని అమాయక జనం అనుకుంటున్నారు. ఈ రకంగా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు.  అలా సినిమా నాలెడ్జ్.తో ఫీలైపోతున్న అమాయక చక్రవర్తులు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, పిన్నెల్లి బ్రదర్స్ పోలీసుల కన్నుగప్పి పారిపోవడం లేదు. ప్రభుత్వం, పోలీసులు చక్కగా వాళ్ళిద్దర్నీ కాపాడుతున్నారు. పోలీసులు, ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సదుపాయాలూ ఇంటి అల్లుళ్ళ మాదిరిగా అనుభవిస్తూ వాళ్ళు నీడపట్టున హ్యాపీగా వున్నారు. అసలు పాయింట్ ఏంటంటే, ఈ ఇద్దరూ ఎన్నికల ఫలితాలు విడుదలై, ఎన్నికల కోడ్ ముగిసే వరకూ బయటకి రారు. ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక అప్పటి సంగతి అప్పుడు. మళ్ళీ రాబోయేది తమ రౌడీ రాజ్యమే కాబట్టి అప్పుడు తమకేమీ ఢోకా లేదని ఈ బ్రదర్స్ అనుకుంటూ వుండవచ్చు. కానీ, రాబోయేది రౌడీ రాజ్యం కాదు.. లోకేష్ రెడ్ బుక్ రాజ్యం. అప్పుడు వీళ్ళిద్దరి పరిస్థితి సీన్ సితారైపోతుంది. 

పిన్నెల్లి వీడియో లీక్ చేసింది పోలీసులేనా? సీఈవో మాటలకర్ధం అదేనా?

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన వీడియో వెలుగులోకి వచ్చిన క్షణం నుంచీ అధికార వైసీపీ పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయింది. స్వయంగా అభ్యర్థే పోలింగ్ బూత్ లో దౌర్జన్యం చేసి, అందరినీ బెదరించి ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జాతీయ మీడియా సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. అయితే ఈ విషయాన్ని వైసీపీ సమర్ధించుకోవడానికి చేసిన ప్రయత్నం ఆ పార్టీపై మరిన్ని విమర్శలు వెల్లువెత్తడానికే దోహదపడింది. అంబటి వంటి నాయకులైతే నిస్సిగ్గుగా ఈవీఎం పగులగొట్టడాన్ని పక్కన పెట్టి అసలా వీడియో ఎలా వెలుగులోకి వచ్చింది అంటూ ప్రశ్నించడం విస్మయపరిగింది. అంబటి అయితే ఒక అడుగు ముందుకు వేసి ఆ వీడియో ఫేక్ అని చెప్పడానికి కూడా వెనుకాడలేదు.  అయితే ఆ వీడియో ఎలా వెలుగులోకి వచ్చి ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సూచన ప్రాయంగానైనా సరే వెల్లడించేశారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింసపై దర్యాప్తు చేయడానికి ఏర్పాటైన సిట్ కు వీడియో ఫుటేజిలు అప్పగించామని చెప్పారు. అంటే సిట్ అధికారులే ఈ వీడియోను లీక్ చేశారని ఆయన చెప్పకనే చెప్పేశారు. అదే జరిగితే అధికారులే విపక్షానికి మేలు చేసే విధంగా వీడియో లీక్ చేశారంటే ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్నదానికి ఇంత కంటే బలమైన సంకేతం ఏముంటుంది?  క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది కనిపెట్టే అవకాశం ఇంకెవరికన్నా పోలీసు  శాఖకే అధికంగా ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకుంటున్నది ఒక ఎమ్మెల్యేను ఏడేళ్ల పాటు జైలుకు పంపిం చేందుకు సాక్ష్యంగా ఉన్న వీడియో గురించి. ఈ వీడియో ఎమ్మెల్యేను నేరస్తుడిగా నిరూపించడమే కాదు, వైసీపీ ప్రతిష్టను కూడా కొలుకోలేనంతగా దెబ్బతీసింది.  నిజంగా క్షేత్ర స్థాయిలో జగన్ పార్టీకి ప్రజా మద్దతు ఉండి ఉంటే, ఆయన మళ్లీ ముఖ్యమంత్రి ఎన్నికౌతారనుకుంటే కచ్చితంగా పోలీసలు ఈ వీడియోను లీక్ చేయరు.  గత ఐదేళ్లుగా పోలీసు శాఖ జగన్ కు అనుకూలంగా ఎంతగా నింబంధనలకు కూడా తిలోదకాలిచ్చేసి పని చేసిందో చూశాం.   తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును సీఐడీ పోలీసులు ఎంత అడ్డగోలుగా అరెస్టు చేశారో చూశాం. అలాగే చంద్రబాబు అరెస్టు కు సంబంధించి సీఐడీ చీఫ్ మీడియా సమావేశాలు పెట్టి మరీ రాజకీయాలు మాట్లాడిన వైనాన్ని గమనించాం. అటువంటి పోలీసు శాఖ  జగన్ కు జగన్ పార్టీకీ భారీ నష్టం చేకూరుస్తుందని తెలిసి కూడా లీక్ చేశారంటే.. రాబోయే సర్కార్ కచ్చితంగా వైసీపీ సర్కార్ కాదన్న నిర్ధారణకు వచ్చేశారనే భావించాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇప్పుడు కూడా వైసీపీ చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీకి  ఈసీ ద్వారా బీజేపీ సహకారం అందిస్తోందంటూ ఆరోపణలు గుప్పించడం మొదలు పెడితే అది తనను తాను మోసం చేసుకోవడం తప్ప మరొకటి కాదు. ఎందుకంటే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుందని గట్టిగా విశ్వసిసించినా కూడా  బీజేపీ తెలుగుదేశంకు ఈ రకంగా సహకారం అందించే అవకాశాలు ఇసుమంతైనా లేవు. ఉండవు,  రాష్ట్రంలో తెలుగుదేశం కూటమిలో భాగస్వామి అయినప్పటికీ బీజేపీ ఏపీలో జగన్ సర్కార్ ను విమర్శించే విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించిందో ఎన్నికల ప్రచార సమయంలో చూశాం.  స్వయంగా ప్రధాని మోడీయే తన ప్రసంగంలో ఎక్కడా జగన్ పేరు ప్రస్తావించకుండా చాలా జాగ్రత్తగా వైసీపీ సర్కార్ పై విమర్శలు చేశారు. తెలుగుదేశం కచ్చితంగా విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉన్నా కూడా  బీజేపీ తెలుగుదేశం పార్టీకి సహకరించేందుకు ముందుకు రాదు.  అయినా   ఎన్డీయే కూటమిలో తన తరువాత అతిపెద్ద పార్టీ తెలుగుదేశం అన్న సంగతి తెలిసిన బీజేపీ, జగన్ రెడ్డి పార్టీని నిర్వీర్యం చేయడానికి ఎంత మాత్రం సాహసించే అవకాశాలు లేవు. ఈ విషయాలన్నీ పరిగణనలోనికి తీసుకుని పరిశీలిస్తే పోలీసుల ద్వారానే పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం వీడియో విడుదలైందంటే.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు వైసీపీ కొంప ముంచేసేవిగానే ఉన్నాయని అర్ధం. పరిశీలకులు దీనినే ఉటంకిస్తూ జగన్ పార్టీ ఓటమి ఖాయమైపోయిందని అంటున్నారు. 

ఫలితాల రోజు వాటర్ తాగండి బ్రో!

ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పార్టీ సర్వనాశనం అయిపోవడం ఖాయమని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. అలాగే కేంద్ర రాజకీయాల గురించి కూడా ఆయన తన అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. అయితే, ప్రశాంత్ కిషోర్ అభిప్రాయాలను కొంతమంది విమర్శిస్తున్నారు. ఇది సహజం. అయితే తన అంచనాలపై వస్తున్న  విమర్శలకు ప్రశాంత్ కిషోర్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెరైటీ కౌంటర్ ఇచ్చారు. ‘‘శరీరానికి, మెదడుకు నీరు చాలా అవసరం. నా అంచనాలను విమర్శిస్తున్న వారు జూన్ 4వ తేదీన బాగా మంచినీరు తాగడం మంచిది.. ఎందుకంటే, ఆరోజు వచ్చే ఫలితాలను చూసి వాళ్ళ శరీరంలో నీరు ఆవిరైపోయే ప్రమాదం వుంది’’ అనే అర్థం వచ్చే విధంగా ఎక్స్.లో కామెంట్ పోస్ట్ చేశారు. ఎన్ని విమర్శలు వస్తున్నా ప్రశాంత్ కిషోర్ తాను చెప్పినదానికి కట్టుబడి వుంటున్నారు. అంటే, మన జలగన్న ఖేల్ ఖతమ్ దుకాణ్ బంద్!  

రెండు శక్తులు కలిశాయ్.. సైకోని తరిమేశాయ్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చారిత్రకంగా ప్రాధాన్యం వున్న అనేక సంఘటనలు జరిగాయి. అలాంటి సంఘటనలలో ఈ మధ్యకాలంలో రాష్ట్ర రాజకీయాల తీరునే మార్చేసిన సంఘటన ఒకటి జరిగింది. అదే తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య కీలక సమయంలో మరోసారి పొత్తు కుదరడం. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు బలమైన కులాలు.. కమ్మ, కాపు! కమ్మ కులానికి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో బలం ఎక్కువ వుంది. కాపు కులానికి కొన్ని ప్రాంతాల్లో రెడ్డి కులానికి బలం ఎక్కువుంది. బలం లేని ప్రాంతాల్లో రెండు కులాలకూ బలహీనత వుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ రెండు కులాలు ఒక్కటైతే మరో బలమైన కులం రెడ్డికి బలం తగ్గిపోతుంది. అందుకే చాలాకాలంగా ఈ రెండు కులాలు ఒక్క తాటిమీద నడవకుండా చేయడానికి ‘రెడ్డి’ నాయకులు శాయశక్తులా కృషి చేశారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటానికి ముందు, ఏర్పడిన తర్వాత తెలుగు రాజకీయాలలో రెడ్డి కులం ఆధిపత్యం కొనసాగేది. 1983లో ఎన్టీఆర్ రంగప్రవేశం చేసిన తర్వాత కమ్మ కులం బలమేంటో రాజకీయంగా రెడ్లకు అర్థమైంది. రాష్ట్ర రాజకీయాల్లో తమకు పెద్ద ముప్పు ఏమిటో అవతగమైంది. ఒక్క కమ్మకులాన్ని అయితే ఎలాగోలా ఎదుర్కోవచ్చు.  కమ్మ, కాపు కులాలు రెండూ కలిశాయా.. ఇక తమకు ఉనికే ఉండదని క్లియర్‌గా తెలిసిపోయింది. అందుకే ఈ రెండు బలమైన కులాల మధ్య వైరాన్ని పెంచి పోషిస్తూ వచ్చారు.  రంగాని ఎవరు హత్య చేశారో రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తూ వచ్చిన సీనియర్లు చాలామందికి తెలుసు. కానీ, ఆ నేరాన్ని ఎన్టీఆర్ మీద, కమ్మ కులం మీద నెట్టారు. చేయని పాపాన్ని కమ్మ వారి మీద రుద్దారు. అప్పటి నుంచి కాపులు కమ్మ కులస్తులను శత్రువులుగానే చూస్తూ వచ్చారు. అప్పుడప్పుడు పాత పగలు చల్లారి ఇద్దరి మధ్య సయోధ్య కుదిరే సందర్భం వచ్చినా ‘రెడ్డి రాజులు’, కాపుల్లోనే వున్న ముద్రగడ లాంటి పెద్దలు చెడగొడుతూ వచ్చారు.  ఎన్నో అవరోధాలను అధిగమించి కాపు కుల ఆశాదీపంగా వున్న పవన్ కళ్యాణ్‌కి, కమ్మ నాయకుడైన చంద్రబాబుకు మధ్య 2014లో పొత్తు కుదిరింది. అధికారం దక్కింది. రెండు కులాల సత్తా ఏమిటో తెలిసింది. మధ్యలో కొంతమంది క్రియేట్ చేసిన విభేదాలు ఇద్దర్నీ మళ్ళీ దూరం చేశాయి. దాంతో 2019లో అపజయం తప్పలేదు. ఇప్పుడు మళ్ళీ 2024 ఎలక్షన్ల సందర్భంగా ఈ రెండు కులాల నాయకులు ఒకే తాటిమీద నడవడం శుభ పరిణామం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కమ్మ, కాపు కులాలకు చెందిన నాయకులు ఎన్నికలలో కలసికట్టుగా పనిచేశారు. కమ్మ కులం బలం తక్కువున్న చోట కాపు కులస్తులు కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు. కాపు కులం బలం తక్కువున్న ప్రాంతాల్లో కమ్మ కులస్తులు కూటమిని బలోపేతం చేశారు. రెండు కులాలకూ బలం వున్న ప్రాంతంలో ఇక చెప్పేదేముంది... పండగే పండగ. దమ్మున్న కమ్మ కులస్తులు, ఊపున్న కాపు కులస్తులు... ఈ రెండు శక్తులూ కలిశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైకోని తరిమేశాయ్.

జగన్ మేనమామ కూడా చెప్పేశారు.. ఫలితాలపై ఆశలొద్దని!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్ ఐదేళ్ల దుష్టపాలనను వదిలించేసుకుందా? ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెల్లడి కాకపోయినప్పటికీ వైసీపీ నేతల మాటలు, వారి బాడీ లాంగ్వేజ్, వారి ఉక్రోషం చూస్తుంటే.. విజయంపై నమ్మకాన్ని వాళ్లు వదిలేసుకున్నారని అనిపించక మానదు. ఎంత గంభీరంగా ఉందామని ప్రయత్నించినా, విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ ముఖం సంతోషంతో వెలిగిపోతున్నట్లు నటిద్దామని ప్రయత్నించినా, వారికి తెలియకుండానే మాటల్లో నిరాశ, ముఖంలో నిర్వేదం కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. నగరి వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి రోజా పోలింగ్ రోజునే మీడియా ముందకు వచ్చి తనను తన పార్టీ వారే ఓడించడానికి ప్రయత్నించారని ఎవరూ అడగకుండానే తన ఓటమి మాట చెప్పేశారు. ఆ తరువాత సత్తెనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబు అయితే పోలీసులు తెలుగుదేశం వారితో కుమ్మక్కైపోయారని విమర్శలు గుప్పించి, తనలోని ఓటమి భయాన్ని బయటపెట్టుకున్నారు. అంతే కాకుండా రీపోలింగ్ డిమాండ్ చేసి తనకు జనం ఓట్లు వేయలేదని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు తగదునమ్మా అని రీపోలింగ్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇక సకల శాఖల మంత్రి, ప్రభుత్వ సలహాదారు, ఒక విధంగా చెప్పాలంటే జగన్ ఆత్మ అయిన సజ్జల రామకృష్ణారెడ్డి పోలింగ్ సరళి తమకు అనుకూలంగా లేదని పరోక్షంగా చెప్పేశారు. తన కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా వింగ్ చీఫ్ అయిన సజ్జల భార్గవ్ రెడ్డిని చడీచప్పుడు లేకుండా రాష్ట్రం దాటించేశారు. పోలింగ్ రోజు నుంచి సజ్జల భార్గవ్ మాట ఎక్కడా వినిపించడం లేదు. ఆయన ఎక్కడా కనిపించడం లేదు. పోలింగ్ ఇలా పూర్తయ్యిందో లేదో వైసీపీ సోషల్ మీడియా కార్యాలయానికి తాళాలు పడిపోయాయి. ఇక జగన్ భజనలో ఆరితేరిన కొమ్మినేని శ్రీనివాసరావు అయితే తొందరపడి బెట్టింగులూ గట్రా కట్టి సొమ్ములు పోగొట్టుకోకండి అంటూ అడగకుండానే వైసీపీ అభిమానులు, కార్యకర్తలకు ఒక ఉచిత సలహా పారేసి, వైసీపీ విజయంపై ఆశలు పెట్టుకోవద్దని చెప్పకనే చెప్పేశారు. నిజానికి వైసీపీ గెలుపుపై బెట్టింగులు కాయడానికి వైసీపీ వారెవరూ సిద్ధంగా లేరనుకోండి అది వేరే విషయం. మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని వంటి అనుచిత భాషా ప్రవీణులు తమ నోళ్లకు తాళం వేసుకున్నారు. వల్లభనేని వంశీ గోడెక్కేశాడు. ఎటు దూకాలో తేల్చుకునే పనిలో ఉన్నారు. ఇక  ఆపద్ధమర్మ ముఖ్యమత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్  సొంత మేనమామ, పార్టీ కమలాపురం అభ్యర్థి రవీంద్రనాథ్ రెడ్డి అయితే తన మేనల్లుడి పార్టీ రాష్ట్రాన్ని గబ్బుపట్టించేసిందని వ్యాఖ్యానించి మొత్తం గాలి తీసేశారు. పోలింగ్ పూర్తయిన తరువాత తాపీగా ఆయన తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆ సందర్భంగా  మీడియాతో మాట్లాడుతూ అనుకోకుండా మనసులో మాట బయటపెట్టేశారు. రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైసీపీ అని మీడియాకు చెప్పేసి ఆ తరువాత నాలుక్కరుచుకున్నారు, అయితే అప్పటికే ఆలస్యమైపోయింది. ఆయన మాటలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయిపోయాయి.  స్వయంగా జగన్ మేనమామ రవీంద్రనాధరెడ్డే వైసీపీ ఈ రాష్ట్రాన్ని గబ్బుపట్టించిందంటూ నిజం కక్కేయడంతో వైసీపీ శ్రేణులలో కాస్తో కూస్తో ఉన్న గెలుపు నమ్మకం పూర్తిగా పోయిందని పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.  

వైసీపీ కొత్త డ్రామా...రీ పోలింగ్ కోసం హైకోర్టును ఆశ్రయించిన మంత్రి అంబటి

   దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాచర్లలో రిగ్గింగ్ వ్యవహారం కోర్టుకెక్కింది. మొగుడిని కొట్టి  మొగసాలకు ఎక్కినట్టు రిగ్గింగ్ కు పాల్పడిన వైసీపీయే కోర్టు మెట్లు ఎక్కింది. రిగ్గింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొనే పిన్నెల్లి మీద చట్ట పర చర్యలు తీసుకోవాలని కోరే బదులు రీ పోలింగ్ డ్రామాకు వైసీపీ తెరలేపింది.  పల్నాడు ప్రాంతంలో పోలీసు యంత్రాంగం అట్టర్ ఫ్లాప్ అయిందని   మంత్రి  అంబటి రాంబాబు విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు లా అండ్ ఆర్డర్ కాపాడటంలో విఫలం అయ్యారని ఆరోపించారు. టీడీపీ నేతలు అరాచకాలకు తెగబడ్డారని, తాము ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని చెప్పారు. తమ కార్యకర్తలకు రక్షణ కల్పించలేని పరిస్థితి ఏర్పడిందని, తనను తిరగకుండా అడ్డుకున్నారని అన్నారు. ఒక బూత్‌లో వెయ్యి ఓట్లు రిగ్గింగ్‌ చేశారని, రీపోలింగ్‌ నిర్వహించబోమని ముందుగానే ఈసీ చెప్పడం సరికాదన్నారు. దమ్మాలపాడు, నార్నేపాడులో రిగ్గింగ్‌ జరిగిన పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్‌ నిర్వహించాలని అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారుఎన్నికల పోలింగ్ పై మంత్రి అంబటి రాంబాబు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో 236, 237, 253, 254 వార్డుల్లో రీ పోలింగ్ నిర్వహించాలని పిటిషన్ దాఖలు చేశారు. ప్రతి వాదులుగా ఈసీ, సీఈవో సహా ఐదుమందిని చేర్చారు.  ఈ పిటిషన్ ధర్మాసనం రేపు విచారించే అవకాశం ఉంది.  

ఎన్డీయే కూటమిలోతెలుగుదేశం మాత్రమే శక్తిమంతమైన పార్టీ!

ఈ సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీకి వేవ్ లేదని రాక్ ఫెల్లర్ ఇంటర్నేషనల్ చైర్మన్ రుచిర శర్మ అభిప్రాయపడ్డారు. ఈ వేవ్ లెస్ ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేనలను ఎన్డీయేలోకి చేర్చుకోవడం ద్వారా బీజేపీ బోలెడంత రాజకీయ లబ్ధి పొందిందని ఆయన అన్నారు. ఎన్డీయే కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలన్నిటిలోనూ తెలుగుదేశం పార్టీయే శక్తమంతమైనదని చెప్పిన ఆయన ఆ పార్టీని ఎన్డీయేలో చేర్చుకోవడం ద్వారా జీరో స్టేక్ ఉన్న ఆంధ్రప్రదేశ్ లో  కూడా కొన్ని స్థానాలను బీజేపీ దక్కించుకునే అవకాశం ఏర్పడిందన్నారు.  అన్నిటికీ మించి ఐదేళ్ల పాటు ఏపీలో అధకారంలో ఉన్న వైసీపీకి అన్ని విధాలుగా అండదండలు అందించి, ఇరు పార్టీల మధ్యా ఏదో రహస్య బంధం ఉందన్న అభిప్రాయం సర్వత్రా ఏర్పడేలా చేసుకున్న బీజేపీ.. చివరి నిముషంలో తెలివిగా తెలుగుదేశం వైపు మొగ్గు చూపడం ఆ పార్టీకి కచ్చితంగా ఎన్నికల లబ్ధి చేకూరుస్తుందని అన్నారు.  అన్ని విధాలుగా తమ అడుగులకు మడుగులొత్తే విధంగా వ్యవహరించిన, ఇక ముందు కూడా వ్యవహరించక తప్పని స్థితిలో ఉన్న వైసీపీని కాదని, సమస్యలపై, రాష్ట్ర ప్రయోజనాలపై గట్టిగా నిలబడి నిలదీసే చంద్రబాబును ఎన్డీయే కూటమిలో చేర్చుకోవడం ద్వారా బీజేపీ వ్యూహకర్తలు వాస్తవికంగా ఆలోచించారనీ, ఉత్తరాదిలో ఏదో మేరకు బీజేపీ నష్టపోతున్నదన్న అంచనాల నేపథ్యంలో బీజేపీ వ్యూహాత్మకంగా దక్షిణాదిలో ఆమేరకు బలం పెంచుకోనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీతో జత కట్టిందని ఆయన విశ్లేషించారు.   ఇక సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఇప్పటి వరకూ జరిగిన ఐదు విడతల పోలింగ్ లో బీజేపీకి సంతృప్తికర ఫలితాలు వస్తాయన్న భావన పరిశీలకుల్లో వ్యక్తం కాలేదు. ఆ పార్టీ భారీగా ఆశలు పెట్టుకున్న తమిళనాడు( ఇప్పటి వరకూ తమిళనాట బీజేపీకి పెద్ద స్టేక్ లేదు. అయితే జయ మరణం తరువాత ఏర్పడిన రాజకీయ వాక్యూమ్ ను భర్తీ చేయడానికి కమలనాథులు ప్రయత్నించారు. పోలింగ్ కు ముందు వరకూ కూడా తమిళనాట చెప్పుకోదగ్గ స్ధానాలు వస్తాయని భావించారు. అయితే పోలింగ్ సరళితో కమలనాథుల ఆశలు ఆవిరయ్యాయి. ) ఆ తరువాత కర్నాటక విషయానికి వస్తే  అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయినా క్షేత్ర స్థాయిలో ఉన్న బలంతో అక్కడ గతంలో కంటే ఎక్కువ లోక్ సభ స్థానాలను గెలుచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని భావించింది. అయితే పోలింగ్ సరళి చూసిన తరువాత బీజేపీలో ఆ ఆశ కూడా ఆవిరైపోయిందని అంటున్నారు. ఇక శివసేన, ఎన్సీపీలను చీల్చిన కారణంగా మహారాష్ట్రలో కూడా బీజేపీ బాగా బలహీన పడిందని, ఆ పార్టీల చీలిక అంతిమంగా బీజేపీకే చేటు చేసిందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీకి మద్దతుగా నిలిచిన ఏక్ నాథ్ షించే వర్గం శివసేన ఇప్పుడు రాష్ట్రంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ప్రజల సానుభూతి ఉద్ధవ్ థాక్రే వర్గానికి వరంగా మారే అవకాశాలు ఉన్నాయన్నది పరిశీలకులు అంచనా. అదే విధంగా ఎన్సీపీలోని చీలిక కూడా అంతిమంగా బీజేపీకి నష్టం చేస్తుందని చెబుతున్నారు.  అలాగే బీహార్ లో నితీష్ కుమార్ ను దగ్గరకు తీయడం కూడా ఆ రాష్ట్రంలో బీజేపీకి కొంపముంచే వ్యవహారంగానే మారింది. కేవలం ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం తరచూ కూటములను మార్చేసే నితీష్ కుమార్ పట్ల బీహార్ ప్రజలలో ఆగ్రహం వ్యక్తం అవుతోందనీ, ఆ కారణంగా కూడా ఆ రాష్ట్రంలో నితీష్ తో పాటు బీజేపీ కూడా భారీగా నష్టపోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు.  ఇన్ని నష్టాల మధ్య బీజేపీకి రాజకీయంగా లబ్ధి చేకూరే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని చెబుతున్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీని ఎన్డీయేలో చేర్చుకోవడం వల్ల ఆ రాష్ట్రంలో బీజేపీ చెప్పుకోదగ్గ స్థానాలలో పొలిటికల్ గెయిన్ సాధిస్తుందని రుచిర్ శర్మ అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి వేవ్ లేని ఈ సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే కూటమి  ఒక వేళ అధికారంలోకి వస్తే.. ఆ కూటమిలో శక్తిమంతమైన పార్టీగా తెలుగుదేశం నిలుస్తుందని చెబుతున్నారు.  

తెలంగాణ ఆర్టీసీ లోగో సిద్దం కాలేదు: సజ్జనార్ 

తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. టీఎస్ పేరును టీజీగా మారుస్తామని ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇందుకు సంబంధించి ఉత్తర్వులు సైతం జారీ చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ విజ్ఞప్తిని కేంద్రం సైతం అంగీకరించింది. ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో తెలంగాణలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లకు టీజీ పేరును ఇస్తున్నారు. ఈ మార్పులతో తాజాగా టీఎస్ఆర్టీసీ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చారుఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సూచించే అధికారిక సంక్షిప్త పదం టీఎస్ నుంచి టీజీగా మారుస్తూ ఇటీవల సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, ఏజెన్సీలు, ఇతర స్వయం ప్రతిపత్తి సంస్థలు, అధికారిక హోదాలు సూచించే బోర్డుల్లో రాష్ట్రాన్ని టీజీగా పేర్కొనాలని సూచించారు. జీవోలు, పాలసీ పేపర్లు, నోటిఫికేషన్లు, సర్క్యులర్లు, లెటర్‌ హెడ్స్‌, అధికారిక పత్రాల్లో సైతం టీజీ అని వచ్చేలా చూడాలన్నారు.ఇదిలా ఉంటే తెలంగాణ ఆర్టీసీని టీఎస్‌ఆర్టీసీగా పిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం టీజీగా మార్చడంతో టీఎస్‌ఆర్టీసీ కూడా టీజీ ఆర్టీసీగా మారుతుందని వార్తలు వచ్చాయి. ఇక ఆర్టీసీ లోగో కూడా మారిపోయిందంటూ సోషల్‌ మీడియాలో కథనాలు వైరల్‌ అయ్యాయి. మారిన లోగో ఇదేనంటూ కొన్ని ఫొటోలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే దీంట్లో ఏ మాత్రం నిజం లేదని ఆర్టీసీ ఎండీ సజ్జనర్‌ క్లారిటీ ఇచ్చారు. లోగో మార్పుపై జరుగుతోన్న ప్రచారానికి సంబంధించి ట్విట్టర్‌ వేదికగా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ఆర్టీసీ లోగో మార్పు విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తప్పుబట్టారు. కొత్త లోగో ఇంకా సిద్ధం కాలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ పెట్టారు.  ‘కొత్త లోగో విషయంలో సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. అధికారికంగా ఇప్పటివరకు కొత్త లోగోను సంస్థ విడుదల చేయలేదు. టీజీఎస్‌ ఆర్టీసీ  కొత్త లోగో అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్న లోగో ఫేక్‌. ఆ లోగోతో సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. కొత్త లోగోను సంస్థ రూపొందిస్తోంది. కొత్త లోగోను టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఇంకా ఫైనల్ చేయలేదు’ అని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.  

అన్న చాలా మంచోడు.. పిన్నెల్లికి జగన్ కితాబు.. వైరల్ అవుతున్న పాత వీడియో

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్. అరాచకాలు, అకృత్యాలు, దాడులు, ఈవీఎంల విధ్వంసం ఇలా ఆయన చేయని దారుణం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే, అధికార పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి  ఈవీఎంను ధ్వంసం చేసిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పైగా ఆయన పోలీసులను తప్పించుకుని పరారైపోయారు. అజ్ణాతంగా ఉన్నారు. ఆయనపై లుక్ ఔట్ నోటీసు కూడా జారీ చేశారు. ఈ సంఘటనలన్నీ ఆయన ఎంతటి నేరస్తుడో ఎవరికైనా అర్ధం అయిపోతుంది. పిన్నెళ్లిపై పది సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కనీసం ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశాలున్నాయని సాక్షాత్తూ  డీజీపీయే చెప్పారు. అటువంటి నేరస్థుడికి సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన కితాబుకు సంబంధించిన పాత వీడియో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమంలో  తెగ వైరల్ అవుతోంది.  ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓ రేంజ్ లో పొగిడేస్తున్న వీడియోను నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ గూండాయిజాన్ని ప్రోత్సహిస్తుందనడానికి ఇంతకు మించిన సాక్ష్యం ఎందుకంటూ ఏకి పారేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో జగన్ ఏమన్నారంటే.. పిన్నెల్లి అన్న తనకు సోదర సమానుడు. చాలా మంచి వ్యక్తి. ఆయనను మంచి మెజారిటీతో గెలిపిస్తే ఆయనకు ఉన్నత స్థానం హోదా కల్పిస్తాను. అంటే మంత్రిని చేస్తాను. మీరంతా ఆయన వెనుకే ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ మాటలన్నీ జగన్ స్వయంగా అన్నవి. వాస్తవానికి పిన్నెల్లి మంచి తనం ఏమిటో ఈవీఎం ధ్వంసం ఘటనతో, అదేమని ప్రశ్నించిన ఒక మహిళపై దుర్భాషలాడిన వీడియోతోనే తేలిపోయింది.  దీంతో ఇప్పుడు వైసీపీ నోరు మూతపడిపోయింది. పిన్నెల్లిని సమర్ధించుకునేందుకు అవకాశం కూడా లేకుండా పోయింది. ఇటువంటి పిన్నెల్లిని చాలా మంచి వ్యక్తి అంటూ పొగిడిన జగన్ కు జనం ముందు దోషిగా, రౌడీలకూ, గూండాలకూ కొమ్ముకాసే వ్యక్తిగా ముద్రపడిపోయింది. 

భగ్నమైన చైనా కుట్ర... సైబర్ నేరాలకు పాల్పడేందుకే  విశాఖ వాసులకు శిక్షణ 

చైనా భారత్ సరిహద్దు వివాదం చాలాకాలంగా నలుగుతూనే ఉంది. అయితే డ్రాగన్ దేశం భారత్ పై విషం చిమ్ముతూనే ఉంది. తాజాగా చైనా భారత్ మీద మరో అఘాయిత్యానికి పాల్పడింది. భారత పౌరుల చేత భారత్ మీదే సైబర్ నేరాలకు పాల్పడాలన్న చైనా  కుట్ర భగ్నమైంది.  విదేశాల్లో ఉద్యోగం, భారీ మొత్తంలో వేతనం అంటూ ప్రకటనలు గుప్పించి ఆకర్షించడం.. నమ్మిన వాళ్లను దేశంకాని దేశంలో మోసం చేయడం వంటి ఉదంతాలు ఇటీవల పెరుగుతున్నాయి. తాజాగా ఇలాంటిదే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా 300 మంది భారతీయులు కాంబోడియాలో ఆందోళనకు దిగడంతో అక్కడి భారత రాయబార కార్యాలయం స్పందించింది. మోసపోయిన వారిలో 60 మందిని కాపాడింది. ఇందులో సగం మంది విశాఖపట్నం వాసులేనని సమాచారం. బాధితులు, ఎంబసీ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. కాంబోడియాలో డాటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు ఉన్నాయని, పెద్దమొత్తంలో వేతనం పొందొచ్చని ఏజెంట్లు చెప్పడంతో నమ్మి మోసపోయామన్నారు. ఏజెంట్లకు భారీ మొత్తం చెల్లించి కాంబోడియాకు వచ్చామని వివరించారు. తీరా ఇక్కడికి వచ్చాక చైనా కంపెనీల ఫేక్ కాల్ సెంటర్ లో కూర్చోబెట్టి భారతీయులపై సైబర్ నేరాలకు పాల్పడాలని నిర్భందిస్తున్నారని చెప్పారు.  ఇండియాతో పాటు దుబాయ్, బ్యాంకాక్, సింగపూర్ తదితర దేశాల్లో ఈ మోసపూరిత కంపెనీలకు ఏజెంట్లు ఉన్నారని భారత రాయబార కార్యాలయం పేర్కొంది. స్థానికంగా ప్రకటనలు ఇచ్చి నిరుద్యోగులను నియమించుకుని కాంబోడియా, లావోస్ దేశాలకు పంపిస్తున్నారని తెలిపింది. టైపింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ చేసి అభ్యర్థులను ఎంపికైన వారికి చైనా కంపెనీలు ఆకర్షణీయమైన వేతనం ఆఫర్ చేస్తున్నాయని చెప్పింది. దీంతో పాటు హాస్టల్ లో అకాడమేషన్, తిరుగు ప్రయాణానికి టికెట్ కూడా కంపెనీ ఇస్తుందని చెప్పడంతో చాలామంది జాయిన్ అవుతున్నారని తెలిపింది. వీసా ప్రాసెస్ లో కూడా ఈ ఏజెంట్లు సాయం చేస్తున్నారని, ఫ్లైట్ ఎక్కించి కాంబోడియా పంపిస్తున్నారని వివరించింది. ఇక్కడికి చేరుకున్న తర్వాత లోకల్ క్రిమినల్ గ్యాంగ్స్ సాయంతో భారతీయులను నిర్భందించి సైబర్ నేరాలకు పాల్పడాలంటూ శారీరకంగా, మానసికంగా టార్చర్ చేస్తున్నారని రాయబార కార్యాలయం అధికారులు తెలిపారు. ఇలా వారి చెరలో చిక్కుకున్న వారిలో దాదాపు 100 నుంచి 150 మంది విశాఖపట్నం వాసులు ఉన్నారని వివరించారు. ఇందులో 60 మందిని స్థానిక పోలీసుల సాయంతో కాపాడామని చెప్పారు. విదేశాల్లో ఉద్యోగాల పేరుతో ఆన్ లైన్ లో కనిపించే ప్రకటనలు, ఏజెంట్లు చెప్పే ఆకర్షణీయమైన మాటలు నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఒకటికి రెండుసార్లు అన్ని వివరాలు తెలుసుకున్నాకే ఫ్లైట్ ఎక్కాలని సూచించారు.

ఆర్ఆర్ఆర్ విజయంపై కాదు.. మెజారిటీపైనే భారీగా బెట్టింగులు.. ఉండి సీన్ అర్ధమైపోయిందా?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఓట్ల లెక్కింపు వచ్చే నెల 4న జరుగుతుంది. అయితే ఇప్పటికే  కూటమి గెలుపుపై సర్వత్రా ఒక నమ్మకం అయితే ఏర్పడిపోయింది. అధికారికంగా ఫలితం వెలువడే వరకూ ఒకింత ఉత్కంఠ తప్పదు. కానీ గెలుపు గుర్రాలు ఏవీ, పరాజయం పాలై పలాయనం చిత్తగించేది ఎవరు అన్న విషయంలో రాష్ట్రంలో ఎన్నికలపై జరుగుతున్న బెట్టింగులను బట్టి సులువుగానే అర్ధం అవుతున్నది. మరీ ముఖ్యంగా పలు నియోజకవర్గాలలో గెలుపు ఎవరిది అని కాకుండా అక్కడ కూటమి అభ్యర్థికి వచ్చే మెజారిటీ ఎంత అన్న విషయంపైనే భారీగా బెట్టింగులు జరుగుతుండటం చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ విషయమే వైసీపీలో రోజురోజుకూ ఆందోళన పెరిగిపోయేలా చేస్తున్నది.  ఇప్పుడు ఉండి నియోజకవర్గమే తీసుకుంటే ఈ నియోజకవర్గం నుంచి కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామకృష్ణం రాజు మెజారిటీ పై పెద్ద ఎత్తున బెట్టింగులు జరుగుతున్నాయి. రఘురామకృష్ణం రాజు గత ఎన్నికలలో  వైసీపీ అభ్యర్థిగా నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆ తరువాత జగన్ విధానాలతో, తీరుతో విభేదించి రెబల్ గా మారారు. ఆ క్రమంలో జగన్ సర్కార్ ఆయనపై కక్ష కట్టింది. ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ లోక్ సభ స్పీకర్ ను కోరింది. అయితే లోక్ సభ స్వీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదు. పాలనా పరమైన లోపాలను ఎత్తి చూపిన కారణంగా అనర్హత వేటు వేసే అవకాశం లేదని పరిశీలకులు అప్పట్లోనే విశ్లేషించారు. దీంతో రఘురామకృష్ణం రాజుపై కక్ష కట్టిన  జగన్ సర్కార్ ఆయనను అరెస్టు చేయించి, కస్టడీలో చిత్ర హింసలకు గురి చేసింది. ఆ తరువాత కూడా ఆయనకు థ్రెట్ కంటిన్యూ అయ్యింది. దీంతో నాలుగు సంవత్సరాల పాటు ఆయన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టలేని పరిస్థితి ఎదుర్కొన్నారు. దరిమిలా ఆయన వైసీపీకి రాజీనామా చేసి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు.  ఆ పార్టీ అభ్యర్థిగా ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.  నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండి నుంచి రఘురామకృష్ణం రాజు విజయంపై ధీమా వ్యక్తం అవుతోంది. విజయం కాదు భారీ మెజారిటీ సాధిస్తారంటూ బెట్టింగులు కూడా జరుగుతున్నాయి. ఉండిలో రఘురామకృష్ణం రాజుకు 15 వేలకు పైగా మెజారిటీ వస్తుందని చాలా మంది బెట్టింగులు కడుతున్నారు. కొందరు విజయం తథ్యం కానీ మెజారిటీ  అంత ఉండే అవకాశం లేదని బెట్టింగులకు దిగుతున్నారు. విశ్వసనీయంగా అందిన సమాచారంపై రఘురామ రాజు విజయం ఖాయమంటూ 35 కోట్ల రూపాయలకు పైగా బెట్టింగులు జరిగాయి.  కొన్ని ప్రాంతాలలో అయితే భూములను కూడా  బెట్టింగుకు పెట్టారని చెబుతున్నారు.   

ఎన్డీయే సర్కార్ వస్తే..చంద్రబాబు మాటే చెల్లుబాటు!

జాతీయ ప్రజాస్వామ్య కూటమి  అంటే నేషనల్ డెమక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఎ). ఒకప్పుడు అటల్ బిహారీ వాజ్’పేయి సారధ్యంలో 24 పార్టీల కూటమిగా  కేంద్రంలో చక్రం తిప్పిన ఎన్డీఎకు ఇప్పుడు మోడీ పదేళ్ల పాలనలో ఎన్డీయేకూ అసలు పోలికే లేదు. ఇప్పుడు ఎన్డీయేలో సింగిల్ సీట్ పార్టీలు తప్ప మరేమీ మిగలలేదు. తాజాగా ఎన్నికల ముందు కూటమిలో చేరిన తెలుగుదేశం, జనసేన వినా ప్రస్తుతం ఎన్డీయేలో చెప్పుకోదగ్గ పార్టీ లేదని చెప్పడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.  ఇంత వరకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారధ్యంలోని జనతా దళ్ (యు) కూటమిలో చేరడంతో..  అది పూర్తిగా ఆయన రాజకీయ స్వార్ధం కోసమే, అధికారాన్ని, ముఖ్యమంత్రి పదవినీ కాపాడుకోవడం కోసమే అయినా ఎన్డీయే ఉనికిని చాటుకోవడానికి దోహదపడిందనే చెప్పాలి. నిజానికి, 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ‘ఏకపార్టీ’ ఆధిక్యత సాధించిన రోజునే, ఎన్డీఎ కథ ఇక ముగిసినట్లేనని పరిశీలకులు విశ్లేషణలు చేశారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా లోక్ సభలో బీజేపీ సొంతగా సాధారణ మెజారిటీ (272)కంటే 10 సీట్లు అదనంగా (282) గెలిచి  చరిత్రను తిరగ రాసింది. అలాగే, 2019 ఎన్నికల్లో బీజేపీ సొంత బలమే 303 కు చేరింది. మరో వంక ప్రతిపక్ష కూటమి, యూపీఎకు సారధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ దినదిన ప్రవర్థమానంగా దిగజారి ప్రాంతీయ పార్టీల పంచన చేరే పరిస్థితికి చేరుకుంది.   అయినా 2014లో, 2019లో బీజీపీ  ప్రధాని మోడీ సారధ్యంలో ఎన్డీఎ సంకీర్ణ ప్రభుత్వాలే ఏర్పాటు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ మొదటి మంత్రివర్గంలో తెలుగు దేశం, శివసేన, అకాలీదళ్, సహా అనేక ప్రాంతీయ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. అయితే  ఆ తర్వాత ఏమి జరిగింది అన్నది చరిత్ర. ఎవరి కారణాలు వారికీ ఉన్నా, ఒక్కొక్క పార్టీ ఎన్డీఎకి దూరమవుతూ వచ్చాయి.   2019 ఎన్నికల్లోనూ అకాలీ దళ్, శివసేన, పాశ్వాన్ పార్టీ ఎల్’జేపీ, ఎఐఎడిఎంకే, జేడీ(యు)సహా అప్నా దళ్, ఆల్ ఝార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ వంటి మరికొన్ని చిన్నా చితక పార్టీలు సహా మొత్తం తొమ్మిది పార్టీలు కలిసి పోటీచేశాయి. 2024 ఎన్నికలు వచ్చే సరికి  ఎన్డీయే కూటమిలో ఆ చిన్నా చితకా పార్టీలలోని కొన్ని మాత్రమే మిగిలాయి.  బీజేపీ సహజ మిత్ర పక్షాలుగా చెప్పుకునే  శివసేన, అకాలీ దళ్ వంటి ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఏవీ ఎన్డీఎలో లేవు.  పేరుకే ఎన్డీయే.. కానీ ఎన్డీయేలో  ఉన్న పార్టీలు ఏవీ రాజకీయంగా   ప్రభావం చూపగలిగే పార్టీలు కాదు. ఏ పార్టీకి కూడా లోక్ సభలో  ఒకటి రెండు స్థానాలకు మించి లేవు.  ఈ నేపథ్యంలోనే పదేళ్ల మోడీ పాలన సహజంగానే ప్రజలలో కొంత వ్యతిరేకత మూటగట్టుకుంది. ముఖ్యంగా రైతులు, నిరుద్యోగులు మోడీ సర్కార్ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన బీజేపీ మళ్లీ ఎన్డీయేలో ప్రధాన ప్రాంతీయ పార్టీల ఆవశ్యకతను గుర్తించింది. ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీని ఎన్డీయే గూటికి చేర్చుకుంది. ఇప్పుడు ఎన్డీయేలో ఉన్న ప్రధాన పార్టీ అనేది  ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే.  ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఐదు విడతల పోలింగ్ పూర్తియిన తరువాత చూసుకుంటే.. బీజేపీ సొంతంగా సాధారణ మెజారిటీ సాధిస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  అదే జరిగితే కేంద్రంలో మళ్లీ  తెలుగుదేశం పార్టీయే ఎన్డీయేలో బీజేపీ తరువాత అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంటే విభజన సమస్యల పరిష్కారం, ఏపీకి సహకారం విషయంలో చంద్రబాబు కేంద్రంపై ప్రభావమంతంగా ఒత్తిడి తీసుకురాగలరని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ఆయన మాటకే ఎక్కువ చెల్లుబాటు ఉంటుందని అంటున్నారు. 

చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌పై వైసీపీ రా ద్ధాంతం అందుకేనా?

ఏపీలో వైసీపీ నేత‌ల రాజ‌కీయాలు చిత్ర విచిత్రంగా ఉన్నాయి. వారి త‌ప్పుల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబును అడ్డుపెట్టుకోవ‌టం వారికి అల‌వాటుగా మారింది. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  గ‌త ఐదేళ్లుగా ఇదే ప‌ని చేశారు. మ‌రీ ముఖ్యంగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబును పేద‌ల వ్య‌తిరేకిగా చూపే ప్ర‌య‌త్నం చేశారు. గ‌త ఐదేళ్ల‌లో పేద వ‌ర్గాల ప్ర‌జ‌లపై వైసీపీ నేత‌ల దాడులను క‌ప్పిపుచ్చుకునేందుకు ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబును పేద‌ల వ్య‌తిరేకి అంటూ బూచిగా చూపెట్టే ప్ర‌య‌త్నం జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు చేశారు. ఏపీలో ఏ చెడ్డ‌ప‌ని జ‌రిగినా దానికి కారకుడు చంద్ర‌బాబు అన్న‌ట్లుగా వైసీపీ అనుకూల మీడియా, సోష‌ల్ మీడియా ప్ర‌చారం చేస్తూ వ‌స్తోంది. తాజాగా చంద్ర‌బాబు విదేశాల‌కు వెళ్లినా వైసీపీ నేత‌లు తెగ టెన్ష‌న్ ప‌డిపోతున్నారు. చంద్ర‌బాబు ఎటుపోయారు.. ఎక్క‌డికి పోయారో చెప్పాలంటూ ప్రెస్ మీట్‌లు పెట్టి మ‌రీ ప్ర‌శ్నిస్తున్నారు. ఇంత‌కీ చంద్ర‌బాబు విదేశాల‌కు వెళితే వైసీపీ నేత‌ల‌కు అంత టెన్ష‌న్ ఎందుకు? జ‌గ‌న్ సైతం విదేశాల‌కు వెళ్లారు క‌దా.. మ‌రి చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌పై వైసీపీ నేత‌లు ఎందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారు?  ఉన్న‌ట్లుండి చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌పై వైసీపీ నేత‌లు గ‌గ్గోలు పెట్ట‌డం వెనుక ప్ర‌ధాన కార‌ణ‌మే ఉన్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.  తెలుగు అధినేత చంద్ర‌బాబు నాయుడు గ‌త శ‌నివారం రాత్రి త‌న స‌తీమ‌ణి భువనేశ్వరితో క‌లిసి అమెరికాకు వెళ్లారు. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఆయ‌న వైద్య ప‌రీక్ష‌ల‌కోసం వెళ్లార‌ని తెలుగుదేశం నేత‌లు చెప్పారు.  వైసీపీ అనుకూల మీడియాలోనూ చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లార‌ని వార్త‌లు వ‌చ్చాయి.   అయితే ఆ మీడియా చంద్ర‌బాబు విదేశాల‌కు పారిపోతుంటే ఎయిర్ పోర్టులో ఇమిగ్రేష‌న్ అధికారులు అడ్డుకున్నారంటూ   పైత్యాన్ని ప్ర‌ద‌ర్శిచింది. ఇదంతా రెండు రోజుల కిందట జ‌రిగిన విష‌యం. రెండు రోజులు నోరు మెద‌ప‌ని వైసీపీ బ్యాచ్.. ఉన్న‌ట్లుండి చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌కు ఎందుకెళ్లారు?  ఏ దేశం వెళ్లారు? ఏ ప్రాంతంలో ఉన్నారు అంటూ ప్ర‌శ్నించ‌డం మొద‌లు పెట్టారు. ప్రెస్ మీట్లు పెట్టి ఎప్ప‌టిలాగే వారికి మాత్రమే సొంతమైన భాషలో  ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లారు. చంద్రబాబు ఎక్కడికి వెళ్లారో మాకిప్పుడే తెలియాలి అంటూ పెద్ద రాద్దాంత‌మే చేశారు. చంద్రబాబు, లోకేశ్‌ కనిపించకపోయేసరికి వారేమీ చేస్తున్నారో ? తమను బుక్ చేసే పనులేమైనా చేస్తున్నారా అని వైసీపీ నేత‌లు తెగ‌ టెన్షన్ పడిపోతున్న‌ట్లు క‌నిపించింది. బొత్స స‌త్య‌నారాయ‌ణ లాంటి సీనియ‌ర్ నేత‌లు సైతం చంద్ర‌బాబు ఎక్కడికి వెళ్లారో చెప్పండి అంటూ మీడియా ముందు గగ్గోలు పెట్ట‌డం చూస్తుంటే.. చంద్ర‌బాబు అంటే వైసీపీ నేత‌లు ఎంత‌లా వ‌ణికిపోతున్నారో అర్థ‌మ‌వుతుంది.  ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి లండ‌న్ ప‌ర్య‌ట‌న‌పై తెలుగు రాష్ట్రాల్లోనేకాక దేశ‌వ్యాప్తంగా పెద్ద చ‌ర్చే జ‌రిగింది. కోర్టుల్లో అనేక కేసులున్న జ‌గ‌న్.. హైకోర్టు అనుమ‌తి ఇవ్వ‌డంతో లండ‌న్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. అదికూడా లండ‌న్ లో  ఏఏ ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్నారో జ‌గ‌న్ ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌జేస్తుండాలి. ఫోన్ నెంబ‌ర్ ను కూడా ఇచ్చివెళ్లాల‌ని  కోర్టు ష‌ర‌తులు పెట్టింది. ఎందుకంటే, జ‌గ‌న్‌పై అనేక కేసులు ఉండ‌టంతో ఆయ‌న విదేశాల‌కు పారిపోతున్న‌ట్లు దేశ‌వ్యాప్తంగా విస్తృత ప్ర‌చారం జ‌రిగింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ పరాజయం పాలు కాకతప్పదన్న స్పష్టత రావడంతో   ఇక మ‌ళ్లీ జైలు జీవితం గ‌డ‌పాల్సి వ‌స్తుంద‌నే భ‌యంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఫ్యామిలీతో లండ‌న్ వెళ్తున్నార‌ని, ఇక ఆయ‌న తిరిగిరార‌ని విస్తృతం ప్ర‌చారం జ‌రిగింది. తెలుగుదేశం నేత‌లు సైతం ఈ విష‌యాన్ని ప‌దేప‌దే ప్ర‌స్తావించారు. చివరాఖరికి సీబీఐ కూడా ఆయన విదేశీ పర్యటనను వ్యతిరేకిస్తూ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన కౌంటర్ లో కూడా ఇదే అనుమానం వ్యక్తం చేసింది. ఎన్నిక‌లు అయిపోయిన త‌రువాత జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌న అంటే వైసీపీ శ్రేణులుసైతం ఒకింత‌ ఆందోళ‌న చెందారు. జ‌గ‌న్ పై జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని డ్రైవ‌ర్ట్ చేస్తేందుకు వైసీపీ నేత‌లు చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌ను తెర‌పైకి తెచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఓట‌మి భ‌యంతో ఆందోళ‌న‌లోఉన్న వైసీపీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌పై అర్ధంప‌ర్దంలేని ప్ర‌శ్న‌లు లేవ‌నెత్తుతూ త‌మ‌ అనుకూల మీడియాలో వైసీపీ నేత‌లు విష‌ప్ర‌చారం చేస్తున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి.. చెప్పిందేచెప్పి ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్ లండ‌న్ ప‌ర్య‌ట‌న టాపిక్ ను డైవ‌ర్ట్ చేసేందుకు వైసీపీ నేత‌లు ఆడుతున్న డ్రామాగా రాజ‌కీయ విశ్లేష‌కులు దీనినిపేర్కొంటున్నారు.  మ‌రోవైపు.. ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మి ఖాయ‌మ‌ని స్ప‌ష్ట‌మ‌యింది. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ అయితే..  వైసీపీ ఘోర ఓట‌మిని చ‌విచూడ‌బోతుంద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. ఏపీలో సీఎంగా చంద్ర‌బాబు బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్నార‌ని దేశ‌వ్యాప్తంగా విస్తృత ప్ర‌చారం జ‌రుగుతుంది. దీంతో వైసీపీ అభ్య‌ర్ధుల‌తోపాటు, పార్టీ శ్రేణులు ఆందోళ‌న చెందుతున్నారు. ఓటింగ్ స‌ర‌ళిని చూసి వైసీపీలోని ముఖ్య‌నేత‌లు మీడియా ముందుకు వ‌చ్చేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌టం లేదు. నిత్యం చంద్ర‌బాబు, లోకేశ్ పై విరుచుకుప‌డే విజ‌య‌సాయిరెడ్డి, రోజా, కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ, అనిల్ కుమార్ యాద‌వ్ వంటి నేత‌లు ఒక్క‌సారిగా సైలెంట్ అయ్యారు. దీంతో ప‌లువురు వైసీపీ అభ్య‌ర్థులు, జిల్లాల్లోని వైసీపీ ముఖ్య‌నేత‌లు, పార్టీలోని ద్వితీయ స్థాయి నేత‌లు ఆందోళ‌న చెందుతున్నారు. కూట‌మి అధికారంలోకి వ‌స్తే వైసీపీ ప్ర‌భుత్వంలో తాముచేసిన త‌ప్పుల‌ను బ‌య‌ట‌కుతీసి చ‌ట్ట‌ప్ర‌కారం శిక్షిస్తుంద‌ని వారు భ‌య‌ప‌డిపోతున్నారు. ఇలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే ముంద‌స్తుగానే  తెలుగుదేశం, బీజేపీ, జ‌న‌సేన పార్టీల్లో చేరిపోతే సేఫ్ సైడ్‌లో ఉండొచ్చ‌నే ఆలోచ‌న‌సైతం చేస్తున్నారు. ఇప్ప‌టికే పలువురు వైసీపీ నేత‌లు బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ నేత‌ల ట‌చ్‌లోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. ఇదే జ‌రిగితే వైసీపీ పెద్ద‌న‌ష్టం వాటిల్లుతుంద‌ని భావించిన ఆ పార్టీ అధిష్టానం పెద్ద‌లు న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల‌కు దిగిన‌ట్లు తెలుస్తోంది.  అందులో భాగంగానే చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఏదో కుట్ర దాగిఉంద‌ని చెప్ప‌డం.. వైసీపీ అనుకూల మీడియాలో చంద్ర‌బాబు విదేశాల‌కు వెళ్ల‌డం పెద్ద‌పాపం చేసిన‌ట్లు చూప‌డం వంటి కార్య‌క్ర‌మాల‌కు వైసీపీ అధిష్టానం శ్రీ‌కారం చుట్టింద‌ని, త‌ద్వారా కొద్దిరోజులు చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌పై ఏపీ రాజ‌కీయాలు చ‌క్క‌ర్లు కొట్టేలా చేయ‌డమే వైసీపీ ప్లాన్ గా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మ‌రోవైపు పోలింగ్ స‌మ‌యంలో, పోలింగ్ అనంత‌రం వైసీపీ నేత‌లు అనేక దాడుల‌కు పాల్ప‌డ్డారు. సిట్ ద‌ర్యాప్తులోనూ ఆ విష‌యం స్ప‌ష్ట‌మైంది. ప‌లు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల‌నుసైతం వైసీపీ నేత‌లు ప‌గ‌ల‌గొట్టారు. ఇన్నాళ్లూ తెలుగుదేశం నేత‌లు త‌మ‌పై దాడులు చేశారంటూ ప్ర‌జ‌ల‌కు అబ‌ద్దాలు చెబుతూ వ‌చ్చిన వైసీపీ నేత‌ల‌కు సిట్ ద‌ర్యాప్తు పెద్ద ఎదురుదెబ్బ‌గా మారింది. ప్ర‌స్తుత ప‌రిణామాల నేప‌థ్యంలో పోలింగ్ స‌మ‌యంలో, ఆ త‌రువాత వైసీపీ నేత‌ల త‌ప్పుల‌ను క‌ప్పిపుచ్చుకునేందుకు చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న అంశాన్ని జ‌గ‌న్ బ్యాచ్ తెర‌పైకి తెచ్చిన‌ట్లు ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.