'షాడో' థియేటర్ల పై దాడి చేసిన అభిమానులు

        మెహర్ రమేష్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన 'షాడో' చిత్రం థియేటర్ పై వెంకటేష్ అభిమానులు దాడికి పాల్పడ్డారు. తిరుపతిలో ఈ సినిమా ప్రదర్శిస్తున్న జగత్, విఖ్యాత్ థియేటర్ల వద్ద టికెట్ల కోసం ఈ ఉదయం నుండి అభిమానులు బారులు తీరారు. చివరికి టికెట్లు అయిపోయాయని థియేటర్ యాజమాన్యం చెప్పడంతో అభిమానులు గొడవకు దిగారు. థియేటర్ అద్దాలు పగలగొట్టిన అభిమానులు అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేశారు. థియేటర్ సిబ్బంది టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్నారని, అసలు టికెట్లు ఇవ్వకుండానే అయిపోయాయని యాజమాన్యం అబద్దాలు చెబుతోందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలోని భూమా సినిమా హాలు వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. టికెట్లు అయిపోయాయని థియేటర్ యాజమాన్యం చెప్పడంతో అభిమానులు అద్దాలు పగలగొట్టారు.

సుబ్బిరామిరెడ్డిని కలవరపరుస్తున్న పురందేశ్వరి మౌనం

  వైజాగ్ లోక్ సభ సీటు కోసం ఈ సారి టీ.సుబ్బిరామిరెడ్డి చాలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ప్రస్తుతం వైజాగ్ లోక్ సభ స్థానానికి ప్రాతినిద్యం వహిస్తు, తనకు పోటీగా ఉన్నకేంద్రమంత్రి పురందేశ్వరి తనకు చెల్లెలువంటిదని చెపుతూనే, వైజాగ్ ను తనకు వదిలిపెట్టి, ఆమె పక్కనున్న నర్సాపురం నియోజక వర్గానికి వెళ్ళిపోతే ఇద్దరికీ బాగుంటుందని ఆయన మీడియా ముఖంగా ఆమెకు సలహాలు కూడా ఇచ్చారు.   నగరంలో జరిగే పలు చిన్నా పెద్దా కార్యక్రమాలలో ఇప్పుడు చురుకుగా పాల్గొంటున్న ఆయన ప్రతీ సభలో, సమావేశంలో ఈ సారి తానూ వైజాగ్ నుండే పోటీ చేయడం ఖాయమని పదే పదే చెపుతున్నారు కూడా. పనిలో పనిగా వైజాగ్ నగరాన్ని తానూ ఏవిధంగా మార్చివేయాలనుకొంటున్నారో తెలియజేస్తూ ఒక పెద్ద దీర్ఘకాళిక ప్రణాళిక కూడా ప్రకటించేశారు. తద్వారా, ఇక తానే వైజాగ్ కి ప్రాతినిద్యం వహించబోతున్నట్లు ప్రకటించేసుకొన్నారు.   పనిలో పనిగా ఇటీవలే వైజాగులో ఒక సభ నిర్వహించి తానూ చేసిన సేవలకి గాను కిరీటం కూడా పెట్టించుకొన్నారు. అయినప్పటికీ, పురందేశ్వరి మాత్రం తన సహజ సిద్దమయిన హుందాతనం కనబరుస్తూ, ఏనాడు ఆయన మాటలకు జావాబు ఈయలేదు. ఆమె అంత నిశబ్దంగా ఉండిపోవడంతో ఆమె అంతర్యం ఏమిటో అర్ధం కాక, కంగారుపడుతూన్న సుబ్బిరామిరెడ్డి ఎందుకయినా మంచిదని నిన్ననే డిల్లీ వెళ్లి సోనియా గాంధీని కలిసి, వైజాగ్ ప్రజలకు తానూ చేస్తున్న సేవల లిస్టులు, దాన ధర్మాల లిస్టులు, తన ధార్మిక వ్యవహారాల వివరాలను పూర్తిగా అప్పజెప్పి, వైజాగ్ లోక్ సభ సీటు తనకే ఇప్పించవలసిందిగా కోరారు. మరి సోనియా గాంధీ ఏమి హామీ ఇచ్చేరో ఆయన ఇంకా బయటపెట్టలేదు.త్వరలోనే ఆ సంగతీ ఆయనే స్వయంగా ప్రకటించుకోవచ్చును.

పాదయాత్ర ముగింపు సభకి రానున్న జూ.యన్టీఆర్

  రేపటితో చంద్రబాబు సుదీర్గ పాదయాత్ర ముగియనున్నందున, ఈ సందర్భంగా తెదేపా విశాఖ నగరంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. రాష్ట్రం నలుమూలల నుండి దాదాపు 5 లక్షల మంది పార్టీ కార్యకర్తలు, నాయకులూ, పార్టీ అభిమానులు ఈ సభకు రానున్నట్లు అంచనా వేస్తున్న తెదేపా, ఈ సభలో పాల్గొనవలసిందిగా కోరుతూ పార్టీ నేతలకు, నందమూరి కుటుంబ సభ్యులకు, మిత్ర పక్షాల నేతలకు, దేశ విదేశాలలో ఉన్న పార్టీ అభిమానులకు ఆహ్వానాలు పంపింది.   అయితే అనారోగ్య కారణాల వల్ల పార్టీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ హాజరు కాకపోవచ్చునని ఆహ్వానకమిటీ భావిస్తోంది. పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభలలో ఆయన స్వయంగా పాల్గొనలేకపోయినపటికీ తన కుమారుడు జూ.యన్టీఆర్ ను మాత్రం పంపుతున్నట్లు సమాచారం అందింది. ఇటీవల ఫ్లెక్సీబ్యానర్ల కారణంగా నందమూరి కుటుంబ సభ్యుల మద్య తలెత్తిన వివాదాలకు తెరదించాలని అందరూ భావిస్తున్నందున, ఈ సభకు జూ.యన్టీఆర్ తప్పనిసరిగా హాజరవుతాడని పార్టీ నేతలు భావిస్తున్నారు. అతనితో బాటు, తారక రత్న, కళ్యాన్ రామ్ తదితరులు కూడా వచ్చి ఈ సభలో పాల్గొంటారు. లక్షలాది ప్రజలు, పార్టీ కార్యకర్తలు హాజరవుతున్న సభకి హాజరవుతున్న సందర్బంగా, జూ.యన్టీఆర్ ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకొని అందరిలో అపోహలు దూరం చేసే ప్రయత్నం చేస్తూ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగనున్నట్లు, పార్టీకే మద్దతు ఉటుందని ఒక విస్పష్టంగా ప్రకటన చేయవచ్చునని అందరూ భావిస్తున్నారు. అందువల్ల ఈ సభలో విజయవంతంగా పాదయాత్ర ముగించుకొన్నచంద్రబాబు నాయుడు కంటే జూ.యన్టీఆర్, ఆ తరువాత వరుసగా లోకేష్, బాలకృష్ణలే ప్రధాన ఆకర్షణగా నిలువబోతున్నారని చెప్పవచ్చును.

పాదయాత్ర ముగింపుకి భారీ ఏర్పాట్లు

  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మొదలుపెట్టిన సుదీర్గ పాదయాత్ర ఈ నెల27న ముగియనున్నందున పార్టీ నేతలు చాలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ శివారు ప్రాంతమయిన గాజువాక సమీపంలో వడ్లపూడి వద్ద రూ.౩ కోట్ల ఖర్చుతో 275గజాల స్థలంలో ఒక సుందరమయిన పార్కు తీర్చిదిద్ది దాని మద్యలో 60 అడుగుల పొడవయిన పైలాన్ నిర్మిస్తున్నారు. దానిలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం నెలకొల్పనున్నారు. పైలాన్ నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది.   చంద్రబాబు 27వ తేదీన గాజువాక పరిసర ప్రాంతాలలో తన పాదయాత్ర ముగించుకొన్న తరువాత మద్యాహ్నం 3గంటలకు పైలాన్ ఆవిష్కరిస్తారు. ఆ తరువాత 10,000 మోటార్ సైకిళ్ళు, 400 ఇతర వాహనాలతో కూడిన భారీ ర్యాలీతో ఓపెన్ టాప్ జీపులో బయలుదేరి నగరం నడిబొడ్డునగల ఆంధ్రాయునివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో జరిగే భారీబహిరంగ సభలో పాల్గొంటారు.   ఈ ముగింపు వేడుకలకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నపార్టీ కార్యకర్తలు, నాయకులూ అందరు కలిసి దాదాపు 10లక్షల మంది వరకు రావచ్చునని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే 12 ప్రత్యేక రైళ్ళను, 500 బస్సులను, అనేక మినీ వ్యాన్లను ముందుగానే బుక్ చేసారు. అదేవిధంగా నగరంలో ఉన్న చిన్న పెద్దా హోటల్స్ మరియు గెస్ట్ హౌసులలో రూములు కూడా ఇప్పటికే చాలావరకు బుక్ అయిపోయినట్లు సమాచారం.   ఇంత భారీ ఎత్తున తరలి వస్తున్న జనాలను అదుపుచేసేందుకు పోలీసులు కూడా అదనపు బలాలను ఇతర జిల్లాల నుండి రప్పిస్తున్నారు. ఇక 26వ తేదీ నుండే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్ళింపులు ఉంటాయని పోలీసు అధికారులు తెలియజేసారు. సభాస్థలి జనసాంద్రత ఎక్కువ ఉండే నగరం నడిబొడ్డున ఉండటంతో పోలీసులు మరింత జాగురకతో వ్యవహరించాల్సి ఉంటుంది.   చంద్రబాబు తన 63 ఏళ్ల వయసులో దాదాపు 2,900కి.మీ. పాదయాత్ర దిగ్విజయంగా చేసుకొని ఇంత భారీ ఎత్తున ర్యాలీ, సభ నిర్వహించతుండటంతో పార్టీ కార్యకర్తలలో, నేతలలో మళ్ళీ చాలారోజుల తరువాత సమరోత్సాహం కనిపిస్తోంది.

కమలం గూటికి నాగం!

        నాగర్ కర్నూల్ శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి భారతీయ జనతాపార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన రోజు ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తో కలిసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ కోసం ప్రజలు ఎన్ని పోరాటాలు చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో అది సాధ్యం కాదని, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే తెలంగాణ సాధ్యమవుతుందని నాగం ఆశాభావం వ్యక్తం చేశాడు. తెలంగాణవాదులంతా జాతీయ పార్టీనే గెలిపించాలని, ఎన్డీయే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలపాలని కోరారు. ప్రజలంతా ఐక్యంగా పోరాడి తెలంగాణను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో జాతీయ పార్టీ తరుపునే పోటీ చేస్తానని కూడా ఆయన అన్నారు.

బ్రహ్మాణి భూ కేటాయింపులు రద్దు

        కడప జిల్లాలోని బ్రహ్మాణి స్టీల్స్‌కు సంబంధించిన భూ కేటాయింపులను రద్దు చేసిన బుధవారం ప్రభుత్వం ప్రకటించింది. బ్రహ్మాణి స్టీల్స్‌కు కేటాయించిన 10వేల 766 ఎకరాలను రద్దు చేస్తున్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించిన ఫైలుపై సంతకం చేశాడు. వైఎస్ఆర్ జిల్లాలోని జమ్మలమడుగు మండలం వేగుంటపల్లి, కొత్తగుంటపల్లి, పి. బొమ్మపల్లి, తూగుటపల్లి, ప్రాంతాలలో ఉన్న భూములను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బ్రాహ్మాణి స్టీల్స్‌కు కేటాయించాడు. ప్రభుత్వం భూ కేటాయింపులు రద్దు చేసి ఈ భూములను వెనక్కు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది.

మారింది అధినాయకుడు మాత్రమే! కాంగ్రెస్ తీరు కాదు

  కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన నాటినుండి ఆయన చేస్తున్న ఆకర్షణీయమయిన ప్రసంగాలు, పార్టీ ప్రక్షాళన, అధికార వికేంద్రీకరణం, అవినీతిరహితమయిన ప్రభుత్వాల ఏర్పాటు వంటి మాటలు విని, ఆయన గుర్రంపై ఎక్కి,వచ్చితన దగ్గరున్నమంత్రం దండంతో అటు స్వంత పార్టీని, ఇటు దేశాన్నిసమూలంగా మార్చేస్తాడని ఎవరూ భావించకపోయినా, కనీసం పార్టీపరంగా కొన్ని మంచి మార్పులు తీసుకువచ్చి, పార్టీని తన పాత పందానుండి బయట పడేస్తాడని మాత్రం చాల మంది ఊహించారు. కానీ, మాటలు వేరు, చేతలు వేరన్నట్లు ఉంది ఆయన పద్ధతి. కర్ణాటక శాసనసభకి త్వరలో జరగనున్న ఎన్నికల ప్రచారంలో విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టోలో అంశాలను గమనిస్తే మారింది అధినాయకుడు మాత్రమే! తప్ప కాంగ్రెస్ తీరు, ఆలోచనలు కాదని అర్ధం అవుతుంది.   మానిఫెస్టోలో ప్రకటించిన తాయిలాలు కొన్ని: కేజీ రూ.1బియ్యం నెలకి 30 కేజీలు ఒక్కో ఇంటికి కాలేజీ విద్యార్దులకు ల్యాప్ టాపులు పీయుసీ విద్యార్దులకు డిజిటల్ నోట్ట్ బుక్స్ (టాబ్లెట్ పీసీలు) పాడి రైతులకు పాల మీద లీటరుకు రూ.4 సబ్సీడి వ్యవసాయదారులకు రుణాల మాఫీ వ్యవసాయదారులకు రూ.2లక్షల వరకు వడ్డీలేని రుణాలు వ్యవసాయదారులకు రూ.4లక్షల వరకు కేవలం 3 శాతం వడ్డీతో రుణాలు (బహుశః ఈ రుణాలు వారు తిరిగి చెల్లించలేకపోతే వచ్చే సాధారణ ఎన్నికలలో వాటిని మాఫీ చేస్తారేమో!)   ఇక రాహుల్ గాంధీ ప్రచారంలో కూడా ‘కాంగ్రెస్ మార్క్’ కొట్టవచ్చినట్లు కనబడుతోంది. ఒక వైపు కేంద్రంలో రోజుకొక కుంభకోణం బయటపడుతుంటే, తమను ఎన్నుకొంటే కర్ణాటకలో మాత్రం స్వచ్చమయిన పరిపాలన అందిస్తామని నొక్కి వక్కాణిస్తున్నారు. ఆయన స్వంత పార్టీలో, స్వంత ప్రభుత్వంలో, ఇంకా చెప్పాలంటే స్వంత కుటుంబంలో (బావగారు రాబర్ట్ వాద్రాభూముల భాగోతాలు) వెలుగు చూస్తున్న భాగోతాలను మరిచి, బీజేపీ అవినీతిని ప్రస్తావించడం చూస్తే అద్దాల మేడలో కూర్చొని రాళ్ళు విసురుతున్నట్లు ఉంది.   65 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనకార్యాలు చెప్పుకొని ఓట్లు కోరే బదులు, ప్రతిపక్ష ప్రభుత్వం అవినీతి గురించి మాట్లాడుతూ తమకి ఒట్లేయమని కోరడం చూస్తే, ఎవరు పగ్గాలు చెప్పటినా పార్టీకి అనుకూలంగా వారే మారాలి తప్ప కాంగ్రెస్ పార్టీని ఎన్నడూ, ఎవరూ మార్చలేరని అర్ధం అవుతోంది.   రాహుల్ గాంధీ తన ఆలోచనలను, ఆశయాలను కనీసం కర్ణాటక రాష్ట్రంలో ‘పైలట్ ప్రాజెక్టు’గా అమలుచేసి చూపినా ఆయన నాయకత్వం పట్ల ప్రజలలో నమ్మకం పెరిగి ఉండేది. ఒకవేళ అక్కడ సఫలం కాలేకపోతే, అప్పుడు రాబోయే సాధారణ ఎన్నికలలో మళ్ళీ కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు చేసుకొనే అవకాశం ఉంది. కానీ, రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు అంత రిస్క్ తీసుకొనే మూడ్ లో లేరు.

పంతం నెగ్గించుకొన్న స్పీకర్ నాదెండ్ల

  రాష్ట్ర బడ్జెట్ లో ఆర్ధిక మంత్రి ఆనం రామినారాయణ రెడ్డి ప్రతిపాదించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రభుత్వానికి వాటిపై తగిన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సభాపతి నాదెండ్ల మనోహర్ నిన్న కాంగ్రెస్, తెదేపాలతో కూడిన 12 సభా స్థాయి సంఘాలకు అధ్యక్షులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసారు. ఈ విషయంలో ఆయనతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విభేదించినప్పటికీ, ఆయన పార్లమెంటు సంప్రదాయాలను పాటిస్తూ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలని కూడా స్థాయి సంఘాలకు అధ్యక్షులుగా నియమించారు.   ప్రతిపక్షాలకు ఈ బాధ్యతలు అప్పగించడం ఎంతమాత్రం ఇష్టపడని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కేవలం అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులకే ఆ బాధ్యతలు అప్పగించాలని గట్టిగా పట్టుబట్టారు. అదేవిధంగా సభాపతిని సంప్రదించకుండా ఆయన పరిధిలో ఉండే స్థాయి సంఘాల సమావేశ తేదీలను కూడా ప్రకటించడంతో వారిరువురి మద్య ఈ విషయంలో బేధాభిప్రాయాలు మరింత పెరిగాయి. చివరికి, మధ్యే మార్గంగా నాదెండ్ల మనోహర్ మెజార్టీ స్థాయి సంఘాలకు కాంగ్రెస్ వారిని, ముఖ్యమయిన ౩ సంఘాలకు తెదేపా నేతలను అధ్యక్షులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసి, ఒకవైపు పట్టువిడుపులు ప్రదర్శిస్తూనే మరో పక్క తన పంతం కూడా నెగ్గించుకొన్నారు. తద్వారా ఆయన ఒక సరి కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టి అందరి ప్రశంసలు అందుకొంటున్నారు.

కాంగ్రెస్ పై మోహన్ బాబు విమర్శనాస్త్రాలు

        నటుడు మోహన్ బాబు మరోసారి వార్తల్లోకి వచ్చారు. తిరిగి రాజకీయాల్లోకి ప్రవేశిస్తానన్న ప్రకటనతో చర్చలోకి వచ్చిన మోహన్ బాబు ఇప్పడు ప్రభుత్వ తీరుపై విరుచుకుపడటంతో మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అయితే మోహన్ బాబు విమర్శ ఇప్పుడు రాజకీయ కోణంలో కాక ఒక కళాశాల యజమాని తీరున ఉంది. శ్రీ విద్యానికేతన్ సంస్థల యజమానికిగా ఒక ఇంజినీరింగ్ కళా శాల యజామానికిగా ప్రభుత్వంపై మోహన్ బాబు విమర్శనాస్త్రాలు సంధించారు. తమకు రావాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలోఆయన ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. మొత్తం కాలేజీల తరపున వకాల్తా పుచ్చుకొంటూ… రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో 730 ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన అన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదలకాకపోవడంతో లెక్చరర్లకు జీతాలివ్వలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇప్పటికే అనేక సార్లు కళాశాలల తరపున మోహన్ బాబు ప్రభుత్వంతో చర్చల్లోపాల్గొన్నారు. అయితే అవేవీ సానుకూలంగా కనపడకపోవడంతో ఇప్పుడు ఈయన విమర్శలకు దిగారు. ఇక ఇతర అంశాల గురించి కూడా మోహన్ బాబు స్పందించారు. రాజకీయపార్టీల తీరువల్లే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. విదేశీ తరహాలో ఇక్కడా కఠిన శిక్షలు అమలుచేస్తే అత్యాచారాలు ఉండవన్నారు.

టిటిడి మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు కన్నుమూత

      ప్రముఖ పారిశ్రామికవేత్త ,చిత్తూరు మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు కన్నుమూశారు. కొద్ది కాలంగా అస్వస్థతతో ఉన్న ఆదికేశవులు బుధవారం రాత్రి 10.15 గంటలకు తన సొంత ఆస్పత్రి వైదేహిలో మరణించారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సత్యసాయిబాబాకు పరమ భక్తుడైన ఆదికేశవులు నాయుడు సత్యసాయి శివైక్యం చెందిన రెండేళ్లకు సరిగ్గా అదే రోజున మరణించడం గమనార్హం. వైదేహి ఆస్పత్రి ప్రాంగణంలోనే గురువారం సాయంత్రం నాలుగు గంటలకు ఆదికేశవులు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ వర్గాల ద్వారా తెలిసింది.   ఆదికేశవులు మృతిపై సీఎం కిరణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్‌గా, ఎంపీగా, పారిశ్రామికవేత్తగా ఆయన చేసిన సేవలు ప్రశంసనీయమని, ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు ఆదికేశవులు చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సానుభూతి తెలిపారు. ఆదికేశవులు ఆకస్మిక మృతి తనను షాక్‌కు గురి చేసిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పాదయాత్రలో ఉండగానే ఆదికేశవులు కుటుంబ సభ్యులతో ఆయన ఫోన్లో మాట్లాడి సంతాపం తెలిపారు.

చిరంజీవి మీద కాదు: మోహన్ బాబు

  సినీ నటుడు మోహన్ బాబు త్వరలో రాజకీయాలలోకి ప్రవేశిస్తానని ప్రకటన చేస్తూ "పార్టీ పెట్టే దైర్యం, దానిని అమ్ముకొనే తెలివితేటలు తనకి లేవంటూ" వ్యంగంగా అన్న మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నావో అందరికీ తెలుసు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ “నేను చిరంజీవిని ఉద్దేశించి ఆ మాటలు అనలేదు. ఆయన కుటుంబంతో మా కుటుంబానికి సత్సంబందాలున్నాయి. పర్యాటక మంత్రిగా ఆయన చాలానే చేస్తున్నాడు. అందుకు ఆయనను అభినందిస్తున్నాను,” అని అన్నారు.   కానీ, ఆయన మళ్ళీ అప్పుడే మరో కొత్త బాణం వేసారు. “డబ్బులు ఇచ్చిన వాళ్ళు, పుచ్చుకొన్న వాళ్ళు గుట్టుగానే తీసుకొన్నారు. ఇద్దరూ బాగానే ఉన్నారిప్పుడు. వాళ్ళెవరో అందరికి తెలుసు. ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు,” అని అన్నారు.   బహుశః ఆయన ఈ సారి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిని, కాంగ్రెస్ హై కమాండ్ ని ఉద్దేశించి ఈ విధంగా అని ఉండవచ్చును. గతంలో రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కొనసాగనిస్తున్నందుకు గాను, ఆయన ప్రతీనెలా కాంగ్రెస్ హైకమాండ్ కి కప్పం (పన్ను) కట్టినట్లు సూట్ కేసులతో డబ్బు ముట్టజెప్పేవారని, తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శించేవారు. బహుశః ఆయన వాటిని దృష్టిలో ఉంచుకొనే ఈవిదంగా అని ఉండవచ్చును.   ఏమయినప్పటికీ, ఆయన తీరు, మాటలు రెండూ కూడా అయన రాజకీయాలకు నప్పరని స్పష్టం చేస్తోంది. రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నప్పుడు అందుకు తగిన విధంగా మాట్లాడకపోగా, ఇటువంటి వ్యర్ధమయిన వ్యంగోక్తులు ప్రయోగించడం ఆయనకు ఏవిధంగాను మేలు చేయకపోగా, ముందుగానే రాజకీయ శత్రువులను సృష్టించిపెడుతుంది అని ఆయన గ్రహించడం మంచిది. ఇటువంటి డైలాగులకి సినిమాలలో బాగానే చప్పట్లు పడవచ్చును, కానీ రాజకీయాలలో మాత్రం అవి అనర్ధాలే తెస్తాయి. ఆయన తన మాటలకి స్వయంగా మళ్ళీ సంజాయిషీ ఇచ్చుకోవలసి రావడమే అందుకు ఒక చక్కటి ఉదాహరణ.

సభా సంఘాల నియామకం చేసిన స్పీకర్

  శాసన సభలో ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ ను అంశాల వారిగా చర్చించి, వాటిపై తమ సలహాలు, సూచనలు మరియు సవరణలను తెలిపేందుకు ఈ రోజు స్పీకర్ నాదెండ్ల మనోహర్ 12 సభా సంఘాల చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఈ సభా సంఘాలు మే 2వ తేదీలోగా తమ నివేదికలను స్పీకర్ కి అందజేయవలసి ఉంటుంది. మౌళిక వసతులు, అభివృద్ధి సంఘానికి మాత్రం ఇద్దరు చైర్మన్లను నియమించారు. వారు: మౌళిక వసతులు, అభివృద్ధి-ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరావు మరియు ఎమ్మెల్సీ నరసారెడ్డి (తెదేపా) ఉపాధి కల్పన - ఎమ్మెల్యే మస్తాన్‌రావు(తెదేపా) మానవ వనరులు- ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు పట్టణాభివృద్ధి -ఎమ్మెల్యే విజయప్రసాద్‌ (కాంగ్రెస్) గ్రామీణాభివృద్ధి- ఎమ్మెల్సీ యాదవరెడ్డి (కాంగ్రెస్) రెవిన్యూ - ఎమ్మెల్యే జీవీ శేషు (కాంగ్రెస్) వ్యవసాయం- ఎమ్మెల్యే సుధాకర్‌ (కాంగ్రెస్) సంక్షేమ కమిటీ- ఆత్రం సక్కు ఆరోగ్యం - ఎమ్మెల్యే వంగాగీత (కాంగ్రెస్) అడవులు, పర్యావరణం- ఎమ్మెల్సీ రెడ్డపరెడ్డి (కాంగ్రెస్) నీటిపారుదల - ఎమ్మెల్యే కిష్టారెడ్డి (కాంగ్రెస్)

కార్యకర్తలకి, నాయకులకీ సెలవులు క్యాన్సిల్: చంద్రబాబు

మరో మూడు రోజుల్లో తన సుదీర్గ పాదయాత్రను ముగించుకొని ఇంటి ముఖం పట్టనున్న చంద్రబాబు ఈ రోజు అనకాపల్లి నియోజకవర్గంలో పాదయత్ర చేస్తున్నప్పుడు స్థానిక కార్యకర్తలతో మాట్లాడుతూ, “ఎన్నికలకు కేవలం ఇంకా ఒక్క ఏడాది మాత్రమే మిగిలి ఉన్న ఈ కొద్దిపాటి సమయం మనందరికి చాలా కీలకమయినది. కనుక ప్రతీ కార్యకర్త, ప్రతి నాయకుడు నేటి నుండి పార్టీ కోసం రోజుకు 24 గంటలు పనిచేయవలసి ఉంది. మళ్ళీ ఎన్నికలయ్యే వరకు మీ స్వంత పనులను, బాధ్యతలను మీ కుటుంబంలో వేరే ఎవరికయినా అప్పగించి పార్టీ సేవకే అంకితమయిపోవాలి. అంతవరకు మన పార్టీలో ఎవరికీ కూడా ఇక శెలవులు లేవు. ఎన్నికలలో విజయమే లక్ష్యంగా చేసుకొని మనం అందరూ కలిసి కష్టపడాలి. రాబోయే ఎన్నికలు మన శక్తి, సామర్ద్యాలకి ఒక అగ్నిపరీక్ష వంటివి,” అని అన్నారు.

తెదేపా సిట్టింగ్ ఎం.ఎల్.ఏ.లకే సీట్లు ఖాయం

  తెదేపా 9సం.ల ప్రతిపక్షవాసం పూర్తి చేసుకొని, మళ్ళీ ఎన్నికలకి సిద్ధం అవుతోంది. ఈ 9సం.లలో పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయినవారు పోగా, పార్టీని కష్టకాలంలో కూడా నమ్మకంగా అంటిపెట్టుకొని మిగిలిన 76 మంది శాసన సభ్యులకే మళ్ళీ పార్టీ టికెట్స్ ఇవ్వాలని చంద్రబాబు నిశ్చయించుకొన్నట్లు తెలిసింది. అంతే కాకుండా సమస్యాత్మకంగాలేని మరో 153 నియోజక వర్గాలాలో కూడా ఇప్పటికే అభ్యర్ధుల పేర్లు ఖరారు చేసేసినట్లు సమాచారం.   వీరుకాక చంద్రబాబు నాయుడు తన పాదయాత్రలో మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ నుండి యస్.విజయపాల్ రెడ్డి, కాకినాడ సిటి నుండి వనమది వెంకటేశ్వరరావు పేర్లను ఖరారుచేసిన విషయం తెలిసిందే. ఇక యనమల రామకృష్ణుడు శాసనమండలికి మారినందున ఆయన సోదరుడు యనమల కృష్ణుడుకి  తూర్పు గోదావరి జిల్లా తుని నుండి, దాడి వీరభధ్ర రావు లోక్ సభకు వెళ్లాలని భావిస్తున్నందున ఆయన కుమారుడు దాడి రత్నాకర్ అనకాపల్లి నుండి పార్టీ అభ్యర్ధులుగా దాదాపు ఖాయం అయినట్లేనని సమాచారం.   ఇక ఒకరి కంటే ఎక్కువ అభ్యర్ధులు పోటీలో ఉన్నవి, లేదా  కొంచెం సమస్యాత్మకంగా మిగిలిన 60 నియోజక వర్గాలకు అభ్యర్ధులను ఖరారు చేసే క్లిష్టమయిన పనిని చంద్రబాబు తన పాదయత్ర ముగించుకొని పార్టీ కార్యాలయానికి రాగానే మొదలుపెట్టే అవకాశం ఉంది. ఈ సారి ఏడాది ముందుగానే పార్టీ అభ్యర్ధులను ప్రకటిస్తానని చంద్రబాబే గతంలో స్వయంగా ప్రకటించారు. గనుక, వచ్చే నెల 23వ తేదీ నుండి హైదరాబాదులో జరగనున్న మహానాడు సభలలో ఆయన తన మొట్ట మొదటి అభ్యర్ధుల లిస్టు ప్రకటించే అవకాశం ఉంది.   తద్వారా అభ్యర్ధులు తమతమ నియోజక వర్గాలలో ముందే ప్రచారం చేసుకోవడమే కాకుండా రాబోయే ఎన్నికల కురుక్షేత్ర మహా సంగ్రామాన్ని దైర్యంగా ఎదుర్కొనేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకొని పూర్తి సన్నధం కాగలరు. పార్టీ టికెట్స్ కేటాయింపుల సమయంలో చెలరేగే అసంతృప్తి జ్వాలలు కూడా ఎన్నికల సమయానికి పూర్తిగా చల్లారే అవకాశం ఉంది గనుక, అప్పుడు పార్టీ కూడా నిశ్చింతగా ఎన్నికలకు వెళ్ళవచ్చునని పార్టీ నేతల అభిప్రాయం.   తెరాస అధ్యక్షుడు కేసీఆర్ కూడా ఈ సారి ఇదే పద్దతి అనుసరించబోతున్నారు. తెరాస కూడా మే నెలాఖరులోగా పార్టీ అభ్యర్ధుల పేర్లు ప్రకటించబోతోంది. ఇక డిల్లీ నుండి రిమోట్ తో పనిచేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఖరారు కావాలంటే డిల్లీవైపు, వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధుల లిస్టు కోసం చంచల్ గూడా జైలు వైపు చూడాల్సిందే.

బయ్యారంలో బయటపడిన కాంగ్రెస్ లుకలుకలు

  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల కాలంలో తీసుకొంటున్న ప్రతీ నిర్ణయం వివాదాస్పదం అవుతున్నట్లే వైజాగ్ స్టీల్ ప్లాంటుకు బయ్యారం గనుల కేటాయింపు కూడా ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. తొలుత ఈ అంశంపై ప్రతిపక్షాల నేతలు ఒకరినొకరు నిందించుకొంటూ కత్తులు దూసుకొంటుంటే, చిద్విలాసంగా నవ్వులు చిందిస్తూ, ఇందిరమ్మ (పగటి) కలలు కంటూ కులాసాగా తిరిగిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు అందులోకి కాంగ్రెస్ నేతలు కూడా వేలు పెట్టడంతో సమస్య తిరిగి ఆయన మెడకే చుట్టుకొంది.   స్వంత పార్టీ వారే రెండు వర్గాలుగా చీలి, కొందరు అది జాతీయ సంపదని, మరికొందరు తెలంగాణ సంపదని, బయ్యారంలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని కొందరు, సాంకేతికంగా కుదరదని మరికొందరు రకరకాల వాదనలు చేస్తూ గందరగోళ పరిస్థితులు సృష్టించారు. చిలిచిలికి గాలివానగా తయారయిన ఈ వివాదం ఇప్పటికే పార్టీలో సభ్యుల మద్య ఉన్నదూరాన్ని మరింత పెంచడమే కాకుండా, వారి మద్య ఉన్న తీవ్ర విబేధాలను బయట పెట్టింది. తద్వారా పార్టీలో ఎన్ని లుకలుకలున్నాయో ఒక్కసారిగా బయట పడింది.   మొదట ప్రభుత్వంపై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం, తరువాత పెంచిన విద్యుత్ చార్జీలు, ఆ వెంటనే హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులపై సీబీఐ ఆరోపణలు వంటి వరుస దెబ్బలతో సతమత మవుతున్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందాలేదా అని తీవ్ర విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాల దృష్టి మళ్ళించే ప్రయత్నంలో తలకెత్తుకొన్న ఈ బయ్యారం అంశం, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మోయలేని భారంగా మారింది.   ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన ఒంటెత్తు పోకడలతో ఇప్పటికే అనేక సార్లు ఇటువంటి పరిస్థితులు చేజేతులా తెచ్చుకొన్నపటికీ ఆయనలో మార్పు రాలేదని ఈ అంశం స్పష్టం చేస్తోంది. బహుశః ఆయన తన ‘దూకుడు’ పై మీడియాలో వస్తున్నరాజకీయ విశ్లేషణలను చూసుకొని, అది కొనసాగిస్తే మరింత సత్ఫలితాలు ఇస్తుందనే భ్రమలో మరింత దూకుడు ప్రదర్శించడం వలననే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితులు తలెత్తాయని చెప్పవచ్చును. ఒక సమస్య నుండి మరొక సమస్యలోకి పయనించడమే తన పద్దతిగా మార్చుకొన్న కిరణ్ కుమార్ రెడ్డి తన కాంగ్రెస్ పార్టీని కూడా ఇప్పుడు బయ్యారం గనుల్లోకి నెట్టారు. ప్రతిపక్షాలతో ఒక ఆట ఆదేసుకొంటున్నాననే భ్రమలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా సెల్ఫ్ గోల్ చేసుకోవడం విచిత్రం.

షర్మిల సవాల్ కు రేవంత్ రెడ్డి ప్రతి సవాల్

  వై.ఎస్. రాజశేఖర రెడ్డి కుమార్తె, వైఎస్సార్సీపీ కార్యకర్త షర్మిల పాదయాత్రలో చంద్రబాబుపై చేసిన సవాల్ ను టిడిపి అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి స్వీకరించారు.  ఖమ్మం జిల్లాలో ఫ్యాక్టరీ స్థాపించాలనే బయ్యారం గనులను వై.ఎస్. మంజూరు చేసినట్టు షర్మీల చెబుతున్నారని కానీ, కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆ మర్నాడే ఒప్పందం కుదుర్చుకున్న విషయం షర్మిలకు తెలియదేమోనని, ఈ విషయాలను తాను అసెంబ్లీలో ప్రస్తావించినా ప్రభుత్వం మందబలంతో తప్పించుకుందని, ఉక్కు పరిశ్రమను స్థాపించేందుకు అనుమతి పొందిన షర్మిల భర్త బ్రదర్ అనిల్ బంధువైన కొండలరావుకు నిజంగా 500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే సామర్థ్యం ఉందా అని, కొండలరావు బ్రదర్ అనిల్ కుమార్ కు బినామీ అని, రక్షణ స్టీల్స్, బ్రదర్ అనిల్ డైరెక్టర్ గా ఉన్న మిరాకిల్ ఫార్ములేషణ్ సంస్థల కార్యాలయాలు హైదరాబాద్ లోని డి-203, ఆదిత్య ఎలైట్, బిఎన్. మక్తా, సోమాజిగూడ అన్న చిరునామాలోనే ఉండడం ఇందుకు నిదర్శమని స్పష్టం చేశారు. మతపరమైన వ్యవహారాలూ కూడా ఈ చిరునామా నుంచే సాగించేవారని, షర్మిల ఇప్పటికైనా తట్టాబుట్టా సర్దుకుని ఇంటికెళ్ళిపోవాలని, షర్మిల పాదయాత్ర చేసినా, క్యాట్ వాక్ చేసినా మాకేమిటని, కొండలరావు మీ బినామీ కాకపొతే సిబీఐ తో విచారణను ఎందుకు కోరలేదని, షర్మిలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తన సవాల్ ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లోగా ప్రభుత్వానికి విచారణ కోరుతూ లేఖ వ్రాయాలని సవాల్ విసిరారు.

బొత్సని టార్గెట్ చేసిన కేసీఆర్

        గత కొన్నిరోజులుగా టిడిపిని టార్గెట్ చేసిన కేసీఆర్ ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిపై పడ్డాడు. బొత్సవి తిక్కమాటలని తేల్చాడు. బయ్యారంపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తలతిక్క మాటలు మానుకోవాలని టీఆర్ఎస్ అధినేత వ్యాఖ్యానించారు. బయ్యారం గనులపై మే నెలలో మహా ఉద్యమాన్ని నిర్వహిస్తామన్నారు. బయ్యారం గనుల్లో నాణ్యత లేదని బొత్స అసత్య ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. బయ్యారంపై విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. అలాగే ముఖ్యమంత్రి కిరణ్ పై కూడా కేసీఆర్ విరుచుకుపడ్డారు. తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వనన్న సీఎం కిరణ్‌ పార్టీకి ఒక్క ఓటు వేయొద్దని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణను అడ్డుకున్న చంద్రబాబుకు ఒక్క సీటు రాకుండా చేయాలని ప్రజలకు కేసీఆర్‌ సూచించారు. మొత్తానికి బయ్యారం విషయంలో కూడా సీట్ల విషయంలోనే మాట్లాడటం కేసీఆర్ అసలు ఉద్దేశ్యాన్ని బయటపెడుతోంది!

మంచువారి సపోర్ట్ వైకాపాకా లేక టిడిపికా?

  చిరంజీవితో మోహన్ బాబుకి ఉన్న వైరం పాముకి ముంగీసకి ఉన్న ఆజన్మ వైరంవంటిది. దానికి ముఖ్య కారణం తెలుగు సినిమా రంగంలో వారిద్దరి మద్య భూమ్యాకాశమంత ఉన్న తేడానే! ఇద్దరూ స్వయంకృషితో పైకి వచ్చినప్పటికీ మోహన్ బాబు ‘కలెక్షన్ కింగ్’ అనిపించుకోగలిగారు కానీ, ‘మెగా స్టార్’ అనో లేక ‘లిజండ్’ అనో అనిపించుకోలేకపోయారు. ముక్యంగా చిరంజీవిని ‘లిజెండ్’ అని అందరు మెచ్చుకొన్నపుడు, వారిద్దరూ ఒకే వేదిక మీద ఉన్నపుడే మోహన్ బాబు స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్లుగా అభ్యంతరం చెప్పిన ఘనుడు. నిజం చెప్పాలంటే అప్పటి నుండే ఆయనలో ఆత్మన్యూనత కూడా మొదలయిందని చెప్పవచ్చును.   సాధారణంగా అటువంటి సమస్యతో బాధపడేవారు అందరి కంటే ఎక్కువగా వారే తమ శత్రువుని పదేపదే తలచుకొంటూ, ఏదో రకంగా వారి ప్రస్తావన తెస్తూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నిందించడం లేదా వారిని తక్కువ చేసి మాట్లాడటం చేస్తుంటారు. ప్రస్తుతం మోహన్ బాబు కూడా అదేవిధంగా మాట్లాడుతున్నారు.   మళ్ళీ రాజకీయాలలోకి వస్తానంటున్నమోహన్ బాబు “ఒక్క సినిమా హిట్టయిపోగానే నేనే ముఖ్యమంత్రిననుకొనే వాళ్లున్నారు,’ అని అన్న మాటలు చిరంజీవి చేసిన సూపర్ హిట్ సినిమా ‘టాగూర్’ గురించేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలో ఆయన రాష్ట్రంలో అవినీతిని అవలీలగా రూపుమాపినట్లు చూపించినపుడు దానికి ప్రజలనుండి బ్రహ్మాండమయిన స్పందన వచ్చింది. అదే ఊపులో ఆయన ప్రజారాజ్యం స్థాపించడం, తనకున్న విపరీతమయిన జనాధరణతో అవలీలగా ముఖ్యమంత్రి అయిపోదామనే ఆయన ఆశపడటం, కానీ పార్టీని సరిగ్గా నియంత్రించుకోలేక ఎన్నికలలో చతికిలబడి అభాసు పాలవడం, తదనంతరం జరిగిన పరిణామాలను గమనించిన మోహన్ బాబు రాజకీయాలలోకి రావాలనే తన బలమయిన కోరికను బలవంతంగా అణచివేసుకొన్నపటికీ ఆశలు వదులుకాలేదని ఆయన తాజా ప్రకటన తెలియజేస్తోంది.   “పార్టీ పెట్టే దైర్యం, దానిని అమ్ముకొనే తెలివి తేటలు నాకు లేవని” మోహన్ బాబు వ్యంగంగా పలకడం ఎవరిని ఉద్దేశించి అన్నావో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిరంజీవిని మనస్పూర్తిగా ద్వేషించే కొద్దిమందిలో మోహన్ బాబు కూడా ఒకరు. గనుక, చిరంజీవి కేంద్రమంత్రిగా వెలుగుతున్న కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనలో మరింత ఆత్మన్యూనత పెరుగుతుందే తప్ప తరగదు. కనుక ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం లేదు.   కొంత కాలం క్రితం ఆయన చంచల్ గూడా జైలుకి వెళ్లి జగన్ మోహన్ రెడ్డిని కలిసి రావడంతో, అందరూ ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఊహిస్తున్నారు. కానీ, నేడు కాకపోతే రేపయినాఆ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే కలిసే కలుస్తుందని, లేదా అదే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నందున మోహన్ బాబు ఆ పార్టీలో చేరే అవకాశాలు లేవని భావించవచ్చును. ఒకవేళ ఆ పార్టీలో జేరినా ఆ పార్టీ తిరిగి తనను చిరంజీవి ముందే నిలబెట్టే అవకాశం ఉంది గనుక ఆయన ఆ పార్టీలో చేరకపోవచ్చును. పైగా నిష్కర్షగా మాట్లాడే ఆయన ఆ పార్టీలోఎంతో కాలం ఇమడలేరు. అందువల్ల, ఆయన తెలుగు దేశం పార్టీలో జేరే అవకాశాలే ఎక్కువున్నాయి.   నందమూరి వంశంతో తనకున్న సత్సబందాలు, అభిమానం అందుకు ఒక కారణమయితే తన ప్రియ శత్రువు చిరంజీవిని రాజకీయంగా ఎదుర్కొని ఆయనను మనసారా ఎండగట్టాలంటే అందుకు అనువయిన పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీయే గనుక, ఆయన ఆ పార్టీలోకే తిరిగి ప్రవేశించవచ్చును.   అయితే, తనకి పదవులు, అధికారం మీద ఎంత మాత్రం ఆసక్తి లేదని కేవలం పార్టీ ప్రచారంలో పాల్గొనడంపైనే ఆసక్తి ఉందని ఆయన చెప్పడం వెనుక ఉన్న బలమయిన కారణం కనీసం జీవితంలో ఒక్కసారయినా మనసారా తన ప్రియ శత్రువుని చీల్చిచెండాడగలిగితే ఆయన అహం శాంతించవచ్చును. అందుకే ఆయన ఇప్పుడు రాజకీయాలలో ప్రవేశించడం, ప్రచారంలో పాల్గొనడం గురించి మాట్లాడుతున్నారిప్పుడు. ఆయనలో ఆ అహం శాంతించితే ఎన్నికల అనతరం మళ్ళీ రాజకీయాలకి దూరం వెళ్లిపోవచ్చును.

అన్నగారి శత్రువులు..బాలయ్య కు మిత్రులు!

  నందమూరి వంశానికి, వారి స్వగ్రామం నిమ్మకూరుకి ఉన్నప్రత్యేక అనుబంధం గురించి అందరికి తెలిసిన విషయమే. స్వగ్రామం అంటే ప్రాణాలు పెట్టే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, తన ప్రతీ పధకాన్ని నిమ్మకూరు నుండే ప్రారంభం కావాలని కోరుకొనేవారు. సాధారణంగా అటువంటి గ్రామాలలో స్థానిక నేతల చేతుల్లో జరిగే శంకు స్థాపనల వంటి చిన్నచిన్న కార్యక్రమాలకు కూడా స్వగ్రామంపై అభిమానంతో ఆయనే స్వయంగావచ్చి తన స్వహస్తలతో చేసేందుకు ఇష్టపడేవారు.   నిమ్మకూరు అంటే అంత వెర్రి అభిమానం చూపే ఆయన, 1987 ఆగస్టులో నిమ్మకూరు పర్యటించనున్న తరుణంలో, కారణాలు ఏవయినప్పటికీ ఆయన తోడల్లుడు నందమూరి చంద్రం కుమారుడు వెంకటరత్నం,  పార్టీ జెండా దిమ్మెను స్వయంగా తన ట్రాక్టర్ తో కూలగొట్టడంతో, తీవ్ర కలత చెందిన యన్టీఆర్ ఇక మళ్ళీ తన జీవితంలోఆ గ్రామంలో అడుగుపెట్టనని భీషణ ప్రతిజ్ఞ చేయడమే కాకుండా, ఆ తరువాత ఎంత మంది నచ్చజెప్పాలని చూసినా, ఎవరెన్ని సార్లు క్షమాపణలు కోరినా ఆయన తన మనసు మార్చుకోలేదు. స్వంత బందువయి ఉండి కూడా తను స్థాపించిన పార్టీ జెండాని అవమానించారనే బాధతో వారి కుటుంబాన్నికూడా చనిపోయే వరకు దూరంగానే ఉంచారు. ఆ తరువాత కూడా యన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా వెంకటరత్నంని కానీ, ఆయన కుటుంబ సభ్యుల వైపు కానీ కన్నెత్తి చూడలేదు.   అయినప్పటికీ, వారందరికీ నేటికీ నిమ్మకూరు అంటే ఒక ప్రత్యేక అభిమానం ఉంది. అదేవిధంగా నిమ్మకూరు వాసులకు కూడా నందమూరి కుటుంబం అంటే ఎనలేని అభిమానం. అయితే, ఆనాడు జరిగిన దానిని ఇంకా మనసులో పెట్టుకొని తన వారిని తన గ్రామాన్ని దూరం చేసుకోవడం ఎందుకనుకున్నారో, లేక పార్టీలో మారుతున్న సమీకరణాలకు అనువుగా తను కూడా బలం పెంచుకోవాలని తలచేరో తెలియదు కానీ, నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఆగ్రహానికి గురయిన తమ బందువు వెంకటరత్నం ఇంట్లో చాలా ఏళ్ల తరువాత ఈ మద్యనే అడుగు పెట్టారు. అంతే కాకుండా ఆయన కుమారుడు శివరామకృష్ణ ఇంట్లో కూడా బస చేశారు. అయితే, అదే ఊరిలో జూ.యన్టీఆర్ నెలకొల్పిన తన తల్లితండ్రుల విగ్రహలవైపు ఆయన కన్నెత్తి చూడకపోవడంతో, అక్కడ నివసిస్తున్న నందమూరి వంశస్తులు కోరిక మీద విగ్రహాలకు పూలమాలలు వేసి, అక్కడి నుండి మళ్ళీ నేరుగా శివరామకృష్ణ ఇంటికి వెళ్ళిపోయారు.   బాలకృష్ణ ఈ విధంగా అకస్మాత్తుగా వారిపట్ల ఇంత అభిమానంగా వ్యవహరించడం అక్కడి ప్రజలనే కాకుండా, వెంకటరత్నం అతని కుమారుడు శివరామకృష్ణలను కూడా ఆశ్చర్య పరిచింది. అయితే, ఇందుకు కారణాలు ఇదమిద్ధంగా ఎవరూ చెప్పలేకపోయినప్పటికీ, తన సోదరుడు హరికృష్ణతో, అతని కుమారుడు జూ.యన్టీఆర్ తో పెరిగిన దూరం వల్లనే ఆయన తన స్వగ్రామంలో నివశిస్తున్న నందమూరి వంశస్తులకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారని భావించవచ్చును.   అంతే గాక, వచ్చే ఎన్నికలలో తప్పకుండా శాసనసభకే పోటీ చేస్తానని పదేపదే చెపుతున్న బాలకృష్ణ బహుశః నిమ్మకూరు ఉన్న గుడివాడ నియోజక వర్గం నుండే పోటీ చేయాలని భావిస్తునట్లయితే, ఆ ప్రయత్నాలలో భాగంగానే పాత విబేధాలు పక్కన పెట్టి, మళ్ళీ తనవారి మద్దతు కూడగట్టుకొంటునారని భావించవచ్చును.   జూ.యన్టీఆర్ స్థాపించాడనే కారణంతో, తన తల్లితండ్రుల విగ్రహాలకు కూడా బాలకృష్ణ పూలదండలు వేయడానికి ఇష్టపడక పోవడం చూస్తే, ఆయనకి తన సోదరుడు హరికృష్ణపై, అతని కుమారుడు జూ.యన్టీఆర్ పై ఎంత కోపం ఉందో అర్ధం అవుతోంది. ఇక, బాలకృష్ణ చర్యలకు ఆయన సోదరుడు ఎటువంటి ప్రతిచర్యలు ప్రదర్శిస్తారనే దానిని బట్టి బాలకృష్ణ అంతర్యం అర్ధం చేసుకొనే వీలుంటుంది.   కానీ, తన తండ్రి వద్దనుకొన్నవెంకటరత్నం, అతని కుమారుడు శివరామకృష్ణలను కూడా అక్కున చేర్చుకొనేందుకు సిద్దపడుతున్న బాలకృష్ణ, స్వయాన్న తన సోదరుడిని, అతని కుమారుడిని ద్వేషించడం, దూరం చేసుకోవడం సమంజసంగా లేదు. ఈ రోజు వారినిరువురినీ ద్వేషించి, మళ్ళీ కొన్నేళ్ళ తరువాత ఇదే విధంగా మనసు మార్చుకొని పాత కక్షలను, మనస్పర్ధలను పక్కన బెట్టి కలుసుకొందామని ఆయన భావించవచ్చును. కానీ, అప్పటికే చాలా ఆలస్యం, తిరిగి చక్కదిద్దుకోలేనంత నష్టం జరిగిపోయి ఉంటుంది.   మొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ బ్యానర్లను ఆయుధంగా చేసుకొని తమతో ఆడుకోగలిగిదంటే కారణం వారి ఈ బలహీనతలు అది కనిపెట్టగలిగినందునేనని చెప్పవచ్చును. అందుకే పెద్దలు ‘ఇంటి గుట్టు లంకకు చేట’న్నారు.