కాంగ్రెస్ దెబ్బకి రాహుల్ భవిష్యత్ ఫినిష్!

  ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప రాష్ట్రంలో దాదాపు అన్ని పార్టీలకు ఈసారి ఎన్నికలు అతిముఖ్యమయినవి. తెరాస, వైకాపాలు మొట్ట మొదటిసారిగా ప్రభుత్వ పగ్గాలు చేజిక్కించుకొనేందుకు తహతలాడుతుంటే, తెదేపా ఈ ఎన్నికలలో గెలవకపోతే తన ఉనికే ప్రమాదం గనుక విజయమో వీర స్వర్గమో అన్నట్లు పోరాడేందుకు సిద్దం అవుతోంది. ఇక రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్, అందుకు సహకరించిన బీజేపీలు మాత్రం ఈ రేసులో అందరి కంటే వెనుకబడిపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. కానీ, బీజేపీ-తెదేపాల మద్య ఎన్నికల పొత్తులు కుదిరితే బీజేపీ కూడా బలపడే అవకాశం ఉంటుంది. కానీ, తెరాస హ్యాండివ్వడంతో తెలంగాణాలో, పార్టీ దాదాపు ఖాళీ అయిపోయిన కారణంగా సీమాంద్రాలో కూడా కాంగ్రెస్ ఘోరంగా దెబ్బ తినబోతోంది.   రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగోలేకపోయినా, కనీసం దేశంలో మిగిలిన రాష్ట్రాలలోనయినా విజవకాశాలు ఉండి ఉంటే, ఎన్నికల తరువాత ఆంధ్ర, తెలంగాణాలలో ఎన్నికయిన పార్టీలు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు తోడ్పడి ఉండేవి. కానీ, దేశంలో వివిధ రాష్ట్రాలలో కూడా ప్రాంతీయ పార్టీలదే పూర్తి రాజ్యం నడుస్తోంది గనుక కాంగ్రెస్ పార్టీ ఏవో రెండు మూడు ఈశాన్య రాష్ట్రాలలో, దక్షిణాన్న కర్ణాటకలో తప్ప మరెక్కడా గెలిచే అవకాశాలు కనబడటం లేదు. కనీసం దాని మిత్రపక్షాలయినా గెలిస్తే కొంతలో కొంత ఊరట లభిస్తుంది. కానీ మోడీ మాయలో పడి వారు కూడా ఎన్డీయే కూటమికి జంపైపోతే ఇక కాంగ్రెస్ ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలనే కల పగటికలగానే మిగిలిపోతుంది. ఇదంతా కాంగ్రెస్ స్వయంకృతాపరాధమేనని చెప్పక తప్పదు.   కాంగ్రెస్ అధిష్టానం చాలా దురాలోచన చేసి దక్షిణాదిన తనకు కంచుకోట వంటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్నితన హస్తాలతో తానే స్వయంగా బ్రద్దలు కొట్టుకొని, కన్నకొడుకుల వంటి స్వంత పార్టీ నేతలను కాదని, వేరెవరి చేతికో అధికారం అప్పజేప్పెందుకు  సిద్దం అయ్యింది. తత్ఫలితంగా ఈసారి కేంద్రంలో కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు సన్నగిల్లిపోయాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలంత మెజార్టీ సాధిస్తే తప్ప, రాష్ట్రం నుండి ఎవరి మద్దతు దొరకదు. సోనియా గాంధీ తన ముద్దుల కొడుకు రాహుల్ గాంధీని ఎలాగయినా ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలని ఇంత రిస్క్ తీసుకొని కధ నడిపిస్తే చివరికి అదే కారణంగా రాహుల్ గాంధీ శాశ్వితంగా ప్రధాని పదవికి దూరం అయ్యేలా ఉన్నారు.   కాంగ్రెస్ నిసహ్హాయ స్థితి, రాహుల్ గాంధీ భవిష్యత్తు తలచుకొంటే పాపం జాలేస్తుంది.

తెలంగాణాలో నేటి నుంచి నామినేషన్లు

      రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. తెలంగాణాలో తొలివిడత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ఈ రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నేపథ్యంలో నామినేషన్ల దాఖలు లో తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ వెల్లడించారు. స్థానికంగా ఉన్న ఆస్తులతోపాటు విదేశాల్లోని ఆస్తులు, అప్పుల వివరాలను, పోలీసు కేసులుంటే ఆ వివరాలూ అఫిడవిట్‌లో పొందుపరచాలి. ఏ ఒక్క సమాచారం లేకపోయినా నామినేషన్లను తిరస్కరిస్తామని చెప్పారు. నామినేషన్ జారీ తేదీ నుంచి ఈ నెల తొమ్మిదో తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని, పదో తేదీన పరిశీలించి, 12న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తామని, అదే రోజు గుర్తులు కేటాయిస్తామని చెప్పారు.   అభ్యర్థి నామినేషన్ దాఖలు చేయనున్న నియోజకవర్గం పరిధిలోని పది మంది ఓటర్లు ఆయన పేరును ప్రతిపాదించాలి. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థి అయితే ఒక్కరు చాలు. పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థి రూ. 25వేలను డిపాజిట్టుగా చెల్లించాలి. శాసనసభకు పోటీచేసే అభ్యర్థి రూ.10 వేలను డిపాజిట్లుగా చెల్లించాలి.ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అందులో సగం చెల్లించాలి.పార్లమెంటు అభ్యర్థి రూ. 70లక్షల వరకు ప్రచారానికి ఖర్చు చేయవచ్చు. అసెంబ్లీ అభ్యర్థి రూ. 28 లక్షల వరకు ఖర్చు చేయవచ్చు.

గల్లా వెంటపడిన ఎమ్మార్ భూతం

  ఎమ్మార్ భూమూలా వ్యవహారంలో ఇంతవరకు చాలా మంది నేతలు, అధికారులు కేసులలో ఇర్రుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు తాజాగా తెదేపా కండువా కప్పుకొన్న మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి వంతు వచ్చింది. ఆమె కూడా ఎమ్మార్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ దాఖలయిన ఒక ప్రవేట్ పిటిషన్నువిచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు, ఈ వ్యవహారంలో ఆమె మరియు ఆమె కుటుంబ సభ్యుల పాత్రపై విచారణకు ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు ఆమెపై ఇటువంటి ఆరోపణలేవీ రాలేదు. కానీ చిత్రంగా ఆమె పార్టీ వీడగానే ఆమెపై పిటిషను పడింది. అది కూడా మామూలు కోర్టులో గాక సీబీఐ కోర్టులో పడింది. బహుశః ఆమె రాజకీయ ప్రత్యర్ధులు రాజకీయ కారణాలతోనే సరిగ్గా ఎన్నికల సమయం చూసుకొని ఆమెపై ఈ పిటిషను వేసి ఉండవచ్చును. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎన్నికలలో గెలవడం కష్టమని భావించిన ఆమె తెదేపాలోకి మారితే, ఇప్పుడు ఈ సరికొత్త ఆరోపణలు ఆమెకు ఇబ్బందికరంగా మారనున్నాయి.

చిరంజీవికి అభిమానులు మళ్ళీ గుర్తువచ్చారు

    గత ఎన్నికల దెబ్బకి ప్రజారాజ్యం పార్టీని, దాని ఆశయాలను, చివరికి తన అభిమానులను కూడా  మరిచిపోయిన చిరంజీవి అనే ఓ మెగాజీవి కాంగ్రెస్ గంగలో మునిగి పునీతులయిపోయారు. ఆ పుణ్యఫలం వలన అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ వచ్చిన ఆ జీవి మరెన్నడూ తన అభిమానులని పట్టించుకోకపోయినా, వారు మాత్రం టంచనుగా ఆయన పుట్టిన రోజు, ఆయన కొడుకు పుట్టిన రోజులని కూడా గ్యాపకం పెట్టుకొని తమ రక్తం ధార పోస్తూనే ఉన్నారు. కానీ రాష్ట్ర విభజన వ్యవహారం బెడిసికొట్టిన తరువాత, తమ్ముడు పవన్ కొట్టిన దెబ్బతో మళ్ళీ ఆయన మెల్లమెల్లగా అభిమానులను గుర్తుపట్టగలుగుతున్నారిపుడు. అందుకే మళ్ళీ అందరినీ పేరుపేరునా పిలుస్తూ తమ్ముడు పెట్టే సమావేశానికి వెళ్ళవద్దని కూడా చెప్పగలిగారు.   అయితే వారిలో చాలా మంది ఆయన తమను గుర్తిస్తున్నాడని సంతోషించకపోగా, వారు కూడా ఆయనపేరు మరిచిపోయినట్లు ఆయన బస్సు యాత్రలో కనబడినప్పుడల్లా ‘పవన్ కళ్యాణ్ కి జై!’ అని అరుస్తూ తాము కన్ఫ్యూజ్ అయిపోతూ ఆయనను కూడా తెగ కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. ఇంకా వారినలాగే వదిలేస్తే ఇక శాశ్వితంగా తమ్ముడికే జై కొడుతూ తనపేరు కూడా మరిచిపోయే ప్రమాదం ఉందని, భయపడిన చిరంజీవులవారు, రఘువీరుడు, వసంత కుమారుడు వెంటరాగా ఈరోజు తన అభిమాన సంఘాలతో ఒక మీటింగ్ వేసుకొన్నారు.   చిల్లుపడిన కుండలా మారిన పార్టీలో నుండి మిగిలినవారు కూడా జారిపోకముందే అభిమానులందరికీ కూడా కాంగ్రెస్ కండువాలు కప్పేస్తే వారు మరెవరి వెనుకపోకుండా నమ్మకంగా కాంగ్రెస్ పార్టీలోనే పడి ఉంటారని మంచి ఐడియా కూడా చేసారు. కానీ ఆ గుప్పెడు మందితో కాంగ్రెస్ పార్టీని నడపడం చాలా కష్టం గనుక వారందరి చేతికీ కాంగ్రెస్ టోపీలు ఇచ్చి వీలయినంతమంది అభిమానులకి, జనాలకి కూడా అవి పెట్టి వారిని పార్టీలోకి తోలుకురమ్మని సాక్షాత్ కేంద్రమంత్రి చిరంజీవే చేతులు పట్టుకొని అభ్యర్ధించేసరికి వాళ్ళు కూడా ఐస్ అయిపోయారుట.   ఎప్పుడూ ఎక్కడో డిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దగ్గర ఆయన చేతులు కట్టుకొని వినయంగా వంగి నిలబడగా టీవీలలో చూడటమే తప్ప ఇలా తమ ముందు కూడా వినయంగా నిలబడి, ఆప్యాయంగా భుజాల మీద ఆయన అమృత హస్తాలు వేయడం ఎన్నడూ ఎరుగని అల్పసంతోషులు, ఆయన బొమ్మున్న ‘కేసీ క్రూ’ బ్యాడ్జీలు మెడలో వేసుకొని ‘జై చిరంజీవ!’ అంటూ వీరావేశంతో ఊగిపోయారుట. కేసీఆర్ రాష్ట్రాన్నే విడదీస్తే ఈ కేసీ బాబు మాత్రం కేవలం అభిమానులనే విడదీస్తే చాలు మన పనయిపోతుందని అనుకొంటున్నారుట.   కానీ లక్ష్మణుడు వంటి తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం “పాపం! అన్నయ్యను తప్పుపట్టడానికేమీ లేదు.. ఆ సోనియమ్మే అమాయకుడైన మా అన్నయ్యను వెనక నుండి రాంగ్ డైరెక్షన్ లో నడిపిస్తోంది. అసలు ఆయనకి మాట్లాడే అవకాశం ఎక్కడిచ్చారు గనుకా..” అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ భలే తమ్ముడు అనిపించుకొన్నారు. కానీ ఆయన అభిమానులు మాత్రం ఆయన మనసు మార్చుకోక పోతాడా? ఎన్నికలలో పోటీ చేయబోడా..అని ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు.

రాహుల్ గుండెలో లేడీబాంబు!

      నిన్నటి వరకూ అమేథీ నియోజకవర్గంలో తనకి తిరుగు లేదని అనుకుంటున్న ‘యువరాజు’ రాహుల్ గాంధీ గుండెలో బాంబు పడింది. ఆ బాంబు కూడా మామూలు బాంబు కాదు... మాంఛి పవర్ ఫుల్ లేడీ బాంబు. ఆ లేడీ బాంబు పేరు స్మృతి ఇరానీ. ‘క్యోంకీ సాంస్ భీ కభీ బహూ..’ సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా బోలెడంతమంది అభిమానులను సంపాదించుకున్న స్మృతి ఇరానీకి ఉత్తరాదిలో అభిమానులు వెల్లువలా వున్నారు. అ అభిమాన వెల్లువే ఆమెను పార్లమెంట్‌కి పంపించింది. ఈ లేడీ బాంబును బీజేపీ ఈసారి రాహుల్ గాంధీ మీద ప్రయోగించాలని డిసైడ్ అయింది.   ఇప్పటి వరకూ రాజీవ్ గాంధీ మీద వున్న సానుభూతే అమేథీలో గాంధీ కుటుంబాన్ని గెలిపిస్తూ వస్తోంది. ఈసారి ఆ పప్పులు అక్కడ ఉడకవన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. అవినీతిలో కూరుకుపోయిన యుపిఎ ప్రభుత్వం రాహుల్ విజయావకాశాలను సన్నగిల్లేలా చేసిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. పులిమీద పుట్రలా ఇప్పుడు ఆ స్థానం నుంచి బీజేపీ స్మృతి ఇరానీని రంగంలోకి దించడం కాంగ్రెస్ వర్గాల్లో కలవరానికి, రాహుల్ గాంధీ గుండెల్లో బాంబు పేలడానికి కారణమైంది. స్మృతి ఇరాని కేవలం నటి మాత్రమే కాదు. మంచి వక్త. తన ప్రసంగాలతో ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో సిద్ధహస్తురాలు. పరిపాలనాదక్షురాలిగా కూడా పేరు సంపాదించుకున్నారు. ఈ ఎన్నికలలో రాహుల్‌ని ఓడించడానికి ఆమె సమర్థురాలని బీజేపీ విశ్వసించింది. స్మృతి ఇరానీ రంగంలోకి దిగడంతో కాంగ్రెస్ వర్గాలు ఎలర్ట్ అయ్యాయి. గతంలో మాదిరిగా లైట్‌గా తీసుకోకుండా అమేథీ మీద అధిక శ్రద్ధ తీసుకోవాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకపోతే కాకపోయాడు కనీసం ఎంపీగా అయినా మిగలాలని ప్రయత్నాలు ప్రారంభించాయి.

ప్రకటనల కామెడీ!

      ఈమధ్య కాలంలో తెలుగులో కామెడీ సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో కామెడీ సినిమాలు కూడా లేవు. టీవీ సీరియళ్ళలో కూడా కామెడీ సీరియళ్ళు కూడా తక్కువగా వున్నాయి. తెలుగు ప్రజలు హాయిగా నవ్వుకోవడానికి అవకాశాలు తక్కువగా వున్నాయి. దీన్ని అర్థం చేసుకున్న రాజకీయ పార్టీలు ప్రకటనల రూపంలో తెలుగు ప్రజలను నవ్వించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాయి.   వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రాజకీయ ప్రకటనలు చూసి నవ్వడం మరచిపోయిన జనం కూడా పగలబడి నవ్వుకుంటున్నారు. ఏవేవో సమస్యల్లో వున్న జనం అక్కడే ఉన్న రాజకీయ నాయకుడుతో ‘ఆయనొస్తున్నాడు’ అని గాల్లోకి వేలు తిప్పడం, అది ఫ్యాన్ గుర్తుకు సింబాలిక్‌గా వుండటం చూసేవాళ్ళని బాగా నవ్విస్తోంది. ఆ తర్వాత వచ్చే ‘ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి.. దుమ్ము దులపండి’ అని బొంగురుగొంతు వాయిస్ ‘ఓవర్’ భలే కామెడీగా వుంటోంది. అసలు రాష్ట్రంలో దుమ్ముకు ఫ్యానే ప్రధాన కారణం అయినప్పుడు మళ్ళీ ఫ్యాన్‌కి ఓటేసి కొరివితో తల గోక్కోవడం ఎందుకని జనం అనుకుంటున్నారు. అలాగే సమైక్య సింహం ముసుగులో వున్న కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ జై సమైక్యాంధ్య పార్టీ ఇస్తున్న ప్రకటనలు కూడా నవ్వు తెప్పించేలా వున్నాయి. ‘చెప్పు గుర్తుకే మీ ఓటు’ అని ప్రకటనలో వినిపిస్తున్నప్పుడు జనం నవ్వులే నవ్వులు. అసలు పొలిటికల్ సీన్‌లో జై సమైక్యాంధ్ర పార్టీ వుందా అనే సందేహాలు చాలామందికి వస్తున్న సమయంలో ఈ ప్రకటన ‘ఓహో ఈ పార్టీ ఒకటి వుంది కదూ’ అని గుర్తు చేస్తూ ఆ రకంగా సక్సెస్ అవుతోంది.

ముషారఫ్‌కి ఉరేస్తారా? షూట్ చేస్తారా?

      పాకిస్తాన్ మాజీ సైన్యాధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కి ముసించింది. ఆయనగారి బతుకు ముగిపోయే సమయం ఆసన్నమైంది. పాక్ సైన్యాధ్యక్షుడి హోదాలో తిరుగుబాటు చేయడం ద్వారా పాకిస్తాన్‌ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని, దేశాధ్యక్షుడిగా నియంతలా వ్యవహరించిన ముషారఫ్ ప్రస్తుతం అనేక నేరారోపణలు ఎదుర్కొంటూ పాక్‌లో బందీగా వున్నాడు.   పాకిస్తాన్‌లో పద్ధతుల ప్రకారం ముషారఫ్ మీద ఆరోపించిన నేరాలు నిరూపణ అయితే ముందూ వెనుకా ఆలోచించకుండా చంపిపారేస్తారు. ప్రస్తుతం ముషారఫ్ గారి నేరాలన్నీ నిరూపణ అయ్యేలా వున్నాయట. ఇక కొద్ది రోజుల్లోనే ముషారఫ్‌ని రఫ్పాడించేసి పైకి పంపించడానికి అక్కడి సైన్యం సన్నాహాలు చేస్తోందట. ముషారఫ్‌ని ఉరి తీస్తారా లేక షూట్ చేసి చంపుతారా అనే డిస్కషన్ ప్రస్తుతం పాకిస్తాన్‌లో జరుగుతోంది. ముషారఫ్ లాంటి సైనికుడు బుల్లెట్‌ ద్వారా చావడానికి ఇష్టపడతాడు. ఉరి వేయడం అనేది ఒక సైనికుడికి చావుకంటే బాధ కలిగించే విషయం. మనం జాలిపడతాంగానీ, మన దేశంలో ఈ అవకాశం లేదుగానీ, అక్కడ ఓ వెలుగు వెలిగిన రాజకీయ నాయకులని అవసరమైతే చట్టప్రకారం చంపేస్తారు. గతంలో జుల్ఫుకర్ అలీ భుట్టోని కూడా అలాగే చంపేశారు. ఇప్పుడు చావుకి దగ్గరైన ముషారఫ్ కూడా తక్కువోడేమీ కాదు.. ఎన్నో వేలమందిని చంపేసిన రఫ్ కేరెక్టర్ ముషారఫ్‌ది. అధికారంలో ఉన్నంతకాలం ఇండియా మీద కయ్యానికి కాలు దువ్వాడు. పాపం పండి ఇప్పుడు చావుకోసం ఎదురుచూస్తున్నాడు.

కోదండరామ్ పై కొండా మాటల దాడి

      తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరామ్ తమపైన చేసిన వ్యాఖ్యలు బాధించాయని ఇటీవల తెరాసలో చేరిన కొండా సురేఖ అన్నారు. కోదండరామ్ తనమీద ఆగ్రహాన్ని ప్రకటించడం అన్యాయమని ఆమె ఆక్రోశిస్తున్నారు. కోదండరామ్ మీద మాటల దాడికి దిగారు. తానేదో తెలంగాణ ద్రోహి అన్నట్టు మాట్లాతున్న కోదండరామ్‌ తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడానికి ఏంచేశారో చెప్పాలని నిలదీశారు. గతంలో రాజకీయ జేఏసీ, దాని నాయకుడు కోదండరామ్ ఆదేశించినందువల్లే తాము తమ పదవులకు రాజీనామా చేశామని, అలాగే తెలంగాణ  విషయంలో యు టర్న్ తీసుకున్నందువల్లే వైసీపీ నుంచి వైదొలగామని,  అలాంటి త్యాగమూర్తులైన తనని, తన భర్తని ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు, జేఏసీ నాయకులు విమర్శించడం దారుణమని ఆమె వాపోతున్నారు. 

తొమ్మిది లోపు కౌంటింగ్!

      మున్సిపల్ఎన్నికల కౌంటింగ్ విషయంలో హైకోర్టు తీర్పు ప్రకటించింది. ఈనెల 9వ తేదీ లోపు కౌంటింగ్ పూర్తి చేయాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల కమిషన్ షెడ్యూలు ప్రకారం రేపటి నుంచి కౌంటింగ్ జరపాల్సి వుంది. అయితే ఇప్పుడే మున్సిపల్ ఫలితాలు ప్రకటిస్తే ఆ ఫలితాలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌ మీద ప్రభావం చూపే అవకాశం వుందని, అందువల్ల ఫలితాలను వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ విషయంలో కోర్టు తీర్పు కోసం రాజకీయ పక్షాలు ఆసక్తిగా ఎదురుచూశాయి. ఫలితాలు ముందుగా విడుదల చేస్తే ఓటర్లు ప్రభావితులవుతారని దాఖలైన పిటిషన్లను హై కోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల ఫలితాలను ఈనెల 9 లోపు విడుదల చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కౌంటింగ్‌కి సన్నాహాలు ప్రారంభించింది.

పొత్తులు సరే..నేతలు సహకరించుకొంటారా?

  తెలుగుదేశం-బీజేపీల మధ్య పొత్తులు దాదాపు ఖరారయినట్లు తాజా సమాచారం. తెలంగాణాలో ఎనిమిది లోక్ సభ, 45 అసెంబ్లీ సీట్లను బీజేపీకి కేటాయించేందుకు తెదేపా ఇప్పటికే సంసిద్దత వ్యక్తం చేస్తుండగా, అందుకు దాదాపు అంగీకరించిన బీజేపీ వీలయితే అదనంగా మరి కొన్ని స్థానలయినా సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందువల్ల బహుశః ఈరోజు లేదా రేపటికల్లా పొత్తులు కధ సుఖాంతమయినట్లు ప్రకటించే అవకాశం ఉంది.   అయితే ఇంతకాలం తెదేపాతో పొత్తులను తీవ్రంగా వ్యతిరేఖించిన కిషన్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి వంటి బీజేపీ నేతలు తేదేపాకు ఎంతవరకు సహకరిస్తారనేది ప్రశ్నార్ధకమే. రెండు పార్టీల మధ్య పొత్తులు కుదిరినప్పటికీ బీజేపీ నేతలు సహకరించకపోయినట్లయితే, అప్పుడు తెదేపా నేతలు కూడా అదేవిధంగా వ్యవహరించవచ్చును. అదే జరిగితే రెండు పార్టీల అభ్యర్ధులకు తీవ్ర నష్టం జరగవచ్చును. అందువల్ల తెదేపా-బీజేపీ అగ్రనేతలు పొత్తులకోసం ఎంత శ్రమించారో, తమ నేతల మధ్య సహకారం పెరిగేందుకు కూడా అంతే శ్రమించ వలసి ఉంటుంది. లేకుంటే వారి మధ్య ఉన్న ఈ విభేదాల వలన కాంగ్రెస్, తెరాసలు ప్రయోజనం పొందడం తధ్యం.

తప్పు దిద్దుకుంటున్న పవన్!

      అన్నయ్య చిరంజీవితో పోలిస్తే తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి ఆలోచన కాస్త ఎక్కువే అనొచ్చు. పైకి ఆవేశంగా కనిపించినా, లోపల ఆలోచన వుందనడానికి ఆధారాలు బయటపడుతున్నాయి. మొదట పవన్ ఆలోచనని ఆవేశం డామినేట్ చేసినా, ఆ తర్వాత ఆలోచించి తెలివైన నిర్ణయం తీసుకుంటాడని అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.   పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఆవేశంగా ప్రకటించడం ఆయన చేసిన మొదటి పొరపాటు. పార్టీని ప్రకటించకుండానే తన ఆవేదనను వ్యక్తం చేయవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని సరైన దిశలో నడిపించే నాయకత్వం గురించి ప్రస్తావించొచ్చు. అయితే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో తప్పడుగులు వేశాడు. పార్టీని ప్రకటించాకగానీ, పవన్ కళ్యాణ్‌కి పార్టీ పెడితే సరికాదు.. దాన్ని నడపటం, క్షణానికో మాట మార్చే రాజకీయ నాయకులతో వేగటం కష్టమని తెలిసొచ్చింది. దాంతో  పార్టీ కార్యకలాపాలను ప్రకటించకుండానే తనలోని ఆవేశానికి విశ్రాంతి ఇచ్చాడు. ఎన్నికలలో పోటీ చేయాలన్న ఆవేశాన్ని విరమించుకుని ఆలోచనాత్మకంగా వ్యవహరించాడు. తాను ఇప్పుడు ఎన్నికలలో పోటీ చేసి గెలిచేది లేకపోయినా, ఓట్లని చీల్చి సమర్థమైన నాయకత్వానికి ఇబ్బంది కలిగించే అవకాశం వుందని గ్రహించాడు. పవన్ కళ్యాణ్ ఎన్నికల నుంచి తప్పుకోవడం ఆయన చేసిన చాలా తెలివైన పని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దాంతోపాటు కేంద్రంలో మోడీకి, రాష్ట్రంలో చంద్రబాబుకి మద్దతుగా మాట్లాడ్డం కూడా మంచి పరిణామమని అంటున్నారు. రాజకీయాల్లో అనుభవం లేకపోయినా సరైన సమయంలో సరైన విధంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ పరిణితిని కనబరిచాడని ప్రశంసిస్తున్నారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా ఇప్పటికీ రాజకీయ అపరిపక్వతతో విలసిల్లే చిరంజీవి భవిష్యత్తులో రాజకీయ పాఠాలు నేర్చుకోదలుచుకుంటో ఎవరిదగ్గరకో వెళ్ళడం కాకుండా పవన్ కళ్యాణ్ దగ్గరే నేర్చుకుంటే బాగుంటుందని సూచిస్తున్నారు.  

తెలంగాణాలో దూసుకుపోతున్న తెదేపా

  తెలంగాణా ఉద్యమాలు, రాష్ట్ర విభజన వ్యవహారాలలో తెలంగాణాలో బాగా దెబ్బతిన్న తెదేపా మళ్ళీ క్రమంగా పుంజుకొని ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, తెరాసలకు ఎదురునిలిచి పోరాడగల ఆత్మస్థయిర్యాన్ని ప్రదర్శిస్తోంది. ఒకవేళ బీజేపీతో పొత్తులు కూడా ఖరారయినట్లయితే, తెలంగాణా సాధించిన కారణంగా గెలుపు ఖాయమని భావిస్తున్న తెరాస, కాంగ్రెస్ పార్టీలు రెండూ కూడా చెమటోడ్చక తప్పని పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యం లేదు. కొద్ది రోజుల క్రితం మెహబూబ్ నగర్ లో తెదేపా నిర్వహించిన ప్రజాగర్జన సభకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. అందుకే మళ్ళీ వెంటనే మరో రెండు సభలు నిర్వహించేందుకు తెదేపా సిద్దం అవుతోంది.రేపు వరంగల్లో,ఎల్లుండి కరీంనగర్ లో ప్రజాగర్జన బహిరంగ సభలు నిర్వహించేందుకు తెదేపా భారీ సన్నాహాలు చేస్తోంది.   బీజేపీతో పొత్తుల విషయం కూడా తేలిపోయిన తరువాత, ఆ పార్టీ నేతలతో కలిసి మరిన్ని సభలు నిర్వహించాలని తెదేపా భావిస్తోంది. ఒకవేళ పొత్తులు కుదరకపోయినట్లయితే, తెదేపా వెంటనే తన అభ్యర్ధుల పేర్లను ప్రకటించి వారితో కలిసి ప్రచారం మొదలుపెట్టేందుకు సిద్దంగా ఉంది. ఏమయినప్పటికీ, తెదేపా తెలంగాణాలో ఊహించని విధంగా మళ్ళీ బలం పుంజుకొని తన ప్రత్యర్ధుల కంటే ముందు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

జగన్ పై పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు

  ఇటీవల వైజాగ్ లో బహిరంగ సభ నిర్వహించిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అనేక విషయాలపై సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేయడంతో రాజకీయ నాయకుల నుండే కాక ప్రజల నుండి కూడా విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. అయితే ఈనాడు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పార్టీ, దాని ఉద్దేశ్యాలు, వివిధ పార్టీ అధినేతల గురించి మరికొంత స్పష్టత ఇచ్చేరు.   ఎన్నికలలో పోటీ చేసే ఆలోచన లేనప్పుడు పార్టీ ఎందుకు పెట్టారనే అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ “రాష్ట్రంలో, దేశంలో ప్రస్తుతం నెలకొన్న విచ్చినకర పరిస్థితులను చూస్తూ కూర్చోలేకనే తాను పార్టీని పెట్టాను తప్ప ఎన్నికలలో పోటీ చేయాలనే ఏకైక లక్ష్యంతో కాదని జవాబిచ్చారు. కానీ పోటీ చేసేందుకు తగిన అభ్యర్ధుల కోసం తాను వెతికినట్లు ఆయన అంగీకరించారు. అయితే ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో తాను కూడా కొందరు అభ్యర్ధులను పోటీలోకి దింపడం వలన వ్యవస్థకు లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందనే ఉద్దేశ్యంతోనే వెనుకంజ వేసినట్లు చెప్పారు. అయితే 2019 ఎన్నికల నాటికి జనసేన పార్టీ పూర్తిస్థాయిలో పోటీ చేసేలా తాను కృషిచేస్తానని అన్నారు. ఈలోగా రెండు రాష్ట్రాలలో అధికారం చెప్పట్టే రాజకీయ పార్టీలను ప్రజల తరపున నిలదీస్తానని తెలిపారు. అందుకోసం తాను ఇకపై సినిమాలలో నటించడం సగానికి సగం తగ్గించుకొంటానని తెలిపారు.   ఇక, పవన్ కళ్యాణ్ తన వైజాగ్ సభలో కాంగ్రెస్ నేతలను పేరుపేరునా విమర్శించినప్పటికీ, తన సోదరుడు చిరంజీవిని కానీ, జగన్మోహన్ రెడ్డిపై కానీ గట్టిగా మాట్లాడకపోవడాన్ని కూడా చాలా మంది తప్పు పట్టారు. దానికి సమాధానంగా నేను వ్యక్తిగతంగా ఎవరినీ ద్వేషించడం లేదు. వారి సిద్దాంతాలను మాత్రమే విమర్శిస్తున్నాను. కానీ ఒకవేళ నా సోదరుడు చిరంజీవి నోరు విప్పి మాట్లాడినా ఎటువంటి ప్రయోజనమూ ఉండేది కాదని చెపుతూ పవన్ అన్నయ్యను వెనుకేసుకు వచ్చారు.   వ్యక్తిగతంగా ఎవరినీ ద్వేషించను అంటూనే జగన్మోహన్ రెడ్డిని మాత్రం తీవ్రంగా విమర్శించారు. తాను ఎన్నో ఏళ్ళపాటు శ్రమిస్తే తప్ప కొద్దిపాటి ఆస్తులను కూడా సంపాదించలేకపోయానని, అయినప్పటికీ గత రెండేళ్లలో సరయిన హిట్స్ లేక ఆదాయపన్ను కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడిందని, కానీ జగన్మోహన్ రెడ్డి కొద్దిపాటి సమయంలోనే ఏవిధంగా అన్ని కోట్లు కూడబెట్టగలిగారని పవన్ ప్రశ్నించారు. ఆయనకు వ్యతిరేఖంగా ఒక గదినిండా పోగుపడిన చార్జ్ షీట్లు, ఆరోపణల పత్రాలను పెట్టుకొని ఆయన ఏవిధంగా స్వచ్చమయిన పాలన అందిస్తానని హామీ ఇస్తున్నారు? అని ప్రశ్నించారు. తన తండ్రి చనిపోయిన బాధ కూడా లేకుండా ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన పడిన ఆరాటాన్ని పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు.   అదేవిధంగా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి అవినీతిని ప్రజల జీవితాలలో ఒక భాగమేననే స్థాయికి తీసుకువచ్చి అందరినీ అవినీతిపరులుగా మార్చే ప్రయత్నం చేసారని ఆరోపించారు. తండ్రి అవినీతికి పాల్పడితే, కొడుకు అధికారం కోసం అర్రులు చాస్తున్నారని ఎద్దేవా చేసారు. జగన్మోహన్ రెడ్డిపై మోపబడిన నేరారోపణలు నిరూపింపబడక పోయినప్పటికీ,అవ్వన్నీ అబద్దాలని కొట్టిపారేయలేమని అందువల్ల ఆయన అధికారం ఆశించే ముందు, తన కేసులనుండి స్వచ్చంగా బయటపడి ఉంటే బాగుండేదని అన్నారు. అవినీతి ఆరోపణలు తప్ప ఎటువంటి పరిపాలనానుభవమూ లేని ఆయనకు అధికారం కట్టబెట్టడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు.   మంచి పరిపాలనా దక్షుడిగా నిరూపించుకొన్న చంద్రబాబు వలననే రాష్ట్రంలో మళ్ళీ సుస్థిరత ఏర్పడుతుందని ఆయన అబిప్రాయం వ్యక్తం చేసారు. అయితే చంద్రబాబు కూడా తన హయాంలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసి పొరపాటు చేసారని, కానీ మళ్ళీ అవకాశమిస్తే వాటిని సవరించుకొనే ప్రయత్నం చేస్తారని తను ఆశిస్తున్నట్లు తెలిపారు. మోడీకి మద్దతు ఈయడంపై కూడా మాట్లాడుతూ గుజరాత్ లో జరిగిన అల్లర్లకు మోడీ చాలా సార్లు పశ్చాతాపం వ్యక్తం చేసారని, అలాగని ఆయన తప్పులు చేయలేదని నేనూ భావించట్లేదని,అయితే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశానికి అటువంటి సమర్దుడయిన నాయకుడు చాలా అవసరమనే ఉద్దేశ్యంతోనే తాను ఆయనకీ మద్దతు ఇచ్చానని తెలిపారు.

సమరానికి సై అంటున్న లెజెండ్

  నటసింహం లెజెండ్ గా ప్రేక్షకులను అలరిస్తున్నారు. చిత్రం భారీ విజయం సాధించడంతో దేవుళ్ళకు మొక్కులు, ప్రేక్షక దేవుళ్ళకు కృతజ్ఞతలు తెలిపేందుకు లెజెండ్ టీం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తోంది. విశాఖపట్నం చేరుకుని సింహాచలం అప్పన్నను దర్శించుకున్న బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తానని వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో బావ చంద్రబాబుతో సమావేశం కానున్నానని తెలిపారు. పార్టీ నాయకత్వం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పారు బాలయ్యబాబు.   బాలకృష్ణ అసెంబ్లీ కి పోటీ చేస్తారా, పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగుతారా అనేది స్పష్టం కాకపోయినా ఎమ్మెల్యేగా పనిచేసేందుకే నందమూరి నాయకుడు మొగ్గు చూపుతున్నారని సన్నిహితులు చెబుతున్నారు. సెంటిమెంట్ ప్రకారం అయితే అంతపురం జిల్లా హిందూపురం, కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గాలలో ఏదో ఒక చోటు నుంచి బాలయ్య పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అభిమానులు అంటున్నారు. ఇవే కాకుండా కృష్ణా జిల్లాలోని గన్నవరం, పెనమలూరు, నూజివీడు నియోజకవర్గాల అభిమానులు కూడా తమ ప్రాంతం నుంచి బాలయ్య పోటీ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

ఎట్టకేలకు మోడీకి అద్వానీ మద్దతు

      ఎట్టకేలకు బీజేపీ అగ్రనేత అద్వానీ తమ పార్టీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీకి తన మద్దతు ప్రకటించారు. మార్పు కావాలంటే మోడీకి ఓటు వేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. మోదీని పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు నుంచి ఆయనతో అద్వానీకి సుహృద్భావ సంబంధాలు లేవు. ఇటీవల అద్వానీ పోటీ చేసే స్థానం విషయంలో నెలకొన్న వివాదంతో ఆ దూరం మరింత పెరిగిందని అంతా భావించారు. అయితే సోమవారం మహారాష్ట్రలోని శెవగావ్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న అద్వానీ మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం దేశానికి కావల్సింది నినాదాల నాయకుడు కాదు.. దృఢమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేసే నాయకుడు. అందుకే మార్పు కోసం మోదీకి ఓటేయండి అని పిలుపునిచ్చారు.

కారు జోరుకు కొండా బ్రేకులు?

  తెలంగాణలో జోరు మీదున్న కారుకు కొండా దంపతుల చేరికతో బ్రేకులు పడ్డాయి. నిన్న మొన్నటి వరకూ గులాబీ కండువాలు కప్పుకునేందుకు ఎగబడ్డ తెలుగు తమ్ముళ్ళు, కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా పునరాలోచనలో పడినట్టు సమాచారం. వైసీపీలో కీలకంగా ఉంటూ.. జగన్ పార్టీకి అనధికార తెలంగాణా ప్రతినిధిగా వ్యవహరించిన కొండా దంపతులు.. జగన్ అన్న కోసం మానుకోట రణరంగానికి ఆజ్యం పోశారు. తెలంగాణా బిడ్డలపై బందూకులు ఎక్కుపెట్టారు. గులాబీ దళపతి తీవ్ర ఆరోపణలు చేశారు. తెరాస శ్రేణులతో యుద్ధాలకు దిగారు. సీమాంధ్ర లో జరిగే సభలకు కొండా సురేఖ ప్రత్యెక అతిథిగా హాజరయ్యేవారు.   జగన్ జైలులో చేరిన నుంచీ కొండా దంపతులతో విభేదాలు మొదలయ్యాయి. పార్టీ నుంచి ఏ కారణంతో బయటకు వెళ్దామా అని ఎదురు చూసిన కొండా జంటకు జగన్ సమైక్యాంధ్ర స్టాండ్ సాకుగా దొరికింది. పార్టీకి రాజీనామా చేసేసి జగన్ పై తీవ్ర ఆరోపణలకు కూడా దిగారు మురళి, సురేఖ. ఇతర పార్టీల నుచి వలస వచ్చే వారి కోసం తెరాస గేట్లు బార్లా తెరిచింది. వలసల జాతరలో కొండా దంపతులకు గులాబీ కండువాలు వేసి ఆహ్వానం పలికారు.   ఇక అంటే ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఎవరిని పార్టీలో చేర్చుకున్నా రాని వ్యతిరేకత ఒక్కసారిగా పెల్లుబుకింది. టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సభ్యుడు చెరుకు సుధాకర్ కొండా దంపతుల చేరికను వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాం కూడా దీనిపై తీవ్రంగా స్పందించారు. టీఆర్ఎస్ తీరును ఆయన తప్పుపట్టారు. తెలంగాణా వ్యతిరేకులను పార్టీలో చేర్చుకోవడం తప్పని వ్యాఖ్యానించారు. కొండా దంపాతులను చేర్చుకోవడంపై ఇప్పుడు పార్టీలో పెద్ద చర్చే నడుస్తోంది.   నిన్న మొన్నటివరకూ మొఖం కూడా చూడకుండా గులాబీ కండువాలు కప్పేసిన కేసీయార్.. ప్రస్తుతం పార్టీలో చేరికలకు ఆచి తూచి .. బాగా ఆలోచించి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని సమాచారం.

అందరిదీ ఒకటే నినాదం?

  ఎన్నికలకు పార్టీల మేనిఫెస్టోలు విడుదలయ్యాయి. రాష్ట్రం రెండుగా విడిపోయాక రాజకీయ నేతలు ఏ రోటికాడ ఆ పాట పాడుతున్నారు. మేనిఫెస్టోలు కూడా ఇరు ప్రాంతాలకు వేరు వేరుగా విడుదల చేస్తున్నారు. తెలంగాణలో మాత్రం మేనిఫెస్టోల కంటే తెలంగాణ తెచ్చిన క్రెడిట్ తమ ఖాతాలో వేసుకుని ఎన్నికల్లో లబ్ది పొందాలని మెజార్టీ పార్టీలు వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి ఎలా వెళ్ళాలనే దానిపై పార్టీలు కేడర్ కు దిశానిర్దేశం చేస్తున్నాయి. పోరాడి తెచ్చుకున్నామని తెరాస, సీమాంధ్ర లో పార్టీ తుడిచి పెట్టుకుపోయినా లక్ష్య పెట్టకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా తెలంగాణా ఇచ్చారని కాంగ్రెస్, ఉభయసభల్లో తాము మద్దతు ఇవ్వడం వల్లే బిల్లు ఆమోదం పొందిందని బీజేపీ, విభజనకు అనుకూలంగా తమ పార్టీ లేఖ ఇచ్చిందని టీడీపీ, తాము మొదటి నుంచీ తెలంగాణాకు అనుకూలమని సీపీఐ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు వివరిస్తున్నాయి.   సమైక్యాంద్రకు కట్టుబడి ఉన్న సీపీఎం, ఎంఐఎం తెలంగాణా అభివృద్ధి మంత్రంతో ఎన్నికలకు వెళుతున్నాయి. తెలంగాణాకు తామే పాలకులు కావాలని ఉవ్విళ్ళూరుతున్న నేతలు నవ తెలంగాణా, సామాజిక తెలంగాణా, పునర్ నిర్మాణం పేరుతో ప్రచారం మొదలు పెట్టారు. మరో వైపు కాంగ్రెస్ దళిత ముఖ్యమంత్రి కార్డు ప్రయోగించింది. టీడీపీ బీసి రామబాణంతో దూసుకెళ్తామనే ఆశతో ఉంది. బీజేపీ కూడా బీసీ మంత్రం జపిస్తోంది. అధికారం దక్కించుకునేందుకు ప్రత్యెక రాష్ట్ర ఏర్పాటు, ప్రాంతం, కులం, అభివృద్ధిని అస్త్రాలుగా ప్రయోగించాయి పార్టీలు. చివరికి ఏ మంత్రం ఫలిస్తుందో.. ఎవరిని విజయం వరిస్తుందో ...

కాంగ్రెస్ ఖజానా ఖాళీ

అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారాన్ని చలాయించిన కాంగ్రెస్ పార్టీకి అకస్మాత్తుగా డబ్బు కొరత వచ్చి పడింది. ఎన్నికల జెండాలు, ఫ్లెక్సీలు, కరపత్రాలను తయారు చేసుకునేందుకు పైసల్లేని పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ నాయకులు ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ గాంధీభవన్ బొక్కసం మాత్రం ఖాళీగా దర్శనమిస్తోంది. పార్టీకి నిధులు ఇచ్చేందుకు నేతలెవరూ ముందుకు రావడం లేదు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కూడా తన చేతి చమురు ఎందుకు వదలించుకోవాలనే ఉద్దేశంతో ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ఎన్నికలు దగ్గర పడుతున్నా పార్టీ ప్రచార సామగ్రి ఇంతవరకు సిద్ధం కాలేదు. చివరకు గాంధీభవన్‌కు వచ్చే నాయకులు, మీడియాకు టీ, బిస్కెట్లు ఇచ్చేం దుకు కూడా వెనుకాడే పరిస్థితి ఏర్పడింది.   ధర్మపురి శ్రీనివాస్ పీసీసీ పగ్గాలు చేపట్టినప్పుడు కాంగ్రెస్ సభ్యత్వం కోసం కార్యకర్తలు చెల్లించిన రూ.3 కోట్లను డిపాజిట్ చేశారు. దానిపై వచ్చే వడ్డీని గాంధీభవన్ నిర్వహణకు వినియోగించేవారు. దీనికి తోడు పార్టీ అధికారంలో ఉన్నందున ప్రభుత్వాధినేత నుంచి ప్రతినెలా రూ.10 లక్షల మేరకు అనధికారికంగా సర్దుబాటు చేసేవారు. డీఎస్ నుంచి బొత్స సత్యనారాయణ పీసీసీ పగ్గాలు చేపట్టిన తరువాత గాంధీభవన్‌ను ఆధునీకరించేందుకు బ్యాంకులో ఉన్న సొమ్మంతా ఖర్చు చేశారు. కానీ కిరణ్ వచ్చాక రూ.10 లక్షలకు బదులు రూ.5 లక్షలు ఇస్తానని ప్రతిపాదించారు. దానితో విభేదించిన బొత్స ఆ సొమ్మును కూడా తీసుకునేందుకు నిరాకరించారు. మంత్రిగా తనకున్న పలుకుబడి, ఇతర నాయకుల సహకారంతో గాంధీభవన్ ఆధునీకరణ, ఇందిరా భవన్ నిర్మాణం పూర్తి చేశారు.   టీపీసీసీ, ఏపీసీసీలుగా ఏర్పడే నాటికి గాంధీభవన్ ఖాతాలో సొమ్ము రూ.2 లక్షలకు పడిపోయింది. ప్రభుత్వమే రద్దయినందున అక్కడి నుంచీ చెల్లింపులు ఆగిపోయాయి. ఎన్నికల నేపథ్యంలో గాంధీభవన్‌లో, జిల్లాల్లో కొత్తగా కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలని పొన్నాల లక్ష్మయ్య ఆదేశించారు. కానీ అందుకు అవసరమైన కంప్యూటర్, ఫోన్, టేబుల్, ఇతరత్రా సదుపాయాలకు డబ్బు లేక కంట్రోల్‌రూం నిర్వాహకులు తలపట్టుకున్నారు.   టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అబద్ధాలను, మాట తప్పిన నైజాన్ని ఎండగడుతూ ‘కేసీఆర్....వంద అబద్ధాలు’ పేరుతో బుక్‌లెట్ రూపొందించాలని పొన్నాల ఆదేశించారు. అందుకయ్యే ఖర్చులను ఎలా భరించాలో తెలియక గాంధీభవన్ సిబ్బంది బిక్కమొహం వేసుకున్నారు.

జేఏసీ- టీఆర్ఎస్ వార్ షురూ

   రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు.. అప్పుడే టీఆర్ఎస్- టీ.జేఏసీల మధ్య విభేదాలు మొదలయ్యాయి. రాజకీయాలకు అతీతంగా ఏర్పాటైన జేఏసీకి, పూర్తిస్థాయి రాజకీయాలతో మునిగి తేలుతున్న టీఆర్ఎస్ కు మధ్య మొదటినుంచే పొరపొచ్చాలున్నా, ఎప్పటికప్పుడు పరస్పర అవసరాల దృష్ట్యా సర్దుకుపోతూ వచ్చారు. ఇప్పుడు ఆ అవసరాలు తగ్గడంతో జేఏసీ నాయకులు టీఆర్ఎస్ అధినాయకత్వం మీద.. ముఖ్యంగా కేసీఆర్ మీద మండిపడుతున్నారు. ఒంటికాలిపై లేస్తున్నారు. గతంలో మహబూబ్ నగర్ ఉప ఎన్నిక సందర్భంలో కూడా జేఏసీ వర్గాలు టీఆర్ఎస్ కు సహకరించలేదన్న కథనాలు వినిపించాయి. తాజాగా కూడా మరోసారి జేఏసీ ఛైర్మన్ కోదండరాం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద మండిపడ్డారు. కొండాదంపతులను పార్టీలో చేర్చుకోవడం పార్టీ వర్గాలతో పాటు జేఏసీ వర్గాలకు కూడా సుతరామూ ఇష్టం లేదు. దీనిపైనే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.   తెలంగాణా ద్రోహులకు టిక్కెట్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి అడ్డుపడ్డ శక్తులు, వ్యక్తులను తీసుకొచ్చి, పదువులు ఇచ్చి, విశ్వాసం పోగొట్టుకోవద్దని సూచించారు. ఉద్యమ ద్రోహులకు టిక్కెట్లు ఇవ్వడం సరికాదన్నారు. అలాంటి వారికి నాయకత్వం అప్పగిస్తే, టిక్కెట్లు ఇస్తే ప్రజల విశ్వాసం సన్నిగిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.   టీ.జేఏసీ తెలంగాణ అజెండా... తెలంగాణా వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రాల్లో అమరుల స్మారక స్థూపాలను ఏర్పాటు చేయాలి ఉద్యమ సమయంలో విద్యార్థులు, ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తివేయాలి ప్రభుత్వ పథకాలను హక్కుగా అడిగే చట్టం ఉండాలి. తెలంగాణా రాష్ట్రంలో ప్రైవేటీకరణకు స్వస్తి చెప్పాలి కర్ణాటక తరహాలో లోకాయుక్త ఉండాలి. జిల్లాల్లో ఐటీ కారిడార్లు ఏర్పాటు చేయాలి. 1956 నుంచి జరిగిన భూకేటాయింపులపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించాలి. రైతుల రుణాలు మాఫీ చేయాలి.