వైసీపీ ఎమ్మెల్యేలకు నరకం చూపిస్తున్నారట

తెలంగాణలో పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలు గందరగోళంలో పడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కి ఓటేసిన తర్వాత తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వైసీపీఎమ్మెల్యేలు మదనలాల్, తాటికొండ వెంకటేశ్వర్లు తెగ బాధపడిపోతున్నారు. తమ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని, ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఒకరకంగా, తర్వాత మరోరకంగా టీఆర్ఎస్ లీడర్స్ ప్రవర్తిస్తున్నారని వాపోతున్నారట. ఇప్పుడు కనీసం పలకరించేవారే కరువయ్యారని, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, కనీసం తమ ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన చెందుతున్నారు. పార్టీలో చేరేముందు స్వర్గాన్ని చూపిస్తామని చెప్పి, ఇప్పుడు నరకం చూపిస్తున్నారని మండిపడుతున్నారు. తమకు కనీసం నియోజకవర్గ నిధులు కూడా ఇవ్వకుండా, ప్రజల్లో అవమానిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు, వైసీపీలో ఉండగా, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేదోడువాదోడుగా ఉండేవారని, కానీ పార్టీ మారడంతో ఆ పరిస్థితి ఇప్పుడు లేదని, తాము వైసీపీలో ఉన్నా బాగుండేదని వాపోతున్నారట. మరికొద్దిరోజులు వేచిచూస్తామని, అయినా టీఆర్ఎస్ నేతల్లో మార్పు రాకపోతే, మళ్లీ పార్టీ మారే అంశాన్ని ఆలోచిస్తామంటున్నారు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు

ఆ హీరో తెగ నచ్చేశాడంటున్న రకుల్

జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'నాన్నకు ప్రేమతో' ఫస్ట్ లుక్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు భారీ స్పందన వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఎంతో అందంగా ఉన్నాడని, తారక్ కెరీర్ లో ఇప్పటివరకూ ఇదే మోస్ట్ స్టైలిష్ లుక్ అంటూ పొగేస్తున్నారు. నాన్నకు ప్రేమతో ఫస్ట్ లుక్... అటు ఫ్యాన్స్ నే కాకుండా, ఇటు హీరోయిన్లను అట్రాక్ట్ చేస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ అయితే... తారక్ మోస్ట్ హ్యాండ్సమ్, మోస్ట్ స్టైలిష్ గా ఉన్నాడంటూ ట్వీట్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ న్యూలుక్ కి...ఫ్యాన్సే కాదు, హీరోయిన్లూ ఫిదా అయిపోతున్నారన్న మాట.

అది అధికారిక యాత్రా? విహార యాత్రా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటనను ముగించుకుని, హైదరాబాద్ తిరిగొచ్చేసినా విమర్శలు మాత్రం ఆగడం లేదు. అది అసలు ప్రభుత్వ అధికారిక యాత్రా? లేక విహార యాత్రకు వెళ్లారా అంటూ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి విమర్శించారు. కేసీఆర్ విహార యాత్రకు వెళ్లినట్లుందని, అది పెట్టుబడులను ఆకర్షించడానికి వెళ్లినట్లు లేదని ఎద్దేవా చేశారు. చైనా టూర్ కి వెళ్లిన వారిని చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారన్న ఆయన, అంతమందిని అసలు ఎందుకు తీసుకెళ్లారో, వాళ్లకున్న అర్హతలేంటో? తెలియడం లేదన్నారు. కేసీఆర్ చైనా టూర్ కోసం ఖర్చు పెట్టిన డబ్బును, రైతుల కోసం ఉపయోగించి ఉంటే, కనీసం ఆత్మహత్యలైనా ఆగేవని అన్నారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ... కేసీఆర్ చైనా టూర్ ఖర్చు, పర్యటన వివరాలు, వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్లుగా, ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, చైనా పర్యటన ఏంటంటూ విమర్శించారు. ఏడాది కాలంలోనే 50వేలకోట్ల అప్పులు చేసి, తెలంగాణను దివాళా తీయించారని, అందుకే ప్రపంచ బ్యాంక్ లాస్ట్ ర్యాంక్ ఇచ్చిందని ఆరోపించారు.

కదులుతున్న బస్సులో మళ్లీ గ్యాంగ్ రేప్

మహిళల రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా సరే, మృగాళ్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనతో దేశమంతా అట్టడుకినా, అలాంటి ఘోరాలు మళ్లీమళ్లీ జరుగుతూనే ఉన్నాయి. ఆగస్ట్ 5న భోపాల్ లో...కదులుతున్న కారులో మహిళపై నలుగురు యువకులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటనను మరువక ముందే, అలాంటి దారుణమే మరొకటి జరిగింది. ఈసారి కదులుతున్న బస్సులో ఓ మహిళపై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర సంచలనం కలిగించిన ఈ ఘటన భోపాల్ లోని ఎంపీనగర్ లో జరిగింది. నెలరోజుల వ్యవధిలో ఇలా వరుసగా రెండు సంఘటనలు జరగడంతో భోపాల్ వాసులు భయంతో వణికిపోతున్నారు.

బాలయ్య ‘డిక్టేటర్’ ఫస్ట్‌లుక్‌ లో ఏం మిస్సైంది

నందమూరి బాలకృష్ణ 99వ చిత్రం ‘డిక్టేటర్’ ఫస్ట్‌లుక్‌ రిలీజైంది. వినాయక చవితి సందర్భంగా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్...పోస్టర్ పై బాలయ్యను అదిరిపోయే రేంజ్ లో చూపించారు. ఓ అద్భుతమైన భవనంలో, విద్యుత్ దీపాల మధ్య ధగధగ మెరిసిపోతున్న రూమ్ లో సోఫాలాంటి సింహాసనంపై కళ్లద్దాలు పెట్టుకుని కాలు మీదు కాలేసుకుని కూర్చున్న బాలయ్య... డిఫరెంట్ స్టైల్లో తలపైకెత్తి సిగార్ తాగుతున్న బాలయ్య ఫోజు అదిరిపోయింది. శ్రీవాస్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన అంజలి, సోనాల్ చౌహాన్ నటిస్తున్నారు. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకున్న డిక్టేటర్...శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సొంతింటికి వచ్చేయమంటున్న వీహెచ్ పీ

వివిధ కారణాలతో ఇతర మతాలను స్వీకరించిన హిందువులు... మళ్లీ సొంతింటికి రావాలంటూ 'ఘర్ వాపసీ' చేపట్టిన విశ్వహిందూ పరిషత్... ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ కు కూడా ఆహ్వానం పలికింది. ఇరాన్ సినిమా 'మహ్మద్-మెసెంజర్ ఆఫ్ గాడ్'కు సంగీతం అందించినందుకు సున్నీ ముస్లిం గ్రూప్ రజా అకాడమీ...ఫత్వా జారీ చేయడంపై మండిపడ్డ వీహెచ్ పీ, ఏఆర్ రెహ్మాన్ సొంతింటికి(ఘర్ వాపసీ) రావాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించింది. ఏఆర్ రెహ్మాన్ పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఫత్వాలో వాడిన భాష అత్యంత దారుణమన్న విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్.... రెహ్మాన్ కోసం హిందూ సమాజం ఎదురుచూస్తోందని వ్యాఖ్యానించారు.రెహ్మాన్ కు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నామన్న జైన్, ఆయనకు ఎలాంటి హాని కలుగకుండా కాపాడుకుంటామన్నారు. వివిధ కారణాలతో ఇస్లాం, క్రైస్తవ మతాల్లోకి మారిన ప్రతి ఒక్కరినీ, తిరిగి హిందూమతంలోకి (సొంతింటికి) రావాలని ఆహ్వానిస్తున్నామని జైన్ తెలిపారు.

బెజవాడ మెట్రోకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం విజయవాడలో మెట్రోరైలు ప్రాజెక్టు శరవేగంగా పట్టాలెక్కుతోంది. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తిచేసి ఢిల్లీ మెట్రో శ్రీధరన్ నివేదిక ఇవ్వగా, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇప్పుడు తాజాగా కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. మెట్రో ప్రాజెక్టు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకెళ్లొచ్చని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. మొత్తం 25 కిలోమీటర్ల పొడవున రెండు లైన్లతో నిర్మాణం కానున్న విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్టును, మెట్రో గురు శ్రీధరన్ నేతృత్వంలో... ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ చేపట్టనుంది. విజయవాడలో మెట్రోరైలు పూర్తికాగానే, దాన్ని గుంటూరు వరకు విస్తరించనున్నారు.

కిడారికి గిరిజన కార్పొరేషన్ ఛైర్మన్ పదవి!

అరకు వైసీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు...పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్న కిడారి...పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ కిడారి అంటీముట్టనట్లుగానే వ్యవహరించారని చెబుతున్నారు. కొణతాల మనిషిని కావడం వల్లే తనను పక్కనపెడుతున్నారని, నియోజకవర్గంలోనూ వేరొకరికి ప్రాధాన్యత ఇస్తూ తనను సైడ్ లైన్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఇక సర్దుకుపోవడం కష్టమని కిడారి అంటున్నారట. అయితే కిడారికి తెలుగుదేశం పార్టీ గాలం వేసిందని, గిరిజన కార్పొరేషన్ ఛైన్మన్ పదవి ఆఫర్ చేయడంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు.

ఐసిస్ చెరలో మరో ఇద్దరు భారతీయులు

  ఇంతకు ముందు లిబియాలో సిర్తే పట్టణం నుంచి నలుగురు భారతీయులను కిడ్నాప్ చేసిన ఐ.యస్.ఐ.యస్. (ఐసిస్) ఉగ్రవాదులు మళ్ళీ మరో ఇద్దరు భారతీయులను కిడ్నాప్ చేసినట్లు భారత విదేశాంగ శాఖ ద్రువీకరించింది. ఆంధ్రాకు చెందిన కొసనం రామ్మూర్తి, ఓడిశాకు చెందిన రంజాన్ సమాల్ అనే ఇద్దరినీ ఐసిస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు. వారి పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది. జూలై 31న కిడ్నాప్ అయిన గోపీ కృష్ణ, బలరామ్ అనే ప్రొఫెసర్లు నేటికీ ఐసిస్ ఉగ్రవాదులు చెరలో బందీలుగానే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మరో ఇద్దరు కిడ్నాప్ చేయబడ్డారు. ఆ నలుగురిని ఉగ్రవాదుల చెరలో నుండి విడిపించేందుకు అధికారులు ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవి ఎంతవరకు సఫలం అవుతాయో ఎవరికీ తెలియదు.

లైంగికంగా హింసించి, యాసిడ్ పోసి చంపారు

తెలంగాణలో జరిగిన తొలి ఎన్ కౌంటర్ పై విరసం, ప్రజాసంఘాల నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. చంద్రబాబు తరహాలోనే కేసీఆర్ పాలనా సాగుతోందని, స్వరాష్ట్రంలోనూ రాజ్యహింస జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వరంగల్ జిల్లా తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ బూటకమంటున్న ప్రజాసంఘాలు, విరసం నేతలు... మైనింగ్ మాఫియా కోసమే...వాళ్లిద్దరికీ పట్టుకుని కాల్చిచంపారని ఆరోపిస్తున్నారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అంటూ ప్రశ్నించిన విప్లవ కవి వరవరరావు... ఎంటెక్ విద్యార్ధిని శృతిపై లైంగిక దాడికి పాల్పడి హింసించి,  యాసిడ్ పోసి కాల్చిచంపారని ఆరోపించారు.

ఇస్తావా? చస్తావా? కేబీఆర్ పార్క్ లో మరో దాడి

నిత్యం వేలాదిమంది సంచరించే కేబీఆర్ పార్క్ లో మరోసారి వాకర్స్ పై దాడి జరిగింది. వీఐపీలు, వీవీఐపీలు నివాసముండే ఖరీదైన జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. మొన్నామధ్య ఓ బడా పారిశ్రామికవేత్తపై ఏకే 47తోనే కాల్పులు తెగబడగా, ఈసారి ఓ మహిళా వాకర్ పై దాడి జరిగింది. కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న ఓ మహిళపై హఠాత్తుగా దాడి చేసిన దుండగుడు... గోల్డ్ చైన్ ఇస్తావా? చస్తావా అంటూ బెదిరింపులకు దిగాడు. మొదట సెల్ ఫోన్ ను లాక్కున్న దొంగ, మెడలోని చైన్ ను బలవంతంగా గుంజుకునేందుకు ప్రయత్నించాడు, దాంతో బాధితురాలు ధైర్యంచేసి ఎదురుతిరిగింది. ఇద్దరి మధ్యా పెనుగులాటను గమనించిన మిగతా వాకర్స్, దొంగను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. అయితే పోలీసుల తీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి, ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావిడి చేసి, కొద్దిరోజులు సెక్యూరిటీ పెట్టి, ఆ తర్వాత కనీసం అటువైపు కూడా తిరిగిచూడటం లేదని, అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వాకర్స్ ఆరోపిస్తున్నారు. నిత్యం వేలాది మంది సంచరించే కేబీఆర్ పార్క్ లో ఎప్పుడూ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నారు

తాను మోడీ కూతుర్నే అంటున్న మోడల్

హాట్ మోడల్ అవని మోడీ...తాను ప్రధాని నరేంద్రమోడీ కూతుర్ని అంటోంది. తానే కాదు దేశంలోని ఆడపిల్లలందరూ మోడీకి కూతుళ్లేనంటోంది కేలండర్ గాల్స్ నటి. దేశానికి ఆయన తండ్రి లాంటివారంటున్న అవని, మోడీ నికార్సైన నాయకుడు, స్ఫూర్తి ప్రదాత అంటూ పొగడ్తల వర్షం కురిపించింది. మీ పేరు వెనుక మోడీ ఉంది...మీరు ప్రధాని నరేంద్రమోడీకి బంధువా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు ఇలా గడుసుగా సమాధానమిచ్చింది హాట్ మోడల్. పైగా అవని మోడీ సొంత రాష్ట్రం...గుజరాతే కావడంతో...మోడీకి ఏమైనా బంధువు అవుతారేమోనని మీడియా ప్రతినిధులు రెట్టించి అడగడంతో...కాదంటూ చివరికి క్లారిటీ ఇచ్చింది. అయితే తాను మోడీకి కూతుర్నే అంటూ గడుసుగా సమాధానమిచ్చి... అందరిచూపు తనవైపు తిప్పుకుంది. దాంతో అవని తెలివైన పిల్లేనంటున్నారు బాలీవుడ్ జనాలు.

ప్రతిపక్షాలకు మర్యాద ఇవ్వడం రాదా?

  ప్రపంచ బ్యాంకు ఏపీకి అరుదైన ఘనత దక్కించిన సంగతి తెలిసిందే. దేశంలోనే పెట్టుబడులు పెట్టడానికి అనుకూల అవకాశాలు ఉన్న ప్రదేశాల్లో ఏపీ రెండో స్థానంలో నిలవడం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందించాల్సి విషయం. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ పని చేసినా విమర్శించే ప్రతిపక్ష నాయకులు మాత్రం ఏపీకి అరుదైన ఘనత రావడం విషయంలో మాత్రం నోరు మెదపడంలేదు. ఒకపక్క ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి దేశాలు పర్యటనలు చేస్తూ పెట్టుబడులు తీసుకురావడానికి కష్టపడుతున్నారు. ఇప్పుడు ఈ ర్యాంకు వల్ల దేశమంతా ఏపీ వైపే చూస్తుంది. అలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు దీనిని గౌరవించాల్సిన అవసరం ఉంది.. మీడియా సమావేశాలు పెట్టి ఒకరి మీద ఒకరి విమర్శులు చేసుకోమంటే రెడీగా ఉండే నేతలు మాత్రం ఇప్పటి వరకూ దీనిపై ఒక్కరు కూడా ప్రశంసించింది లేదు. అదే ర్యాంకు ఎక్కడో చివర్లో ఉంటే మాత్రం పనికట్టుకొని మరీ మీటింగ్ లు పెట్టి దీనిపై పెద్ద చర్చలు.. విమర్శలు చేసేవారు. నిజంగా ప్రజల కోసమే పాటుపడేవాళ్లు.. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసేవాళ్లయితే దీనిని  రాజకీయ కోణంలో చూడకుండా ఈ విషయంలో మెచ్చుకునేవాళ్లే. నిజంగా అలాగ చేసుంటే వారికి గౌరవం దక్కేది.

జగన్ రాసిన లెటర్ ను చించిపారేశారు

చంద్రబాబు తనయుడు నారా లోకేష్ దూకుడు పెంచారు. ఇక్కడ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని, అక్కడ టీఆర్ఎస్ సర్కార్ ను ఏకిపారేస్తున్నారు. కొద్దిరోజులుగా జగన్ పై విరుచుకుపడుతున్న చినబాబు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ డెవలప్ మెంట్ కు జగన్ అడ్డంకిగా మారాడని, రాజధాని నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు కలిగిస్తున్నారని ఆరోపించారు. అక్టోబర్ 22న రాజధాని శంకుస్థాపనకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంటే, మరోపక్క జగన్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి సహకరించొద్దంటూ సింగపూర్ ప్రభుత్వానికి జగన్ లేఖ రాశారని, అయితే జగన్ లెటర్ ను చదివి నవ్వుకున్న సింగపూర్ పాలకులు దాన్ని చించిపారేశారని లోకేష్ కొత్త బాంబు పేల్చారు. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ చంద్రబాబుకు మంచి పేరొస్తుందనే బాధే  తప్ప... ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందనే విషయమే గుర్తుకురావడం లేదన్నారు.

బాహుబలి మరో రికార్డు

  దర్మకమౌళి రాజమౌళి జక్కన్న చెక్కిన చిత్రం బాహుబలి. ఈ సినిమా విడుదలై ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించింది. భారతీయ సినీ చరిత్రలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించబడి అనేకమంది ప్రశంసలు అందుకున్న బాహుబలి ఇప్పుడు మరో రికార్డును సొంతం చేసుకుంది. ఈ బాహుబలి చిత్రాన్ని చైనాలోని 5000 థియేటర్లలో నవంబర్‌లో విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమా ఇన్నీ థియేటర్లలో విడుదల కాలేదు. బాహుబలి సినిమాకే ఈ అవకాశం దక్కింది. ఈస్టార్స్ అనే సంస్థ బాహుబలి హక్కులు దక్కించుకొని ఏకంగా 5000 థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయనుంది. ఈ రకంగా బాహుబలి మరో రికార్డు దక్కించుకుంది. అయితే బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ పీకే సినిమాను కూడా ఈ సంస్ధనే హక్కులు దక్కించుకొని చైనాలో రిలీజ్ చేసింది. ఈ సినిమా అక్కడ 150 కోట్లు సాధించింది. ఇప్పుడు బాహుబలి కూడా అదే రీతిలో భారీగా వసూళ్లు చేస్తుందనే నమ్మకం ఉందని.. బాహుబ‌లి చైనా ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌కుండా న‌చ్చుతుంద‌ని సంస్థ ప్రతినిధి ఫ్రాంకోయిస్ డిసిల్వా తెలిపారు.

ఇస్లాంలోకి మారతామంటున్న బ్రాహ్మణులు

బ్రాహ్మణులేంటి? ఇస్లాం మతంలోకి మారతాననడం ఏంటి అనుకుంటున్నారా? అవును మీరు చదువుతున్నది నిజమే? ఉత్తరప్రదేశ్ లోని ఓ గ్రామంలో 150మంది బ్రాహ్మణులు... తామంతా ఇస్లాంలోకి మారిపోతామంటున్నారు? అయితే ఇస్లాంపై ప్రేమతోనే, ఆ మత సంప్రదాయాలు నచ్చో...అందులో చేరతామనడం లేదు, పోలీసులపై కోపంతోనే ఆ పని చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు తమ బాలికను దళిత యువకుడు కిడ్నాప్ చేశాడని ఫిర్యాదుచేసి, పదిరోజులు కావొస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న సింఘావలీ అహిర్ గ్రామ బ్రాహ్మణులు... ఖాకీల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బాలిక ఆచూకీ కనిపెట్టి తమకు అప్పగించకపోతే, తామంతా ఇస్లాం మతంలోకి మారిపోతామంటూ పోలీసులకు విచిత్రమైన హెచ్చరిక జారీ చేశారు. కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ ఆఫీసుల ముందు కూడా ధర్నాలు చేపట్టిన బ్రాహ్మణులు...తమ ఫిర్యాదుపై అధికారులు స్పందించకపోతే, ఇస్లాంలోకి మారిపోతామంటూ కలెక్టర్ కు వినతిపత్రం కూడా ఇచ్చారు. అయితే బాలిక ఆచూకీ కనిపెట్టడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఏఎస్సీ విద్యాసాగర్ మిశ్రా తెలిపారు.

రెండు రాష్ట్రాల సమస్య.. ఉల్లిపాయ తీర్చిందా?

  రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ప్రాంతీయ బేధాల వల్ల చిన్న చిన్న సమస్యలు ఉండేవి. కాని రాష్ట్రం విడిపోయిన తరువాత మాత్రం రెండు రాష్ట్రాల మధ్య ఎప్పుడూ ఏదో గొడవ. ప్రతి చిన్నవిషయానికి గిల్లి కజ్జాలు చేసుకుంటున్నాయి. నీటి విషయంలో.. ఉద్యోగుల పంపిణీ విషయంలో ఇంకా అనేక విషయాల్లో రెండు రాష్ట్రాలు తరుచూ గొడవ పడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆశ్చర్యం ఏంటంటే రెండు రాష్ట్రాలకు మధ్య ఉన్న సమస్యలను తీర్చడానికి అటు గవర్నర్.. ఇటు కేంద్రం కూడా ప్రయత్నించింది కాని లాభం లేకుండా పోయేది. అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఒక సమస్యను ఉల్లిపాయ తీర్చింది. ఉల్లిపాయ ఏంటీ సమస్యను తీర్చడమేంటి అనేగా డౌట్. అసలు విషయం ఏంటంటే రాష్ట్రం విడిపోయిన తరువాత తెలంగాణ ప్రభుత్వం.. ఏపీ పై రవాణా పన్ను విధించిన సంగతి తెలిసిందే. దానికి ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసి పన్ను విధించవద్దని తెలంగాణా ప్రభుత్వాన్ని కోరింది. అయినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం అవేమి పట్టించుకోకుండా పన్ను విధించింది. దాంతో ఏపీ కూడా తెలంగాణ ప్రభుత్వంపై రవాణా పన్ను వేసింది. దీంతో ప్రభుత్వాల సంగతేమో కాని దీనివల్ల రెండు రాష్ట్రాల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. కాని ఇప్పుడు రాష్ట్రంలో ఉల్లిపాయ ధరలు పెరుగడంతో తెలంగాణ ప్రభుత్వం రావాణా పన్నుతో ఇబ్బందులు పడుతోంది. అదెలా అంటే రెండు రాష్ట్రాల్లోనూ ఉల్లి విక్రయాలు దాదాపు కర్నూలు రైతుల నుండే జరుగుతాయి. ఈనేపథ్యంలో ఏపీకీ రవాణా పన్ను వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ వచ్చిన సమస్యల్లా తెలంగాణా ప్రభుత్వానికే..  కిలో ఉల్లి పై రూ.6 వరకు రవాణా భారం పడుతోందట.. కానీ రైతు బజార్లలో రూ.20 కే ప్రభుత్వం కిలో ఉల్లిని ఇస్తుండడంతో ఈ రవాణా భారం కూడా నేరుగా ప్రభుత్వంపైనే పడుతోంది. దీంతో ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వానికి జ్ఞానోదయమై ఏపీ ప్రభుత్వంతో రవాణా పన్నుపై సంప్రదింపులు జరిపారు. ఏపీ అధికారులతో చర్చించి ఒక ఒప్పందానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఒప్పందం ప్రకారం ఒక రాష్ట్ర వాహనం రెండో రాష్ట్రంలో ప్రవేశిస్తే రూ.5 వేలు చెల్లించాలి.. ఆఖరికి ఏడాదికి మొత్తం మీద ఎన్నివాహనాలు తిరిగాయో లెక్కించి దాని ప్రకారం ఆ సొమ్మును రెండు రాష్ట్రాలూ సమానంగా పంచుకోవాలి.. ఇది రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం. అయితే ప్రస్తుతానికి రెండు రాష్ట్రల అధికారులు చర్చించుకున్నా ప్రభుత్వం ఆమోదం పొందాల్సి ఉంది. అంతా ఒకే అయితే అక్టోబరు 1 నుంచి ఈ ప్రోసెస్ ను రెండు ప్రభుత్వాలు అమలు చేస్తాయి. మొత్తానికి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యను ఎవరూ తీర్చలేకపోయినా ఉల్లిపాయ తీర్చింది.

వాజుపేయి కల.. చంద్రబాబు ద్వారా తీరింది

  ఏపీ ప్రభుత్వం చేపట్టిన నదుల అనుసంధానంలో భాగంగా ఈ రోజు సీఎం చంద్రబాబు పట్టిసీమ పంపు నుండి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద ఫైలాన్ ను ఆవిష్కరించారు. దీనికి కృష్ణ-గోదావరి నదుల పవిత్ర సంగమం అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, స్పీకర్ కోడెల తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ నదుల అనుసంధానం పై మాజీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించి చంద్రబాబును ప్రశంసించారు. ఈ సందర్భగా కేంద్రమంత్రి వెంకయ్య మట్లాడుతూ నదుల సంధానం అనేది వాజుపేయి కల చంద్రబాబు ద్వారా అది నెరవేరిందని.. నదుల అనుసంధానికి పట్టిసీమ తొలి అడుగు అని.. గంగా, కావేరీ నదుల అనుసంధానానికి పట్టిసీమ స్ఫూర్తి అని అన్నారు.