దేశం గూటికి కన్నా.. సత్తెన పల్లి నుంచి బరిలోకి!

ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం గూటికి చేరనున్నారా? వచ్చే ఎన్నికలలో ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగుతారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అయితే ఈ  విషయాన్ని తెలుగువన్ గత ఏడాది అక్టోబర్ లోనే  అంటే  మూడు నెలల ముందే వెల్లడించింది. అప్పట్లో  తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను   కలవడం.. భవిష్యత్తులో కలిసి పని చేస్తామంటూ పొత్తుపై సంకేతాలు ఇవ్వడంతో ఏపీలో రాజకీయవేడి రగిలింది. అదే సమయంలో బీజేపీలో అసమ్మతి రాగం భగ్గుమంది. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తన అసమ్మతి గళం విప్పారు. బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు టార్గెట్ గా విమర్శల వర్షం కురిపించారు. జనసేనతో సఖ్యత విషయంలో రాష్ట్ర నాయకత్వం విఫలమైందని కన్నా లక్ష్మీనారాయణ అప్పట్లో కుండబద్దలు కొట్టారు.  ఏపీ బీజేపీలో సమస్య అంతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతోనే అని చెప్పారు.  బీజేపీ అధిష్టానం పవన్ కళ్యాణ్ ను లైట్ తీసుకోవడం, రాష్ట్ర నాయకత్వం కూడా పవన్ కు అంతగా ప్రాముఖ్యం ఇవ్వకపోవడం వల్లే జనసేనకు బీజేపీ దూరమయ్యే పరిస్థితి వచ్చిందని కన్నా లక్ష్మీనారాయణ అప్పట్లోనే విస్పష్టంగా తేల్చి చెప్పడంతో.. జనసేనతో మైత్రిని కొనసాగించడంలో బీజేపీ నేతల ఉదాశీనతపై కమలం పార్టీలో ఇంత వరకూ నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమందని పరిశీలకులు అంటున్నారు. ముఖ్యంగా బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు కమలంలో సెగలు పుట్టించాయి. ఏపీలో బీజేపీ పరిస్థితి ఇంత దయనీయంగా మారడానికి, చివరికి రాష్ట్రంలో పార్టీకి ఉన్న ఏకైక మిత్రపక్షం కూడా దూరమవ్వడానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరే కారణమని కన్నా కుండబద్దలు కొట్టారు.  అప్పట్లో కన్నా వ్యవహారాన్నిసీరియస్ గా తీసుకున్న బీజేపీ అధిష్ఠానం ఆయనపై చర్యలకు సిద్ధమైందని కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత పరిస్థితి సద్దుమణిగిందని అంతా భావించారు. మోడీ విశాఖ పర్యటన సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ తో భేటీ కావడం, ఆ తరువాత రాష్ట్ర బీజేపీ వైఖరిలో ఒకింత మార్పు కనబడటంతో బీజేపీలో ముసలం సద్దుమణిగిందని అంతా భావించారు. అయితే ఏపీ బీజేపీలో విభేదాలు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయనీ, లోలోన రాజుకుంటూనే ఉన్నాయనీ ఇటీవలి పరిణామాలు తేల్చేశాయి. బీజేపీ జిల్లా అధ్యక్షులను సోము వీర్రాజు తొలగించడంతో రాష్ట్ర బీజేపీలో కన్నాను ఏకాకిని చేయడమే లక్ష్యంగా సోము వీర్రాజు పావులు కదుపుతున్నారన్నవిషయం స్ఫష్టమైంది. ఈ నేపథ్యంలోనే కన్నా మరోసారి తన అసమ్మతి గళం విప్పారు.    తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన జాతీయ పార్టీ బీఆర్ఎస్ లోకి ఏపీకి చెందిన  వారిని చేర్చుకోవడం.. అలా చేరిన వారిలో అత్యధికులు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడం వెనుక ఏపీ బీజేపీలోని కీలక నేత ప్రమేయం ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ఆ కీలక నేత వేరెవరో కాదు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజేనని కన్నా లక్ష్మీనారాయణ అంటున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉండగా నియమించిన పార్టీ జిల్లాల అధ్యక్షులను ఒక్కరొక్కరిగా సోము వీర్రాజు తొలగించి, ఆ స్థానంలో వేరే వారిని నియమించడం పై కన్నా గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ నుంచి బీఆర్ఎస్ గూటికి చేరిన వారిలో సోము వీర్రాజు వియ్యంకుడు కూడా ఉండటాన్ని ఎత్తి చూపుతూ కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు ఏపీ బీజేపీలో దుమారం లేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కన్నా బీజేపీకి గుడ్ బై చెప్పడం ఖాయమైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కన్నా బీజేపీని వీడి ఏ పార్టీలోకి చేరుతారన్న చర్చ తెరమీదకు వచ్చింది. ఇటీవల పవన్ కల్యాణ్ పార్టీకి అనుకూలంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన జనసేన గూటికి చేరుతారని అంతా భావించారు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు కన్నా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఆయన సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని మూడు నెలల కిందటే తెలుగువన్ చెప్పింది. అమరావతి విషయంలో  తెలుగుదేశం స్టాండ్ కు పూర్తి స్థాయిలో  మద్దతుగా నిలుస్తున్న కన్నా ఆ పార్టీలోనే చేరుతారని పేర్కొంది.   సత్తెనపల్లి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని అప్పట్లోనే తెలుగుదేశం అధినేతను కన్నా కోరారు.   అందుకు తెలుగుదేశం అధినేత ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. అదీ కాకుండా దాదాపుగా తెలుగుదేశం, జనసేనల మధ్య దాదాపుగా పొత్తు కుదిరిందనీ, సీట్ల సర్దుబాటుపై అవగాహనకు కూడా వచ్చాయనీ వార్తలు వస్తున్న నేపథ్యంలో జనసేన సత్తెనపల్లిని కోరుతున్నప్పటికీ.. కన్నా తెలుగుదేశం తరఫుర ఆ స్థానం నుంచి పోటీలో దిగితే జనసేన ఆ స్థానాన్ని వదులుకోవడానికి అభ్యంతరం చెప్పే అవకాశాలు లేవని పరిశీలకులు అంటున్నారు. 

నరేష్.. పవిత్ర.. పబ్లిసిటీ స్టంటేనా?

ఒకనాటి హీరో... ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేశ్, పవిత్ర లోకేశ్ ఇద్దరు మళ్లీ పీటలెక్కబోతున్నారంటూ ఇ  ఓ ప్రచారం అయితే గత కొంత కాలంగా జోరుగా సాగింది.    కొత్త ప్రారంభం.. మీ అందరి ఆశీస్సులు మాకు కావాలంటూ.. ఈ జంట.. కన్నుల పండగగా.. అదీ కొవ్వొత్తల వెలుగులో లిప్‌లాక్ చేసుకొంటూ ఓ వీడియో నూతన సంవత్సరం ప్రారంభ వేళ.. విడుదల చేశారు. సదరు వీడియో చివరల్లో.. గెట్టింగ్ మ్యారీడ్ సూన్ అంటూ మూక్తాయింపు ఇవ్వడంతో ఇంత కాలం జోరుగా సాగిన ప్రచారం వాస్తవమే అని అందరూ అనుకున్నారు.  అంతేకాదు దీనికి మళ్లీ పెళ్లి అనే ప్రకటనతోపాటు #పవిత్రానరేశ్ అనే హ్యాష్ ట్యాగ్‌తో సదరు వీడియో విడుదల కావడంతో వాళ్లిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారని కన్ ఫర్మ్ చేసేసుకున్నారు.   అయితే ఫిల్మ్ నగర్ వర్గాలు మాత్రం ఈ వీడియో కేవలం పబ్లిసిటి జిమ్మిక్కేనని అంటున్నాయి.  మళ్లీ పెళ్లి అనే చిత్రంలో నరేశ్, పవిత్రా లోకేశ్ జంట కలిసి నటిస్తున్నారని.. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగానే దీనిని విడుదల చేశారని.. ఆ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు నరేశ్, పవిత్రా లోకేశ్‌లు ప్రస్తుతం సహజీవనం చేస్తున్నారన్న ప్రచారం అయితే ఉంది. మరో వైపు నరేశ్ భార్య రమ్య రఘుపతి.. ఈ జంటని కర్ణాటకలోని మైసూర్‌లోని ఓ హోటల్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొవడానికి  సంబంధించిన వీడియోలు.. ఇటీవల హల్ చల్ చేసిన సంగతి విదితమే.  ఈ నేపథ్యంలోనే   నరేశ్, పవిత్రా లోకేశ్‌తో ఓ వీడియో తీసి వదిలితే.. మంచి పబ్లిసిటి వస్తోందనే ఆలోచనతో ఈ వీడియోను రూపొందించార ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఓ వదంతిని జస్ట్ అలా వదిలితే.. వచ్చే పబ్లిసిటి అలా ఇలా కాదు.. ఓ రేంజ్‌లో ఉంటుందనే ఓ ఆలోచనతో ఈ వీడియోను షూట్ చేసినట్లు ఫిలింనగర్‌లో టాక్ సాగుతోంది.    మరో వైపు.. ఈ చిత్రం నరేశ్, పవిత్రల బయోపిక్ అని కూడా ఫిలింనగర్‌లో చర్చ నడుస్తోంది. వీరిద్దరిపై ఇటీవల వచ్చిన వార్తల నేపథ్యంలో ఓ రియల్ స్టోరీతో....రీల్ స్టోరిగా తెరకెక్కించాలని చూస్తున్నారనే టాక్ సైతం హల్ చల్ చేస్తోంది. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ సైతం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఇంకోవైపు.. ఈ జంట సహజీవనంలో ఉందో లేదో.. అలాగే వీరిద్దరు పెళ్లి చేసుకుంటారో లేదో ఎవరికీ తెలియదని.. కానీ ప్రస్తుతం ఈ జంట వెండి తెరపై నటిస్తోందని.. దానిని తెలివిగా క్యాష్ చేసుకోవడం కోసం.. ఈ వీడియోని రిలీజ్ చేశారని అంటున్నారు.   

ఏపీని కేటీఆర్ మళ్లీ అనేశారు.. జగన్ కు కావలసిందీ అదేనా?

తెలంగాణ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో తన ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారుతోందని గుర్తించిన ప్రతి సందర్బంలోనూ పొరుగు రాష్ట్రాన్ని అంటే ఏపీని చులకన చేయడం.. అక్కడి పరిస్థితులు నరకంతో సమానంగా ఉన్నాయంటూ చులకన చేసి.. తాము చేసిన అభివృద్ది గురించి గొప్పలు చెప్పుకోవడం కామనైపోయింది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయి ఎనిమిదిన్నరేళ్లు గడిచిపోయింది.   ఉమ్మడి రాష్ట్రం నాటి భావోద్వేగాలు, సెంటిమెంట్లు ఇప్పుడు పెద్దగా లేవు కూడా. అయితే రాజకీయంగా తమకు అవసరమనిపించిన ప్రతి సందర్బంలోనూ తెలంగాణ మంత్రులు తమ ప్రభుత్వ గొప్ప చాటుకోవడానికి ఏపీలో అభివృద్ధి లేమిని చూపి తమ భుజాలను తామే చరుచుకుంటూ ఉండటం సర్వ సాధారణమైపోయింది. ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికల హీట్ పెరిగినప్పుడూ, ప్రభుత్వం ఇబ్బందులలో పడినప్పుడూ  తెలంగాణ మంత్రులకు తమ గొప్పలు చాటుకోవడానికి ఏపీ దుస్థితినే ఆశ్రయిస్తుంటారు. ఎందుకంటే  తెలంగాణలో ఆంధ్ర నుంచి వచ్చి స్థిరపడిన వారు ఎక్కువే ఉన్నారు.. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడే స్థిరపడిన ఆంధ్రా ప్రజలు ఇప్పటి తెలంగాణలో కూడా చెప్పుదగ్గ స్థాయిలో ఇక్కడి రాజకీయాలను మలుపు తిప్పగలరు. దాదాపు పాతిక నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలరని కూడా  ఇక్కడి రాజకీయాలలో ఓ లెక్క ఉంది. అందుకే తెలంగాణలో అధికారం దక్కాలంటే ఇక్కడ స్థిర పడిన వారి  మద్దతు అవసరం కేసీఆర్ ప్రభుత్వంలోని మంత్రులకు బాగా తెలుసు. అందుకే స్థిరపడిన ఆంధ్రుల ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మలచుకోవాలంటే ఏపీలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. తెలంగాణను మా ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ది చేసిందని చెప్పుకోవడానికి ఏపీలో అభివృద్ధి లేమిని అండగా తెచ్చుకోవడం అలవాటుగా మారిపోయింది.  అవినీతి, రెండు కళ్ల సిద్ధాంతంలో ఏపీ ప్రయోజనాలను దెబ్బతీశారంటూ, సెంటిమెంటును రెచ్చగొట్టడం ద్వారా ఇక్కడి ఆంధ్రుల మద్దతు పొందే ప్రయత్నం చేశారు. చేస్తున్నారు. గత ఏడాది మేలో  కేటీఆర్ ఇక్కడ స్థిర పడిన ఆంధ్రుల్లో జగన్ పాలన పట్ల ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడానికే.. ఏపీలో రోడ్లు, విద్యుత్ పరిస్థితి అధ్వానంగా ఉంటే తెలంగాణలో అద్భుతంగా ఉన్నాయయంటూ చెప్పుకున్నారు.   గత ఎన్నికల్లో ఎలాగైతే ఏపీలో చంద్రబాబుపై వ్యతిరేకతను తెరాస ఇక్కడ ఓట్లుగా మార్చుకుందో.. అదే విధంగా   జగన్ పై అక్కడి వ్యతిరేకతను క్యాష్ చేసుకునే వ్యూహంతోనే కేటీఆర్ తెలంగాణతో ఏపీలో పరిస్థితులను పోలుస్తూ అభివృద్ధి చిరునామాగా తెలంగాణను తీర్చిదిద్దామని చెప్పుకున్నారు.  ఇప్పుడు మళ్లీ ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో.. కేటీఆర్ మరో సారి ఆంధ్రలో పరిస్థితులపై తనదైన శైలీలో వ్యాఖ్యానించారు. తెలంగాణలో అభివృద్ధిని తెలుసుకోవాలంటే ఓ సారి ఏపీ వెళ్లి అక్కడి పరిస్థితులను చూసి రండంటూ వ్యాఖ్యలు చేశారు.   స్వచ్చ సర్వేక్షణ్ అవార్డులు తెలంగాణకు భారీగా రావడంపై హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో   కేటీఆర్ ప్రసగించారు. బీఆర్ఎస్ హయాంలో భారీగా అభివృద్ధి జరిగిందని చెప్పారు. అయితే ఎంత అభివృద్ధి జరిగిందో చెప్పుకోవాలంటే పోలిక ఉండాలి కాబట్టి పక్క రాష్ట్రాన్ని చూపించారు. ఆ రాష్ట్రం వెళ్లి చూసి వస్తే తేడా తెలుస్తుందన్నారు. ఏపీలో గుంతల రోడ్లు, విద్యుత్ కష్టాలు, తరలిపోతున్న పరిశ్రమలు,  కరవైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు పొరుగురాష్ట్రం చులకనగా చేసిన వ్యాఖ్యలను పట్టించుకునే తీరిక లేదు. ఆ రాష్ట్ర ప్రభుత్వం విమర్శలను పట్టించుకోవడం మానేసి చాలా కాలమైంది. రాష్ట్రంలో విపక్షాలు సభలు, సమావేశాలు, రోడ్ షోలను అడ్డుకోవడానికే జగన్ సర్కార్ సర్వ శక్తులను వెచ్చిస్తోంది. పైగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలలో అబద్ధమేముంది? నిజమే కదా అని తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రులే కాదు.. ఏపీ ప్రజలు కూడా అంటున్నారు. ఇలాంటి భావన ఏపీలో ఎంతగా వ్యాపిస్తే  తనకు అంత ప్రయోజనం చేకూరుతుందని జగన్ భావిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ రావాలన్న భావన కొద్ది మందిలోనైనా ఏర్పడితే.. ఆ మేరకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందన్న ఆశాభావంతో జగన్ ఉన్నారనీ, అందుకూ కూటీఆర్ ఏపీని చులకన చేస్తూ, అభివృద్ధి లేమికి ఆనవాలుగా అభివర్ణిస్తూ వ్యాఖ్యలు చేసినా స్పందించలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో తన గ్రాఫ్ పడిపోయిందని గుర్తించిన జగన్ ఇప్పుడు తన సర్వ శక్తులనూ విపక్షాల గ్రాఫ్ పెరగకుండా ఉండటంపైనే కేంద్రీకరించారని అంటున్నారు. ఇందు కోసం కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ కు రాష్ట్రంలో రెడ్ కార్పెట్ వెల్ కం చెప్పడం దగ్గర నుంచీ... తెలంగాణ మంత్రులు ఏపీ పరిస్థితులపై విమర్శలు చేసినా మౌనమే భూషణంగా భరించడం వరకూ అన్నీ చేస్తున్నారు. తనపైనా, తన ప్రభుత్వంపైనా జనంలో వ్యక్తమౌతున్న వ్యతిరేకత విపక్ష తెలుగుదేశం కు అనుకూలంగా మారకుండా ఉంటే చాలని భావిస్తున్నారు. ఇందుకు బీఆర్ఎస్ ఏపీపై విమర్శలతో దూకుడు పెంచాలని కోరుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

కమల దళంలో కొత్త నేతలకు పెద్ద పీట

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ  పాతకొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన పార్టీ పూర్తి సమయ కార్యకర్తల సమావేశంలో, పార్టీ  మిషన్ 90  టార్గెట్  గా రోడ్ మ్యాప్ సిద్దం చేసిన విషయం తెలిసిందే. సరే నిజంగా బీజేపీ  ప్రస్తుతమున్న మూడు సీట్ల నుంచి ఒకేసారి 90 సీట్లకు చేరుకుంటుందా? అది అయ్యే పనేనా అనే విషయాన్ని పక్కన పెడితే, కమల దళం ‘మిషన్ టార్గెట్’ విషయంలో తగ్గేదేలే అంటోంది. పక్కగా ప్రణాళికలను రచించుకోవడమే కాకుండా కార్య క్షేత్రంలో అడుగులు వేయడం ప్రారంభించింది.  అందులో భాగంగా క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమవడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తోంది. పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీరియస్ గా దృష్టి పెట్టిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ సునీల్ బన్సల్ పోలింగ్ బూత్ స్థాయి నుంచి కేడర్ ను పెంచుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 7,61,200 మంది పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలను ఎంపిక చేశారు. ఈ నెల 7న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా వారందరితో వర్చువల్ గా సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేయనున్నారు. తెలంగాణ కోసం బీజేపీ ప్రత్యేకంగా సరళ్ యాప్ అందుబాటులోకి తెచ్చారు. ఆ యాప్ లో బూత్ కమిటీల వివరాలు, పార్టీ వ్యవహారాలు పొందుపరచనున్నారు. ఇదిలా ఉంటే ఎంపిక చేసిన పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలందరికీ బీజేపీ ఐడీ కార్డులతో పాటు డైరీలు అందజేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు డైరీలు మెయింటెన్ చేయాలని వారికి ఆదేశించింది. నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ పరంగా బూత్ స్థాయిలో సమస్యలు, వాటి పరిష్కారానికి చర్యలతో పాటు పార్టీ బలోపేతానికి సంబంధించి అన్ని వివరాలు సేకరించాలని కార్యకర్తలకు ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 34,600 పోలింగ్ బూత్ లు ఉండగా.. ఒక్కో దానికి 22 మంది కార్యకర్తల్ని నియమించారు. వారిలో ఒకరు సోషల్ మీడియా బాధ్యతలు చూసుకోనున్నారని పార్టీ నేతలు చెపుతున్నారు.  అదలా ఉంటే, రానున్న రోజుల్లో రాష్ట్ర పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈనెల ( జనవరి) 16, 17 తేదీలలో ఢిల్లీలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో..పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డాను కొనసాగించే అంశంతో పాటు, ఈ సంవత్సరం జరగనున్న 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు, 2024లో జరిగే లోక్ సభ ఎన్నికలకు పార్టీ సమాయత్తం కావడంపై కూడా లోతుగా చర్చించనున్నారు.  ఎన్నికలే ప్రధాన ఎజెండా జరుగతున్న జాతీయ కార్యవర్గ సమావేశాల్లో, ఇతర రాష్ట్రాలతో పాటుగా ఈ సంవత్సరం చివర్లో జరిగే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ‘ప్రత్యేక’ చర్చ ఉంటుంది అంటున్నారు. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్చే విషయంతో పాటుగా, ముఖ్యమంత్రి అభ్యర్ధి విషయంలోనూ నాయకులకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. బండి సంజయ్ ని పార్టీ అధ్యక్షునిగా కొనసాగిస్తూ, ఈటలకు పదోన్నతి కల్పించే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యమంత్రి కేసేఆర్ కు అన్ని విధాల సమ ఉజ్జీగా నిలిచి, కేసీఆర్ శక్తియుక్తులను సమర్ధవంతంగా ఎదుర్కోగల సత్తా సామర్ధ్యం ఉన్న ఈటల రాజేందర్  కు పార్టీలో సీఎం స్థాయి హోదాను కల్పిస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అటు తెలంగాణ ఉద్యమ నేతల్లో, ఇటు బడుగు బలహీన వర్గాల ప్రజల్లో మంచి పటున్న ఈటల రాజేందర్ ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా తెర మీదకు తెచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈటలను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించక పోవచ్చును కానీ, పార్టీ నేతలకు క్లారిటీ  అయితే ఇస్తారని, అంటున్నారు.  ఏది ఏమైనా, ఈటలతో పాటుగా  ఇతర పార్టీల నుంచి వచ్చిన ముఖ్య నాయకులు కొందరికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఖాయంగా ఉందని అంటున్నారు.

తెరపైకి మరో స్పాన్సర్డ్ పార్టీ ?

తెలంగాణలో ఇప్పటికే లెక్కకు మించి పార్టీలున్నాయి. మరో వంక ఏపీతో సమానంగా తెలంగాణలోనూ పటిష్ట పునాదులున్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ) రీ ఎంట్రీ ఇచ్చింది. అలాగే, ఏపీలో బీజేపీ పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన తెలంగాణలో ఒంటరి పోరాటానికి సిద్డమవుతోంది. గత ఎన్నికల నాటికి లేని వైఎస్ షర్మిల పార్టీ వైఎస్సార్ టీపీ కొత్తగా తెరపై కొచ్చింది. కేఏ పాల్ పార్టీ,  తెలంగాణ ప్రజల పార్టీ, ఇంటి పార్టీ, కోదండరాం పార్టీ తెలంగాణ జన సమితి ( టీజేఎస్) ..  ఐపీస్ మాజీ అధికారి, ఆర్ ఎస్ ప్రవీణ కుమార్ సారధ్యంలో కొత్తగా అడుగులు వేస్తున్న బీఎస్పీ .. ఇలా చెప్పుకుంటూపోతే ..  చాలా చాలా పార్టీలే ఉన్నాయి. అయితే అందులో ఎన్ని పార్టీలు ఎన్నికల రాజకీయాలను సీరియస్ గా తీసుకుంటున్నాయి? ఏయే పార్టీలు, పరోపకారార్ధం పుట్టుకొస్తున్నాయి, స్పాన్సర్డ్  పార్టీలు ఎన్ని, అనేది చెప్పడం కొంచెం కష్టం. అయినా, మంది పెరిగే కొద్ది మజ్జిగ పలచనవుతుంది,అనేది మాత్రం నిజం.అందుకే, అధికార బీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వ వ్యతిరేక, ప్రతిపక్ష అనుకూల ఓటును సాధ్యమైన మేరకు ముక్కలు ముక్కలు చేసేందుకు, చీల్చేందుకు, కొన్ని పార్టీలను స్పాన్సర్ చేస్తోందనే విమర్శ చాలా కాలంగా వినవస్తోంది. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా, కొత్త కొత్తగా పుట్టుకొస్తున్న పార్టీలు, ఆ పార్టీల పట్ల అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వం యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు  గమనిస్తే, ఏ పార్టీని ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, ఎవరు  ఎవరు వదిలిన  బాణమో .. అర్థం చేసుకోవడం కష్టం కాదని రాజకీయ పండితులు పేర్కొంటున్నారు.  అదలా ఉంటే, తెలంగాణ రాజకీయ ముఖ్య చిత్రంలో, త్వరలోనే, బీఆర్ఎస్ చెప్పుచేతల్లో పనిచేసే మరో స్పాన్సర్డ్  పార్టీ తెర మీదకు వస్తుందని, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లో సంక్రాంతి తర్వాత మరో కొత్త ప్రాంతీయ పార్టీ రాబోతోందని మీడియా సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే బీజేపీ నేత ఉభయ తెలుగు రాష్టాలకు సంబంధించి మరో కీలక కీలక వ్యాఖ్య చేశారు.ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరిపాలనను పక్కన పెట్టి, ఎన్నికల రాజకీయాలలో తల మునకలయ్యారని, ఆ ఇద్దరి పరస్పర సహకారంతో  పార్టీలను పుట్టిస్తున్నారని అంటున్నారు. కాగా, ప్రభాకర్ ఏ పార్టీ గురించి ఈ వ్యాఖ్య చేశారనే విషయం పక్కన పెడితే,  ఏపీకి చెందిన ఒక ముఖ్య నేత సారథ్యంలో తెలంగాణలో కొత్త పార్టీ పుట్టుకోస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని 27 నియోజక వర్గాల్లో ఆంధ్రా సెటిలర్ల ఓటును చీల్చే లక్ష్యంతో, ఈ కొత్త పార్టీ పుట్టుకొస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ, టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్న నేపధ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొత్త పార్టీని తెర మీదకు తెస్తున్నారని అంటున్నారు. అయితే  రాజకీయ విశ్లేషకులు మాత్రం, ఒక సారి ప్రజల్లో వ్యతిరేకత వస్తే, బ్యాలెట్ పేపర్ మీద ఎన్ని పార్టీలు, ఎన్ని గుర్తులున్నా, అధికార పార్టీని ఓడించే పార్టీని గుర్తించి, గురి చూసి ఓటు వేస్తారని అంటున్నారు. అలాగే ఎన్నికల రాజకీయాల్లో వన్ ప్లస్ వన్  రెండు కావాలన్న నియమం లేనట్లే, మైనస్ ప్లస్ మైనస్ .. మైనస్ కావాలనే నియమం లేదని.. అంటున్నారు.

సలహాదారుల చట్టబద్ధతను తేలుస్తాం.. ఏపీ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సలహాదారులు ఎంతమంది? వారికి ఇచ్చే జీతభత్యాల సంగతేంటి? వారంతా ఎవరికి.. ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? అనే అంశాలపై ఏపీలోని సాధారణ ప్రజల్లో కూడా చర్చ జరుగుతోంది.  జగన్ రెడ్డి సర్కార్ ప‌దుల సంఖ్య‌లో సలహాదారులను నియమించుకుంది. ఆ సంఖ్య 70కి పైనే ఉంటుంది.   వారిలో చాలా మందికి  మందికి కేబినెట్ ర్యాంకు కూడా ఇచ్చింది.  ఆ హోదాలోనే లక్షల్లో జీత భత్యాలు ఇస్తోంది. అంటే   సలహాదారులకు అందరికీ కలిసి నెల నెలా కోట్ల రూపాయలు జీత భత్యాల రూపంలో ప్రజాధనాన్ని పందేరం చేస్తోంది.   ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కన్నా.. సలహాదారులకే ఎక్కువ జీతం ఇస్తున్నారని అంటున్నారు.  సలహాదారుల నియామకంపై ఎంత మంది ఎన్ని రకాలుగా విమర్శలు గుప్పిస్తున్నా.. న్యాయస్థానం సైతం  ఇంత మంది స‌ల‌హాదారులా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నా,  విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నా జగన్ సర్కార్ నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు  అన్న చందంగా  సలహాదారుల నియామకాల విషయంలో తగ్గేదేలే అంటూ ముందుకు సాగుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఇంత మంది సలహాదారుల నుంచి ఎలాంటి సలహాలు స్వీకరిస్తున్నది ఒక బ్రహ్మ రహస్యం.   అసలే ఆర్థికంగా దిగజారిపోయి, అప్పుల ఊబిలో కూరుకుపోయి, ఉద్యోగులకుర నెలనెలా సక్రమంగా జీతాలివ్వలేని దుస్థితిలో ఉన్న రాష్ట్రంలో సలహాదారుల పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయడం ఏమిటని ఆర్థిక రంగ నిపుణులు  ప్రశ్నిస్తున్నారు. ఇంత మంది సలహాదారులను నియమించుకున్న జగన్  ప్రభుత్వాన్ని హైకోర్టు కడిగి పారేసింది.  సలహాదారుల నియామకంపై దాఖలైన పిటిషన్ గురువారం (జనవరి 5)న హైకోర్టు విచారించింది. ఇలాగే వదిలేస్తే రేపు ఎమ్మార్వోలకు కూడా సలహాదారులను నియమిస్తారేమో అంటే వ్యాఖ్యానింది. ఐఏఎస్‌ అధికారులు ఉండగా వివిధ శాఖలకు సలహాదారులు ఎందుకని  ప్రశ్నించింది. సలహాదారుల నియామక రాజ్యాంగ బద్ధతను తేలుస్తామని స్పష్టం చేసింది. సలహాదారులకు సంబంధించిన పూర్తి వివరాలు కోర్టు ముందుంచాలని ప్రభుత్వాన్నిఆదేశించింది. 

కర్నాటకలో హంగ్.. కాంగ్రెస్ కే స్వల్ప ఆధిక్యం.. పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడి

కర్ణాటకలో వచ్చే ఏప్రిల్‌/మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ నిర్వహించిన ఫస్ట్  ట్రాకర్‌ పోల్‌ సర్వేలో వెల్లడయ్యింది. ఒక  వెబ్‌సైట్‌ కోసం పీపుల్స్‌పల్స్‌  సిస్రో  తో కలిసి తాజాగా నిర్వహించిన సర్వేలో రాష్ట్రంలోని సంపూర్ణ మెజారిటీ ఏ పార్టీ సాధించే అవకాశం లేదని తేలింది. అయితే అత్యధిక స్థానాలలో కాంగ్రెస్ విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొంది.  అయితే ఏ పార్టీ కూడా అధికారం చేపట్టేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను చేరుకునే అవకాశాలు లేవని కూడా పీపుల్స్ పల్స్ సర్వే లో వెల్లడైంది.  పీపుల్స్‌పల్స్‌  మొదటి ట్రాకర్‌ పోల్‌ ను గత ఏడాది  డిసెంబర్  22 నుండి 31 వరకు నిర్వహించారు. పది రోజుల పాటు జరిగిన ఈ సర్వే వివరాలను సంస్థ గురువారం (జనవరి 5) విడుదల చేసింది.  ఎన్నికల లోపు మరో రెండు విడతల్లో రాష్ట్రంలో ఈ సర్వే చేయనున్నట్లు పేర్కొంది.  కర్ణాటకలో గత మూడున్నర దశబ్దాలుగా అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా వరుసగా రెండో సారి విజయం సాధించిన చరిత్ర లేదు. దక్షిణ భారత దేశంలో కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి, ఇక్కడ అధికారం నిలుపుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తోంది. 2022లో ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో వరుసగా రెండోసారి తామే అధికారంలోకి వచ్చినట్టు ఇక్కడ కూడా పట్టు సాధించి, తిరిగి అధికారం నిలుపుకుంటామని బీజేపీ చెబుతోంది. మరోవైపు, హిమాచల్‌ ప్రదేశ్‌లో అధికార మార్పు సంప్రదాయం కొనసాగినట్లే ఇక్కడ కూడా అధికార పార్టీ పరాజయం పాలయ్యి, తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌, జేడి(ఎస్‌)లు ధీమాతో ఉన్నాయి. పీపుల్స్‌ పల్స్‌-సిస్రో నిర్వహించిన మొదటి ట్రాకర్‌ పోల్‌ సర్వే ప్రకారం 224 అసెంబ్లీ స్థానాల్లో 101 స్థానాలు (ప్లస్‌/మైనస్‌ 9 స్థానాలు) సాధించి కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. అధికార బీజేపీ 91 స్థానాలకు (ప్లస్‌/మైనస్‌ 7 స్థానాలు) పరిమితమవుతుందని, జేడి (ఎస్‌) 29 (ప్లస్‌/మైనస్‌ 5 స్థానాలు), ఇతరులు మూడు స్థానాలు సాధించవచ్చని ట్రాకర్‌పోల్‌లో తేలింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 113 ను ఏ పార్టీ సాధించలేదు.   

మాస్టర్ ప్లాన్ వెనక మరో మాస్టర్ ప్లాన్

కామారెడ్డి మాస్టర్ ప్లాన్  వివాదం ఒక్కసారిగా భగ్గుమంది. పట్టణ నూతన మాస్టర్‌ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ యువ రైతు రాములు ఆత్మహత్య చేసుకోవడంతో, పెద్ద ఎత్తున రైతులు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. కామారెడ్డి మున్సిపాలిటీ తీసుకొచ్చిన మాస్టర్ ప్లాన్‌తో భూములు నష్టపోయిన రైతుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి భారీగా అన్నదాతలు తరలివచ్చారు. మరో వైపు పోలీసులు కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కలెక్టర్ కార్యాలయం ముందు రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. మరోవైపు యువ రైతు రాములు మృతికి నిరసనగా అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామ పంచాయతీ పాలకవర్గం రాజీనామా చేసింది. సర్పంచ్ సహా తొమ్మిది మంది వార్డు సభ్యులు రాజీనామా చేశారు. కామారెడ్డి కొత్త మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిజానికి  మంత్రి కేటీఆర్ అన్నట్లుగా ఇదేమీ ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ప్రభుత్వ అధికారులు  తీసుకున్న నిర్ణయం కాదు. పోలీసులు సృష్టించిన వివాదం కాదు. పక్కాగా ఒక పథకం ప్రకారం సర్కార్  స్వాములు తెర వెనక నుంచి జరిపించిన ఉదంతంగా పరిశీలకులు భావిస్తునారు. నిజమే, కావచ్చు , చావు కబురు చల్లగా చెప్పినట్లు, మాస్టర్ ప్లాన్  కు వ్యతిరేకంగా రైతులు రోడ్లమీడకు వచ్చే వరకు మౌనంగా తమ పని తాము చేసుకు పోతున్న అధికారులు, ఇప్పుడు రైతులు ఆందోళనకు దిగిన తర్వాత స్థిమితంగా వచ్చి,  ముసాయిదా ప్లాన్ మాత్రమే సిద్దమైందని, ఇంకా అప్రూవ్ కాలేదని చెప్పడం వెనక మతలబు ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. అదే నిజం అయితే, అదే విషయాన్ని రైతులకు చెప్పేందుకు జిల్లా కలెక్టర్ కున్న అభ్యంతరం ఏమిటని, రైతులు అడుగుతున్నారు. అలాగే, కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నాలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించినట్ల్గుగా  కామారెడ్డి ఎస్పీ రైతులకు సున్నితంగా దమ్కీ ఇవ్వడంలో అంతరార్ధం ఏమిటి? మరో వంక తనేమీ దమ్కీ ఇవ్వలేదని అంటూనే, ఎస్పీ మరోమారు మీడియా సాక్షిగా  తాను అనుకుంటే నిమిషంలో అంతా తీసెయ్యగలనని..  కానీ అలా చేయనన్నారు. దమ్కీ ఇచ్చేవాడినే అయితే రఘునందన్ రావు హైదరాబాద్ లోనే ఉండేవాడని ఎస్పీ పేర్కొనడం తెర వెనక కథను తెర మీదకు తెచ్చింది.  మరోవంక కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయంలో రైతుల ఆందోళనపై మంత్రి కేసీఆర్ స్పందించారు. అసలు మాస్టర్ ప్లాన్ ఏమిటని కామారెడ్డి కమిషనర్ ను ప్రశ్నించారు. ఈ అంశం గురించి తనకు తెలియదని చెప్పారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ స్టేజీలో ఉందన్న విషయాన్ని ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నారని అధికారులను ప్రశ్నించారు. ప్రజాభిప్రాయం ప్రకారం మార్పులు చేర్పులు చేస్తామని చెప్పొచ్చు కదా అని అన్నారు.మాస్టర్ ప్లాన్ వల్ల ఓ రైతు చనిపోయాడంట కదా అని కమిషనర్ను కేటీఆర్ ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా మాస్టర్ ప్లాన్ ఉండాలని తానెప్పుడు చెప్పలేదని అన్నారు. ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టాలనే ఉద్ధేశ్యం తమకు లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజల అభ్యంతరాలను వెంటనే స్వీకరించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు.  ఈ మొత్తం వ్యవహారాన్ని గమనిస్తే ప్రభుత్వం ఏదో దాచే ప్రయత్నం చేస్తోంది. దాల్ మే కుచ్  కాలా హై ..అంటున్నారు.

మల్లారెడ్డి, గంగుల ఔట్.. బండా ప్రకాశ్, బాల్కసుమన్ ఇన్.. కేసీఆర్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ?

సంక్రాంతి తరువాత ఏ రోజైనా కేసీఆర్ తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తు కూడా పూర్తి చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి తరువాత  ప్రారంభం కానున్న కొత్త సచివాలయంలో కొత్త కేబినెట్ కొలువుదీరుతుందని చెబుతున్నారు. ప్రస్తుత కేబినెట్ నుంచి ఇద్దరు మంత్రులుకు ఉద్వాసన పలికి, కొత్తగా ఇద్దరికి స్థానం కల్పించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.  కొత్తగా కేబినెట్ లోకి తీసుకోనున్న ఇద్దరు మంత్రులకు ఇప్పటికే ఆ మేరకు సమాచారం కూడా పంపించారని చెబుతున్నారు. ఇక ఉద్వాసనకు గురి కానున్న ఇద్దరు మంత్రుల విషయానికి వస్తే వారి తీరు తరచూ వివాదాస్పదం అవుతుండటం, ఆ వివాదాస్పద తీరు కారణంగా ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుండటం కారణమని అంటున్నారు. వీరిద్దరికీ ఉద్వాసన పలకడం ద్వారా అధికారం ఉందనీ, అధిష్ఠానం అండ ఉందనీ ఇష్టారీతిగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదన్న స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లు చెబుతున్నారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఉద్వాసన, చేర్పులకు సంబంధించి సీనియర్ నాయకులతో కేసీఆర్ ఇప్పటికే గోప్యంగా చర్చలు జరిపి రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. సాధారణంగా కేసీఆర్ కేబినెట్ సహచరులతో, అధికారులతో స్నేహపూర్వకంగానే వ్యవహరిస్తారు, అయితే కట్టు దాటుతున్నారని అనిపిస్తే మాత్రం అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు మాజీ మంత్రులు రాజయ్య, ఈటల ఉదంతాలను ఉదహరిస్తున్నారు. ఇటీవలి కాలంలో మంత్రులు మల్లారెడ్డి, గంగులల వ్యవహార శైలి పట్ల కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారనీ అందుకే వారికి ఉద్వాసన పలకాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారంటున్నారు. వారి స్థానంలో ఎమ్మెల్సీ బండా ప్రకాష్, ఎమ్మెల్యే బాల్క సుమన్ లకు కేబినెట్ లో చోటు కల్పించనున్నారంటున్నారు.  

రేవంత్ ఖేల్ ఖతం దూకుడుకు బ్రేకులు

ఇప్పడు కాదు, చాలా కాలం క్రితం, ఆయన పీసీసీ చీఫ్ గా అప్పాయింట్ అయిన కొత్తల్లో కావచ్చు   ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ రాజకీయాలు అర్థం చేసుకోవడం అనుకున్నంత ఈజీ వ్యవహారం కాదని  అన్నారు. ఇప్పుడు ఆయన పరిస్థితి చూస్తుంటే ఇప్పటికీ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ రాజకీయాలు పూర్తిగా అర్థమైనట్లు లేదు. నిజానికి రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఎలా వచ్చింది అనేది అందరికీ తెలిసిన విషయమే. సంచులు చేతులు మారాయి అనే ఆరోపణలలో నిజం వుందో లేదో కానీ  రాహుల్ గాంధీ సంపూర్ణ  మద్దతుతోనే రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి దక్కింది అనేది మాత్రం, రేవంత్ రెడ్డి సహా అందరూ హండ్రెడ్ పెర్సెంట్  అంగీకరిస్తున్న విషయం. పంజాబ్ పీసీసీ చీఫ్ గా నవజ్యోతి సింగ్ సిద్దు, తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డి పేర్లను రాహుల్ గాంధీనే ఓకే చేశారు. అందుకే, రేవంత్ రెడ్డి నియామకాన్ని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు చాలా వరకు అయిష్టంగా అంగీకరించారే కానీ, హృదయపూర్వకంగా స్వాగతించలేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన సీనియర్ నాయకులు...  ఎక్కడో పుట్టి ఇంకెక్కడో పెరిగి వచ్చిన రేవంత్ రెడ్డి  మూడేళ్ళు అయినా నిండకుండానే, పార్టీ బాస్ గా పెత్తనం చెలాయించడం అనే ఉహనే, జీర్ణించుకోలేక పోయారు. అందుకే ఆయన అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి ఏదో ఒక రూపంలో అసమ్మతి సెగ రాజుకుంటూనే వుంది. మునుగోడు  ఉప ఎన్నిక  ఓటమికి కూడా రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల పార్టీ సీనియర్  నాయకుల అసమ్మతి, వ్యతిరేకతలే కారణం.    అలాగే  నిన్నటిదాక కాంగ్రెస్ రాష్ట్ర  వ్యవహారాల ఇన్ చార్జిగా వ్యవహరించిన మాణిక్యం ఠాగూర్‌  కారాణాలు ఏవైనా రేవంత్ రెడ్డికి, అన్ని విధాల సహకరిస్తూ వచ్చారు. నిజానికి మునుగోడు ఓటమి తర్వాత తిరుగుబాటు జెండా ఎగరేసిన తర్వాత, జీ 9 అసమ్మతి నేతలు  రేవంత్ రెడ్డి వ్యవహర సరళిని, ఒంటెద్దు పోకడలను ఎంతగా వ్యతిరేకించారో, మాణిక్యం ఠాగూర్‌  వ్యవహార శైలిని అంతలా ఎండగట్టారు. ఆ ఇద్దరి కారణంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరుకుందని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి తప్పొప్పులకు కర్త, కర్మ,క్రియ అన్నీ ఠాగూరే అని ఫిర్యాదు చేయడమే కాకుండా ఆయన స్థానంలో రాష్ట్ర రాజకీయల పట్ల అవగాహన ఉన్న  సీనియర్ నాయకులను రాష్ట్ర వ్యవహారాల బాధ్యునిగా నియమించాలని కేంద్ర దూతగా వచ్చిన దిగ్విజయ్ సింగ్ వద్ద మొర పెట్టుకున్నారు.  అయితే ఇది పార్టీని బతికించుకునేందుకు చేసిన ప్రయత్నమా  అంటే కాదు. ఠాగూర్‌ కు ఉద్వాసన పలికితే పీసీసీ అధ్యక్ష పదవి నుంచి రేవంత్ రెడ్డిని సాగనంపడం ఈజీ అవుతుందని భావించిన సీనియర్లు  వ్యూహాత్మకంగా పావులు కదిపారు.  ఏదైతే నేమి, చివరకు ఫస్ట్ రౌండ్ లో రేవంత్’పై సీనియర్లు విజయం సాధించారు. దిగ్విజయంగా ...ఠాగూర్‌ ను గోవాకు పంపారు.  ఆయన స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నూతన బాధ్యునిగా, మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు మాణిక్‌రావు థాకరేను ఏఐసీసీ అధిష్టానం నియమించింది. దీంతో ఇప్పటికే సీనియర్ల నుంచి సమస్యలు ఎదుర్కుంటున్న రేవంత్ రెడ్డి ముందు ముందు మరింతగా  సమస్యలు ఎదుర్కోక తప్పదని అంటున్నారు.  మాణిక్‌రావు థాకరే మహారాష్ట్రకు చెందిన నేత.  గతంలో ఆయన మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. బీజేపీ, శివసేన ప్రభుత్వాలను తీవ్రంగా విమర్శించిన నాయకుడిగా ఆయనకు పేరుంది. ఆయన్ను తెలంగాణకు బాధ్యునిగా యమించడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. మాణిక్యం ఠాగూర్‌ ను దిగ్విజయంగా సాగనంపిన సీనియర్లకు నెక్స్ట్ టార్గెట్ రేవంత్ అవుతారని అంటున్నారు. మరో వంక రాహుల్ గాంధీ పార్టీ వ్యవహారాలలో పెద్దగాజోక్యం చేసుకోవడం లేదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లతో దీర్ఘకాల సైద్ధాంతిక పోరాటానికే రాహుల్ ప్రాధాన్యత ఇస్తున్నారు.  పార్టీ సంస్థాగత వ్యవహరాల్లో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు గాంధీ ఫ్యామిలీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. చివరకు పార్టీలో తన పాత్ర ఏమిటో కూడా అధ్యక్షుడు ఖర్గేజీ  నిర్ణయిస్తారని రాహుల్ గాంధీ పలు మార్లు స్పష్టం చేశారు. భారత్ జోడో యాత్ర తెలంగాణలో సాగుతున్న సమయంలోనూ రాహుల్ గాంధీ అదే విషయం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇక ఎంతో  కాలం పీసీసీ పదవిలో కొనసాగలేరని పరిశీలకులు అంటున్నారు.  అందుకే కావచ్చు  రేవంత్ రెడ్డి స్వరం మారిందని, దూకుడుకు బ్రేకులు పడ్డాయని అంటున్నారు.  బుధవారం(జనవరి 4) పీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన శిక్షణ తరగతుల్లో రేవంత్ రెడ్డి అయిందేదో అయింది, ఇకపై విభేదాలు మరచి అందరం ఒకటిగా కలిసి కట్టుగా పని చేద్దామని పిలుపు నిచ్చారు. అంతే కాదు ఇంకో అడుగు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే మెరుగైన స్థాయికి వెళుతుందననుకుంటే తన పీసీసీ పదవి వదులుకుంటానని చెప్పారు. పీసీసీ వదులుకుంటే పార్టీ అధికారంలోకి వస్తుందంటే.. తాను రాజీనామా చేయడానికి సిద్ధమని అన్నారు.  పార్టీలో చిన్న చిన్న గొడవలు ఉంటాయని.. నేతలు సర్దుకుపోవాలని సూచించారు. తాను ఎవరినీ ఇబ్బంది పెట్టాలని అనుకోలేదని అన్నారు. అదుకే నిన్న మొన్నటి వరకు సీనియర్ నాయకులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ఛీ .. ఛా .. అంటూ అవమానించిన రేవంత్ రెడ్డిలో ఈ మార్పు దేనికి సంకేతం  అనే చర్చ రాజకీయ వర్గాల్లో వినవస్తోంది. ఠాగూర్‌ ఉద్వాసనతో రేవంత్ సీటుకు ముప్పు పొంచి ఉన్నట్లేనని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే, రేవంత్ ఖేల్ ఖతం  అనే మాట పార్టీ సీనియర్ నేతల నోట వినవస్తోందని   అంటున్నారు. అయితే  రాజకీయ పరిశీలకులు మాత్రం  రేవంత్ రెడ్డికి తక్షణ ఉద్వాసన ఉండక పోవచ్చును కానీ, ఆయన దూకుడుకు మాత్రం బ్రేకులు పడినట్లే అంటున్నారు.

చంద్రబాబు సహా తెలుగుదేశం కీలక నేతల అరెస్టుకు రంగం సిద్ధం?

అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరన్నట్లుగా,  నిషేధం ఉత్తర్వులు, లాఠీచార్జీలతో తెలుగుదేశం ప్రభంజనాన్ని నిలువరించడంలో విఫలమైన వైసీపీ ఇక ఆ పార్టీ నేతలను అరెస్టు చేయడానికి సిద్ధ పడుతోంది. పరిస్థితులు చూస్తుంటే వైసీపీ సర్కార్ అందుకే సిద్ధపడిందని అనిపించక మానదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బయటకు తెలియని అలజడి రేగుతోంది. ఎప్పుడేం జరుగుతుందో అర్దం కాని పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం కార్యాలయాలు, కీలక నేతల నివాసాల ముందు పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. చంద్రబాబు ప్రస్తుతం ఉన్న కుప్పం తెలుగుదేశం కార్యాలయం వద్ద అయితే వేల సంఖ్యలో పోలీసులు మోహరించి ఉన్నారు. కుప్పంలోకి బయటి వ్యక్తులెవరినీ రానీయడం లేదు. పార్టీ కార్యాలయం చుట్టూ ముళ్ల కంచెలు వేసి దిగ్బంధించారు. దీంతో ఏ క్షణంలోనైనా చంద్రబాబును పోలీసులు అరెస్టు చేయవచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తెలుగుదేశం శ్రేణులు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు.  తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు సహా ఆ పార్టీ నేతలందరినీ అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైనట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబును ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశాలున్నాయన్న ప్రచారంతో తెలుగుదేశం శ్రేణులు భారీగా పార్టీ కార్యాలయం వద్దకు చేరుకుంటున్నారు. కాగా కుప్పం పార్టీ కార్యాలయం ఎదుట పోలీసులు ముళ్ల కంచెలతో బారికేడ్డు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు కార్యాలయం వద్ద మోహరించారు. కుప్పంలోనికి బయట నుంచి ఎవరినీ అడుగు పెట్టనీయకుండా వేల మంది పోలీసులు మోహరించారు. కుప్పంలోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు ప్రజల నుంచి వినతి పత్రాల స్వీకరణ, నియోజకవర్గ నేతలతో వరుస భేటీలు, నియోజకవర్గ సమస్యలపై నేతలతో చర్చలతో బిజీగా ఉన్నారు. కార్యాలయం బయట కూడా పెద్ద సంఖ్యలో జనం వేచి ఉన్నారు.   అలాగే పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో మోహరించి  ఉండటంతో అక్కడ ఏ క్షణంలో ఏం జరుగుతుందా అన్న టెన్షన్ కనిపిస్తోంది. ఇలా ఉండగా చంద్రబాబును అరెస్టు చేయవచ్చన్న ప్రచారంతో కుప్పం పార్టీ కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో తెలుగుదేశం శ్రేణులు చేరుకుంటున్నాయి. చంద్రబాబును కుప్పంలో ఏ క్షణంలోనైనా అరెస్టు చేయవచ్చన్న ప్రచారానికి బలం చేకూరే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం కార్యాలయాలు, నాయకుల ఇళ్ల వద్ధ కూడా పోలీసులు భారీగా మోహరించారు. తెలుగుదేశం అధినేతను అరెస్టు చేస్తే ఎక్కడా ఎవరూ ఆందోళనలకు దిగకుండా తెలుగుదేశం నాయకులను ముందస్తు అరెస్టు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకుడు నక్కా ఆనందబాబును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలను, కీలక నేతల నివాసాలను పోలీసులు చుట్టు ముట్టడంతో ఏం జరుగుతోందో, ఎం జరుగుతుందో అర్దం కాని పరిస్థితి నెలకొని ఉంది.  ఆ పార్టీ నేతలందరినీ అరెస్టు చేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ స్థాయిలో తెలుగుదేశం కార్యాలయాలు, నేతల నివాసాలను పోలీసులు చుట్టుముట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలులో ఉందా అని తెలుగుదేశం శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. లేదా మావోయిస్టు పార్టీని నిషేధించినట్లు తెలుగుదేశం పార్టీని కూడా నిషేధించారా అంటూ నిలదీస్తున్నారు. విపక్ష నేతలపై ఇలా పోలీసుల ప్రయోగం ఈ స్థాయిలో ఎమర్జెన్సీ సమయంలో కూడా జరగలేదంటున్నారు. ఇప్పటికే కుప్పంలో బుధవారం పోలీసుల లాఠీ చార్జి నేపథ్యంలో నిషేధం అమలులో ఉన్న చంద్రబాబు రోడ్ షో నిర్వహించడానికి ప్రయత్నించడమే కాకుండా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై కేసు నమోదైందని చెబుతున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఎఫ్ ఐఆర్ లను అయితే బయట పెట్టడం లేదు. ఆ కేసు ఆధారంగా చంద్రబాబును అరెస్టు చేయాలన్నది పోలీసులు వ్యూహంగా చెబుతున్నారు. ఇంతే కాకుండా కందుకూరు, గుంటూరులలో తొక్కిసలాటలకు సంబంధించి కూడా చంద్రబాబుపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టుకు రంగం సిద్ధం చేశారన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు చేస్తున్న హడావుడి చూస్తుంటూ ఏదో పెద్ద ప్రణాళికే ఉందని తెలుగుదేశం శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు సహా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కీలక నేతలందరినీ అరెస్టు చేయడానికి రంగం సిద్ధమైందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  

రాజకీయ అవతారం ఎత్తిన సివిల్ సర్వెంట్స్

చిన్న పిల్లలను పెద్దయ్యాక ఏమవుతావు, అంటే ఒకడు డాక్టర్ అంటాడు ఇంకొకడు యాక్టర్ అవుతానంటాడు ... ఇంకొకడు ఇంజినీర్ మరొకరు లాయర్ అంటాడు. ఇంకోడు టీచర్,  సివిల్ సర్వెంట్ (ఐఎఎస్, ఐపీఎస్,ఐఎఫ్ఎస్) సైంటిస్ట్, ఇంకా అదో ..ఇదో ఇంకేదో అవుతానని అంటారు. కానీ, రాజకీయ నాయకుడు అవుతాననే వాళ్ళు మాత్రం చాలా చాలా తక్కువగా కోటికొక్కరుగా ఉంటారు. కానీ,చివరకు నదులన్నీ సముద్రంలో కలుస్తాయి అన్నట్లుగా...  డాక్టర్లు, యాక్టర్లు, ఐఎఎస్, ఐపీఎస్ లుఇతర ఉన్నత పదవుల్లో ఉన్నవారు చివరకు న్యాయమూర్తులు, ఒకరని కాదు, సహస్ర వృత్తుల సెలబ్రిటీలు  చాలా వరకు అవకాశం చిక్కితే రాజకీయ అరంగేట్రం చేసేందుకు రెడీ అయిపోతుంటారు. అందరి విషయం ఎలా ఉన్నా, సివిల్ సర్వెంట్ల విషయం కొంచెం చాలా భిన్నంగా ఉంటుంది. సివిల్ సర్వెంట్  కావడమే జీవిత ఆశయంగా అహోరాత్రులు కష్ట పడతారు. ఒక విధంగా ఒక తపస్సులా, ఒక మహా యజ్ఞంల కష్టపడి సివిల్ సర్వీసెస్ పూర్తి  చేస్తారు.  అయితే అంత కష్టపడి చేరుకున్న గమ్యం నుంచి  కొందరు సివిల్ సర్వెంట్స్ కొంత కాలం తర్వాతనే కావచ్చును రాజకీయలపై మనసు పారేసుకుంటారు. ఎమ్మెల్యే, ఎంపీ కాలం ఖర్మం కలిసొస్తే మంత్రి, ముఖ్యమంత్రి కావాలని  కోరుకుంటారు. అయితే అలాంటి  కోరిక ఎంత మందిలో ఉన్నా  అటు సివిల్ సర్వెంట్స్ గా ఇటు రాజకీయ నాయకుడిగా జోడు గుర్రాల స్వారీ చేసి సక్సెస్ అయిన వారు కొద్ది మందే కనిపిస్తారు. అందులో మన జీపీ, జేడీ లక్ష్మినారాయాణ,ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి కొందరు ఉన్న ఉద్యోగం వదులుకుని రాజకీయ అరంగేట్రం చేస్తే, మాజీ మంత్రి విజయరామ రావు, మాజీ ఐఏఎస్ అధికారి ఐవీఆర్ కృష్ణా రావు వంటి కొందరు మరి  కొందరు పదవీ విరమణ చేసిన తర్వాత, సెకండ్ ఇన్నింగ్స్ లో రాజకీయ అరంగేట్రం చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పుడొక సారి అలా జాతీయ రాజకీయాల్లో ప్రముఖ భూమిక పోషించిన  మాజీ సివిల్ సర్వెంట్స్...ఎవరని చూస్తే,  కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరు ముందుగా వినిపిస్తుంది.  ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లోప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన యశ్వంత్ సిన్హా  1960లో ఐఏఎస్  ఆఫీసర్ గా  ప్రభుత్వ విధుల్లో జాయినయ్యారు. 1984 వరకు వివిధ హోదాల్లో ప్రభుత్వ అధికారిగా కొనసాగారు. ఆ తర్వాత జనతాదళ్ లో చేరారు .. ప్రధాని చంద్రశేఖర్ మంత్రి వర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు. చంద్రశేఖర్ ప్రభుత్వం పడిపోయిన వెంటనే  బీజేపీలోకి జంప్ చేశారు. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో ఆర్థిక, విదేశాంగ శాఖల మంత్రిగా పనిచేశారు. 2018లో బీజేపీకి రాజీనామా చేశారు. చివరకు తృణమూల్ కాంగ్రెస్ లో చేరి రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసే ముందు, తృణమూల్ కు రాజీనామా చేశారు.  అలాగే లోక్ సభ మాజీ స్పీకర్, మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రాం కుమార్తె  మీరా కుమార్, 1973లో ఐఎఫ్ఎస్ ఆఫీసర్  గా జీవితాన్ని ప్రారంభించారు. 1985లో రాజకీయాల్లో ప్రవేశించారు. నాలుగు పర్యాయాలు లోక్ సభకు ఎన్నికైన ఆమె 2004 నుంచి 2009 వరకు కేంద్ర మంత్రిగా,  2009 నుంచి 2014 వరకు లోక్ సభ స్పీకర్ గా పనిచేశారు. తొలి మహిళా స్పీకర్ అన్న ప్రత్యేక గుర్తింపు పొందారు. అలాగే 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయినా  గణనీయ స్థాయిలో  అంతవరకు జరిగిన  రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడిన అభ్యర్ధులలో  అత్యధిక ఓట్లు సాధించినవారిలో మూడవ స్థానంలో నిలిచారు.  మరో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు  కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ కూడా మూడు దశాబ్దాలకు పైగా ఐఎఫ్ఎస్  ఆఫీసర్ గా పనిచేశారు. 1953లో  ఐఎఫ్ఎస్  లో చేరిన ఆయన 31 సంవత్సరాలు సర్వీస్ లో కొనసాగారు. 1984  పదవీ విరమణ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గా అమెరికా, చైనా రాయబారి సహా పలు కీలక బాధ్యతలు నిర్వహించిన నట్వర్ సింగ్, రాజస్థాన్ లోని భరత్ పూర్ నుంచి  లోక్ సభకు ఎన్నికయ్యారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు.  అలాగే  ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుత మంత్రి  వర్గంలో విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కూడా  ఐఎఫ్ఎస్ అధికారిగా  సుదీర్ఘ కాలం  పనిచేశారు. 1977లో భారత విదేశాంగ సేవ అధికారిగా ప్రభుత్వోద్యోగంలో చేరిన జయశంకర్  2014-2015 సంవత్సరాల్లో అమెరికా 2009-2013 చైనాలో 2001-04 చెక్ రిపబ్లిక్ లో భారత రాయబారిగా పనిచేశారు. 2007-09లో సింగపూర్ దేశానికి భారత హై కమిషనర్ గా పనిచేశారు. ఇండో-అమెరికన్ అణు ఒప్పందానికి సంబంధించిన సంప్రదింపుల్లో కీలక పాత్ర పోషించారు. 31 మే 2019 నుండి భారత ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్నారు. 2019 జులైలో గుజరాత్ నుంచి  రాజ్యసభ కు ఎన్నికయ్యారు. అంతకు ముందు జయశంకర్ 2015 నుండి జనవరి 2018 వరకు విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుత మోడీ కాబినెట్ లో జయశంకర్’తో పాటుగా మరో ముగ్గురు మాజీ సివిల్ సర్వెంట్స్ కూడా మంత్రులుగా కొనసాగుతున్నారు. గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి  పూర్వశ్రయంలో ఐఎఫ్ఎస్ అధికారిగా పనిచేశారు. 1974లో సర్వీస్ లో చేరిన ఆయన యుకే, బ్రెజిల్ దేశాలలో భారత రాయబారిగా పనిచేశారు. అలాగే  ప్రస్తుత కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రిగా ఉన్న రాజ కుమార్ కౌర్, బీహర్ క్యాడర్ కు చెందిన 1975 బ్యాచ్, ఐఏఎస్ ఆఫీసర్.  గతంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా పనిచేశారు. రాజ్ కుమార్ 2013లో బీజేపీలో చేరారు. అలాగే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ మహారాష్ట్ర క్యాడర్ కు చెందిన 1980 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్.  ముంబై పోలీస్ కమీషనర్ గా పనిచేసిన సింగ్  2014 లో ఉద్యోగానికి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. బఘ్పాట్ లోక్ సభ స్థానం నుంచి వరసగా రెండుసార్లు విజయం  సాధింఛి, కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు.  ఇక ముఖ్యమంత్రులైన సివిల్ సర్వెంట్స్ విషయానికి వస్తే, ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగీ, ఐఏఎస్ ఆఫీసర్  గా పనిచేస్తున్న సమయంలోనే ఆనాటి ప్రధాని రాజీవ గాంధీ దృష్టిని ఆకర్షించారు. రాజీవ్ గాంధీ ప్రోద్బలంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత కాలంలో ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ఒకప్పుడు గాంధీ కుటుంబ లాయలిస్ట్ గా మెలిగిన జోగీ అవినీతి ఆరోపణలు కారణంగా ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. చివరకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామాచేసి, ఛత్తీస్ గఢ్ జనతా కాంగ్రెస్ పేరిట ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే అనారోగ్యం కారణంగా జనతా కాంగ్రెస్ జనంలోకి వెళ్ళలేదు.  ఇక ఢిల్లీ ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ సంగతి అయితే చెప్పనే అక్కరలేదు. ఇండియన్ రెవిన్యూ సర్వీస్ ( ఐఆర్ ఎస్) ఆఫీసర్ గా పనిచేసిన అరవింద్ కేజ్రివాల్, సామాజిక కార్యకర్త అన్నా హజారే, అవినీతి వ్యతిరేక  లోక్ పాల్ ఆందోళన వేదికగా రాజకీయ అరంగేట్రం చేశారు. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని స్థాపించారు.  2013 నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కాగా  2022లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్  విజయం సాధించింది.  నిజానికి, కేజ్రివాల్ ప్రధాని రేస్ లో నిలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఒక వేళ ఆయన కల ఫలిస్తే పీఎం పదవి చేపట్టిని  సెకండ్ సివిల్ సర్వెంట్ అవుతారు.. అవును మన్మోహన్ సింగ్ సివిల్ సర్వెంట్ నిర్వచనం పరిధిలోకి రాక పోవచ్చును కానీ  సివిల్ సర్వెంట్ పీఎం మన్మోహన్ సింగ్.  రిజర్వు బ్యాంకు గవర్నర్ సహా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక ప్రభుత్వ బాధ్యతలు నిర్వహించిన మన్మోహన్ సింగ్  పీవీ నరసింహ రావు మంత్రి వర్గంలో 1991 నుంచి 1996 వరకు ఆర్థిక మంత్రిగా,  2004 నుంచి 2014 వరకు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.  వీళ్ళే కాదు... కాంగ్రెస్ బహిష్కృత నేత మణి శంకర్ అయ్యర్ మొదలు  తాజాగా బీఆర్ఎస్  అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  బీఆర్ఎస్  ఏపీ శాఖ అధ్యక్షుడిగా నియమించిన తోట చంద్రశేఖర్  వరకు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న మాజీ సివిల్ సర్వెంట్ల సంఖ్య భారీగానే ఉంది.  

తెలుగుదేశం,జనసేన పొత్తు ఖరారు.. సీట్ల సర్దుబాటూ కొలిక్కి?.. జనసేన పోటీ చేసే స్థానాలేమిటంటే?

ఏపీలో వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయమైపోయిందా? బీజేపీ కలిసినా కలవకపోయినా తెలుగుదేశం జనసేనల మధ్య పొత్తు ఖరారైపోయిందా?  అంటే ఈ రెండు పార్టీల శ్రేణుల నుంచీ కూడా ఔననే సమాధానం వస్తోంది. ఎన్నికలు ఇంకా బోలెడు సమయం ఉన్నా.. రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల హీట్ పీక్స్ కి చేరింది. దానికి తోడు ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు, సీట్ల సర్దుబాటు వంటి అంశాల విషయంలో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చేశాయని చెబుతున్నారు. ఏవో రెండు మూడు జిల్లాలు వినా దాదాపుగా అన్ని జిల్లాలలోనూ పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలు కూడా ఖరారైపోయాయని చెబుతున్నారు.  2019 ఎన్నికల నాటితో పోలిస్తే ప్రస్తుతం ఏపీలో జనసేన బలం పెరిగిందన్న విషయాన్ని ఆయన ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తారని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. హీరోగా, పొలిటీషియన్ గా జనసేనాని పవన్ కల్యాణ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎక్కడికి వెళ్లినా పెద్ద సంఖ్యలోనే ప్రజలు ఆయన సభలకు హాజరౌతున్నారు.  తెలుగు రాష్ట్రాలలో అత్యంత జనాకర్షణ సామర్థ్యం ఉన్న వారిలో పవన్ కల్యాణ్ కచ్చితంగా ముందు వరుసలో ఉంటారు.   అయితే ఈ జనాకర్షణ ఎన్నికలలో విజయానికి దోహదపడుతుందా అంటే మాత్రం కచ్చితంగా ఔనన్న సమాధానం రాదు. గత ఎన్నికలలో  130కి పైగా స్థానాలలో పోటీ చేసిన జనసేన కేవలం ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించింది.  ప్రస్తుతం కూడా ఆ పార్టీకి జనాదరణ పెరిగినా ఒంటరిగా ఎన్నికల సమరాంగణంలో గెలిచే సామర్థ్యం మాత్రం లేదనే చెప్పాలి. ఇందుకు కారణాలెన్నో ఉన్నా.. ప్రధానంగా పార్టీ ఆవిర్భవించి పుష్కర కాలం గడిచినా ఇప్పటికీ సంస్థాగత నిర్మాణం  లేదు. అలాగే పవన్ కల్యాణ్ వినా మరో నాయకుడు కనిపించరు. జనసేన అంటే పవన్ కళ్యాణ్ అంతే. రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నా.. ఆయన క్రౌడ్ పుల్లర్ కాదు. వీరిద్దరినీ మినహాయిస్తే మిగిలిన వారంతా ఆటలో అరటి పండుతో సమానం.   పవన్ కళ్యాణ్ ఒంటరి నాయకత్వం వలన పార్టీ జనంలోకి బలంగా వెళ్ళలేక పోతోంది. ఎన్టీఆర్‌ టీడీపీ స్థాపించినప్పుడు ఆయన పార్టీ నిర్మాణంపై దృష్టి సారించింది. గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకూ పార్టీ నిర్మాణం చేశారు. శిక్షణా శిబిరాలు నిర్వహించి, సభ్యత్వాలు నమోదుపైనా దృష్టి సారించారు. ఆ తరువాత పార్టీలో చంద్రబాబు కార్యకర్తల వివరాలు, పార్టీ కార్యక్రమాలను కంప్యూటరైజ్‌ చేశారు. శిక్షణా శిబిరాలను కిందిస్థాయి వరకూ తీసుకువెళ్లారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ లేకపోయినా, టీడీపీ సంస్థాగతంగా బలంగా ఉండటానికి అదే కారణం.  అందుకే టీడీపీ అధికారంలో ఉన్నా, లేకపోయినా.. రాజకీయాల్లో తన గుర్తింపు చాటుకుని, స్థిరంగా నిలిచింది.   ఏ రాజకీయ పార్టీ అయిన పదికాలాలు  నిలవాలంటే, సంస్థాగత నిర్మాణం  అవసరం. అది లేక పోవడమే  జనసేన  లోపం. ఈ పరిస్థితుల్లో జనసేన పార్టీ వచ్చే ఎన్నికలలో ఒంటరిగా ఎన్నికల బరిలో దిగితే, 2019 ఫలితాలే పునరావృతం అవుతాయి.అంతే కాదు,  జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, ఫలితంలో మార్పు ఉండదు. బీజేపీ దేశంలో బలమైన శక్తి కావచ్చును, కానీ, ఆంధ్ర ప్రదేశ్’లో మాత్రం బీజేపీకి నిండా ఒక శాతం ఓటు బలం కూడా లేదు. అందుకే  వైసీపీని ఓడించే శక్తి ఒక్క టీడీపీకి తప్ప మరో పార్టీకి లేదు.  సో .. వైసీపీని ఓడించి, జగన్ రెడ్డి పాలనకు ముగింపు పలకడమే జనసేన లక్ష్యం అన్న పవన్ కళ్యాణ్  ముందున్న ఏకైక ఆప్షన్  తెలుగుదేశం పార్టీతో అవగాహన కుదుర్చుకోవడం ఒక్కటే. అలాగే  తెలుగుదేశం పార్టీకి కూడా వచ్చే ఎన్నికలలో ఎట్టిపరిస్థితుల్లోనూ వైసీపీ గెలుపును అడ్డుకోవాలన్న లక్ష్యం నెరవేరాలంటే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.  అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న జనసేన పార్టీతో పొత్తు తెలుగుదేశం పార్టీకీ అవసరమే. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల మధ్యా పొత్తు పొడుపుకు మార్గం సుగమమయ్యేలా చర్చల ప్రక్రియకు తెరలేచింది. అందులో భాగంగానే ఇప్పటికే చాలా వరకూ ఒక అవగాహన కుదిరింది.  విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఇప్పిటికే ఇరు పార్టీల మధ్యా సీట్ల సర్దుబాటు కూడా చాలా వరకూ ఖరారైందని చెబుతున్నారు.   పొత్తులో భాగంగా ఏడు జిల్లాలలో 20 స్థానాలలో జనసేన పోటీ చేస్తుందని చెబుతున్నారు. మిగిలిన జిల్లాలలో సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే అవగాహన కుదిరిన స్తానాలు ఇలా ఉన్నాయి.  గుంటూరు జిల్లాలో తెనాలి, సత్తెన పల్లి, కృష్ణా జిల్లాలో పెడన, కైకలూరు, విజయవాడ వెస్ట్, తూర్పుగోదావరి జిల్లాలో అమలాపురం, పి. గన్నవరం, రాజోలు, రాజానగరం, కాకినాడ రూరల్ నియోజకవర్గాలలోనూ, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, నరసాపురం, తాడేపల్ల్లిగూడెం, పాలకొల్లు నియోజకవర్గాలలోనూ జనసేన అభ్యర్థులు రంగంలో ఉంటారు. ఇక విశాఖ జిల్లాలో పెందుర్తి, భీమిలి, గాజువాక, చోడవరం నియోజకవర్గాలలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారు. చిత్తూరు జిల్లాలో చిత్తూరు లేదా తిరుపతిలో పొత్తలో భాగంగా జనసేన పోటీ చేస్తుంది.  ప్రకాశం జిల్లా లోని దర్శి, గిద్దలూరు స్థానాలను తెలుగుదేశం జనసేనకు కేటాయించింది. నెల్లూరు, విజయనగరం, అనంతపురం జిల్లాలలో సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగుతున్నాయి. మొత్తం మీద వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేనల పొత్త ఖాయమని ఆ రెండు పార్టీలూ కూడా ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నాయి. 

చలి చంపేస్తోంది.. హస్తినలో ఆరెంజ్ అలర్ట్

దేశ రాజధాని నగరం ఢిల్లీని చలి వణికించేస్తోంది.   నైనిటాల్ తో పోటీ పడేలా న్యూఢిల్లీ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి.  తాజాగా  హస్తినలో ఉష్ణోగ్రత 3 డిగ్రీలు నమోదైంది.  విజిబిలిటీ 50 మీటర్లకు పడిపోయింది. కంటి ముందున్నవి కూడా కనిపించని స్థాయిలో దట్టమైన  మంచు దుప్పటి ఢిల్లీ నగరాన్ని కప్పేసింది. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయి. హిమాలయాల నుంచి వస్తున్న చల్లటి ఈదురు గాలులతో ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  లోఢి రోడ్ వంటి ప్రాంతాల్లో కనిష్ణ ఉష్ణోగ్రతలు ఏకంగా 2.2 డిగ్రీలకు పడిపోవటం విశేషం. దీంతో ఢిల్లీ-ఎన్సీఆర్ సెక్టర్ అంతా ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. వాతావరణ శాఖ కోడ్ లాంగ్వేజ్ లో ఆరెంజ్ అలర్ట్ అంటే బీ ప్రిపేర్డ్ అని అర్థం. ఇక ఢిల్లీ నగరంలోని వీధులు సాయంత్రం, రాత్రి, తెల్లవారుజామున చాలావరకు నిర్మాణుష్యంగా కనిపిస్తున్నాయి. మరో రెండు రోజుల  పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది.

మోడీ విధానాలతో పెచ్చరిల్లిన నిరుద్యోగం.. దేశంలో పెళ్లికాని ప్రసాదులు

నిరుద్యోగం యువత జీవితాలపై మరో విధంగా కూడా ప్రభావం చూపుతోందా? అంటే ఔననే అంటున్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. విద్యావంతులై ఉండి కూడా ఉద్యోగం లేకపోవడం వల్ల యువకులు బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారని ఆయన అన్నారు. ఉన్నత విద్య అభ్యసించినా దేశంలో యువత సామర్ద్యానికీ, అర్హతకు తగిన ఉద్యోగాలు లభించడం గగనమైపోయిందని అన్నారు. ఈ పరిస్థితి కారణంగానే వారు వయసు మీరిపోతున్నా అవివాహితులుగా మిగిలిపోతున్నారన్నారు. నిరుద్యోగం కారణంగానే తమకు ఎవరూ పిల్లనివ్వడం లేదని పాతిక నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులు పలువురు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారని శరద్ పవార్ చెప్పారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ రక్కసి విలయ తాండవం చేస్తోందన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ విధానాల కారణంగానే దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లిందని విమర్శలు గుప్పించారు.   పుణెలో జరిగిన ‘జన్ జాగర్ యాత్ర’లో పాల్గొన్న పవార్.. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అసలైన సమస్యలపై దృష్టి సారించకుండా ఉండేలా విభజన రాజకీయాలు చేస్తూ కేంద్రం ప్రజా దృష్టిని మళ్లిస్తోందని విమర్శించారు. 

తెలంగాణ కాంగ్రెస్ ఇక ఇంతేనా?

నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో.. నరులెవరూ నడవనిది ఆ రూట్లో నే నడిచెదరో.. అన్న చందంగా తెలంగాణ కాంగ్రెస్ తీరు ఉంది.  ఆ పార్టీకి జనంలో ఆదరణ ఉన్నా.. అంతర్గత విభేదాల కారణంగా ఆ ఆదరణను ఓట్ల రూపంలో మార్చుకోలేని దుస్థితి. గత పదేళ్లుగా వరుస పరాజయాలతో ఆ పార్టీ ఎన్నికలంటేనే భయపడే పరిస్థితికి దిగజారింది. ఇక తెలంగాణలో అయితే ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని పార్టీలూ విబేదాలను పరిష్కరించుకుని ఏకతాటిపై ఎన్నికల సమరంలో విజయం కోసం పావులు కదుపుతుంటే.. కాంగ్రెస్ మాత్రం అంతర్గత కుమ్ములాటలతో ఉక్కిరిబిక్కిరయి  ఉనికినే కొల్పోయే పరిస్థితికి వచ్చింది.   శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్నా పార్టీ తీవ్ర అసమ్మతితో, అసంతృప్తితో సతమతమౌతోంది వాస్తవానికి గత ఏడాది కాలంగా  కాంగ్రెస్ అసమ్మతి మంటల్లో మగ్గుతూనే ఉంది. అయితే  ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి కానీ, సమస్య పరిష్కరించడానికి కానీ  ఎటువంటి ప్రయత్నాలూ జరగలేదు. ఇప్పుడు పుణ్య కాలం కాస్తా ముగిసి పోయిందన్న పరిస్థితి దాపురించిన తరువాత హడావుడిగా పార్టీలో అసమ్మతి సమస్య పరిష్కారానికి హై కమాండ్ చర్యలు ప్రారంభించింది.   రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడైన దగ్గర నుంచి పార్టీలో సిగపట్లు ప్రారంభమయ్యాయి. పార్టీలో అంతకు ముందు కుమ్ములాటలు, లుకలుకలు ఉన్నప్పటికీ, తెలుగు దేశం పార్టీ నుంచి కొత్తగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి అధిస్థానం పార్టీ పగ్గాలు అప్పగించడం   సీనియర్లకు మింగుడు పడలేదు.  వాస్తవానికి రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు చేపట్టిన తరువాతే.. పార్టీ క్షేత్ర స్థాయిలో కార్యకర్తలకు నూతనోత్సాహం వచ్చింది.  అయితే తమను కాదని రేవంత్ కు పగ్గాలు అప్పగించడాన్ని జీర్ణించుకోలేకే సీనియర్ల అసమ్మతి కుంపటి రగిల్చారు.  రేవంత్ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నాకా.. తెలుగుదేశం పార్టీ నుంచి తన గ్రూపు వారిని పార్టీలోకి తీసుకురావడం వారికి పీసీసీ కమిటీల్లో పెద్ద పీట వేయడంతో బహిరంగంగా అసమ్మతి రాగం ఆలపించారు. దీంతో  అధిష్టానం హుటాహుటిన సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ను పంపించింది కానీ, ఆయన దౌత్యం పెద్దగా పనిచేసిన దాఖలాలు కనిపించడం లేదు.  పార్టీ కమిటీలన్నిటినీ రేవంత్ తన వర్గం వారితోనే నింపేస్తున్నారని, తమను పక్కన పెట్టేస్తున్నారని సీనియర్లు దిగ్విజయ్కు ఫిర్యాదు చేశారు.   రేవంత్ రెడ్డి వర్గం కూడా పార్టీ సీనియర్ నాయకుల తీరుతెన్నులను బాహాటంగానే ఎండగడుతోంది పార్టీలో రేవంతు పెరుగుతున్న పట్టు, పలుకుబడిని చూసి సీనియర్లు ఓర్వ లేకపోతున్నారని, సరిగ్గా ఆయన పాదయాత్ర చేయదల చుకున్నప్పుడే వారంతా గొంతెత్తడం ప్రారంభించారని వారు దిగ్విజయ్ సింగ్కు ఫిర్యాదు చేశారు. రేవంత్ పాదయాత్ర ద్వారా తన పట్టును పెంచుకోవడం ఈ నాయకులకు ఏమాత్రం గిట్టడం లేదని కూడా వారు ఆయనకు చెప్పారు. నిజానికి, రాష్ట్రంలో కాంగ్రెస్ ఇతర ప్రతిప క్షాల కంటే కొద్దిగా మంచి స్థాయిలో ఉంది. ముఖ్యంగా, బీజేపీ, తెలుగుదేశం   తదితర పార్టీల కంటే పటిష్ఠంగా ఉంది. పాలక పక్షం మీద సంధించడానికి కావాల్సిన అస్త్రశస్త్రాలన్నీ ఆ పార్టీ దగ్గర ఉన్నాయి. పాలక పక్షం మీద పోరాటాన్ని ఉధృతం చేయడానికి తమకే ఎక్కువ అవకాశాలున్నాయని పార్టీ అధిష్టాన వర్గం సైతం భావిస్తోంది. ఈ దశలో పాత కాపులు, కొత్త కాపుల మిశ్రమంగా పార్టీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అయితే  ఆ దిశగా సాగుతున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వడం లేదనడానికి బుధవారం (జనవరి 4)న టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి గాంధీ ఐడియాలజీ కేంద్రంలో జరిగిన కాంగ్రెస్‌ శిక్షణా తరగతుల్లో రేవంత్ ప్రసంగమే నిదర్శనం. పార్టీ అధికారంలోకి వస్తుందంటే తాను టీపీసీసీ పగ్గాలు వీడడానికి సిద్దమని రేవంత్ బేలగా చెప్పడం ఆయనపై సీనియర్లు పై చేయి సాధించారనడానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే మాణికం ఠాగూర్ లో కలిసి జోడు గుర్రాల్లా రాష్ట్ర పార్టీని పరుగులెట్టించాలన్న ప్రణాళికలు సిద్ధం చేసుకున్న రేవంత్ కు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ పదవి నుంచి ఠాకూర్ ను తప్పించడం కచ్చితంగా రేవంత్ కు ఎదురుదెబ్బగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఏపీ కమలంలో కాక.. తెలంగాణపైనా ప్రభావం?

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి కనీసం ఒక శాతం ఓటు బ్యాంకు లేకపోయినా.. కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉన్న కారణంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ కమలం ప్రాపకం కోసం అర్రులు చాస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటువంటి సానుకూల వాతావరణంలో కూడా ఏపీలో బీజేపీ తన స్థానాన్ని మెరుగుపరుచుకొనే పరిస్థితులను చేజార్చుకుంటోంది. అంతర్గత కుమ్ములాటలతో పరిస్థితిని మరింత దిగజార్చుకుంటోంది. రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రయోజనం చేకూరే విధంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు అటు మరో తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణలో కూడా బీజేపీ ప్రయోజనాలకు గండి కొట్టేలా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. తాజాగా  ఏపీ బీజేపీలో అంతర్గత విభేదాలు ముదిరి పాకాన పడ్డాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన జాతీయ పార్టీ బీఆర్ఎస్ లోకి ఏపీకి చెందిన  వారిని చేర్చుకోవడం.. అలా చేరిన వారిలో అత్యధికులు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే కావడం వెనుక ఏపీ బీజేపీలోని కీలక నేత ప్రమేయం ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ఆ కీలక నేత వేరెవరో కాదు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజేనని కన్నా లక్ష్మీనారాయణ అంటున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ ఉండగా నియమించిన పార్టీ జిల్లాల అధ్యక్షులను ఒక్కరొక్కరిగా సోము వీర్రాజు తొలగించి, ఆ స్థానంలో వేరే వారిని నియమించడం పై కన్నా గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ నుంచి బీఆర్ఎస్ గూటికి చేరిన వారిలో సోము వీర్రాజు వియ్యంకుడు కూడా ఉండటాన్ని ఎత్తి చూపుతూ కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు ఏపీ బీజేపీలో దుమారం లేపుతున్నాయి. ఒక్క కన్నా వ్యాఖ్యలనే కాకుండా  ఏపీ నుంచి బీఆర్ఎస్ లో చేరికల వెనుక సోము వీర్రాజు ఉన్నారన్న అనుమానాలు పార్టీలోని పలువురు నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో జగన్ కు మేలు చేకూరేలా సోము వీర్రాజే ఏపీలో బీఆర్ఎస్ లోకి చేరికలను ప్రోత్సహిస్తున్నారని కూడా పలువురు ఏపీ బీజేపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏపీలో జనసేనాని పవన్ కల్యాణ్ కు నష్టం చేకూరే విధంగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను బీఆర్ఎస్ లో చేరే విధంగా సోము పావులు కదుపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయాన్నే కన్నా పలు సందర్భాలలో కుండ బద్దలు కొట్టారు. అదలా ఉంచితే.. జిల్లా అధ్యక్షుల తొలగింపు విషయంలో  సోము వీర్రాజు ఏకపక్ష నిర్ణయాలపై ఏపీ బీజేపీలో నిరసన వ్యక్తమౌతోంది. కన్నా వర్గీయులను టార్గెట్ చేసే ఈ తొలగింపులు ఉంటున్నాయని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఈ ఏకపక్ష తొలగింపులకు నిరసనగా ఏపీ బీజేపీకి పలువురు రాజీనామాలు చేస్తూ ఆ రాజీనామా లేఖలను సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తున్నారు.  అదే సమయంలో సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో పార్టీ పరంగా చేపట్టిన రాజకీయ కార్యక్రమం ఒక్కటీ లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే కన్నా  ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్న సమయంలో  ప్రభుత్వంపై.. అవినీతిపై క్రియాశీలంగా కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ నిర్వాకాన్ని ఎండగట్టారని అంటున్నారు. ఇప్పుడు సోము ఏకైక అజెండా పార్టీలో కన్నాను ఏకాకిని చేసి ఆయన బయటకు వెళ్లేలా చేయడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారుతారు, జనసేనలో చేరుతారు అని జరుగుతున్న ప్రచారం వెనుక ఉన్నది కూడా సోము వీర్రాజు వర్గమేనని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కన్నా తన మౌనాన్ని వీడి సోముపై విమర్శలు చేస్తున్నారనీ, అధిష్ఠానం సూచనతో కొద్ది రోజులు మౌనంగా ఉన్నా.. సోము వీర్రాజు వర్గం తనపై దుష్ప్రచారం కొనసాగిస్తుండటంతో మళ్లీ నిరసన గళం ఎత్తారని చెబుతున్నారు. దీంతో కన్నా కేంద్రంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ రాజకీయ చర్చలు వేడెక్కాయి. జనసేనాని పవన్ కల్యాణ్ తెలంగాణలో కూడా తమ పార్టీ పోటీ చేయనుందని ప్రకటించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయన్న చర్చ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే ఏపీ బీజేపీలో ముసలానికి కారణాలపై ఒక స్పష్టత వస్తోందన్న విశ్లేషణలూ జోరందుకున్నాయి.   ఏపీలో బీజేపీ మిత్ర పక్షంగా ఉన్న జనసేన తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయడం అంటే ... ఎవరి కోసం అనే ప్రశ్న సహజంగానే తెరపై కొచ్చింది.  వాస్తవానికి ఏపీలో   బీజేపీ, జనసేన మిత్ర పక్షాలుగా ఉన్నా.. ఎవరి దారిలో వారు పోతున్నారు.    ఈ మైత్రీ బంధం ఉండీ లేనట్టేనని రాజకీయ వర్గాలు అభిప్రా యపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే   మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారయణ బీజేపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం వెనుక ఉన్నది సోము వీర్రాజు అన్న అనుమానాలను కన్నా వర్గం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కమలం గూటికి వచ్చిన కొద్ది కాలానికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయిని చేరుకున్న కన్నా, గత కొంత కాలంగా పార్టీలో తనకు అంతగా ప్రాధాన్యత లేకుండా పోతోందనే అసంతృప్తిని  వ్యక్తం చేస్తున్న మాట వాస్తవమే. ఆ కారణంగానే కన్నా పార్టీ మార్పు వార్తలకు ప్రాధాన్యత ఏర్పడింది.  వీటికి తోడు గత ఏడాది నవంబర్ లో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కన్నా నివాసానికి వెళ్లి మరీ భేటీ కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది.   ఈ భేటీకి కొద్ది రోజుల ముందు   పార్టీని నడిపే విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమైందని, మిత్రపక్షమైన   జనసేనతో సమన్వయం చేసుకోవడంలోనూ రాష్ట్ర నాయకత్వం విఫలమైందని  కన్నా లక్ష్మీనారాయణ సోము వీర్రాజుపై పరోక్షంగానైనా ఘాటు విమర్శలు చేశారు.  అలాగే రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించాలని హై కమాండ్ కు సూచించారు.  ఆ తరువాత కొద్ది రోజులకే ఆయనతో నాదెండ్ల భేటీ కావడంతో కన్నా పార్టీ మార్పు తథ్యమని పరిశీలకులు విశ్లేషణలు చేశారు.  అయితే కన్నా అదేం లేదని అప్పట్లో క్లారిటీ ఇచ్చినా ఊహాగానాలు ఆగలేదు.   అయితే  కన్నా  పార్టీ మారడం విషయం పక్కన పెడితే ఏపీలో బీఆర్ఎస్ అడుగు పెట్టడం జనసేనను బలహీన పరిచేందుకు  కేసేఅర్,  జగన్ రెడ్డి పన్నిన ఉమ్మడి వ్యూహమేనన్న అనుమానాలకు మాత్రం తాజాగా బీజేపీలో సంభవిస్తున్న పరిణామాలు తావిస్తున్నాయి. ఏపీలో బలపడాలని భావిస్తున్న బీజేపీకి ఈ పరిణామాలు ఏ మంత మేలు చేయవు సరికదా ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ఆ పార్టీ ప్రయోజనాలకు గండి కొడతాయనడంలో సందేహం లేదు. మరి ఈ పరిస్థితుల్లో ఏపీలో  పార్టీలో నెలకొన్న గందరగోళ పరిస్థితులను చక్కదిద్దడానికి బీజేపీ హై కమాండ్ ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి.

టీకాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ గా మాణికం ఠాకూర్ ఔట్?!

తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పుకుంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు మాణిక్కం ఠాగూర్ రాజీనామా లేఖను పంపారు . దీంతో.. మాణిక్కం ఠాగూర్ ను తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ గా తప్పించాలని కోరుతున్న తెలంగాణ సీనియర్లు రేవంత్ వర్గంపై పైచేయి సాధింనట్లైంది. నిజానికి దిగ్విజయ్ సింగ్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై సమీక్ష నిర్వహించటానికి రావడానికి ముందే తనను తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించాలని మాణికం ఠాకూర్ హై కమాండ్ ను కోరారు.  ఇంత రాలం టీ కాంగ్ సీనియర్ల డిమాండ్ ను పట్టించుకోకుండా వదిలేసిన పార్టీ హైకమాండ్ ఎన్నికల సంవత్సరం కావడంలో అనివార్యంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై దృష్టి సారించింది. కాగా తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జ్‌గా  మాణిక్ రావ్ థాక్రేను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసినట్లుగా ప్రచారం సాగుతోంది.   మాణిక్ రావ్ థాక్రే మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత. ఆయన అక్కడ మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, పీసీసీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు.  

కుప్పం రణరంగం.. పోలీసుల దాష్టీకం.. బాబు చంద్ర నిప్పులు

చంద్రబాబు పర్యటన సందర్భంగా కుప్పం రణరంగంగా మారింది. చంద్ర కుప్పం పర్యటనను అడ్డుకోవడానికి జగన్ సర్కార్ సర్వ విలువలకూ, నిబంధనలకూ తిలోదకాలిచ్చేసింది. పోలీసుల అత్యుత్సాహం కారణంగా కుప్పం యుద్ధ భూమిగా మారిపోయింది. చంద్రబాబు కుప్పం పర్యటన సీఎం జగన్ కు ఇష్టం లేదు కనుక.. ఎవరూ ఆయనకు స్వాగతం చెప్పడానికి వీళ్లేదు, ఆయన ప్రసంగం వినడానికి వీళ్లేదు అన్న రీతిలో పోలీసులు వ్యవహరించారు. దీంతో వైసీపీ చీకటి జీవో లక్ష్యమేమిటన్నది స్పష్టంగా తేలిపోయింది. కుప్పం పర్యటనకు ముందు చంద్రబాబు ప్రచార రథం డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రచార రథాన్ని సైతం సీజ్ చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజాక్షేత్రంలో తిరగడానికి అవకాశం లేకుండా చేయడం కోసమే జగన్ సర్కార్  ఈ నిషేధాస్త్రాన్ని ప్రయోగించిందన్నది దీనితో  తేలిపోయింది.   చంద్రబాబు పర్యటన సాగిస్తే జనం పెద్ద సంఖ్యలో హాజరు కావడం తథ్యమన్నసమాచారంతోనే.. రోడ్ షోకు చంద్రబాబు వెళ్లే అవకాశం లేకుండా చేయాలన్నఉద్దేశంతోనే వైసీపీ నిషేధం విధించిందని తేటతెల్లమైపోయింది.  ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న రెండు సభలలో తొక్కిసలాట జరిగిన సంగతి విదితమే.  కందుకూరులో జరిగిన సంఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా..  గుంటూరులో ముగ్గురు మృత్యువాత పడిన విషయం విదితమే.   ఈ సంఘటనలను సాకుగా తీసుకుని ఏపీలో సభలు, ర్యాలీ లు, రోడ్ షోలను ప్రభుత్వం నిషేధించింది.  నిషేధం అమలులోకి వచ్చిన తరువాత కూడా వైసీపీ రాజమండ్రి, ఉత్తరాంధ్రలో వేలాది మందిలో కార్యక్రమాలు నిర్వహించింది. కానీ చంద్రబాబు కుప్పం పర్యటన కు మాత్రమే నిషేధం విషయం పోలీసులకు గుర్తు వచ్చింది.  చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికి పోలీసులు చూపిన అత్యుత్సాహం కారణంగానే కుప్పం రణరంగమైంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయన ప్రచార రధాన్ని సీజ్ చేశారు. ఆ రథం డ్రైవర్ ను అదుపులోనికి తీసుకున్నారు. చంద్రబాబుకు స్వాగతం చెప్పడానికి వచ్చిన వారిని అడ్డుకున్నారు. సభా వేదికను కూల్చేశారు. దీంతో జనం పోలీసులపై తిరగబడ్డారు. దీంతో పోలీసులు లాఠీ చార్జి చేశారు. ఈ లాఠీ చార్జిలో పలువురు గాయపడ్డారు. కొందరు మహిళలు స్ఫృహ తప్పి పడిపోయారు.  కుప్పం నియోజకవర్గంలో బాబు అడుగుపెట్టీ పెట్టగానే అనుమతి లేదంటూ పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వబోయారు. అయితే నోటీసు తీసుకునేందుకు నిరాకరించిన చంద్రబాబు తన పర్యటనకు ఎందుకు అనుమతి ఇవ్వరో రాతపూర్వకంగా చెప్పాలని డిమాండ్ చేశారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో కుప్పం నియోజకవర్గంలోని పెద్దూరు చేరుకున్న చంద్రబాబును అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. తన సొంత నియోజకవర్గంలో ప్రవేశించవద్దనడానికి పోలీసులు ఎవరని నిలదీశారు.  రాజమహేంద్రవరంలో రోడ్లు బ్లాక్‌ చేశారు. విద్యా సంస్థలు మూసేశారు. ఆర్టీసీ బస్సులు వాడుకున్నారు. జగన్‌కు ఓ రూలు.. నాకు ఓ రూలా? అని ప్రశ్నించారు.   ఈ నెల2నజీవో తెచ్చారు, ఆ జీవో ఈనెల 1 నుంచే అమలులో ఉందని పలమనేరు డీఎస్పీ చెబుతున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.   ఏ చట్టం కింద తనను తన సొంత నియోజకవర్గానికి రానీయకుండా అడ్డుకుంటున్నారని నిలదీశారు.    ప్రచార వాహనం తీసుకు రాకుంటే ఇక్కడే ధర్నా చేస్తానని హెచ్చరించారు. ప్రచార రథం తెచ్చే వరకు పెద్దూరులో పాదయాత్ర చేస్తానని అక్కడి నుంచి గ్రామంలోకి వెళ్లారు.  అయితే ఇక్కడ తప్పని సరిగా గుర్తించాల్సిన అంశమేమిటంటే.. చంద్రబాబు రోడ్ షోలలో తొక్కిసలాటలు జరిగాయని చెబుతున్న ప్రభుత్వం ఆ తొక్కిసలాటలు జరిగిన సభలలో పోలీసుల వైఫల్యం గురించి మాట్లాడటం లేదు. తొక్కిసలాట జరిగిన రెండు సందర్భాలలోనూ కూడా పోలీసుల సంఖ్య అతి స్వల్పంగా ఉంది. అయితే కుప్పం పర్యటనను అడ్డుకోవడానికి మాత్రం జిల్లా మొత్తం పోలీసు యంత్రాంగమంతా ఇక్కడే ఉందా అన్నట్లుగా వేల సంఖ్యలో పోలీసులు మోహరించారు.  ప్రత్యేక బలగాల్ని తరలించారు.  ఒక విధంగా చెప్పాలంటే గత ఏడాది ఆగస్టులో చంద్రబాబు కుప్పంలో పర్యటించిన సమయంలో వైసీపీ కార్యకర్తలు ఏ విధంగా ప్రవర్తించారో..ఇప్పుడు చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు అదే విధంగా వ్యవహరించారు.   కాగా చంద్రబాబు కుప్పం పర్యటనను అడ్డుకోవడంపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు.  జగన్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసిందన్నారు.    జీవో నంబర్ 1 జగన్ కు వర్తించదా అని ప్రశ్నించారు. మంగళవారం (జనవరి 3) రాజమహేంద్రవరంలో పర్యటించిన జగన్ చేసిన షోకు నిబంధనలు వర్తించవా అని ప్రశ్నించారు.  చీకటి జీవోలతో రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారని విమర్శలు గుప్పించారు.