మళ్లీ గ్రేటర్ రాయలసీమ నినాదం! జగన్ పై ఫైరవుతున్న సీమ జనం..  

గ్రేటర్ రాయలసీమ నినాదం మళ్లీ ఊపందుకుంటుందా? రాయల సీమ సమస్యలను జగన్ నిర్లక్ష్యం చేస్తున్నారా? అంటే ఆ ప్రాంత జనాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో తెరపైకి వచ్చిన గ్రేటర్ రాయలసీమ నినాదం మళ్లీ వినిపిస్తోంది.  తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న కృష్ణా జలాల వివాదం, బోర్డుల పరిధిని నోటిఫై చేస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేయడంతో రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లా వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేంద్రం గెజిట్ తో భవిష్యత్ లో ఈ ప్రాంతానికి నష్టం కల్గుతుందని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. దీంతో గ్రేటర్ రాయలసీమతోనే తమ హక్కులను కాపాడుకుంటామనే ఆలోచనకు ఆ ప్రాంత ప్రజలు వచ్చారని తెలుస్తోంది.  కృష్టా జల వివాదంపై మాట్లాడిన మాజీ మంత్రి, రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి నేత మైసూరా రెడ్డి కూడా ఇవే వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. కేవలం రాజకీయ లబ్ధికోసమే ఇద్దరు ముఖ్యమంత్రులు ఘర్షణకు దిగారని.. దానివల్ల రాయలసీమ నీటి ప్రాజెక్టులను గందరగోళంలోకి నెట్టేశారని మైసూరారెడ్డి ధ్వజమెత్తారు. ఇద్దరు సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందన్న ఆయన.. వీరికి ఎందుకు భేషజాలు అడ్డు వస్తున్నాయని ప్రశ్నించారు, వీరిద్దరూ తెగేదాక లాగడం వల్లనే పరిస్థితి ఇంతదాకా వచ్చిందన్నారు మైసూరా రెడ్డి. పోలవరంపై ఐదు రాష్ట్రల ముఖ్యమంత్రులు కలసి మాట్లాడుతున్నప్పుడు ఇద్దరు సీఎం‌లు మాట్లాడుకోలేరా? అని వ్యాఖ్యానించారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తికి మూడు టీఎంసీలు మాత్రమే వినియోగించాలని, ఇష్టానుసారం విద్యుత్ ఉత్పత్తి చేస్తోంటే సీఎం జగన్ ఎందుకు మట్లాడరని మైసూరారెడ్డి ప్రశ్నించారు.  కేంద్ర ప్రభుత్వం జారీచేసిన గెజిట్ వల్ల రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతుందని మైసూరా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నోటిఫికేషన్ సీమ ప్రాంతానికి గొడ్డలిపెట్టు వంటిదని అన్నారు. ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కు మంచిది కాదని అన్నారు.ఈ పరిస్థితి వల్ల.. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం అంశం తెరపైకి వస్తోందని అన్నారు. తమకు కూడా రాష్ట్రం ఏర్పడితే ఈ పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయం జనాల్లో వస్తుందని అన్నారు. కేంద్రం ఇచ్చిన ఈ గెజిట్ ను జగన్  ప్రభుత్వం ఆహ్వానించడం పూర్తిగా తప్పేనని మైసూరా రెడ్డి మండిపడ్డారు. గెజిట్‌ను స్వాగతించే ముందు ముఖ్యమంత్రి జగన్ రాయలసీమ ప్రాజెక్టుల గురించి ఆలోచన చేయలేదని అన్నారు. రాయలసీమను జగన్ చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రత్యేక రాష్ట్రంగా ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదంటూ మైసూరా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం చట్టబద్దత కల్పించాలని మైసూరా రెడ్డి డిమాండ్ చేశారు. పట్టిసీమ ప్రాజెక్టుకు చట్టబద్దత కల్పించాలని ప్రతిపక్షనేతగా జగన్ డిమాండ్ చేసింది నిజం కాదా? అని అడిగారు. గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి ఒక ప్రభుత్వం ఉండుంటే.. రాయలసీమ ప్రజలకు ఇంత అన్యాయం జరిగేది కాదు కదా అని అన్నారు. కేసీఆర్, జగన్ లు రాజకీయ లబ్ది కోసం కీచులాడుకుని  జట్టును కేంద్రం చేతిలో పెట్టారని వ్యాఖ్యానించారు. ఇద్దరు సీఎంలు కలిసి మాట్లాడుకోకపోవటం వలనే బోర్డులు మితిమీరి జోక్యం చేసుకున్నాయన్నారు. శ్రీశైలం జలాశయాన్ని తెలంగాణ ఖాళీ చేస్తుంటే... ఆంధ్రా పాలకులు నిద్రపోతున్నారని మైసూరారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆంధ్రా ఆగమాగముంది.. జగన్ పాలనపై కేసీఆర్ సెటైర్లు..

ఆంధ్రప్రదేశ్ లో జగన్ రెడ్డి పాలనపై ఇప్పటికే చాలా ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై జనాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఏపీలో ప్రస్తుతం ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలన్న అప్పు తేవాల్సిన పరిస్థితి ఉంది. రుణం దొరకకపోతే ఆ నెలకు వేతనాలు లేనట్టే. పరిమితికి మించి అప్పులు తెచ్చారంటూ జగన్ రెడ్డి సర్కార్ తీరుపై కేంద్ర ఆర్థిక శాఖ కూడా మొట్టికాయలు వేసింది. ఏపీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా  రాష్ట్ర భవిష్యత్ ఎలా ఉంటుదోనన్న ఆందోళన నెలకొంది. ప్రధాన ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీతో ఇతర పార్టీలు కూడా జగన్ అస్తవ్యస్థ, అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర భవిష్యత్ ను గండంలోకి నెట్టారని చెబుతున్నారు.  తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆంధ్రప్రదేశ్ ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమిస్తుందని చెప్పిన కేసీఆర్.. ఆంధ్రా పరిస్థితి మాత్రం దారుణంగా ఉందన్నారు. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా ప్రజలు.. విభజన తర్వా త కూడా తెలంగాణ వాళ్లుగా చెప్పుకోవడానికి ఇష్టపడే వారు కాదన్నారు.  కాని ప్రస్తుతం ఆ సీన్ మారిపోయిందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుండగా.. ఆంధ్రా మాత్రం ఆగమాగం అవుతుందన్నారు. అందుకే హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రా ప్రజలు కూడా ఇప్పుడు తెలంగాణవాసులమని చెప్పుకుంటున్నారని చెప్పారు. గతంలో ఏపీలో వరి ఎక్కువగా పండేదని, ప్రస్తుతం తెలంగాణకు కనీస దూరంలో కూడా  లేదని తెలిపారు.  తెలంగాణ వాళ్లకు పండించడం రాదు.. పాలన చేసుకోవడం రాదని మాట్లాడేవారని.. కాని ప్రస్తుతం ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఉందే జనాలు గమనిస్తున్నారని కేసీఆర్ చెప్పారు. జగన్ సర్కార్ తీసుకున్న మెజార్టీ నిర్ణయాలు వివాదాస్పదం కావడం, కోర్టులు కొట్టివేయడం వంటి ఘటనలు జరిగాయి. కొన్ని రోజులుగా  ఏపీలో నెలకొన్న పరిస్థితులను  బట్టే కేసీఆర్.. ఈ కామెంట్లు చేశారని తెలుస్తోంది.  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.  మరోవైపు ఆంధ్రాను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మరో వాదన కూడా వస్తోంది. ఇటీవల కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం సాగుతోంది. రెండు రాష్ట్రాలు పోటాపోటీగా కేంద్రానికి ఫిర్యాదు చేసుకున్నాయి. దీంతో కేంద్ర సర్కార్ ఎంటరై బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గెజిట్ ఇచ్చింది. అయినా తెలంగాణ సర్కార్ దూకుడుగానే వెళుతోంది. సుప్రీంకోర్టులో పోరాటానికి సిద్ధమైంది. జల వివాదం నేపథ్యంలోనే గతంలో మిత్రుడిగా చెప్పుకున్న జగన్ టార్గెట్ గా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని కొందరు భావిస్తున్నారు. 

మ‌న్సాస్‌లో రివేంజ్ పాలిటిక్స్‌!.. రాచ‌క్రీడ‌లో ఉద్యోగులు బ‌లి?

రాజుల హ‌యాంలో రారాజులా బ‌తికారు. ద్రోహుల కాలంలో జీతాల‌కూ ఇబ్బంది ప‌డుతున్నారు. అశోకుడి హయాంలో ఏ ఇబ్బందీ రాలేదు. సంచ‌యిత రాక‌తో ఇక్క‌ట్లు మొద‌ల‌య్యాయి. ఇది మ‌న్సాస్ ట్ర‌స్టులో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తున్న వారి నుంచి వస్తున్న మాట. వంద‌లాది మంది ఉద్యోగులు. వేలాది మందికి చ‌దువులు చెప్పే ఉపాధ్యాయులు. అక్ష‌ర సేద్యం జ‌రుగుతున్న మ‌న్సాస్ విద్యాల‌యాల్లో ప్రస్తుతం ఆక‌లి కేక‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో ఎన్న‌డూ లేనిది దాదాపు ఏడాదిన్న‌ర‌గా మ‌న్సాస్ ఉద్యోగుల‌కు జీతాలు రావ‌డం లేదంటున్నారు. రాజుల ఖ‌జానాలో కాసులు లేక కాదు.. పాల‌కుల్లో చిత్త‌శుద్ధి లేక‌.  మ‌న్సాస్ పీఠంపై అడ్డ‌గోలు జీవోల‌తో సంచ‌యిత‌ను తీసుకొచ్చి కూర్చోబెట్టింది.. ట్ర‌స్టు ప‌ర్య‌వేక్ష‌ణ కోసం కాదు.. మ‌న్సాస్ ఆస్తుల‌ను స్వాహా చేయ‌డం కోస‌మ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మ‌న్సాస్‌కు ఉత్త‌రాంధ్ర వ్యాప్తంగా ఉన్న ఖ‌రీదైన భూముల‌ను అడ్డంగా దోచుకునేందుకు.. తాడేప‌ల్లి పెద్ద‌లు ఆడిన గ‌జ‌ప‌తుల ఆట‌లో సంచ‌యిత ఓ పావు మాత్ర‌మే అంటారు. అశోక్‌ను దెబ్బ‌తీయ‌డం, ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో భ‌ద్రంగా ఉన్న‌ భూముల లెక్క‌ల చిట్టా బ‌య‌ట‌కు తీయ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ రెండేళ్లు పావులు క‌దిపారని అంటున్నారు. ఎక్క‌డా, ఏ కోషానా మ‌న్సాస్ ట్ర‌స్టు ప్రాభ‌వం కోసం ప‌ని చేయ‌లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. అస‌లు, మ‌న్సాస్ కార్య‌క్ర‌మాల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోలేద‌ని.. అందుకే నెల‌ల త‌ర‌బ‌డి ఉద్యోగుల‌కు జీతాలు కూడా ఇవ్వ‌లేద‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. క‌డుపు కాలిన ఆ ఉద్యోగులంతా ఇప్పుడు జీతాల కోసం ధ‌ర్నాల‌కు దిగుతున్నారు. కోర్టు ఆదేశాల‌తో.. మ‌న్సాస్ పీఠం నుంచి సంచ‌యిత వైదొలిగి.. అశోక్ గ‌జ‌ప‌తిరాజు రావ‌డంతో ఉద్యోగ‌ల్లో కాస్త‌ ధైర్యం వ‌చ్చింది. పాత రోజులు, మంచి రోజులు మ‌ళ్లీ వ‌స్తాయ‌నే ఆశ‌ చిగురించింది.  సిబ్బంది ఒక‌లా త‌లిస్తే.. ప్ర‌భుత్వం మ‌రోలా ప్ర‌తీకారం తీర్చుకుంటోంది. పెండింగ్ జీతాలు రిలీజ్ చేయాలంటూ.. ఇటీవ‌ల‌ వంద‌లాది మంది ఉద్యోగులు మ‌న్సాస్ కార్యాల‌యాన్ని చుట్టుముట్టి.. ధర్నా చేశారు. ఉద్యోగుల క‌డుపుమంట‌.. మాజీ ఛైర్‌ప‌ర్స‌న్ సంచ‌యిత‌కు క‌ళ్ల‌మంట‌లా క‌నిపించింది. అశోక్ గ‌జ‌ప‌తిరాజే మ‌న్సాస్ సిబ్బందిని రెచ్చ‌గొడుతున్నారంటూ ఆరోపించారు సంచ‌యిత‌. మ‌రోవైపు, జీతాల కోసం కార్యాల‌యాన్ని చుట్టుముట్టిన ఉద్యోగుల‌పై కేసులు పెట్టడంతో మ‌రింత క‌ల‌క‌లం చెల‌రేగింది. జీతాలు ఆప‌డం, అడిగితే కేసులు పెట్ట‌డ‌మంతా.. ఎంపీ విజ‌య‌సాయి డైరెక్ష‌న్‌లో.. ఈవోతో ఆడిస్తున్న జ‌గ‌న్నాట‌క‌మ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మ‌న్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా ఉద్యోగులంద‌రికీ వెంట‌నే జీతాలు విడుద‌ల చేయాలంటూ అశోక్ గ‌జ‌ప‌తిరాజు ఆదేశించారు. అకౌంట్‌లో డ‌బ్బులు కూడా ఉన్నాయి. ఇక శాల‌రీ ప‌డుతుంద‌న‌గా.. మ‌న్సాస్ ఈవో ఆ శాల‌రీ అకౌంట్‌ను ఫ్రీజ్ చేయించార‌ని తెలుస్తోంది. ఉద్యోగుల‌ జీతాలు ఆపేసి.. అశోక్‌కు స‌హాయ నిరాక‌ర‌ణ చేస్తున్న ఈవో వ్య‌వ‌హార శైలిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. పాల‌కుల అడుగుల‌కు ఈవో మ‌డుగులు ఒత్తుతున్నారంటూ ఉద్యోగులు మండిప‌డుతున్నారు.  ఇన్నేళ్ల‌లో సిబ్బంది జీతాల సమస్య ఇప్పటివరకు మాన్సాస్‌కి రాలేదని సంస్థ చైర్మన్ అశోక్ గజపతిరాజు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. జీతాల చెల్లింపుని అధికారులు సమస్యగా భావించటం సరికాదన్నారు. సిబ్బంది లేకపోతే సంస్ధలకు మనుగడే ఉండదన్నారు. సిబ్బంది పనిచేసేది జీతాల కోసమేన‌ని.. వారికి ఈవో ఇబ్బందులు కలిగించటం భావ్యం కాదన్నారు. జీతమడిగితే కేసులు పెడతారా? జీతం రాకపోతే ఈవో పనిచేయగలరా? అని మండిప‌డ్డారు మ‌న్సాస్‌ చైర్మన్‌ అశోక్ గజపతిరాజు.  ఇలా, మ‌న్సాస్ కేంద్రంగా జ‌రుగుతున్న రాజ‌కీయ క్రీడ‌లో.. ఉద్యోగులు బ‌లిప‌శువులుగా మారుతున్నారని అంటున్నారు. కోర్టు ఆదేశాల‌తో మ‌ళ్లీ మ‌న్సాస్ ప‌గ్గాలు చేప‌ట్టిన అశోక్ గ‌జ‌ప‌తిరాజును ఇబ్బందుల‌కు గురి చేసేందుకు.. పాల‌కులు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నార‌ని చెబుతున్నారు. మ‌రి, ఈ రాజుల యుద్ధంలో గెలుపు, ఓట‌ములు ప‌క్క‌న‌పెడితే.. శిక్ష మాత్రం ఉద్యోగుల‌కు ప‌డుతుండ‌టం ఆందోళ‌న‌క‌ర అంశం.

కేతేపల్లి మర్డర్ ఆడియో టేపు.. లీక్ 

పాలు ఇవ్వడం మాత్రమే కాదు.. పాలించడం కూడా తెలుసు అని సినిమా డైలాగ్ వినేవుంటారు. అది అక్షరాల నిజం. కానీ నేటి యువత ఆ మాటలు పఠియించుకోవడం లేదు. ప్రేమ ముసుగులో ఎన్నో ఘోరాలు చేస్తున్నారు. ఎన్ని చట్టాలు వచ్చిన , ఎన్ని శిక్షలు వేసిన ఈ దాడులు మాత్రం ఆగడం లేదు..జీవితాన్ని మరిచి ఉన్న దాడులు చేస్తున్నారు ఆవేశంలో ప్రాణాలు తీస్తున్నారు. యువతిని అకారణంగా రేప్‌ చేసి.. ఆపై చంపేశారు దుర్మార్గులు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. నలుగురు యువకులు పీకలదాకా తాగి.. చిత్రహింసలకు గురి చేసి మరీ హతమార్చారు. ఎవ్వరికీ హాని చేయని మైనర్‌ బాలిక ఆర్తనాదాలు చేసినా.. మద్యం మత్తులో ఉన్న ఆ నీచులు  కనికరించకుండా పొట్టనపెట్టుకున్నారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామానికి చెందిన మైనర్ బాలికను.. పవన్‌ మాయమాటలు చెప్పి అటవీప్రాంతానికి తీసుకెళ్లాడు. తన స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆపై చిత్రహింసలకు గురి చేశాడు. ఎక్కడ తమ బాగోతం బయటపెడుతుందోనన్న బెంగతో బాలిక మెడకు చున్నీచుట్టి చంపేశారు. ఆ సమయంలో నిందితుడు పవన్‌.. బాలిక బావ రాజుకు ఫోన్‌ చేశాడు. అమెను చంపేసి జైలుకు వెళ్తానని అతనికి తెగేసి చెప్పాడు. ఆమె బావ వద్దని చెప్పాడు. ఇప్పుడు వదిలిపెట్టు అని చెప్పాడు అయినా ఆ మూర్ఖుడు వినకుండా బాలికను చిత్రవధ చేశాడు. ఆ సమయంలో కాపాడమని బాలిక ఆర్తనాదాలు చేసిన ఆడియో ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఆ వైరల్ ఆడియో టేపు ఇప్పుడు మీడియాకు  లభించింది. కొప్పోలు గ్రామంలో ఈనెల 13వ తేదీన మైనర్ బాలిక దారుణ హత్యకు గురైంది. ఆ ఘటన రాష్ట్రాన్ని అంత ఒక్క సారి ఆందోళనలో పడేసింది. ఊరు చివర్లో ఉన్న వ్యవసాయ భూముల్లో అనుమానాస్పదంగా పడి ఉన్న ఆమె మృతదేహాన్ని చూసి గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగారు. బాలిక మెడకు చున్ని చుట్టి ఉండటంతో పాటు డెడ్‌ బాడీ పక్కనే మద్యం బాటిళ్లు పడి ఉండటం పలు అనుమానాలకు దారి తీసింది. కేతే పల్లి ఎస్‌ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అయితే ఈ విషయంలో కేతేపల్లి ఎస్‌.ఐ రామకృష్ణ విచారణ సరిగ్గా చేయలేదంటూ నిందితుడిని కాపాడాలనే అతని ఈ పని చేశాడని. గ్రామస్తులు,ఇతర  దళిత సంఘాలు ధర్నా చేపట్టాయి. ఎస్‌ఐ రామకృష్ణని సస్పెండ్‌ చేయాలని వారు  డిమాండ్‌ చేశాయి. దాంతో ఎస్‌ఐ రామకృష్ణను విఆర్‌కి అటాచ్‌ చేస్తూ డిఐజీ రంగనాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. మైనర్‌ బాలిక పోస్టుమార్టంలో ఆధారాలు తారు మారు చేశారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేయడంతో డిఐజీ రంగనాథ్‌ స్పెషల్‌ ఆపీసర్‌ సతీష్‌ ఐపీఎస్‌ను నియమించారు. పోలీసుల సమక్షంలో రీ పోస్టుమార్టం నిర్వహించి రిపోర్టు ఇచ్చారు. ఈ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. బాలికపై అత్యాచారం చేసి.. ఆపై హత్య చేసినట్లు తేలింది. దీంతో పవన్‌, అతని స్నేహితులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అమాయకురాలైన బాలికను చంపిన దుండగులను ఉరితీయాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

హుజురాబాద్ బరిలో వెయ్యి మంది? కేసీఆర్ కు షాక్ తప్పదా..

రెండు దశాబ్దాలుగా తమకు కంచుకోటగా ఉన్న హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కాపాడుకునేందుకు అన్ని శక్తులు ఒడ్డుతోంది అధికార టీఆర్ఎస్ పార్టీ. తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో పాటు మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు రాజకీయంగా చెక్ పెట్టాలని వ్యూహాలు రచిస్తోంది. హుజురాబాద్ లో గెలిచి కేసీఆర్ కు షాక్ ఇవ్వాలని చూస్తున్న రాజేందర్ ను ఎట్టి పరిస్థితిల్లోనూ ఓడించేలా గులాబీ దళం స్కెచ్ వేస్తోంది. అందులో భాగంగానే ఈటలకు మద్దతుగా ఉంటున్న వారికి గాలం వేస్తున్నారని, ప్రలోభాలకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తన పాదయాత్రకు ఇబ్బందులు కల్గిస్తున్నారని, తన అనుచరులను బెదిరిస్తున్నారని ఈటల పదే పదే ఆరోపణలు చేస్తున్నారు.  అయితే ఈటలకు చెక్ పెట్టాలని ప్లాన్ వేస్తున్న అధికార పార్టీకి మరో రకంగా షాక్ తగిలే సూచనలు కన్పిస్తున్నాయి. తమ ఉద్యోగాలు తొలగించడంపై ఆగ్రహంగా ఉన్న ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టేంట్లు హుజురాబాద్ ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. తమను తిరిగి ఉద్యోగాల్లో తీసుకుంటూ రీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇవ్వకపోతే ప్రత్యక్ష ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కలు చూపించాలని భావిస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఏకంగా వెయ్యి మందిని బరిలోకి దింపాలని చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న 7,600 మంది ఫీల్డ్ అసిస్టెంట్‌లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని.. లేనట్టయితే బై పోల్‌ బరిలో నిలిచి టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని హెచ్చరిస్తున్నారు.  ఫీల్డ్ అసిస్టెంట్ల ఆందోళనకు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు మద్దతు ఇస్తున్నాయి.  బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కూడా ఇదే ప్రకటన చేశారు. హుజురాబాద్ లో వెయ్యి మంది నామినేషన్ వేసి కేసీఆర్ కు ఝలక్ ఇవ్వాలని ఆయన పిలుపిచ్చారు. గతంలో జరిగిన హుజూర్‌నగర్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు ముందు కూడా ఫీల్డ్ అసిస్టెంట్లు ఇలాంటి హెచ్చరికలే చేశారు. అయితే సమస్యను పరిష్కరిస్తామని ప్రభుత్వం నుంచి హామీ రావడంతో పోటీ నుంచి వెనక్కి తగ్గారు. అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత తమను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న బాధితులు.. ప్రభుత్వం దిగి రాకపోతే హుజురాబాద్ ఉప ఎన్నికలో తమ ప్రతాపం చూపిస్తామని అంటున్నారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, వారి కుటుంబాలు కూడా క్షేత్ర స్థాయిలో ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు.  ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు వెయ్యి మంది హుజురాబాద్ బరిలో నిలిస్తే రికార్డు బ్రేక్ కానుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో రైతులు నిజామాబాద్ లోక్ సభకు పోటీ చేశారు. నిజామాబాద్ ప్రాంతానికి చెందిన 175 మంది రైతులు అప్పటి ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థుల గెలుపు ఓటములను శాసించారు. ఆ ఎన్నికల్లో కేసీఆర్ కూతురు కవిత ఓడిపోయారు. పసుపు రైతుల వల్లే కవిత ఓడిపోయిందని టీఆర్ఎస్ భావిస్తోంది. గతంలో నల్గొండ నుంచి ఫ్లోరైడ్ బాధితులు దాదాలు నాలుగు వందల మంది పోటీ చేశారు. ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఏకంగా వెయ్యి మంది పోటీ చేస్తే దేశంలోనే అరుదైన రికార్డు నమోదు కానుంది. అంతేకాదు అధికార పార్టీకి నష్టం కల్గించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

సెకండ్ వేవ్ లో ఒక్కరు కూడా ఆక్సీజన్ లేక మరణించలేదు.. మోడీ సర్కార్.. 

కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేసింది..అయితే కరోనా మీద ప్రజలకు అనుమానం లేకపోలేదు.. ఇది మెడికల్ మాఫియా అని కొందరు అంటే.. మరికొందరు డాక్టర్స్ కార్పొరేట్ సంస్థ ల పని అని మరికొందరు ఎవరి వారి వాదనలు వినిపించారు. మరి కొంత మంది కరోనా లేదు ఏం లేదని జరుగుతున్నది అంట నాటకం అని కూడా తెగేసి చెప్పారు.  వైరస్ సెకండ్ వేవ్ దేశంలో ఎంతటి విలయాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన అందరం కళ్లారా చూశాం.. దేశం వీధులు శవాలతో నిండాయి.. ఎంతో మంది ప్రాణాలు చేతిలో పట్టుకుని తిండి తిప్పలు లేక బతకాలంటే కోరిన ఒక్కటే గుండెల్లో పెట్టుకుని ఎలాగైనా తమ ఊర్లకు చేరుకుంటే చాలు అన్నట్లు నడవలేక వారి రక్తంతో భూమికి అభిషేకం చేశారు.. ఎక్కడికక్కడే ప్రజలు పిట్టల రాలిపోయారు.  దేశంలో మొదటి వేవ్ చూపించిన విధ్వంసం కంటే నాలుగు రేట్లు ఎక్కువగా ప్రభావం చూపించింది. రోజుకి నాలుగున్నర లక్షలకి పైగా కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వేల సంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకున్నాయి. సెకండ్ వేవ్ లో నమోదు అయిన మరణాల్లో ఎక్కువశాతం ఆక్సీజన్ అవసరం అయిన సమయంలో అందుబాటులో లేకపోవడం వల్లే జరిగాయి అని ఎవరైనా చెప్తారు. ఎందుకు అంటే ఆ సమయంలో ప్రభుత్వాలు కోర్టులు మీడియా ఆక్సీజన్ గురించి అంతగా మాట్లాడాయి. లక్షల మంది రోగులు ఆక్సిజన్ లేక విలవిల్లాడటం పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా వేల మంది చనిపోవడాన్ని జనం ప్రత్యక్షంగా చూసినా ప్రభుత్వాలకు మాత్రం ఆక్సిజన్ మరణాలు ఒక్కటి కూడా కనిపించలేదట. అయితే ప్రభుత్వాలు ఏ సమయంలోను తమ తప్పిదం వల్ల మనుషులు చనిపోయారని వారు అంగీకరించరు. ఇప్పుడు కూడా పార్లమెంట్ లో అదే సీన్ రిపీట్ అయ్యింది. తాజాగా రాజ్యసభలో కరోనా అంశంపై జరిగిన చర్చలో ఆక్సిజన్ కొరత కారణంగా ఒక్కరంటే ఒక్కరు కూడా దేశంలో చనిపోలేదని కేంద్రం ఓ కీలకమైన భారమైన తప్పుడు  స్టేట్ మెంట్ ఇచ్చింది మోడీ ప్రభుత్వం.. మరి సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ లేక ప్రాణాలు పోలేదని వాళ్ళు ఏరకంగా చనిపోయారో మోడీ కి తెలియదా.. సెకండ్   వేవ్ లో ఆక్సిజన్ కొరత వల్ల రోగులు మరణించినట్లు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి నిర్దిష్టమైన సమాచారం లేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాజ్యసభకు తెగేసి చెప్పింది మోడీ సర్కార్. తొలి వేవ్ కంటే రెండో వేవ్ లో మెడికల్ ఆక్సిజన్ కు డిమాండ్ పెరిగిందని మాత్రం మోదీ సర్కారు అంగీకరించింది. తొలి వేవ్ సమయంలో 3095 మెట్రిక్ టన్నులుగా ఉన్న మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ రెండో వేవ్ సమయంలో 9000 మెట్రిక్ టన్నులకు పెరిగిందని స్వయంగా తానే రంగంలోకి దిగి రాష్ట్రాలన్నిటికీ సమానంగా మెడికల్ ఆక్సిజన్ పంపిణీ చేశామని కేంద్రం వెల్లడించింది. ఈ ఒక్క వార్త చాలు మోడీ బీజేపీ ప్రభుత్వానికి ఈ దేశం పై ఈ దేశ ప్రజలపై ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి.. ఒకవైపు దేశం మొత్తాన్ని అతలాకుతలం చేసిన సెకండ్ వేవ్ లో ఎవరు ఆక్సిజన్ తో చనిపోలేదని చెప్పడం ఏంటి మోడీ..  పార్లమెంట్ సమావేశాల రెండో రోజైన మంగళవారం కూడా కరోనా పరిస్థితుల నిర్వహణలో మోదీ సర్కారు వైఫల్యంపై విపక్షాలు ఆందోళన చేశాయి. ఏకంగా ప్రశ్నల ప్రవాహమే మొదలైయింది. దేశం మొత్తం  కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరత వల్ల సంభవించిన మరణాలు మొత్తం మరణాల సంఖ్య దాచివేత ఆరోపణలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాడవీయ అదే శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ సమాధానాలిచ్చారు. వైద్యం ఆరోగ్యం అనేవి రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని అంశాలన్న కేంద్రం ఆయా రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రతి నిత్యం కేసుల సంఖ్యను మరణాల సంఖ్యను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాయని మరణాలను నివేదించవలసిన విధానంపై అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు సవివరమైన మార్గదర్శకాలను జారీ చేశామని అయితే ఆక్సిజన్ కొరత వల్ల సంభవించిన మరణాలంటూ నిర్దిష్టంగా తెలియజేయలేదని కేంద్ర మంత్రులు పార్లమెంటుకు తెలిపారు. ఇంకా నయ్యం మన దేశంలో కరోనా వల్ల ఒక్కరు కూడా చనిపోలేదని చెప్పలేదు మోడీ సర్కార్. ఆక్సీజన్ కొరత కారణంగా ఓ ఒక్కరు చనిపోలేదు అని దేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా కేంద్రానికి సమాచారం ఇవ్వలేదట. మరి అలాంటప్పుడు ఆక్సిజన్ కొరత లేకపోతే మనుషులు పిట్టల్లా రాలిపోకపోతే  ప్రపంచం మొత్తం  ఉరుకులు పరుగుల మీద ఎందుకు ఇండియాకు ఆక్సిజన్ పంపిందో కేంద్రం చెప్పాల్సి ఉంది.  వందల కొద్ది మరణాలు  శ్మశానాల ముందు బారులు తీరిన మృతదేహాలు ఆక్సిజన్ కోసం కోర్టుకెళ్లిన రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి వార్తలతోనే సెకండ్ వేవ్ నడిచిపోయింది. ఏపీలో తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 30మందికిపైగా చనిపోయారని ప్రభుత్వం నష్టపరిహారం కూడా ఇచ్చింది. ఇవేమీ లెక్కలోకిరాలేదు. చివరికి ధర్డ్ వేవ్ వస్తుందన్న ఆందోళన.. సెకండ్ వేవ్ లాంటి పరిస్థితులు రిపీట్ కాకుండా ఉండాలన్న లక్ష్యంతో వేల కొద్దీ ఆక్సిజన్ ప్లాంట్ ల కు కేంద్రం నిధులిస్తోంది. ఇన్ని జరుగుతున్నా కూడా దేశంలో ఆక్సిజన్ కొరత కారణంగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదు అంటూ దేవాలయం వంటి రాజ్యసభ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. ఇప్పుడు చెప్పాలి మన దేశ ప్రజలు దేశ భక్తులు ఎవరో.. దేశ ద్రోహులు ఎవరో.. దేశాన్ని విచ్చిన్నం చేసేదెవరో దేశాన్ని అభివృద్ధి వైపు నడిపించేది  ఎవరో.. ప్రజలారా ఇంకెంత కాలం మోసపోతారు.. మేలుకోండి..    

పెట్రోల్ మంటలకు ఇదిగో విరుగుడు..

పెరుగుట విరుగుట కొరకే అనే సామెత, పెట్రోల్, డీజిల్‌ ధరలకు మాత్రం వర్తించేలా లేదు. పెట్రోల్, డీజిల్‌ ధరలు పాపంలా ప్రతి రోజు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇప్పట్లో కాదు, ఎప్పటకీ పెరిగిన ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. కేంద్ర పెట్రోలియం, ఇంధన శాఖ మాజీ  మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే పెట్రోల్, డీజిల్‌ ధరలు సమీప భవిష్యత్తులో తగ్గే ఆవకాశం ఇప్పట్లో లేదని ఎప్పుడోనే స్పష్టం  చేశారు.  ఈ నేపధ్యంలో మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్‌ వాహనాల మధ్యతరగతి ప్రజలకు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల  వైపు చూస్తున్నారు. ఇంచు మించుగా గత నెల రోజులలో గ్రేటర్‌లో హైదరాబాద్ నగర్ పరిధిలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. గత నెలరోజుల్లో సుమారు 5 వేలకు పైగా బైక్‌ల విక్రయాలు జరిగినట్లు అధికార లెక్కలు సూచిస్తున్నాయి.  ఎలక్ట్రిక్‌ వాహనాలకు జీవితకాల పన్నుతో పాటు వాహనం రిజిస్ట్రేషన్‌ చార్జీలను కూడా ప్రభుత్వం మినహాయించింది. ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వీస్‌ కింద 2 లక్షల బైక్‌లకు ఈ మినహాయింపు వర్తించనుంది. అలాగే మరో 10 వేల వరకు కార్లు,  3 వేల ఆటోలు, తదితర రవాణా వాహనాలకు కూడా ఈ మినహాయింపును ఇచ్చారు. కొద్ది రోజుల  క్రితంరవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అంశాన్ని వెల్లడించారు. ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. ద్విచక్ర వాహనాలతో పాటుగా కార్లు, ఆటోలు కూడా అమ్మకానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఇంకా విక్రయాలు ప్రారంభం కాలేదు. అయితే ప్రజలు బుకింగ్‌ల పట్ల మాత్రం ఆసక్తి చూపుతున్నట్లు నగరంలోని ఓ ఎలక్ట్రిక్‌ వాహనషోరూమ్‌ నిర్వాహకులు తెలిపారు. ఎలక్ట్రిక్‌ వాహనాలపైన ప్రభుత్వం ప్రత్యేక పాలసీని అమల్లోకి తేవడానికి ముందు నుంచే నగరంలో వీటి అమ్మకాలు  జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం మరింత ఆదరణ పెరిగింది.   అయితే  ఇంకా విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలు అందుబాటులోకి రాక పోవడంతో సహా కొన్ని చిన్న ప్రతిబందాకాలు ఉన్నప్పటికీ, ఎలక్ట్రిక్ వాహనాలు త్వరలోనే నగర రోడ్ల పై పరుగులు తీస్తాయని అంటున్నారు.ఎలక్ట్రిక్ బైక్ ను ఒకసారి చార్జింగ్‌ చేస్తే 110 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చును.. నగరంలో ఇంటినుంచి కార్యాలయానికి కార్యాలయం నుంచి ఇంటికి ప్రయాణించే వారికీ ఛార్జింగ్ సమస్య కూడా ఉండదని అంటున్నారు. అయితే, ఈ వాహనాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో  ... చూడవలసి వుంది.

కేంద్రం నిధులిచ్చినా ఖర్చు చేయని సర్కార్! కేసీఆర్ తీరుతో పేదలకు నష్టం..

కేంద్ర ప్రభుత్వం అయినా  రాష్ట్ర ప్రభుత్వమే అయినా ప్రజల సోమ్ముతోనే, అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తాయి. ఇందుల  కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు లేదా కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రధాని, ముఖ్యమంత్రి తమ సొంత సంపద నుంచి ఇచ్చేది చిల్లిగవ్వ కూడా ఉండదు. అయినా, ప్రతిపార్టీ, ప్రతినాయకుడు కూడా తమ సొంత జేబులోంచి తీసి ప్రజల జేబులు నింపుతున్నామని, సంక్షేమ పథకాల అమలుకు ఇన్ని వేల కోట్లు,అన్ని లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని గొప్పలు పోతారు. నిజానికి,రాజకీయ పార్టీలు, నాయకులే సక్రమంగానో అక్రమంగానో ప్రజల సొమ్ము అనుభవిస్తారు. పండిన ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుందని సామెత, అదేమో కానీ, రాజకీయ నాయకులు తినే ప్రతి మెతుకు మీద, ప్రజల పేరే ఉంటుంది. ప్రజలు తమ రక్తం, చెమట కలిపి చేసిన సిరాతో చేసిన సంతకమే ఉంటుంది. అది రాజకీయం.ఆ విషయాన్ని అలా ఉంచితే, కేంద్రానికి లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి పేరొస్తుందని, లేదా ఆ పార్టీకి వచ్చే ఓట్లు పది పెరుగుతాయనో, కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయక పోవడం, అప్పుడప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాదు, మేధావి, మీడియా వర్గాల్లోనూ చర్చకు వచ్చిన సందర్భాలు లేక పోలేదు. ఇలా కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయక పోవడం వలన రాజకీయ లాభనష్టాలు ఎలాఉన్నా ప్రజలకు మాత్రం నష్టం జరుగుతుంది.  తెలంగాణలో అధికారంలో ఉన్న తెరాస ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు మొదటినుంచి కూడా పెద్దగా ఆసక్తి చూపని విషయం అందరికీ తెలిసిందే. అలాగే, కేంద్ర ప్రభుత్వనిధులతో అమలయ్యే పథకాలలో కూడా కేంద్రం పేరు బయటకు రాకుండా,’కేసీఆర్ కిట్స్’ అనో  మరోటనో సొంత పేర్లు పెట్టుకోవడం సర్వసాధారణం అయిపోయింది. కొన్ని పథకాల విషయంలో అయితే అది రాజకీయ వివాదాలకు దారి తీసిన సందర్భాలు కూడా లేక పోలేదు. కిలో రూపాయి బియ్యం పధకంలో కేంద్రం సమకూర్చే నిధులు ఎక్కువగా, రాష్ట్రం సమకూర్చే నిధులు నామమాత్రంగా ఉంటాయి.అయినా సబ్సిడీ బియ్యం క్రెడిట్’ను రాష్ట్ర ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుంటుంది. ఆయుష్మాన్ భారత్ – ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన’ పేరిట కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాన్ని, నిన్నమొన్నటిదాక తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. అదేమంటే ఆయుష్మాన్ భారత్ కంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీనే అద్భుత పథకమని ముఖ్యమత్రి సమాధానం. అయితే ఆయుష్మాన్’లోలాగా ఆరోగ్యశ్రీలోనూ  కరోనాను, చేర్చాలని విపక్షాలు వెంట పడడంతో, ఆయుష్మాన్ భారత్ పథకాన్ని స్టేట్’లో అములు చేసేందుకు ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారు.   తాజాగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి గ్రామీణ ఆవాస్‌ యోజన (పీఎంజీఏవై) పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్‌ జ్యోతి మంగళవారం లోక్ సభకు తెలిపారు.అంటే కాదు,  2016-17లో ఈ పథకం కింద విడుదల చేసిన రూ.190.78 కోట్లను ఈ కారణంగా తిరిగి ఇచ్చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించామని ఆమె వెల్లడించారు. మంగళవారం లోక్‌సభలో బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ఆమె లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.  పేద ప్రజల సొంత ఇంటి కలలను నిజమా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈపధకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. అయితే,రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను ఖర్చు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, కేంద్ర ప్రభుత్వం నిదులను వెనక్కి పంపమని కోరింది. గడచిన ఏడేళ్ళలో ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.849.01 కోట్ల నిధులు విడుదల చేసింది. అందులో 2016, 2017 ఆర్థిక సంవత్సరాలకు కేటాయించిన రూ.190.78 కోట్లను వినియోగించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడంతో.. ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది కేంద్రం. ఇదే అదనుగా  రాష్ట్ర బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అర్హులైన పేదలకు సొంత ఇంటి కలను నిజం చేసేందుకు  కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొస్తే.. కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మదిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రవేశపెట్టిన పథకం కింద రాష్ట్రానికి 70వేలకు పైగా ఇళ్లు మంజూరైతే. ఒక్కటి కూడా కట్టలేదని బండి ఆరోపించారు. రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకం వలన రాష్ట్రానికి వచ్చిన 70 వేల ఇల్లు  వెనక్కి వెళ్లి పోయాయి.

ఐస్ క్రైమ్ పేరు బ్లాక్ డైమండ్ .. ధర 60 వేలు.. 

ఐస్ క్రైమ్ ఆ పేరు వింటే చిన్న పెద్ద, చివరికి వయసుతో తేడాలేకుండా అందరి నోళ్లు ఉరిల్లు ఊరుతాయి.  మన దేశంలో సాధారణంగా ఐస్ క్రీమ్ ల ధరలు చూసుకుంటే 10 రూపాయల నుంచి మొదలై వేయి రూపాయల వరకు ఉంటాయి. అది ఎవరి తహతనిబట్టి వాళ్ళు తింటుంటారు. కానీ మనం మాట్లడుకోబోయే ఐస్ క్రైమ్ ధర అక్షరాల 60 వేల రూపాయలు. అంటే ఒక సామాన్యుడి ఆరునెలల జీతం  అన్నమాట. చాలా ప్రదేశాల్లో ఐస్ క్రీమ్ ల ధరలు షాక్ కలిగేలా ఉంటాయి. ఇంత ధర చెల్లించి అసలు వీటిని ఎవరు కొంటారు? అనే ఆశ్చర్యం చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. కానీ ఐస్ క్రీమ్ లంటే చాలా మందికి ఫేవరెట్. ఆ కారణం చేతే కొంత మంది ఎంత రేటైనా చెల్లించి ఐస్ క్రీమ్ ను తినాలని చూస్తుంటారు. అటువంటి వారి కోసం నిర్వహకులు కూడా వివిధ వెరైటీలతో ఐస్ క్రీమ్స్ తయారు చేస్తుంటారు. ఒక మన దేశంలోనే అని కాదు ప్రపంచవ్యాప్తంగా ఐస్ క్రైమ్ అంటే ఎక్కడైనా ఫేమస్.. ప్రాంతంతో సంబంధం లేకుండా.. వానాకాలం ఎండాకాలం, చలికాలాలతో సంబంధం లేకుండా పిల్లలు ఈ ఐస్ క్రీమ్ లను తినేందుకు చాలా మక్కువ చూపుతారు. వాళ్ల పేరెంట్స్ వద్దని చెప్పినా నాకు ఐస్ క్రైమ్ కావాలి.. నాకు ఐస్ క్రైమ్ కావాలి అని గొడవ చేసి మరి  ఎలాగైనా ఐస్ క్రీమ్ లు తింటూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఐస్ క్రీమ్ లతో పాటు చివాట్లు కూడా తింటుంటారు. అప్పుడప్పుడు దెబ్బలు కూడా పడుతుంటాయి. ఇలా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఇష్టంగా తినే ఐస్ క్రీమ్ ల గురించి ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచిన ట్రావెలర్ షెనాజ్ ట్రెజరీ కి దేశ విదేశాల్లో ఉన్న ఐస్ క్రీమ్ ల రుచులు చూడాలని కోరిక పుట్టింది. అందుకోసమే ఆమె ఈ మధ్యే దుబాయ్ కి వెళ్లి అక్కడ ఉన్న ఐస్ క్రీమ్ రుచి చూసింది. కేవలం ఆమె రుచి చూడడమే కాకుండా అక్కడి ఐస్ క్రీమ్ రకాలను అందరికీ పరిచయం చేస్తూ... యూ ట్యూబ్ లో ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఆమె చెప్పిన ప్రకారం దుబాయ్ లోని జుమేరా రోడ్డులో ఐస్ క్రీమ్ ధర వింటే మన కళ్లు బైర్లు కమ్ముతాయి. ఏకంగా అక్కడ ఐస్ క్రీమ్ కు 840 డాలర్ల ధర ఉందని ఆమె తెలిపింది. మన దేశ కరెన్సీలో 840 డాలర్లంటే దాదాపు 60వేల రూపాయల పైమాటే.  ఇక అరవై వేల రూపాయల ధర ఉండేందుకు ఆ ఐస్ క్రీమ్ ను దేనితో తయారు చేసి ఉంటారని ప్రతి ఒక్కరిలోనూ సందేహం కలుగుతోంది. ఆ ఐస్ క్రైమ్ ఎలా తయారు చేస్తారో తెలుసుకోవాలనుకుంటాడు. అయితే ఈ ఐస్ క్రీమ్ తయారీలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెనీలా బీన్స్ బంగారు రేకులు ఉపయోగిస్తారట. అందుకే ఆ ఐస్ క్రీమ్ కు అంతలా రేటు హైదరాబాద్ లో సైట్ లా ఈ ఐస్ క్రైమ్ కి ఆ ధర నిర్ణయించారు. అంతే కాకుండా 60 వేల రూపాయలున్న ఐస్ క్రీమ్ కు బ్లాక్ డైమండ్ అనే పేరును కూడా పెట్టారు. షెనాజ్ పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఒక్క ఐస్ క్రీమ్ రేటుతో ఇండియాలో ఒక చిన్న కుటుంబం ఏడాది పాటు బతికేయ వచ్చు కదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంత రేటు ఉన్నా కూడా అక్కడ ఆ ఐస్ క్రీమ్ ను చాలా మందే తింటున్నారని షెనాజ్ తెలిపారు. 

గోల్డెన్ ఫెరారీ.. వై దిస్ అంటూ మ‌హీంద్రా వ‌ర్రీ!

ఒక‌రికి తింటానికి తిండే ఉండ‌దు. ఇంకొక‌రికి డ‌బ్బు ఏం చేసుకోవాలో తెలీదు. ప్ర‌పంచం అలానే ఉంటుంది. పేద‌వాడు ఆక‌లితో అల‌మ‌టిస్తుంటే.. ఉన్నోడు పైలాప‌చ్చీస్‌లా ఎంజాయ్ చేస్తుంటాడు. అలాంటి ఓ రిచ్ ప‌ర్స‌న్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అది కాస్తా ఆనంద్ మ‌హీంద్రాను చేరింది. ఆయ‌న చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఆలోచింప చేసేలా ఉన్నాయి.  అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి ఫెరారీ కారేసుకొని వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. అక్క‌డి వారంతా ఆయ‌న్ను, ఆయ‌న కారును ఆశ్చ‌ర్యంగా చూస్తున్నారు. ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. అమెరికాలో ఫెరారీ కార్లు కామ‌నే క‌దా. చాలా మంది ద‌గ్గ‌ర ఉంటాయి క‌దా. మ‌రి, మ‌నోడి కారునే ఎందుకంతా వింత‌గా చూస్తున్నార‌నే డౌట్ రావొచ్చు. ఎందుకంటే, ఆ ఎన్నారైది మామూలు ఫెరారీ కారు కాదు. గోల్డ్ కోటెడ్ కార్‌. కారునంతా బంగారంతో పోత పోయించాడు. ఆ గోల్డెన్ కార్‌తో వీధుల్లో ఊరేగుతున్నారు. అందుకే, ఆ కారుకంత క్రేజ్‌. కారుతో పాటు ఆయ‌న‌కంత ఫాలోయింది.  ‘ఇండియన్‌ అమెరికన్ విత్‌ ప్యూర్‌ గోల్డ్‌ ఫెరారీ కార్‌’ అని రాసున్న ఆ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఇక‌, సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మ‌హీంద్రా కంటికి క‌న‌బ‌డ‌కుండా ఉంటుందా ఆ వీడియో? అయితే, ఆ కారు వీడియోతో పాటు ఆనంద్ మ‌హీంద్రా చేసిన కామెంట్లు కూడా వైర‌ల్‌గా మారాయి. ఇంత‌కీ ఆయ‌న ఏమ‌న్నారంటే.. ‘‘ఇది సామాజిక మాధ్యమాల్లో ఎందుకు చక్కర్లు కొడుతుందో నాకర్థం కావడం లేదు. మనం ధనవంతులమైనంత మాత్రాన డబ్బులు ఎలా ఖర్చు పెట్టకూడదో దీని ద్వారా మనం పాఠం నేర్చుకోవచ్చు. అందుకు తప్ప.. ఇంకా ఏ విషయంలో ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిందో?’’ అంటూ ఆయ‌న ట్వీట్ చేశారు.   

మైదానంలోనే శ్రీలంక కోచ్, కెప్టెన్ వాగ్వాదం.. వీడియో వైరల్.. 

శ్రీలంకతో జ‌రిగిన వ‌న్డే సిరీస్ ను టీమిండియా గెలుచుకుంది. తొలి వన్డేలో ఈజీగా విజయం సాధించిన భారత జట్టు.. రెండో వన్డేలో మాత్రం కష్టపడి నెగ్గింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో చివరికి మూడు వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.నిజానికి రెండో మ్యాచ్ లో టీమిండియా గెలవడం అంతా అసాధ్యమనుకున్నారు. రెండు వందల పరుగులకు లోపే ఏడు వికెట్లు కోల్పోవడంతో అంతా లంకే గెలుస్తుందని అనుకున్నారు. కాని దీపక్ చాహార్ అద్బుతంగా ఆడి.. భువనేశ్వర్ తో కలిసి ఇండియాను గెలిపించారు.  రెండో మ్యాచులో  మైదానంలోనే అనూహ్య ఘటన జరిగింది.  శ్రీ‌లంక ప్రధాన కోచ్‌ మికీ ఆర్థర్‌కు, ఆ జ‌ట్టు కెప్టెన్‌ దాసున్ షనకల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. మొదట టీమిండియా ఓటమి దిశగా సాగుతున్నప్పుడు డ్రెస్సింగ్‌ రూమ్‌లో సంతోషంగా కనిపించిన ఆర్థర్‌.. క్రమంగా చహర్‌ నిలుద్కొకుకోవడం.. ఆ తర్వాత భువీతో కలిసి ఇన్నింగ్స్‌ నడిపించడం ఆర్థర్‌కు సహనం కోల్పోయేలా చేశాయి. ఈ సందర్భంగా అతను డ్రెస్సింగ్‌ రూమ్‌లో కోపంతో విచిత్రమైన హావభావాలు ఇచ్చాడు.  ఇక శ్రీ‌లంక ఆట‌గాళ్లు మ్యాచుపై ప‌ట్టు కోల్పోతోన్న స‌మయంలో డ్రెస్సింగ్‌ రూమ్‌లో కోపంతో ఊగిపోయిన ఆర్థ‌ర్ ఆట‌గాళ్ల‌పై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. మ్యాచ్‌ చివరి ఓవ‌ర్ల స‌మ‌యంలో ఆర్థర్  మైదానంలోకి వచ్చి కెప్టెన్‌ షనకతో మాట్లాడారు. ఆ సమయంలో కెప్టెన్ షనక కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఆ స‌మ‌యంలో ఇద్ద‌రి మధ్య  వాగ్వివాదం చోటు చేసుకుంది. కోచ్ ను గ్రౌండ్ బయటికి వెళ్లాకంటూ షనక చేతులు చూపిస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది.  శ్రీలంక కోచ్, కెప్టెన్ కు వాగ్వాదం జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ట్విటర్‌లో వెలుగు చూసింది. వైరల్ గా మారింది. ఈ వీడియోపై అభిమానులు ఎవరికి తోచింది వారు కామెంట్‌ చేశారు. '' మ్యాచ్‌ జరుగుతుంటే కోచ్‌ మైదానంలోకి అడుగుపెట్టడం రూల్స్‌కు విరుద్ధం.. టీమిండియా ఆట తీరును డిస్టర్బ్‌ చేయాలనే ఆర్థర్‌ ఇలా ప్లాన్‌తోనే షనకతో గొడవపడినట్లు నటించాడంటూ కొందరు కామెంట్ చేశారు. అసలు మ్యాచ్‌ జరుగుతోన్న స‌మ‌యంలో కోచ్ ను మైదానంలోకి ఎందుకు రానిచ్చార‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

అమరావతిలో తేలింది.. విశాఖ ఇన్ సైడ్ ట్రేడింగ్ తేలాల్సి ఉంది!

ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌. అమ‌రావ‌తిని చంపేసేందుకు జ‌గ‌న్ స‌ర్కారు చ‌ల్లిన బుర‌ద‌నే ఆరోపణలున్నాయి. చంద్ర‌బాబును దెబ్బ‌తీసేందుకు ప‌న్నిన ప‌న్నాగమని చెబుతారు. నాలుగు సార్లు దొంగా దొంగా అంటే.. నిజంగానే దొంగ అనుకోవాల‌నే కుతంత్రం దీని వెనుక ఉందంటారు.  అన్ని ఛానెల్స్‌లోనూ బ్రేకింగ్ న్యూస్ రావ‌డంతో జ‌నాలు సైతం అవునా అంటూ ఆశ్చ‌ర్య‌పోయారు. కావొచ్చేమో.. అలా జ‌రిగుండొచ్చేమోన‌ని అనుమానించారు. చంద్ర‌బాబును బ‌ద్నామ్ చేయ‌డంలో ఎంతోకొంత స‌క్సెస్ కూడా అయ్యారు. నోటీసులు, కేసుల‌తో నానా హంగామా చేశారు. టీడీపీ బ్యాచ్‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేశారు. వంద‌లాది మంది రైతుల ఉసురు పోసుకున్నారు. చంద్రబాబు గురించి తెలిసిన వారు మాత్ర‌మే.. ఆయ‌న‌కు రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు మిన‌హా వేరే ఏవీ ప‌ట్ట‌వ‌ని.. ఎట్టిప‌రిస్థితుల్లోనూ అలా జ‌రిగి ఉండ‌ద‌ని ధీమాగా ఉన్నారు. అయితే, అరాచ‌కం ఎంత‌లా విర్ర‌వీగినా.. న్యాయానిదే తుది విజ‌యమ‌ని అప్పుడు గ్ర‌హించ‌లేక‌పోయారు. ఇప్పుడు ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ లేదూ, పాడూ లేదంటూ.. సుప్రీంకోర్టు తీర్పుతో త‌ల ఎక్క‌డ పెట్టుకోవాలో అర్థంకాని ప‌రిస్థితి అధికార ప‌క్షానిది.  ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌లు, క్విడ్‌ప్రోకోలు, అధికారం అడ్డుపెట్టుకొని దోచుకోవ‌డాలు, షెల్ కంపెనీలు, సూటుకేసు కంపెనీల‌తో.. వేల కోట్ల ఆస్తులు పోగేసుకోవ‌డాలు, పెద్ద పెద్ద ప్యాలెస్‌లు క‌ట్టుకోవ‌డాలు.. జ‌గ‌న్‌కు అల‌వాటేమో కానీ.. చంద్ర‌బాబుకు కాదని టీడీపీ నేతలు అంటున్నారు. మ‌చ్చ లేని, మ‌ర‌క ప‌డ‌ని నాయ‌కుడు ఆయ‌న‌. మూడుసార్లు ముఖ్య‌మంత్రిగా ఉన్నా.. తెలుగురాష్ట్రాల‌పై చెర‌గ‌ని ముద్ర వేసినా.. ఐటీతో తెలుగునేల‌ను మేటిగా మార్చినా.. అమ‌రావ‌తితో ప్ర‌పంచ స్థాయి రాజ‌ధానిని తీర్చిదిద్దే ప్ర‌య‌త్నం చేసినా.. ఏనాడు ఆయ‌న‌పై చిన్న అవినీతి ఆరోప‌ణ కూడా రాలేదని చెబుతున్నారు. ద‌మ్ముంటే సీబీఐ ఎంక్వైరీ వేసుకోమంటూ చంద్రబాబే స్వ‌యంగా స‌వాల్ చేసినా.. ఆయ‌న‌పై కేసుక‌ట్టే ధైర్యం ఎవ‌రూ చేయ‌లేదు. ఎందుకంటే ప్ర‌త్య‌ర్థుల‌కు కూడా తెలుసు.. చంద్ర‌బాబు తెరిచిన పుస్త‌కం.. తెల్ల కాగితం లాంటి వార‌ని.  చంద్ర‌బాబుకు లెక్క‌కుమించి ఆస్తులు లేవు, అంత‌స్తులు లేవు. ఉన్న‌ద‌ల్లా హైద‌రాబాద్‌లో ఓ ఇల్లు మాత్ర‌మే. అమ‌రావ‌తిలో ఉన్నా అద్దె ఇంటితోనే అడ్జ‌స్ట్ అయ్యారు. అంతేగాని జ‌గ‌న్‌లా మూడు రాష్ట్రాల్లో మూడు ప్యాలెస్‌లు క‌ట్టుకోలేదు.  ఒక్క హెరిటేజ్ మిల్క్ మిన‌హా ఎలాంటి ఆస్థిపాస్తులూ లేవు. జ‌గ‌న్‌లా సీఎం కాక‌ముందే వంద‌లాది సూటుకేసు కంపెనీలు పెట్టి.. అడ్డంగా దోచుకొని.. అక్ర‌మార్జ‌న‌కు పాల్ప‌డ‌లేదు. అందుకే, చంద్ర‌బాబును జ‌నం న‌మ్మారు. మూడుసార్లు ముఖ్య‌మంత్రిగా అవ‌కాశం ఇచ్చారు. ఒక్క ఛాన్స్ అంటూ ఇప్పుడు జ‌గ‌న్ అంద‌ల‌మెక్కి.. తైత‌క్క‌లాడుతున్నా.. చంద్ర‌బాబు ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాల‌ని ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ అంటూ ఎంత‌గా బట్ట కాల్చి మీదేస్తున్నా.. టీడీపీ అధినేత‌కు పోయేదేమీ లేదు. ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ కేసును సుప్రీంకోర్టు కొట్టేయ‌డంతో.. నిప్పుల్లో కాల్చిన‌ బంగారంలా.. మ‌రోసారి స్వ‌చ్చంగా మారారు చంద్ర‌బాబునాయుడు. సుప్రీంకోర్టు జ‌డ్జిమెంట్‌తో చంద్ర‌బాబు స‌చ్చీలుడ‌నే సంగ‌తి మ‌రోసారి రుజువైంది. మ‌రి, ఇప్పుడు జ‌గ‌న్ తాను నిర్దోషిన‌ని నిరూపించుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చింది. ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ కాన్సెప్ట్ జ‌గ‌న్ క్రియేట్ చేసిందేన‌ని.. విశాఖ‌లో ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌కు పాల్ప‌డి.. ఆ టాపిక్‌ను డైవ‌ర్ట్ చేయ‌డానికే అమ‌రావ‌తి ఇష్యూ తీసుకొచ్చార‌ని అంటున్నారు. ఎంపీ ర‌ఘురామ లాంటి వాళ్లు మ‌రో అడుగు ముందుకేసి.. మ‌రిన్ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు, ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగని చోట ఇంత రాద్దాంతం చేసి.. ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగిన విశాఖ‌లో ఆ టాపిక్ వ‌దిలేశార‌ని ఆరోపిస్తున్నారు. విశాఖ‌ప‌ట్నంలో అంతా సెట్ చేసుకున్నాకే.. ఎగ్జిక్యూటివ్ కేపిట‌ల్‌ను తెర మీద‌కు తీసుకొచ్చార‌ని.. అంత‌కుముందే పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్ జ‌రిగిపోయింద‌ని అంటున్నారు.  ఉత్తరాంధ్రకు సీమ నుంచి తరలివచ్చిన ప్రముఖులు ఎవరు.. వారు చేసిన అరాచకాలు ఏమిటి..? వారు చేసిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఏమిటి..? సినీ ప్రముఖులకు బెదిరింపులు ఏమిటి.? బీచ్‌ రోడ్డులో ఎవరెవరి ఆస్తులను ఎలా కొల్లగొట్టారు? దసపల్లా హిల్‌ హోటల్‌ను ఏ విధంగా కొల్లగొట్టే ప్రయత్నం చేశారు? వీట‌న్నిటిపై చిత్తశుద్ధితో విచారణ చేయించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడు తేలుతుంది.. అస‌లు సంగ‌తి. ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింది ఎక్క‌డో.. చేసింది ఎవ‌రో.. దొంగ‌లంతా బ‌య‌ట‌కు వ‌స్తారు. మ‌రి, విశాఖ‌ప‌ట్నం ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్‌పైనా కేసు న‌మోదు చేసి విచార‌ణ చేసే ద‌మ్ము, ధైర్యం జ‌గ‌న్ స‌ర్కారుకు ఉందా? చంద్ర‌బాబులానే జ‌గ‌న్ సైతం నిర్దోషిగా నిరూపించుకోగ‌ల‌రా?

ఈటలకు భారీ షాక్.. హరీష్ రావుతో గండమేనా?

తెలంగాణ రాజకీయాలకు ప్రస్తుతం కేంద్రంగా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో రోజుకో ట్విస్ట్ జరుగుతోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర చేస్తుండగానే.. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కమలాపూర్ మండలం నుంచి ప్రజా దీవెన యాత్ర చేస్తున్న ఈటలను అధికార పార్టీ దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. ఇల్లందకుంట మండలంలో ఆయనకు భారీ షాక్ ఇచ్చింది. ఈటల రాజేందర్ మద్దతుదారులను లాగేస్తోంది. గులాబీ నేతల ఆకర్ష్ తో నియోజకవర్గంలో ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది.  నిన్నటివరకు రాజేందర్ వెంట నడిచిన ఇల్లందకుంటకు చెందిన కొందరు ప్రజా ప్రతినిధులు రాత్రికి రాత్రే ప్లేట్ ఫిరాయించారు. గులాబీ గూటికి చేరిపోయారు. ఇల్లందకుంట  ఎంపీపీ, ముగ్గురు సర్పంచులు, ఒక ఎంపీటీసీ.. రాజేందర్ కు గుడ్ బై చెప్పి  టీఆర్ఎస్‌కు మద్దతు తెలిపారు.  మండలానికి చెందిన ఎంపీపీ సరిగొమ్ముల పావని వెంకటేష్, సిరిసేడు, మర్రివానపల్లి, రాచపల్లి సర్పంచులు మహమ్మద్ రఫీ ఖాన్, కళాల రాజిరెడ్డి, బూస ఆదిలక్ష్మి, టేకుర్తి ఎంపీటీసీ మోట పోతుల ఐలయ్యలు మంగళవారం రాత్రి ఇల్లందకుంట ఇంచార్జి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ‘దళిత బంధు’ పథకం పట్ల ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గం నుండి ప్రారంభించడం హర్షనీయమన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని వారు వెల్లడించారు. మంత్రివర్గం నుండి బర్తరఫ్ అయినప్పటి  నుండి ఈటలకు అండగా నిలుస్తూ వచ్చారు ఈ నేతలు. టీఆర్ఎస్‌పై , సీఎం కేసీఆర్ పై విమర్శలు కూడా చేశారు.  వీరంతా టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఇల్లందకుంట మండలంలో  ఈటలకు భారీ షాక్ అని చెబుతున్నారు. ఈటలకు మద్దతుగా నిలుస్తున్న మరికొందరు నేతలతోనూ ఆధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నారని తెలుస్తోంది. మంత్రి హరీష్ రావు డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందని అంటున్నారు. ఈ విషయం తెలిసే ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. తనను చంపేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపించి కలకలం రేపారు రాజేందర్. అంతేకాదు తనకు మద్దతు ఉన్నవారికి లక్షల రూపాయలు ఆఫర్ చేస్తున్నారని చెప్పారు. ఈటల చెబుతున్నట్లే టీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి.  మరోవైపు  హుజురాబాద్ నియోజకవర్గానికే పరిమితమైన బదిలీల ప్రక్రియ ఇప్పుడు జిల్లా స్థాయి అధికారులను కూడా తాకింది. కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్న శశాంకను జీఏడికి బదిలీ చేస్తూ ఆయన స్థానంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ కర్ణన్‌కు పోస్టింగ్ ఇచ్చారు. మహబూబాబాద్ కలెక్టర్ వీపీ గౌతంను ఖమ్మం కలెక్టర్‌గా, మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న అభిలాష అభినవ్‌కు ఫుల్ అడిషనల్ ఛార్జిని అప్పగిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈటలకు గతంలో సహకరించిన ఉద్యోగులందరిని బదిలీ చేసే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. రోజుకు రోజుకు మారుతున్న సమీకరణలతో హుజురాబాద్ లో ఎప్పుడు ఏం జరుగుతుందన్న ఆసక్తి కనిపిస్తోంది. 

పెగాసస్ తీగలాగితే కర్ణాటకం డొంక కదిలింది ..

తీగ లాగితే డొంకంతా కదిలిందంటే ఇదే నేమో...  ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ వ్యవహారంతో  అనేక పాత కథలను కొత్తగా తెరమీదకు వస్తున్నాయి. రెండేళ్ళ క్రితం 2019 లో కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలి పోయింది. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన 17 మంది మ్మెల్యేలు నాటకీయ పరిణామాల మధ్య రాజీనామా చేయడంతో, ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వం, బలపరీక్షలో బాల్చి తన్నేసింది.అయితే, అప్పట్లో ప్రభుత్వం కూలిపోవడానికి సంకీర్ణ భాగస్వామ్య పార్టీల మధ్య సయోధ్యత లేకపోవడమే కారణమని అందరూ అనుకున్నారు. ముఖ్యమంత్రి జేడీఎస్ నేత కుమార స్వామి మిత్ర పక్షంమే (కాంగ్రెస్) కొమ్పకుల్చిందని వాపోయారు. కాంగ్రెస్ పెడుతున్న కష్టాలు భరించలేక పోతున్నానంటూ ఒకటి రెండు సార్లు పుబ్లిక్’లో  కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. అలాగే, కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య వంటి పెద్దలు, ముఖ్యమంత్రి కుమార స్వామి కాంగ్రెస్ పార్టీకి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వక పోవడం వల్లనే ప్రభుత్వం పతనమైందని అన్నారు. ఇలా సంకీర్ణ భాగస్వామ్య పార్టీలు  పరస్పరం ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నాయి.  అయితే, ఇప్పుడు  పెగాసస్ స్పైవైర్’ తో పాటుగా ఫోన్ ట్యాపింగ్ ఉదంతం బయటకు రావడంతో, 2019లో కర్ణాటక సంకీర్ణ  ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పెగాసస్’ను ఉపయోగించిందని  కాంగ్రెస్, ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీజేపీ ‘పెగసాస్’ను ప్రయోగించి కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి వేసిందని ఆరోపించారు.మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వరతో పాటు సిద్ధరామయ్య వ్యక్తిగత కార్యదర్శి వెంకటేష్ ఫోన్ నెంబర్’ ను హ్యాక్ చేశారని సిద్దరామయ్య ఆరోపించారు. అందులో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, ఒక్కసారి గతంలోకి వెళితే, 2019 జూలైలో 17 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారంతా బీజేపీలో చేరారు. ఈవ్యవహారం మొత్తం బహిరంగంగానే జరిగింది. ఉభయ వర్గాలు క్యాంపులు నిర్వహించాయి. ఒకరిపై ఒకరు బహిరంగంగానే ఆరోపణలు చేసుకున్నారు. కోర్టులకు వెళ్లారు. తీర్పులు వచ్చాయి. చివరకు సభలో బలపరీక్ష మీద సుదీర్ఘంగా రోజుల తరబడి చర్చజరిగింది. చివరాఖరులో బలపరీక్షలో ఓడిపోయినా తర్వాతనే ముఖ్యమంత్రి కుమార స్వామి రాజీనామా చేశారు. ఈవ్యవహారం మొత్తం టీవీలలో ప్రత్యక్ష ప్రసారం కూడా అయింది. అందరూ చూస్తుండగానే, కుమార స్వామి రాజీనామా ప్రకటన చేశారు. అప్పుడు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంచీలు చరిచి తమ ఆనందాన్ని వ్యక్తం చేయడం కూడా టీవీలలో కనిపించింది.  అయితే, కర్ణాటక అసెంబ్లీ ప్రతిపక్ష నేత సిద్దరామయ్య  ఇప్పడు  ఈ వ్యవహారం అంతా, కేంద్ర ప్రభుత్వం పెగాసస్ ద్వారానే నడిపించిందని అటున్నారు.ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రదాని మోడీ ప్రభుత్వం అడ్డదారులు తొక్కిందని,అప్రజాస్వామికంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేసిందని సిద్దరామయ్య ఆరోపించారు.  ఇక మధ్యప్రదేశ్, గోవా, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లలో ప్రభుత్వాలను కూల్చేందుకు కూడా ఈ పెగాసస్’నే ప్రయోగించారని  కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.పార్లమెంట్ ఉభయసభల్లో ఇదే విషయంపై కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. రాజ్య సభలో ప్రతిపక్ష నాయకుడు,కర్ణాటక కాంగ్రెస్ లీడర్ మల్లికార్జున్ ఖర్గే అయితే  ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జుడ్జితో  విచారణ జరిపించాలని  డిమాండ్ చేస్తున్నారు. అయితే, జేడీఎస్ నేత  మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి మాత్రం.సుదికోసం సోదికెళితే పాత రంకులన్నీ బయట పడ్డాయని అన్నట్లు అవుతుందని అనుకున్నారో ఏమో కానీ, గతం గతః ..ఇప్పుడు అదెందుకు, అంటున్నారు.

సీఎం జగన్ తీరుతో రాయలసీమకు నష్టం! 

కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. తెలంగాణ సర్కార్ దూకుడుగానే వెళుతోంది. శ్రీశైలంలో నీటిమట్టం కనీస స్థాయిలోనే ఉన్నా ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో పవన్ జనరేషన్ చేస్తూ నీటిని దిగువకు వదులుతోంది. కొన్ని రోజుల క్రితం నాగార్జున సాగర్, పులిచింతలలోనూ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ నీటిని దిగువకు వదలడంతో దాదాపు నాలుగు టీఎంసీల నుంచి ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వెళ్లాయి. కృష్ణా జలాలపై తాజాగా జరుగుతున్న పరిణామాలతో రాయలసీమ వాసుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తెలంగాణ ప్రభుత్వం నీటిని వృధాగా వదిలేస్తున్నా జగన్ సర్కార్ కట్టడి చేయలేకపోతుందనే ఆరోపణలు వస్తున్నాయి.  ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు, చేతగానితనంతో రాయలసీమకు తీరని నష్టం జరిగే అవకాశం ఉందని మాజీ మంత్రి, రాయలసీమ పరిరక్షణ సమితి నాయకుడు మైసూరా రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీటిని వాడుకుంటోందని  చెప్పారు. తెలంగాణకు ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం ఎందుకు చెప్పలేకపోతోందని ఆయన తప్పుబట్టారు. ఇద్దరు సీఎంలు కూర్చుని ఎందుకు  మాట్లాడుకోవడం లేదని మైసూరా రెడ్డి ప్రశ్నించారు.  మిత్రులుగా ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు జల వివాదంలో మాట్లాడుకోవడానికి ఎందుకు భేషజాలు అడ్డం వస్తున్నాయని నిలదీశారు.  ఇతర రాష్ట్రాల సీఎంలు నీటి సమస్యలను చర్చించుకోవడం లేదా అని మైసూరా రెడ్డి ప్రశ్నించారు. ఈ పరిస్థితి ఏపీకి మంచిది కాదని హితవుపలికారు. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టని మైసూరారెడ్డి అన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మౌనం వీడరపోతే రాయలసీమ ఎడారిలా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీకి కేటాయించిన నీటిని ఎక్కడికైనా తరలించే అవకాశం ఆ రాష్ట్రానికి ఉంటుందన్నారు. పెన్నా బేసిన్ కు కృష్ణా జలాలను తరలిస్తున్నారన్న తెలంగాణ ఆరోపణలకు పస లేదన్నారు.  ఇప్పటికైనా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించి వివాదానికి చెక్ పెట్టాలని ఆయన సూచించారు.   

నిండా మునిగిన చైనా.. 1000ఏళ్ల రికార్డు వాన‌...

క‌రోనా పాపం.. శాపంగా మారి ముంచెత్తిందో లేక‌, ప్ర‌కృతి ప‌గ‌బ‌ట్టిందో తెలీదు కానీ, చైనాలోని హెనన్‌ ప్రావిన్స్‌ను భారీ వర్షాలు కుదిపేశాయి. గ‌డిచిన వెయ్యి ఏళ్ల‌లో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో కుంభవృష్టి కురిసింది. భారీ వ‌ర్షంతో భీక‌ర వ‌ర‌ద ముంచెత్తింది. ఇటు వాన‌, అటు వ‌ర‌ద‌.. రెండూ క‌లిసి హెన‌న్ ప్రావిన్స్‌ను హెల్‌గా మార్చేశాయి.  భారీ వర్షాలతో ఎల్లో నది ఉప్పొంగ‌డంతో వరదలు వ‌చ్చాయి. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లు న‌దుల‌ను త‌ల‌పిస్తున్నాయి. కార్ల‌న్నీ నీటిలోనే. మెట్రో స్టేష‌న్లు వ‌ర‌ద నీటిలో క‌లిసిపోయాయి. వీధుల్లో న‌డుంలోతు నీళ్లు వ‌చ్చాయి. బస్సు, రైళ్ల సర్వీసులను నిలిపివేశారు. 250కి పైగా విమానాల రాకపోకలను నిలిపివేశారు.  జెంగ్జౌలోని ఓ సబ్‌వే టన్నెల్‌లోకి వరద నీరు భారీగా చేరడంతో అందులో నుంచి వెళ్తోన్న రైల్లోకి నీరు వచ్చింది. అనేక మంది రైల్లో చిక్కుకుపోయారు. ఛాతీ వరకు నీటిలో నిల్చున్న ప్రయాణికుల వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.    హెనన్‌ ప్రావిన్స్‌.. అనేక వ్యాపార కార్యకలాపాలు, పరిశ్రమలు, సాంస్కృతిక కార్యక్రమాలకు వేదిక. చైనా అతిపెద్ద ఐఫోన్‌ తయారీ ప్లాంట్‌ కూడా ఇక్కడే ఉంది. శనివారం నుంచి కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ‘ఐఫోన్‌ సిటీ’గా పిలిచే ప్రావిన్స్‌ రాజధాని జెంగ్జౌలో మంగళవారం ఒక్కరోజే 457.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శనివారం నుంచి సగటున 640.8 మి.మీల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత 1000ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి. వాన‌, వ‌ర‌ద ధాటికి అనేక మంది చ‌నిపోయారు. లక్ష మంది వ‌ర‌కూ సురక్షిత ప్రాంతాలకు తరలించారు.  

మా అత్తకు.. అద్దె బాయ్ ఫ్రెండ్ కావాలి.. 

నిద్ర లేచింది మొదలు పడుకునే వరకు మన ఉరుకుల పరుగుల జీవితం మనది. మన చుట్టూ ఉండే ప్రతి అంశంలోనూ ఏదో ఒక ప్రకటనల్ని మనల్ని ఫాలో అవుతుంటాయి. చాలా వరకు ఆ ప్రకటనలు చూసే కూడా మనం నిర్ణయాలు తీసుకుంటుంటాం. రోజు లేవగానే ఏదో ఒక ప్రకటన చూస్తూనే మన డే స్టార్ట్ అవుతుంది. ఎక్కడి దాకానో ఎందుకు.. మొబైల్ తెరిచి.. ఏ యాప్ ఓపెన్ చేసినా యాడ్స్ మనల్ని వెంటాడుతుంటాయి. మన జీవితాలను కూడా యాడ్స్ ప్రభావితం చేస్తాయంటే నమ్మక తప్పదు.   టీవీ ఓపెన్ చేసినా.. న్యూస్ పేపర్ చదివినా.. కాలు బయటకు తీసి రోడ్డు మీదకు వెళ్లినంతనే ప్రకటనలు జోరుగా కనిపిస్తుంటాయి. రోటీన్ గా కనిపించే ప్రకటనలకు భిన్నమైన ప్రకటన చేసిన ఒక కోడలి ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మన దగ్గర వరుడు కావాలి.. వధువు కావాలంటూ పెళ్లిళ్లకు సంబంధించిన ప్రకటనలు పేపర్లలో కనిపిస్తూ ఉంటాయి. లేదంటే రన్నింగ్ లో ఉన్న హోటల్ అమ్మడానికి పెట్టాం, జాబ్ కి సంబందించిన ప్రకటనలు కనిపిస్తూనే ఉంటాయి.  ఇక  ప్రాశ్చాత్య దేశాల్లో బాయ్ ఫ్రెండ్ కావాలన్నా.. గర్ల్ ఫ్రెండ్ కావాలన్న ప్రకటనలు ఇచ్చుకోవటం.. తామేం కోరుకుంటున్నామో ఇందులో క్లియర్ గా చెబుతుంటారు. తాజాగా అందుకు భిన్నమైన ఒక యాడ్ అమెరికాలో పబ్లిష్ అయ్యింది. న్యూయార్కుకు చెందిన ఒక కోడలు తన 51 ఏళ్ల అత్తకు సంబంధించిన ఒక ప్రకటనను ఇచ్చి సంచలనంగా మారారు. ఆ విషయం వింటే మీరు నోటి మీద వేలువేసుకుతారు. ఇంతకీ ఆ ప్రకటన ఏంటని అనుకుంటున్నారా ? ఆ ప్రకటన ఏంటో తెలుసుకోవాలని తహతహలాడుతున్నారా ? అయితే మారేందుకు ఆలస్యం పదండి తెలుసుకుందాం.  తన అత్తకు తోడుగా, ఆమెతో కాస్తంత సమయం గడిపి.. ఒక వివాహ వేడుకకు హాజరయ్యేందుకు 40 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఒక బాయ్ ఫ్రెండ్ అద్దెకు కావాలని క్రెయిగ్స్ లిస్ట్ అనే క్లాసిఫైడ్స్ వెబ్ సైట్ లో ప్రకటన ఇచ్చింది ఒక కోడలు. ఒకరకంగా చెప్పాలంటే ఒకరోజు సీఎం లాగా ఒక రోజు భర్త అన్నట్లు. అంతే కాదు అత్తకు ఒకరోజు బాయ్ ఫ్రెండ్ కి కొన్ని కండిషన్స్ కూడపెట్టారు. ఎవరు పడితే వారు ఈ అద్దె బాయ్ ఫ్రెండ్ డీల్ కు ఓకే కాదంటూ కొన్ని షరతుల్ని కూడా విధించారు. తన అత్తకు బాయ్ ఫ్రెండ్ గా అద్దెకు వచ్చే వ్యక్తికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు బాగా డాన్స్ కూడా వచ్చి ఉండాలన్న షరతును పెట్టారు. ప్రస్తుతం ఈ ప్రకటన వైరల్ గా మారి.. ఆసక్తికర చర్చకు తెర తీసింది. ఈ ప్రకటనలో మరో కీలక అంశం కూడా ఉంది. అదేమంటే.. తన అత్తకు బాయ్ ఫ్రెండ్ గా వ్యవహరించే వ్యక్తికి 960 డాలర్లు.. మన రూపాయిల్లో అయితే రూ.72వేల వరకు ఇస్తామని  ఆఫర్ ఇస్తోంది. ఈ ప్రకటన ఇప్పుడు విపరీతంగా షేర్ అవుతూ.. ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఏమిటో సమాజం ఎటు పోతుందో.. ఏమైపోతుందో.. 

షర్మిల పార్టీకి రేవంత్ రెడ్డి దెబ్బ? ఇక జెండా ఎత్తేయడమేనా? 

డబ్బు ఖర్చు పెట్టారు.. హైప్ క్రియేట్ చేసుకున్నారు..హల్ చల్ చేద్దామనుకున్నారు. కాని కరోనా ఒకరకమైన దెబ్బకొడితే... రేవంత్ రెడ్డి మరో దెబ్బ కొట్టారు. దీంతో లాంఛింగ్ లాంఛనంగా మిగిలిపోయింది. పోరుబాట అంటూ మొదలెట్టిన వారం వారం మంగళవారం నిరాహారదీక్షలు పేలవంగా ముగుస్తున్నాయి. దీంతో మేడమ్ ను నమ్ముకున్నవారిలో ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీళ్లు ప్రయత్నిస్తే చూద్దామన్న లీడర్లంతా మొహం చాటేస్తున్నారు. కొత్త లీడర్లు చాలామంది వస్తారు.. హడావుడి చేద్దామనుకున్నవారికి ఎదురుచూపులే మిగిలాయి. మరోవైపు హూజూరాబాద్ లో పోటీ చేసేది లేదంటూ కుంటిసాకులు చెబుతూ అధినేత్రి చేసిన ప్రకటన కూడా ఇమేజ్ డ్యామేజ్ చేస్తోంది. వైఎస్సార్టీపీ ఆవిర్భావానికి ముందున్న ఉత్సాహం ఇప్పుడు కనపడటం లేదు. ఆ ఉత్సాహం కూడా మీడియా ఉరిమిందే గాని...సహజంగావచ్చింది కాదన్న విషయం పక్కనబెడితే..ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పటికీ పుష్ చేయడానికి కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నిస్తున్నా...ఒకవైపు కేసీఆర్ స్పీడు పెంచడం..మరోవైపు స్పీడున్న రేవంత్ రెడ్డి రంగంలోకి రావడంతో.. వారిద్దరి నడుమ ఇంకెవరూ కనపడని పరిస్ధితి ఏర్పడింది. బిజెపియే వెనకబడినట్లు కనపడుతుంటే.. ఇక ఈ కొత్త పార్టీ..అది కూడా అర్దం లేని లాజిక్కులు చెప్పే పార్టీ ఇంకేం కనపడుతుంది.? నిరుద్యోగ సమస్యను ఎత్తుకున్న షర్మిల.. దానిపైనే ముందుకెళుతున్నారు. రేవంత్ రెడ్డి నిరుద్యోగ సమస్యపైనే పోరాటం ఉంటుందని పీసీసీ చీఫ్ కాగానే ప్రకటించారు. దీంతో ఆయనకు పోటీగా అన్నట్లుగా కార్యాచరణ ప్రకటించింది షర్మిల. ఒకవైపు కేసీఆర్ నియామకాల పేరుతో హడావుడి మొదలెట్టారు. దీంతో రేవంత్ రెడ్డి తెలివిగా నిరుద్యోగుల పోరాటాన్ని వాయిదా వేసుకుని..పెట్రోల్ ధరలు, ఇతర సమస్యలపై పోరు మొదలెట్టారు.ఛలో రాజ్ భవన్ అంటూ వేడి పుట్టించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా  పెగాసస్ స్పై వేర్ అలజడి రేగింది. దీనిపై కాంగ్రెస్ పోరుబాట పట్టింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందున్నకర్తవ్యం అదే. ఇలాంటి సమస్యలపై షర్మిల ఎక్కడా మాట్లాడటం లేదు. బిజెపిపై ఒక్క మాటగాని, ఒక్క విమర్శ గాని ఇప్పటివరకు షర్మిల చేయకపోవడం గమనించాలి. ఎంఐఎం మీద కూడా ఏమీ మాట్లాడలేదు. కేవలం రాజన్న రాజ్యం తెస్తామనే మాట తప్ప.. రాజకీయంగా రకరకాల ఇష్యూస్ మీద తమ విధానం ఏంటో క్లారిటీ లేదు. అదేమంటే ఇప్పుడే కదా మొదలెట్టింది అంటారు. ముఖ్యమంత్రి అయిపోతామని..తమదే అధికారం అని చెప్పుకోవడానికి వచ్చినప్పుడు ఇలాంటి కారణాలు ఉండవు మరి.  హుజూరాబాద్ లో పోటీ చేయకపోవడం కూడా ఓ రాజకీయ వ్యూహాత్మక తప్పిదంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. డిపాజిట్ కూడా రాకపోతే ఆదిలోనే పరువు పోతుందనే పోటీకి దిగడం లేదని అందరికీ అర్ధమైంది. కాని అసలు పోటీకి దిగపోతే.. ప్రత్యామ్నాయ పార్టీ ఎలా అవుతుందనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అనే విమర్శలను కౌంటర్ చేయలేక నానా తిప్పలు పడుతున్నారు షర్మిల, ఇతర నేతలు. వైఎస్సార్ ఉండుంటే అసలు రాష్ట్రం విడిపోయేది కాదని అందరూ చెప్పుకునే మాటే. అలాంటి నేత కుమార్తెగా..పైగా అదే వారసత్వం అంటూ వచ్చిన ఆంధ్రా ఆడపడచు షర్మిలను తెలంగాణ ప్రజలు ఆహ్వానిస్తారా అంటే కష్టమే అనిపిస్తోంది. కేవలం ఒక మార్కెటింగ్ కంపెనీలాగా నేతలను, కార్యకర్తలను సమకూర్చుకోవడమే తప్ప..ఎలాంటి భావోద్వేగం.. ఎలాంటి రాజకీయ ఆకర్షణ లేకుండా వైఎస్సార్టీపీ అడుగులు వేస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి మరి.  

కూతురి పై తండ్రి అఘాయిత్యం.. కూతురు చివరికి.. 

నేటి సమాజంలో  మానవత్వం కరువైంది. ఆడపిల్లల జీవితాలు అంటే అంగట్లో సరుకుల చూస్తున్నారు. రోజురోజుకి ఆడవాళ్లపై దారుణాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇంటి బయటే కాదు ఇంట్లోనూ మహిళలకు  భద్రత లేదు. పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వారే కామంతో కాటేస్తున్నారు. వావి వరుసలు మరిచి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. అది నెల్లూరు జిల్లా. వెంకటగిరి.లో దారుణం జరిగింది. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి 14ఏళ్ల కుమార్తెపై 6 నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. వెంకటగిరి మునిసిపాలిటీ పరిధిలో దళితవాడకు చెందిన అంజయ్య అనే వ్యక్తి తన భార్యతో విడిపోయాడు. ఆ తర్వాత మరో వివాహితను పెళ్లి చేసుకున్నాడు. ఆ మహిళకు కొడుకు, కూతురు ఉన్నారు. ఆ మహిళ అంజయ్యతో కలిసి ఉంటోంది. కాగా, కామంతో కళ్ళు మూసుకుపోయిన అంజయ్య ఆమె కూతురిపైనా కన్నేశాడు. ఎలాగైనా ఆ అమ్మాయిని లొంగదీసుకోవాలనుకున్నాడు. అతని పథకం ప్రకారమే  గత 6 నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పుకున్నా ప్రయోజనం లేకపోయింది. గత ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను అత్యాచారం చేసేందుకు అంజయ్య యత్నించాడు. ఇది గమనించిన పదేళ్ల కొడుకు కేకలు వేయడంతో స్థానికులు వచ్చారు. దీంతో అంజయ్య అక్కడి నుంచి పారిపోయాడు. స్థానిక మహిళా సంఘం నేతలు, అధికారులు, వలంటీర్ల సాయంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అంజయ్యపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తాగితే తల్లి తాళికట్టిన పెళ్ళాం అవుతాడా.. పడకగదిలో ఉన్న పెళ్ళాం తల్లి అవుతదా చెప్పండి.. ఏది ఏమైనా సినిమాల ప్రభావమో.. లేదంటే పరదేశి కల్చర్ కి అలవాటు పడడంతో గాని మన భారతీయ సమాజం మరి ఇంతలా తయారు అయింది.. కొంచం కళ్ళు తెరవాలి.. మహిళలపై దాడులు గరగకుండా చూసుకోవడం మనందరి బాధ్యత..