ఆ రాష్ట్రంలో గజదొంగను పట్టించిన ఈ రాష్ట్రం పోలీసు

ఒక ఐడియా జీవితాన్ని నిజంగా మారుస్తుందో లేదో తెలీదు కానీ.. ఒక చిన్న షేరింగ్ మాత్రం భారీ నేరస్తుల గుట్టు  బయట  పెట్టి తీరుతుంది. అందుకే విలువైన సమాచారం, ఎమర్జెన్సీ సమాచారాన్ని మాత్రమే సోషల్ మీడియా గ్రూపుల్లో షేర్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. భారీ నేరాలు చేసి తప్పించుకుంటూ తిరుగుతున్న పేరుమోసిన నేరగాళ్లు సైతం వణికిపోతున్నారంటే అందుక్కారణం సోషల్ మీడియానే.  ఇక వివరాల్లోకి వెళ్దాం. గత జులై 9వ తేదీన తమిళనాడులోని తిరువరక్కడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ సంఘటనలో పెద్దమొత్తంలో బంగారు, వెండి ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. ఈ చోరీకి పాల్పడిన నేరస్తుణ్ని గుర్తించేందుకు స్థానికంగా వున్న సీసీ కెమెరాల్లో రికార్డయిన విజువల్స్ ను తిరువరక్కడు పోలీసులు పరిశీలించారు. విజువల్స్ అయితే ఉన్నాయి గానీ ఆ దొొంగ తాలూకు వివరాలు మాత్రం వారిదగ్గర లేవు. ఆ దొంగ ఎక్కడివాడు, పాత నేరాలేమైనా అతనిపై ఉన్నాయా.. అసలు ఆ దొంగను పట్టుకోవాలంటే ఎక్కణ్నుంచి విచారణ మొదలు పెట్టాలన్న కనీస సమాచారం కూడా ఆ సమయంలో వారికి అందుబాటులో లేదు. దీంతో  చెన్నై పోలీసాఫీసర్ కులశేఖరన్ బుర్రలో ఓ ఐడియా తట్టింది. వెంటనే ఆ రోజు జరిగిన నేరం తాలూకు వివరాలతో కలిపి నేరస్తుడి విజువల్స్ ను జాతీయ క్రైం విభాగానికి సంబంధించిన వాట్సప్ గ్రూపులో పోస్ట్ చేశారు. అదే వాట్సాప్ గ్రూపులో వరంగల్ కమిషనరేట్లో టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మీర్ మహమ్మద్ ఆలీ  ఆ విజువల్స్ తీసుకొని అప్పటికే తను సేకరించి పెట్టిన ఆ దొంగ తాలూకు వివరాల పూర్తి సమాచారాన్ని తిరువరక్కడు పోలీస్ స్టేషన్ పంపించారు. చోరీకి పాల్పడిన నిందితుడు, ఆలీ పంపించిన సమాచారం ఒక్కటే కావడంతో తిరువరక్కడు పోలీసులు నిందితుణ్ని సులభంగా గుర్తించి అరెస్టు చేశారు.  అంతేకాదు.. నిందితుడి నుంచి సుమారు 12 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుణ్ని అరెస్టు చేయడంలో ఆలీ ఇచ్చిన సమాచారం కీలకం కావడంతో చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జైవాల్.. మీర్ మహమ్మద్ ఆలీని  అభినందిస్తూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి క్యాష్ రివార్డు పంపించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ చేతుల మీదుగా ఆలీ క్యాష్ రివార్డు అందుకొని సాటి కానిస్టేబుల్స్ కు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఆలీ గతంలోనూ కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలతో పాటు పక్క జిల్లాల్లో జరిగిన చోరీల్లో నిందితులను పట్టిచ్చారు. అలా ఇప్పటికే పలుమార్లు ఆలీని పలు విభాగాల పోలీస్ అధికారులు ఘనంగా సన్మానించారు. అలాగే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతంలో జరిగిన నేరాల్లోని నిందితులను గుర్తించడంలో ఆలీ చాలా కీలక పాత్ర పోషించారు. ఇలా ఆలీలాగా ప్రతిఒక్కరూ తమకు అప్పగించిన విధులను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తే క్రైమ్ రేట్ అతి తొందరగానే తగ్గిపోతుందని, శ్రేయోదాయకమైన సమాజం ఆవిర్భవిస్తుందని పోలీసు అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు

TOP NEWS @ 1pm

1. హుజురాబాద్‌, బ‌ద్వేల్ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌లైంది. అక్టోబ‌ర్ 1న నోటిషికేష‌న్ రానుంది. అక్టోబ‌ర్ 30న పోలింగ్. న‌వంబ‌ర్ 2న ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫ‌లితాలు ప్ర‌క‌టించనున్నారు. నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌కు అక్టోబ‌ర్ 8, నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు అక్టోబ‌ర్ 13 చివ‌రి తేదీలు.  2. ‘‘తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైకాపా గ్రామ సింహాల గోంకారాలు సహజమే’’ అంటూ పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్‌కు మంత్రి పేర్ని నాని కౌంట‌ర్ ఇచ్చారు. ‘‘జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న‘మస్కా’రాలు’’ అంటూ ట్వీట్ చేసి మ‌రింత‌ ర‌చ్చ రాజేశారు. పవన్ కల్యాణ్‌పై ఓ ట్రోల్ వీడియోనూ సైతం పోస్ట్ చేశారు పేర్ని నాని.  3. సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ 10 ప్ర‌శ్న‌ల‌తో లేఖ రాశారు. కేసీఆర్ జమానా-అవినీతి ఖజానా..అని సకల జనులు ఘోషిస్తున్నారని అన్నారు. ప్రగతి భవన్‌.. అవినీతి భవన్‌గా మారిందన్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఆస్తులు లక్ష రెట్లు పెరిగిన మాట నిజం కాదా?.. దీనిపై చర్చకు సిద్ధమా? అంటూ బండి సంజ‌య్‌ సవాల్ చేశారు.  4. తూర్పుగోదావరి జిల్లా వైసీపీ నేత‌ల కోల్డ్‌వార్ తాడేప‌ల్లికి చేరింది. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఎంపీ మార్గాని భరత్‌ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకోవడం, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలోనే ఒకరితో ఒక‌రు వాగ్వివాదానికి దిగడంతో సీఎం జ‌గ‌న్‌ మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇక ఆ ఇష్యూను సీఎం జ‌గ‌నే స్వ‌యంగా డీల్ చేయ‌నున్నారు. 5. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 112వ రోజు కొనసాగుతోంది. ఇవాళ‌ సీబీఐ విచారణకు వేముల జడ్పీటిసీ బయపురెడ్డి హాజరయ్యారు. వైఎస్ భాస్కర్‌రెడ్డికి బయపురెడ్డి  అనుచరుడు.  6. ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టి మ‌రీ మదనపల్లిలో ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ‌టం క‌ల‌క‌లం రేపుతోంది. భార్య, మరదలు, అత్త  వేధిస్తున్నారని ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఫేస్‌బుక్ లైవ్‌లో గమనించిన స్నేహితులు, కుటుంబసభ్యులు పోలీసులకు స‌మాచారం అందించారు.  7. మేడ్చల్‌లో అక్రమంగా రెండు కార్లలో తరలిస్తున్న గంజాయిని పక్కా సమాచారంతో దాడి చేసి ఎస్‌ఓటీ పోలీసులు ప‌ట్టుకున్నారు. 47 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.  ఐదుగురు గంజాయి స్మ‌గ్ల‌ర్ల‌ను అదుపులోకి తీసుకున్నారు.  8. భారీ వర్షానికి సిరిసిల్ల కలెక్టరేట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో కలెక్టర్ అనురాగ్ జయంతి కలెక్టరేట్‌లోనే చిక్కుకుపోయారు. రాత్రి కలెక్టరేట్‌లోనే అనురాగ్ జయంతి బస చేశారు. కాగా ఉదయం మరింత వరద నీరు వచ్చి చేరడంతో చివరకు ట్రాక్టర్ సహాయంతో కలెక్టర్‌ను అధికారులు బయటకు తీసుకువచ్చారు.  9. గులాబ్ తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్రపై తీవ్రంగా ఉంది. విశాఖ ఏజెన్సీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మిగతా ప్రాంతాల్లో చెదురు ముదురు జల్లులు పడుతున్నాయి. గులాబ్‌ ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాలు త‌డిసి ముద్ద‌వుతున్నాయి. మ‌రో 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల వర్షాలు పడతాయని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.  10. ప్రధాని మోదీ అధ్యక్షతను కేంద్రమంత్రివర్గం మధ్యాహ్నం 3.45 గంటలకు సమావేశం కానుంది. రాష్ట్రపతి భవన్‌లో ఈ సమావేశం జరుగుతుందని అధికారిక వర్గాలు తెలిపాయి. జూలై 7న కేంద్ర మంత్రివర్గ పునర్వవస్థీకరణ అనంతరం కేంద్ర మంత్రివర్గంతో మోదీ సమావేశం కానుండటం ఇది నాలుగోసారి కావ‌డం ఆస‌క్తిక‌రం. 

కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ లేనట్టేనా? హుజురాబాద్ లో ఏం జరగబోతోంది? 

ఇలా పార్టీలో చేరి .. అలా ఎమ్మెల్సీగా నామినేట్ అయిన కౌశిక్ రెడ్డి, అదృష్టమే అదృష్టం. ఏళ్ల తరబడి క్యూలో నిలబడిన వారిని కనికరించని కేసీఆర్, కాంగ్రెస్ నుంచి వచ్చిన కౌశిక్ రెడ్డిని పట్టుమని పక్షం రోజులు తిరక్కుండానే ఎమ్మెల్సీ చేశారు. అది కూడా చుక్క చెమట, రూపాయి ఖర్చులేకుండా ఉచిత (గవర్నర్) కోటాలో  కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అయిపోయారు... అనుకున్నారు. అదృష్టం అంటే అది కదా, అంటూ చాలా మంది చాలా విధాలుగా ఆశ్చర్యానికి గురయ్యారు.  నిజం చెప్పాలంటే చాలా మంది కౌశిక్ రెడ్డి అదృష్టాన్ని చూసి ఈర్షకు కూడా గురయ్యే ఉంటారు. అందులో ఎవరు ఎలాంటి శాపనార్ధాలు పెట్టారో ఏమో గానీ, అడక్కుండానే వచ్చి పడిన అదృష్టం, ఇప్పడు చెప్పా పెట్టకుండా చెట్టెక్కి కూర్చుంది. అంతే కాదు,అది ఇప్పట్లో చెట్టు దిగే దారి కూడా కనిపించడం లేదు. కౌశిక్ రెడ్డిని గవర్నర్ ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని సిఫార్సు చేస్తూ, రాష్ట్ర మంత్రివర్గం పంపిన తీర్మానం ఫైలును గవర్నర్ భద్రంగా పెండింగ్ లో పెట్టారు. అంతే కాదు, ఇప్పట్లో ఆ ఫైల్ కు మోక్షం లేదని, రాదని గవర్నర్ మరోసారి స్పష్టం చేశారు. దీంతో  వచ్చినట్లే వచ్చిన ఎమ్మెల్ల్సీ పదవి, ఓ జీవిత కాలం లేటైనా కావచ్చని, ఇప్పట్లో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ముచ్చట తీరక పోవచ్చని, అంతర్గత వర్గాల సమాచారం.  గతంలో ఒక సారి, కౌశిక్ రెడ్డి ఫైల్ పరిశీలనలో ఉందని, అయన అర్హతలను పరిశీలించేందుకు ఇంకొంత సమయం పడుతుందని చెప్పిన గవర్నర్ తమిళి సై మళ్ళీ మరో మారు అదే మాట రిపీట్ చేశారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో,  ఇట్ ఈజ్ స్టిల్ ఇన్ పెండింగ్. ఇంకా పెండింగ్’లోనే  ఉంది, కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సిగా అమోదించేందుకు మరింత సమయం కావాలని అమె స్పష్ట చేశారు. అంతే కాదు, అది అంత ఇంపార్టెంట్ విషయం కాదన్నట్లుగా, ఇప్పట్లో తేలే విషయం అసలే కాదన్నట్ల్గు గవర్నర్ మాట్లాడారు. గవర్నర్ ఇలా మళ్ళీ మళ్ళీ వాయిదా వేస్తున్నారంటే, అందుకు అయితే, ఆయన అర్హత, యోగ్యతల విషయంలో గవర్నర్’కు అనుమానాలైనా ఉంది ఉండాలి ... లేదంటే గవర్నర్ అడిగిన వివరాలను ఇవ్వడంలో ప్రభుత్వం జాప్యం చేయడం అయినా కారణం అయ్యుండాలని అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి.   రాజకీయ నిర్ణయాల విషయంలో ఆచి తూచి అడుగులు వేసే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలోనూ  క్యాలిక్యూటెడ్ నిర్ణయమే తీసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అన్నీ తెలిసే, ముఖ్యమత్రి కౌశిక్ రెడ్డిని రెంటికి చెడ్డ రేవడిని చేశారని అటు కాంగ్రెస్ వర్గాల్లో, ఇటు తెరాస వర్గాల్లో వినిపిస్తోంది. కౌశిక్ రెడ్డికి  త్రిశంకు సభలో పెర్మనెంట్ సీటు ఇచ్చేందుకే, ముఖ్యమంత్రి ఆయనకు పెద్దల సభలో సీటును ఎరగా వేశారని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా కౌశిక్ రెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యే అవకాశం మాత్రం ఇక లేదనే అనికోవచ్చని అంటున్నారు. ఎమ్మెల్సీ విషయంలో సీఎం కేసీఆర్ తీరుపై కౌశిక్ రెడ్డి అనుచరులు కూడా అసహనానికి లోనవుతున్నారు. ఎమ్మెల్సీ ఆమోదంపై గవర్నర్ తో ముఖ్యమంత్రి మాట్లాడకపోవతంపై వాళ్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో చాలా విషయాల్లో రాజ్ భవన్ కు వెళ్లి కేసీఆర్ చర్చించారని.. ఎమ్మెల్సీ విషయంలో ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. కౌశిక్ రెడ్డిని నమ్మించి నట్టేట ముంచారనే ఆరోపణలు కొందరు చేస్తున్నారు. దీని ప్రభావం హుజురాబాద్ ఉప ఎన్నికలో ఉంటుందని కూడా చెబుతున్నారు. 

సినిమా టికెట్లపై సీరియస్.. ప్రజా సమస్యలపై సైలెన్స్! ఇదేందయ్యా పవన్ కల్యాణ్.. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాక రాజుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్దం సాగుతోంది. రిప‌బ్లిక్ సినిమా ఈవెంట్ లో  వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలతో రాజుకున్న వేడి.. మరింత తీవ్రమవుతోంది. ఏపీ పాల‌కుల‌ను స‌న్నాసులు, ద‌ద్ద‌మ్మ‌లూ అంటూ మొద‌లుపెట్టి.. సినిమా టికెట్ల‌ ఆన్‌లైన్ అమ్మ‌కాల‌పై ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు చేశారు పవన్. వెంటనే రియాక్ట్ అయిన  మంత్రులు, వైసీపీ నేతలు తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. మంత్రులు, వైసీపీ నేతలు త‌న‌పై అటాక్‌కు దిగ‌డంతో మ‌రోసారి ట్వీట్‌తో పంచ్ ఇచ్చారు పవన్ కల్యాణ్. వైసీపీ నేతల మాటలను గ్రామ సింహాల అరుపులతో పోల్చారు. 'హూ లెట్ ద డాగ్స్ ఔట్' అన్న పాటను ట్వీట్ చేస్తూ.. మొరిగే కుక్క‌ల‌కు తాను భ‌య‌ప‌డ‌న‌నే అర్థం వ‌చ్చేలా ట్వీట్ చేశారు. పవన్ కౌంటర్ ట్వీట్ కు అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు మంత్రి పేర్నినాని.  పవన్ కల్యాణ్, వైసీపీ నేతల మధ్య వార్ సాగుతుండగానే మరో అంశంపై జనాల్లో చర్చ సాగుతోంది. పవన్ కల్యాణ్ ఇప్పుడు ఈ స్థాయిలో ఎందుకు స్పందించారన్నదానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. సినిమా టికెట్లను ఆన్ లైన్ విక్రయించాలన్న జగన్ సర్కార్ నిర్ణయంపై ఓ రేంజ్ లో ఫైరైన పవన్ కల్యాణ్.. ఏపీ సమస్యల విషయంలో ఎందుకు ఇంతలా స్పందించలేదని కొన్ని వర్గాల నుంచి ప్రశ్న వస్తోంది. జగన్ రెడ్డి పాలనలో ఏపీలో పాలనా అస్తవ్యస్థంగా సాగుతుందనే విమర్శలు ఉన్నాయి. ఏపీ ప్రస్తుతం అప్పుల ఊబిలో చిక్కుకుంది. దేశంలోనే అప్పులు ఎక్కువ చేసిన రాష్ట్రాల్లో టాప్ లో ఉంది. ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదు. ప్రతి నెలా అప్పులు తెస్తేనే ఉద్యోగులకు జీతాలు వచ్చే పరిస్థితి. ఇలాంటి పరిస్థితులపై పవన్ కల్యాణ్ ఎందుకు ఈ స్థాయిలో ప్రశ్నించలేదని కొందరు అడుగుతున్నారు. టీడీపీ ప్రభుత్వం అంతర్జాతీయ రాజధానిగా నిర్మించేందుకు ప్లాన్ చేసిన అమరావతిని జగన్ సర్కార్ మూడు ముక్కలు చేసే ప్రతిపాదన చేసింది. కోర్టు కేసులతో ప్రస్తుతానికి ఆగిపోయినా.. అమరావతిని మాత్రం గాలికొదిలేసింది. రాజధాని రైతులు 20 నెలలకు పైగా ఆందోళనలు చేస్తున్నారు. అయితే అమరావతి విషయంలో ఏదో మాట్లాడాలన్నట్లుగా స్పందించారు కాని.. సినిమా టికెట్లపై స్పందించినంత రేంజ్ లో పవన్ ఎందుకు రియాక్ట్ కాలేదనే ప్రశ్న వస్తోంది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఎందుకు ఉద్యమించలేదని కొందరు అడుగుతున్నారు. గతంలో అమరావతికి మద్దతు తెలిపిన పవన్.. ఆ రాజధానిని మూడు ముక్కలు చేస్తున్నా సీరియస్ గా స్పందించలేదనే విమర్శలు ఉన్నాయి.  సినిమా టికెట్ల ఇష్యూపై మాట్లాడినంత ఘాటుగా అమరావతి విషయంలో మాట్లాడితే  రాజధాని ఉద్యమానికి మరింత ఊపు వచ్చేదని అంటున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్... ఆంధ్రుల హక్కుగా సాధించిన కర్మాగారం. విశాఖ ఉక్కును ప్రైవేటుకు అమ్మేస్తోంది మోడీ ప్రభుత్వం. ఆంధ్రుల ఆత్మగౌరవంగా చెప్పుకునే విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తున్నా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మాత్రం సీరియస్ గా రియాక్ట్ కాలేదు. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకోవడంతో.. ఆయన ఈ విషయంలో సైలెంటుగానే ఉండిపోయారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయవద్దంటూ కొన్ని ప్రకటనలు చేయడం తప్ప... బీజేపీని తీవ్రంగా విమర్శించి లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ లాంటి కీలకమైన అంశంలో మాట్లాడని పవర్ స్టార్... సినిమా టికెట్ల విషయంలో మాత్రం తీవ్రంగా రియాక్ట్ కావడంపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. రాజకీయ పార్టీ అధినేతగా ఉంటూ... ప్రజా సమస్యలపై పెద్దగా పట్టింపు లేదన్నట్లుగా వ్యవహరిస్తూ... సినిమాల విషయంలో మాత్రం సీరియస్ గా రియాక్ట్ కావడం చర్చగా మారింది.  ఇవే కాదు.. ఏపీలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆలయాలపై దాడులు జరిగాయి. టీటీడీ నిత్యం వివాదాల్లో ఉంటుంది. ఆస్తి పన్ను పెంచిన ప్రజలపై భారం మోపారు. పెట్రోల్, డీజిల్ ధరలు... దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ. లిక్కర్ పాలసీపై మొదటి నుంచి వివాదమే ఉంది. ఇసుక, మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం సమీపంలోనే గ్యాంగ్ రేప్ జరిగింది.  ఇలాంటి సమస్యలపై పవన్ కల్యాణ్ ఏనాడు సీరియస్ గా స్పందించలేదనే విమర్శలు ఉన్నాయి. ఇవే ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ప్రజా సమస్యలు చాలా ఉన్నా పెద్దగా స్పందించని పవన్ కల్యాణ్... తన సినిమాకు అడ్డంకులు స్పష్టించారనే కారణంగా ప్రభుత్వంపై రెచ్చిపోయారనే విమర్శలు వస్తున్నాయి.  పవన్ కల్యాణ్ తీరు చూస్తుంటే... ఆయనకు రాజకీయాలకన్నా సినిమాలే ముఖ్యమన్నట్లుగా ఉందని అంటున్నారు విశ్లేషకులు. జనసేన పార్టీకి  చీఫ్ గా ఉంటూ రాజకీయాలకంటే సినిమాలే ఎక్కువన్నట్లుగా వ్యవహరించడం ఆయనకు మైనస్ అవుతుందంటున్నారు. ఇలాంటి చర్యలతో రాజకీయాలపై సీరియస్ నెస్ లేదనే ముద్ర ఆయనపై పడుతుందని చెబుతున్నారు. 

బ‌ద్వేల్‌లో హోరాహోరీ ఫైట్‌!.. జ‌గ‌న్‌కు త‌ప్ప‌దా షాక్‌?

ఉప ఎన్నిక అన‌గానే వైసీపీలో ఏ మూల‌నో టెన్ష‌న్ టెన్ష‌న్‌. గెలుస్తామ‌నే న‌మ్మ‌కం ఉన్నా.. ఏదో గెలిచాం చాల‌న్న‌ట్టు.. గెలిచి ఓడినంత ప‌ని అవుతోంది. తిరుప‌తి ఎంపీ ఉప ఎన్నిక అధికార పార్టీకి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించింది. రెండు ల‌క్ష‌ల మెజార్టీతో గెలిచామ‌ని విర్ర‌వీగే ప‌రిస్థితి లేకుండా పోయింది. ఎల‌క్ష‌న్‌కు ముందు 6 ల‌క్ష‌ల మెజార్టీ వ‌స్తుంద‌ని మంత్రులు ఫోజులు కొట్టారు. ప్ర‌చారం మొద‌ల‌య్యేస‌రికి ఆ ఫిగ‌ర్ త‌గ్గుకుంటూ పోయింది. 4 ల‌క్ష‌ల ఆధిక్యం ప‌క్కా అన్నారు. కానీ, టీడీపీ అధినేత చంద్ర‌బాబు, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ రంగంలోకి దిగి.. ర్యాలీలు, స‌భ‌ల‌తో హోరెత్తించ‌డం.. తిరుప‌తి ఎంపీ నియోజ‌క‌వ‌ర్గ‌మంతా ప‌సుపుమ‌యంగా మార‌డం.. టీడీపీ ర్యాలీల‌కు జ‌నం తండోప‌తండాలుగా రావ‌డం చూసి.. ఓ ద‌శ‌లో వైసీపీకి ఓడిపోతామేమోన‌నే వ‌ణుకు మొద‌లైంది. అందుకే కాబోలు.. ఓడితే ప‌రువంతా పోతుంద‌నే భ‌యంతో.. పోలింగ్ నాడు ప‌క్క జిల్లాల నుంచి బ‌స్సుల్లో జ‌నాల‌ను తీసుకొచ్చి మ‌రీ దొంగఓట్ల‌తో గ‌ట్టేక్కారు. ఇక వైసీపీకి ఓటేయ‌క‌పోతే ప్ర‌భుత్వ ప‌థ‌కాలు ద‌క్క‌వ‌నే బెదిరింపులు, వాలంటీర్ల‌తో వార్నింగులు, తాయిలాలు, పందేరాలు.. ఇలా తిరుప‌తిలో గెలుపు కోసం వైసీపీ చేయ‌ని కుట్ర‌, కుతంత్రాలు లేవు. అన్ని చేసినా.. 6 ల‌క్ష‌ల మెజార్టీ అని గొప్ప‌లు చెప్పినా.. చివ‌రాఖ‌రికి 2 ల‌క్ష‌ల మెజార్టీతో బ‌యట‌ప‌డ్డారు. గెలిచి ఓడారు. ఆ ఎన్నిక స‌జావుగా జ‌రిగుంటే టీడీపీనే గెలిచుండేద‌ని అంతా అన్నారు.  తిరుప‌తి జ్ఞాప‌కం మ‌ర‌వ‌క ముందే.. తాజాగా బ‌ద్వేలు ఉప ఎన్నిక‌కు ఎన్నిక‌ల క‌మిష‌న్ షెడ్యూల్ విడుద‌ల చేసింది. అక్టోబ‌ర్ 30న పోలింగ్‌. న‌వంబ‌ర్ 2న కౌంటింగ్ అండ్ రిజ‌ల్ట్స్‌. బ‌ద్వేలు క‌డ‌ప జిల్లాలో ఉండ‌టంతో సీఎం జ‌గ‌న్‌కు ఈ ఎన్నిక స‌వాలేన‌ని చెప్పాలి. క‌డ‌ప జిల్లాలో వైసీపీకి గ‌ట్టి ప‌ట్టున్న మాట వాస్త‌వ‌మే. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే చ‌నిపోయార‌నే సానుభూతి అద‌న‌పు బ‌లం. అయినా, ఈజీగా గెలుస్తామ‌నే ధీమా మాత్రం అధికార‌పార్టీలో క‌నిపించ‌డం లేదు. టీడీపీకి ప‌ట్టుంద‌ని కాదు కానీ.. వైసీపీపై వెల్లువెత్తుతున్న ప్ర‌జాగ్ర‌హ‌మే ఆ పార్టీకి కునుకు లేకుండా చేస్తోంది.  అస‌లే రాయ‌ల‌సీమ. ఉపాధి అంతంత మాత్ర‌మే. ఇసుక పాల‌సీ అంటూ ఇసుక దొర‌క్కుండా చేసి రోజు కూలీల‌కు ఉపాధి లేకుండా చేసిన ఘ‌న‌త జ‌గ‌న్‌దే. ఇక ధ‌ర‌ల పెంపు, చెత్త ప‌న్నులు, అప్పులు, జీతాలు స‌మ‌యానికి రాక‌పోవ‌డం.. ఇలా ప్ర‌తీ ఒక్క వ‌ర్గ‌మూ జ‌గ‌న్ పాల‌న‌పై ఆగ్ర‌హంగానే ఉంది. ఇక మ‌ద్యం తాగే అల‌వాటున్న ప్ర‌తీఒక్క‌రు.. మందు తాగే ప్ర‌తీసారి.. జ‌గ‌న్‌ను తిట్టకుండా ఉండ‌టం లేదు. అడ్డ‌గోలుగా ధ‌ర‌లు పెంచేసి.. అడ్డ‌మైన బ్రాండ్లు తీసుకొచ్చి.. మందుబాబుల పాలిట విల‌న్ అయ్యారు జ‌గ‌న్‌.  ఇలా ప్ర‌జాగ్ని ఉప ఎన్నిక‌ వ‌చ్చిన‌ప్పుడే బ‌య‌ట‌ప‌డుతుంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో కంపేర్ చేయ‌లేము. ఎమ్మెల్యే ఎల‌క్ష‌న్ సీఎంతో లింకుంటుంది కాబ‌ట్టి.. ముఖ్య‌మంత్రి ప‌నితీరుకు రెఫ‌రెండంగా భావిస్తుంటారు. గ‌తంలో తెలంగాణ‌లో అదే జ‌రిగింది. దుబ్బాక‌లో టీఆర్ఎస్‌ను ఓడించి కేసీఆర్‌కు షాక్ ఇచ్చిన‌ట్టు.. బ‌ద్వేలులో వైసీపీకి బుద్దిచెప్పి జ‌గ‌న్‌కు ఝ‌ల‌క్ ఇవ్వాల‌ని ప్ర‌జ‌లు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే, అధికార పార్టీలో టెన్ష‌న్ నెల‌కొంద‌ని అంటున్నారు.  కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల కావడంతో అక్కడ అధికార పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయం చర్చనీయాంశంగా మారింది. బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న వైకాపా ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చిలో కన్నుమూశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య సుధ పేరును వైసీపీ దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. ఇక‌, టీడీపీ అభ్యర్థిగా ఓబుళాపురం రాజశేఖర్‌ పేరును ఇప్ప‌టికే టీడీపీ ప్ర‌క‌టించింది. అభ్య‌ర్థులు దాదాపు క‌న్ఫామ్ కావ‌డంతో ఇక అస‌లైన పోరు మొద‌లుకానుంది.   

కాంగ్రెస్‌లోకి కన్హయ్య, జిగ్నేష్‌.. మోడీనే టార్గెట్..

కాంగ్రెస్ పార్టీ కొత్తగా అడుగులు వేస్తోంది. ఇంతవరకు సాగిన వరస పరాజయాలకు, పరాభవాలకు ఇక చుక్క పెట్టాలని నిర్ణయానికొచ్చింది. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, కొత్త బాటలో ముందుకు వెళ్లేందుకు నూతన విధానాలతో సిద్దమైంది. ఒకవిధంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో కొత్త కాంగ్రెస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది అనవచ్చును.   యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించి ఏ రాష్ట్రానికి ఆ  రాష్ట్రంలో పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు చక చకా అడుగులు  వేస్తోంది. ఈ ప్రయోగం ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాలలో సక్సెస్ అయిన నేపధ్యంలో ఇప్పుడు అదే ఫార్ములాను ఇతర రాష్ట్రాలకు చివరకు జాతీయ స్థాయిలోకి విస్తరించేందుకు పక్కా  ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన, ఇద్దరు యువనాయకులు, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సిపిఐ నాయకుడు కన్హయ్య కుమార్‌, రాష్ట్రీయ దళిత అధికార మంచ్‌ (ఆర్‌డీఏఎమ్‌) ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవాని కాంగ్రెస్ గూటికి చేర‌డం ఆస‌క్తిక‌రం.   కన్హయ్య కుమార్‌, గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు జేఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడిగా, పార్లమెంట్ పై దాడి కేసులో ఉరి తీయబడిన ఉగ్రవాది అఫ్జల్ గురుకు, అనుకూలంగా విశ్వవిద్యాలయంలో విద్యార్ధులను కూడ‌గట్టి, నినాదాలు చేయడం ద్వారా మీడియా దృష్టిని ఆకర్షించారు. అంతే కాదు కన్హయ్య కుమార్‌ పై దేశద్రోహం కేసు కూడా నమోదైంది. ఆ తర్వాత  కన్హయ్య కుమార్‌ 2019 లోక్ సభ ఎన్నికల్లో బీహార్’లోని బెగుసరాయ్ లోక్ సభ స్థానం నుంచి సిపిఐ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడి పోయారు. ఎన్నికలలో ఓడిపోయినా, సీఏఏ వ్యతీరేక ఆందోళనలో, రైతుల ఆందోళనలో కీలక పాత్రను పోషించారు. మంచి వక్త. కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని,  సంఘ్ పరివార్  సంస్థలను ఏకి పారేయడంలో కన్హయ్య కు కన్హయ్యే సాటి. ఆయనకు ఆయనే పోటీ. అందుకే, కన్హయ్య కుమార్‌ కాంగ్రెస్‌లో చేరి బీహార్‌ పార్టీని బలపరుస్తారని భావిస్తున్నారు. అయితే  బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా సమయం ఉండటంతో యువతను బాగా ఆకర్షించే కన్హయ్య కుమార్‌ను ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికల ప్రచార బరిలో దింపాలని కాంగ్రెస్‌ భావిస్తోందని సమాచారం.  ఇక, ప్రధాని మోడీ సొంత రాష్ట్రం  గుజరాత్‌లోని వడ్గామ్‌ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దళిత నాయకుడు, ఎమ్మెల్యే జిగ్నేష్‌ మేవానీని కాంగ్రెస్‌ రాష్ట్ర విభాగానికి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించే అవకాశాలున్నాయి. కాగా, సీనియర్‌ నాయకుడు అహ్మద్‌ పటేల్, యువ నాయకుడు రాజీవ్‌ సతావ్‌ మరణానంతరం కాంగ్రెస్‌ పార్టీ గుజరాత్‌లో నాయకత్వ సమస్యలను ఎదుర్కొంటోంది. జిగ్నేష్‌ మేవాని పార్టీలో చేరితే శక్తిమంతమైన దళిత నాయకుడి అండ పార్టీకి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, రాహుల్ గాంధీ టీమ్’ గా ఎమర్జ్‌ అవుతున్న యువ నేతలపై సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయన్న ఆరోపణలు అప్పుడే మొదలయ్యాయి. ఈ ఆరోపణలకు కాంగ్రెస్ నాయకత్వం ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడవలసి ఉందని అంటున్నారు.  

కేసీఆర్ ఢిల్లీలో ఉండ‌గానే హుజురాబాద్ షెడ్యూల్‌.. సంథింగ్ సంథింగ్‌..

ఎప్పుడో రావాల్సిన హుజురాబాద్ బైపోల్ షెడ్యూల్‌. అప్పుడు రాలేదు. బెంగాల్‌తో పాటు జ‌రుగుతుంద‌నుకున్నా జ‌ర‌గ‌లేదు. అప్పుడు సైతం కేసీఆర్ ఢిల్లీ వెళ్లొచ్చారు. ఇప్పుడు కేసీఆర్ మ‌రోసారి హ‌స్తిన ప‌ర్య‌ట‌న చేప‌ట్టారు. కేంద్ర పెద్ద‌లను వ‌రుస‌బెట్టి క‌లుస్తున్నారు. రోజుల త‌ర‌బ‌డి ఢిల్లీలోనే మ‌కాం వేసి.. గ‌ప్‌చుప్ భేటీలు జ‌రుపుతున్నారు. ఇదే స‌మ‌యంలో ఉరిమి ఉరిమి పిడుగు మీద‌ప‌డ్డ‌ట్టు.. స‌డెన్‌గా హుజురాబాద్ ఉప ఎన్నిక‌కు ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ షెడ్యూల్ ప్ర‌క‌టించింది, కేసీఆర్ హ‌స్తిన‌లో ఉన్న‌ప్పుడే అక‌స్మాత్తుగా బైపోల్ న‌గారా మోగ‌డం యాధృచ్చిక‌మా? లేక‌...? కేసీఆర్ వ‌రుస‌ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ల‌తో బీజేపీ పెద్ద‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకున్నార‌ని గ‌తంలోనే వార్త‌లు వ‌చ్చాయి. కేసీఆర్ రిక్వెస్ట్ మేర‌కే గ‌త నెల‌లోనే రావాల్సిన ఎన్నిక‌ల షెడ్యూల్ రాలేద‌ని అన్నారు. ఇప్పుడిక హుజురాబాద్ ఎల‌క్ష‌న్‌ బెల్ మోగ‌డంతో దీని వెనుక ఢిల్లీలో ఎలాంటి రాజ‌కీయం న‌డిచింద‌నే అనుమానం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది. రెండు ర‌కాల ఆస‌క్తిక‌ర‌ వాద‌న‌లు వినిపిస్తున్నాయి. కేసీఆర్ విజ్ఞ‌ప్తి మేర‌కే హుజురాబాద్ ఎన్నిక‌ను కొన్నివారాల పాటు వాయిదా వేసి.. ద‌ళిత‌బంధు ప‌థ‌కం అమ‌లుకు ఓ రూపు తీసుకొచ్చాకే ఎన్నిక‌ల న‌గారా మోగించార‌నేది ఓ వ‌ర్ష‌న్‌. ఈ లోగా ద‌ళిత‌బంధుతో పాటు ఈట‌ల హీట్ కాస్త త‌గ్గించ‌డం, కుల సంఘాల మీటింగులు, జంపింగ్ జ‌పాంగుల షిఫ్టింగులు, తాయిలాలు, పందేరాలు గ‌ట్రా కంప్లీట్ చేసుకున్న గులాబీ పార్టీ ఇక ఇక్క‌డ ఓకే అన‌గానే.. అక్క‌డ ఎల‌క్ష‌న్ బెల్ మోగిందని అంటున్నారు. టీఆర్ఎస్‌-బీజేపీల ఉమ్మ‌డి శ‌త్రువైన కాంగ్రెస్‌ను భ‌విష్య‌త్తులో దెబ్బ‌కొట్టేందుకు.. హుజురాబాద్ విష‌యంలో తాత్కాలికంగా కాంప్ర‌మైజ్ కావాల‌ని బీజేపీని కేసీఆర్ ఒప్పించార‌ని అంటున్నారు. ఢిల్లీ మంత్రాంగంలో పాపం ఈట‌ల రాజేంద‌ర్ బ‌లిప‌శువు అయ్యే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.  ఇక మ‌రో వాద‌న మ‌రింత ఇంట్రెస్టింగ్‌గా ఉంది. కేసీఆర్ విసిరిన పాచిక‌లు ఢిల్లీ పెద్ద‌ల ద‌గ్గ‌ర‌ బెడిసికొట్టాయ‌ని అంటున్నారు. కాలికి బ‌ల‌పం క‌ట్టుకొని తిరిగినా.. కేంద్రం గులాబీ బాస్ ట్రాప్‌లో ప‌డ‌లేద‌ని తెలుస్తోంది. తెలంగాణ‌లో సొంతంగా అధికారంలోకి రావాల‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్న క‌మ‌ల‌నాథులు.. కేసీఆర్‌తో అంట‌కాగేందుకు స‌సేమిరా అన్న‌ట్టు స‌మాచారం. ఈట‌ల రాజేంద‌ర్‌లాంటి బ‌ల‌మైన నాయ‌కుడు బీజేపీ త‌ర‌ఫున బ‌రిలో ఉండ‌బోతుండ‌టంతో ఎలాగైనా ఆయ‌న్ను గెలిపించుకొని.. కేసీఆర్‌కు గ‌ట్టి ఝ‌ల‌క్ ఇవ్వాల‌ని.. టీఆర్ఎస్‌కు బీజేపీనే ఆల్ట‌ర్‌నేట్ అనే మెసేజ్‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లాల‌ని భావిస్తోంది. భారీ మెజార్టీతో ఈట‌ల‌ను గెలిపించుకొని.. టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ల‌కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి.. కాషాయ జెండాను ఎగ‌రేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉంది బీజేపీ. అందుకే, క‌మ‌ల‌ద‌ళాన్ని ప్ర‌స‌న్నం చేసుకునే ప్ర‌య‌త్నాలు కేసీఆర్ ఓవైపు చేస్తుండ‌గానే.. ఇక త‌మ‌రి ప‌ప్పులేమీ ఉడ‌క‌వు, ఢిల్లీలో ఉన్న‌ది చాలు, ఇక ఇంటికెళ్లు అన్న‌ట్టు.. హుజురాబాద్ బైపోల్ బెల్ కొట్టేశార‌ని అంటున్నారు.  ఇలా రెండు వాద‌న‌లూ రీజ‌న‌బుల్‌గానే  ఉండ‌టంతో.. కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌లో అస‌లేం జ‌రిగిందోన‌నే ఆస‌క్తితో పాటూ అనుమానాలూ ఉన్నాయి. హ‌స్తిన‌లో ఏం జ‌రిగినా.. హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ రావ‌డం.. మ‌రో నెల రోజులు గ‌డువు ఉండ‌టంతో.. ఇక ఇక్క‌డ పొలిటిక‌ల్ హీట్ తారాస్థాయికి చేర‌డం ఖాయం.  ఎలాగైనా గెలిచి కేసీఆర్‌కు దిమ్మ‌తిరిగేలా చేయాల‌ని ఈట‌ల రాజేంద‌ర్ ప‌ట్టుద‌ల‌గా ఉండ‌టం.. ప్ర‌గ‌తిభ‌వ‌న్‌ను ధిక్క‌రించిన ఈట‌ల‌ను మ‌ళ్లీ అసెంబ్లీలోకి అడుగుపెట్ట‌కుండా చేయాల‌ని టీఆర్ఎస్ స్ట్రాంగ్‌గా డిసైడ్ కావ‌డంతో ఇక ఈ నెల‌రోజులూ, హుజురాబాద్ ఎల‌క్ష‌న్ జ‌రిగే వ‌ర‌కూ అస‌లు సిస‌లు రాజ‌కీయం చూడొచ్చు.   

హుజురాబాద్‌, బ‌ద్వేల్ ఉపఎన్నిక‌ షెడ్యూల్.. ఇద్ద‌రు సీఎంల‌లో టెన్ష‌న్‌..

సీఎం కేసీఆర్‌కు బిగ్ షాక్‌. సీఎం జ‌గ‌న్‌కు అగ్ని ప‌రీక్ష‌. హుజురాబాద్‌, బ‌ద్వేల్ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుద‌లైంది. అక్టోబ‌ర్ 1న నోటిషికేష‌న్ రానుంది. అక్టోబ‌ర్ 30న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. న‌వంబ‌ర్ 2న ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫ‌లితాలు ప్ర‌క‌టించనున్నారు. ఈ మేర‌కు ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది.  నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌కు అక్టోబ‌ర్ 8, నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు అక్టోబ‌ర్ 13 చివ‌రి తేదీలుగా నిర్ణ‌యించారు. అంటే మ‌రో 10 రోజుల్లో నామినేష‌న్ల ప్ర‌క్రియ‌.. మ‌రో నెల రోజుల వ్య‌వ‌ధిలో ఎన్నిక‌లు ఉండ‌నున్నాయి.  ఈసీ ప్ర‌క‌ట‌న‌తో తెలుగురాష్ట్రాలు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డాయి. మాజీమంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామాతో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక రావ‌డం.. గెలుపు కోసం బీజేపీ, టీఆర్ఎస్ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతుండ‌టం తెలిసిందే.  ఇక‌, సిట్టింగ్ ఎమ్మెల్యే మ‌ర‌ణంతో క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్‌లో బై ఎల‌క్ష‌న్ బెల్ మోగింది. ఏపీ వ్యాప్తంగా సీఎం జ‌గ‌న్‌పై, వైసీపీపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో సొంత జిల్లాలో జ‌ర‌గ‌బోవు ఉప ఎన్నిక జ‌గ‌న్‌కు స‌వాల్‌గా నిల‌వ‌నుంది. అందుకే, ఉప ఎన్నిక‌లు అంటే రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌డుతున్నాయి. 

ప‌వ‌న్ వ‌ర్సెస్ పేర్ని.. ట్విట‌ర్‌లో ర‌చ్చ రంభోలా..

ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర్సెస్ వైసీపీ. ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర్సెస్ ఏపీ మినిస్ట‌ర్స్‌. ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర్సెస్ పోసాని. ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర్సెస్ పేర్ని నాని. రిప‌బ్లిక్ ఈవెంట్ రోజు నుంచీ ర‌చ్చ రంభోలా జ‌రుగుతోంది. ఏపీ పాల‌కుల‌ను స‌న్నాసులు, ద‌ద్ద‌మ్మ‌లూ అంటూ మొద‌లుపెట్టి.. సినిమా టికెట్ల‌ ఆన్‌లైన్ అమ్మ‌కాల‌పై ఓ రేంజ్‌లో విమ‌ర్శ‌లు చేశారు. వెంట‌నే వ‌రుస పెట్టి మంత్రులు సైతం పీకేపై రివ‌ర్స్ అటాక్ చేశారు. ఇక వైసీపీ ఇచ్చిన హామీలు, నెర‌వేర్చ‌ని వైనాన్ని చార్ట్ రూపంలో ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసి.. సేవ్ ఏపీ ఫ్రం వైసీపీ అంటూ ఇష్యూను కంటిన్యూ చేశారు. అటు పోసాని సైతం మ‌ధ్య‌లో ఎంట‌రై మ‌రింత ర‌క్తి క‌ట్టించారు. ఇలా మంత్రులు, సినిమా వాళ్లు త‌న‌పై అటాక్‌కు దిగ‌డంతో మ‌రోసారి ట్వీట్‌తో అంద‌రికీ చుర‌క‌లు అంటించారు. ప‌వ‌న్ చేసిన ఆ ట్వీట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.  ‘‘తుమ్మెదల ఝుంకారాలు, నెమళ్ల క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలు, వైకాపా గ్రామ సింహాల గోంకారాలు సహజమే’’ అంటూ సోమవారం రాత్రి పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. అలాగే 'హూ లెట్ ద డాగ్స్ ఔట్' అన్న పాటను ట్వీట్ చేస్తూ.. ఇది తనకు ఇష్టమైన పాటల్లో ఒకటంటూ.. మొరిగే కుక్క‌ల‌కు తాను భ‌య‌ప‌డ‌న‌నే అర్థం వ‌చ్చేలా ట్విట‌ర్‌లో మ‌రింత గిల్లారు.    పవన్ కల్యాణ్ ట్వీట్‌కు మంత్రి పేర్ని నాని సైతం అదే స్థాయిలో బదులిచ్చారు. ‘‘జనం ఛీత్కారాలు, ఓటర్ల తిరస్కారాలు, తమరి వైవాహిక సంస్కారాలు, వరాహ సమానులకు న‘మస్కా’రాలు’’ అంటూ ట్వీట్ చేసి ర‌చ్చ మ‌రింత రాజేశారు. పవన్ కల్యాణ్‌పై ఓ ట్రోల్ వీడియోనూ సైతం పోస్ట్ చేశారు పేర్ని నాని. 

రాహుల్–వరుణ్.. మోదీ కలిపారు ఇద్దరినీ..

రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ ఇద్దరూ గాంధీలే..ఇందిరా గాంధీ మనమలే ... అయితే రాజకీయంగా ఎవరిదారి వారిది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, వరుణ్ గాంధీ బీజేపీ ఎంపీ. నిజానికి ఇద్దరూ ఇంచుమించుగా ఒకేసారి రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. అయినా ఎప్పుడూ, రాజకీయంగా కలవలేదు, చేతులు కలపలేదు. ఏ విషయంలోనూ ఇద్దరూ ఒకే అభిప్రాయాన్ని పంచుకున్న సందర్భాలు ఇంచుమించుగా లేవనే చెప్పవచ్చును, అయితే ఆ ఇద్దరినీ కలిపారు ప్రధాని నరేంద్ర మోడీ.  అవును... ఎలాగంటే  ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్‌కు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడు (కేరళ) ఎంపీ రాహుల్ గాంధీ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, పైగా, రైతు చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సర కాలంగా  రైతులు  సాగిస్తున్న ఆందోళను మద్దతు నిస్తోంది. కాబట్టి రైతు సంఘాలు నిర్వహిస్తున్న భారత్ బంద్’కి రాహుల్ గాంధీ మద్దతు ఇవ్వడంలో విశేషం ఏమీ లేదు.    నిజానికి, ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, బీజేపీని వ్యతిరేకించే అన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలు అన్నీ ‘బంద్’ పిలుపులో భాగస్వాములయ్యాయి. వ్యవసాయ చట్టాలను మోడీ ప్రభుత్వం ఆమోదించి ఏడాదైన సందర్భంగా ఆ చట్టాలను రద్దు చేయాలంటూ రైతు సంఘాల కూటమి సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు జరిగిన 'భారత్ బంద్'కు  కాంగ్రెస్ పార్టీటతో పాటుగా సీపీఎం, సీపీఐ, ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాది పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ (సెక్యులర్), బహుజన్ సమజ్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, డీఎంకే, సాద్-సంయుక్త్, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, జార్ఖాండ్ ముక్తి మోర్చా, రాష్ట్రీయ జనతా దళ్, సర్వాజ్ ఇండియా తదితర పార్టీలు మద్దతు ప్రకటించారు. బంద్‌కు 500కు పైగా రైతు సంస్థలు, 15 ట్రేడ్ యూనియర్లు, ఆరు రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ వర్గాల ప్రజలు మద్దతు ప్రకటించారు. సో .. రాహుల్ గాంధీ, భారత్ బంద్’కు మద్దతు ఇవ్వడం విశేషం కాదు. కానీ, వరుణ్ గాంధీ బీజేపీ ఎంపీ, పరోక్షంగానే అయినా  మద్దతు ఇవ్వడం కొంచెం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. వరుణ్ గాంధీ, బంద్’కు కాదు కానీ,రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఉత్తర ప్రదేశ్’లోని పిల్బిట్’ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ్ గాంధీ, ఇప్పుడు కాదు, చాలా కాలం క్రితమే రైతుల ఆందోళను మద్దతు ప్రకటించారు. రైతుల బాధలను కేంద్రం అర్ధం చేసుకోవాలని అన్నారు. కిసాన్ పంచాయత్‌లను ఆయన సమర్ధించారు. రైతులతో సంప్రదింపుల ప్రక్రియను కేంద్రం తిరిగి జరపాలని సూచించారు. బంద్’కు ప్రత్యక్ష మద్దతు ప్రకటించక పోయినా రైతులు, రైతు సంఘాల డిమాండ్లకు మద్దతు ప్రకటించారు.  ఆదాల ఉంటే, సోషల్ మీడియాలో వరుణ్ గాంధీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తున్నారని, అందుకు రాహుల్ గాంధీ వెనకుండి నడిపిస్తున్న రైతుల ఆందోళనకు వరుణ్ మద్దతు ఇవ్వడం ప్రత్యక్ష సాక్ష్యం అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నిజంగా కూడా వరుణ్ గాంధీ ప్రభుత్వానికి వ్యతిరకంగా రైతుల ఆందోళనకు మద్దతు నీయడం  ఒక విధంగా రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తున్నా, గాంధీ సోదరులు దగ్గర అవుతున్నారు అనేందుకు ఇదొక సంకేతమని అనుకున్నా, అది అయ్యేది కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి, సోనియా, మేనకా గాంధీల మధ్య ఇప్పటికి కూడా పాత పగలు చల్లారలేదని, ముఖ్యంగా, మేనక గాంధీ కాంగ్రెస్ గడప తొక్కేందుకు ఎట్టి పరిస్తితిలోనూ అంగీకరించరని అంటున్నారు. వరుణ్ గాంధీ కూడా వస్తుందనుకున్న మంత్రి పదవి రాక కొంత, సొంత నియోజక వర్గం పిల్బిట్ ‘లో రైతుల ఆందోళన ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకునే రైతుల ఆందోళనకు మాత్రమే మద్దతు నిచ్చారని అంటున్నారు. అయితే, రాజకీయాలలో ఎప్పుడైనా ఏదైనా జరగా వచ్చును.. ఎవరు ఎవరితో అయినా కలవ వచ్చును అనే మాట కూడా వినవస్తోంది.  

సీఎం కుర్చీకి ఎసరు పెట్టింది ఎవరు? అస‌లేం జ‌రిగింది?

హుజురాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందో, చివరకు ఏమౌతుందో, ఏమో కానీ, ఎన్నికల ప్రచారం మాత్రం ప్రవాహంలా, వేడిగా వాడిగా సాగుతూనే ఉంది. ఓ వంక అధికార తెరాస పార్టీ అభ్యర్ధి బాధ్యతలు మోస్తున్న మంత్రి హరీష్ రావు, మరో వంక  బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ ఉదృతంగా, ఆ ఇద్దరి మధ్యనే పోటీ అన్నట్లుగా  ప్రచారం సాగిస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు విసురుకుంటున్నారు. గతాన్ని తవ్విపోసుకుంటున్నారు. అదేలా ఉన్నప్పటికీ, సుదీర్ఘంగా సాగుతున్న ప్రచారపర్వంలో  అనేక ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. రోజుకో విషయం చర్చకు వస్తోంది. రచ్చ చేస్తోంది. ముఖ్యంగా పాత మిత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణలు, తెరాస పార్టీ లోగుట్టును, కల్వకుట్ల ఇంటి కుట్రలను విప్పి చెపుతున్నాయి. ఇప్పటికే, కలిసి కన్నీళ్లు పెట్టుకున్న ఉదంతం మొదలు ప్రగతి భవన్’  సాక్షిగా ఇద్దరికీ జరిగిన జంట అవమానాల వరకు చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. అదే క్రమంలో ఇప్పుడు ముఖ్యమంత్రి కుర్చీ మీద కన్నేసింది, ఎవరు? ఎవరు కేసీఆర్ కుర్చీ దించేందుకు కుట్రలు ఎవరు చేశారు? అనే విషయంలో ఆసక్తి కర చర్చ జరుగుతోంది. తీగలాగితే డొంకంతా కదిలించి అన్నట్లుగా, పూటకో కుల సంఘం సమావేశంలో హామీలు కురిపిస్తున్న హరీష్ రావు, తాటిచెట్టు ఎందుకు ఎక్కావంటే, దూడ మేతకు అన్నట్లుగా, ఈటల రాజేందర్’ను మంత్రి వర్గం ఎందుకు బర్తరాఫ్ చేశారంటే, ముఖ్యమంత్రి కుర్చీ మీద ఈటల కన్నేశారని, అందుకే ముఖ్యమంత్రి ఆయన్ని మంత్రి వర్గం నుంచి తోలిగించారని చెప్పు కొచ్చారు. నిజానికి, పేదల భూములు కాజేశారనే కాణంగా ఈటలను బర్తరాఫ్ చేశారన్నది నిజం కాదని తెలిపోవండతో, హరీష్ రావు కొత్తగా కుట్ర కోణాన్ని పైకి తెచ్చారు.   అయితే, ఈటల ముఖ్యమంత్రి కుర్చీకి ఎసరు పెట్టింది నిజమే కానీ, ఆ కుట్ర చేసింది నేను కాదు, ఆర్థిక మంత్రి హరీష్ రావేనని, ఎదురుబాణం వేశారు.అంతే, కాదు,” ముఖ్యమంత్రి కుర్చీకి ఎసరు పెడితే, కేసీఆర్ కుమార్తె కవిత, కాదంటే కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావు పెట్టాలి, అంతే కాని బడుగు బిడ్డను నేనెందుకు పెడతాను” అంటూ, కల్వకుట్ల ఫామిలీలో కుట్రలు జరుగుతున్నాయని, ఈటల చెప్పకనే చెప్పారు. నిజానికి, కేటీఆర్ అమెరికా ఫ్లైట్ దిగినప్పటి నుంచి కూడా కేటీఆర్, హరీష్ రావు మధ్య ఏవో పొరపొచ్చాలు ఉన్నాయని, ఇద్దరి మధ్య సెకండ్ పొజిషన్ కోసం యుద్ధం లాంటిది జరుగుతోందని అప్పుడప్పుడు కథలు, కథనాలు వస్తూనే ఉన్నాయి. అలాగే, తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత, మరీ ముఖ్యంగా పార్టీ 2018లో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, కల్వకుట్ల ఫామిలీలో ఇంటర్నల్ వార్’ గురించి అనేక రూపాల్లో చర్చ జరుగుతూనే ఉంది. కథలు, కధనాలు వస్తూనే ఉన్నాయి.  ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకే దెబ్బకు రెండు పెట్టలు అన్న విధంగా, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా, ముఖ్యమంత్రి కుర్చీకి పోటీపడే సత్తా, సామర్ధ్యం ఉన్న హరీష్ రావు, ఈటల రాజేందర్ ఇద్దరిపైన  ఒకేసారి వేటు వేసేందుకు, ఇద్దరి అడ్డు ఒకేసారి తొలిగించుకునే వ్యూహంలో భాగంగానే, కేసీఆర్  హుజూరాబాద్’  స్కెచ్ సిద్దం చేశారని పార్టీ వర్గాల కథనంగా ఉంది. ఈ నేపధ్యంలో హుజూరాబాద్’లో తెరాస గెలిచినా ఓడినా హరీష్ రావు రాజకీయ భవిస్త్యత్’ ప్రశ్నార్ధకమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, గెలిస్తే, హరీష్ రావుకు  కొంత ఊరట చిక్కుతుంది .అందుకే కావచ్చు హరీష్ రావు, హుజూరాబాద్’కు మకాం మార్చేశారు. సర్వ శక్తులు ఒడ్డి తెరాస అభ్యర్ధి గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, ఎంత చేసినా దుబ్బాక దెబ్బ రిపీట్ అవుతుందనే అంటున్నారు.  

TOP NEWS @ 7pm

1. గులాబ్‌ తుపాను, అనంతర పరిస్ధితులపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. గులాబ్‌ తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో జగన్ మాట్లాడారు. కుండపోత వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయనగరం, విశాఖ జిల్లాలోనూ భారీ వర్షాలు ముంచెత్తాయి.  2. గులాబ్ తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయని.. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారని.. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని టీడీపీ అధినేత చంద్ర‌బాబు తెలిపారు. తుఫాను ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తమ వంతు సాయం అందజేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరకులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించడంలో సహాయం అందించాలని సూచించారు. 3. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ధాన్యం కొనుగోలుపై చర్చించారు. కేంద్ర గోదాముల్లో నాలుగేళ్లకు సరిపోయే నిల్వ ఉన్నాయని.. గతంలోలా కొనలేమని కేంద్రం రాష్ట్రానికి చెప్ప‌గా ఆ అంశంపై చ‌ర్చించారు. కేంద్రమంత్రి నుంచి ఇంకా స్పష్టత రాలేదని.. మరో రెండు మూడు రోజుల సమయం కావాలని కేంద్ర మంత్రి కోరారని తెలుస్తోంది.  4. కేసీఆర్ పాలనపై ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై శాసనమండలిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును నిలదీశారు. ప్రజా ప్రతినిధులకు కనీసం కూర్చోడానికి కూడా కుర్చీ లేదని సూటిగా ప్రశ్నించారు. పంచాయతీరాజ్ మంత్రి చొరవ తీసుకుని దీనికి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.  5. ఎంపీ భరత్, ఎమ్మెల్యే రాజా వివాదంపై వైసీపీ అధిష్టానం దృష్టి సారించింది. మంగళవారం తాడేపల్లికి రావాలని ఇద్దరికీ పార్టీ అధిష్టానం ఆదేశించింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దగ్గర జరిగిన వివాదంపై చర్చించనున్నారు.  6. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ జరుగుతుంటే.. సీఎం కేసీఆర్ బంద్‌కు మద్దతు ఇవ్వకుండా ఢిల్లీలో ప్రధాని మోదీతో విందులో పాల్గొన్నారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించాలంటే కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు.  7. మంత్రి కేటీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. ఐటీ రంగం అభివృద్ధిపై అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. ఐటీ అభివృద్ధిపై ఎమ్మెల్యేలకు చెత్త పేపర్లు పంపిణీ చేశారని ఆరోపించారు. చేతకాకనే .. కేసీఆర్, కేటీఆర్‌లు కేంద్రాన్ని విమర్శించటం అలవాటుగా మార్చుకున్నారని రాజాసింగ్‌ విమర్శించారు. 8. సినిమా టికెట్లను ప్రభుత్వ పోర్టల్ ద్వారా ఆన్‌‌లైన్‌లో విక్రయించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ రఘురామ కృష్ణరాజు తప్పుబట్టారు. ఒకవేళ సినిమా ఇండస్ట్రీ వాళ్లే అడిగినా కూడా ప్రభుత్వానికి అవసరమా? వాళ్లు ఎన్నైనా అడుగుతారు. సినిమా హాళ్ల బాత్‌రూమ్‌లు క్లీన్ చేయడానికి మీరు వాలంటీర్లను కేటాయించండి అని కూడా అడుగుతారు. అలా అడిగితే ఇస్తారా? అని ప్ర‌శ్నించారు ఎంపీ ర‌ఘురామ‌.  9. మణికొండ నాలాలో పడిపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రజనీకాంత్ మృతదేహం ఎట్ట‌కేళ‌కు లభ్యమైంది. రెండు కి.మీ. దూరంలో నెక్నమ్‌పూర్ చెరువు ఒడ్డున ఆయన మృతదేహాన్ని క‌నుగొన్నారు. జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, డ్రోన్ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా రజనీకాంత్ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో దొరికింది.  10. సిరియా రాజధాని డమాస్కస్‌లోని అధ్యక్ష భవనం ద‌గ్గ‌ర‌ ఆత్మాహుతి దాడి జరిగింది. ఘటనలో సుసైడ్ బాంబర్‌తో పాటు మరో ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారు. పేలుడు ధాటికి వారి శరీర భాగాలు ఎగిరిపడ్డాయి. ఘటనంతా వీడియోలో రికార్డైంది.  

స‌ర్కారుపై ఎంఐఎం ఫిర్యాదు.. తప్పు సరిచేయాల‌ని డిమాండు..

తెలంగాణలో మిత్రపక్షం హర్టయ్యింది. ఎంతగా హర్టయిందంటే తెలంగాణ సర్కారు తమ సెంటిమెంట్లతోనే ఆడుకుందని, ఆ తప్పు సరిదిద్దుకోవాలని ఎంఐఎం ఏకంగా శాసనసభలోనే ఫిర్యాదు చేసింది. ఒకవర్గం మీద మరో వర్గానికి భేదభావం ఏర్పడుతుందని, ఇది ఉపేక్షించరాదని ఎంఐఎం ఎమ్మెల్యే బలాలా ఫిర్యాదు చేశారు. ఆ తరువాత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి రాతపూర్వకంగా ఫిర్యాదును అందజేశారు.  8వ తరగతి సాంఘిక శాస్త్రంలో స్వాతంత్య్ర ఉద్యమం-ఆఖరు దశ అనే అధ్యాయంలో ముస్లింల గౌరవానికి భంగం కలిగించేలా ప్రైవేట్ పబ్లిషర్ సిలబస్ ప్రిపేర్ చేశారని బలాలా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇస్లాం ఒక చేతిలో ఖురాన్, మరో చేతిలో ఖడ్గాన్ని పట్టుకొని దేశంలో ప్రవేశించిందని, అలా ప్రజల్ని భయపెట్టడం ద్వారా మత మార్పిడులకు పాల్పడినట్లు సిలబస్ లో పెట్టారని, ఇది ముస్లింలను కించపరిచేదే గాక సాటి ప్రజల్లో వివక్షకు దారి తీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా ఆలోచన లేకుండా సిలబస్ ప్రిపేర్ చేసిన ప్రైవేట్ పబ్లిషర్ పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక సిలబస్ లోని ఆ భాగాన్ని ఆన్ లైన్ లోంచి తొలగించారని, కానీ ఆఫ్ లైన్ లో ఇంకా ఉందని, దాన్ని కూడా తక్షణమే తొలగించాలని కోరారు. ఆన్ లైన్ లో తొలగించడం క్షణాల్లో జరిగే పని. కానీ ఆఫ్ లైన్ లో ఒకసారి ప్రింటయ్యాక దాన్ని తొలగించడం ఎలా సాధ్యమవుతుందన్న ఆందోళన, ఆగ్రహం ఎంఐఎం వ్యక్తం చేస్తోంది.  అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో బలాలా ఈ విషయాన్ని సభ దృష్టికి తీసుకురాగా సభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి దీనిపై స్పందించారు. ఎంఐఎం ఫిర్యాదును తక్షణమే పరిగణనలోకి తీసుకొని అభ్యంతరకరంగా ఉన్న భాగాలను తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఆ తరువాత దీనిపైనే రాతపూర్వక ఫిర్యాదును బలాలా సబితా ఇంద్రారెడ్డికి అందజేశారు.  ఇక ఈ విషయంపై బలాలా అసెంబ్లీలో చేసిన ప్రసంగ భాగం, దానికి ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన రిప్లయిని కలిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై ఎంఐఎం వ్యతిరేకులు, సమర్థకులు తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు.  

ఉద్యోగాలు అసాధ్యం.. అసెంబ్లీలో తేల్చేసిన కేటీఆర్‌!.. నిరుద్యోగుల ఆగ్ర‌హం

అప్పొజిషన్లో ఉన్నప్పుడు అధికార పక్షాన్ని ఏకిపారేయడం.. అధికారం అనుభవిస్తున్నప్పుడు నీతిపాఠాలు బోధించడం.. రాజకీయాాల్లో ఆరితేరినవాళ్లకు ఇలాంటివన్నీ మామూలే. అయితే ప్రజల్లో పలుచనైపోతామని గానీ, తమ పరువు తామే తీసుకుంటున్నామని గానీ గుర్తించకపోవడమే వీళ్లు చేస్తున్న అతిపెద్ద తప్పిదంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ  అసలు విషయమేంటంటే.. తెలంగాణ రాష్ట్ర యువమంత్రి కేటీఆర్ ఎట్టకేలకు ఓ వీక్ పాయింట్‌ను బయట పెట్టారు. అది కూడా శాసనసభా ముఖంగా మిత్రపక్షాలు, శత్రుపక్షాలు కళ్లప్పగించి చూస్తుండగా, చెవులప్పగించి వింటుండగా అసలు విషయాన్ని కక్కేశారు. అదేంటంటే ఏ ప్రభుత్వమైనా 2 శాాతానికి మించి ఉద్యోగావకాశాలు కల్పించలేదని, అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని అసలు విషయాన్ని ఏమాత్రం దాచుకోకుండా, తడుముకోకుండా చెప్పేశారు. ఈ మాటలు అంటున్నప్పుడు కేటీఆర్ లో ప్రతిపక్షాలు ఏమంటాయన్న భయం గానీ, స్వపక్షాలకైనా ఏం చెబుతామన్న సందేహాస్పద స్థితి గానీ, పోనీ ప్రజలు (మీడియా) అడిగితే ఎలా కన్విన్స్ చేస్తామన్న ఆలోచన గానీ కనిపించకపోవడం విశేషం. అసెంబ్లీ సమావేశాల్లో హైదరాబాద్ కోసం వెచ్చిస్తున్న భారీ ఎత్తున నిధులు, హైదరాబాద్ అభివృద్ధి  కోసం ఏం చేస్తే బాగుంటుందో తీసుకుంటున్న సూచనలపై కేటీఆర్ మాట్లాడారు. ఆ సందర్భంగా కేటీఆర్.. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని 4వ ప్రపంచ పారిశ్రామిక విప్లవంగా అభివర్ణించారు.  ఇప్పుడు తెలంగాణ జనాభా సుమారు 4 కోట్లు అనుకుంటే అందులో ఓవరాల్ గా 2 శాతానికి మించి ప్రభుత్వ  ఆధ్వర్యంలో ఉద్యోగావకాశాలు కల్పించలేమన్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది కొత్త తరం ఉన్నత చదువులు చదువుకొని యూనివర్సిటీల్లోంచి బయటికొస్తున్నారని, వారందరికీ ఉద్యోగాలిచ్చే సామర్థ్యం ఎవరికీ లేదన్నారు. తన వాదనకు సపోర్టుగా కేంద్రంలోని మోడీ సర్కారును కూడా ఆయన తీసుకోవడం విశేషం. మోడీ లేటెస్ట్ గా చేసిన అమెరికా టూర్ లో బైడెన్ ని కలవకముందు పలు కంపెనీల సీఈవోలతో విడివిడిగా భేటీ అయ్యారని మన దేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారని గుర్తు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నా, ఇప్పుడు బీజేపీ ఉన్నా, రేపు మరో ప్రభుత్వమే వచ్చినా ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించక తప్పదన్నారు. మోడీ క్వాల్కామ్ సీఈవో క్రిస్టియానో అమన్ ను కలిసిన విషయాన్ని కేటీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. డిజిటల్, 5జి, సోలార్ పవర్ వంటి అనేక రంగాల్లో భారత్ లో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలున్నాయని, అందులో తెలంగాణకు మరింత స్కోప్ ఉందని కేటీఆర్ చెప్పారు. ప్రైవేట్ కంపెనీల వ్యాపారాలకు సహకరిస్తేనే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని కేటీఆర్ ఇండైరెక్టుగా తేల్చిచెప్పారు.  అంతేకాదు.. ఇంక్లూసివ్ గ్రోత్ అంటే సర్వజన సమ్మిళితమైన అభివృద్ధి కోసం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని, వారిద్దరి మధ్య అతి అరుదుగా ఏకాభిప్రాయాలు వస్తుంటాయని, రాష్ట్ర అభివృద్ధిలో వారు ఏకాభిప్రాయం సూచించడమే గాక ఆ కార్యంలో తాము భాగస్వాములమవుతామని చెప్పడం ఆనందంగా ఉందంటూ.. ఆ రెండు పార్టీల సపోర్టును ఎంతో ముందుచూపుతో లాక్ చేశారు కేటీఆర్.  అయితే రాష్ట్రంలో ఉన్న వాస్తవమైన పరిస్థితులను బయటపెట్టే ఉద్దేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినా.. కాంగ్రెస్, లెఫ్ట్, టీజేఎస్, ఇంకా ఇతర పార్టీల నుంచి వచ్చే విమర్శనాస్త్రాలను మాత్రం విస్మరించారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఉద్యమ సమయంలో తండ్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యానాల పర్యవసానాలు కూడా కేటీఆర్ పట్టించుకోలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉద్యమ సమయంలో అధికార బాధ్యతలేవీ లేని వ్యక్తిగా కేసీఆర్ ఏటా దాదాపు 2 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని చెప్పారు. కానీ అది చేయలేక చేతులెత్తేసి ఇప్పుడు నిండా విమర్శనాస్త్రాలు ఎదుర్కొంటున్నారు. ఇక తాజాగా కేటీఆర్ 2 శాతానికి మించి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేమంటూ కొత్త సూత్రీకరణ చేసినా అది కూడా ఆచరణ సాధ్యం కాదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆయన మాటల ప్రకారమే తెలంగాణ జనాభా ఉజ్జాయింపుగా 4 కోట్లు అనుకున్నా అందులో 2 శాతం అంటే 8 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యమవుతుందని, అంతకుమించి ఇవ్వడం సాధ్యమయ్యే  పని కాదని తేల్చేశారు. మరి కేసీఆర్ అధికార పగ్గాలు చేపట్టాక 2 శాతం (8 లక్షల ఉద్యోగాలు) ఉద్యోగాలు కల్పించారా అంటే లేదనేదే సమాధానం. ఇప్పటికి ప్రభుత్వ లెక్కల ప్రకారమే చిన్నా, చితకా ఉద్యోగాలు కూడా కలుపుకున్నా 3 లక్షలకు మించలేదని నిరుద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఈ ఏడేళ్లలో ఉద్యోగాల కల్పన 2 శాతానికి  కూడా చేరలేేదని తేలిపోతుంది. మరి కేటీఆర్ ఏ లెక్క ప్రకారం 2 శాతం సాధ్యమవుతుందంటున్నారు.. పోనీ ఆ 2 శాతమైనా ఎప్పటిలోగా పూర్తి చేస్తారో.. చెప్తారా అంటున్నారు నిరుద్యోగులు.  ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ప్రైవేట్ రంగాన్ని మించింది లేదని చెప్పడం ఒక్కటే  కేటీఆర్ ఆంతర్యం తప్ప.. ప్రభుత్వం తరఫున కల్పించే లెక్కను పూరించడం కాదన్న చమత్కారాలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల దళిత బంధును ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కేసీఆర్ కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వంద మందిని ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున ఇస్తామన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో కొందరికి చెక్కులు ఇచ్చారు. వాటి నుంచి కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇది కూడా దళితులకు 3 ఎకరాల్లాంటి హామీయే తప్ప మరోటి కాదని మందకృష్ణ మాదిగ సహా ఇతర మేధావులంతా విమర్శిస్తున్నారు. తాజాగా కేటీఆర్ ఏ ఆధారంతో 2 శాతం ఉద్యోగాలు సాధ్యమవుతుందన్నారో  తెలియడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే కేటీఆర్ నోరు జారారా.. లేక బ్యాగ్రౌండ్ లో ఏమైనా హోం వర్క్ చేసే మాట్లాడారా.. లేక ఉద్యోగాల విషయంలో ప్రతిపక్షాలు కూడా అలాంటి హామీలే గతంలో ఇచ్చాయి కాబట్టి తన వ్యాఖ్యల వైఫల్యాన్ని ఎండగట్టరు అన్న ధీమాతోనే అలా మాట్లాడారా అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.  

రేవంత్ పిల‌క కేసీఆర్ చేతుల్లో ఉంది.. ష‌ర్మిల ఆవేద‌న‌తో మాట్లాడుతోంది..

కేసీఆర్‌ను ప్ర‌గ‌తిభ‌వ‌న్ నుంచి బ‌య‌ట‌కు గుంజాల‌నేది పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి టార్గెట్‌. తెలంగాణ‌లో ఎలాగైనా పాగా వేయాల‌నేది వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల ల‌క్ష్యం. ఆమె భ‌విష్య‌త్తుకు బ‌ల‌మైన ఆడ్డంకి రేవంత్‌రెడ్డి. ఆయ‌న్ను దాటుకొని వెళితేనే కేసీఆర్‌ను ఢీకొట్టగ‌ల‌రు ష‌ర్మిల‌. రేవంత్‌రెడ్డి దూకుడు రాజ‌కీయం ముందు.. ష‌ర్మిల సెటైర్లు తేలిపోతున్నాయి. అందుకే, త‌న రాజ‌కీయ భ‌విత‌కు అడ్డుగా ఉన్న రేవంత్‌రెడ్డిని అవ‌స‌ర‌మైన‌ప్పుడ‌ల్లా ఇర‌కాటంలో ప‌డేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు ష‌ర్మిల‌. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో రేవంత్‌రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అందుకే, రేవంత్‌రెడ్డి త‌న‌దైన స్టైల్‌లో ఆన్స‌ర్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. "రేవంత్‌రెడ్డి గారి పిలక కేసీఆర్‌ చేతుల్లో ఉంది. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలక కాదు.. మెడ తీసేయగలడు. అలాంటివాడు కేసీఆర్‌ మాట వింటాడా? కాంగ్రెస్‌ మాట వింటాడా? తెలంగాణ‌లో  ప్రతిపక్షమే లేదు. ఈ రోజు కాంగ్రెస్‌.. పార్టీగా కాకుండా ‘కాంగ్రెస్‌ సప్లయింగ్‌ కంపెనీ’గా మారింది. కేసీఆర్‌కు ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలి? ఎంతకు కావాలి? అని బేరమాడే స్థితికి వచ్చింది కాంగ్రెస్‌. అది ప్రతిపక్షమెలా అవుతుంది? అంటూ ఆ ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న విమ‌ర్శ‌లు చేశారు ష‌ర్మిల‌".  ష‌ర్మిల మాట‌ల‌పై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్పందించారు. అయితే, కేసీఆర్‌పై అటాక్ చేసిన‌ట్టు ఎదురుదాడి చేయ‌కుండా.. ఆమె ఆరోప‌ణ‌లకు అంతగా ప్రాధాన్యం లేద‌న్న‌ట్టు మాట్లాడారు. వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ఆవేదనతో ఏదో మాట్లాడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తప్పుబట్టారు. రాజకీయ పార్టీల నేతలు మాట్లాడితే తాను స్పందిస్తానని, ఎన్జీవో నడిపేవారు మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాజకీయాలతో షర్మిలకు సంబంధం లేదని కొట్టిపారేశారు. వైఎస్ ఆస్తులకు వారసులు జగన్, షర్మిలేనని చెప్పారు. కులపెద్దల మధ్య పంచాయితీ పెట్టుకొని ఆస్తుల సమస్య తీర్చుకోవాలని సూచించారు. ‘‘వైఎస్ ఆస్తులు మాకొద్దు.. మేము వారసులం కాదు. రాజకీయంగా మాత్రం వైఎస్ కాంగ్రెస్ నాయకుడే’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.  ఇలా రేవంత్‌రెడ్డి ఎలాంటి ఘాటైన వ్యాఖ్య‌లు చేయ‌కుండా.. వ్యూహాత్మ‌కంగా స్పందించ‌డం.. ఆమె ఆవేద‌న‌తో ఏదో మాట్లాడుతోందంటూ లైట్ తీసుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. త‌న మెయిన్ టార్గెట్ కేసీఆర్ మాత్ర‌మేన‌ని.. ష‌ర్మిల‌తో త‌న‌కు పెద్ద‌గా పోటీ లేద‌న్న‌ట్టు ఉంది రేవంత్‌రెడ్డి రియాక్ష‌న్‌.    

బాత్‌రూమ్‌లు క‌డ‌గ‌డానికి వాలంటీర్ల‌ను కేటాయిస్తారా? జ‌గ‌న్‌కు ఏకిపారేసిన ర‌ఘురామ‌

ర‌ఘురామ మాట‌లు తూటాల్లా వ‌స్తుంటాయి. నిత్యం ఏపీ స‌ర్కారును, సీఎం జ‌గ‌న్‌ను విమ‌ర్శ‌ల‌తో తూట్లు పొడుస్తుంటారు. ఘాటైన వ్యాఖ్య‌లతో ప్ర‌భుత్వ తీరును ఎప్ప‌టిక‌ప్పుడు నిల‌దీస్తుంటారు. తాజాగా సినీ ఇండ‌స్ట్రీ ర‌చ్చ‌పైనా ఆయ‌న త‌న‌దైన స్టైల్‌లో స్పందించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర్సెస్ వైసీపీ వార్‌లో పీకేకు ఫుల్ స‌పోర్ట్‌గా నిలిచారు. ఇక మూవీ టికెట్స్ ఆన్‌లైన్ వ్య‌వ‌హారంలో ప్ర‌భుత్వాన్ని ప‌దునైన విమ‌ర్శ‌ల‌తో ఏకిపారేశారు ఎంపీ ర‌ఘురామకృష్ణ‌రాజు.  ‘‘సినిమా వ్యాపారం అనేది చాలా చిన్న వ్యాపారం. అలాంటి దానిపై ప్రభుత్వం అంత శ్రద్ధ చూపించడం అవసరమా? రాష్ట్రంలో ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. రోడ్లు అధ్వానంగా మారినా పట్టించుకోవడం లేదు. ఒకవేళ సినిమా ఇండస్ట్రీ వాళ్లే అడిగినా కూడా ప్రభుత్వానికి అవసరమా? వాళ్లు ఎన్నైనా అడుగుతారు. సినిమా హాళ్ల బాత్‌రూమ్‌లు క్లీన్ చేయడానికి మీరు వాలంటీర్లను కేటాయించండి అని కూడా అడుగుతారు. వాళ్లకు ఇచ్చే రూ. 5వేలు మేమే ఇస్తాం. అంత తక్కువకు మాకు ఎవరూ రావడం లేదు. మీరు వాలంటీర్ల పేర్లతో మాకు కేటాయించండి అని అడిగితే ఇస్తారా? అడగడానికి వాళ్లెవరు? ఓకే చెప్పడానికి వీళ్లెవరు? ఇది చాలా తప్పు’’ అంటూ ర‌ఘురామ విరుచుకుప‌డ్డారు.  ఇక, పవన్ కల్యాణ్‌కు సైతం ర‌ఘురామ స‌పోర్ట్ చేశారు. ‘‘ప‌వ‌న్‌ చెప్పిన విషయాన్ని నేను సమర్థిస్తా. పవన్ కల్యాణ్ చాలా క్లియర్‌గా చెప్పారు. తన మీద కోపాన్ని ఇండస్ట్రీపై చూపిస్తున్నారనే ఆవేదన ఆయన మాటల్లో కనిపించింది.’’ అని రఘురామకృష్ణరాజు అన్నారు.   

వైసీపీకి బిగ్ షాక్‌.. జెడ్పీ ఛైర్‌ప‌ర్స‌న్‌పై హైకోర్టులో పిటిష‌న్‌..

అధికార పార్టీకి షాకుల మీద షాకులు. వైసీపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిత్యం ఏదో ఒక పిటిష‌న్ హైకోర్టులో దాఖ‌ల‌వుతూనే ఉంటుంది. స‌ర్కారు చేసే ప‌నులు కూడా అలా ఉంటున్నాయి మ‌రి. అధికారం చేతిలో ఉంది క‌దా అని.. ఇష్టారీతిన వ్య‌వ‌హ‌రిస్తోంది. నిబంధ‌న‌లు ప‌ట్టించుకోకుండా అడ్డ‌గోలు నియామ‌కాలు చేప‌డుతోంది. అందుకే, ప‌లు ఉదంతాల్లో న్యాయం కోరుతూ హైకోర్టును ఆశ్ర‌యిస్తున్నారు ప‌లువురు. తాజాగా, ఇటీవ‌లే గుంటూరు జెడ్పీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా ఎన్నికైన క్రిస్టినాకు వ్య‌తిరేకంగా హైకోర్టును ఆశ్ర‌యించారు ఓ మ‌హిళ‌.  గుంటూరు జెడ్బీ ఛైర్‌ప‌ర్స‌న్‌ క్రిస్టినా ఎస్సీ కాదంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. తెనాలికి చెందిన సరళకుమారి అనే మహిళ కోర్టులో పిటిషన్ వేశారు. క్రిస్టినా తప్పుడు ధ్రువపత్రం సమర్పించారని కోర్టుకు తెలిపారు. ఈ విషయంపై గతంలోనే జిల్లా కలెక్టర్‌కూ ఫిర్యాదు చేసినా ఫ‌లితం లేద‌ని ఆరోపించారు.  పిటిష‌న్‌పై స్పందించిన ఏపీ హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. అయితే, ఈ నెల 25నే గుంటూరు జిల్లా జెడ్పీ ఛైర్‌పర్స‌న్‌గా క్రిస్టినా ప్రమాణ స్వీకారం చేశారు. రెండు రోజులు గ‌డ‌వ‌గానే హైకోర్టులో అన‌ర్హ‌త‌ పిటిషన్ దాఖలు కావడం సంచ‌ల‌నంగా మారింది.   

మమత వాటికన్ టూర్‌పై ర‌చ్చ‌.. బీజేపీ అడ్డుపుల్ల‌.. స్వామి స‌పోర్ట్‌.. ఇదేం డ్రామా?

పశ్చిమ బెెంగాల్ రాజకీయ కక్షలు ప్రపంచ వేదికల మీద కూడా ప్రతిఫలిస్తాయా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తప్పదేమో అనిపిస్తుంది. వాటికన్ సిటీలో జరిగే సర్వమత సమ్మేళనానికి మమతా బెనర్జీకి కూడా ఆహ్వానం అందిందట. అక్టోబర్ 4వ తేదీన ఈ సమ్మేళనం జర‌గ‌నుంది. దానికి మమత వెళ్లాల్సి ఉంది. అందుకోసం ఆమె ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. అయితే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మోకాలడ్డుతోంది. మమత వాటికన్ వెళ్లడానికి అనుమతించేది లేదంటోంది. అది సర్వమత సమ్మేళనం కాబట్టి పొలిటికల్ లీడర్స్ ఆ సమావేశానికి వెళ్లాల్సిన అవసరం లేదని ఎం.హెచ్.ఎ స్పష్టం చేస్తోంది. అయితే మమత మాత్రం వెళ్లి తీరతాను.. ఎవరాపుతారో చూస్తాను అంటూ చెలరేగిపోతోంది.  మమత సీఎం పీఠాన్ని నిలబెట్టుకోవాలంటే భవానీపూర్ లో తప్పకుండా గెలిచితీరాలి. ఇటీవల విడుదలైన ఈసీ షెడ్యూల్ ప్రకారం ఈనెల 30న భవానీపూర్ బైె-ఎలక్షన్ జరుగుతుంది. అక్టోబర్ 3న కౌంటింగ్ లో మమత భవితవ్యం తేలిపోతుంది. ఆ తెల్లవారే వాటికన్ సిటీలో సర్వమత సమ్మేళనం జరగబోతోంది. కాబట్టి ఆ పంచాయతీకి ఈ లోగానే శుభం కార్డు పడితే తాను తప్పక గెలుస్తానన్న ఓ కాన్ఫిడెన్స్ మమతలో బిల్డప్ అవుతుంది. సర్వమత సమ్మేళనంలో సెక్యులర్ లీడర్ గా ప్రొజెక్ట్ కావడం అనేది మమతకు తప్పనిసరి అంశం. లేకపోతే ఆమె మోరల్ గా పతనమై భవానీపూర్ లో బీజేపీకి తలొగ్గి ఆ తరువాత సీఎం కుర్చీ నుంచి అత్యంత పరాభవంతో నిష్క్రమించాల్సి వస్తుంది. అది జరగకూడదు కాబట్టే తనను ఎవరాపుతాారో చూస్తానంటూ మమత బీజేపీ నేతల మీద సవాళ్లు విసురుతోంది.  ఇటీవల బెంగాల్ కు జరిగిన హోరోహోరీ ఎన్నికల్లో మమత సీఎం స్థానాన్ని నిలబెట్టుకున్నా తను పోటీ చేసిన సీటు మాత్రం ఓడిపోయారు. అటు బీజేపీ 4 స్థానాల నుంచి 77 స్థానాలకు ఎగబాకింది. బెంగాల్ పోలింగ్ సమయంలోనే ప్రధాని మోడీ బంగ్లాదేశ్ రాష్ట్ర అవతరణ దినాన్ని పురస్కరించుకొని ఢాకాలో పర్యటించారు. అక్కడ మోడీ చేసిన ప్రసంగం, కాళికాదేవి టెంపుల్ ను మోడీ సందర్శించడం బాగా హైలైట్ అయ్యాయి. మరోవైపు బెంగాల్లో మాత్రం మత ఘర్షణలు చెలరేగాయి. బీజేపీ కార్యకర్తలు, నాయకుల ఆస్తులు ధ్వంసం అయ్యాయి. రోహింగ్యాలు, స్థానిక ముస్లిం శక్తులు సంఘ పరివార్ కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. చాలా బీజేపీ కుటుంబాల ఆస్తులు లూటీ అయ్యి రోడ్డుమీద కూడా పడ్డాయి. మరోవైపు రాష్ట్ర హెచ్చార్సీ, జాతీయ హెచ్చార్సీ, హైకోర్టు వంటి ఉన్నత సంస్థలు సైతం మమత పరిపాలనను, వైఖరిని తప్పుపట్టేలా కామెంట్లు చేశాయి. సీబీఐ విచారణ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన సీటును తప్పకుండా నిలబెట్టుకోవాలంటే ఆనాడు మోడీ అనుసరించిన సూత్రాన్నే తాను కూడా అనుసరించాలని మమత భావిస్తున్నట్టు నిపుణులు భావిస్తున్నారు.  బెంగాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లింలు, క్రిస్టియన్ల మద్దతు పొందేందుకు వాటికన్ సమావేశాన్ని  ఉపయోగించుకోవాలని మమత నిర్ణయించుకున్నారు. అందుకే ఐరాస ఆధ్వర్యంలో నవంబర్ లో జరగబోయే క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ కు ముందస్తుగా జరుగుతున్న వాటికన్ సమావేశంలో పాల్గొనాలని డిసైడయ్యారు. వాటికన్లో సమావేశాన్ని బ్రిటన్, ఇటలీ కలిసి నిర్వహిస్తుండగా నవంబర్ లో జరిగే సమావేశానికి బ్రిటన్ హోస్ట్ చేస్తోంది. వాటికన్ మీట్ లో ప్రపంచంలోని పలు దేశాల నుంచి సుమారు 40 మంది వివిధ మతాల ప్రవక్తలు, మరో 10 మంది శాస్త్రవేత్తలు పాల్గొంటున్నారు. ఈ 50 మంది ప్రపంచ దేశాధినేతలకు సంయుక్తంగా ఓ అప్పీల్ చేస్తారు. వివిధ దేశాల్లో పతనమవుతున్న శాంతిభద్రతలు, మానవీయ విలువలు నిలబెట్టడానికి, పర్యావరణాన్ని మెరుగు పరచడానికి ఏం చేయాలో సూచిస్తారు.  అలాంటి సమావేశానికి మమత వెళ్లాల్సిన అవసరం ఏంటని, తన పాలనలో హిందువులకు రక్షణ కల్పించలేకపోయిన మమత.. ఏ విధంగా శాంతి వచనాలు వల్లిస్తుందని, ఎవరికి వల్లిస్తుందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే అది ప్రజాస్వామిక హక్కు అని మమత మద్దతుదారులు, బీజేపీ వ్యతిరేకులు అభిప్రాయపడుతున్నారు. అందుకు వారు గోద్రా అల్లర్లను ఉటంకిస్తున్నారు. అయితే బీజేపీకి బలమైన మద్దతుదారుగా ఉన్న సుబ్రమణ్యస్వామి కూడా మమతకు సపోర్టుగా రావడం ఆసక్తికరంగా మారింది. పౌరుడికి ఎక్కడికైనా ప్రయాణించే స్వేచ్ఛను ఆర్టికల్ 19 ద్వారా రాజ్యాంగం కల్పించిందని, దాని గురించి ఎంతసేపైనా తాను వివరించగలనని స్వామి ఘాటుగానే వ్యాఖ్యానించారు.  అయితే ప్రయాణించే స్వేచ్ఛ మీద అవసరానికి తగినట్టు కొన్ని ఆంక్షలున్నాయని, ఆ ఆంక్షలను కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని, కానీ ఒక సీఎం ట్రావెల్ చేయడాన్ని అడ్డుకునే ఆంక్షలు ఎక్కడా లేవంటూ కేంద్ర సర్కారు మీద అస్త్రాలు సంధించారు. అయితే స్వామిది రెండు నాల్కల ధోరణి అంటూ బీజేపీ సోషల్ మీడియా టీమ్ విరుచుకుపడుతుండగా.. మమత సపోర్టర్లు మాత్రం స్వామిని సమర్థిస్తున్నారు. బీజేపీ ఎంపీగా ఉన్న స్వామి.. ఫక్తు మోడీ వ్యతిరేకిగా మమతకు మద్దతివ్వడంలో చాణక్యం ఏంటన్న అంచనాలు, అభిప్రాయాలు జోరుగా సాగుతున్నాయి.

బంద్‌లో కాకుండా మోదీతో విందులో.. కేసీఆర్‌ను కార్న‌ర్ చేసిన‌ రేవంత్..

రేవంత్‌రెడ్డి విమ‌ర్శ‌లు ప‌ర్‌ఫెక్ట్‌గా ఉంటాయి. ఆయ‌న మాట‌ల్లో లాజిక్‌, మేజిక్ ఉంటుంది. ప్ర‌తీ మాట‌కో లెక్క‌. ప‌క్కా ఆధారాల‌తో విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు చేస్తుంటారు. సంద‌ర్బానుసారం గ‌తాన్ని ప్ర‌స్తావిస్తుంటారు. అందుకే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసే ప్ర‌తీ కామెంట్ ఇటు కేసీఆర్‌కు, అటు కేటీఆర్‌కు స్ట్రాంగ్‌గా త‌గులుతుంటుంది. రేవంత్ విమ‌ర్శ‌ల‌తో తండ్రీకొడుకులు తెగ ఇర‌కాటంలో ప‌డుతుంటార‌ని అంటారు. తాజాగా, భార‌త్ బంద్ విష‌యంలోనూ కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసి ముఖ్య‌మంత్రిని ఇబ్బందుల్లో ప‌డేశారు. ఇంత‌కీ రేవంత్‌రెడ్డి ఏమ‌న్నారంటే... మోదీ ఏం మాయ చేశారో గాని కేసీఆర్‌లో మార్పు వచ్చింది. రైతుల ప‌క్షాన సీఎం కేసీఆర్ భార‌త్ బంద్‌లో పాల్గొనకుండా మోదీతో విందులో పాల్గొంటున్నారు. కేసీఆర్‌ ఎవరి పక్షాన ఉన్నారో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. అదానీ, అంబానీలకు సాగును మోదీ తాకట్టు పెట్టారు. అలాంటి మోదీకి కేసీఆర్ మ‌ద్ద‌తు ఇస్తారా? అంటూ రేవంత్‌రెడ్డి నిల‌దీశారు.  ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ పాలనలో పేదల బతుకు దుర్భరంగా మారిందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రైతు ఉద్యమానికి కేసీఆర్‌ తొలుత మద్దతిచ్చారని గుర్తు చేశారు. గతంలో రైతు బంద్‌లో కేటీఆర్‌ కూడా పాల్గొన్నారు. మోదీని కలిసిన తర్వాత కేసీఆర్‌ వైఖరి మారిపోయింది. రైతు శ్రేయస్సును గతంలో కాంగ్రెస్‌ కాపాడింది. మోదీ సర్కారు రైతులను బానిసగా మార్చింది. సాగు చట్టాలతో రైతు భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది. సాగు చట్టాలు రైతులు, వినియోగదారులకు మరణశాసనాలే.. అంటూ ఉప్ప‌ల్ డిపో ముందు ధ‌ర్నాలో రేవంత్‌రెడ్డి మండిప‌డ్డారు.  నిజ‌మే. గ‌తంలో కేంద్ర సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు భార‌త్ బంద్ చేప‌ట్టారు. అప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం ఆ బంద్‌కు అధికారికంగా మ‌ద్ద‌తు తెలిపింది. బంద్‌లో టీఆర్ఎస్ పార్టిసిపేట్ చేసింది. మంత్రి కేటీఆర్ సైతం రైతుల‌కు మ‌ద్ద‌తుగా రోడ్డు మీద‌కొచ్చారు. అదే విష‌యాన్ని ఇప్పుడు గుర్తు చేశారు రేవంత్‌రెడ్డి. ఇటీవ‌ల ప్ర‌ధాని మోదీతో కేసీఆర్ మీటింగ్ త‌ర్వాత స‌ర్కారు తీరు మారిపోయింద‌ని.. మోదీ ఏం మాయ చేశారో కానీ కేసీఆర్ భార‌త్ బంద్‌లో పాల్గొన‌డం లేదంటూ విమ‌ర్శించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.