ఇక ఏపీలో ముందస్తు నగారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు డిసైడైపోయారా? ఆయన తాజా హస్తిన పర్యటనలో ఈ విషయంపై కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ పొందారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అందుకు తార్కానంగా ఆయన హస్తిన నుంచే కేబినెట్ భేటీకి ఏర్పాట్లు చేయాల్సిందిగా ఇచ్చిన ఆదేశాలను చెబుతున్నారు. ఔను హస్తిన నుంచి ఆయన సోమవారం (మే29) పార్టీ ముఖ్యులకు ఒక సందేశం పంపించారు.  వచ్చే నెల 7న కేబినెట్ భేటీకి ఏర్పాట్లు చేయాలన్నదే ఆ సందేశం. ఆ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంటామని కూడా జగన్ చెప్పారని అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఆయన తీసుకోబోయే కీలక నిర్ణయం ముందస్తేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం దూకుడు ను నిలువరించాలంటే.. ఆ పార్టీ మరింత పుంజుకోకుండా ఆపాలంటే ముందస్తు ఒక్కటే మార్గమన్నది వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశంగా వారు పేర్కొంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని వర్గాలలో వైసీపీ పాలన పట్ల.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జగన్ పాలన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అందుకు తాజా తార్కానం అమరావతి ఆర్5 జోన్ లో పట్టాల పంపిణీకి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి.. వేల మందికి పట్టాలు పంపిణీ చేపట్టినా.. ఆ సభలో జగన్ ప్రసంగం ప్రారంభించగానే జనం మూకుమ్మడిగా లేచి వెళ్లిపోవడాన్ని చూపుతున్నారు.  ఇప్పటికే ఏపీలో ఎన్నికల హీట్ రోహిణి కార్తె ఎండలను మించిపోయింది. ఏపీ సీఎం ముందస్తు ముచ్చటే లేదని స్పష్టం చేసినా ఆయన మాటలను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. నవంబర్‌లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ రావాల్సి ఉంది. అసెంబ్లీల గడువు పూర్తయ్యే రాష్ట్రాల్లో ఈసీ ఇప్పటికే సన్నాహాలు ఆరంభించింది. ధృవపడని సమాచారం మేరకు పనిలో పనిగా ఏపీలో కూడా ఈసీ ఎన్నికల సన్నాహాలు ఆరంభించింది.  అయినా ఏపీలో  కూడా ఎన్నికలు జరగాలంటే.. ఎ ఆ ఐదు రాష్ట్రాలతో కలిపి ఈసీ ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలు నిర్వహించాలంటే… ఇక జాగు లేకుండా జగన్ అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది. అదిగో ఆ నిర్ణయం తీసుకునేందుకే జగన్ వచ్చే నెల 7న కేబినెట్ బేటీ ఏర్పాటు చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ విశ్లేషణలకు హేతువు మాత్రం ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల, మంత్రులు సమయం సందర్భంతో పని లేకుండా ముందస్తు ప్రశక్తే లేదన్న ప్రకటనలు గుప్పించడమేనంటున్నారు.  ముందస్తుకు వైసీపీ తొందర ఎందుకంటే.. రాష్ట్రంలో జగన్ సర్కార్ సంక్షేమ పథకాల కొనసాగింపు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. ఆర్థిక పరిస్థితులు కారణంగా ఆ పథకాలు నిలిచిపోయే పరిస్థితి ఉంది. అదే జరిగితే.. ప్రభుత్వ ప్రతిష్ట మరింత దిగజారి మొదటికే మోసం వస్తుంది. ఈ ఆలోచనతోనే జగన్ ముందస్తు మంత్రం జపిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇందుకు కేంద్రం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందనీ, సహకారం అందింస్తామన్న హామీ కూడా జగన్ కు లభించిందని అంటున్నారు. అందుకే ఏళ్ల తరబడి పైసా విదల్చడానికి కూడా ఇష్టపడని కేంద్రం ఒక్క సారిగా ఉరుములేని పిడుగులా.. జగన్ సర్కార్ పై అవాజ్యమైన ప్రేమానురాగాలు ప్రదర్శిస్తూ రెవెన్యూ లోటు నిధులను పది వేల కోట్ల రూపాయలకు పై చిలుకు ఒకే సారి విడుదల చేసిందని అంటున్నారు. ముందస్తు సన్నాహాలకు, బకాయిల చెల్లింపులకు ఈ నిధులు రాష్ట్రానికి ఉపకరిస్తాయన్న యోచనతోనే ఆ విడుదల జరిగిందనీ, లేకుంటే గత ప్రభుత్వం రెవెన్యూలోటు భర్తీ గురించి అడినప్పుడల్లా దేశ రక్షణ నిధులివ్వమంటారా అంటూ ఒంటి కాలిమీద లేచిన కేంద్రంలోని మోడీ సర్కార్ ఇప్పుడు హఠాత్తుగా అంత సొమ్ము ఒకేసారి ఎందుకు విడుదల చేస్తుందని అంటున్నారు.   ఏది ఏమైనా జగన్ సర్కార్ ముందస్తుకు వెడుతుందా? లేదా? అన్నది జూన్ 7న జరిగే కేబినెట్ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  

కెసీఆర్ ఇలాఖాలో నీటి కటకట

ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గంలో తాగునీటి కటకట వాటిల్లింది. భారతదేశంలోనే పవర్ ఫుల్ సిఎం కెసీఆర్ అని ప్రచారంలో ఉన్నప్పటికీ ఎండాకాలంలో గజ్వేల్ వాసులు పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు. దాదాపు 60 శాతం మంది నీటి ఎద్దడికి గురవుతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 2011 సెన్సెస్ ప్రకారం మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకదర్గంలో మొత్తం 3, 22, 130 మందిలో 1,93,278 మంది తాగునీటికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  ఆరు మండలాల్లో ప్రజలు దాహార్తికి గురవుతున్నారు. వర్గల్ మండలంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది.  మరుగుదడ్లు కేవలం 46.73 శాతం మందికే ఉన్నాయి. అంటే మండలంలో మొత్తం 3.2 లక్షల మంది జనాభా ఉంటే లక్షా 48 వేల మంది మరుగుదడ్లు లేక నానా ఇబ్బందులకు గురవుతున్నారు.  అంటే మిగిలిన  లక్షా 73 వేల మంది ఆరు బయట విసర్జన కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ముఖ్యమంత్రి స్వంత ఇలాఖాలోనే ఇటువంటి పరిస్థితి ఉందంటే మిగతా ప్రాంతాల్లో అంచనా వేయవచ్చు. 

మహాజన ప్రభంజనం.. మహానాడు

రాజమండ్రిలో రెండు రోజుల పాటు జరిగిన పసుపు పండుగ మహానాడు తెలుగుదేశం పార్టీ భవిష్యత్ వ్యూహాలను ప్రజల ముందు ఉంచింది. మే నెల 27, 28 తేదీలలో జరిగిన తెలుగుదేశం వార్షిక ప్రతినిథుల సభ, బహిరంగ సభలు ఆ పార్టీ శ్రేణులలో కొత్త జోష్ ను నింపాయి.  27వ తేదీన సుమారు 15వేల మంది హాజరౌతారని అశించిన ప్రతినిథుల సభకు 40 వేల మందికి పైగా హాజరు కావడంతో ప్రతిపక్ష తెలుగుదేశంలో ఆనందం, అధికార వైసీపీలో గుబులు ఒక్కసారిగా బయటపడ్డాయి.  తెలుగుదేశం పార్టీ ఆ జోష్ ను రెండు రోజుల పాటు కొనసాగించగా, వైసీపీ తన అక్కసును అనేక రకాలుగా ప్రకటిస్తూనే వచ్చింది.  రాజమండ్రి శివారు ప్రాంతమైన వేమగిరిలో జరిగిన రెండు సభలూ సూపర్ హిట్ కావడంతో పసుపు క్యాడర్ లో  పట్టపగ్గాలు లేకుండా పోయాయి. మరో వైపు పరిస్థితిని గమనించిన వైసీపీ నేతలు అడుగడుగునా అడ్డు పడటం కనిపించింది. ముందు రోజు నుండీ ఫ్లెక్సీలు చించివేయడం, సభలకు స్థలాన్ని ఇచ్చిన వారిని బెదరించడంతో పాటు.. లక్షలాది మంది ప్రజలు హాజరౌతున్న సభలకు అంబులెన్సులను ఇచ్చే వారిని కూడా వైసీపీ నేతలు బెదరించారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇన్ని అవరోధాల మధ్య మహానాడు మహా విజయాన్ని స్వంతం చేసుకుంది. రాజమండ్రి నగరంలో, సభలు జరిగే చోట భారీ వాహనాలను అడ్డుగా పెట్టి ట్రాఫిక్ సమస్యను సృష్టించారని స్థానిక టీడీపీ నేతలు వైసీపీ  నేతలపై, ప్రభుత్వ శాఖల అధికారులపై ఆరోపణలు చేయడం కూడా కనిపించింది.  ఇన్ని అవాంతరాల మధ్య రెండు రోజుల పాటు సాగిన మహానాడు పార్టీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. 27వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ప్రతినిథుల మహాసభల దాదాపు ప్రతి నాయకుడూ మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను సభ ముందు ఉంచే ప్రయత్నం చేశారు.  27వ తేదీన ప్రతినిథుల మహా సభలో పార్టీ ముఖ్యులు చేసిన ప్రసంగాలు పార్టీ ప్రతినిథులను ఆకట్టుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ప్రతినిథులు రావడంతో సభకు నిండుదనం చేకూరింది.  సుమారు  40 డిగ్రీల ఎండ కాస్తున్నా లెక్క చేయకుండా ఉదయం 10 గంటల నుండి రాత్రి 7 గంటల దాకా సాగిన ప్రతినిథుల మహా సభ పార్టీలోని క్రమశిక్షణను చెప్పకనే చెప్పింది. ప్రతినిథుల సభలో అధినేత చంద్రబాబు ప్రసంగం హైలైట్ గా నిలిచింది. కౌరవులను ఓడించి గౌరవ సభలోకి అడుగుపెడతానని బాబు చెపపినపుడు ప్రతినిథుల సభ హర్షం వ్యక్తం చేసింది. అదే రోజు సాయంత్రం జరిగిన జాతీయ అధ్యక్షుడి ఎన్నికల చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  రానున్న ఎన్నికలలో యువతకు 40శాతం సీట్లు కేటాయిస్తామని, క్రమశిక్షణ పాటించని నాయకులను పార్టీ ఆదరించే ప్రశ్నే లేదని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించారు.  మొత్తం 19 తీర్మానాలను ఆమోదించారు.  28వ తేదీన జరిగిన భారీ బహిరంగ సభ పార్టీ పట్టును మరోసారి తెలిపింది. లక్షల మంది హాజరైన ఈ సభలో పార్టీ అధినేత మినీ మేనిఫెస్టోను విడుదల చేశారు.  మహిళలకు పెద్ద పీట వేస్తూ ప్రకటించిన మానిఫెస్టో రానున్న ఎన్నికలలో విజయానికి తొలి సంకేతమని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.  మినీ మేనిఫెస్టో పేరుతో చంద్రబాబు చేసిన ప్రకటనల్లో ఎ క్కడా వ్యక్తుల పేర్లను పథకాలకు పెట్టలేదు.  18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇచ్చే ఆడబిడ్డ నిథి, చదువుకునే పిల్లల తల్లులకు తల్లికి వందనం, జిల్లా పరిధిలో మహిళలకు ఉచిత బస్సు వసతి, ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలెండర్లు, నిరుద్యోగ యువతకు మూడు వేల రూపాయల భృతి ఈ మినీ మేనిఫెస్టోలో ముఖ్యమైనవి. ఇవి కాక అధికారం ఉండే ఐదేళ్లలో 20 లక్షల మందికి జీవనోపాధి కల్పించే బాధ్యత తనదేనంటూ చంద్రబాబు చేసిన వాగ్దానాలు తెలుగుదేశం శ్రేణులకు అమితానందాన్ని కలిగించాయి.   ఏది ఏమైనా రాజమహేంద్రవరం మహానాడు తెలుగుదేశం పార్టీకి, నాయకులకు, శ్రేణులకు ఒక మధుర జ్ణాపకంగా నిలిచిపోనుంది. 2023 మహానాడు స్ఫూర్తితో రానున్న ఎన్నికలకు సమాయత్తం కావడానికి తెలుదండు జిల్లాలకు తరలివెళ్లింది. 

ఆవిర్భావ దినోత్సవాలకు కాంగ్రెస్ ప్లాన్ 

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఓన్ చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. తెలంగాణ ఏర్పడిన 9 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తొలిసారి అమెరికాలో తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ వేడుకలను నిర్వహించనుంది. దీనికి ముఖ్య అతిథిగా ఎఐసీసీ నేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చినప్పటికీ ఆ క్రెడిట్ బిఆర్ఎస్ కు వెళ్లిందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే తెచ్చింది మాత్రం బిఆర్ఎస్ అని  ప్రచారం చేసుకుంటుంది.  వచ్చే నెల రెండున అమెరికా టెక్సాస్ లో జరిగే వేడుకలకు రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొంటున్నారు. ప్రభుత్వ నిధులతో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది. ఇటీవలె కర్ణాటక ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. తెలంగాణలో  ఆ పార్టీ బలం పెరిగింది. కర్ణాటక సరిహద్దు జిల్లాలలో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఎక్కువయ్యాయి. కాస్తా కష్టపడితే బిఆర్ఎస్ ను దెబ్బతీయడం సులభమేనని కాంగ్రెస్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.  పిల్ల పుట్టి తల్లి చచ్చినట్టు తెలంగాణ పుట్టి కాంగ్రెస్ చచ్చినట్టు మారింది. ఇటు తెలంగాణలో, అటు ఆంధ్ర ప్రదేశ్ తుడిచిపెట్టుకుపోయింది. వరుసగా రెండు పర్యాయాలు బిఆర్ ఎస్ అధికారంలో రావడాన్ని కాంగ్రెస్ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.  ఇదిలా ఉండగా బిఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటుంది. తాము కూడా బీఆర్ఎస్ కు పోటీగా తెలంగాణ ఆవిర్బావ దినోత్సవాలను జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. సోనియాగాంధీని ముఖ్య అతిథిగా హజరుఅయ్యేలా కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నాలు ప్రారంభించాయి. జూన్ రెండున హైదరాబాద్ లో బహిరంగ సభ నిర్వహించాలని చూస్తోంది. కర్ణాటక సీఎం సిద్ద రామయ్య, డిప్యూటి సీఎం డికె శివకుమార్ ను  ఈ సభకు రప్పించాలని చూస్తున్నారు.  

సైబరాబాద్ మొక్క.. తప్పిన లెక్క

రాజమహేంద్రవరం వేదికగా జరిగిన రెండు రోజుల పాటు జరిగిన మహానాడు ఆదివారంతో ముగిసింది.   మహానాడు వేదికగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆరు అంశాలతో కూడిన మినీ మేనిఫెస్టోను ప్రకటించారు.  అయితే మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, మేనిఫెస్టోపై ఆయన చేసిన ప్రకటనపై అధికార వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని.. తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అలాగే  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీ కూడా విమర్శించారు. ఇప్పటికే కొడాలి నానిపై నెటిజన్లు ఫైర్ అవుతుంటే..  విడదల రజినీ విమర్శలపై  నెటిజన్లు ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు.  అంతేకాదు.. చంద్రబాబుపై ఆమె చేసిన ప్రతి కామెంట్‌కి  కౌంటర్ ఇస్తున్నారు.   ఆ క్రమంలో ఏపీ సీఎం  జగన్‌ను తిట్టేందుకే ఈ మహానాడు ఏర్పాటు చేశారంటు విడదల రజినీ పేర్కొనడంపై.. ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.  మరి జగన్ తొలి కేబినెట్‌లోని మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ తదితరులు చంద్రబాబుని బండ బూతులు తిట్టారని..  వారి సంగతి ఏమిటని వారు ఈ సందర్భంగా నిలదీస్తున్నారు. అలాగే ఇదే వేదికగా.. సైకిల్.. ఎలక్ట్రిక్ సైకిల్‌గా మారబోతోందని.. ఆ క్రమంలో ముందు చక్రం సంక్షేమం అయితే వెనుక చక్రం అభివృద్ధి అని చంద్రబాబు చెబుతున్నారని.. కానీ ఆయన ప్రభుత్వ హయాంలో సంక్షేమం గురించి కానీ.. అభివృద్ధి గురించి కానీ పట్టించుకోలేదని ఆమె విమర్శించడంపై  కూడా నెటిజన్లు రజని తెలుగుదేశం గూటిలో ఉన్న సమయంలో చేసిన కామెంట్లను గుర్తు చేస్తూ ఓ ఆటాడుకుంటున్నారు.  2017లో విశాఖపట్నంలో టీడీపీ నిర్వహించిన మహానాడు వేదికగా.... అదీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో... అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ నారా చంద్రబాబు నాయుడు గారని.. హైదరాబాద్‌లో సైబరాబాద్ నిర్మాణంలో చంద్రబాబు పాత్ర ఉందని.. ఆ సైబరాబాద్‌లో మీరు నాటిన ఈ మొక్క నేను సార్..  అంటూ నాడు ఒకటికి రెండు స్లారు గర్వంగా చెప్పుకొచ్చిన విషయం  మరిచిపోయారా? మంత్రి రజినీ అంటూ నెటిజన్లు.. సోషల్ మీడియా వేదికగా చురకలంటిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్.. సంక్షేమాన్ని, అభివృద్ధి ఆయన రెండు కళ్లని.. వాటిని ఆయన ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్తున్నారో.. అందరు చూస్తున్నారని మీరు చెబుతున్నారు. అసలు అభివృద్ధి , సంక్షేమ అంటే ఏమిటని నెటిజన్లు ఈ సందర్బంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని  సోషల్ మీడియా ద్వారా  సూటిగా ప్రశ్నిస్తున్నారు.  చంద్రబాబు చేసింది చెప్పేందుకు ఏమీ లేక ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారని.. మీరు అంటున్నారు. మరి మీ పార్టీ అధినేత   జగన్ ప్రతిపక్ష నేతగా.. ఇచ్చిన హామీలు.. ఆ తర్వాత ఆయన గద్దెనెక్కిన అనంతరం అమలు చేసిన వాటి గురించి మీరు కనీసం ఒకటి లేకుంటే రెండు వివరించగలరా? అని ఈ సందర్బంగా  డిమాండ్ చేస్తున్నారు. అలాగే సంపద సృష్టి, మేనిఫెస్టోలపై చంద్రబాబు వ్యాఖ్యలపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించడాన్ని ఖండించి.. వాటికి సైతం నెటిజన్లు తమదైన శైలిలో ఆమెకు కౌంటర్‌ ఇస్తున్నారు. ఇక 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశించడం.. అది కుదరదని టీడీపీ అధిష్టానం స్పష్టం చేయడంతో.. అప్పటికప్పుడు జంప్ జిలానీ రాగం ఆలపించి.. ఫ్యాన్ పార్టీలో చేరి.. అలా ఆ పార్టీ ఎమ్మెల్యే టికెట్ దక్కించుకొని.. తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టడమే కాదు....  మంత్రి పదవి కూడా చేపట్టి.. ఇప్పుడు.. మీ రాజకీయ జీవితానికి బేస్ అయిన టీడీపీపైనా, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శలుగుప్పించడం ఏం మాత్రం పద్దతి కాదని నెటిజన్లు నిర్మొహమాటంగా మంత్రి రజనీకి తేల్చి చెబుతున్నారు. ఏదీ ఏమైనా.. సైబరాబాద్ మొక్క లెక్క తప్పిందంటూ సోషల్ మీడియాలో నెటిజనల్ కామెంట్స్  చేస్తున్నారు.

బాబు విజనరీ.. జగన్ ప్రిజనరీ!

లోకేష్ చేపట్టిన యువగతం పాదయాత్ర ఆయనను నిజమైన ప్రజా నేతగా మార్చేసిందా? గత 110 రోజులుగా ఆయన పాదయాత్రలో భాగంగా నిరంతరం జనంతో మమేకం అవ్వడంతో వారికి కావలసిందేమిటి? వారికి చేయవలసిందేమిటి అన్న దానిపై ఒక క్లారిటీ వచ్చిందా? అంటే మహానాడులో లోకేష్ ప్రసంగం విన్న వారంతా ఔననే అంటున్నారు. పాదయాత్ర పొడుగునా ఆయనకు జగన్  పార్టీ విధానాల వల్ల సమాజంలోని అన్ని వర్గాలకు ఎదురైన కష్టాలు కళ్లకు కట్టాయి. జనం సమస్యలు ప్రత్యక్షంగా తెలిశాయి. అంతే కాదు.. జనంలో తిరుగుతూనే వాటికి పరిష్కారాలను కనుగొనేయత్నం చేశారు. ఈ  మొత్తం ప్రక్రియలో ఆయన తెలుగుదేశం జాతీయ కార్యదర్శిగా కంటే జనం మనిషిగా మరింత ఎక్కవ రాటు దేలారు. ప్రజా సమూహాలలో మమేకమైన అనుభవమే ఆయన మంచి వక్తగా మార్చింది. తెలుగుదేశం మహానాడులో ఆయన చేసిన ప్రసంగంలో అదే ప్రతిఫలించింది. అందుకే ఆయన గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని, నాలుగేళ్ల జగన్ పాలనలో జరిగిన విధ్వంసాన్ని సరిగ్గా చెప్పగలిగారు. మహానాడులో అధినేత ప్రసంగంతో సమానంగా లోకేష్ ప్రసంగానికి  స్పందన లభించింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలను కురుక్షేత్ర సంగ్రామంతో పోలిస్తే.. ఆ యుద్ధంలో తిరుగులేని విజయం తెలుగుదేశం పార్టీదే అన్న ధీమాను లోకేష్ ఇవ్వగలిగారు. జగన్ ను పిల్ల సైకోగా అభివర్ణించిన ఆయన అంత కంటే పెద్ద సైకోలను ఎదుర్కొన్న అనుభవం తెలుగుదేశం పార్టీది అని విస్పష్టంగా ప్రకటించి ఒక్క చాన్స్ విజ్ణప్తితో అధికార పగ్గాలు అందుకున్న జగన్ ఆ చాన్స్ ను తాను ధనిక సీఎంగా ఆవిర్భవించేందుకు ఉపయోగించుకుని ప్రజలను పేదలగానూ, పేదలను నిరుపేదలుగానూ మార్చేశారన్నారు. రైతులకు ఇచ్చే పాసుపుస్తకాలపై కాదు జగన్ చెత్త పన్ను బిల్లులపై తన ఫొటో ముద్రించుకోవాలని సూచించారు. బాబా పాలనలో నిర్మాణాలు జరిగితే.. జగన్ పాలన విధ్వంసాల మయంగా అభివర్ణించిన లోకేష్.. మహానాడులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.   మహానాడుకు వచ్చిన పసుపు సైన్యానికి, పార్టీ పెద్దలకు సలాం అంటూ ప్రారంభమైన లోకేష్ ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకొంది.   తెలుగుదేశం పార్టీ పేరు చెబితే పౌరుషం.. పసుపు జెండా చూస్తే పూనకం అంటూ క్యాడర్ లో జోష్ నింపారు. తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన మూడక్షరాల శక్తి ఎన్టీఆర్.. జనానికి కష్టం వస్తే కన్నీరు తుడిచింది. ఎస్సీఎస్టీ బీసీ మైనారిటీలకు రాజకీయ, ఆర్థిక స్వాతంత్ర్యం తెచ్చింది. నిజమైన సంక్షేమాన్ని దేశానికి పరిచయం చేసిందీ ఆ శక్తేనని లోకేష్ చెప్పారు.   పార్టీ పెట్టాలంటే హిస్టరీ ఉండాలి.. దానిని నడపాలంటే క్యాలిబర్ ఉండాలి ఆ రెండూ తెలుగుదేశానికి నిండుగా ఉన్నాయన్నారు. పార్టీ పెట్టిన ఎన్టీఆర్ కు హిస్టరీ ఉంది.. ఆ పార్టీని నడుపుతున్న చంద్రబాబుకు క్యాలిబర్ ఉంది.. ఆ రెండూ లేని పార్టీ వైసీపీ అని ఎత్తి చూపారు. చంద్రబాబు పేరు అభివృద్ధికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్  అన్న లోకేష్  జగన్ అవినీతి చిరునామా ఎద్దేవా చేశారు.  లక్ష కోట్ల ఆస్తి ఉన్నవాడు రూ.లక్ష చెప్పులు వేసుకునేవాడు రూ.వెయ్యి వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడా? అని లోకేశ్ ప్రశ్నించారు. బెంగళూరు హైదరాబాద్ తాడేపల్లి ఇడుపులపాయ వైజాగ్లలో ప్యాలెసులు ఉన్నవాడు పేదవాడా? అని నిలదీశారు. 

బీఆర్ఎస్ లో ఉప్పొంగిన ఎన్టీఆర్ భక్తి!

టీఆర్ఎస్ పార్టీ... బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందింది. ఇటువంటి తరుణంలో పార్టీలోని లీడర్ నుంచి కేడర్ వరకు.. భారీ సంఖ్యలో కారు దిగి.. సైకిల్ ఎక్కి.. చెక్కేసేందుకు.. తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసుకొంటున్నారు. ఆ క్రమంలో ఈ విషయాన్ని గులాబీ దళం అధిష్టానం పసిగట్టి.. నష్ట నివారణ చర్యలకు శ్రీకారం చుట్టిందని?... అందులోభాగంగా.. ఎన్టీఆర్ జయంతిని వేదికగా చేసుకొని.. పావులు కదిపిందనే ఓ చర్చ  పోలిటికల్ సర్కిల్‌లో  జోరుగా సాగుతోంది. మే 28వ తేదీ.. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి. అయితే ఆయన జయంతి వేడుకలను తెలంగాణలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్  మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు.. ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌ నడి బొడ్డును ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయన సమాధికి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్..  నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చరిత్రలో నిలిచిపోయే మహానీయుడు, మకుటం లేని మహారాజు ఎన్టీఆర్ అంటూ కిర్తీంచారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ తనదైన ముద్ర వేశారని గుర్తు చేశారు. రాజకీయంగా ఎందరికో ఎన్టీఆర్ భవిష్యత్ ఇచ్చారన్నారు.  ఇక హన్మకొండలో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పూలమాల వేసి.. ఘనంగా నివాళులర్పించారు. అలాగే నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో ఎన్టీఆర్ క్యాంస విగ్రహానికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. ఇక ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వర్గీయులు ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా హైదరాబాద్ మహానగరంలోనే కాదు.. శివారు ప్రాంతాల్లోని ఎన్టీఆర్ విగ్రహాలకు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు క్యూలు కట్టి మరీ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  అయితే తాజాగా బీఆర్ఎస్  ప్రజా ప్రతినిధులు ఈ విధంగా వ్యవహరించడం పట్ల.. పోలిటికల్ సర్కిల్‌లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి. తెలంగాణలో టీడీపీ మళ్లీ సత్తా చేటేందుకు ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించిన విషయం విదితమే. అందులో భాగంగా అన్ని లోక్‌సభ , అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తోంది. అలాగే ఇంటింటికి తెలుగుదేశం పార్టీ పేరిట కార్యక్రమాన్ని సైతం ప్రజల ముంగిటకు తీసుకు వెళ్లి..   తమ పార్టీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలు.. ప్రస్తుత కేసీఆర్ ప్రభుత్వం తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలు.. వాటిలోని వ్యత్యాసం.. లోపాలను క్షుణ్ణ్నంగా ప్రజలకు నేరుగా వివరించే ప్రయత్నం చేస్తోంది.  మరోవైపు తెలంగాణ పదాన్ని సెంటిమెంట్‌గా చేసుకొన్న టీఆర్ఎస్ పార్టీ... ప్రస్తుతం ఆ పదాన్ని పక్కన పెట్టి.. బీఆర్ఎస్‌గా  మారిపోయింది. దీంతో తెలంగాణ ప్రజలు సైతం.. సైకిల్ పార్టీ వైపు మొగ్గు చూపేందుకు ఆసక్తి కనబరుస్తున్నారనే  చర్చ సైతం రాజకీయ వర్గాల్లో   సాగుతోంది. అదీకాక.. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ అధినేత నుంచి సాధారణ కార్యకర్త వరకు దాదాపుగా 70 శాతం మంది తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ లోకి వలస వెళ్లి షికారు కొట్టిన వారేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  మరోవైపు.. ముచ్చటగా మూడో సారి కూడా అధికార పీఠం అందుకోవాలనే లక్ష్యంతో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటూ.. ఇంకోవైపు.. కేసీఆర్‌కి చెక్ పెట్టి పాగా వేయాలని బీజేపీ   తన ఆలోచనలకు మరింత పదును పెడుతూ... ముందుకు సాగుతోంది. ఇక రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ సైతం .. దూకుడు మీద ఉంది. అలాంటి తరుణంలో తెలంగాణ సెంటిమెంట్‌ను రాజేసి.. అధికారాన్ని అందుకొన్న కేసీఆర్ పార్టీ.. మళ్లీ బీఆర్ఎస్‌గా మారడంతో తన ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చేసింది. ఈ నేపథ్యంలో మళ్లీ గెలుపు కష్టమనే భావనతోపాటు.. కేసీఆర్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొంటూ వెళ్లితే తప్ప... పదవి యోగం ప్రాప్తమవదనే  భావనతో ఎన్టీఆర్ అభిమానులను  తమవైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్  తన వంతు ప్రయత్నాలు చేపట్టిందని..  అదీకాక తెలంగాణలో ఎన్టీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారు... రాబోయే ఎన్నికల్లో వారి ఓట్లు పార్టీ గెలుపోటమలను నిర్ణయించడంలో క్రియా శీలకంగా మారనున్నాయి. అటువంటి తరుణంలో బీఆర్ఎస్ నాయకులు ... ఎన్టీఆర్ రాగం అందుకొన్నారనే చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది.

నేవిగేషన్ సేవల కోసం మరో రాకెట్

జీఎస్ఎల్ వి రాకెట్ ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించింది. నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్  సెంటర్ నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ మీద భారత్ పెద్ద ఆశలే పెట్టుకుంది.  జిఎస్ఎల్ వీ - ఎఫ్12 రాకెట్ ప్రయోగం విజయవంతం అవుతుందనీ భారత్ ముందే ఊహించింది.  ఇస్రో  మరో రాకెట్‌ను ప్రయోగించించడాన్ని ప్రపంచమంతా వీక్షించింది.  సోమవారం  నావిగేషన్‌ శాటిలైట్‌ ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపింది. ఈ  ఉపగ్రహాన్ని ఉదయం 10:42 గంటలకు నింగిలోకి తీసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా భారత నావిగేషన్‌ వ్యవస్థ మరింత మెరుగుపడి తన సేవలను మరింత విస్తరించనుంది. నావిగేషన్‌ సేవల కోసం గతంలో పంపిన వాటిలో నాలుగు ఉపగ్రహాల జీవిత కాలం ముగిసింది. వాటి స్థానంలో ప్రతి ఆరు నెలలకు ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ శనివారమే వెల్లడించారు. ప్రాంతీయ నావిగేషన్ సిస్టమ్ భారతదేశానికి ఎందుకు ముఖ్యమైనది అనేది ఈ రాకెట్ శోధిస్తుంది. ప్రస్తుతం ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్  కాన్స్టెలేషన్‌లో ఉన్న ఏడు ఉపగ్రహాలలో ప్రతి ఒక్కటి లిఫ్ట్‌ఆఫ్ వద్ద చాలా తక్కువ - దాదాపు 1,425 కిలోల బరువు కలిగి ఉంది. దీని పొడవు 49.11 మీటర్లు.  2001 నుంచి ఇస్రో ప్రయోగించిన రాకెట్లలో ఇది 15వది.  

రెజ్లర్ల ఆందోళన బీజేపీకి పట్టదా?

ఢిల్లీలో మహిళా రెజ్లర్ల  ఆందోళన పై దేశ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. రెజ్లర్ల సమస్యపై  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వినా దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలూ, సామాజిక వేత్తలు, మేధావులూ.. ఇలా అన్ని వర్గాలూ స్పందించాయి. రెజ్లర్లకు మద్దతుగా నిలిచాయి. అయితే ప్రధాని మోడీ మాత్రం ఈ విషయంలో ఇంత వరకూ నోరెత్తలేదు. పైగా పోలీసులు రెజ్లర్ల విషయంలో అనుసరిస్తున్న తీరుపై సర్వత్రా నిరసన వ్యక్త అవుతోంది. దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసేలా ప్రపంచస్థాయి పోటీలలో పతకాలను సాధించిన రెజ్లర్లు తన సమస్యలపై గళమెత్తితే.. కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే కాకుండా, వారి ఆందోళనను శాంతి భద్రతల సమస్యగా చూడటాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి.  రెజ్లర్ల  తమపై జరుగుతున్న లైంగిక వేధింపుల నుంచి రక్షణ కోరుతున్నారు. ఇది న్యాయమైన డిమాండే. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడైన బీజేపీ ఎంపీ  బ్రిజ్‌భూషణ్‌ సింగ్ పై ఈ రకమైన ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. అయినా కేంద్రం పట్టించుకోలేదు. పోలీసులు ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడం లేదు. దేశానికి పతకాలు తెచ్చిన ఎంతో మంది మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ సింగ్ పై చేస్తున్న ఆరోపణలకు పూచికపుల్ల పాటి విలువ ఇవ్వడం లేదు. సాక్షి మాలిక్‌, వినేశ్‌ ఫోగట్‌, భజరంగ్‌ పునియా వంటి వారు బ్రిజ్ భూషణ్ సింగ్ పై ఆరోపణలు చేస్తున్నా  కేంద్రం, క్రీడాశాఖ ఉన్నతాధికారులు  ఎవరూ స్పందించడం లేదు.  ఎంపీకే  మద్దతుగా నిలుస్తున్నారు. పోనీ బ్రిజ్ భూషణ్.. క్రీడాకారుడా అంటే కాదు. దేశానికి పతకాలు సాధించుకువచ్చిన మల్లయోధుడూ కాదు.. ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడు.  అంతే కాదు అధికార పార్టీ ఎంపీ. ఇవే అర్హతలుగా ఆయనపై ప్రముఖ రెజ్లింగ్ క్రీడాకారులు చేస్తున్న ఆరోపణలను పరిగణనలోనికి తీసుకోవడానికి పోలీసు వ్యవస్థ ముందుకు రావడం లేదు. అదే సమయంలో రెజ్లర్ల ఆందోళనను ఉక్కుపాదంతో అణచివేయడానికి క్షణమాత్రం సంకోచించడం లేదు. ఘనత వహించిన బ్రిజ్ భూషణ్ సింగ్ పై పలు ఆరోపణలు ఉన్నాయి. ఆయన కోట్లది రూపాయలు ట్నరోవర్ ఉన్న విద్యాసంస్థలకు అధిపతి కూడా. యూపీలోని పలు ప్రాంతాలలో బ్రిజ్ భూషణ్ బలమే వల్లే బీజేపీ ఉనికిలో ఉందన్న పరిస్థితి ఉంది. అందుకే అంత మంది రెజర్లు దాదాపుగా నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ఆయన పై చర్యలు తీసుకోవడానికి బీజేపీ వెనుకాడుతోంది.   రెజ్లర్ల విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ ప్రతిష్టను, మోడీ వ్యక్తిగత ప్రతిష్టనే కాదు.. దేశ ప్రతిష్టను సైతం మసకబారుస్తోంది. శాంతి యుతంగా ర్యాలీ చేస్తున్న రెజ్లర్లపై ఢిల్లీ పోలీసుల జులం పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. 

తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ సీన్ అయిపోయిందా?

జూనియర్, సీనియర్ పోరులో రేవంత్ వెనుకబడ్డారా? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే వైఎస్ బిడ్డ షర్మిలకు నాయకత్వం అప్పగించడమే మేలన్న నిర్ణయానికి కాంగ్రెస్ హై కమాండ్ వచ్చేసిందా?  అంటే షర్మిల కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో వరుస భేటీలను చూస్తుంటే ఔననే  అనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆ రాష్ట్ర రాజకీయాలలో షర్మిల ఇంపార్టెన్స్ ఒక్క సారిగా పెరిగిపోయింది. కేసీఆర్ ఫ్యామిలీపై నిర్భీతిగా, నిర్మొహమాటంగా విమర్శలు గుప్పిస్తున్న షర్మిల ప్రాధాన్యతను ఇతర పార్టీలన్నీ గుర్తించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే గత కొంత కాలంగా షర్మిల ఎవరు వదిలిన బాణం అంటూ పరిశీలకులే కాదు, రాజకీయ వర్గాలలోనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. తొలుత ఆమె రాజకీయ ప్రవేశమే జగనన్న వదిలిన బాణాన్ని నేను అంటూ ఆరంభమైంది. ఆ తరువాత రాష్ట్ర విభజన అనంతరం జగనన్నతోనే విభేదించి.. ఏపీ వదిలి తెలంగాణలో తన తండ్రి వైఎస్సార్ పేరిట వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసి, సుదీర్ఘంగా పాదయాత్ర చేయడమే కాకుండా, వరుస దీక్షలతో రాష్ట్ర రాజకీయాలలో గుర్తించక తప్పని శక్తిగా అవతరించారు షర్మిల.  షర్మిల సొంత పార్టీ పెట్టుకుని, ఏపీలో, సొంత అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఆ రాష్ట్రాన్ని వదిలి తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు వేలు పెటినట్లు? అసలు షర్మిల ఎవరు వదిలిన బాణం? అన్న ప్రశ్న ఆమె రాజకీయ పార్టీ పెట్టిన సమయంలోనే ప్రముఖంగా వినిపించింది. అయితే ఆమె ఇప్పుడు ఇంత దూరం నడిచేసిన తరువాత ఆ ప్రశ్న ముగిసిన అధ్యాయం అన్న వాదన ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. అయితే ఇటీవలి కాలం వరకూ ఆమె రాజకీయ లక్ష్యం ఏమిటి? రాజకీయంగా ఆమె ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అన్న ప్రశ్నలు బలంగా తెరమీదకు వచ్చాయి.  జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలను మించి వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, మేనల్లుడు హరీష్ రావు, మరో ఇంటి చుట్టం సంతోష కుమార్  ఇలా బీఆర్ఎస్ లో (ఒకప్పడు టీఆర్ఎస్) ఉన్న కేసీఆర్ కుటుంబం మొత్తాన్నిటార్గెట్ చేసి విమర్శలు  గుప్పిస్తున్నారు. మంత్రి కేటీఆర్ రేపెప్పుడో, ప్రధాని మోడీ బట్టలు ఊదదీసి నడిబజార్లో నిలబెడతామని అంటున్నారు. కానీ షర్మిల  తన విమర్శల ద్వారా తెరాస ప్రభుత్వాన్ని నిత్యం ఉతికి ఆరేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే షర్మిల స్వల్ప వ్యవధిలో కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్  తో రెండు సార్లు భేటీ కావడంతో ఆమె కాంగ్రెస్ గూటికి చేరుతున్నారా? అంటే వైఎస్సార్ టీపీని తన తండ్రి జీవించి ఉన్నంత కాలం ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నారా అన్న కోణంలో పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. తాజా బేటీలో డీకే శివకుమార్ షర్మిలతో ఆమె తండ్రి వైఎస్సార్ తో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.  ఈ వరుస భేటీలతో తెలంగాణ కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ విలీనంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఒక వేళ అలా విలీనం అంటూ జరిగితే తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు అప్పగించే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు. వైఎస్సార్ బిడ్డగా షర్మిలకు పగ్గాలు అప్పగిస్తే.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అభ్యంతరం చెప్పే అవకాశం దాదాపుగా ఉండదని పరిశీలకులు అంటున్నారు. కాగా కాంగ్రెస్ లో వైఎస్సార్టీపీ   విలీనం అంశాన్ని కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ స్వయంగా పరిశీలిస్తున్నరని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి.   ఇక షర్మిల కాంగ్రెస్ గూటికి చేరడం, ఆమెకు టీపీసీసీ పగ్గాలు అప్పగించడం అన్న ప్రచారం ఓ వైపు జోరుగా సాగుతుంటే.. మరో వైపు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరిస్థితి ఏమిటన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది.   కాంగ్రెస్ శ్రేణులు మాత్రం షర్మిలకు టీపీసీసీ పగ్గాలు అప్పగించడం అంటూ జరిగితే పార్టీలో రేవంత్ సీన్ అయిపోయినట్లేననీ, ఆయన దారి తెలుగుదేశంపైపు మళ్లొచ్చని అంటున్నాయి. 

ఎంఐఎం వ్యూహమేంటి? లాభం ఎవరికి?

ఎంఐఎం అనగానే తెలంగాణలో పాతబస్తీకే పరిమితమైన జాతీయ పార్టీగా గుర్తింపు ఉంది. అయితే ఆ పార్టీ హైదరాబాద్ మహానగరంలో పాతబస్తీకే పరిమితం కావడం వెనుక  ఆ పార్టీ అక్కడే బలంగా ఉండటం కారణమని అంతా భావిస్తు వస్తున్నారు. అయితే ఎంఐం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాత్రం వచ్చే ఎన్నికలలో తమ పోటీ పాతబస్తీ వెలుపల కూడా ఉంటుందని చెబుతున్నారు.  తెలంగాణలో బీజేపీ విస్తరణను అడ్డుకోవడమే లక్ష్యంగా తామీ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. ఇంత కాలం అనధికార మిత్ర పక్షమైన బీఆర్ఎస్ కోసం తాము ఓల్డ్ సిటీకే పరిమితమయ్యామనీ, అయితే అందువల్ల బీజేపీ బలపడుతోందనీ, అందుకే అవసరమైతే బీఆర్ఎస్ ను పక్కన పెట్టి మరీ ఓల్డ్ సిటీ బయట పోటీ చేయడానికి రెడీ అవుతున్నామని అసదుద్దీన్ చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికలలో తాము నిజామాబాద్, కరీంనగర్, సికిందరాబాద్ ల నుంచి పోటీలో లేకపోవడం వల్ల బీజేపీ గెలిచిందని ఆయన గుర్తు చేశారు. ఎంఐఎం తమ ఓట్లు చీల్చడం ద్వారా బీజేపీ విజయానికి దోహదపడుతోందని ఆరోపణలు చేస్తున్న సెక్యులర్ పార్టీలు ఈ విషయాన్ని ఎందుకు గుర్తించడం లేదని నిలదీశారు.  తెలంగాణ కొత్త సచివాలయంపై బీజేపీ జెండా ఎగరడానికి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఒవైసీ స్పష్టం చేశారు.  ఎంఐఎం బలంగా ఉంటేనే తెలంగాణలో మతసామరస్యం వెల్లివిరుస్తుందని చరిత్ర చెబుతున్న సత్యమని ఒవైసీ అంటున్నారు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అసెంబ్లీ స్థానాల సంఖ్యపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.  2014,  2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించడంలో  ఏఐఎంఐఎం కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు. అయితే పరిశీలకులు మాత్రం ఓల్డ్ సిటీ బయట ఎంఐఎం పోటీ చేయడం వల్ల అంతిమంగా బీజేపీయే లబ్ధి పొందుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంత కాలం ఓల్డ్ సిటీకి పరిమితమై పోటీలో ఉన్న ఎంఐఎం కే బీజేపీ యేతర పార్టీలు, ఇప్పుడైతే బీఆర్ఎస్.. అంతకు ముందు కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోటీ ద్వారా బయటి ఓట్లు చీలి బీజేపీ లబ్ధి పొందకుండా పరస్పర సహకారం అందించుకునేవనీ, ఇప్పుడు ఎంఐఎం ఓల్డ్ సిటీ దాటి బయటకు వస్తే.. సెక్యులర్ ఓట్లు చీలి  బీజేపీకే ఎక్కువ ప్రయోజం చేకూరుతుందని విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద జాతీయ స్థాయిలో  కాంగ్రెస్ బలోపేతమౌతోందన్న భావన వ్యక్తమౌతున్న వేళ ఎంఐఎం నిర్ణయం బీజేపీకి నెత్తిన పాలు పోసినట్లేనని అంటున్నారు.  

పెట్రోల్ ట్యాంకులో పడి ముగ్గురు మృతి

పెట్రోల్ ట్యాంకులో పడి  ముగ్గురు మరణించి విషాద ఘటన అన్నమ్య్య జిల్లా రాయచోటిలో జరిగింది. పెట్రోల్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు చెబుతున్నారు. రాయచోటి జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న పెట్రోల్ పంప్ లో ట్యాంకర్ క్లీన్ చేయడానికి చమురుకంపెనీ హిందూస్థాన్ పెట్రోలియం యాజమాన్యం కడప నుంచి ముగ్గురిని ఇక్కడకు పంపింది. వారు పెట్రోల్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ప్రమాద వశాత్తు ఒకరు అందులో పడిపోయారు. అతడిని రక్షించే ప్రయత్నంలో మరో ఇద్దరు కూడా ట్యాంక్ లో పడిపోయారు. వెంటనే అగ్నిమాపక దళం ఒకరిని బయటకు తీసింది. అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మరణించారు. ట్యంకులో పడిన మరో ఇద్దరిని అగ్నిమాపక దళం బయటకు తీసే సరిగే విగత జీవులయ్యారు.  ఈ సంఘటనపై బషీర్ ఖాన్ పెట్రోల్ బంక్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

విజయసాయి మౌనం సజ్జలపై పై చేయి కోసమేనా?

విజయసాయి రెడ్డి..  వైసీపీతో ఈ పేరును విడదీసి చూడటం సాధ్యం కాదన్న బావన ఇటీవలి వరకూ అందరిలోనూ ఉండేది. అంతగా విజయసాయి వైసీపీతో మమేకమై ఉండేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ కు కుడి, ఎడమ, ముందు, వెనుక కూడా విజయసాయే అన్నట్లుగా ఆయన హవా కొనసాగింది.  జగన్ అక్రమాస్తుల కేసులో కూడా ఏ2గా జగన్ కు తోడుగానే ఉన్నారు విజయసాయి. అందుకే విజయసాయికి వైసీపీలో తిరుగుండదనే అంతా భావించారు.  అయితే ఇటీవలి కాలంలో ఆ పరిస్థితి పూర్తి రివర్స్ అయ్యింది.  పార్టీ కార్యక్రమాలలో విజయసాయి నీడ కూడా కనిపించడం లేదు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలందరిదీ ఒక దారీ అయితే  విజయసాయి రెడ్డి ఒక్కడిదీ ఒక దారి అన్నట్లుగా ఆయన ఒంటరి అయిపోయారు. కేంద్ర మంత్రిని కలిసినా, ఏపీ కొత్త గవర్నర్ ను ప్రమాణ స్వీకారం ముందు కలిసినా విజయసాయి ఒక్కరే వెళుతున్నారు.  ఇక అన్నిటికీ మించి ఏపీ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ గ్లోబల్ సమ్మిట్ పేరుతో నిర్వహించిన ఇన్వెస్ట్ మెంట్ సదస్సు లో కూడా ఎక్కడా విజయసాయి కనిపించలేదు.  విజయసాయి కేవలం వైసీపీ ఎంపీ మాత్రమే కాదు..  పార్టీ ఆవిర్భావం నుంచీ ఆయన వైసీపీకి పబ్లిక్ రిలేషన్స్ విషయంలో ఏకైక ప్రతినిథి కూడా. ఇక ఇటీవలి కాలం వరకూ ఆయన ఉత్తరాంధ్రకు ఇన్ చార్జ్ కూడా.  అంతేనా.. దేశ వ్యాప్తంగా ఇన్వెస్టర్లతో ఆయనకు బోలెడు సంబంధాలు ఉన్నాయి. అయినా సరే వివిధ రాష్ట్రాలలో విశాఖ సదస్సు ప్రమోషన్ల కోసం నిర్వహించిన  రోడ్ షోలలో ఆయన ఎక్కడా కనిపించలేదు. పారిశ్రామిక వేత్తల ఆహ్వానం కోసం ఏర్పాటైన బృందంలోనూ విజయసాయికి ప్రాతినిథ్యం లేదు.  నిన్న మొన్నటి వరకూ పార్టీ ఎంపీలలో వెలివేతకు గురైన వ్యక్తి రఘురామకృష్ణం రాజు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఆయనకు తోడుగా విజయసాయి కూడా చేరారా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అయ్యాయి కూడా.  తారకరత్న మరణం, ఆ తరువాత అంత్యక్రియల సందర్భంగా విజయసాయి బాలకృష్ణతో కలిసి అన్ని ఏర్పాట్లలోనూ పాల్గొనడం వల్లే విజయసాయిని దూరం పెట్టారా అన్న చర్చ అప్పట్లో  జోరుగా సాగింది. విజయసాయి పార్టీకి దూరం అయ్యారా అన్న అనుమానాలు కలిగే విధంగానే  ఆయన తీరు కూడా ఇటీవలి కాలంలో ఉంది. జగన్ మెచ్చేలా ఈ మధ్య కాలంలో ఆయన  ఎన్నడూ విపక్షంపై విమర్శలతో విరుచుకుడలేదు. అంతే కాదు.. విపక్ష నేత చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన మర్యాదపూర్వకంగా విషెస్ కూడా తెలిపారు. ఆ విషెస్ గతానికి భిన్నంగా ఎక్కడా వ్యగ్యం లేకుండా అత్యంత గౌరవ ప్రదంగా ఉన్నాయి. అలాగే పార్టీ వ్యవహారాలలో కూడా విజయసాయి అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. కొండొకచో ఆయన ట్వీట్లు పార్టీకి నష్టం చేకూర్చేవిగా కూడా ఉంటున్నాయి.  తెనాలిలో జగన్ రైతు భరోసా కింద  మీట నొక్కి రైతుల ఖాతాలలో నిధులు జమ చేసే సమయంలో  పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందజేసిన సందర్భాన్ని పురస్కరించుకుని విజయసాయి మోడీకి  ధన్యవాదాలు తెలుపుతూ చేసిన ట్వీట్ ఇటు పార్టీలోనే కాదు.. అన్ని వర్గాలనూ ఆశ్చర్యంలో ముంచెత్తింది. పీఎం ఒక రోజు ముందే రైతుల ఖాతాలలోకి విడుదల చేసిన నిధులకు జగన్ ఉత్తుత్తి మీట నొక్కారన్న విపక్షాల విమర్శలకు ఊతం ఇచ్చేదిగా విజయసాయి ట్వీట్ ఉంది.    ఆ ట్వీట్ కు ముందు వరకూ వైసీపీ అధినేత జగన్ విజయసాయిని దూరం పెడుతున్నారని అంతా భావించారు. అయితే విజయసాయి మోడీకి కృతజ్ణతలు చెబుతూ చేసిన ట్వీట్ తరువాత విజయసాయి రెడ్డే పార్టీకి దూరం జరుగుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అన్నిటికీ మించి పార్టీ ఇబ్బందుల్లో ఉన్నా మౌనం వీడి పార్టీకి మద్దతుగా విజయసాయి మాట్లాడకపోవడంతో ఆయన దాదాపుగా వైసీపీతో తెగతెంపులు చేసేసుకున్నారా లేక వైసీపీయే ఆయనను వదిలించుకుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే హఠాత్తుగా ఉరుములేని పిడుగులా... ఆయన  తెలుగుదేశం పార్టిని విమర్శిస్తూ తాజాగా చేసిన ట్వీట్ విజయసాయి ఇంత కాలం మౌనం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? పార్టీలో కోల్పోయిన తన స్థానాన్ని తిరిగి సంపాదించుకునే ఎత్తుగడ ఉందా అన్న చర్చ మొదలైంది. ఇంతకీ ఆయన తాజాగా  మహానాడులో చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టోను మాయా ఫెస్టోగా అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ లో గతంలో ఉన్న వ్యంగ్య వైభవం మళ్లీ కనిపించింది. 2014 ఎన్నికలలో విజయం సాధించిన తరువాత మేనిఫెస్టోనే మాయం చేసిన బాబు ఈ సారి మాయాఫెస్టోను విడుదల చేశారని ఆ ట్వీట్ లో విజయసాయి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  వైసీపీ ఇటీవలి కాలంలో వరుస ఎదురు దెబ్బలు తింటుండటం, పార్టీలో అంతా తానై వ్యవహరిస్తున్న సజ్జల పరిస్థితిని చక్కదిద్దడంలో విఫలం కావడం, సజ్జలపై మెజారిటీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆగ్రహంగా ఉన్నారన్న వార్తలు, అలాగే పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన వారు నేరుగా సజ్జలపైనే విమర్శలు గురిపెట్టడం వంటి సంఘటనల నేపథ్యంలో విజయసాయి మౌనం వీడటం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీపై విజయసాయి మళ్లీ  పట్టు సాధించేందుకు ఇంత కాలం వ్యూహాత్మక మౌనం పాటించి, ఇప్పుడు అదును చూసి సజ్జలపై పై చేయి సాధించేందుకు పావులు కదుపుతున్నారా అన్న అనుమానాలను వైసీపీ శ్రేణులే వ్యక్తం చేస్తున్నాయి. 

తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ

కలియుగ దైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. గత వారం రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ ఇసుమంతైనా తగ్గలేదు. వేసవి సెలవులు ముగిసే సమయం దగ్గర పడుతుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. ఆదివారం(మే28) నాడు తిరుమల దేవుడిని 78వేల 818 మంది దర్శించుకున్నారు. 39 వేల 76 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 3.66 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక సోమవారం (మే29)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 23 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానిని 24 గంటల సమయం పడుతోంది.  

పార్లమెంటు నియోజకవర్గాల పెంపు ఎప్పుడంటే?

లోక్ సభ స్థానాలు పెరగనున్నాయా? అంటే నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా మోడీ  చేసిన ప్రకటన వింటే ఔననే అనాల్సి ఉంటుంది. త్వరలో పార్లమెంటు స్థానాలు పెరగబోతున్నాయని ప్రధాని మోడీ స్వయంగా ప్రకటించారు. లోక్ సభ, రాజ్యసభ స్థానాలు పెరగనున్నాయనీ, కొత్త పార్లమెంటు భవనంలో అందుకు తగ్గ విధంగా ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు.   నూతన పార్లమెంట్ భవనలో లోక్ సభలో  888 మంది రాజ్యసభలో 384 మంది కూర్చోవడానికి వీలుగా సీటింగ్ అరేంజ్ మెంట్ చేసినట్లు మోడీ వివరించారు.  అయితే 2026 నాటికి పార్లమెంటు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది. అది జరిగితే..  ప్రస్తుతం ఉన్న లోక్ సభ స్థానాలు 543 నుంచి మరో 150 వరకూ అంటే  693 వరకూ పెరిగే అవకాశం ఉంది. అలాగే దేశంలో అనేక అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయి కనుక అందుకు అనుగుణంగా  రాజ్య సభ సీట్లు కూడా పెరుగుతాయి.  అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సందర్భంగా పార్లమెంటు సాక్షిగా  తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాల పెంపు నకు ఇచ్చిన హామీ ఇప్పటి వరకూ నెరవేరలేదు. గతంలో పలు మార్లు తెలుగు రాష్ట్రాల్లో నియోజవర్గాల పెంపు ప్రక్రియ కసరత్తు షురూ అయ్యిందంటూ అప్పటి  రాజకీయ పరిస్థితులను బట్టి బహుముఖంగా ప్రచారం జరిగింది.   విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా.. ఆంధ్రప్రదేశ్ ,  తెలంగాణ రాష్ట్రాలు   అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే.  రాష్ట్ర విభజన చట్టంలోని హామీల ప్రకారం ఏపీలో ఉన్న స్థానాలను 175 నుంచి 225కి. అలాగే తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ  నియోజకవర్గాల సంఖ్య  153 కు పెరగాల్సి ఉంది. గతంలో పలుమార్లు  తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపునకు  పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టేందుకు అనువుగా అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్ పంపాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్ర న్యాయ శాఖ కోరింది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీలైనంత త్వరగా  నివేదిక అందితే..  పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశ పెట్టే అవకాశాలున్నాయని కూడా ప్రచారం జరిగింది. అయితే అదంతా ప్రచారానికే పరిమితమైంది. ఆ తరువాత ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు తెలుగురాష్ట్రాలలో నియోజకవర్గాల పెంపు 2031 వరకూ ఉండే అవకాశం లేదని కేంద్రం విస్పష్టంగా బదులిచ్చింది.   కానీ కాశ్మీర్ లో ఇటీవలే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టిన కేంద్రం తెలుగు రాష్ట్రాలపై మాత్రం శీతకన్నేసింది. 

వోటు బ్యాంకు పాలిట్రిక్స్ కు కెసీఆర్ సిద్దం

భారత రాష్ట్ర సమితి  అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలతో పార్టీ ఔట్రీచ్ కార్యక్రమాలను అనుసంధానం చేస్తూ, రాబోయే కొద్ది నెలల్లో సంక్షేమ పథకాలను  అమలు చేయడం ద్వారా తన ఓటు బ్యాంకులను పదిలపర్చుకోవాలని చూస్తోంది.  రానున్న రెండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంఘాలకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేయడంతోపాటు గృహలక్ష్మి పథకం కింద పేద కుటుంబాలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి దళిత కుటుంబానికి  దళిత బంధు పక్కాగా అమలు చేయాలని చూస్తోంది.   పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ,  గొర్రెలను అందజేయాలని ప్రణాళిక సిద్దం చేస్తోంది బీఆర్ఎస్ ప్రభుత్వం.  అసెంబ్లీ ఎన్నికల్లో  లబ్ధిదారుల మద్దతు కోరడానికి ఇది చక్కటి అవకాశమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.  ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ నాయకులు ఆర్బాటంతో  ఈ పథకాలు లబ్ధిదారులకు అందేలా  చూస్తారు.  పోడు భూముల పట్టా కార్యక్రమాలకు సాక్షాత్తు ముఖ్యమంత్రి హాజరుకానున్నట్లు తెలుస్తోంది. జూన్ 24 నుంచి 30 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.  అధికార పార్టీ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. వెల్ఫేర్, డెవలప్మెంట్  కార్యక్రమాలను  ప్రచారం నిర్వహించి లబ్ది పొందాలని చూస్తోంది. 

అంబేడ్కర్, బాపూజీల ప్రస్తావన ఏది..?

పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.  రూ.1200 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన పార్లమెంటును ప్రారంభించిన  కొన్ని గంటలు కూడా గడవక ముందే.. ప్రతిపక్షాలు ఊహించి నట్లుగానే ప్రధాని నరేంద్ర మోడీ ఓ పని చేశారు.  కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం రోజే వినాయక్ రావ్ దామోదర్ సావర్కర్ జయంతి కూడా రావడంతో పాత పార్లమెంటులోని సెంట్రల్ హాలులో సావర్కర్ చిత్రపటానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించారు. స్పీకర్ ఓం బిర్లా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీర సావర్కర్ త్యాగం సాహసం దృఢదీక్ష మనకు నిరంతర స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రధాన మంత్రి "మన్ కీ బాత్'' కార్యక్రంలో కొనియాడారు. స్వాతంత్ర్య సమరయోధుడైన వీర సావర్కర్ జయంతి ఈరోజు అని సావర్కర్ జైలు జీవితం అనుభవించిన అండమాన్ జైలును దర్శించేందుకు తాను వెళ్లిన రోజు నేటికీ మరిచిపోలేనని అన్నారు. నిర్భీతికి ఆత్మగౌరవానికి సావర్కర్ ప్రతీక అని మోడీ అంటున్నారు. కేవలం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా సామాజిక సమానత్వం సామాజిక న్యాయం కోసం సావర్కర్ విశేషంగా కృషి చేశారని కొనియాడారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా హిందీలో చేసిన ట్వీట్లో వీడీ సావర్కర్ తన ఆలోచనలతో అసంఖ్యాక భారతీయుల గుండెల్లో దేశ భక్తి ద్వీపాలను వెలిగించారని తెలిపారు. ఆయన దేశ భక్తి త్యాగం పట్టుదల ప్రశంసనీ యమనని అన్నారు. ఆ గుణాలు భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. ఆది నుంచి  కాంగ్రెస్ నేతలు సావార్కర్ ను  దేశ ద్రోహిగా పేర్కొంటున్న విషయం తెలిసిందే. సావార్కర్బపై రాహుల్ గాంధీ గతంలో విమర్శలు చేసిన సందర్భంలో బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. మొత్తంగా పరిస్థితి కాంగ్రెస్, ప్రతిపక్షాలు  ఊహించినట్టే జరగడం.. తొలి రోజు పార్లమెంటు ప్రారంభించిన వెంటనే సావార్కర్ కు నివాళులర్పించడం గమనార్హం. అయితే..ఇదేసమయంలో నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మహాత్మా గాంధీ ప్రస్తావనలు కనిపించకపోవడం గమనార్హం.  అసత్యాలను సత్యాలుగా ..నమ్మే విధంగా ప్రచారం చేయడంలో మోడీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వం.. చాలా వరకు సఫలమైందని, అయితే కొంత మందిని కొంత కాలం మోసం చేయొచ్చు..కాని, అన్ని వేళల అందరిని మోసం చేయడం కుదరదనే విషయాన్ని  బీజేపీ గుర్తుంచుకోవాలని ప్రతిపక్షాలు హితబోధ చేస్తున్నాయి. 

కవిత కనిపించడం లేదు.. వినిపించడం లేదు.. కారణమేంటి?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎక్కడ అనే ఓ చర్చ తెలంగాణ  రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.  ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమె పేరు ప్రముఖంగా వినిపించడంతోపాటు.. ఈ ఏడాది మార్చిలో ఒకటి సారి రెండు సార్లు కాదు.. ముచ్చటగా మూడు సార్లు ఢిల్లీలో  ఈడీ కవితను విచారించింది. ఆమె సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది.  ఒకానొక దశలో ఆమెను ఈడీ అరెస్ట్ చేయడం ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇదే కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో సహా పలురురిని అరెస్టు చేయడం, వారికి బెయిలు కూడా రాకపోవడంతో కవిత అరెస్టు అనివార్యం అన్న స్థాయిలో ప్రచారం జరిగింది. అంతే  ఆ తరువాత ఈడీ కవితను మళ్లీ  విచారించింది లేదు. అంతే కాదు విచారణకు ముందు, తరువాత గంభీరంగా ప్రకటనలు ఇచ్చి  , కేంద్రంపై విమర్శలు గుప్పించిన కవిత ఆ తరువాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు.  ఢిల్లీ మద్యం కుంభకోణంలో  కల్వకుంట్ల కవిత మాజీ అడిటర్ గోరంట్ల బుచ్చిబాబుతోపాటు పలువురు పెద్ద తలకాయలను   ఈడీ అరెస్ట్ చేసి.. ఢిల్లీలోని తీహార్ జైల్‌కి తరలించిన విషయం విదితమే. వారిలో కొందరికి బెయిల్ వచ్చిందనుకోండి అది వేరే విషయం.   బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు అందరు అప్పుడో.. ఇప్పుడో.. ఎప్పుడో ఒక్కప్పుడు బయట కనిపిస్తున్నారు. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. కవిత సోదరుడు, సీఎం కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ అయితే.. ఉన్నతాధికారులతో కలిసి ఇప్పటికే లండన్‌లో పర్యటించి, అక్కడ నుంచి అమెరికా చేరుకొని.. ఆ దేశ పర్యటనలో భాగంగా.. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం... పలు కంపెనీల ప్రతినిధులతో ఆయన వరుస భేటీలు నిర్వహించారు. పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.  అందుకు సంబంధించి కేటీఆర్ వీడియోలు.. అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ సైతం చేస్తున్నాయని... అయితే   కవిత  మాత్రం అనూహ్యంగా ఎక్కడా కనిపించడం లేదు, వినిపించడం లేదు.   మరోవైపు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన ఉద్యమంలో కేసీఆర్ ఫ్యామిలీ పాత్ర అత్యంత కీలకమని.. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత అయితే.. బతుకమ్మ పండగ సమయంలో ఆడి పాడి.. తెలంగాణ ప్రజలను నిత్య చైతన్యవంతులుగా రూపొందించడంలో కీలకంగా వ్యవహరించిందని.. ఇంకా చెప్పాలంటే.. బతుకమ్మ పండగ కాస్తా.. కవితమ్మ పండగ అయిపోయిందనే ఓ చర్చ సైతం నాడు తెలంగాణ సమాజంలో  జరిగిందని పరిశీలకులు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. అలాంటి కవిత  హఠాత్తుగా సైలెంట్‌గా ఉండడం వెనుక మర్మం ఏమిటి? వ్యూహం ఏమిటి? అన్న చర్చ జోరుగా సాగుతోంది.        2019 ఎన్నికల్లో నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఓటమి పాలైన  తర్వాత కొద్ది రోజులు ఆమె  ఇలాగే వ్యవహరించారు.  ఆ తర్వాత మళ్లీ ఎమ్మెల్సీ అయి.. పెద్దల సభలో ఆమె అడుగు పెట్టారని.. అనంతరం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆమె పేరు ప్రముఖంగా వినిపించడం.. అనంతరం చోటు చేసుకొన్న పరిణామాలు అందరికీ తెలిసినవేనని స్పష్టం చేస్తోంది.  ఇంకోవైపు ఈ ఏడాది ఏప్రిల్‌ 11న ఆమె కాలికి గాయం కావడంతో.. మూడు వారాలు విశ్రాంతి తీసుకోన్నారని...ఆ తర్వాత మదర్స్ డే సందర్భంగా తల్లిని కలిశారని.. అయితే ఆ తర్వాత అంటే మే 17న పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి సైతం ఆమె హాజరుకాలేదని.. బీఆర్ఎస్ పార్టీలోని పలువురు కీలక నేతలు సైతం పేర్కొంటున్నారు. మరోవైపు ఈ నెల 21న మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్ఎస్ శిక్షణా శిబిరానికి కేసీఆర్‌తో పాటు కవిత కూడా వెళ్తారని ప్రచారం జరిగినా.. ఆమె వెళ్లలేదు. అలాగే జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న దశాబ్ది ఉత్సవాల్లో అయినా ఆమె కనిపిస్తారా? అని తెలంగాణ ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.  అదీకాక.. మద్యం స్కామ్‌లో తమ విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నుంచి నోటీసులు రావడంతో.. పార్లమెంట్‌లో మహిళ రిజర్వేషన్ బిల్లు.. అందుకోసం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన అంటూ ప్రకటనలు గుప్పించి.. ఆ తర్వాత ఇలా చడీ చప్పడు చేయకుండా.. సైలెంట్ కావడం ఏమిటనే చర్చ సైతం తెలంగాణ సమాజంలో మొదలైంది. అయినా..  మద్యం కుంభకోణంలో తొలుత కవిత పేరు వినిపించడం.. ఆ తర్వాత ఆమె పేరు ఎక్కడ బయటకు రాకపోవడం.. దీంతో కేంద్రంలోని బీజేపీతో బీఆర్ఎస్ బాస్ దోస్తి కట్టిఉంటారనే ఓ చర్చ సైతం.. తెలంగాణ సమాజంలో జోరుగా సాగుతోంది. అయినా.. ఎన్నికల సమీపిస్తున్న వేళ.. ఇలా కవిత ఏదో అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లినట్లు సైలెంట్‌గా ఉండడం ఏం బాగోలేదని చర్చ సైతం తెలంగాణ సమాజంలో జోరుగా సాగుతోంది.