గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై బిజెపి సస్పెన్షన్ ఎత్తివేత?

 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తి వేయాలని బిజెపి అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నుంచి గెలిచిన ఏకైక అభ్యర్థి రాజాసింగ్ కావడం  గమనార్హం. ఇవ్వాళో, రేపో బిజెపి  మొదటి జాబితా విడుదల కానున్న నేపథ్యంలో ఢిల్లీలో పార్టీ అధిష్టానంతో తెలంగాణ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు గోషామహల్ ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ పై గత సంవత్సరం ఒక మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఆరోపణతో సస్పెన్షన్  అయ్యారు. ఎన్నికల సందర్బంగా బిజెపి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపినప్పటికీ రాజాసింగ్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రాజాసింగ్ హిందుత్వ నినాదంతో దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా నిలిచారు.తనకు బిజెపి టికెట్ ఇవ్వకపోతే ఇతర పార్టీల వైపు కన్నెత్తి కూడా చూడనని రాజాసింగ్ ప్రకటించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న రాజాసింగ్ నిండు అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇదే నా చివరి అసెంబ్లీ సమావేశాలు అని వ్యాఖ్యానించారు. రాజాసింగ్ కమెడియన్ మునావర్ మీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో సస్పెన్షన్ కు గురైన సంగతి తెలిసిందే.  రాజాసింగ్ తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరగ్రేటం చేశాడు. అతను 2009 హైదరాబాదు మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో టిడిపి తరపున పోటీచేసి, 2009 నుండి 2014 వరకు కార్పోరేటర్ గా గెలిచాడు.  తొలిసారి ఎమ్మెల్యేగా రాజాసింగ్  బిజెపి నుంచి గెలిచారు.2014లో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖేశ్ గౌడ్ పై 46,793 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. రెండోసారి అంటే 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నుండి పోటీచేసి తెలంగాణ అప్పటి టిఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ పై 17,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ముచ్చటగా మూడోసారి కూడా తానే గెలుస్తానని ఇప్పటికే రాజాసింగ్ నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారసభలో పేర్కొంటున్నారు. గోషామహల్ టికెట్ తనకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. 

ఏపీ హేట్స్ జగన్!.. తెలుగుదేశం కొత్త స్లోగన్

ఏపీలో ఎన్నికలకు నిండా ఆరు నెలల సమయం కూడా లేదు. దీంతో ఇప్పటికే  రాష్ట్రంలో రాజకీయం వేడెక్కిపోయింది. ఎవరికి వారు దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు రకరకాల వ్యూహాలతో ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలైతే రకరకాల కార్యక్రమాల పేరుతో ప్రజల మధ్యకి వెళ్తున్నారు. ఇందులో భాగంగానే వైసీపీ ఏపీకి మరోసారి సీఎం జగన్ అవసరం ఉందంటూ ఓ కార్యక్రమాన్ని రూపొందించారు. వై ఏపీ నీడ్స్ జగన్ అనే కారక్రమం పేరుతో ప్రజల వద్దకు వెళ్తున్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజల కోసం తీసుకోచ్చిన పథకాలు, సంక్షేమం, అభివృద్ధిని విమరిస్తూ మరోసారి రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రి కావాలంటూ ప్రచారం సాగిస్తున్నారు. గ్రామ స్థాయి నుండి మంత్రుల వరకూ.. పూర్తి స్థాయిలో క్యాడర్ ను కలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రజలలోకి తీసుకెళ్లాలని ఇప్పటికే వైసీపీ పెద్దలు పిలుపునిచ్చారు. కాగా, ఇప్పటికే దీనికి కౌంటర్ గా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయితే బాయ్ బాయ్ జగన్ అంటూ పిలుపునిచ్చారు. త్వరలోనే జనసేన ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లనున్నది.  ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం కూడా  ఒక కార్యక్రమాన్ని సిద్ధం చేసింది.    వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమానికి కౌంటర్ గా టీడీపీ నేతలు ఏపీ హేట్స్‌ జగన్‌ అనే కార్యక్రమాన్ని రూపొందించారు. నాలుగున్నరేళ్ల జగన్ సర్కార్ లో ఏపీ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని, నెరవేరని హామీలను, కక్షపూరిత పాలన, ప్రణాళికలు లేని నిర్ణయాలపై  విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. తాజాగా ఏపీ హేట్స్ అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన అచ్చెన్నాయుడు ప్రతి ఒక్కరూ ‘వద్దు జగన్.. నిన్ను ఇక మేము భరించలేమని’ ముక్త కంఠంతో అంటున్నారని  ఎద్దేవా చేశారు. జగన్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని, బినామీలు సృష్టించిన కంపెనీల మద్యంతో రాష్ట్రంలో 30 వేల మందిని చంపేశారని ఆరోపించారు. ఉచిత ఇసుక రద్దుతో కార్మికులు ఉపాధి కోల్పోయారని, విద్యుత్‌ ఛార్జీల భారం రూ.64 వేల కోట్లు అని దుయ్యబట్టారు. మేనిఫెస్టోలోని హామీలు జగన్ నెరవేర్చ లేదని, సీపీఎస్‌ రద్దు, ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తామన్న జగన్ మాట తప్పారని గుర్తు చేశారు. నిజానికి ఇప్పుడు తెలుగు దేశం పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. పార్టీ అధినేత చంద్రబాబు అక్రమంగా అరెస్టై 43 రోజులు అయ్యింది. కోర్టులలో వాయిదాల మీద  వాయిదాలు పడుతున్నాయి.  ఆయన ఎప్పుడు బయటకి వస్తారో అర్ధం కావడం లేదు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆవేదనతో ఉన్నారు. ఆయన ఆరోగ్యం కూడా క్షీణించింది. చంద్రబాబు భార్య భువనేశ్వరి అక్కడే ఉంటూ ఆయన యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉన్నారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్ కూడా అటు ఢిల్లీలో సుప్రీంకోర్టులో క్యాష్ పిటిషన్ వ్యవహారాలు, లాయర్లతో భేటీలు చూసుకుంటూ ఢిల్లీ, ఏపీ మధ్య పర్యటనలు చేస్తూ బిజీగా ఉన్నారు.  అయినా పార్టీ నేతలు, క్యాడర్ మాత్రం దూకుడుగానే ఉంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్యక్రమాలతో ప్రజలలో యాక్టివిటీ ఉండేలా చేస్తున్నారు. తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా అధిగమించి ప్రతిష్టాత్మకంగా తీసుకొని సక్సెస్ చేస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.  నిజానికి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేస్తే తెలుగుదేశం నీరుగారిపోతుందనీ, అధినేత అరెస్టుతో ఆవేదనతో చేష్టలుడిగి నిస్తేజంగా ఉండిపోతుందని వైసీపీ మరీ ముఖ్యంగా జగన్ భావించారు. అయితే అందుకు భిన్నంగా తెలుగుదేశం రెట్టించిన ఉత్సాహంతో జగన్ కు, వైసీపీకి తగిన విధంగా బుద్ధి చెప్పాలన్న పట్టుదలతో తెగించి మరీ రోడ్డుమీదకు వస్తున్న తీరు అధికార పార్టీ అగ్రనేతలకు మింగుడు పడటంలేదు. తెలుగుదేశం దూకుడుకు బ్రేకులు వేయవచ్చని భావించి చంద్రబాబును అక్రమంగా నిర్బంధించిన క్షణం నుంచీ తెలుగుదేశం శ్రేణులు అనూహ్యంగా గతానికి మించి యాక్టివ్ అయ్యాయి. పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న పట్టుదలతో రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు.   తమ అధినేతను అక్రమంగా అరెస్టు చేశారన్న విషయాన్ని జనంలోకి బలంగా తీసుకువెడుతున్నారు.  అలాగే ఇప్పుడు ఏపీ హేట్స్ జగన్ అంటూ పార్టీ రూపొందించిన కార్యక్రమంతో మరింత ఉత్సాహంగా జనంలోకి వెళ్లేందుకు సిద్ధమౌతున్నారు.  

ప్రజలలో పెల్లుబుకుతున్న ఆక్రోశం.. సైకో ప్రభుత్వ పతనమే ధ్యేయం

ఎక్కడైనా ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తుంటాయి. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు.. అనుసరిస్తున్న విధానాలపై విపక్షాలు విమర్శించడం సహజమే.  ఆ విమర్శలకు అధికార పార్టీ దానికి కౌంటర్లు ఇవ్వడమూ సాధారణమే.  ఏపీలో  కూడా ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. కానీ అంతకు మించిన విమర్శలు ప్రజల నుంచే వస్తున్నాయి.   సీఎం జగన్ మోహన్ రెడ్డి నుండి ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు సహా అందరిపై రాష్ట్ర ప్రజలు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై, ఆయన పాలనను ప్రజలు తూర్పారపడుతున్నారు.  జగన్ పాలనలో రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మంత్రులు మాట్లాడే ప్రతి మాటపై విపక్షాల కంటే ముందే ప్రజలు కౌంటర్లు ఇస్తున్నారు. మండిపడుతున్నారు. అప్పుడెప్పుడో ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ప్రజా వేదిక కూల్చివేత, రాజధాని అమరావతి నిర్వీర్యం, తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వరకూ ఒక్కో అంశాన్ని గుర్తు చేసుకొని మరీ ప్రజలు జగన్ ప్రభుత్వాన్ని తూర్పార పడుతున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, ఉపాధి, ఆరోగ్యంపై మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతల వ్యక్తిగత జీవితాలపై మాట్లాడుతున్నారు. తమ తమ శాఖల పనితీరు, ఆయా శాఖలలో సాధించిన పురోగతి  తదితర అంశాలపై  మీడియా సమావేశం నిర్వహించాల్సిన మంత్రులు.. ప్రతిపక్ష నేతలపై దూషణల కోసం మాత్రమే మైకుల ముందుకు వస్తున్నారు. శాఖల వారీ సమీక్షల విషయమే మరచిపోయారు.  రాష్ట్రంలో పరిస్థితులు, అభివృద్ధి, సంక్షేమంపై ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పాల్సిన అధికార పార్టీ ప్రతినిధులు కులాల గురించి, ప్రతిపక్షాల పొత్తుల గురించి, ప్రతిపక్ష పార్టీలలో అంతర్గత విషయాల గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతిపక్ష నేతలు ఎవరైనా.. ఎంతటి వారినైనా సభ్యత, సంస్కారం అన్న మాటే తెలియదన్నట్లు అనుచితంగా దూషణలకు దిగుతూ తమ దిగజారుడుతనాన్ని చాటుకుంటున్నారు. నేతల కుటుంబాలు, మహిళలు అని కూడా లేకుండా వేధిస్తున్నారు. కనీస ఆధారాలు కూడా లేకుండా కేసులు పెట్టడం, విమర్శలు చేయడం.. వివరణ అడిగితే వ్యతిగత జీవితాలపై విమర్శలు చేయడం ఇదే వైసీపీ నేతల తీరుగా మారిపోయింది. వైసీపీ  పాలన,  వైసీపీ నేతల తీరుతో విసుగెత్తిన జనం తిరగబడుతున్నారు. అతి సామాన్య ప్రజలు కూడా ఆగ్రహంతో   బయటకి వస్తున్నారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే తమపై అక్రమ కేసులు పెడతారని.. వేధించి హింసిస్తారనీ తెలిసినా ప్రజలు వెనకడుగు వేయడం లేదు. ఒక్కో అంశంపై.. ఒక్కో వైసీపీ నేతను పేరుపేరునా కడిగిపారేస్తున్నారు. అలాంటి వీడియో  ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నది. ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళ పేరు శ్రీమతి వరలక్ష్మి. రాజధాని 29 గ్రామాల్లో ఒకటైన మందడం గ్రామానికి చెందిన ఈమె ఓ సాధారణ గృహిణి. కేవలం  రెండు ఎకరాల వ్యవసాయ భూమి, 4 సెంట్లలో రేకులతో నిర్మించిన చిన్న ఇల్లు ఈమె కుటుంబ యావదాస్తి. అయితే, ఆమె కుటుంబానికి ఉన్న రెండెకరాలను ఆంధ్రుల ప్రజా రాజధాని కోసం ప్రభుత్వానికి ఇచ్చేశారు. కానీ రాజధానిపై నీలినీడలు కమ్ముకోవడంతో సర్వం కోల్పోయి చట్ట ప్రకారం రావాల్సిన కౌలు రాక భవిష్యత్ కారు చీకటిగా మారి అంతులేని వేదనతో  బతుకీడుస్తున్నారు. కష్టాలు చుట్టుముట్టినా ఆమెలో చైతన్యం అణగారిపోలేదు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గొంతెత్తేందుకు భయం అడ్డు రాలేదు.   ప్రభుత్వంపై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కడానికి ఆమె మాటలకు తడుముకోలేదు. జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచీ  తీసుకున్న ఒక్కో ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని, పాల్పడిన అక్రమాలను ఒకదాని తరువాత ఒకటిగా గుక్క తిప్పకోకుండా కడిగి పారేశారు.   మాస్కులు లేకుండా కరోనా వైద్యం ఎలా చేయాలని ప్రశ్నించిన దళిత వైద్యుడినే అక్రమ కేసులు పెట్టి చంపేసిన ప్రభుత్వం.. అంటూ ఆమె జగన్ సర్కార్ ను దుమ్మెత్తి పోసింది. ఇలాంటి సాధారణ గృహిణి ఇంతలా విమర్శిస్తే ఊరికే ఉంటారా. ఆమె బాధను వెళ్లగక్కిన పుణ్యానికి ఆమెపై అక్షరాల ఇరవై మూడు క్రిమినల్ కేసులు బనాయించింది జగన్ సర్కార్. రాక్షస కాండపై రాజ్యంగం కల్పించిన ప్రాథమిక హక్కును అహింసా మార్గంలో గొంతెత్తినందుకు ఆమెకు 23 క్రిమినల్ కేసులు బహుమతిగా ఇచ్చారు. అయితే, ఒక సాధారణ మహిళ, తన ఆక్రందనను వెక్కగక్కుతూ గుక్క తిప్పుకోకుండా వైసీపీ నేతలను చీల్చి చెండాడిన ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. తమ బాధ కూడా ఆమె మాటలలో కనిపిస్తున్నదని, మా మనసులలోని ఆవేదన ఆమె నుండి ఆక్రందనగా బయటకి వచ్చినట్లుగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది ఒక్క వరలక్ష్మి ఆవేదన మాత్రమే కాదని.. రాష్ట్ర సంక్షేమాన్ని కోరుకొనే ప్రతి పౌరుడి మనసులో మాటలేనంటూ ఆమెకి మద్దతు తెలుపుతున్నారు.

చంద్రబాబు ఆరోగ్యంపై అనుచిత వ్యాఖ్యలు.. వెగటు పుట్టిస్తున్న వైసీపీ తీరు!

తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ తర్వాత జరుగతున్న సంఘటనలు గమనిస్తే చంద్రబాబును వీలైనంత ఎక్కువ రోజులు నిర్బంధంలో ఉంచి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలన్నదే  వైసీపీ  లక్ష్యంగా కనిపిస్తున్నది. అందుకే  చంద్రబాబు ప్రమేయమే లేని స్కిల్  కేసులో ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం అంతటితో ఆగకుండా ఒకదాని తరువాత ఒకటిగా అక్రమ కేసులను తెరమీదకు తెచ్చి.. పీటీ వారెంట్లతో హడావుడి  చేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేమన్న నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు ఆయన ప్రజలలో తిరిగే అవకాశం లేకుండా చేయాలన్న దుష్టతలంపుతోనే అక్రమంగా అరెస్టు చేయించారని అంటున్నారు.  అయితే అక్రమ అరెస్టుతో కూడా ఏ మాత్రం ధైర్యం కోల్పోని చంద్రబాబు.. తనపై కేసు అక్రమమనీ, దానిని కొట్టివేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి  చంద్రబాబునాయుడిని ఏపీ  సీఐడీ అరెస్టు చేసిన కేసులో ఆయన క్వాష్ కాకుండా బెయిలు పిటిషన్ దాఖలు చేసి ఉంటే ఒకటి రెండు రోజులలో బయటకు వచ్చేసే వారు. కానీ.. జగన్ సర్కార్ దుష్ట తలంపును అర్ధం చేసుకున్న ఆయన ఒక కేసులో బెయిలు పొందగానే మరో కేసు.. ఆ తరువాత ఇంకో కేసు అంటూ వేధిస్తారని, అసలు ఆ  కేసులలో పస లేదనీ, కేవలం రాజకీయ వేధింపులేనని తేల్చేసేందుకే సిద్ధపడ్డారు.   న్యాయస్థానాలలో  విజయం సాధించి తాను పులు కడిగిన ముత్యంలా బయటకు రావడం ఖాయమని చంద్రబాబుకు స్పష్టంగా తెలుసునని అందుకే ఆయన కోర్టులలో కేసులు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నా నిబ్బరంగా ఉన్నారని అంటున్నారు.  అయితే రాజమహేంద్రవరం జైలులో పరిస్థితులు, జైలు అధికారులు వ్యవహరిస్తున్న తీరు చంద్రబాబుకు జైలులో ఏదైనా హాని తలపెడతారన్న అనుమానాలను కలిగిస్తున్నాయి. ఆయన విపరీతమైన ఉక్కపోతకు గురై డీహైడ్రేషన్ కు గురైన సందర్భంలోనూ, ఉక్కపోత కారణంగా అ లర్జీ వచ్చి అనారోగ్యానికి గురైనా సరైన వైద్య సహాయం అందించకపోవడం వంటి సంఘటనలతో ఉద్దేశపూర్వకంగా చంద్రబాబుకు హాని తలపెట్టాలన్న లక్ష్యంతో జగన్ సర్కార్ ఉందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా జైలులో ఉండగా అనారోగ్యానికి గురైతే.. ఆసుపత్రికి తరలించడం కద్దు. అయితే చంద్రబాబు విషయంలో మాత్రం జైలు అధికారులు ఆయనను ఆస్పత్రికి తరలించకుండా జైలుకే ప్రభుత్వ వైద్యులను రప్పించడం, అలాగే ఆయనకు చేసిన పరీక్షలు, చికిత్స, అందించిన మందుల విషయాలను గోప్యంగా ఉంచడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి.   సొంత బాబాయ్  వివేకా హత్య కేసులో  కేసులో సొంత కుటుంబ సభ్యులే జగన్ వైపు  వేలెత్తి చూపడం, కన్నతండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత ముఖ్యమంత్రి పదివి కోసం ఆయన చేసిన ‘సంతకాల’ ప్రయత్నం, రాజకీయంగా తల్లీ, చెల్లి విషయంలో ఆయన వ్యవహరించిన తీరు గుర్తు చేస్తూ..  అధికారం కోసం ఏమైనా చేసేందుకు వెనుకాడని జగన్ రెడ్డి, ఇప్పుడు అదే అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ఆ అధికారాన్ని కాపాడుకోవడం కోసం  చంద్రబాబుకు  హాని తలపెట్టినా తలపెడతారన్న అనుమానాలు సామాన్య జనంలో కూడా వ్యక్తం అవుతున్నాయి. ఆయన ఆరోగ్యం విషయంలో జైలు అధికారులు వ్యవహరిస్తున్న తీరు,  చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల, కొందరు మంత్రులు చేస్తున్న వ్యంగ్య వ్యాఖ్యలను గమనిస్తే.. ఆ అనుమానాలు బలపడుతున్నాయని అంటున్నారు.   చంద్రబాబు  5 కిలోలు బరువు తగ్గారని, ఆయనకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారని.. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని, ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే,ఇతర కుటుంబ సభ్యులతో పాటుగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాజకీయలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు, సామాన్య ప్రజలు  ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు అరెస్టుపై ఇంత వరకూ  కనీసం స్పందించని  కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని మోడీ కూడా చంద్రబాబు ఆరోగ్యంపై ఆరా తీశారు. ఈ  విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నివేదికలపై విశ్వాసం లేకపోవడంతో  చంద్రబాబు నాయుడు కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్’ను పిలిపించుకుని చంద్రబాబు ఆరోగ్యం గురించి అడిగితెలుసు కున్నారు.అలాగే, తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్’ను  చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిని అమిత్ షా అడిగి తెలుసుకుంటే..  పార్లమెంట్ -20 సమావేశం సందర్భంగా  ప్రధాని మోదీ  తెలుగుదేశం ఎంపీ కనకమేడలను చంద్రబాబు ఆరోగ్యంపై అడిగి తెలుసుకున్నారు. ఇలా చంద్రబాబు ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంటే ఒక్క వైసీపీ నాయకులు మాత్రం మానవత్వాన్ని మరిచి వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తన భర్త చంద్రబాబు ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గారని, ఇంకా బరుగు తగ్గితే కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తే,   ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల  మాత్రం చంద్రబాబు జైల్లో బరువు తగ్గలేదు సరికదా ఒక కిలో బరువు పెరిగారని  వ్యంగ్య వ్యాఖ్యలు చేసశారు.  చంద్రబాబుకు ఆయన కుటుంబ సభ్యుల నుంచే ప్రమాదం ఉందంటూ చౌకబారు ఆరోపణలు, అడ్డగోలు  వ్యాఖ్యలు చేశారు. 73 ఏళ్ల వయసున్న నాయకుడి ఆరోగ్యంపైనా అవహేళనగా మాట్లాడి తమ తీరు ఎంత నేలబారుగా ఉంటుందో మరో  సారి రుజువు చేసుకున్నారు.   చంద్రబాబుకు వయసు రీత్యానే కాదు, 35 సంవత్సరాలకు పైగా ఉన్న చర్మ ఆరోగ్య  సమస్య రీత్యా ప్రత్యేక  వైద్యం, ప్రత్యేక సదుపాయాలు అవసరం. ఆరోగ్య అవసరాల దృష్ట్యా చల్లటి వాతావరణం (ఏసీ) లో ఉండటం అవసరం. జైల్లో ఆ సదుపాయం లేదు. కోర్టు ఆదేశించిన తరువాత తప్పనిసరి పరిస్థితుల్లో ఏసీ సౌకర్యం కల్పించారనుకోండి అది వేరే విషయం.  అయితే స్కిన్‌ అలర్జీతో ప్రాణాలు పోతాయా? వంటి దారుణ వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ నేతల పట్ల ప్రజలలో ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. హెల్త్ బులిటిన్ విడుదల చేయాలన్న డిమాండ్ పైనా సజ్జల చేసిన నీచమైన వ్యాఖ్యల  పట్ల సర్వత్రా ఏహ్యత వ్యక్తం అవుతున్నది.  అధికార దర్పంతో సభ్యత, సంస్కారం మరిచి వ్యవహరించే నేతలకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నది చరిత్ర పదే పదే రుజువు చేస్తున్న సత్యం.  అధికార  మదంతో కన్నూమిన్నూ కానకుండా వ్యవహరిస్తున్న వైసీపీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. 

ఏపీ సీఐడీ చీఫ్, అడిషనల్ ఏజీపై చర్యలకు గవర్నర్ ఆదేశం!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును స్కిల్ కేసులో ఏపీ సీఐడీ అక్రమంగా అరెస్టు చేసిన విషయం.. ఆ తరువాత  విచారణ, రిమాండ్ ఏసీబీ కోర్టు నుంచి సర్వోన్నత న్యాయస్థానం వరకూ బాబు జరుపుతున్న న్యాయపోరాటం  అందరికీ తెలిసిందే. స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అలాగే సైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు పిటిషన్ పై విచారణ వాయిదా వేసింది. స్కిల్ కేసులో తీర్పు వెలువరించిన తరువాతనే మిగిలిన విషయాలను పరిగణనలోనికి తీసుకుంటామని స్పష్టం చేసింది.  ఒక వేళ స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను అనుమతిస్తే చంద్రబాబుపై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయన్నది న్యాయనిపుణుల విశ్లేషణ. అలాగే   క్వాష్ పిటిషన్ పై కూడా సుప్రీం కోర్టులోబాబు తరఫు న్యాయవాదుల వాదనలే ఎఫెక్టివ్ గా ఉన్నాయనీ, ఈ కేసులో జగన్ సర్కార్ తరఫున వాదించిన ముకుల్ రోహత్గీ.. వాయిదాల కోసమే వాదిస్తున్నారన్న అభిప్రాయం కూడా న్యాయనిపుణులలో వ్యక్తం అవుతోంది. ఇదంతా పక్కన పెడితే.. ఈ కేసులను ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ పర్యవేక్షిస్తున్నారు,  ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులలో వాదిస్తున్నారు. అయితే కేవలం ఉద్యోగ ధర్మానికి పరిమితం కాకుండా వారు ఒకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నారనీ, ఊరూరా తిరిగి  మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ కేసుల గురించి మాట్లాడుతున్నారనీ వారిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మీడియా సమావేశాలలో కోర్టులలో విచారణలో ఉన్న కేసులలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని తీర్పులు ఇచ్చేస్తున్నారు. ఒక్క ఆయనే కాదు.. ఇంకా లోకేష్ సహా పలువురిని కూడా అరెస్టు చేస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అంతే కాకుండా ఈ కేసులలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ తదితరుల అవినీతికి సంబంధించి   బలమైన సాక్ష్యాధారాలున్నాయని వారు మీడియాకు చెప్పారు.  తాము చట్టప్రకారమే ముందుకు సాగుతున్నామని  రాజకీయ కక్ష సాధింపు సరికాదంటూ రాజకీయ ప్రసంగాలు చేశారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రెస్‌మీట్‌ పెట్టి జగన్‌ ప్రభుత్వం ఈ అక్రమకేసులు బనాయించి తమపై ఏవిదంగా రాజకీయ కక్షలకు పాల్పడుతోందో వివరించడంతో  జగన్‌ ప్రభుత్వం తరఫున ఏపీసీఐడీ చీఫ్ సజయ్, అడిషనల్ ఏజీ పొన్నవోలు ఢిల్లీ వెళ్లి కౌంటర్లు ఇచ్చి వచ్చారు.  అయితే నారా లోకేష్‌   జాతీయ మీడియా ముందు జగన్ సర్కార్ అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తోందని  చెప్పడం.. మూడు కోర్టులలో ఈ కేసుల విచారణ కొనసాగుతున్నప్పుడు, వాటిని పర్యవేక్షిస్తున్న ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్, వాదిస్తున్న పొన్నవోలు   ప్రెస్‌మీట్‌ పెట్టి కేసులపై మాట్లాడడాన్ని ఒకే గాటన చూడలేం.  కోర్టులు కేసులను విచారిస్తునప్పుడు వాటిని ప్రభావితం చేసేవిధంగా ఏపీ సీఐడీ చీఫ్, అడిషనల్ అడ్వకేట్ జనగర్ మీడియాకు చెప్పడం చట్టప్రకారం నేరం అవుతుంది. వారి ఉద్యోగ ధర్మాన్ని ఉల్లంగించడమే ఔతుంది. ఇదే విషయంపై ఏపీ గవర్నర్‌ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు  ఏపీ యునైటడ్ ఫోరం ఫర్ కాంపెయిన్ సంస్థ అధ్యక్షుడు ఎన్‌. సత్యనారాయణ గవర్నర్‌కు  ఫిర్యాదు చేశారు, ఆ ఫిర్యాదుపై స్పందించిన గవర్నర్  విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని   రాష్ట్ర హోమ్ కార్యదర్శిని ఆదేశించారు.   గతంలో తెలంగాణలో ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మరీ వివరాలు వెల్లడించారు. దీంతో తెలంగాణ హైకోర్టు ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించి, కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులను మందలించింది. కోర్టుకు మాత్రమే తెలియజేయాల్సిన వివరాలు సీఎంకు ఎలా తెలిశాయని నిలదీసింది. అంతే కాకుండా కేసునే రద్దు చేసింది. చంద్రబాబు స్కిల్ కేసులో కూడా ఏపీసీఐడీ, అడిషనల్ ఏజీ కోర్టుకు తెలియజేయాల్సిన విషయాలను మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ బహిరంగంగా వెల్లడిస్తుండటం కూడా ఆ కోవలోకే వస్తుంది. దీనిపైనే గవర్నర్ వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ ఏపీ హెోంశాఖ కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చారు.  

బెడిసి కొట్టిన ఆర్జీవీ వ్యూహం!

ఏం చేసినా చూస్తూ ఊరుకునేందుకు ఇదేమీ ఆటవిక రాజ్యం కాదు కదా. ఎలాంటి మహారాజులనైనా చీల్చి చెండాడే రాజ్యాంగం అమలయ్యే దేశం కదా.. కాస్త ఆలస్యమైనా విపరీత ధోరణికి కళ్లెం పడాల్సిందే.  నేనేం చేసినా చెల్లుతుంది అనుకుంటే అందరూ చూస్తూ ఉండాలని రూల్ ఏమీ లేదు కదా. అసలే తలబిరుసు ఎక్కువాయె.. అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఇంతకీ దేని గురించి ఇదంతా అనుకుంటున్నారా? అదే టాలీవుడ్ లో వివాదాస్పద దర్శకుడిగా పేరున్న రామ్ గోపాల్ వర్మ గురించి.. ఆయన తెరకెక్కించిన వ్యూహం సినిమా గురించి. దీనిని సినిమా అనే కన్నా.. ఎన్నికలే లక్ష్యంగా  వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని హీరోగా చిత్రీకరించేలా తెరకెక్కించిన ఓ కంప్లీట్  ప్రచారం చిత్రం అని చెప్పొచ్చు. విడుదల కూడా కాకుండా మీరెలా చెప్తారని అంటారేమో.. ఏకంగా సినిమా తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ తానే స్వయంగా ఈ విషయం చెప్పారు.  ఔను.. నాకు జగన్ మోహన్ రెడ్డి హీరోలాగానే కనిపిస్తారు.. కనుకే ఆయన్ని ఈ సినిమాలో హీరోలా చూపించానని ఓపెన్ గానే చెప్పారు ఆర్జీవీ. జగన్ హీరో అంటే మిగతా ఆయన రాజకీయ ప్రత్యర్థులంతా విలన్లే కదా. అందుకే ఇష్టం వచ్చినట్లుగా జగన్ ప్రత్యర్థులందరినీ ఘోరాతి ఘోరంగా చూపించారు. ఇప్పటికే టీజర్లు, ట్రైలర్లలోనే ఆయన ఏం చెప్పాలనుకున్నాడో స్పష్టంగా చెప్పారు. అందుకే ఇప్పుడు ఆయన సినిమాకు బ్రేకులు పడే అవకాశాలే కనిపిస్తున్నాయి. .  జగన్ రాజకీయ జీవితంలోని కీలక ఘట్టాల ఆధారంగా తెరకెక్కిన వ్యూహం సినిమా నవంబరు 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వర్మ అండ్ కో ఇప్పటికే ప్రకటించారు. అయితే, వ్యూహం సినిమా విడుదల కాకుండా ఆపాలంటూ టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ను, కేంద్ర హోంశాఖను, తెలంగాణ ఎన్నికల ప్రధాన కమిషనర్ ను కోరుతున్నారు. ఈ సినిమాలో ఏపీ సీఎం జగన్ ను, వైసీపీని గొప్పగా చూపించి, విపక్షాలను తక్కువ చేసి చూపించారని నట్టి కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది ఏపీకి సంబంధించిన ఇతివృత్తం అయినప్పటికీ, త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నందున తెలంగాణలోనూ ఈ సినిమా ప్రభావం చూపించే అవకాశం ఉందని నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. వర్మ వ్యూహం సినిమాలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, సోనియా గాంధీ వంటి రాజకీయ నేతలందరినీ తక్కువ చేసి చూపించడమే కాకుండా.. వారంతా కుట్రలు పన్నే నేతలుగా చూపించే ప్రయత్నం చేశారని నట్టి కుమార్ ఆరోపించారు.  వ్యూహం సినిమా విడుదలైతే తెలంగాణ ఓటర్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆరోపించిన నట్టి కుమార్.. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ వ్యూహం సినిమా విడుదల సరి కాదని పేర్కొన్నారు. వచ్చే నెలలోనే ఎన్నికలు ఉన్న తెలంగాణలోతెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయని.. ఆ పార్టీల అధ్యక్షులైన చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాత్రలను ఈ సినిమాలో తప్పుగా చూపించారన్న విషయం ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ల ద్వారానూ, స్వయంగా ఆర్జీవీ మాటల ద్వారానూ అర్దం అవుతోందని పేర్కొన్న నట్టి కుమార్ ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం విడుదల వాయిదా వేయాలని కోరారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ చేస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.   తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే అక్రమంగా అరెస్టై జైలులో ఉండగా.. ఆయన పాత్ర డూప్ ద్వారా వస్తున్న ఈ చిత్రం విడుదల చేస్తే అల్లర్లు జరిగే అవకాశం ఉందని నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాలలో చంద్రబాబు అక్రమ అరెస్టునకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయనీ, ఈ సమయంలో వ్యూహం సినిమా విడుదలైతే అల్లర్లు జరిగే అవకాశాలు మండుగా ఉన్నాయనీ నట్టి కుమార్   ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఈ సినిమాలో పాత్రలన్నీ యధాతధంగానే చిత్రీకరించారు. ఒక్క జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య భారతీలను తప్ప మిగతా అందరినీ కుట్రదారులుగా చూపించారు. పైగా రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాలలో వాస్తవాలను వక్రీకరించి తమకు కావాల్సినట్లుగా తెరకెక్కించారు. జగన్ కు వ్యతిరేకంగా మారే అవకాశం ఉన్న తన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల పాత్రలను ఎక్కడా సినిమాలో లేకుండా ఇది సంపూర్ణంగా జగన్ కోసమే.. జగన్ కు అనుకూలంగా ఉండేలా.. జగన్ ను ఓ ఆదర్శ నాయకుడిలా చూపించే ప్రయత్నంగానే కనిపిస్తున్నందునే  నట్టి కుమార్ ఫిర్యాదు చేశారు.  

బాబుకు సజ్జల సలహా బూమరాంగ్.. ముందు జగన్ జైలుకెళ్లాలంటున్న నెటిజన్లు!

సజ్జల రామకృష్ణా రెడ్డి.. ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రి. ఈయన  ఇటీవల మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు అవినీతి పరుడు. అందుకే జైలుకు వెళ్లారు. ఒక వేళ ఆయన అవినీతికి పాల్పడి ఉండకపోతే ఆయన జైలుకు ఎందుకు వెడతారు? తన నిర్దోషిత్వాన్ని జైల్లో  ఉండే విచారణను ఎదుర్కొని ఎందుకు రుజువు చేసుకోకుండా క్వాష్ పిటిషన్ వేస్తారు అని ప్రశ్నలు సంధించారు. అంతే కాదు.. జైల్లో ఆయన ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, శ్రేణులు వ్యక్తం చేస్తున్న ఆందోళనపై సైతం సెటైర్లు వేసి జనంలో పలుచన అయ్యారు. అయితే అవన్నీ  పక్కన పెడితే ఇప్పుడు సజ్జల చేసిన వ్యాఖ్యలే  వైసీపీని డిఫెన్స్ లో పడేశాయి. ఆయన వ్యాఖ్యలు  బూమరాంగ్ అయ్యాయన్న అభిప్రాయం పార్టీ వర్గాలలో వ్యక్తం అవుతోంది. వైసీపీ నేతలు కూడా జగన్ ను సజ్జల వ్యాఖ్యలు ఇబ్బందుల్లో పడేశాయని అంటున్నారు.  ఎందుకంటే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు కనుకనే అరెస్టయ్యారు. తన నిజాయితీని నిరూపించుకోవలసిన బాధ్యత  ఆయన మీద ఉంది అంటూ చేసిన వ్యాఖ్యలు సూటిగా జగన్ అక్రమ  కేసులలో 16 నెలలు జైలులో ఉన్న సంగతిని  గుర్తు చేశాయి. ఇప్పుడు ఆ మాటలనే తెలుగుదేశం  నాయకులు ప్రస్తావిస్తూ  జగన్ అవినీతికి పాల్పడ్డాడు కనుకనే  16 నెలలు జైలుకు వెళ్లారని సజ్జల అంగీకరించేశారుగా అంటున్నారు. జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారే  ఆ మాటలు చెప్పిన  తరువాత ఒక్క క్షణం కూడా  సీఎంగా  ఉండే అర్హత జగన్ కు లేదని అంటున్నారు. ఆయన తక్షణమే జైలుకు వెళ్లి.. తన నిజాయితీని  నిరూపించుకున్న తరువాత బయటకు  రావాలని అంటున్నారు. ఇక  నెటిజనులు అయితే సజ్జల వ్యాఖ్యలపై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. ఒక వేలు చంద్రబాబువైపు చూపే ముందు మూడు వేళ్లు జగన్ వైపు చూపుతున్నాయని గుర్తుంచుకోవాలని హితవు పలుకుతున్నారు.  స్కిల్ కేసు అంటూ చంద్రబాబుపై ఏపీ సీఐడీ చేసినవన్నీ ఆరోపణలేననీ, అదే జగన్ అక్రమాస్తుల కేసులో ఆస్తుల జప్తు జరిగిందనీ, మనీ ట్రయల్ జరిగిందన్న ఆధారాలు కూడా దర్యాప్తు సంస్థలు చూపాయని గుర్తు చేస్తున్నారు.   పదేళ్లుగా బెయిల్‌పైనే ఎందుకు తిరుగుతున్నారని నెటిజనులు నిలదీస్తున్నారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని జడ్జి నమ్మినందుకే, ఆయనకు రిమాండ్‌ విధించారన్న సజ్జల మాటలు నిజమైతే… జగన్‌ కూడా అవినీతికి పాల్పడ్డారని కోర్టు నమ్మినందుకే, ఆయనను 16 నెలలపాటు రిమాండ్‌లో ఉంచిందా అని నిలదీస్తున్నారు.  జగన్‌పై 38 కేసులుంటే.. దానిపై కోర్టులో 54 డిశ్చార్జి పిటిషన్లు వేశారు. 158 స్టే పిటిషన్లు వేశారు. మరి సజ్జల చెప్పినట్లు జగన్‌ కూడా నిర్దోషి అయితే, ఇన్నేసి పిటిషన్లు వేయడం ఎందుకు జైల్లో ఉండి తాను నిర్దోషినని రుజువుచేసుకుని, తుది తీర్పు వచ్చిన తర్వాత పులుకడి గిన ముత్యం మాదిరిగా బయటకు రావచ్చు కదా?  అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్య సలహాదారు అయి ఉండీ ఆ సలహా జగన్ కు ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తున్నారు.   పనిలో పనిగా జగన్ కేసులకు సంబంధించిన వివరాలు అన్నీ సామాజిక మాధ్యమంలో పోస్టు చేస్తున్నారు.  ఇంతకూ కోర్టులో తాను నిర్దోషినని రుజువుచేసుకోవాలన్న సజ్జల సలహా  చంద్రబాబుకు ఇచ్చినట్లా, లేక జగన్ కు ఇచ్చినట్లా అని ప్రశ్నిస్తున్నారు.  పదేళ్లుగా జనం బెయిలుపై ఉన్నారన్న సంగతి కొద్ది మందిని మినహాయిస్తే జనం పెద్దగా గుర్తుంచుకున్నట్లు కనిపించదు. ఆయన పాలనా వైఫల్యాలపైనే జనాగ్రహం ఉంది. ఆయనపై కేసులు, ఆయన బెయిలపై పదేళ్లుగా విచారణకు హాజరుకాకుండా ఉన్నారన్న విషయం జనానికి పెద్దగా గుర్తు లేదనే భావించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ముఖ్య సలహాదారు విపక్ష నేతకు ఇచ్చిన  అమూల్యమైన సలహాల కారణంగా జనం జగన్ కేసులు, బెయిలు విషయాన్ని గుర్తు చేసుకుని చర్చించుకుంటున్నారు. జగన్ అక్రమాస్తుల కేసుల వివరాలను అంతర్జాలంలో తెగ వెతికేస్తున్నారు. ఇప్పుడు జగన్ ముఖ్యసలహాదారు ఆ విషయాలన్నిటినీ గుర్తు చేసి జగన్ ను మరో సారి జనం ముందు దోషిగా నిలబెట్టారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

తెలంగాణలోనూ బీజేపీకి జనసేన రాంరాం.. తెలుగుదేశంతో కలిసే ఎన్నికలకు?!

తెలుగు రాష్ట్రాలలో బీజేపీ విధానాలేంటి, వ్యూహాలేంటి అన్న విషయంలో ఆ పార్టీకి చందిన రాష్ట్ర నాయకులకే అవగతం కావడం లేదు. ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆ రాష్ట్రంలో ఒక బలపైన విపక్షం జనసేన బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ఆ పార్టీని పట్టించుకోకుండా.. తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న అధికార పార్టీకి అన్ని  విధాలుగా అండదండలు అందిస్తూ.. రాష్ట్రంలో తనకున్న కొద్ది పాటి బలాన్ని కూడా చేజేతులా జారవిడుచుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో జనసేన పార్టీ తెలుగుదేశంతో కలిసి నడవాలన్న నిర్ణయానికి వచ్చేసి కలిసి వస్తే రండి లేకుంటే పొండి అంటూ బంతిని బీజేపీ కోర్టులో పడేసింది. ఇక ఇప్పుడు రాష్ట్రంలో అసలే స్టేక్ లేని బీజేపీకి గత ఎన్నికలలో వచ్చిన ఒక  శాతం ఓటు కూడా అనుమానమే అని ఆ పార్టీ శ్రేణులే అంటున్నాయి.  ఏ రాజకీయ ప్రయోజనం ఆశించి జనాగ్రహాన్ని ఎదుర్కొంటున్న వైసీపీకి తమ పార్ట హైకమాండ్ అండదండగా నిలిచి తమను పలుచన చేస్తున్నదో అవగతం కాలేదంటూ ప్రైవేటు సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చే స్తున్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. అక్కడ అధికారమే తరువాయి అన్నంతగా బలపడిన పార్టీని చేజేతులా మళ్లీ మొదటికి అంటే సింగిల్ డిజట్ స్థాయికి దిగజారడానికి  కారణం కూడా అధిష్థానమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద దక్షిణాదిలో బలపడాలంటే పార్టీని క్షేత్ర స్థాయి నుంచీ బలోపేతం చేయాలన్న ప్రాథమిక  సూత్రాన్ని విస్మరించిన బీజేపీ అగ్రనాయకులు.. ఆయా రాష్ట్రాలలో ప్రత్యర్థి పార్టీలను అంటే బలహీనం చేస్తే చాలన్న ఎత్తుగడతో వెళ్లి మొదటికే మోసం వచ్చేలా వ్యవహరించారని  పరిశీలకులు అంటున్నారు.  ఏపీలో అధికార పార్టీకి అన్ని విధాలుగా సహాయసహకారాలు  అందించి ఆ పార్టీ ద్వారా రాష్ట్రంలో  బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని బలహీన  పరచాలన్న బీజేపీ వ్యూహం  బెడిసికొట్టిందని అంటున్నారు. ఏపీలో  మిత్ర పక్షంగా  ఉన్న జనసేన కూడా ప్రజాభిప్రాయానికి  తలొగ్గి బీజేపీతో మైత్రి ఉన్నా లేకపోయినా ప్రజాభీష్టం ఎలా ఉంటే అలా నడుచుకోవాలని నిర్ణయించుకోవడానికి కూడా బీజేపీ అగ్రనాయకత్వం తీరే కారణమని  విశ్లేషిస్తున్నారు. సరే ఏపీలో అలా ఉంటే.. ఇక తెలంగాణలో అధికారమే తరువాయి  అన్న  స్థితి  నుంచి  అన్నినియోజకవర్గాలలో పోటీకి అభ్యర్థులను వెతుక్కోవలసిన పరిస్థితి పార్టీ  దిగజారడానికి  కూడా బీజేపీ హైకమాండ్ తీరే కారణమని అంటున్నారు. తీరా ఎన్నికల  ముంగిటకు వచ్చిన తరువాతైనా ఇక్కడ  కలిసి  వచ్చే పార్టీలను కలుపుకుని పోవడానికి బదులు బరిలో నిలవవద్దంటూ వాటిపై ఒత్తిడి తీసుకువచ్చి  పెద్దన్న  పాత్ర  పోషించి అజమాయిషీ చేయాలని చూడటం కూడా వికటిస్తోందని అంటున్నారు. తెలంగాణలో 36స్థానాలలో పోటీకి జనసేన నిర్ణయించింది. ఆ  మేరకు అభ్యర్థుల ఎంపిక కూడా దాదాపుగా పూర్తయిన స్థితిలో బీజేపీ రంగ ప్రవేశం చేసి జనసేనతతో తన మైత్రికి చూపుతూ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండి మద్దతు ఇవ్వాలంటూ చేసిన  ప్రతిపాదన బూమరాంగ్ అయ్యింది. తెగదెంపులు చేసుకోవడానికైనా రెడీ కానీ పోటీకి దూరంగా  ఉండే ప్రశక్తే లేదని  జనసేనాని  బీజేపీకి తేల్చి చెప్పేశారని  ఆ పార్టీ శ్రేణులు  చెబుతున్నాయి.  ఏపీలో తన తీరుతో జనసేనను  దూరం  చేసుకున్న బీజేపీ  తెలంగాణలో కూడా అదే అపరిపక్వ  తీరుతో ఆ పార్టీకి  దూరం అవుతోందని  అంటున్నారు.   ఎన్డీయేలో భాగస్వామ్యపక్షంగా ఉన్నాం  కనుక బీజేపీతో కలిసి  తెలంగాణ ఎన్నికలలో ముందుకు సాగడమే బాగుంటుందని అన్న  జనసేనానికి  వ్యాఖ్యలను స్వాగతించాల్సింది  పోయి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా ఆయనకు  బీజేపీ అధిష్ఠానం ఒక ప్రతిపాదన పంపిందని  అంటున్నారు. ఆ ప్రతిపాదన ప్రకారం  ఎన్డీయే మిత్ర  పక్షంగా  జనసేన తెలంగాణ ఎన్నికలలో  అభ్యర్థులను  రంగంలోకి దింపకుండా  బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా పని చేయాలి. అయితే  ఈ  ప్రతిపాదనను జనసేన  నిర్ద్వంద్వంగా తిరస్కరించారని జనసేన శ్రేణులు చెబుతున్నాయి. జీహెచ్ఎంసీ  ఎన్నికలలో  కూడా  పోటీకి  దూరంగా  ఉండి జనసేన చేసిన త్యాగాన్ని బీజేపీ ఇసుమంతైనా గుర్తించలేదనీ, పైపెచ్చు   ఏరు  దాటాకా అన్న సామెతలా  తెలంగాణలో ఎవరి  పొత్తూ లేకుండా ఒంటరిగానే అధికారంలోకి వస్తామంటూ   ప్రకటనలు గుప్పించి మిత్ర ధర్మాన్ని  విస్మరించిందనీ జనసేన శ్రేణులు గుర్తు చేస్తున్నాయి.   అంతే కాకుండా సొంత బలం లేని బీజేపీ తమను  పోటీ చేయకుండా మద్దతుకే పరిమితం అవ్వాలంటూ  ఒత్తిడి  చేయడం హాస్యాస్పదమంటున్నాయి. ఇక బీజేపీలో సీనియర్లు కూడా అధిష్థానం తీరు పట్ల అభ్యంతరం  వ్యక్తం  చేస్తున్నారు.  రాష్ట్రంలో త్రిముఖ పోటీ నేపథ్యంలో..  జనసేనతో కలసి పోటీ చేయడమే మంచిదని అంటున్నారు.    ఇక పోతే బీజేపీ ప్రతిపాదనతో తీవ్ర ఆగ్రహానికి  గురైన జనసేనాని తెలుగుదేశంతో కలిసి  తెలంగాణ ఎన్నికలలో పోటీలోకి దిగే విషయాన్ని  తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. ఏపీలో ఇప్పటికే జనసేన తెలుగుదేశంతో కలిసి ఎన్నికలకు వెళ్లాలన్ని నిర్ణయం తీసేసుకుంది సమయం మించి  పోయిన కారణంగా  ఆ పొత్తును తెలంగాణలో కూడా కొనసాగించే విషయంలో తెలుగుదేశం, జనసేనలు నిర్ణయం తీసుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే జనసేన 36 స్థానాలలో అభ్యర్థులను నిలపాలని నిర్ణయించింది. తెలుగుదేశం  రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలలోనూ అభ్యర్థులను  నిలిపేందుకు నిర్ణయించినప్పటికీ.. చంద్రబాబు  అరెస్టు  తదననంతర పరిణామాల నేపథ్యంలో  ఎన్నిస్థానాలలో పోటీ  అన్న విషయంలో  ఒక  క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలోనే  రాజమహేంద్రవరం  వెళ్లి   తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో ములాఖత్ అయిన తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్ ఆ తరువాత రాష్ట్రంలో 86స్థానాలలో తెలుగుదేశం పోటీ  చేస్తుందని ప్రకటించారు. ఏయే  స్థానాలలో అన్న త్వరలో ప్రకటిస్తామనీ, ఈ లోగా  జనసేనానితో కూడా  చర్చించి  కలిసిఎన్నికలు వెళ్లే విషయమై చర్చిస్తామని ప్రకటించారు. దీంతో తెలంగాణలో  కూడా  తెలుగుదేశం, జనసేనలు పొత్తు పెట్టుకుని కలిసే  ఎన్నికలకు వెళ్లే అవకాశాలు  మెండుగా కనిపిస్తున్నాయని అంటున్నారుప తెలుగుదేశం, జనసేన కలిసి  ఎన్నికలకు  వెడితే ఈ  కూటమి అభ్యర్థులు  రాష్ట్రంలోని 119 స్థనాలలోనూ  పోటీ  చేసే అవకాశం ఉంటుందని  అంటున్నారు. అదే  జరిగితే ఈ కూటమి రాష్ట్రంలో గణనీయ సంఖ్యలో సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉంటాయంటున్నారు. 

ప్రగతి భవన్ కు ఈసీ నోటీసులు

బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయా? అంటే పరిస్థితులను గమనిస్తుంటూ ఔనని అనక తప్పదని పరిశీలకులు అంటున్నారు. గత ఎన్నికల నుంచి కారును పోలిన ఎన్నికల గుర్తులపై నానా యాగీ చేస్తున్న ఆ పార్టీకి ఇప్పుడిక ఆ విషయంపై నోరెత్తే అవకాశం లేకుండా పోయింది. కారును పోలిన ఎన్నికల గుర్తులను ఏ ఇతర పార్టీకీ కేటాయించకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరతూ సుప్రీంను ఆశ్రయించిన బీఆర్ఎస్ కు అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. ఇక ప్రగతి భవన్ వేదికగా పార్టీ కార్యకలాపాలూ ఎన్నికల ప్రచార వ్యూహాల రూపకల్పన జరుగుతోందంటూ కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై ఈసీ ప్రగతి  భవన్ కు నోటీసులు పంపింది. కాంగ్రెస్ ఫిర్యాదుపై స్టేట్ ఎలక్షన్ అధికారి  (ఎస్ఈవో) హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారితో భేటీ అయ్యారు. అనంతరం  కాంగ్రెస్ ఫిర్యాదును పరిగణనలోనికి తీసుకుని ప్రగతి  భవన్ లో జరుగుతున్న కార్యకలాపాలపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతూ ప్రగతి భవన్ నిర్వహణాధికారికి ఎన్నికల  సంఘం నోటీసులు పంపింది.  ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రభుత్వ భవనమైన సీఎం  క్యాంప్ కార్యాలయం అయిన ప్రగతి భవన్ ప్రభుత్వ భవనమనీ, ఆ భవనంలో పార్టీ కార్యక్రమాలు, కార్యక్రమాలు  నిషేధమనీ  ఆ నోటీసులో పేర్కొంది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన  నాటి నుంచీ రాష్ట్రంలో ఈసీ ఆదేశాలమేరకు చేపట్టిన తనిఖీల్లో పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే కాంగ్రెస్  ఫిర్యాదు చేసిన వెంటనే ఈసీ స్పందించడం, ప్రగతి భవన్ కు నోటీసులు పంపించడం చూస్తుంటే ఈ సారి ఎన్నికలలో అధికార దుర్వినియోగం, అక్రమాల వంటి వాటికి తావు లేకుండా ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు చేపడుతోందని అవగతమౌతున్నది. 2018 ఎన్నికలలో  బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి విదితమే. చివరాఖరికి  ఈవీఎంల విషయంలో, వాటి భద్రత విషయంలో కూడా అప్పట్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి, విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఈసీ ఈ  సారి అటువంటి వాటికి తావులేకుండా అన్ని  చర్యలూ తీసుకుంటున్నదని భావించాల్సి ఉంటుంది. ప్రగతి భవన్ కు నోటీసుల నేపథ్యంలో బీఆర్ఎస్ స్పందన ఏమిటన్నది చూడాల్సి ఉంది. 

ఎన్నికల గుర్తులపై బీఆర్ఎస్ కు సుప్రీంలో ఎదురుదెబ్బ

ఎన్నికల ముంగిట అధికార బీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీం కోర్టులో ఎన్నికల గుర్తులపై ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు శుక్రవారం (అక్టోబర్ 20) కొట్టివేసింది. గత ఎన్నికల నుంచీ కూడా బీఆర్ఎస్ తమ పార్టీ ఎన్నికల గుర్తు కారును పోలిన సింబల్ ను తొలగించాలని, ఇతరులెవరికీ కేటాయించవద్దని చెబుతైవస్తోంది. ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడంతో కారును పోలిన ఎన్నికల గుర్తులను రాష్ట్రంలో వేరెవరికీ కేటాయించకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం ఆ పిటిషన్ ను కొట్టివేసింది.  గత ఎన్నికల్లో తమ పార్టీపై తీవ్ర ప్రభావం చూపిన రోడ్డు రోలర్ వంటి కారును పోలిన సింబల్స్‌ను ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది. అయితే గుర్తుల తొలగింపు కుదరదని ఈసీ బదులిచ్చింది. తాజాగా ఈసీ విడుదల చేసిన గుర్తుల జాబితాలో రోడ్డు రోలర్ సహా బీఆర్ఎస్ అభ్యంతరం చెబుతున్న గుర్తులు యధాతథంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే గుర్తుల వివాదానికి సంబంధించి బీఆర్ఎస్ ఇటీవలే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే తొలి విచారణ సందర్భంగానే తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం కారు గుర్తును పోలిన వాటిని తొలగించాలని సుప్రీంకోర్టును ఆశ్రయిచింది. ఇందులో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రతివాదిగా చేర్చింది. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

 ప్రవళిక ఆత్మహత్య విపక్షాల కు  మరో అస్త్రం

 ప్రవళిక ఆత్మహత్య చూట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇది ఆత్మహత్య కాదు  ప్రభుత్వ హత్యేనని కాంగ్రెస్ వాదిస్తోంది. ప్రవళిక ఆత్మహత్య చేసుకున్న కొద్ది సేపటికే ఆమె బస చేస్తున్న హస్టల్ ప్రాంగణంలో తల్లి కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించింది. పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన తెలంగాణ సర్కార్  ప్రవళిక కుటుంబంను ప్రగతి భవన్ కు పిలిపించుకుంది. ప్రగతి భవన్ లో బిఆర్ఎస్ స్వంత చానల్ కు ఆమె తల్లి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇచ్చిన స్టేట్ మెంట్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు, ప్రగతి భవన్లో ఇచ్చిన ఇంటర్వ్యూకు పరస్పరం విరుద్దంగా  ఉండటంతో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ప్రగతి భవన్ మెట్లు ఎక్కడానికి మంత్రులను సైతం అనుమతించని కెసీఆర్ ప్రవళిక కుటుంబాన్ని ప్రగతిభవన్ కు హడావిడిగా పిలిపించుకుని ఏం చర్చలు జరిపినట్టు అని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. నేరుగా కెసీఆర్, కెటీఆర్ ఆమె కుటుంబ సభ్యులను బెదిరించినట్లు సోషల్ మీడియా కోడైకూస్తుంది. ఏ ఒక్క చానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వకుండా ప్రభుత్వం జాగ్రత్త పడింది. కాలర్ మైక్ లో తల్లి స్టేట్ మెంట్ రికార్డు చేసి అధికార పార్టీ చానెల్ లో ప్రసారం చేసింది ప్రభుత్వం. ఇంటర్వ్యూ సమయంలో అధికార పార్టీ స్వంత చానల్ లోగో కనబడకుండా ప్రసారం చేయడం గమనార్హం. ఇదే రికార్డ్ ఫుటేజిని ప్రభుత్వం అన్ని చానల్స్ , యూట్యూబ్ చానల్స్ కు  విడుదల చేసింది.   ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడానికి గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయడమేనని ఆమె తల్లి అన్ని చానల్స్ , పత్రికలకు  ఆత్మహత్య చేసుకున్న రోజు  చెప్పారు. ఇంతలో రాహుల్ గాంధి, ప్రియాంక గాంధీ ములుగు సభకు రానున్నట్లు తెలిసి బిఆర్ఎస్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ప్రవళిక అన్నయ్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఆశ చూపింది. గ్రూప్ 2 పరీక్షలు ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడ్డాయి.ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్నట్లు ప్రభుత్వానికి ముందే తెలుసు. అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయని తెలిసే గ్రూప్ 2 పరీక్షలు అనౌన్స్ చేసింది. ఎన్నికల కోడ్ అమలు కావడంతో టీఎస్ పిఎస్ సి గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేసింది. నేను కొట్టినట్టు చేస్తాను నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అన్నట్టు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షలను ఎగ్గొట్టడానికే డ్రామా ఆడినట్లు తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. కూలినాలి చేసుకునే ప్రవళిక కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే తెలంగాణ ప్రజలు హర్షిస్తారు. కానీ మంత్రి కెటీఆర్ ప్రవళిక ఆత్మహత్య కు గ్రూప్ 2 పరీక్షలు కారణం కాదని చెప్పే ప్రయత్నం చేశారు. అసలు ఆమె ఎలాంటి కాంపిటేటివ్ పరీక్షలకు హజరు కాలేదని అబద్దాలు చెప్పారు.  గ్రూప్  2 పరీక్షలకు కనీసం అప్లయ్ కూడా చేసుకోలేదని స్టేట్ మెంట్ ఇచ్చారు. వాస్తవాలు తెలుసుకోకుండా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. కానీ రాజకీయం చేస్తుంది బిఆర్ఎస్ ప్రభుత్వమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అప్లయ్ చేయకపోతే ప్రవళిక కు హాల్ టికెట్ నెంబర్ ఎలా వచ్చింది అని  ప్రతి పక్షాలు  ప్రశ్నిస్తున్నాయి. పైగా కెటీఆర్ స్టేట్ మెంట్ ప్రవళిక క్యారెక్టర్ అసాసినేషన్  చేసే విధంగా ఉంది. ప్రవళిక కు బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లు, అతను వేధించడం వల్లే ఆత్మ హత్య చేసుకున్నట్లు కెటీఆర్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. బాయ్ ఫ్రెండ్ వేధించడం వల్లే ప్రవళిక ఆత్మ హత్య చేసుకుందని, ఆమె ఏ ఒక్క పరీక్షకు అప్లయ్ చేసుకోలేదని తమ దర్యాప్తులో తేలిందని డిసిపి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. బాయ్ ఫ్రెండ్ వేధించడం వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నట్లు ఓ వైపు కెటీఆర్, డిసిపి చెబుతూనే ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఆశ పెట్టడం అంటే ప్రభుత్వం తన తప్పును అంగీకరించినట్లేనని అర్థం చేసుకోవాలి. గ్రూప్ వన్ ప్రశ్నా పత్రాల లీక్ తో బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల అగ్రహానికి గురైంది. తెలంగాణ జిల్లాల నుంచి నిరుద్యోగ యువత హైదరాబాద్ చేరుకుని వివిధ కోచింగ్ సెంటర్లలో లక్షల రూపాయలు చెల్లించి కోచింగ్ తీసుకుంటుంది. గ్రూప్ వన్ పరీక్షతో సహా  మిగతా పరీక్షలు వాయిదా పడటంతో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశ,  నిస్పృహలకు లోనైంది. ఏ ముఖం పెట్టుకుని స్వంత గ్రామాలకు వెళ్లాలి అనేది వారి ప్రశ్న. ప్రవళిక విషయంలో  అదే జరిగింది. ఆత్మహత్య చేసుకున్న రోజు ప్రవళిక  తన తల్లికి ఫోన్ చేసి గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడ్డాయని పేర్కొంది. పరీక్షలు వద్దు గిరీక్షలు వద్దు ఇంటికి వచ్చేయ్ అని తల్లి ఫోన్ లో చెప్పినప్పటికీ ఇక్కడే చిన్న ఉద్యోగం దొరికింది. హస్టల్ ఫీజు తానే కట్టుకుని  మళ్లీ పరీక్షలకు హాజరవుతానని చెప్పింది. కూలీ నాలీ చేసి బిడ్డ హాస్టల్ ఫీజు కట్టే తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాళనుకుంది ప్రవళిక. 15 కిలో మీటర్ల దూరం వెళ్లి ఉద్యోగం చేయడాన్ని తల్లి దండ్రులు వారించారు. బిడ్డ క్షేమం దృష్ట్యా వాళ్లు వారించి ఉండవచ్చు. కానీ  గ్రూప్ 2 పరీక్షల వాయిదాతో ప్రవళిక తీవ్ర డిప్రెషన్ కు గురైంది.  అదే రోజు తాను చిక్కడపల్లిలో ఉంటున్న హాస్టల్ లోనే ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులకు తీరని వేదనకు గురి  చేసింది.  ఒక్క గ్రూప్ 2 పరీక్ష కు మాత్రమే కాదు ఏ పరీక్ష కు హాజరు కాకుండా ప్రవళిక తిరిగి రాని లోకాలకు చేరుకుంది. యావత్ తెలంగాణ ప్రజలు ఈ సంఘటనకు చలించిపోయారు.  ప్రభుత్వ వ్యతిరేకత నిరుద్యోగ యువతలో బాగా పెరిగిపోయింది. ఆత్మహత్య చేసుకున్న మరుసటి రోజే ములుగు సభలో కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చింది. ప్రతీ సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలను కల్పించనున్నట్లు హామీ ఇచ్చిం. తెలంగాణలో దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువత  ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ వారిని ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు. సిక్స్ గ్యారెంటీస్ తో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ  మాంచి ఊపు మీద ఉంది. ప్రజల్లో దూసుకెళ్తుంది. వివిధ సర్వే ఫలితాలు కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తున్న నేపథ్యంలో ప్రవళిక ఆత్మహత్య బిఆర్ఎస్ ప్రభుత్వం చెడ్డ పేరు మూటగట్టుకుంది.

పనిమనిషిపై లైంగిక దాడి.. ప్రైవేట్ స్కూల్ మాజీ చైర్మన్ పై కేసు

మహిళలపై అత్యాచారాల నిరోధానికి ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా ఫలితం ఉండటం లేదు. నిర్భయ ఘటన తరువాత అత్యాచార  నిందితులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా  చట్టాన్ని సవరించినా ఫలితం లేకపోయింది. అన్నిటికీ మించి బాధితులపై ఒత్తిడి తీసుకువచ్చి, బెదరించి ఫిర్యాదే లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక వేళ బాధితురాలు ధైర్యం చేసి ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చినా రాజీ చేసుకోవడం మంచిదంటూ ఠాణాలోనే రాజీయత్నాలు జరుగుతున్న సంఘటనలు సమాజంలో మహిళల  భద్రత  ప్రశ్నార్థకం  చేస్తున్నాయి. తాజాగా విశ్వనగరం హైదరాబాద్ లో ఓ మహిళపై జరిగిన లైంగిక దాడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లైంగిక దాడికి ముందు, తరువాత కూడా ఆమెను బెదరించి ఫిర్యాదు చేయకుండా నిలువరించడానికి జరిగిన  ప్రయత్నాలూ వెలుగులోకి వచ్చాయి. విషయంలోకి వస్తే.. హైదరాబాద్  బంజారాహిల్స్ మిథిలానగర్ లో నివాసం ఉండే మురళి ముకుంద్ ఇంట్లో  ఓ ఏగ్రేడ్ ఏజెన్సీ ద్వారా పనిమనిషిగా చేరింది.  ఈ ఏడాది  జూన్ 18న ఆమె మురళి ముకుంద్ నివాసంలో పని మనిషిగా చేరింది. చేరిన నెల రోజుల నుంచే ఆమెకు వేధింపులు ఎదురయ్యాయి. పలు మార్లు ఈ విషయమై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినా ఫలితం లేకపోయింది. తాను పని చేస్తున్న ఇంటి యజమాని మురళి ముకుంద్ మామూలు వ్యక్తి  కాదు. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్. మురళి ముకుంద్ తో పాటు ఆయన కుమారుడు ఆకాష్ కూడా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధించే వారు. ఆ క్రమంలోనూ  జూలై 16 మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మురళి ముకుంద్ ఆమెను తన బెడ్ రూంలో బెడ్ షీట్ మార్చాలని ఆదేశించాడు. దీంతో ఆమె బెడ్ రూంలోకి వెళ్లగానే ఆమె ప్రతిఘటించేలోగానే రూం తలుపులు మూసేసి స్నానం చేయాల్సిందిగా ఒత్తిడి చేశారు. తిరస్కరిస్తే బెదరింపులకు దిగాడు. ఆమెను, ఆమె తల్లినీ చంపేస్తానని బెదరించడంతో ఆమె బాత్ రూంలోకి వెళ్లి స్నానం చేసింది. బాత్ రూంలో ఆమె స్నానం చేస్తుండగా తీసిన ఫొటోలు, వీడియోలూ చూపి బెదరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ  విషయాన్ని ఎవరికైనా చెబితే ఆమెను, ఆమె తల్లినీ చంపేస్తానని బెదరించాడు. ఆ తరువాత కూడా పలు మార్లు అత్యాచారానికి  పాల్పడటంతో భరించలేక విషయాన్ని  ఆ యువతి మురళీముకుంద్ కుమారుడు ఆకాష్ కు చెప్పింది. అయితే  ఆకాష్ బాధితురాలిని తీవ్రంగా కొట్టి విషయం బయటపెడితే చంపేస్తానని  బెదరించాడు. అంతే కాకుండా తమ ఇంట్లో సిమ్ కార్డ్ చోరీ చేసిందంటూ ఎదురు కేసు పెట్టారు. తనను తీవ్రంగా  కొట్టారంటూ ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేస్తే రాజీచేసుకోమని వారు ఆమెనే మందలించారు. దీంతో దిక్కుతోచక ఆమె మౌనంగా ఉండిపోయింది. ఆ సమయంలో తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని ఆమె పోలీసులకు చెప్పలేకపోయింది. చెబితే తననూ తన తల్లినీ చంపేస్తామని మురళి ముకుంద్, అతని కుమారుడు ఆకాష్ బెదరించడంతో మౌనంగా ఉండిపోయింది. తర్వాత కూడా అత్యాచార పర్వం కొనసాగిస్తుండటంతో ఆమె విషయాన్ని తల్లికి  చెప్పి ఆమెతో కలిసి ఈ  నెల 18న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలిని  భరోసా కేంద్రానికి తరలించిన పోలీసులు నిందితులు మురళీముకుంద్, అతని కుమారుడు ఆకాష్ పై కేసు నమోదు చేశారు. 

కదిలితే జైలు.. మెదిలితే నిర్బంధం.. ఏపీలో అప్రకటిత ఎమెర్జెన్సీ!

ఏపీలో ఎమెర్జన్సీ అమలవుతున్నదా అన్న అనుమానం జనంలో కలుగుతోంది.  ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు స్వేచ్ఛ. కానీ, ఇప్పుడు ఏపీలో ఆ స్వేచ్ఛ లేనే లేదు. అడుగడుగునా ఆంక్షలు, ఎక్కడా లేని సవాలక్ష నిబంధనలు, ఏం చేయాలన్నా అనుమతి లేదని నిరాకరించే పోలీసులు.  నిరసన మా హక్కు అని నిలదీస్తే కేసులు, జైలు అన్నట్లుగా ఉంది ఏపీలో పరిస్థితి.  రాష్ట్రంలో ఒక విధమైన అరాచకం రాజ్యమేలుతోంది. రాష్ట్రంలో కదిలితే జైలు, మెదిలితే నిర్బంధం అన్నట్లుగా పాలన సాగుతోంది. దేశానికి స్వాతంత్య్రం రాకముందు ప్రజల పరిస్థితి ఎలా ఉండేదో అందరికీ తెలిసిందే. బహుశా ఆనాడు బ్రిటీష్ వారి పాలనను చూసిన వారు ఇప్పుడు ఉండరేమో కానీ.. దాదాపుగా అందరం ఆనాటి పాలన, పరిస్థితుల గురించి చదువుకొనే ఉంటాం. ప్రతి దానికి పన్నులు, అడుగు తీసి అడుగు పెట్టాలంటే ఆంక్షలు, ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు వేసేవారు. కానీ, ఇప్పుడు ప్రతి మనిషి గౌరవప్రదంగా బ్రతికేలా రాజ్యాంగం హక్కులు కల్పించింది. అయితే   ఏపీలో ఆ హక్కులని ప్రభుత్వమే కాలరాస్తున్నది.   తమ హక్కులను రక్షించుకోవడం కోసం ప్రజలు నిరసనలు తెలపడం కూడా ఒక హక్కే. ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ప్రతిపక్షాలు, వివిధ రంగాల కార్మికులు ఇలా ఎవరైనా తమ నిరసన వ్యక్తం చేయవచ్చు. కానీ,  అలా నిరసన వ్యక్తం చేయడానికి ముందుకు వచ్చే వారిని అనుమతి లేదన్న పేరుతో పోలీసులు అడ్డుకుంటున్నారు. హౌస్ అరెస్టులు, అరెస్టులు, నిర్బంధాలు, కేసులతో వేధింపులకు గురి చేస్తున్నారు.  ధిక్కరించి నిరసన మా హక్కు అంటూ నినదించే అవకాశం లేకుండా  నిత్యం రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంది. అటు పోలీస్ యాక్ట్ 30 సైతం   అమలు చేస్తున్నారు.   ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించిన వారిపైనా, జీతాలు అడిగిన ఉద్యోగులపైనా  పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. ఎప్పుడూ వినని, ఎక్కడా చూడని కఠినమైన సెక్షన్లను తెరపైకి తెచ్చి అమలు చేస్తున్నారు.  ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి పోలీస్ సెక్షన్లను మళ్ళీ ఇప్పుడు తెరపైకి తెచ్చి కేసులు బుక్ చేస్తున్నారు. సీఎం ఆ రూట్ లో వస్తున్నారంటే కనుచూపు మేరలో మనిషి కనిపించకూడదు. ఏ మాత్రం అనుమానం వచ్చినా వారిని గృహ నిర్బంధం చేయడం లేదా జైలుకు తరలించడం. తమకు అన్యాయం జరిగిందని నిరసన తెలిపేందుకు రోడ్డుపైకి వస్తే కనీసం మనిషిలా కూడా చూడకుండా ఈడ్చుకెళ్లి స్టేషన్ లో పడేయడం.. అక్రమ సెక్షన్లను బుక్ చేసి జైలు పాలు చేయడం. ఇక  విపక్ష నాయకులదైతే మరీ దారుణ పరిస్థితి. అదుపులోకి తీసుకోమని పై అధికారుల ఆదేశాలంటూ పోలీసులు తీసుకెళ్లడం.. అసలు ఎక్కడకి తీసుకెళ్లారో కూడా తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందడం ఇప్పుడు ఏపీలో సర్వసాధారణంగా మారిపోయింది. అసలు ఎందుకు అరెస్ట్ చేసారో చెప్పమంటే పోలీసులు చెప్పే ఒకే ఒక్క సమాధానం ఉన్నతాధికారుల ఆదేశం. తాజాగా  తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తన తల్లిదండ్రుల పితృ కార్యాలను చేసుకోవడానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మీకు అనుమతి లేదంటూ వెనక్కు పంపించారంటే ఏపీలో ఎంతటి దౌర్భాగ్య స్థితి ఉందో అర్ధం చేసుకోవచ్చు.  వైసీపీ ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మగా మారిపోయిన పోలీసు వ్యవస్థ ప్రజలను తీవ్రంగా వేధిస్తుంది. రక్షించాల్సిన భటులే   భక్షక భటుల్లా మారిపోయారు. గతంలో ఏ ప్రభుత్వం ఇంతలా పోలీసులను ప్రయోగించిన దాఖలాలు లేవు.  వైసీపీ సర్కార్ మాత్రం పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని బ్రిటీష్ పాలనను  ప్రజలకు గుర్తు చేస్తున్నది. రాష్ట్రంలో అడుగడుగునా ఆంక్షలు అమలు చేస్తూ వైసీపీ పాలకులు రాక్షసానందం పొందుతున్నారు. ఇంతలా రాజ్యాంగ విరుద్ధమైన పాలన సాగుతున్నా.. ప్రజలను కాపాడేందుకు ఏ వ్యవస్థ కూడా ముందుకు రాలేని పరిస్థితి. జగన్ ఆడుతున్న రాజకీయ రాక్షస క్రీడలో పోలీస్ శాఖ పావుగా మారడం ఆందోళన కలిగిస్తున్నది. పగ, ప్రతీకారాల కోసమే ప్రభుత్వం పనిచేస్తున్నది. ఆ కార్యం తీర్చడానికి పోలీసులనే పావులుగా వాడుతున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

కుమారుడి విజయం కోసం టీటీడీ నిధులు.. భూమన భారీ స్కెచ్!?

గతంలో రాజకీయ నాయకులు ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ జేబులోని నగదు తీసి ఖర్చు పెట్టే వారు. అంటే సొంత డబ్బును ప్రజల కోసం వినియోగించేవారు. అయితే రానురాను  ఆ పరిస్థితి మారింది. ఏపీ సీఎం జగన్ భాషలో చెప్పాలంటే రివర్సైంది. దాంతో  రాజకీయమే కాదు.. రాజకీయ నాయకులూ మారిపోయారు. దీంతో ఈ నయా రాజకీయ నాయకులు సొంత సొమ్మును తమ ఇళ్లలోని ఇనపెట్టిల్లో, లేకుంటే బ్యాంకు లాకర్లలో.. అదీ కాకుంటే తమ బ్యాంకు ఖాతాల్లో భద్రంగా దాచుకోని..  ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న నగదును వివిధ పథకాల రూపంలో అదే ప్రజల కోసం వినియోగిస్తూ.. తమ జేబులో నుంచి కోట్లకు కోట్ల రూపాయిలు తీసి..చెల్లిస్తున్నట్లుగా  బిల్డప్ ఇస్తున్నారు.   అయితే టీటీడీ  చైర్మన్ కం తిరుపతి ఎమ్మెల్యే అయిన భూమన కరుణాకరరెడ్డి మాత్రం ఒక అడుగు ముందుకు వేసి  దేవుడికి ముడుపులు రూపంలో భక్తులు చెల్లిస్తున్న నగదును   ప్రజావసరాల  పేరుతో సొంత లాభం కోసం వినియోగించేందుకు వీలుగా  నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ నిర్ణయమే తీవ్ర వివాదాస్పదంగా మారింది.  విషయమేమిటంటే..  తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌,తిరుపతి ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షన తాజాగా  జరిగిన టీటీడీ  పాలక మండలి సమావేశంలో టీటీడీకి వార్షిక  బడ్జెట్‌ నిధుల్లో ఒక శాతాన్ని తిరుపతి అభివృద్ధి కోసం వినియోగించాలని  నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   శ్రీవారు కొలువు తీరిన తిరుమల కొండపై ఇప్పటికే ఆచార వ్యవహారాలు కొండెక్కాయని ఇప్పుడు దేవుడి నిధులను కూడా పక్కదారి పట్టించేయడానికి నిర్ణయం తీసుకున్నారని ఈ నిర్ణయంపై పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో  తన కుమారుడు  భూమన అభినయ్ రెడ్డికి టికెట్ ఇచ్చి గెలుపించుకొనేందుకే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ హోదాలు తిరుపతి అభివృద్ధికి  టీటీడీ బడ్జెట్ నుంచి నిధులు కేటాయించాలని నిర్ణయించారని అంటున్నారు.  అయినా టీటీడీ వార్షిక బడ్జెట్ వందల, వేల కోట్ల రూపాయిల్లో ఉంటుందని.. అందులో ఒక శాతం అంటే.. దేవుడి సొమ్ము కోట్లాది రూపాయిలు కైంకర్యం చేసేందుకు భూమన స్కెచ్ వేశారని అంటున్నారు.   అయినా దేశంలో ఎక్కడా కూడా దేవాలయాలపై వచ్చే సొమ్మును ఇతర అవసరాల కోసం ఖర్చు చేయడం  లేదని  గుర్తు చేస్తున్నారు. అదీకాక జగన్ ప్రభుత్వ ఖజానాలో నిధులు నిండుకొన్నాయని.. దీంతో రాష్ట్రంలోని ఏ పట్టణం, ఏ నగరం అభివృద్ధికి నోచుకోలేదని.. దీంతో దేవుడి నిధులు తిరుపతి అభివృద్ధికి మళ్లీస్తే.. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నగరాన్ని  అభివృద్ధి చేశానంటూ.. ప్రజలకు చెప్పుకుని, మా అబ్బాయిని గెలిపిస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తామని చెప్పుకుని ఓట్లు దండుకునేందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల శ్రీవారి సొమ్మును తిరుపతి అభివృద్ధి కోసం మళ్లించే నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయినా గతంలో  తాను నాస్తికుడినని బాహాటంగా చెప్పి.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని నల్లరాయి అన్న  భూమన   కరుణాకర్ రెడ్డికి టీటీడీ బోర్డ్ చైర్మన్ గా నియమించిన నాడే.. జగన్ పై విరమ్శలు వెల్లువెత్తాయి. వినాశకాలే విపరీత బుద్ధీ అంటూ నాడే నెటిజన్లు ఓ రేంజ్ లో జగన్ పై విమర్శలు గుప్పించారు.    పద్దతికే అసలు సిసలు బ్రాండ్ అంబాసిడర్‌లాగా నిలువు బొట్టు పెట్టి.. తనకు మాత్రమే సాధ్యమైన అభినయంతో మాట్లాడుతూ.. తాను గతంలో అన్న మాటలు జనం మరిచిపోయారన్న భ్రమలో  పరమ భక్తుడిలాగా బిల్డప్ ఇచ్చుకునే భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు టీటీడీ బడ్జెట్ నుంచి తిరుపతి అభివృద్ధికి నిధుల మళ్లింపు నిర్ణయంతో తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం.. ఓ ధార్మిక కేంద్రం అన్న సంగతిని ఈ ప్రభుత్వం ఎప్పుడో మరిచిపోయిందని.. ఇది ఓ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయిందని.. అదీకాక   టీటీడీని జగన్ సర్కార్ కామధేనువుగా భావించి ఇష్టారీతిన పద్ధతులు పాటించకుండా దోపిడీయే లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు అన్ని వర్గాల నుంచీ వస్తున్నాయి. ఇందుకు  తార్కానంగా ప్రభుత్వం ఇటీవల నియమించిన టీటీడీ బోర్డు సభ్యులను ఉదహరిస్తున్నారు.  అయినా కరుణాకర్ రెడ్డి తన కుమారుడి  విజయం కోసం దేవుడు సొమ్మును ఇలా వాడుకొవడం చూస్తుంటే.. ఆయన ఓ రాజకీయ ఘనపాటి అని వారు సెటైరికల్‌గా అభివర్ణిస్తున్నారు.  అదీకాక ఇప్పటికే టీటీడీ అంశంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై భక్తులు, విపక్షాలు మండిపడుతుండగా.. తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

జనసేనలో వైసీపీ స్లీపర్ సెల్స్!

ఏపీలో రాజకీయాలు ఇప్పుడు ఊహకు కూడా అందని విధంగా మారిపోతున్నాయి. మొన్నటి వరకూ వైనాట్ 175 అన్న అధికార పార్టీలో ఇప్పుడు బ్రతుకు జీవుడా అనే భావన కనిపిస్తుంది. నారా లోకేష్ పాదయాత్ర, తెలుగుదేశం అధినేత చంద్రబాబు యాత్రలతో తెలుగుదేశంలో ఉవ్వెత్తున ఎగసిపడే జోష్ కనిపిస్తుండగా.. అకస్మాత్తుగా చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారు. ఓ రెండు మూడు  రోజులు  మహా అయితే వారంలో చంద్రబాబు బయటకి వస్తారనుకోగా నెల గడిచినా వాయిదాలు కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబు జైలు పాలైతే తెలుగుదేశంను   దెబ్బతీయొచ్చని వైసీపీ భావించగా.. తెలుగుదేశం ఇప్పుడు అంతకు మించిన బలంగా ముందుకు సాగుతున్నది. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తుకు ఒకే చెప్పి సమరశంఖం పూరించడం, చంద్రబాబు అరెస్ట్ తర్వాత ప్రజలలో తెలుగుదేశంకు బలం పెరగడంతో వైసీపీ పరిస్థితి ఇప్పుడు కుడిలో పడ్డ ఎలుకలా మారిపోయింది.  నిజానికి తెలుగుదేశం, జనసేన పొత్తును వైసీపీ తొలి నుండి జీర్ణించుకోలేకపోతోంది. రెండు పార్టీలూ విడివిడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకు మేలు జరుగుతుందన్నది వైసీపీ భావన. అందుకోసమే ఈ పొత్తును చెడగొట్టాలని రకరకాల ప్రయత్నాలు చేసింది. చేస్తోంది. తెలుగుదేశంకు బీ టీమ్ జనసేన, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, దమ్ముంటే పవన్ ఒంటరిగా  పోటీ చేయాలంటూ రెచ్చగొట్టే పని చేశారు. కానీ, పవన్ నా పార్టీ నా ఇష్టం మీరెవరు చెప్పేందుకు అంటూ గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు. మాటలతో పని కాకపోవడంతో వైసీపీ కుట్ర పూరితంగా ఈ పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు పన్నాగం పన్నినట్లుగా రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. జనసేన టార్గెట్ గా వైసీపీ తెర వెనక రాజకీయం నడిపిస్తున్నట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఓ కుట్ర పన్ని జనసేన పార్టీకి భారీ నష్టం చేకూరేలా అమలు పరుస్తున్నట్లు చెప్తున్నారు. సాధారణంగా టెర్రరిజంలో స్లీపర్ సెల్స్ అని ఒక విభాగం ఉంటుంది. వీళ్ళు సామాన్య ప్రజలలో కలిసిపోయి తీవ్రవాదుల కోసం పనిచేస్తుంటారు. అవసరమైన సమయంలో వీళ్ళు ఆత్మహుతి దాడులకు సిద్దపడి అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంటారు. తీవ్రవాదులు తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసమే వీరికి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళకి కావాల్సినట్లుగా తయారు చేసుకుంటారు. ఇప్పుడు ఏపీలో సైతం వైసీపీ జనసేనపై ఇదే తరహా కుట్రకు తెరతీసినట్లుగా తెలుస్తుంది. గత రెండు మూడేళ్లుగా కొందరు వైసీపీ సానుభూతి పరులైన నేతలను ముందుగా జనసేనలోకి పంపించి.. అవసరమైనప్పుడు వారిని జనసేనలో రెబల్స్ గా తెరపైకి తెస్తారు. ముందుముందు వాళ్ళతో రాజీనామాలు చేయించి మిగతా నాయకులలో అభద్రతా భావం కలిగిచడం, తద్వారా రాజకీయ శూన్యత సృష్టించి తెలుగుదేశంతో పొత్తు లక్ష్యాన్ని దెబ్బతీయడమే వైసీపీ వ్యూహంగా కనిపిస్తోందంటున్నారు. అలా చేయడం ద్వారా  రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ  చూస్తున్నట్లు తెలుస్తుంది. తాడేపల్లి ప్యాలెస్ వేదికగా ఈ వ్యూహం రూపొందిందని  అంటున్నారు. తెలుగుదేశంతో పొత్తుపై పవన్ ప్రకటన అనంతరం జనసేనలో వైసీపీ భావాలు కలిగిన నేతలు విభిన్నంగా స్పందించారు. అధినేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ.. ఒకరిద్దరు నాయకులు పార్టీకి రాజీనామా చేసి మీడియాకి ఎక్కి పార్టీ ముఖ్యనేతలపై తీవ్ర విమర్శలకు దిగారు. మరి కొందరు వారిని సమర్ధిస్తూ పార్టీలోనే కొనసాగుతూ విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి వారిపై దృష్టిసారించిన జనసేన నాయకత్వం.. పార్టీ అధినేత నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. దీంతో వాళ్ళు వ్యూహాత్మకంగా వెనక్కు తగ్గారు. అయితే, ముందు ముందు సీట్ల సర్దుబాటు సమయంలో వీళ్ళు మరోసారి రెచ్చిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. కనుక, వీళ్ళని ముందుగానే గుర్తించి వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. లేకుంటే జనసేనకు, తద్వారా జనసేన, తెలుగుదేశం కూటమికి నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

జనంలోకి భువనేశ్వరి

స్కిల్ కేసులో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దీంతో ఆయన్ని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా.. చంద్రబాబుకు రిమాండ్ విధించింది.  ఆయన క్వాష్ పిటిషన్ పైసుప్రీంకోర్టు స్థాయిలో వాదనలు జరుగుతున్నాయి. అదలా ఉంటే  చంద్రబాబు అరెస్ట్‌ వార్త విని 105 మంది గుండె పగిలి చనిపోయారు. ఈ నేప్యథంలో వారి కుటుంబాలను పరామర్శించి.. ధైర్యం చెబుతానని నారా భువనేశ్వరీ గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన సత్యమేవ జయతే దీక్షలో ప్రకటించిన విషయం విదితమే. అందులోభాగంగా నిజం గెలవాలి పేరుతో ఓ కార్యక్రమాన్ని భువనేశ్వరీ చేపట్టనున్నారు.  అందులో భాగంగా జోన్‌కు ఒకటి చొప్పున అయిదు జోనుల్లో సభలు నిర్వహించి ఆ సభలలో భువనేశ్వరి పాల్గొనేలా ప్రణాళిక రూపొందించారు. వాటిలో భువనేశ్వరి పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.   అక్టోబర్ 21న టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేతలతో నిర్వహించే విస్తృత స్థాయి సమావేశంలో.. నారా భువనేశ్వరి, నారా లోకేశ్ ఎప్పుటి నుంచి.. ఎక్కడకెక్కడ ఈ కార్యక్రమాలు ప్రారంభించాలనే అంశంపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.  మరోవైపు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో.. నారా భువనేశ్వరి, నారా లోకేశ్, నారా బ్రహ్మణి ములాఖత్ అయ్యారు. ఈ సందర్బంగా భవిష్యత్తు కార్యాచరణపై చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఆ తర్వాత పార్టీ సీనియర్ నేతలతో నారా లోకేశ్ సమావేశమై.. పార్టీ కార్యక్రమాల స్పీడ్ పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు (బాబుతో నేను)  ఐ యామ్ విత్ బాబు కార్యక్రమాన్ని ఈ మాసాంతం వరకు కొనసాగించనున్నారు. అదేవిధంగా చంద్రబాబు అక్రమ అరెస్ట్, జగన్ అరాచకాలు, ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తెలిపే విధంగా కర్రపత్రాలను ముద్రించి.. ప్రజలకు అందించేందుకు పార్టీ సమాయత్తమైంది. ఇంకోవైపు గతంలో నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులోభాగంగా ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొంటూ నంద్యాలకు చేరుకున్నారు. ఆ సమయంలోనే చంద్రబాబును పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడంతో.. ఆ కార్యక్రమం తాత్కాలికంగా నిలిచిపోయింది. ఆ కార్యక్రమాన్ని నారా లోకేశ్ చేపట్టి.. కొనసాగించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.  ఇక చంద్రబాబు అరెస్ట్‌తో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు సైతం బ్రేకు పడింది. అయితే చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ యాత్రను లోకేశ్ పున: ప్రారంభించనున్నారని సమాచారం. ఓ వేళ నారా లోకేశ్ యువగళం పాదయాత్రను ఇప్పుడే పున: ప్రారంభిస్తే.. చంద్రబాబు నాయుడు కోసం మళ్లీ మధ్యలో న్యాయ సమీక్ష కోసం ఢిల్లీకి వెళ్లవలసి ఉంటుందని.. అటువంటి పరిస్థితుల్లో యువగళం పాదయాత్రకు మధ్యలో బ్రేకులు పడే అవకాశాలు ఉన్నాయని.. దీంతో చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత యువగళగం పాదయాత్రను నారా లోకేశ్ మళ్లీ చేపడతారని అంటున్నారు.

వ్యక్తిగత వైద్యునితో పరీక్షలు.. చంద్రబాబుకు ఏపీ హైకోర్టు అనుమతి

స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌  విచారణకు ఏపీ హై కోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్ విచారణ దసరా తరువాత చేపట్టనున్నట్లు తెలిపింది. అయితే ఒక విషయంలో మాత్రం చంద్రబాబుకు హైకోర్టు ఊరట కల్పించింది. చంద్రబాబు వ్యక్తిగత వైద్యునితో పరీక్షలకు అనుమతి ఇచ్చింది.   ఇక బెయిల్ పిటిషన్ విచారణను వెకేషన్ బెంచ్ కు బదలీ చేసింది.   కాగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో తీవ్ర అస్వస్థతకు గురైన చంద్రబాబుకు ప్రభుత్వ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఆ పరీక్షల వివరాలను జైలు అధికారులు గోప్యంగా ఉంచడం, వారు విడుదల చేసిన హెల్త్ బులిటిన్ లో సమగ్ర సమాచారం లేకపోవడంతో చంద్రబాబు కుటుంబసభ్యులు, తెలుగుదేశం శ్రేణులూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఆయనకు చేసిన వైద్య పరీక్షల వివరాలను బయటపెట్టాలనీ, అలాగే ఆయనకు ఇచ్చిన మందుల వివరాలను కుటుంబ సభ్యులకు తెలపాలనీ డిమాండ్ చేశారు. అయితే జైలు అధికారులు అందుకు అంగీకరించలేదు. ఆ తరువాత వైద్యులు చంద్రబాబు ఆరోగ్యపరిస్థితిపై సమగ్రనివేదికను సీల్డ్ కవర్ లో జైలు అధికారులకు వెల్లడించినట్లు బయటపడటంతో ఆ నివేదికను ఎందుకు గోప్యంగా ఉంచాల్సి వచ్చిందన్న ప్రశ్నలు తలెత్తాయి. చంద్రబాబు నెల రోజులలో ఐదు కిలోల బరువు తగ్గారని ఆయన సతీమణి భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. డయాబెటిక్ పేషెంట్ అయినా చంద్రబాబు సుగర్ లెవెల్స్ పరీక్షించకపోవడం, అలాగే ఆయనకు అందించిన చికిత్స, ఇచ్చిన మందులపై వివరాలు వెల్లడించకుండా గోప్యంగా ఉంచడంతో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు ఆయన వ్యక్తిగత వైద్యునితో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో తెలుగుదేశం వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.  ఇలా ఉండగా స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు శుక్రవారం(అక్టోబర్ 20)న తీర్పు వెలువరించనుంది.