‘భూమి వున్నంతవరకు అత్యాచారాలు వుంటాయి’

  ఈమధ్య కాలంలో రాజకీయ నాయకులకు నోటి దురద ఎక్కువైపోయింది. అత్యాచార సంఘటనలకు సంబంధించి సానుభూతిని వ్యక్తం చేయాల్సింది పోయి నోటికొచ్చినట్టు మాట్లాడ్డం అలవాటైపోయింది. మొన్నటి వరకూ ఉత్తరప్రదేశ్‌లోని ఎస్పీ నాయకులు అత్యాచారాల విషయంలో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ, తమ నోటి దురద తీర్చుకునేవారు. ఇప్పుడా బాధ్యతని తృణమూల్ కాంగ్రెస్ నాయకులు తీసుకున్నట్టున్నారు. అది కూడా ఒక మహిళా నాయకురాలు మమతా బెనర్జీ నేతృత్వం వహించే పార్టీ నాయకులు కూడా ఇలాగే మాట్లాడ్డం విషాదకరం. కోల్‌కతాలోని డైమండ్ హార్బర్ స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా వున్న దీపక్ హల్దర్ ఒక బహిరంగ సభలో అత్యాచారాల విషయంలో దారుణమైన కామెంట్లు చేశారు. ’అత్యాచారాలు ఇంతకు ముందు ఉన్నాయి, ఈరోజు ఉన్నాయి.. ఇంకా చెప్పాలంటే భూమి ఉన్నన్నాళ్లు ఉంటాయి’ అన్నారు. ఆ తర్వాత నాలుక్కరుచుకున్న ఆయన ఈ కామెంట్ చేయడం వెనుక తన ఉద్దేశం ప్రజల్లో అవగాహన కల్పించాలనే తప్ప వేరేది కాదంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. హల్దర్ వ్యాఖ్యలపై మాత్రం విపరీతమైన దుమారం రేగింది. ఇంతకుముందు కూడా అత్యాచారాలపై తృణమూల్ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ’సీపీఎం వాళ్లు మా కార్యకర్తల జోలికి వస్తే, వాళ్ళ ఇళ్లలో స్త్రీలను రేప్ చేయాలని మావాళ్లకు చెబుతాను’ అని ఎంపీ తపస్ పాల్ ఇంతకుముందు అన్నారు.

మణిపూర్ గవర్నర్ రాజీనామా

  యుపిఎ హయాంలో గవర్నర్లుగా నియమితులైన వారు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే మహారాష్ట్ర గవర్నర్ నారాయణన్, కేరళ గవర్నర్ షీలా దీక్షిత్ రాజీనామా చేశారు. వారు తమ పదవులను పట్టుకునే వుండాలని ప్రయత్నించినా ఎన్డీయే ప్రభుత్వం చాలా పట్టుదలగా వ్యవహరించడంతో రాజీనామా చేయక తప్పలేదు. ఇదే కోటాలో తాజాగా మరో గవర్నర్ రాజీనామా చేశారు. ప్రస్తుతం మణిపూర్ గవర్నర్‌గా వున్న వి.కె.దుగ్గల్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ల రాజీనామాల పరంపరలో ఇది తొమ్మిదో రాజీనామా. వి.కె.దుగ్గల్ తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపించారు. వి.కె.దుగ్గల్ మణిపూర్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసి చాలా కొద్దికాలమే అయింది. పదవిలో కుదురుకోకముందే ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కాగా, వి.కె.దుగ్గల్ గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశం మీద నియమించిన శ్రీకృష్ణ కమిటీలో కూడా సభ్యుడిగా పనిచేశారు.

పవన్ కళ్యాణ్‌కి అంత లేదు.. కవిత...

  సినీ నటుడు పవన్ కళ్యాణ్‌కి మెదక్ లోక్ సభ స్థానంలో తమ పార్టీని ఓడించేంత శక్తి లేదని టీఆర్ఎస్ నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత వ్యాఖ్యానించారు. మెదక్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కి ఎదురేలేదని ఆమె వ్యాఖ్యానించారు. మొన్నటి వరకు కాంగ్రెస్‌లో ఉన్న జగ్గారెడ్డి ఎన్ని రూపాయిలు ఇచ్చి బీజేపీ టిక్కెట్ కొనుకున్నారో వెల్లడించాలని కవిత బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. జగ్గారెడ్డి తరఫున కిషన్ రెడ్డి మాట్లాడటం విచిత్రంగా ఉందని అంటూ, తమపై మాపై విమర్శలు చేస్తే సహించేది లేదని బీజేపీ, టీడీపీలను కవిత హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలే మెదక్ ఉప ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తాయన్న నమ్మకాన్ని కవిత వ్యక్తం చేశారు. పవర్స్టార్ పవన్ కల్యాణ్కు దిమ్మదిరిగే ఫలితాలు ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఇచ్చారని కవిత గుర్తు చేశారు.

కేంద్రమంత్రి కొడుకు మీద హీరోయిన్ రేప్ కేసు...

  కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్‌గౌడ మీద రేప్ కేసు నమోదైంది. కార్తీక్ గౌడ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ కన్నడ సినీ నటి మైత్రేయ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కార్తీక్ గౌడపై పోలీసులు రేప్ కేసు నమోదు చేసి, బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల నివేదికలో కార్తీక్ గౌడ మైత్రేయని రేప్ చేసినట్టు రుజువైతే కార్తీక్ గౌడని అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి. తనను కార్తీక్ గౌడ్ రేప్ చేశాడంతో మైత్రేయ బుధవారం మీడియా ముందు తెలిపింది. ఒక స్నేహితుడి ద్వారా తనకు పరిచయమైన కార్తీక్ గౌడ తనను పెళ్లి చేసుకున్నట్టు నటించాడని, ఇప్పుడు తనపై అత్యాచారం జరిపాడని చెప్పింది. ఈ ఉదంతాన్ని కేంద్ర మంత్రి సదానందగౌడ ఖండించారు. తన కుమారుడి నిశ్చితార్థం రోజున ఇలాంటి ఆరోపణలు రావడం వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. కార్తీక్ గౌడ కూడా మైత్రేయ ఆరోపణలను తోసిపుచ్చాడు. తన తండ్రి ఉన్నతమైన వ్యక్తి అని, వివాదాల్లోకి లాగడం మంచిది కాదని వ్యాఖ్యానించాడు.

కేసీఆర్‌ని నిద్రపోనివ్వ... జగ్గారెడ్డి...

  మెదక్ పార్లమెంట్ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా జగ్గారెడ్డి పోటీ చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. బీజేపీ అభ్యర్థిగా జగ్గారెడ్డి ఎంట్రీతో మెదక్ ఉప ఎన్నిక రాజకీయం రసకందాయంలో పడింది. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి కేసీఆర్ మీద కామెంట్లు చేశారు. మెదక్ ఎంపీగా తనను గెలిపిస్తే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను నిద్రపోనివ్వనని, ఆయున ఫామ్‌హౌస్‌లో పడుకున్నా ప్రజా సమస్యలపై పోరాడి నిద్దురలేపుతానని జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన బీజేపీ, టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జగ్గారెడ్డి పై విధంగా కామెంట్ చేశారు. ‘‘దొంగమాటలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట. హైదరాబాద్‌ని సింగపూర్ చేస్తానని చెబుతున్న ఆయన భవిష్యత్తులో సింగపూర్ నుంచే తెలంగాణకు నీళ్ళు తీసుకొస్తానని చెప్పినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’’ అన్నారు. మొత్తానికి ఘాటు కామెంట్లు చేసే జగ్గారెడ్డి ముందు ముందు కేసీఆర్ మీద ఇంకెంత ఘాటైన కామెంట్లు చేస్తారోనన్న ఆసక్తి రాజకీయవర్గాల్లో ఏర్పడింది.

కేసీఆర్ కరెక్ట్ మొగుడు జగ్గారెడ్డి: రేవంత్ రెడ్డి

  మెదక్ లోక్‌సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో భారతీయ జనతాపార్టీ అభ్యర్థిగా తూర్పు జయప్రకాష్ రెడ్డి (జగ్గారెడ్డి) పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మెదక్ జిల్లాలో బాగా పేరు ప్రతిష్టలు వున్న నాయకుడు కావడం, టీడీపీ మద్దతు కూడా వుండటం, కాంగ్రెస్ పార్టీలోని కేడర్ జగ్గారెడ్డికి అనుకూలంగా వుండటంతో జగ్గారెడ్డి గెలుపు సాధ్యమన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి అభ్యర్థిత్వం గురించి బీజేపీ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి కరెక్ట్ మొగుడు జగ్గారెడ్డి అని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. అలాగే నిజాయితీగా ఉద్యమంలో పాల్గొన్న వారిని పక్కనపెట్టిన కేసీఆర్ తనకు కోట్ల రూపాయలు ఇచ్చినవారికే ఎన్నికలలో టిక్కెట్లు ఇస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

రాజధాని విషయంలో గందరగోళం లేదు.. మంత్రి..

  ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటు ఎక్కడ అనే విషయంలో ఎలాంటి గందరగోళం లేదని వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఆయన రాజధాని గురించి మాట్లాడారు. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి పూర్తి స్పష్టతతో వున్నారని, అందువల్ల నూతన రాజధాని ఏర్పాటుపై విభిన్న ప్రకటనలు చేయొద్దని పుల్లారావు తోటి మంత్రులకు సూచించారు. రాజధానిపై ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ గురించి ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చూసుకుంటారని పుల్లారావు వెల్లడించారు.

నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య

  కృష్ణాజిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. క్యాంపస్‌లో వున్న పెద్ద భవనం మీద నుంచి దూకి ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన విద్యార్థిని పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరుకు చెందిన శ్రీకాంత్ ప్రసన్న కుమార్‌గా గుర్తించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడి కాలేదు. అయితే చదువులో వెనుకబడి వున్న కారణంగానే శ్రీకాంత్ ప్రసన్న కుమార్ ఆత్మహత్య చేసుకుని వుంటాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఇది రెండోసారి. పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో నవీన్ అనే విద్యార్థి కూడా భవనం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

లాలూ గుండెకి మూడు రంధ్రాలు

  రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గుండెకు సంబంధించిన వ్యాధితో ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. లాలూ ప్రసాద్ గుండె పనితీరును గమనించిన వైద్యులు ఆయనకు తప్పనిసరిగా ఆపరేషన్ చేయాలని నిర్ధారించారు. బుధవారం నాడు ఆయనకు ఆరుగంటల సేపు గుండె ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. లాలూ ప్రసాద్ యాదవ్ గుండెకు మూడు మిల్లీ మీటర్ల వ్యాసార్థం వున్న మూడు రంధ్రాలు పడ్డాయని, ఆపరేషన్‌ ద్వారా ఆ రంధ్రాలను పూడ్చామని వైద్యులు తెలిపారు. ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ హెడ్ డాక్టర్ రమాకాంత పాండా ఆధ్వర్యంలో లాలూ ప్రసాద్ యాదవ్‌కి ఆపరేషన్ జరిగింది. ఐదు సంవత్సరాల క్రితం అప్పటి భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ గుండెకు కూడా రమాకాంత పాండానే ఆపరేషన్ చేశారు.

మెదక్ స్థానానికి 18 నామినేషన్లు

  మెదక్ పార్లమెంట్ స్థానానికి మొత్తం 18 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన బుధవారం నాడుమొత్తం 13 నామినేషన్లు దాఖలయ్యాయి. మెదక్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డి రంగంలో వున్నారు. అలాగే బీజేపీ నుంచి అనూహ్యంగా జగ్గారెడ్డి తెరమీదకి వచ్చారు. ఆయన బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బీజేపీలో చేరడంతోపాటు మెదక్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కూడా ఎంపికై నామినేషన్ ‌కూడా దాఖలు చేశారు. ఈ ముగ్గురు మినహా మిగతా గుర్తింపు పొందిన పార్టీలేవీ ఈ స్థానం నుంచి పోటీ చేయడం లేదు. వైసీపీ కూడా ఈ స్థానం నుంచి పోటీ చేసే ఆసక్తి చూపించలేదు.

ఏదీ తేల్చని రాజధాని నివేదిక?

  ఆంద్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశం మీద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. ఈరోజుగానీ, గురువారం గానీ ఈ నివేదికను కమిటీ కేంద్ర హోంశాఖకు సమర్పించనుంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఏర్పాటు ఏ ప్రాంతంలో అయితే బాగుంటుందన్న అంశం మీద కమిటీ అనేక ప్రతిపాదలను పరిశీలించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో పర్యటించింది. అయితే శివరామకృష్ణన్ కమిటీ తన నివేదికలో ‘ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఫలాచా చోట పెట్టండి’ అని స్పష్టంగా చెప్పలేదని తెలుస్తోంది. శ్రీకృష్ట కమిటీ నివేదిక తరహాలోనే శివరామకృష్ణన్ కమిటీ కూడా ఏప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే లాభాలేంటి, నష్టాలేంటని మాత్రమే చెప్పిందని, రాజధాని విషయంలో పలు ప్రతిపాదనలు చేసిందని తెలుస్తోంది.

ఈరోజు రెండు చందమామలు హంబక్...

  ఈరోజు (ఆగస్టు 27, 2014) నాడు ఆకాశంలో రెండు చందమామలు కనిపిస్తాయని, వాటిలో ఒక చందమామ మనకు ఎప్పుడూ కనిపించే చందమామ కాగా, మరో చందమామ భూమికి బాగా దగ్గరగా వచ్చిన అంగారక గ్రహం అని, బుధవారం అర్ధరాత్రి పన్నెండున్నర దాటిన తర్వాత ఆకాశంలో రెండు చందమామలు కనిపిస్తాయన్న ప్రచారం ఈమధ్యకాలంలో బాగా జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ విషయం బాగా ప్రచారంలో వుంది. దాంతో ఆకాశంలో రెండు చందమామలు కనిపిస్తాయట, మళ్ళీ అలా కనిపించేది ఇంకో మూడువేల సంవత్సరాల తర్వాతేనట అని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఈరోజు అర్ధరాత్రి పన్నెండున్నర కావడం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ప్రచారం అంతా హంబక్ అని తేలిపోయింది. బుధవారం నాడు అంగారక గ్రహం భూమికి దగ్గరగా వచ్చే మాట వాస్తవమేగానీ, అది మరో చందమామలా కనిపించేంత దగ్గరకి రాదని, ఆకాశంలో అంగారక గ్రహం ఉన్నచోట కాస్త ఎక్కువ వెలుగు వుంటుంది తప్ప, చందమామ స్థాయిలో పూర్ణ బింబం ఏమీ కనిపించదని బెంగుళూరులోని జవహర్‌లాల్ నెహ్రూ ప్లానిటోరియం శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. అందువల్ల బుధవారం అర్ధరాత్రి ఆకాశంలో రెండు చందమామలు కనిపించకపోతే నిరాశపడొద్దని మనవి...

16 ఏళ్ళ యువతిని కాల్చి చంపారు...

  అస్సాంలో దారుణమైన సంఘటన జరిగింది. పదహారేళ్ళ యువతిని బోడోలాండ్ మిలిటెంట్లు ఇంట్లోంచి బయటకి లాక్కొచ్చి, ఆమెని శారీరకంగా తీవ్రంగా హింసించి, చివరికి ఆమె తల్లిదండ్రుల ముందే ఆమెని దారుణంగా కాల్చి చంపారు. ఆ యువతిపై మిలిటెంట్లు తొమ్మిది రౌండ్లు కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. అస్సాంలోని చిరంగ్ జిల్లాలో ఇండో - భూటాన్ సరిహద్దులోని ద్విముగ్రి గ్రామంలో ప్రియ అనే ఈ యువతిని పోలీసు ఇన్ఫార్మర్‌గా అనుమానించిన నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ఆఫ్ బోడోలాండ్ తీవ్రవాదులు ఈ దారుణ చర్యకు పాల్పడ్డారు. మిలిటెంట్లు చంపిన తర్వాత ఆమె మృతదేహం రెండు రోజులపాటు పొలాల్లోనే ఉండిపోయింది. మిలిటెంట్లకు భయపడిన ప్రియ తల్లిదండ్రులు ఆమె మృతదేహం దగ్గరకి వెళ్ళడానికి కూడా భయపడిపోయారు. చివరికి మిలిటెంట్లు అనుమతి ఇవ్వడంతో ప్రియ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

నా కుమారుడిపై పుకార్లలో నిజం లేదు... రాజ్‌నాథ్

  కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్ అవినీతిపరుడని, చెడు ప్రవర్తన కలవాడని, అందువల్లే అతనికి గత ఎన్నికలలో నరేంద్రమోడీ టిక్కెట్ ఇవ్వలేదని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీటిని రాజ్‌నాథ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఈ పుకార్లను తాను ప్రధానమంత్రి దృష్టికి, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళానని, వారిద్దరూ ఈ పుకార్లను విని ఆశ్చర్యపోయారని చెప్పారు. తన కుమారుడి మీద వస్తున్న పుకార్లు నిజమని తేలితే తాను రాజకీయాల నుంచి తప్పుకోవడానికైనా సిద్ధంగా వున్నానని రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు. కాగా, రాజ్ నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్ మీద వస్తున్న పుకార్ల మీద ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. ఇవన్నీ గిట్టనివారు చేస్తున్న పుకార్లని, అవన్నీ అవాస్తవాలు, నిరాధారాలని, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి జరుగుతున్న ప్రచారాలని ప్రధానమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.

మంచు లక్ష్మి వివాదం.. బెల్లంకొండ వివరణ...

  ‘ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా’ సెట్‌ ‘రభస’ చిత్రం కోసం వినియోగించుకున్నందుకు తనకు 58 లక్షలు ఇస్తామని చెప్పిన బెల్లంకొండ సురేష్ ఇప్పుడు ఇవ్వనంటున్నారంటూ మంచు లక్ష్మి మనుషులు మంగళవారం రాత్రి బెల్లంకొండ ఇంటిముందు ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం మీద బెల్లంకొండ సురేష్ వివరణ ఇచ్చారు. ‘‘గతంలో తన బ్యానర్‌లో మంచు విష్ణుతో ఓ చిత్రం తీసేందుకు రూ.60 లక్షలు అడ్వాన్స్ ఇచ్చానని, కథ సిద్ధం కాకపోవడంతో ఈ చిత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ఆ డబ్బులను మంచు లక్ష్మీ ప్రసన్నకు ఇవ్వాల్సిందిగా మంచు విష్ణుకు చెబితే ఆయన సరేనన్నారు. కానీ, మంచు లక్ష్మీ ప్రసన్న మాత్రం అతనికి తనకు లింకు పెట్టొద్దనీ, తన డబ్బులు తనకు ఇవ్వాలని డిమాండ్ చేయడం ఎంతవరకు న్యాయం? మంచు లక్ష్మి, విష్ణు ఒకే కుటుంబానికి చెందినవారు కారా?’’ అని బెల్లంకొండ సురేష్ ప్రశ్నించారు.

వాకౌట్ చేశామని సభలోకి వచ్చారు.. యనమల డౌట్...

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్సార్సీపీ చాలా హడావిడి చేస్తోంది. బుధవారం అసెంబ్లీ సమావేశం కాగానే వైఎస్సార్సీపీ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దుచేసి తాము ప్రతిపాదించిన వాయిదా తీర్మానం మీద చర్చ జరపాలని పట్టుపట్టింది. అయితే స్పీకర్ కోడెల శివప్రసాద్ అందుకు తిరస్కరించారు. దానికి నిరసనగా వైఎస్సార్సీపీ నాయకులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అయితే కాసేపటికి వైఎస్సార్సీపీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ వచ్చి సభలో కూర్చున్నారు. వాకౌట్‌ చేసిన సభ్యులు తిరిగి ఎలా వస్తారంటూ మంత్రి యనమల ప్రశ్నించారు. వైసీపీ సభ్యులు అందరూ వెళ్లిపోయాక జ్యోతుల నెహ్రూ ఒక్కరే ఎందుకు కూర్చున్నారని... వారికి నిబంధనలు తెలియవా అని ప్రశ్నించారు. దీనిపై జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ నిరసన తెలిపి వాకౌట్‌ చేసిన మాట వాస్తవమే అని తమ నాయకుడు సహా సభ్యులందరం వాకౌట్‌ చేశామని చెప్పారు. అయితే రుణమాఫీపై వ్యవసాయ మంత్రి ప్రసంగం ముగిసిందని భావించి తాను సభలోకి వచ్చినట్లు జ్యోతుల నెహ్రూ సమర్థించుకున్నారు.