అమరావతి రైతులపై కేసుల ఉపసంహరణ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులకు బిగ్ రిలీఫ్ కలిగించింది. జగన్ హయాంలో వారిపై పెట్టిన కేసులను ఎత్తివేసింది.జగన్ హయాంలో అమరావతిని నిర్వీర్యం చేస్తూ మొదలు పెట్టిన మూడు రాజధానుల విధానానికి వ్తయతికేకంగా చారిత్రాత్మక ఆందోళన చేసిన రైతులపై అప్పటి జగన్ సర్కార్ బనాయించిన కేసులను ఉపసంహరించుకుంది. ఈ మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి శుక్రవారం (జూన్ 20) ఉత్తర్వులు జారీ చేశారు. రైతులపైనే కాకుండా వేతనాల పెంపు కోసం ఆందోళన చేపట్టి ధర్నా చేసిన అంగన్ వాడీ కార్యకర్తలపై అప్పటి జగన్ ప్రభుత్వం బనాయించిన కేసులను కూడా ఉపసంహరించుకుంటున్నట్లు హోంశా ఆ ఉత్తర్వులలో పేర్కొంది.   ఈ నిర్ణయంతో అమరావతి రైతులకు, అంగన్‌వాడీ కార్యకర్తలకు భారీ ఊరట దక్కింది. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయం ముందు అమరావతి రైతులు అప్పట్లో నిరసన తెలిపారు.దీంతో   జగన్ ప్రభుత్వం వారిపై కేసులు పెట్టింది. 2020 ఆగస్టు 26న గవర్నర్‌పేటలోని సీఆర్‌డీఏ కార్యాలయం దగ్గర రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ సందర్భంగా ప్రభుత్వం వారిని అడ్డుకుని అరెస్టు చేసింది. కేసులు పెట్టింది. ఆ కేసులను ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది.  

హనుమకొండ కోర్టు ఆవరణలో డిటొనేటర్లు

  హనుమ కొండ జిల్లా కోర్టు ఆవరణలో డిటొనేటర్లు లభ్యం కావడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి హనుమకొండ జిల్లా కోర్టు ఆవరణలో బాంబు ఉందన్న ఫోన్ కాల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో కోర్టు ఆవరణ అంతా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఆరు డిటొనేటర్లు లభ్యమయ్యయి. వాటిని స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి బాంబు బెదరింపు కాల్ రావడం, తనిఖీలు చేపట్టిన పోలీసులకు డిటొనేటర్లు లభ్యం కావడంతో లాయర్లు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.  ఇటీవలి కాలంలో హనుమకొండ కోర్టుకు బాంబు బెదరింపు రావడం ఇది మూడో సారి కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. 

అన్నా, చెల్లెలు.. మధ్యలో బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి

ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లు.. అన్న, చెల్లిల మధ్య పోరు వారి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని ఇక్కట్ల పాలు చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మాజీ సీఎం జగన్, ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల మధ్య ఇరుక్కుపోతున్న వైవీ సుబ్బారెడ్డి ఎటూ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారంట. మొన్న ఆస్తుల వివాదంలో.. నిన్న ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో వైవీ ప్రస్తావన తీసుకొచ్చారు షర్మిల. తన ఫోన్‌ను జగన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపిస్తూ.. వైవీని సాక్ష్యంగా చూపించారామె..  షర్మిల లేవనెత్తున్న అంశాలపై కౌంటర్‌ ఇచ్చేందుకు వైవీ సుబ్బారెడ్డి తెగ ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారంట. అటు మిగిలిన  వైసీపీ పెద్దలు కూడా షర్మిల లేవనెత్తిన అంశాలపై ఎలా స్పందించాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారంట. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ఇప్పటి వరకూ తెలంగాణకే పరిమితం అయిందనుకున్న తరుణంలో.. కాదు అటు ఏపీలోను ట్యాపింగ్ ఎపిసోడ్ కలకలం రేపుతోంది. గడిచిన ఐదేళ్లలో ఏపీకి చెందిన రాజకీయనాయకుల ఫోన్ ట్యాప్ అయ్యాయని జరుగుతున్న ప్రచారం వేడి పుట్టిస్తున్న తరుణంలోనే షర్మిల తెరపైకి వచ్చి తీవ్ర ఆరోపణలు చేశారు. ఇప్పటికే తన అన్న, మాజీ సీఎం జగన్‌తో షర్మిల విభేదిస్తున్నారు. పీసీసీ అధ్యక్షురాలిగా ఏపీ  రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఆమె జగన్‌ను ఒక రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు. దాంతో అన్నాచెల్లెల్ల మధ్య తీవ్ర అగాధం ఏర్పడింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన షర్మిల.. తర్వాత జగన్‌ పార్టీ 11 సీట్లకు పరిమితమై, ఆయనకు ప్రతిపక్ష నేత హోదా దక్కకుండా పోయిన తర్వాత కూడా అదే రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల కుటుంబ ఆస్తుల వ్యవహారాలకు సంబంధించి ఆమె తన అన్నపై తీవ్ర ఆరోపణలు చేశారు.  జగన్ సైతం తల్లి  విజయమ్మ, చెల్లి షర్మిలపై ఫిర్యాదులు చేశారు. ఆ వివాదం సద్దుమణగక ముందే షర్మిల ఫోన్ ట్యాపింగ్‌పై ఆరోపణలు గుప్పించడంతో అన్నాచెల్లెల్ల మధ్య బంధం పూర్తిగా తెగిపోయినట్లే కనిపిస్తోందంటున్నారు.  తన ఫోన్ ట్యాప్ చేసి రాజకీయంగా తన ఎదుగుదలను జీర్ణించుకోలేక కుట్రలు చేశారని వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్‌ ఇప్పుడు ఏపీ రాజకీయల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది ముమ్మాటికీ వాస్తవమని, ఈ వ్యవహారం అంతా అప్పటి  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కలిసి చేసిన జాయింట్ ఆపరేషనేమోనని షర్మిలఅనుమానాలు వ్యక్తం చేశారు.  ఆ ఫ్లోలో కేసీఆర్, కేటీఆర్, జగన్‌‌లకు ఉన్న సాన్నిహిత్యాన్ని షర్మిల వివరించారు. వారు చాలా మంచి సత్సంబంధాలు మెయింటెయిన్ చేశారని, వారి అనుబంధం మందు రక్తం సంబంధం కూడా చిన్నబోయిందని సెటైర్లు వేశారు . ఒకరి కోసం ఒకరన్నట్లు మెలిగేవారని ఎద్దేవా చేశారు. పనిలో పనిగా ఆస్తుల వివాదం సమయంలో ప్రస్తావించిన వైవీ సుబ్బారెడ్డి పేరుని ఫోన్ ‌ట్యాపింగ్ వ్యవహారంలో కూడా షర్మిల ఇరికించేశారు. తన ఫోన్ ట్యాపైన విషయాన్ని వైవీ సుబ్బారెడ్డే తనతో చెప్పారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తనకు వైవీ సుబ్బారెడ్డి చెప్పారని..అవసరమైతే బైబిల్ పై ప్రమాణం చేస్తానని షర్మిల అన్నారు. ఇటీవల కాలంలో పదేపదే వైవీ సుబ్బారెడ్డి పేరును షర్మిల ప్రస్తావించడం  వైసీపీ పెద్దలకు మింగుడు పడడంలేదంట. కీలకమైన అంశాలకు సంబంధించి తన పేరును ప్రస్తావించడం పట్ల  రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కూడా ఇబ్బంది పడుతున్నారట. ఇప్పటికే జగన్, షర్మిలకు మధ్య ఆస్తుల వివాదం నడుస్తోంది. ఆస్తుల పంపకాలపై రాజశేఖర్‌రెడ్డి ఆలోచనలు ఏంటో వైవీ సుబ్బారెడ్డికి స్పష్టంగా తెలుసని షర్మిల చేప్పారు. జగన్‌ ఒత్తిడితోనే వైవీ సుబ్బారెడ్డి వాస్తవాలను వక్రీకరించి మాట్లాడుతున్నారని కూడా షర్మిల అంటున్నారు. ఓ వైపు ఆస్తుల వివాదంలో తన పేరు తెరపైకి తీసుకోవడంతోనే ఇబ్బందిపడిన వైవీ సుబ్బారెడ్డి...తాజా ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో తన పేరు షర్మిల ప్రస్తావించడపట్ల వైవీ సుబ్బారెడ్డి మదన పడుతున్నారట. ఒకవైపు షర్మిల తనను సాక్షిగా పేర్కొంటూ నిజాలు చెప్పాలని డిమాండ్ చేస్తుంటే..  మరోవైపు వైవీ సుబ్బారెడ్డి మాత్రం షర్మిల ఆరోపణలను ఖండిస్తూ వస్తున్నారు. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో షర్మిల ఆరోపణలకు కౌంటర్‌గా ఎక్స్ లో స్పందించారు. షర్మిల ఫోన్ ట్యాప్ చేయాల్సినవసరం అప్పటి తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. గత తెలంగాణ ప్రభుత్వం షర్మిల ఫోన్‌ ట్యాప్‌ చేసిందని, వాటిని ఇక్కడ ముఖ్యమంత్రికి ఇచ్చారనడం చాలా హాస్యాస్పదంగా ఉందని వైవీ ట్వీట్లో పేర్కొన్నారు. గతంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉండగా, షర్మిల  తెలంగాణలో పార్టీ పెట్టి రాజకీయాలు నడిపారని, అప్పుడు జగన్‌కి, షర్మిలకి సంబంధాలు ఇప్పటిలా లేవన్నారు. అలాంటి పరిస్థితుల్లో షర్మిల ఫోన్‌ను ట్యాప్‌చేసి కేసీఆర్‌గారి ప్రభుత్వం ఇక్కడి సీఎంకు ఎందుకు ఇస్తుంది? అసలు కేసీఆర్‌గారి ప్రభుత్వం ట్యాప్‌చేసిందా? లేదా? అన్నది తనకు తెలియదన్నారు. తన పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి దీనిపై స్పందిస్తున్నానని పేర్కొన్నారు. అన్నాచెల్లెల్ల గొడవలపై బయటకు మాట్లాడ లేకపోతున్న బాబాయ్ ఎక్స్ ఖాతాలో తన గోడు వెల్లగక్కుతుండటం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా వైవీ సుబ్బారెడ్డి ఇద్దరి మధ్య ఇరుక్కు పోయారనే టాక్ నడుస్తోంది.

వంశీ.. జైలు నుంచి మళ్లీ ఆస్పత్రికి

వైసీపీ సీనియర్ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మరో మారు ఆస్పత్రిపాలయ్యారు. గురువారం (జూన్ 19) రాత్రి ఆయన అస్వస్థతకు గురి కావడంతో విజయవాడ జిల్లా జైలు నుంచి జైలు అధికారులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  వివిధ కేసులతో 3 నెలల క్రితమే అరెస్టై రిమాండ్ ఖైదీగా  జైలులో  ఉన్న వల్లభనేని వంశీ.. జైలులో పలుమార్లు అస్వస్థతకు గురయ్యారు. దీంతో తరచుగా ఆయనను అధికారులు జైలు నుంచి ఆస్పత్రికి.. ఆస్పత్రి నుంచి జైలుకు అన్నట్లుగా తిప్పితున్నారు. కోర్టు   ఇటీవలే మ ఇటీవలే సమగ్ర వైద్య పరీక్షల కోసం ఆయనకు కోర్టు మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసింది. దీంతో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆయను చికిత్స అందించి, ఆరోగ్యం కుదుటపడిన తరువాత తిరిగి జైలుకు తీసుకువచ్చారు.  తాజాగా గురువారం వంశీ   వాంతులు, విరేచనాలతో  డీహైడ్రేషన్ కు గురవ్వడంతో జైలు అధికారులు ఆయనను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.   

విమానం కూలిపోవడానికి కారణం అదేనా?

సాధారణంగా మనం బైక్ తీసుకుని బయలుదేరినప్పుడు ఒక్కోసారి పెట్రోల్ ట్యాంక్ స్విచ్ ఆన్ చేయడం మర్చిపోతుంటాం. అయినా బండి స్టార్ట్ అవుతుంది, ఓ ఫర్లాంగు దూరం నడుస్తుంది. ఆ తర్వాత ఆగిపోతుంది. సరిగ్గా అహ్మదాబాద్ లో టేకాఫ్ అయిన క్షణాలలోనే కుప్పకూలిపోయిన ఎయిర్ ఇండియా  విమానం విషయంలో ఇలాంటిదే జరిగివుంటుందని కొందరు నిపుణులు విశ్లేసిస్తున్నారు. 1,26,000 లీటర్ల ఇంధనం విమానం ట్యాంకులో నింపిన తర్వాత ట్యాంకు నుండి ఇంజనుకు ఇంధనం వెళ్లే స్విచ్ ఆఫ్ చేస్తారట. విమానం బయలుదేరే ముందు దానిని ఆన్ చేయడం మర్చిపోయి ఉంటారని అంటున్నారు.  పైపుల్లో ఉన్న ఇంధనం విమానం టేకాఫ్ అయి కొద్ది దూరం ప్రయాణిస్తుంది. ఆ తర్వాత ఇంధనంఅందక రెండు ఇంజన్లు ఆగిపోతాయి.  ఎందుకంటే.. విమానం సక్రమంగా గాల్లోకి లేచిందంటే ఇంజన్లు బాగున్నట్టే. ఒకేసారి రెండు ఇంజన్లు ఫెయిల్ కావడం జరగదు. ఇది కేవలం విశ్లేషణ కాదండోయ్. కొందరు నిపుణుల అంచనా. అయితే.. పెట్రోలు స్విచ్ ఆఫ్ లో ఉంటే పైలట్ కు ఇండికేటర్ సిగ్నల్ చూపించదా, అలాంటి టెక్నాలజీ ఏమీ ఉండదా అనేది సందేహం. విచారణ పూర్తయితేనే అసలు విషయం బయటకు వస్తుంది.

ఇరాన్ సెల్ఫ్‌గోల్ .. రంగంలోకి అమెరికా!

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య జరుగుతున్న యుద్ధంతో  పశ్చిమాసియా రగిలిపోతోంది.  అగ్రరాజ్యం అమెరికా రణ రంగంలోకి దిగనుందనే సంకేతాలు  ఉద్రిక్తతలను మరింత పెంచాయి.  ఇజ్రాయెల్ తరఫున అమెరికా గనక వార్ జోన్‌లోకి ఎంటరైతే పరిస్థితులు ఎలా మారబోతున్నాయన్నది ఉత్కంఠ రేపుతోంది.  మరోవైపు  ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చుతోంది.  పశ్చిమాసియా రణరంగంలా మారింది. ఇజ్రాయెల్‌,  ఇరాన్‌ పరస్పరం బాంబుల మోత మోగిస్తున్నాయి. ఇప్పటికే ఇరుదేశాల్లోని కీలక ప్రాంతాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు తమతో న్యూక్లియర్ ప్రోగ్రామ్‌కు ఒప్పందం కుదుర్చుకోవడం లేదన్న గుర్రుతో అమెరికా కూడా ఇరాన్‌పై కత్తులు నూరుతోంది. అదును చూసి దెబ్బకొట్టేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో  ఇరాన్‌ రాజకీయ నాయకత్వ మనుగడే ప్రశ్నార్థకంగా మారింది.  ఇంత జరుగుతున్నా.. ఇన్నాళ్లూ ఇరాన్‌ కు పాలు పొసి పెంచిన హమాస్‌, హెజ్‌బొల్లా, హూతీలు లాంటి ముసుగు సంస్థల జాడ కనిపించడం లేదు.  పశ్చిమాసియాలో ఓ బలమైన శక్తిగా ఎదిగిన ఇరాన్‌.. అనధికారిక సైన్యాన్ని పెద్ద ఎత్తున సమకూర్చుకుంది. పాలస్తీనాలో హమాస్‌, లెబనాన్‌లో హెజ్‌బొల్లా, యెమెన్‌లో హూతీలు, ఇరాక్‌లో కొన్ని ముసుగు సంస్థలను ఏర్పాటు చేసి.. ప్రత్యక్షంగా, పరోక్షంగా వాటికి సహకారం అందించింది. నేరుగా తాను యుద్ధ రంగంలోకి దిగకుండా.. శత్రుదేశాలపై వీరిని ఉసిగొల్పేది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌ , హమాస్‌ యుద్ధం మొదలైంది. ఆ ఉగ్ర సంస్థకు సాయం చేసేందుకు హెజ్‌బొల్లా ముందుకురావడంతో ఆ యుద్ధం బీరుట్‌ వరకు ఎగబాకింది. ఇజ్రాయెల్‌ ప్రతాపానికి హమాస్‌, హెజ్‌బొల్లాలోని అగ్రనాయకత్వం తుడిచిపెట్టుకుపోయాయి. ఆయా వర్గాల్లో అంతర్గత కుమ్ములాటలు కూడా మొదలైనట్లు తెలుస్తోంది. వారిని ఏకతాటి మీదకు తీసుకురావాల్సిన ఇరాన్‌లో ప్రస్తుతం అనిశ్చితి కొనసాగుతోంది. ఇప్పుడు ఎవరికివారే అన్నట్లుగా వ్యవహరించడంతో.. ఇరాన్‌ ఒంటరి పోరాటం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడి, సెల్ఫ్‌గోల్ చేసుకుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదలా ఉంటే ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య మొదలైన యుద్ధం క్రమంగా అగ్ర దేశాలను కూడా కదిలిస్తోంది. టెహ్రాన్‌ అణుకార్యక్రమాన్ని బూచిగా చూపి.. ఆ దేశంపై సైనిక చర్యకు దిగేందుకు అమెరికా సిద్ధమవుతోంది. సరైన సమయం కోసం వేచి చూస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్‌, ఇజ్రాయెల్‌ యుద్ధంలో అమెరికా సైనిక జోక్యం సరికాదని, ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది. ఈ మేరకు రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా మీడియాకు వెల్లడించారు. మరోవైపు ఇరాన్‌లోని బుషెహర్‌ అణువిద్యుత్‌ కేంద్రంపై ఇజ్రాయెల్‌ చేసిన దాడిపైనా రష్యా స్పందించింది. తక్షణమే దాడులను ఆపాలని ఆ దేశాన్ని కోరింది. లేదంటే చెర్నోబిల్ తరహా విపత్తు సంభవించే అవకాశముందని హెచ్చరించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ మిలటరీ అధికార ప్రతినిధి స్పందించారు. పొరపాటు వల్లే దాడి జరిగిందని వివరణ ఇచ్చారు. అయితే, బుషెహర్‌కు ప్రమాదం వాటిల్లిందా? లేదా? అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.

మరో విమానంలో సాంకేతిక లోపం

ఇటీవలి కాలంలో విమాన ప్రయాణమంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. అహ్మదాబాద్ లో విమానం కుప్పకూలిన ఘటనలో వందలాది మంది మరణించిన ఘటన మరువక ముందే పలు విమానాలలో సాంకేతిక లోపాల వార్తలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తాజాగా బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కు రావలసిన థాయ్ ఎయిర్ వేస్ కు చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ సాంకేతిక సమస్యను విమానం టేకాఫ్ కు ముందుగానే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. సరిగ్గా విమానం టేకాఫ్ అయ్యే సమయంలో సాంకేతికలోపాన్ని గుర్తించారు. దీంతో వెంటనే విమానాన్ని నిలిపివేశారు. ఆ విమాన ప్రయాణీకులను బ్యాంకాక్ ఎయిర్ పోర్టులోనే దింపేశారు.  

తిరుమల లడ్డూ ప్రసాదంలోనే కాదు.. ఆ దేవాలయాల ప్రసాదాల్లోనూ కల్తి నెయ్యి వినియోగం?!

తిరుమల లడ్డూ ప్రసాద తయారీలో కల్లీ నెయ్యి వినియోగం కేసు దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి  నెయ్యిని సరఫరా చేసినది బోలేబాబా డెయిరీ అనీ, ఈ డెయిరీ సరఫరా చేసినది అసలు నెయ్యే కాదనీ, నెయ్యిలా కనిపించే రసాయినాల మిశ్రమమనీ సిట్ నిర్ధారణకు వచ్చింది. అంతే కాకుండా  బోలేబాబా డెయిరీ.. తిరుపతి నగరంలోని ఓ డెయిరీని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలోని పలు ప్రముఖ ఆలయాలకు కూడా కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు సిట్ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు.   తిరుపతిలోని ఓ డెయిరీని అడ్డుపెట్టుకుని బోలేబాబా డెయిరీ కల్తీ నెయ్యిని విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల వంటి ప్రసిద్ధ దేవాలయాలకూ సరఫరా చేసినట్లు సిట్ ఆధికారులు గుర్తించారు. పేరుకు తిరుపతిలోని ఓ డెయిరీ ద్వారా నెయ్యి సరఫరా అయినప్పటికీ పరోక్షంగా బోలేబాబా డెయినీ సంస్థే ఆ నెయ్యిని సరఫరా చేసినట్లు సిట్ అధికారల దర్యాప్తులో ప్రాథమికంగా తేలినట్లు తెలుస్తోంది.  దీంతో ఇప్పటి వరకూ అంతా భావిస్తున్నట్లు తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలోనే కల్తీ నెయ్యి వినియోగం జరగలేదనీ, రాష్ట్రంలోని పలు ప్రసిద్ధ దేవాలయాల ప్రసాదం తయారీలోనూ కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్లు తేలింది.   

గిఫ్ట్ డీడ్ రద్దు.. వృద్ధ దంపతులకు న్యాయం!

ఆస్తిని పిల్లలకు పించి ఇచ్చేసిన తరువాత చరమాంకంలో పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకపోతే చట్టం చూస్తూ ఊరుకోదని చాటిన ఉదంతమింది. ప్రొద్దుటూరుకు చెందిన మలేపాటి మోహనరావు (86) ఆయన భార్య గౌరమ్మ (75)లు సొంతంగా వ్యాపారం చేస్తూ జీవనం సాగించే వారు. వారికి ఐదుగురు కుమార్తెలు. వయస్సు పై బడిన తరువాత ఆ దంపతులు తమ కుమార్తెలకు ఆస్తిని గిఫ్ట్ డీడ్ ద్వారా పంచి ఇచ్చేశారు. అప్పటి వరకూ వారిని ఎంతో ప్రేమగా చూసుకున్న కుమార్తెలు ఆస్తి పంపకాల తరువాత పట్టించుకోవడం మానేశారు. వయోవృద్ధులమైన తమకు న్యాయ చేయాలని కోరుతూ ఆ వృద్ధ దంపతులు జమ్మలమడుడు రెవెన్యూ డివిజనల్ అధికారి సాయిశ్రీకి మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన సాయిశ్రీ  వృద్ధుల సంరక్షణను పిల్లలు పట్టించుకోకపోతే చట్టం చూస్తూ ఊరుకోదు అనే సందేశాన్ని బలంగా ఇచ్చే    ఆ వృద్ధ దంపతులు తమ కుమార్తెలకురు కుమార్తెల ఆస్తి పంచి ఇస్తూ చేసిన గిఫ్ట్ డీడ్ ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.   మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్, 2007 చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు.  

లబ్ధిదారులపై దాడి చేసిన డిజిటల్ అసిస్టెంట్ పై చర్యలు

తల్లికి వందనం సొమ్ములు తమ ఖాతాలో జమకాలేదని అన్నందుకు లబ్ధిదారులపై దాడికి పాల్పడిన డిజిటల్ కలెక్టర్ పై కలెక్టర్ సీరియస్ అయ్యారు. అన్నమయ్య జిల్లా వడిగల వారి పల్లి గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న బాబా ఫక్రుద్దీన్ తల్లికి వందనం సొమ్ములు తమ ఖాతాలో పడలేదేంటని ప్రశ్నించిన గండువారిపల్లికి చెందిన అనురాధ ఆమె భర్త శంకర్  వారి కుటుంబ సభ్యులపై దురుసుగా ప్రవర్తించి దాడి చేశాడు. ఈ సంఘటన బుధవారం (జూన్ 18) జరిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం (జూన్ 19)న జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి శుక్రవారం (జూన్ 19) బాధితుల ఇంటికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. డిజిటల్ అసిస్టెంట్ పై కఠిన చర్యలు తీసుకుంటామని వారికి ధైర్యం చెప్పారు.   ఆ డిజిటల్ అసిస్టెంట్ పై శాఖపరమైన అన్ని రకాల చర్యలే కాకుండా క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని పేర్కొన్నారు.  బాధిత  కుటుంబానికి జిల్లా యంత్రాంగం అండగా నిలుస్తుందని వారి సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  

ఇద్దరు వృద్ద మహిళల దారుణ హత్య

గుంటూరు  జిల్లా తెనాలి ఇద్దరు వృద్ధ మహిళలు దారుణ హత్యకు గురయ్యారు.   తెనాలిలోని పరిమిడొంకలో నివాసం ఉంటున్న దాసరి రాజేశ్వరి, అంజమ్మ అనే వృద్ధురాళ్ళను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం(జూన్ 19) దారుణంగా హత్య చేశారు.   వీరిరువురూ అదే రోజు ఉదయం బంధువుల ఇంట్లో వివాహానికి హాజరై మధ్యాహ్నానికి ఇంటికి చేరుకున్నారు.  ఆ తరువాత హత్యకు గురయ్యారు.   స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.  వృద్ధుల ఒంటిమీద బంగారం లేకపోవడం, ఘటనా స్థలంలో పెనగులాట జరిగిన ఆనవాళ్ళు ఉండటం, వారి తలపై బలమైన గాయాలు ఉండటంతో.. బంగారం, నగదు కోసమే ఈ హత్య జరిగినట్టు అనుమానిస్తున్నారు.   స్థానికుల కథనం ప్రకారం గురువారం (జూన్ 19)మధ్యాహ్న సమయంలో   ముగ్గురు వ్యక్తులు  వృద్థురాళ్ల ఇంటికి వచ్చినట్లు చెబుతున్నారు. ఆ ముగ్గురిలో ఇద్దరు పురుషులు, ఒక స్త్రీ ఉన్నట్లు చెబుతున్నారు. బంగారం, నగదు కోసం వారే ఈ హత్యలు చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

అండమాన్ లో అంతులేని చమురు నిక్షేపాలు

పెట్రోల్ సమస్యకు  పెర్మనెంట్ సొల్యూషన్ కలిసోచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాని సామెత.. ఇప్పుడు మన దేశానికి అలాంటి కలిసొచ్చే  రోజులు వచ్చాయా? నడిచొచ్చే కొడుకు పుట్టే రోజు వచ్చేసిందా? అంటే  అవుననే అంటున్నారు  కేంద్ర పెట్రోలియం ,సహజ వనరుల శాఖ మంత్రి హరీదీప్ సింగ్ పూరీ. అవును  అండమాన్ ద్వీప సముద్ర గర్భంలో  బయట పడిన చమురు నిక్షేపాలు మన దేశ  చమురు కరవును శాశ్వతంగా తొలిగించేంత పెద్ద మొత్తంలో ఉన్నాయని  కేంద్ర మంత్రి  స్వయంగా చెప్పారు.  నీవినీఎరుగని రీతిలో, రెండు వేల సంవత్సరాల పాటు, మన దేశ చమురు అవసరాలను తీర్చగల స్థాయిలో  అడమాన్ లో చమురు నిక్షేపాలు ఉన్నట్టు చెపుతున్నారు.  నిజానికి, అండమాన్ ద్వీపంలో చమురు నిక్షేపాలున్న విషయం ఇప్పడు కాదు..  ఎప్పుడో, 1970- 80 దశకంలో అంటే ఇంచు మించుగా అర్థ శతాబ్దికి (50 ఏళ్ల) పూర్వమే గుర్తించారు. అయితే అప్పట్లో అధికారంలో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం కానీ, ఆ తర్వాత వచ్చి పోయిన ప్రభుత్వాలు కానీ ముందడుగు వేసే సాహసం చేయలేదు. బహుశా.. అప్పటికి ఉన్న సాంకేతిక, ఆర్ధిక పరిమితుల దృష్ట్యా.. అప్పటి ప్రభుత్వాలు ముందడుగు వేసి ఉండక పోవచ్చును.  అత్యంత సంక్లిష్ట వాతావరణ, భౌగోళిక పరిస్థితుల నడుమ..  అది కూడా సముద్ర గర్భం లోతుల్లోకి వెళ్లి చమురు నిక్షేపాలను వెలికితీయడం అప్పుడే కాదు, ఇప్పటికీ కొంత వరకు అసాధ్యమే.  అందుకే అప్పటి ప్రభుత్వాలు సాహసించి ముందడుగు వేయలేక పోయాయి కావచ్చును.   సరే. అదంతా గతం.  ప్రస్తుతం పరిస్థితులలో మార్పు వచ్చింది. ముఖ్యంగా..  గడచిన 11 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన మొదలు అంతరిక్ష పరిశోధనల వరకూ ప్రతి రంగంలోనూ, సాహసం చేయరా ...డింభకా టైపులో.. సాహసోపేత నిర్ణయాలతో ముందుకు సాగుతోంది. అందుకు తోడు ఈ రోజున ఆయిల్ రిఫైనరీలో మన దేశం, పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంలో చాలా వేగంగా ముందుకు సాగుతోంది. నిజానికి, ఆయిల్ రిఫైనరీ రంగంలో మన దేశం చమురుతో తలలు పండిన దేశాలకంటే చాలా  ముందు వరసలో వుందనీ.. అందుకే మోదీ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.  అవును..  ఏక కాలంలో 26 వేల బోర్లు వేసి, చమురు నిక్షేపాలను అన్వేషించడం అంటే మాములు విషయం కాదు. అయినా..  మోదీ ప్రభుత్వం సాహసించి ముందుగువేసింది. అదృష్టం ఎగసి పడింది. ఈ విషయాన్ని, కేంద్ర చమురు, సహజ వాయువుల శాఖ మంత్రి  హరిదీప్ సింగ్ పూరీ, ఒక అంగ్ల టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.  అయితే..  ఇల్లు అలకగానే పండగ రాదు, చమురు నిక్షేపాలు కనుగొన్నంత మాత్రాన, పెట్రోల్, డీజీల్ పెట్రోల్ బంకుల్లోకి, మన వాహనాల్లోకి వచ్చేయదు. ప్రభుత్వ ప్రైవేటు రంగ సహకారంతో, ఎంతో మెటిక్యులస్ గా ప్లాన్ చేస్తేనే కానీ  పని జరగదని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలైన, ఓఎన్జీసీ, భారత్, హెచ్ పీ, ఇండియన్ ఆయిల్ కంపెనీలు  చమురు తవ్వకాలు, నిర్వహణ బాధ్యతలను చూస్తున్నాయి. మరోవంక రిలయన్స్, నయారా వంటి ప్రైవేటు కార్పొరేట్ సంస్థలు చమురు రంగంలో చురుగ్గా పని చేస్తున్నాయి. సో.. ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంతోనే అండమాన్ ఆపరేషన్స్ చేపట్టాలని ప్రభుత్వం బావిస్తునట్లు మంత్రి చూచాయగా చెప్పారు.   అదలా ఉంచితే..  అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగి, అండమాన్  సముద్ర గర్భంలో దాగున్న  సుమారు 1,160 బిలియన్ బ్యారెళ్ళ చమురు నిక్షేపాలను వెలికి  తీయగలిగితే.. అత్యధిక చమురు నిల్వలు ఉన్న తొలి 20 దేశాల్లో మన దేశం స్థానం సముచిత స్థానం సంపాదించుకుంటుంది. అంతే కాదు..  ప్రస్తుత చమురు దిగుమతులు 85 శాతం మేర తగ్గి, రోజుకు కేవలం 15 శాతం మాత్రమే ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయవలసి వస్తుంది. అదే జరిగితే..  చమురు దిగిమతి వ్యయం ప్రస్తుత  రూ. 11 లక్ష కోట్ల నుంచి కేవలం రూ.1.75 లక్షల కోట్లకు దిగివస్తుంది. అంటే ఏటా.. నికరంగా . రూ. 9 లక్షల కోట్లు ఆదా అవుతాయి..  అంతే కాదు.. మనం మన చమురు ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు.  కలిసొచ్చే రోజొస్తే  .. నడిచొచ్చే బిడ్డడు పుడతాడంటే   ఇదే కదా.

పొలిటికల్ పుష్పగా ట్రోల్ అవుతున్న జగన్

రప్పా రప్పా డైలాగ్‌తో మాజీ ముఖ్యమంత్రి జగన్ సోషల్‌మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నారు. పుష్ష సినిమాలో డైలాగ్ చెప్పి, దాన్ని మీడియా సమావేశంలో మళ్లీ మళ్లీ చెప్పించుకుని మురిసిపోయిన వైసీపీ అధ్యక్షుడ్ని పొలిటికల్ పుష్ప అని నెటిజన్లు తెగ ఆడుకుంటున్నారు. అంతు చూస్తాం.. రప్పా రప్పా నరుకుతాం అంటూ పల్నాడులో భీతావహ వాతావరణానికి కారణమైన తమ పార్టీ కార్యకర్తల్ని మందలించాల్సింది పోయి వారిని వెనకేసు కొచ్చా రాయన.  రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్లకార్డులు ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. పైగా దానికో కొత్త భాష్యం చెప్పే ప్రయత్నం చేశారు. పుష్ప సినిమాలో డైలాగ్‌ కొట్టడం కూడా తప్పేనా? అంటూ మీడియా సమావేశంలో సమర్థించుకొచ్చారు.  జగన్ పల్నాడు పర్యటనలో గంగమ్మతల్లి జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టు నరికేస్తాం అని పోస్టర్‌ పెట్టారు. అది పుష్ప సినిమా డైలాగ్‌ అని దాన్ని అది పోస్టర్‌లో పెట్టినా తప్పేనా? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? పుష్పలో ఫొటోలు పెట్టినా, గడ్డం చేతితో రుద్దుకున్నా తప్పేనా? అని జగన్ దాన్ని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. అదేమంటే ఆ పోస్టర్‌ పట్టుకున్న వ్యక్తికి టీడీపీ సభ్యత్వం కూడా ఉందని.. టీడీపీ సానుభూతిపరుడు కూడా చంద్రబాబుపై కోపంతో మారాడని సంతోషం పడదామని విచిత్రమైన లాజిక్ వినిపించారు.  టీడీపీను రప్పా.. రప్పా కోసేస్తా అని అంటున్నాడని ఆనందపడదామని జగన్ వ్యాఖ్యానించడం గమనార్హం. వాస్తవానికి సదరు వైసీపీ కార్యకర్త రూ.5 లక్షల భీమా పథకం కోసమే టీడీపీ సభ్యత్వం తీసుకున్నాడంట. ఎన్నికల ముందు తన తండ్రి టీడీపీలో చేరుతుంటే తీవ్రంగా వ్యతిరేకించాడంట.  మొత్తానికి జగన్ తన వ్యాఖ్యలతో టీడీపీ నేతలకు గట్టిగానే టార్గెట్ అవుతున్నారు. ఓటమి నుంచి వైసీపీ నేతలు ఇంకా పాఠం నేర్చుకోలేదని, ఎందుకు ఓడిపోయామనే పరిశీలన కూడా చేసుకోలేదని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు. జగన్‌ పల్నాడు పర్యటనపై మీడియాతో మాట్లాడిన మంత్రి నక్సలైట్లను చూసి కలబడి నిలబడిన నాయకుడు చంద్రబాబు అని, జగన్ రౌడీలను సమీకరించి రాష్ట్రాన్ని భయపెట్టాలనుకుంటున్నారని విమర్శించారు. పోలీసు వ్యవస్థను ఉపయోగించి గతంలో అరాచకం చేశారని..అందుకే గతంలో జరిగిన అరాచకాలను ప్రజలు రప్పా రప్పా అని నరికారని ఎద్దేవా చేశారు.  ప్రభుత్వంపై కాదు.. ప్రజలపైనే వైసీపీ తిరుగుబాటు. రప్పా రప్పా అని ఎవరిని నరుకుతారు? ప్రజలనా? ఏడాది కిందట చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఇప్పుడు పరామర్శా? పరామర్శ పర్యటనలో ఇద్దరు చనిపోతే పరామర్శించలేదే. సొంత బాబాయి కుటుంబాన్ని జగన్‌ ఎందుకు పరామర్శించలేదని పయ్యావుల ప్రశ్నించారు.

ఎయిరిండియా విమాన ప్రమాదం.. డీఎన్‌ఏ టెస్టుల ద్వారా 202 మృతదేహాల గుర్తింపు

  అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర  విమాన ప్రమాదంలో మరణించిన వారిలో డీఎన్ఏ పరీక్షల ద్వారా 202 మంది మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు ధృవీకరించారు. ఇప్పటి వరకూ 157 మంది మృతదేహాలను వారి బంధువులకు అప్పగించినట్లు తెలిపారు.  జూన్ 12న అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే లండన్ వెళుతున్న బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది మరణించారు. అలాగే ఈ ప్రమాదంలో బీజే మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థులు కూడా మరణించారు.  మృతదేహాల గుర్తింపునకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థతి ఏర్పడింది. ఈ పరీక్షలు ఎప్పటికి పూర్తవుతాయా అన్న సందేహం మొదట్లో వ్యక్తమైంది. అయితే యుద్ధ ప్రతిపదికన ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చాలా వరకూ పూర్తి చేశారు.  మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అంత్యక్రియలు సోమవారం రాజ్‌కోట్‌లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ వంటి ప్రముఖ రాజకీయ నాయకుల సమక్షంలో ఆయన కుమారుడు రుషభ్ రూపానీ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మిగిలిన మృతదేహాల గుర్తింపు ప్రక్రియ, వాటిని కుటుంబ సభ్యులకు అప్పగించే కార్యక్రమం కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

సీనియర్ జర్నలిస్టు కంచర్ల రామయ్య కన్నుమూత

ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తండ్రి కంచర్ల రామయ్య కన్నుమూశారు. సీనియర్ జర్నలిస్టు, ఎపియుడబ్యుజె   రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు  కంచర్ల రామయ్య  గురువారం (జూన్ 19) మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో తీసుకుంటున్న ఆయన హైదరాబాద్ లో కిమ్స్ ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శుక్రవారం (జూన్ 20) ఉధయానికి ఆయన భౌతిక కాయాన్ని కందుకూరుకు తీసుకువెడతారు. కందుకూరులో శనివారం (జూన్ 21) ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.   ఎందరినో జర్నలిస్టులు గా తీర్చిదిద్ది, జర్నలిస్టు యూనియన్ లో కూడా క్రియాశీలకంగా వ్యవహరించిన రామయ్య మృతి తీరని లోటు అంటూ పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.  కంచర్ల రామయ్యకు ప్రజాసమస్యల పరిష్కారంకోసం కృషి చేయడంలో ఆయన ఎన్నడూ వెనుకడుగు వేసేవారు కాదు. జర్నలిస్టుగా ఆ పని చేసిన కంచర్ల రామయ్య మరింతగా ప్రజలతో మమేకం కావడానికి, వారి సమస్యల పరిష్కారంలో మరింత చొరవచూపడానికి చట్టసభలో అడుగుపెట్టాలని భావించే వారు. ఆయన కోరుకున్నట్లు ఆయనకు  కందుకూరు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని అప్పట్లో ఎన్టీఆర్ ఇచ్చారు. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా ఆయన నాడు పోటీ చేయలేదు. అయితే ఆయన కోరికను కుమారుడు కంచర్ల శ్రీకాంత్ తీర్చారు.  2023లో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.   చంద్రబాబు సంతాపం జర్నలిస్టుగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే కాకుండా, ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీని స్థాపించి విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన కంచర్ల రామయ్య మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

దోపిడీ కేసులో తిరుమలలో పని చేసే కానిస్టుబుల్ ను అరెస్టు చేసిన తమిళనాడు పోలీసులు

తిరుమలలో విధులు నిర్వహిస్తున్న  కానిస్టేబుల్‌ అరుణ్ కుమార్ ను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు.  ఓ వ్యాపార వేత్త నివాసంలో ఆయన భార్యపై దాడి చేసి దోపిడీకి పాల్పడిన కేసులో కానిస్టేబుల్ అరుణ్ కుమార్ సహా మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి.  తమిళనాడులోని వాణియంబాడిలో   తోళ్లపరిశ్రమ యజమాని ఇంతియాస్‌ అహ్మద్‌ ఇంట్లో మూడు రోజుల కిందట దోపిడీ జరిగింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా వాణియంబాడి పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించారు. చెన్నైకు చెందిన దోపిడీ ముఠా సభ్యులకు, ఇంతియాజ్ అహ్మద్ ఇంట్లో పని చేసే శక్తివేల్‌కు సంబంధం ఉన్నట్టు గుర్తించారు. శక్తివేల్‌తో పాటు తిరుపతికి చెందిన శాంతకుమారి, కొల్లకట్టై ప్రాంతానికి చెందిన ఇళవరసన్‌( ) సహా నలుగురికి సంబంధం ఉన్నట్టు గుర్తించారు. శక్తివేల్‌కు.. ఇళవరసన్‌కు పరిచయం ఉండగా.. ఇళవరసన్‌క తిరుపతికి చెందిన శాంతకుమారి  తెలుసు. ఈ ముగ్గురు కలిసి తిరుమలలో పనిచేసే ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అరుణ్‌ కుమార్‌ సాయంతో అరుణ్ కుమార్ అపథకం ప్రకారం దోపిడీకి పాల్పడ్డారు. ఆ కేసులోనే కానిస్టేబుల్‌ అరుణ్‌ కుమార్‌ను తిరుపతి పోలీసుల సహకారంతో తమిళనాడు పోలీసులు అరెస్టు చేసి  వాణియంబాడికి తరలించారు.  

వారి మృతికి జగన్ దే బాధ్యత.. కన్నా

వైసీపీ అధినేత జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా వైసీపీ నేతలు నిబంధనలను ఉల్లంఘించారని  తెలుగుదేశం ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ పర్యటన సందర్భంగా ఇద్దరు వ్యక్తులు మరణించారనీ, వారిలో ఒకరు జగన్ కాన్వాయ్ లో వాహనం ఢీ కొని మరణిస్తే.. మరొకరు ఎండలో ర్యాలీ కారణంగా మరణించారనీ ఆయన తెలిపారు. ఆ ఇద్దరి మృతికీ జగనే బాధ్యత వహించాలనన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన కన్నా..  జగన్ హయాంలో తాము ర్యాలీలకు పిలుపునిస్తే  తెలుగుదేశం నేతలను గృహ నిర్బంధాలు చేశారని గుర్తు చేశారు. అప్పటి రాక్షస పాలనలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పర్యటలను కూడా అడ్డుకున్నారన్నారు. మూడు వాహనాలు, వంద మందితో వెళ్లాలని పోలీసులు చెప్పినా.. భారీగా వెళ్లి అరాచకం సృష్టించారని ఆరోపించారు. జగన్ పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా పోలీసులను కూడా పక్కకు నెట్టేశారని కన్నా ఆరోపించారు.  ఏడాది క్రితం చనిపోయిన వారిని పరామర్శిస్తారు కానీ ర్యాలీలో చనిపోయిన వారి కుటుంబాలను కనీసం పలకరించే  కూడా జగన్ కు లేదా అని నిలదీశారు. జగన్ అబద్ధపు మాటలను జనం నమ్మే పరిస్థితి లేదన్న కన్నా ఆయన ఎన్ని డ్రామాలు ఆడినా జనం పట్టించుకోరన్నారు.