అమిత్‌‌షా, రాహుల్‌ టూర్లపై టీఆర్‌ఎస్‌ సర్వే... ఏం తేలిందంటే?

  తెలంగాణలో సాధారణ ఎన్నికలకు మరో 23 నెలల గడువే మిగిలి ఉంది. దాంతో సమయం దగ్గర పడుతున్నకొద్దీ రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా ఇప్పటికే తెలంగాణలో పర్యటిస్తుండగా, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పది రోజుల వ్యవధిలో తెలంగాణకి రానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరి పర్యటనలూ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చాలా రోజుల తర్వాత రాష్ట్రానికి వస్తున్న రాహుల్‌గాంధీ జూన్‌ 1న సంగారెడ్డి బహిరంగ సభలో పాల్గోనున్నారు.   అమిత్‌‌షా, రాహుల్‌... ఇద్దరి టార్గెట్టూ టీఆర్‌ఎస్‌ పార్టీయే అయినా.... గులాబీ బాస్‌ మాత్రం ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. 2014 తర్వాత పార్టీ బలోపేతానికి ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకున్న టీఆర్ఎస్... కలిసి వచ్చిన అందరి నేతలను పార్టీలో చేర్చుకుంది. 75 లక్షల మంది టీఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకున్నారు. అంతేకాదు పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్ఠపరిచేందుకు నియోజకవర్గ కమిటీల ఏర్పాటుకు నిర్ణయించింది. పార్టీ ప్లీనరీ, ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. అయితే అమిత్‌షా, రాహుల్‌లు... టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేయడంతో ఏ స్థాయిలో ప్రభావం ఉంటుందో తెలుసుకోవడానికి సర్వేలు చేయిస్తోంది.   అమిత్‌‌షా, రాహుల్‌ పర్యటనల ప్రభావాన్ని సూక్ష్మస్థాయిలో విశ్లేషిస్తోంది టీఆర్‌ఎస్‌. అందుకే అమిత్‌ షా, రాహుల్‌ పర్యటించే ప్రాంతాల్లో జనం నాడిని తెలుసుకోవాలని సర్వే సంస్థలకు టీఆర్ఎస్ బాధ్యతలు అప్పగించింది. పార్టీ శ్రేణులు సైతం పరిస్థితులను సూక్ష్మంగా గమనించాలని, జనాభిప్రాయాన్ని తెలుసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అసంతృప్తులను విపక్షాలు తమ వైపు తిప్పుకునే అవకాశం ఉంటుందని, వీటిపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించింది. అయితే అమిత్‌షా పర్యటిస్తోన్న నల్గొండ జిల్లాలో, రాహుల్‌ పర్యటించనున్న సంగారెడ్డిలో టీఆర్‌ఎస్‌ బలంగా ఉందని, బీజేపీ, కాంగ్రెస్‌ అగ్రనేతలు పర్యటించినా తమకేమీ ఢోకా ఉండదని గులాబీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ నేతలు ఎందుకు కిమ్మనడం లేదు? అమిత్‌‌షాకి భయపడుతున్నారా?

  కమల దళపతి రావడం రావడమే టీఆర్‌ఎస్‌ను టార్గెట్‌ చేశారు. ఏదో ఆషామాషీగా తెలంగాణ పర్యటనకు రాలేదనే స్ట్రాంగ్‌ సంకేతాలు పంపారు. మొదటి రోజే అధికార పార్టీ టీఆర్‌ఎస్‌పైనా, ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తమ లక్ష్యం 2019నే అంటూ నేరుగా టీఆర్‌ఎస్‌కే సవాల్‌ విసిరారు. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం కాస్కోమంటూ గులాబీ దళానికి హెచ్చరికలు పంపారు. కేసీఆర్‌ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్న అమిత్‌షా... కనీసం ప్రజలకు మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో సరిగా అమలు కావడం లేదన్న కమల దళపతి.... కేంద్రంలోనూ... రాష్ట్రంలోనూ ఒకే పార్టీ ....అధికారంలో ఉంటే ఇలాంటి సమస్య ఉండదని, మరింత అభివృద్ధి జరుగుతుందంటూ టీఆర్‌ఎస్‌ సర్కార్‌ను టార్గెట్ చేశారు.   కమల దళపతి కాలు దువ్వుతున్నా గులాబీ నేతలు మాత్రం కిమ్మనడం లేదు. అమిత్ షా ఆరోపణలపై స్పందించే లీడరే కనిపించడం లేదు. అమిత్ షా తొలి రోజే కాకపుట్టించే ప్రసంగం చేసినా టీఆర్ఎస్ లీడర్లు మాత్రం కౌంటర్‌ ఇచ్చేందుకు సాహసించలేకపోయారు. రాష్ట్ర నేతలు, విపక్ష లీడర్లు చేసే చిన్నచిన్న ఆరోపణలకే ఘాటుగా కౌంటర్‌ ఇచ్చే టీఆర్‌ఎస్‌ నేతలు... అమిత్‌షా విషయంలో మాత్రం నోరు మెదపడం లేదు, ఎంపీలను  స్పందించమంటే... మంత్రులు చూసుకుంటారని..... మంత్రులను అడిగితే హైకమాండ్‌ చూసుకుంటుందని మాట దాట వేస్తున్నారు.   టీఆర్ఎస్ నిజంగానే బీజేపీకి భయపడుతోందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమిత్‌షా నుంచి ఈ స్థాయిలో దాడి ఉంటుందని టీఆర్ఎస్ ఊహించలేకపోయిందా? లేదంటే కమల దళపతి అనూహ్యంగా విసిరిన సవాల్‌తో డిఫెన్స్ లో పడిపోయిందో తెలియడం లేదు. తెలంగాణలో నిజంగానే కేంద్ర పథకాలు అమలు కావడం లేదా? సొంత పథకాల కోసం కేంద్ర పథకాలను పక్కన పెడుతున్నారా..? అమిత్ షా ఆరోపణలకు టీఆర్ఎస్ దగ్గర సమాధానం లేదా? తెలంగాణలో ఎవరొచ్చినా భయం లేదన్న నాయకులు ఇప్పుడెందుకు సైలెంటైపోయారు... ఇలా అనేక ప్రశ్నలు, అనుమానాలు తలెత్తుతున్నాయి.

చంద్రబాబు ఆగ్రహానికి కారణమేంటి? నిజంగానే దోస్తీ చెడిందా?

  2014 ఎన్నికల్లో పాలూ నీళ్లలా కలిసిపోయారు. సైకిల్‌పై కమలాన్నెక్కించుకుని గత ఎన్నికల్లో రాష్ట్రమంతా చుట్టేసింది టీడీపీ. అయితే మూడేళ్లు తిరక్కుండానే ఆ బంధం సడలిపోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి? మిత్రలాభం కాస్తా మిత్రభేదంగా మారుతోన్న మాటలు వినిపిస్తున్నాయి? సైకిల్‌తో కటీఫ్ చెప్పేసి ఫ్యాను కింద సేదతీరేందుకు కమలం సిద్ధమవుతుందనే ఊహాగానాలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ శరవేగంగా మారుతోన్న రాజకీయాలను చూస్తుంటే నిజమేనేమో అనిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఇలాంటి అనుమానం కలుగక మానదు. అంతేకాదు టీడీపీ-బీజేపీ నేతలు ఎడమొఖం... పెడమొఖంగా ఉంటున్నారంటున్నారు.   2019 నాటికి దక్షిణాది రాష్ట్రాల్లో సొంతంగా ఎదగాలనుకుంటున్న బీజేపీ... ఒంటరి పోరుకు మొగ్గుచూపుతోంది. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందంటూ కె.లక్ష్మణ్‌ ప్రకటించగా.... ఏపీలోనూ అదే దిశగా అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఏదైనా పార్టీతో కలిసి పోటీ చేయాలనుకుంటే... బీజేపీకి ఎక్కువ స్కోప్‌ ఉండేలా జాగ్రత్త పడుతోంది. అయితే టీడీపీతో కలిసి ముందుకెళ్తే కమలం ఎదుగుదలకు పెద్దగా స్కోప్‌ లేదని భావిస్తుందో ఏమో తెలియదు కానీ... తెలుగుదేశం నుంచి కొంచెం దూరం జరుగుతున్నట్లే కనిపిస్తోంది. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం వైసీపీతో దోస్తీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు పంపుతోంది. వైసీపీ అధినేత జగన్‌కు మోడీ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం, మోడీతో జగన్‌ భేటీని బీజేపీ లీడర్లు వెనకేసుకురావడం చూస్తుంటే ఇలాంటి అనుమానం కలుగక మానదు.   జగన్‌... మోడీని కలవడంతో తెలుగు తమ్ముళ్ల ముఖంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. అది కూడా చంద్రబాబు విదేశాల్లో ఉన్న టైమ్ చూసి జగన్ అపాయింట్ మెంట్ కోరడం... వెంటనే మోడీ అంగీకరించడం, భేటీ జరగడం జరిగిపోయాయి. పైగా గంటపాటు ఏకాంత చర్చలు జరిపి బయటకొచ్చాక జగన్ చాలా ఉత్సాహంగా కనిపించారు. అంతేకాదు రాష్ట్రపతి అభ్యర్ధి ఎన్నికలో ఎన్డీఏకు మద్దతునిస్తామని ప్రకటించారు. ఈ పరిణామాలు టీడీపీకి కోపం తెప్పించాయి. అందుకే గతంలో రెండుమూడుసార్లు మోడీని జగన్‌ కలిసినా పెద్దగా స్పందించని టీడీపీ నేతలు... ఈసారి మాత్రం ఘాటుగానే రియాక్టవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం మోడీతో జగన్‌ భేటీ కావడంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో మోడీ-జగన్‌ భేటీపై బీజేపీ నేతలు సానుకూలంగా స్పందిస్తుండటం.... టీడీపీకి కోపం తెప్పిస్తోంది. అంతేకాదు విదేశాల నుంచి రాగానే చంద్రబాబు.... ప్రధాని అపాయింట్ మెంట్ కోరినా దొరకలేదనే టాక్‌ వినిపిస్తోంది. ఈ పరిణామాలన్నీ చూస్తున్న టీడీపీ నేతలు లోలోన ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మరి ఈ పరిణామాలు బీజేపీ-టీడీపీ దోస్తీపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి.

రాళ్లురువ్వినోడి బదులు ‘ఆమె’ను జీపుకి కట్టేయాలన్న రావల్!

  కాశ్మీర్ కాష్టంలా మండుతోంది. పోయిన సంవత్సరం ఒక్క ఉగ్రవాది ఛస్తే ఇప్పటి దాకా యుద్ధం కొనసాగుతూనే వుంది. బుర్హాన్ వని అనే టెర్రరిస్ట్ భద్రతా దళాల కాల్పుల్లో హతుడయ్యాడు. అప్పట్నుంచీ ఇప్పటి దాకా వేర్పాటు వాదుల రాళ్ల రణరంగం ఆగటమే లేదు. అయితే, రాను రాను కాశ్మీరీ వేర్పాటువాదుల దుర్మార్గాలు అన్ని హద్దులు చెరిపేస్తున్నాయి. తాజాగా ఒక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా దేశ వ్యతిరేక శక్తులు పాక్ ఆక్రమిత కాశ్మీర్ కు చెందిన జాతీయ గీతం ఆలపించారట! ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ పాక్ జెండాలు ప్రదర్శించే వేర్పాటు వాద కాశ్మీరీలకు ఇది మామూలు విషయమే కావచ్చు. కాని, మిగతా భారతీయులకి ఎంతో మనస్తాపం కలిగిస్తుంది. మోదీ వస్తే కాశ్మీర్ సమస్య కోలిక్కి వస్తుందనుకున్న వారైతే మరింత ఆవేదనకి గురవుతున్నారు పరస్థితుల్ని చూసి…   ఒక వైపు కాశ్మీర్ ను దేశం నుంచి వేరు చేయాలని దేశ ద్రోహులు కుట్రలు పన్నుతుంటే మరో వైపు మన మేధావులు కొందరు కాశ్మీరీ స్వాతంత్ర్యం అంటూ అమానుష వ్యాఖ్యలు చేస్తుంటారు. అలాంటి వారిలో ఎప్పుడూ వినిపించే కరుడుగట్టిన పేరు అరుంధతీ రాయ్. కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడే ఆమె పదే పదే అక్కడ జరిగే ఆజాదీ పోరాటాల్ని కూడా సమర్థిస్తుంటారు. ఈ  మధ్య అరుంధతీ ‘’ 7వేలు కాదు 7లక్షలు కాదు 70లక్షల మంది భారతీయ సైన్యం వచ్చినా ఆజాదీ బృందం గొంతు నొక్క’’లేరని రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించింది. అందుకు ప్రతిస్పందనగా అన్నట్టు బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్ ట్విట్టర్ లో ఘాటైన కామెంట్స్ చేశాడు.   ఆ మధ్య రాళ్లు రువ్వే అల్లరి మూకల నుంచి తమని తాము కాపాడుకోవటానికి ఆర్మీ వారు ఒక కాశ్మీరీ వేర్పాటు వాదిని జీపుకి కట్టేసి తీసుకెళ్లారు. అతడి బదులు అరుంధతీ రాయ్ ని కట్టేయాలని తీవ్రంగా వ్యాఖ్యానించాడు పరేష్ రావల్! ఇది ఇప్పుడు ట్విట్టర్ లో పెద్ద దుమారంగా మారింది. చాలా మంది బీజేపి ఎంపీ అయిన రావల్ ను సమర్థిస్తున్నప్పటికీ విమర్శించే వారు కూడా చాలా మందే వున్నారు. అంతటి హింసాత్మక ట్విట్స్ పరేష్ స్థాయి నటుడి నుంచి ఆశించలేదని చాలా మంది ఖండించారు. అంతే కాదు, ఒక స్త్రీ పట్ల, రచయిత్రి పట్ల హింసాత్మాకంగా మాట్లాడటం దుర్మార్గమని తిట్టారు.   పరేష్ రావల్ ట్వీట్ నిజంగానే సమర్థనీయం కాదు. కాని, అదే సమయంలో అరుంధతీ రాయ్ దేశం కోసం పోరాడుతున్న ఆర్మీపై పదే పదే చేసే వ్యాఖ్యలు కూడా అత్యంత దిగువ స్థాయికే చెందుతాయి. ఎక్కడో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘన బూచిగా చూపి కాశ్మీర్ నే పాకిస్తాన్ కు వదిలేయమని ఆమె చేసే వాదన పరమ దుర్మార్గం. దానికి ప్రతిగానే పరేష్ రావల్ అలా స్పందించారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, వివాదాలు రాజేసేలా కాకుండా కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపేలా పరేష్ రావల్, అరుంధతీ రాయ్ లాంటి సెలబ్రిటీలు మాట్లాడితే బావుంటుంది…

ఆరోపణల తుఫాన్… కేసుల పిడుగుల్లో… కేజ్రీవాల్!

  కేసులు, ఆరోపణలు, విమర్శలు, ఓటములు … ఇవన్నీ ఎలా వుంటాయో అరవింద్ కేజ్రీవాల్ కు ఇప్పుడు అర్థమవుతోంది. ఒకప్పుడు అన్నా హజారే టీమ్ నుంచి పక్కకు తప్పుకుని రాజకీయ పార్టీ పెట్టిన కేజ్రీవాల్ తిరుగులేని క్రేజ్ ఎంజాయ్ చేశాడు. ముఖేష్ అంబానీ మొదలు షీలా దీక్షిత్ వరకూ అందర్నీ ఏకి పారేశాడు! ఏకే గురి పెట్టాడంటే ఏకే 47 గన్నుకి భయపడ్డట్టు భయపడేవారు! కాని, ఇప్పుడు గ్రహాలు దిల్లీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా గిర్రున తిరుగుతున్నాయి…   రోజుకో వివాదంలో ఇరుక్కునే అరవింద్ అత్యంత తాజాగా సతమతం అవుతోన్న సమస్య కపిల్ మిశ్రా కామెంట్స్! ఏ క్షణం అయితే అతడ్ని కేజ్రీ బయటకు పంపాడో అమాంతం ఆరోపణల వర్షం మొదలు పెట్టాడు. ఆ తుఫాన్ ఇంకా ఆగటం లేదు. అవినీతి పరుల గుండెల్లో నిద్దుర పోతా అన్న అరవింద్ ను నిద్రపోనీయకుండా చేస్తున్నాడు మిశ్రా… తన అవినీతి ఆరోపణలతో! అవ్వి ఎంత వరకూ నిజం అన్నది భవిష్యత్ లో తేలాల్సిందే. అసలు తేలకపోవచ్చు కూడా. కాని, ఇప్పటికిప్పుడు అయితే పెద్ద తలనొప్పిగా మారాయి దిల్లీ సీఎంకి!   కపిల్ మిశ్రా ఆరోపణల్ని ఖండించినా ఖండించకపోయినా ఇబ్బందే అన్నట్టున్న కేజ్రీవాల్ పరిస్థితి తాజాగా మరింత రచ్చై కూర్చుంది. కపిల్ మిశ్రా చేసిన ఆరోపణలు నిజమైతే తాను ఈపాటికి జైల్లో వుండేవాడినని ఆప్ అధినేత అన్నాడు. దానికి కౌంటర్ ఇచ్చిన మిశ్రా జైలుకి వెళ్లని వారంతా అవినీతి పరులు కానట్లేనా అంటూ 2జీ, కామన్ వెల్త్ కుంభకోణం లాంటి అనేక కేసుల్ని, ఆరోపణలు ఎదుర్కుంటున్న నాయకుల్ని ఏకరువు పెట్టాడు!   ఒకవైపు కపిల్ మిశ్రా లాంటి జూనియర్, అరవింద్ ను ఆటాడుకుంటూ వుంటే మరో వైపు జైట్లీ లాంటి సీనియర్ నాయకుడు కూడా వదలటం లేదు. ఇప్పటికే కేజ్రీవాల్ మీద పరువు నష్టం దావా వేసి కోర్టుకు ఈడ్చిన జైట్లీ ఆ కేసులో భాగంగా మరో పరువు నష్టం కేసు వేశాడు. అందుక్కారణం కేజ్రీవాల్ కోరి పెట్టుకున్న లాయరే! ప్రముఖ న్యాయవాది జెఠ్మలానీ కోర్టులో జైట్లీని క్రూక్ అన్నాడు. అలా తనని మోసగాడు అనటం తీవ్రంగా పరిగణించిన జైట్లీ ఆ మాట జెఠ్మలానీ అన్నాడా? లేక కేజ్రీవాల్ అనమంటే అన్నాడా అని ప్రశ్నించాడు! రామ్ జెఠ్మలానీ అరవింద్ కేజ్రీవాల్ సూచన మేరకే తాను క్రూక్ అనే పదం వాడనని సెలవిచ్చాడు. ఈ పాయింట్ ఆధారంగా జైట్లీ రెండో పరువు నష్టం కేసు వేశాడు కేజ్రీవాల్ పైన!   జెఠ్మలానీ వల్ల తాను కేసు నుంచి బయటపడతాను అనుకున్న కేజ్రీవాల్ కి బోనస్ గా రెండో డిఫమేషన్ కేసు వచ్చి చేరింది. పాపం బ్యాడ్ టైంలో వున్న సీఎంగారికి… వర్షం పడుతోందని చెట్టు కిందకి పోతే … కొమ్మలు మీద పడ్డాయి!

బీజేపి వర్సెస్ టీడీపీ : పొత్తు పొత్తే … పోట్లాట పోట్లాటే!

  చెట్టు మీదే బాగా పక్వానికి వచ్చిన పళ్లు వాటంతటవే రాలిపోతాయి. రాజకీయ పొత్తులు కూడా అలానే తయారవుతున్నాయి ఈ మధ్య కాలంలో. ఏదో ఒక పార్టీ బలంగా వున్నప్పుడు రెండో పార్టీ దానితో పొత్తు పెట్టుకుంటుంది. తరువాత టైం రాగానే వేరు కుంపటి. ఇదీ ఇప్పటి పరిస్థితి. రాజకీయ పొత్తులకి, ఎన్నికల అవగాహనలకి పెద్దగా సిద్దాంతాల రాద్దాంతాలు ఏమీ లేకుండా పోయాయి. తాజాగా ఆంధ్రా బీజేపి నాయకుల మాటలు చూస్తుంటే ఏపీలో టీడీపీ, బీజేపి అలయన్స్ అంతం అంతకంతకూ దగ్గరకొచ్చేస్తున్నట్టు కనిపిస్తోంది!   ఏపీలో బీజేపికి పెద్దగా బలమైన క్యాడర్ గాని, నాయకులు గాని లేరన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే, దిల్లీలో పనులు జరగాలని టీడీపీ, ఆంధ్రాలో బలం పుంజుకోవాలని బీజేపి పరస్పరం చేతులు కలిపాయి. ఈ రెండు పార్టీలతో కలిసి ప్రచారం చేసిన పవన్ ఆల్రెడీ జనసేనతో కమ్యూనిస్టుల వైపు వెళ్లిపోతున్నాడు. ఇక మిగిలిన టీడీపీ, బీజేపి బంధం కూడా రోజు రోజుకి క్షిణిస్తున్నట్టే కనిపిస్తోంది. పెద్ద నాయకులు ఎంతగా సంయమనం పాటిస్తున్నా… పొత్తుకు వచ్చిన విపత్తు ఎం లేదని చెబుతోన్నా… ఒక స్థాయి నేతలు మాత్రం ఇరు పార్టీల నుంచీ ఘాటుగా స్పందిస్తూ వస్తున్నారు.   ఏపీ బీజేపి నాయకులు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీపైన, టీడీపీ నాయకులపైనా ఆగ్రహంగా స్పందించారు. కేశినేని నాని బీజేపితో పొత్తు వల్ల టీడీపీ నష్టపోయిందని కామెంట్ చేశారనీ… అలాంటివి తాము పట్టించుకోమని అన్నారు. అదే సమయంలో నాని వ్యాఖ్యలు వ్యక్తిగతమా లేక టీడీపీ పార్టీ అభిప్రాయం కూడా అదేనా తెలపాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. ఇలా టీడీపీ నేతలు బీజేపి టార్గెట్ చేయటం పరిపాటి అయిపోయిందని కూడా కన్నా అన్నారు! ఇదంతా టీడీపీ, బీజేపి పొత్తుకి ఎంత మాత్రం ఆరోగ్యకరం కాదు. అదీ త్వరలో అమిత్ షా ఏపీలో పర్యటించనున్న వేళ!   ఇక ఏపీ బీజేపిలోని మరో నేత సోము వీర్రాజు అయితే స్పష్టంగానే అభిప్రాయాన్ని చెప్పేశారు. ఏ పార్టీ అయినా బలపడటానికి ప్రయత్నిస్తుందనీ, అదే పని బీజేపి చేస్తే తప్పేంటని అన్నారు. అంతే కాదు, జగన్ కి మోదీ అపాయింట్ మెంట్ ఇవ్వటం ఎంత మాత్రం తప్పు కాదని గట్టిగా బదులిచ్చారు. జగన్ , మోదీ భేటీ పైన కూడా చాలా రోజులుగా టీడీపీ, బీజేపి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒక వైపు చంద్రబాబు బీజేపిని పల్లెత్తు మాట అనకున్నా, మరో వైపు వెంకయ్య నాయడు 2019 వరకూ తెలుగు దేశంతో బంధం భద్రంగా వుంటుందని చెబుతున్నా… మాటల తూటాలు మాత్రం పేలుతూనే వున్నాయి. ఈ రచ్చని నియంత్రించే ప్రయత్నం బీజేపి జాతీయ నాయకత్వం అస్సలు చేస్తుండకపోవటం కూడా అనేక అనుమానాలకి తావిస్తోంది! ఒకవేళ దిల్లీ స్థాయిలోనే టీడీపీతో పొత్తు ముందు ముందు వద్దని కాషాయ దళ నాయకులు భావిస్తున్నారా? పరిస్థితి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది! మహారాష్ట్రలో శివసేనతో ఎప్పటికప్పుడు కయ్యానికి కాలు దువ్వుతూనే భాగస్వామ్యం కొనసాగిస్తున్న కమలం… అదే ఫార్ములా టీడీపికి కూడా అప్లై చేయాలనుకుంటుందేమో! ముందు ముందు ఇరు పార్టీల నేతల మాటల్ని బట్టి వ్యూహం బయటపడుతుంది!

అయోధ్య రాముడి పార్టీ భద్రాది రాముడి రాష్ట్రంలో పాగా వేస్తుందా?

  ప్రస్తుత బీజేపికి మోదీ ఇంజన్ లాంటి వారైతే… అమిత్ షా ఇంధనం! అవును, ఆయన సత్తా తోడు కాకపోతే మోదీ విజయాలు ఇంత తేలిక అయ్యి వుండేవే కావు. కాశ్మీర్ లో ప్రభుత్వంలో భాగం కావటం మొదలు మణిపూర్లో సర్కార్ ఏర్పాటు వరకూ షా వ్యూహాలు ప్రతిపక్షాలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. అయితే, మోదీ , షా ఇద్దరి వేడీ ఇంత వరకూ దక్షిణాది పార్టీలకు, నేతలకు తగల లేదనే చెప్పాలి. తెలంగాణ, ఆంధ్రా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కమలం ఎఫెక్ట్ తక్కువ. ఇక కర్ణాటకలో అదును కోసం ఓపిగ్గా వేచి చూడాల్సిన పరిస్థితి. అందుకే సౌత్ ఇంకా మోదీ, అమిత్ షా దండయాత్ర నుంచి సేఫ్ గా వుండగలుగుతోంది.   ఇప్పటి వరకూ బీజేపి ప్రభావం తెలుగు రాష్ట్రాల మీద పడకున్నా ముందు ముందు ఖచ్చితంగా అద్భుతాలు సృష్టించాలని ఉవ్విళ్లూరుతోంది కాషాయదళం. అందుకే, ఫస్ట్ ఎటాక్ కింద మూడు రోజుల టీ టూర్ వేస్తున్నారు షా. ఆయన పర్యటనలో భాగంగా చాలా మంది ఇతర పార్టీల ముఖ్య నేతల మనసులు మారతాయని బీజేపి ఆశిస్తోంది. టీఆర్ఎస్ అధికారంలో వుంది, కేసీఆర్ లాంటి సమర్థుడైన నాయకుడు కూడా గులాబీ పార్టీకి వున్నాడు కాబట్టి దానికి డ్యామేజ్ తక్కువేనంటున్నారు విశ్లేషకులు. ఇక మిగిలింది బీజేపికి జాతీయ స్థాయిలోనూ బద్ధ శత్రువైన కాంగ్రెస్. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన టీ కాంగ్ కు షా ఎఫెక్ట్ ఎక్కువే వుంటుందని అంచనాలు వినిపిస్తున్నాయి. అసోమ్ నుంచి కర్ణాటక దాకా అంతటా కాంగ్రెస్ టాప్ లీడర్స్ ని టార్గెట్ చేస్తోంది బీజేపి. అదే క్రమంలో తెలంగాణలో కూడా కోమటిరెట్టి బ్రదర్స్ లాంటి వార్ని కాషాయదళంలోకి లాగవచ్చని అంటున్నారు. ఇంకా ఎలాంటి కన్ ఫర్మేషన్ లేకున్నా భవిష్యత్ లో బీజేపి పంచన చేరే కాంగ్ నేతలు చాలా మందే వుండవచ్చు. కారణం… తెలంగాణలో కాంగ్రెస్ కు బలమైన ప్రతిపక్ష నేతగా నిలిచిన లీడర్ ఒక్కరూ లేరు. అలాగే, జాతీయ స్థాయిలోనూ రాహుల్ గాంధీ టీమ్ అధికారం చేజిక్కించుకునే సీన్ ఇప్పుడప్పుడే లేదు. కాబట్టి టీఆర్ఎస్ లోకి వెళ్లలేని కాంగ్రెస్ నేతలు బీజేపిని ప్రత్యామ్నాయంగా ఎంచుకునే అవకాశాలే ఎక్కువ. టీ టీడీపీ నేత రేవంత్ రెడ్డి కూడా కమలం కండువా వేసుకుంటాడని బలంగా ప్రచారం జరుగుతోంది. కాని, ఆయన ఇంత వరకూ ఎలాంటి సంకేతాలు, సూచనలు మాత్రం ఇవ్వటం లేదు…   తెలంగాణలో దాదాపుగా అంతమైన టీ టీడీపీ, అతి కష్టంగా కాలం నెట్టుకొస్తున్న కాంగ్రెస్… బీజేపికి చక్కటి ఛాన్స్ ఇస్తున్నాయి విస్తరించేందుకు. అలాగే, తన ప్రస్తుత పర్యటనలో షా నల్గొండని ప్రత్యేకంగా ఎంచుకున్నారు. బహుశా కమలం టార్గెట్ తెలంగాణలోని కమ్యూనిస్ట్ హాట్ స్పాట్ లు కూడా అయి వుండవచ్చు. జాతీయ స్థాయిలో బెంగాల్, కేరళ, త్రిపుర లాంటి చోట్లలోనే కమ్యూనిస్టుల్ని ఎదురించి పోరాడుతున్న కమలం తెలంగాణలోనూ వార్ని టార్గెట్ చేయటం సహజమే. ఇక హైద్రాబాద్ లో ఎంఐఎం ఎలాగూ వుండనే వుంది! మొత్తానికి అమిత్ షా వ్యూహం ఫలించి పెద్ద ఎత్తున్న వలసలు చోటు చేసుకుంటే మాత్రం 2019లో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారిపోవటం ఖాయం. రాష్ట్రంలో అధికారం టీఆర్ఎస్ చేయి నుంచి జారినా , జారకున్నా కేంద్రంలో మోదీని రెండో సారి ప్రధానిని చేసేందుకు తెలంగాణ నుంచి బీజేపి ఎంపీలు ఎన్నిక కావటం తథ్యం. చూడాలి మరి… తమ సెక్యులర్ ఇమేజ్ లు పక్కన పెట్టిన హిందూత్వ కండువాలు తెలంగాణలో ఎందరు కప్పుకుంటారో!

టీటీడీ కొత్త ఛైర్మన్ ఆయనే..పాపం రాయపాటి పరిస్థితి ఏంటీ..?

ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక కేంద్రం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలకు ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. మరి అంతటి భక్త కోటి యోగ క్షేమాలు చూసుకోవడానికి ఎంత పెద్ద వ్యవస్థ ఉండాలి. దాని పేరే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సంక్షిప్తంగా టీటీడీ. సుమారు 10 వేల మందికి పైగా ఉద్యోగులతో చిన్న సైజు ప్రభుత్వంలా ఉండే టీటీడీకి ఛైర్మనే అధిపతి. ఆ పదవి కోసం నాటి నుంచి నేటి వరకు ఎన్నో పైరవీలు, లాబీయింగ్‌లు కానీ ఎవరో ఒక్కరినే ఆ అదృష్టం వరిస్తుంది. ప్రస్తుత ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి పదవి కాలం ముగియనుండటంతో తమకు అవకాశం ఇవ్వాలంటూ ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా...ఎవరికి అందనంత ఎత్తులో ఆలోచిస్తుంటారు సీఎం చంద్రబాబు నాయుడు.   అందుకు అనుగుణంగా ఈ సారి రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తికి ఛైర్మన్‌గా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు ముఖ్యమంత్రి. ఇందులో భాగంగా తనకు అత్యంత సన్నిహితుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డా. కె లక్ష్మీనారాయణను ఛైర్మన్‌గా నియమించేందుకు దాదాపుగా రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఈ వార్త తెలిసినప్పటి నుంచి మిగిలిన వారి సంగతి ఏమో కానీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మాత్రం తీవ్ర నిరాశలో కూరుకుపోయారట. టీటీడీ ఛైర్మన్‌ పదవి ఆయన చిరకాల కోరిక. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆయన రెండు సార్లు ఛైర్మన్ గిరి కోసం ప్రయత్నించినప్పటికి ఆయనకు మొండిచేయి ఎదురైంది. అయితే ఎంపీ, లేదా ఎమ్మెల్యేగా ఉన్నవారికి ఈ పదవిని ఇవ్వకూడదని సీఎం నిర్ణయించుకోవడంతో అవసరమైతే ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సైతం రాయపాటి సిద్ధమయ్యారు.   కానీ అనూహ్యంగా లక్ష్మీనారాయణ పేరు తెర మీదకు రావడంతో రాయపాటి షాక్‌కు గురయ్యారు. ఇక లక్ష్మీనారాయణ విషయానికి వస్తే ఐఏఎస్ అధికారిగా ఉమ్మడి రాష్ట్రంలో ఆయన విశేషమైన సేవలందించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. పదవి విరమణకు ముందు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా పనిచేశారు. 

బీజేపీపై ఫైరవుతున్న పవన్‌... టీడీపీతో జత కడతారా? లేదా?

  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కి సొంతంగా అధికారంలోకి వచ్చే సత్తా లేకపోయినా... ప్రధాన పార్టీల గెలుపోటములను ప్రభావితం చేయగల స్టామినా అయితే కచ్చితంగా ఉంది. ఇది 2014 ఎన్నికల్లో రుజువైంది కూడా, ఎన్నికలకు మూడ్నెళ్ల ముందువరకూ వైసీపీదే విజయమన్న సర్వేల అంచనాలన్నీ పవన్‌ రాకతో తారుమారయ్యాయి. తానే ముఖ్యమంత్రినంటూ కలలగన్న జగన్‌ ఆశలన్నీ తలకిందులయ్యాయి. కేవలం 1.2 పర్సంటేజ్‌ తేడాతో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అందుకు పవన్‌ కల్యాణే కారణమనేది రాజకీయ పండితుల విశ్లేషణ. పలువురు టీడీపీ నేతల మాట కూడా ఇదే.   అయితే 2014లో బీజేపీకి, టీడీపీకి మద్దతిచ్చిన పవన్‌ కల్యాణ్‌... 2019లో జనసేనను ఎన్నికల బరిలోకి దింపుతున్నారు. అందుకు గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణం చేపడుతున్నారు. అయితే జనసేన ఒంటరిగా పోటీ చేస్తే... కచ్చితంగా తెలుగుదేశానికి నష్టమే. కనీసం 50 నియోజకవర్గాల్లో ఫలితాలు తారుమారవడం ఖాయం. అదే జరిగితే ప్రతిపక్ష వైసీపీ భారీగా లాభపడతుంది. అయితే టీడీపీకి జనసేనతో పొత్తు ఎంత ముఖ్యమో... బీజేపీతో మైత్రి కూడా అంతే ముఖ్యం. కానీ ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిందంటూ బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పవన్‌ కల్యాణ్‌.... టీడీపీ-బీజేపీ కూటమితో చేతులు కలుపుతారా అనేది ప్రశ్నార్ధకమే.   అయితే పలువురు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేల ఇంటర్నల్‌ టాక్స్‌ ప్రకారం తెలుగుదేశం-జనసేన కలిసి పోటీ చేయడం ఖాయంగా తెలుస్తోంది. ఇంకా ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉందని, ఈలోపు సమీకరణాలు మారతాయంటున్నారు. జగన్‌‌ను వైసీపీని తీవ్రంగా వ్యతిరేకించే పవన్‌... కచ్చితంగా తమతోనే కలిసి నడుస్తారని అంటున్నారు. ఏదిఏమైనా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కలిసి పోటీ చేయడం మాత్రం ఖాయమంటున్నారు టీడీపీ నేతలు.

భాషా భాషలో మార్పు వస్తోంది! రాజకీయ పదాలు పెరిగిపోతున్నాయ్!

  రజినీకాంత్ స్వరం క్రమంగా మారుతోంది! రాజకీయాలు వద్దే వద్దన్నట్టు మాట్లాడే ఆయన అభిమానుల సమక్షంలో మెల్లగా గొంతు సవరించుకుంటున్నట్టు సూచనలు కనిపిస్తున్నాయి. అభిమానులతో సెల్ఫీల కోసం తొమ్మిదేళ్ల తరువాత సమావేశం అయిన ఆయన రోజకో కామెంట్ తో జనం దృష్టినీ, మీడియా చెవుల్నీ ఆకర్షిస్తున్నాడు. మొదట దేవుడు శాసిస్తే ఏదైనా చేస్తానన్న ఆయన తరువాత బీజేపి రాజకీయాల్లోకి రమ్మంటోంది కదా అంటే… దాన్ని తిరస్కరించలేదు. నేను చెప్పాల్సింది చెప్పేశాను. ఇంక చెప్పేదేం లేదు అన్నారు. కాని,ఎక్కడా బీజేపిలో చేరే ఉద్దేశం లేదు అని కానీ, రాజకీయాల్లోకి రాను అని కానీ రజినీ కుండ బద్దలు కొట్టలేదు.ఇక ఫైనల్ గా ఇప్పుడు ఆయన… యుద్ధం వస్తే రణ రంగంలోకి దిగుదామని అభిమానుల్ని మానసికంగా సిద్ధం చేసే కామెంట్ చేయనే చేసేశారు!   ఇప్పటి వరకూ రజినీకాంత్ ఎన్నో సార్లు తన రాజకీయ రంగ ప్రవేశం గురించి మాట్లాడారు. కాని, ప్రతీసారీ పాము చావదు, కర్ర విరుగదు అన్నట్టే సాగింది ఆయన టోన్. కాని, తాజాగా ఆయన చేసిన కామెంట్స్ రజినీ పొలిటికల్ ఎంట్రీ ఆల్మోస్ట్ కన్ ఫర్మ్ అన్నట్టుగా వున్నాయి. ఒకవైపు స్టాలిన్ మంచి నేత అంటూ పొగడ్తలు కురిపిస్తూనే రాజకీయాలు భ్రష్టుపట్టాయని విమర్శించాడు తలైవా. అందుకే అవసరం అయినప్పుడు యుద్ధం చేద్దామన్నాడు అభిమానులతో! ఇది ఖచ్చితంగా పొలిటికల్ ఎంట్రీకి సంకేతమే తప్ప మరొకటి కాదంటున్నారు విశ్లేషకులు. రజినీ అభిమానులు కూడా అదే మోడ్ లోకి, మూడ్ లోకి వెళ్లిపోయారట!   రానున్న పార్లమెంట్ ఎన్నికల నాటికి ఏదో ఒక పెద్ద నిర్ణయం తీసుకోనున్న రజినీకాంత్ అందుకు తగ్గట్టే కామెంట్ల పరంపర కొనసాగించారు ఫ్యాన్స్ ముందు. తాను కర్ణాటక కంటే ఎక్కువ ఏళ్లు తమిళనాడులో బ్రితికాననీ, బ్రతుకుతున్నానీ చెప్పిన ఆయన తాను వంద శాతం తమిళుడ్నేనని చెప్పుకొచ్చారు. ఈ స్టేట్మెంట్ జనానికి మరింత దగ్గరవ్వటానికే తప్ప ఊరికే యథాలాపంగా చేసింది కాదని ఎవరైనా చెప్పగలరు!   జయలలిత మరణం, కరుణానిధి విరమణంతో స్థబ్దంగా మారిన తమిళ రాజకీయాలు రజినీ ఎంట్రీతో రక్తి కడతాయని అంతా ఎదురు చూస్తున్నారు. మరి పడయప్ప ఈ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కాకుండా డైరెక్ట్ అనౌన్స్ మెంట్ ఎప్పుడో చేస్తారో వేచి చూడాలి…

బెంజ్ కంపెనీ తన నిర్లక్ష్యానికి మూల్యం, కోర్టులో చెల్లించనుందా?

  స్టేజీ పైన కొనసాగే నాటకం లాంటిది లైఫ్ అంటాడు ఒక ఆంగ్ల కవి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని దుఃఖాలు కుదిపేసినా జీవితం ముందుకు పోతూనే వుండాలి. ఏపీ మంత్రి నారాయణ ఇప్పుడు అలాంటి విషాద స్థితిలోనే వున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కొడుకు యాక్సిడెంట్లో చనిపోవటంతో ఆయన తీవ్రంగా క్రుంగిపోయారు. అయినా కూడా జీవితం ఎవరి కోసమూ ఆగదు కదా? ముందుకు కదులుతూనే వుండాలి…   నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ మెట్రో రైల్ కోసం నిర్మించిన పిల్లర్ కి కార్ ను ఢీకొట్టి మృత్యువాత పడ్డాడు. దీనికి ప్రధాన కారణం అతి వేగమే అన్నది దాదాపుగా రూఢీ అయింది. అయితే, నిషిత్ స్వయంకృతం ఎంత వున్నా కార్ లోని సెక్యూరిటీ ఫీచర్స్ ఏమయ్యాయని చాలా మందికి ఇప్పటికీ అనుమానంగానే వుంది. కోట్లు విలువ చేసే బెంజ్ కార్లో అసాధారణ రక్షణ వ్యవస్థలుంటాయి. అవన్నీ ఎందుకు పని చేయలేదన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న!   అత్యంత ఖరీదైన కారు, పైగా మృతి చెందింది మంత్రి కుమారుడు కావటంతో జర్మనీ నుంచీ బెంజ్ కంపెనీ ప్రత్యేకంగా తమ బృందాన్ని దర్యాప్తు కోసం హైద్రాబాద్ కు పంపిందట. వారి విచారణలో నిషిత్ కార్ లో లోపాలున్నాయని తేలిందంటున్నారు. బెంజ్ కంపెనీ కార్ అమ్మే సమయంలో ఇచ్చిన రక్షణ హామీలేవీ యాక్సిడెంట్ సమయంలో పని చేయలేదు. అందుకే, నిషిత్ మృతి చెందడమే కాక కార్ కూడా దారుణంగా దెబ్బతిన్నది. ఇది ఖచ్చితంగా సెక్యూరిటీ ఫీచర్స్ విఫలమవ్వటం వల్లేనని బెంజ్ టీమ్ రిపోర్ట్ తయారు చేసింది.   జర్మనీ నుంచి వచ్చిన కంపెనీ ప్రతినిధులే కార్ లో లోపాలు వున్నాయనటంతో మంత్రి నారయణ న్యాయ పోరాటం దిశగా కదులుతున్నారని టాక్. బెంజ్ ను కోర్టుకు ఈడ్చి బుద్ది చెప్పాలని భావిస్తున్నారట.   కోర్టుకి వెళ్లినంత మాత్రాన చనిపోయిన కుమారుడు తిరిగి రాకున్నా ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ అయిన బెంజ్ ముందు ముందు ఇలాంటి ప్రాణంతకమైన నిర్లక్ష్యం ప్రదర్శించకుండా వుంటుంది. ఒకవేళ నారాయణ కోర్టు మెట్లు ఎక్కితే దాన్ని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. కోట్లూ వసూలు చేసే బడా కంపెనీలు కనీస బాధ్యత లేకుండా వాహనాలు తయారు చేయటం క్షమించరాని నేరం. పూడ్చుకోలేని నష్టం.

అనంత, ఉత్తరాంధ్రేనా మిగిలిన జిల్లాల సంగతేంటి పవన్..?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ మూడేళ్లు పూర్తి చేసుకుంది. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఇంత వరకు పార్టీ సంస్థాగతంగా వేళ్లూనుకోలేదు. సిద్ధాంతపరంగా కాగితాల్లో పార్టీ ఎంత పటిష్టంగా కనిపిస్తున్నా..అసలు ఒక క్రీయాశీలక రాజకీయ పార్టీ ఎలా ఉండాలో అలాంటి నిర్మాణం జనసేనలో కనిపించడం లేదు. రీసెంట్‌గా అనంతపురంలో జనసైనికుల కోసం దరఖాస్తులు ఆహ్వానించాడు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఏదైనా ముందడుగు పడింది అంటే అదొక్కటే. ఏ ప్రెస్ మీట్ పెట్టినా అనంతపురం అంటాడు తప్పించి మరో జిల్లా కానీ..నియోజకవర్గం గురించి కానీ ఒక్క మాట మాట్లాడిన సందర్భం లేదు.   ఇలాంటి దశలో శ్రీకాకుళంలో జనసేన శిబిరాలు ఏర్పాటు చేయాల్సిందిగా పిలుపునిచ్చారు పవన్. పార్టీకి ఏ రకమైన సేవలు అందించగలరన్న ప్రాధాన్యతపై అభ్యర్ధులను ఎంపిక చేసుకోనున్నారు. ముఖ్యంగా కంటెంట్ రైటర్స్, అనలిస్ట్స్, స్పీకర్స్ కోసం జనసేన అన్వేషిస్తోంది. ఈ సంగతి పక్కనబెడితే ముఖ్యంగా అనంతపురం, ఉత్తరాంధ్రపై పవన్ ఎక్కువగా ఫోకస్ చేయడానికి కారణం ఏంటా అని విశ్లేషించే పనిలో పడ్డారు సీనియర్ మోస్ట్ అనలిస్టులు. అనంతపురం, ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధిలో వెనుకబడిన ప్రాంతాలు. కరువు, వలసలు, నిరక్ష్యరాస్యత సమస్యలు మెండు..అందుకే పార్టీ ఆవిర్భవించిన తరువాత ఈ రెండు ప్రాంతాల్లో పర్యటనలు చేసి సమస్యలు తెలుసుకున్నారు జనసేనాని.   గోదావరి జిల్లాల్లో ఎలాగూ పవన్‌కు తిరుగు లేదు..కృష్ణా నుంచి నెల్లూరు వరకు ప్రాణాలిచ్చే అభిమానులున్నారు. సీమలోనూ ప్రభావం చూపగల సత్తా ఉంది. ఏటొచ్చి ఉత్తరాంధ్ర, అనంతలోనే పార్టీకి బలాన్ని ఇవ్వాలి కాబట్టే..తొలి విడతగా ఆ రెండు ప్రాంతాల నుంచి జనసేవకులను ఎంపిక చేసుకుని తన ఉద్దేశ్యం ఏంటో చెప్పకనే చెప్పాడు పవన్. ఇక్కడ సక్సెస్ అయితే గనుక జనసేనకు తిరుగులేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  

బీజేపీ,టీడీపీ మధ్య గ్యాప్ పెరిగిందా? ఒంటరి పోరు ఎవరికి లాభం?

  2014లో కలిసి పోటీచేసిన టీడీపీ, బీజేపీ... ఇప్పుడు ఎవరికి వారే అన్నట్లు వ్యవహారిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో కొన్ని నెలలుగా రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. రెండు పార్టీల నేతలు ఎడమొఖం పెడమొఖంగా ఉంటున్నారు. మిత్రపక్షాలైనప్పటికీ ఎక్కడా కలిసి ఆందోళనలు, ధర్నాలు చేసిందే లేదు. అసెంబ్లీ సమావేశాల్లోనూ వేర్వేరుగానే ఉన్నారు.   బీజేపీ వ్యూహాత్మకంగానే టీడీపీని పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. టీడీపీ ఆంధ్రా పార్టీ అంటూ టీఆర్‌ఎస్‌ పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడమే బీజేపీ ఈ స్టాండ్ తీసుకోవడానికి కారణంగా తెలుస్తోంది. టీడీపీని పక్కన పెట్టకపోతే తమకూ నష్టం కలుగుతుందని అంచనాకి వచ్చిన తెలంగాణ బీజేపీ నేతలు... వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామంటున్నారు. వేరే రాష్ట్రంలో పొత్తులకు తమకి ఎలాంటి సంబంధం లేదన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌... ఇక్కడ మాత్రం టీడీపీతో పొత్తు ఉండదనే సంకేతాలు పంపించారు.   అటు ఏపీలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ నేతలు బహిరంగంగానే టీడీపీ పాలనను విమర్శిస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఏపీలో కూడా బీజేపీ-టీడీపీ కలిసి పోటీచేయడం అనుమానంగానే కనిపిస్తోంది. ఒకవేళ ఆంధ్రాలో టీడీపీతో పొత్తు పెట్టుకొని, తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయడం సాధ్యమవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.   అయితే తెలంగాణ టీడీపీ నేతలు మాత్రం... అప్పుడే పొత్తులపై చర్చ అనవసరం అంటున్నారు. ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలాగైనా మారవచ్చని, ఈ రెండేళ్లలో ఏమైనా జరగొచ్చని చెబుతున్నారు. అయినా మహాకుటమిగా ఏర్పడి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చూస్తుంటే బీజేపీ నేతలు ఇలా మాట్లాడడం కరెక్టు కాదంటున్నారు

నియోజకవర్గానికో బైక్‌... తెలంగాణ బీజేపీ నయా ప్లాన్‌

  తెలంగాణలో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది కమల దళం.  వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ నేతలు... యూపీ వ్యూహాన్ని తెలంగాణ గడ్డపై అమలు చేయబోతున్నారు. యూపీలో పార్టీని గద్దెనెక్కించిన బైక్ లను, కమలాన్ని వికసించేలా చేసిన ఫుల‌్ టైమర్లను ఇక్కడ రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే 70మందికి పైగా ఫుల్ టైమర్లను కార్యక్షేత్రంలోకి దించిన రాష్ట్ర పార్టీ... మరో 49 మందిని ఎంపిక చేసే పనిలో పడింది.  ఈనెల 22న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణ పర్యటనకు రానున్నందున.. ఈలోపే అందరిని రంగంలో దించాలని భావిస్తోంది.   యూపీ ఎలక్షన్లకు రెండేళ్ల ముందే ఫుల్ టైమర్లను అక్కడ దింపేసిన బీజేపీ అధిష్టానం.. నియోజకవర్గాల్లో కలియతిరగడానికి వారికి టూవీలర్లు అందించింది. రెమ్యునరేషన్ కూడా ఇచ్చింది. అదే స్పీడ్ తో అధికార పీఠాన్ని అధిరోహించింది. సరిగ్గా ఇదే ప్లాన్ ను తెలంగాణలో అమలు చేయాలనుకున్న బీజేపీ...  ఆ విజయ రథాలను సెంటిమెంట్ గా ఇక్కడికి రప్పించింది.   నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 119 బైక్ లను సిద్దం చేస్తున్నారు బీజేపీ నేతలు. అవసరమైతే.. ఎన్నికల నాటికి మరో వంద వాహనాలను అదనంగా అందించాలని అనుకుంటున్నారు. పెద్ద నియోజకవర్గాల్లో ఇద్దరు చొప్పున ఫుల్ టైమర్లను నియమించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా యూపీలో అనుసరించిన ప్రణాళికనే తెలంగాణలోనూ ఫాలో కావాలని, ఇక్కడ కూడా కాషాయ జెండాలు రెపరెపలాడించాలని ఆ పార్టీ భావిస్తోంది. మరి యూపీలో సక్సెసైన ప్లాన్‌... తెలంగాణలో వర్కవుట్‌ అవుతుందో లేదో చూడాలి.

వాన్నా క్రై… అమెరికా ప్రపంచం మీద చేస్తోన్న దాడేనా?

  వాన్నా క్రై… అంటే ఏడవాలని వుందా… అని అర్థం! నిజంగానే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది కంప్యూటర్ల యజమానులు ఏడుస్తున్నారు. తలలు పట్టుకుంటున్నారు. దేశాలకు దేశాలే తమ వ్యవస్థలు గందరగోళమైపోయి పిచ్చి చూపులు చూస్తున్నాయి. అయితే, లెటెస్ట్ న్యూస్ ఏంటంటే… వాన్నా క్రై కంటే ఇంకా ఎక్కువ ఏడిపించే వైరస్ మరొకటి ఆల్రెడీ సిస్టమ్స్ లోకి చొరబడిందట! చైనాలో ఈ సైబర్ పురుగును కనుగొన్నారట! అయినా… అసలు అమెరికా, నార్త్ కొరియా మధ్య కమ్ముకుంటోన్న యుద్ధ మేఘాలు మొదలు ప్రపంచంలో బోలెడు సమస్యలుండగా ఈ వైరస్ ల గోలేంటి? దీని వెనుక అసలు ఎజెండా ఏంటి?   కంప్యూటర్ల యుగం వచ్చాక వైరస్ లు కూడా మామూలైపోయాయి. ఎప్పుడూ ఏదో ఒక వైరస్ ల్యాప్ టాపుల్లోకి, డెస్క్ టాపుల్లోకి చొరబడి నానా డ్యామేజ్ చేస్తూనే వస్తోంది. కొత్తగా స్మార్ట్ ఫోన్లు కూడా లిస్ట్ లో చేరటంతో వైరస్ బాధ మరింత పెరిగిపోయింది. అయితే, ఇప్పుడొచ్చిన వాన్నా క్రై లాంటి వైరస్ లు సాధారణ పురుగుల కంటే బలమైనవి కావటంతో టెన్షనూ ఎక్కువే పెడుతుంటాయి. నష్టం కూడా ఎక్కువ తెస్తుంటాయి. అయితే, వీట్ని ప్రయోగించి హ్యాకర్లు డబ్బు లాగాలని చూస్తుంటారని అందరికీ తెలిసిందే. వాన్నా క్రై దెబ్బకి ఇప్పటికే 50వేల డాలర్లు చెల్లించారట ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్ యూజర్లు. హ్యాకర్ల పంట పండిందనే చెప్పాలి!   వైరస్ ను ప్రయోగించి … కంప్యూటర్లను కూల్చి… డబ్బులు లాగటం… ఇంత వరకూ ఓకే! కాని, అసలు ఈ పని చేస్తోన్న హ్యాకర్లని ఏ దేశమూ పట్టుకోలేకపోవటం కాస్త విచిత్రమే. లేదంటే ఇప్పుడున్న రక్షణ వ్యవస్థల బలహీనత అనాలి. ఇకపోతే, ఇప్పుడు వాన్నా క్రై పేరుతో అందర్నీ ఏడిపిస్తోన్న వైరస్ పుట్టింది అమెరికాలోనే. సీఐఏ వారు ఇలాంటి ప్రమాదకర మాల్ వేర్ల లాంటివి ఇంకా బోలెడు తయారు చేసి దేశ దేశాల కంప్యూటర్లలోకి చొరబడాలని భావించారు. కానీ, అంతలోనే అవి కాస్తా అడ్డదారుల్లో లీకైపోయి హ్యాకర్ల చేతికి చిక్కాయి. వాళ్లు ఇప్పుడు వాన్నా క్రై రూపంలో మొదటి బాంబు మాత్రమే పేల్చారు. ఇంకా బోలెడు సైబర్ అరాచకాలు ముందు ముందు జరగవచ్చు!   వాన్నా క్రై వైరస్ ప్రబలటం వెనుక వున్న కథంతా చూస్తే ఒక్క అనుమానం ఎవరికైనా కలగక మానదు. ఇదంతా అనుకోకుండా జరిగిందా? అమెరికానే కావాలని చేయిస్తోందా? అమెరికా కాకుండా మరేదైనా శక్తి ఇలాంటి నాటకాలు ఆడుతూ అత్యంత కీలకమైన సమాచారం రాబడుతోందా? ఊరికే కోట్లాది కంప్యూటర్లు హ్యాకైతే ఎవరికైనా వచ్చే లాభం ఏముంటుంది? ఇలాంటి ప్రశ్నలు బోలెడు తలెత్తుతాయి. దేనికీ స్పష్టమైన జవాబు దొరక్కపోవచ్చు కాని…. వున్నట్టుండీ వైరస్ కలకలం బయలుదేరటం ఎవరో క్రిమినల్ మైండ్ వున్న సైబర్ నేరగాళ్ల పనిలా మాత్రం అనిపించదు. పక్క ప్లాన్ ప్రకారం చాలా పెద్ద లాభం ఆశించి చేసినట్టే అనిపిస్తుంది! అదేంటో ముందు ముందు తెలుస్తుండవచ్చు. అమెరికా పాత్రే ఈ వ్యవహారంలో కీలకం అవ్వొచ్చు!

టీఆర్‌ఎస్‌ నేతలపై కేసీఆర్‌కు అనుమానం... అందుకే వాయిదాలు..!

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి మూడేళ్లయిపోతోంది. కానీ నామినేటెట్‌, పార్టీ పదవులు భర్తీ మాత్రం జరగడం లేదు. పదవుల భర్తీపై ఆశలు పెట్టుకున్న నేతలు... ఎదురుచూసీచూసి అలసిపోతున్నారు. ఎన్నోసార్లు పదవుల భర్తీకి ముహూర్తాలు ఖరారైనా... ఏదో ఒక కారణంగా వాయిదా పడుతుండటంతో ఆశావహుల ఆవేదన కట్టలు తెంచుకుంటోంది. ఉద్యమం కాలం నుంచి కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ను అంటిపెట్టుకుని ఉన్న నేతలు నైరాశ్యంలోకి వెళ్లిపోతున్నారు. ప్లీనరీకి ముందు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న నేతలకు నామినేటెడ్‌ పదవులు ఇస్తామని కేసీఆర్‌ హామీ ఇఛ్చారు. నామినేటెడ్‌ పదవులు దక్కనివాళ్లకి పార్టీ పదవుల్లో న్యాయం చేస్తామని చెప్పారు. దాంతో పార్టీ ప్లీనరీ సందర్భంగా పదవుల భర్తీ ఉంటుందని భావించారు. అయితే ప్లీనరీ ముగిసింది...పదవుల భర్తీ మాత్రం జరగలేదు. దాంతో నౌ ఆర్‌ నెవ్వర్‌ అనే భావన గులాబీ లీడర్లలో వ్యక్తమవుతోంది.    కార్యవర్గం, కమిటీలు, అనుబంధ కమిటీలు లేకుండా అన్నీతానై నడుపుతున్నారు గులాబీ బాస్‌. దీనికి తోడు జిల్లా కమిటీలను పూర్తిగా నిర్వీర్యం చేశారు కేసీఆర్‌. జిల్లా కమిటీలకు ఎలాంటి ప్రాధాన్యత లేకుండా... నేరుగా నియోజకవర్గ కమిటీలు వేశారు. అయితే దీని వెనుక పెద్ద స్ట్రాటజీనే ఉన్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కని నేతల ప్రాధాన్యతను తగ్గించేందుకే కేసీఆర్‌... పార్టీ పదవులను భర్తీ చేయడం లేదనే టాక్‌ వినిపిస్తోంది. టికెట్లు దక్కని నేతలు... పార్టీ ఫిరాయించే అవకాశం లేకపోలేదని... అందుకే ఫలనా స్థాయి వ్యక్తి పార్టీ మారాడన్న అపవాదు రాకూడదంటే పార్టీలో హోదా లేకపోతే తలనొప్పులుండవని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఎలాగూ పార్టీ బలంగానే ఉండటంతో పార్టీ పదవులు భర్తీ చేయాల్సినంత తొందరలేదనే భావనలో కేసీఆర్ ఉన్నారట.   అయితే అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా నామినేటెడ్‌ పదవుల పందేరం మొదలుకాకపోవడంపై గులాబీ నేతలు దిగులు పడుతున్నారు. పదవుల కోసం ఎదురుచూసీచూసి అలసిపోతున్నారు.

ఉత్తమ్‌ టార్గెట్‌గా జానా స్కెచ్‌... తెరపైకి కొత్త ఫార్ములా..!

మళ్లీ అధికారం తమదేనంటూ టీఆర్‌ఎస్‌ ధీమాగా దూసుకుపోతుంటే... 2019లో పవర్‌లోకి వచ్చేది తామేనంటూ బీరాలు పలుకుతోన్న టీకాంగ్రెస్‌ నేతలు మాత్రం ఇంటర్నల్‌ ఫైటింగ్‌తోనే సరిపెట్టుకుంటున్నారు. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌‌కు వ్యతిరేకంగా ఓ వర్గం గట్టిగానే పనిచేస్తోంది. దాంతో పార్టీ కార్యక్రమాల విషయంలో క్లారిటీ లేకుండా పోతోందని అంటున్నారు. ముఖ్యంగా ఉత్తమ్‌ అంటే దిగ్విజయ్‌కి పడటం లేదనే టాక్‌ కూడా పార్టీలో నడుస్తోంది. దిగ్విజయ్‌ సింగే... ఉత్తమ్‌కి వ్యతిరేకంగా అధిష్టానానికి రాష్ట్ర నేతలతో పదేపదే ఫిర్యాదులు చేయిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఆమధ్య ఉత్తమ్‌పై కోమటిరెడ్డి బ్రదర్స్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడటం వెనుక కూడా దిగ్విజయ్‌ హస్తముందనే టాక్‌ ఉంది.   తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలంటే సమూల మార్పులు జరగాలని హైకమాండ్‌పై రాష్ట్ర నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యంగా పీసీసీ, సీఎల్పీ సారథ్యం ఒక్కరికే ఇవ్వాలనే వాదన తెరపైకి తెచ్చినట్లు చెబుతున్నారు. పీసీసీ, సీఎల్పీలకు వేర్వేరు నేతలు సారథ్యం వహిస్తుండటంలో పార్టీలో గ్రూపులు పెరిగిపోయాయని, అదే రెండు పదవులకూ ఒక్కరే నాయకత్వం వహిస్తే... నేతల్లో ఐక్యమత్యం పెరిగే అవకాశముందని వాదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే వాదనను హైకమాండ్‌ ముందుపెట్టిన సీఎల్పీ నేత జానారెడ్డి.... పీసీసీ పదవిని కూడా తనకే అప్పగించాలని ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పీసీసీ, సీఎల్పీ పదవులు ఒక్కరికే కట్టబెట్టడం ద్వారా పార్టీని లీడ్‌ చేయడం ఈజీ అవుతుందని, తద్వారా గెలుపు అవకాశాలు పెరుగుతాయని చెప్పినట్లు తెలుస్తోంది.    అయితే ఉత్తమ్‌కి వ్యతిరేక వర్గం బలంగా ఉండటంతో... పీసీసీ, సీఎల్పీ పదవులు ఒక్కరికే కట్టబెట్టాలన్న వాదనకి పార్టీలో మద్దతు పెరుగుతోంది.

రానురాను అంటూనే రజనీ వచ్చేస్తున్నాడా?

ఆ దేవుడు ఆదేశిస్తాడు...ఈ అరుణాచలం పాటిస్తాడు... ఇరవై ఏళ్ల క్రితం రజనీకాంత్‌ చెప్పిన ఈ డైలాగ్‌ తమిళనాట ఓ ఊపు ఊపింది. ఇప్పుడు అదే స్టైల్లో... నా భవిష్యత్తును ఆ దేవుడే నిర్ణయిస్తాడంటూ తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చెబుతున్న రియల్ డైలాగ్‌ తమిళనాట ప్రకంపనలు పుట్టిస్తోంది. కొద్దిరోజులుగా అభిమానులతో సమావేశమవుతోన్న రజనీకాంత్‌... త‌న‌కు రాజకీయాల్లోకి వ‌చ్చే ఉద్దేశం లేందటూనే... దేవుడు ఆదేశిస్తే మాత్రం కచ్చితంగా రాజకీయాల్లో వస్తానంటూ తేల్చేశారు. దేవుడు ప్రస్తుతానికి తనను న‌టుడిగా చూడాలనుకుంటున్నాడనీ...అది నెరవేరుస్తున్నాననీ,  ఒక‌వేళ దేవుడు నిర్ణయిస్తే మాత్రం రాజ‌కీయాల్లోకి కచ్చితంగా వ‌స్తానన్నారు.   21 ఏళ్ల క్రితం తాను ఓ రాజకీయ కూటమికి మద్దతిచ్చి తప్పుచేశానన్నారు రజనీకాంత్. దాన్ని ఓ పొలిటికల్ యాక్సిడెంట్‌ గా అభివర్ణించారు. అప్పటి నుంచి చాలా మంది నేత‌లు తన పేరును దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. ఇక శ్రీలంక పర్యటనను రద్దు చేసుకోవడంపైనా రజనీ వివరణ ఇచ్చారు. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే మార్చుకోవాల్సి ఉంటుందన్నారు.    అభిమానుల ఆకాంక్షలను ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయనన్నారు రజనీ, రాజకీయాల్లోకి వచ్చేది...లేనిది కచ్చితంగా తేల్చనప్పటికీ... రావాలని నిర్ణయిస్తే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటానన్నారు. ఒకవేళ పొలిటికల్‌ ఎంట్రీ జరిగితే తప్పుడు వ్యక్తులను దగ్గరకి చేరనివ్వనని... నిజాయ‌తీగా ప‌నిచేస్తాన‌ని రజనీ చెప్పుకొచ్చారు. అయితే దేవుడు ఆదేశిస్తే రాజకీయాల్లోకి వస్తానన్న రజనీ వ్యాఖ్యలు... పెద్ద పొలిటికల్‌ జోక్‌ అంటూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సెటైర్లేశారు. రజనీకి అంత సీన్‌ లేదని, ఎక్కువగా ఊహించుకోవద్దని అప్పుడే అటాక్‌ మొదలుపెట్టారు.

రాములమ్మ చూపు.. తెలుగుదేశం వైపు !!

చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. అప్పటి నలుగురు అగ్ర హీరోలతోనూ సూపర్ హిట్స్ కలిగిన విజయశాంతికి సోలోగానూ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. చిరంజీవితో 'ఛాలెంజ్, పసివాడి ప్రాణం, అత్తకు యముడు.. అమ్మాయికి మొగుడు, గ్యాంగ్ లీడర్' వంటి పలు విజయాలు విజయశాంతికి ఉన్నాయి. బాలకృష్ణతో 'ముద్దుల మామయ్య, కథానాయకుడు, లారీ డ్రైవర్' వంటి ఘన విజయాలు కలిగిన విజయశాంతికి.. నాగార్జునతో 'జానకీరాముడు', వెంకటేష్ తో 'శత్రువు' వంటి హిట్స్ ఉన్నాయి. చిరంజీవి, బాలకృష్ణలతో పోల్చితే.. నాగార్జున, వెంకటేష్ లతో విజయశాంతి నటించిన సినిమాలు కూడా తక్కువే. ఈ నలుగురుతోనే కాదు.. కృష్ణ, శోభన్ బాబు వంటి సీనియర్ హీరోలతోనూ నటించిన ఘనత విజయశాంతి సొంతం.   ఇక సోలో హీరోయిన్ గా 'ప్రతిఘటన, కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ' వంటి బ్లాక్ బస్టర్స్ కలిగి ఉండడం వల్ల.. విజయశాంతిని లేడీ అమితాబ్ బచ్చన అని కూడా పిలిచేవారు. అందుకే.. విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆమెకు విపరీతమైన క్రేజ్ ఉండేది. అయితే.. రాజకీయాల్లో ఆమె తీసుకున్న తప్పుడు నిర్ణయాలు.. ఈ రంగంలో విజయశాంతికి సరైన విజయాలు ఇవ్వలేకపోయాయి. మొదట బీజేపీలో, తరవాత తెరాసలో, మళ్ళీ బీజేపీలో ఉండి తన రాజకీయ జీవితాన్ని ఎటూ కాకుండా చేసుకొంది విజయశాంతి.   త్వరలో మళ్ళీ సినిమా రంగ ప్రవేశం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న విజయశాంతి.. రాజకీయాల్లో కూడా మళ్ళీ క్రియాశీలంగా ఉండాలని యోచిస్తున్నదని తెలుస్తోంది. పైన పేర్కొన్న నలుగురు అగ్ర హీరోల్లో.. నందమూరి బాలకృష్ణతో విజయశాంతికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. బాలయ్య-విజయశాంతి నటించిన 'నిప్పురవ్వ' చిత్రానికి అనధికారిక నిర్మాత ఆమెనే. ఆ అనుబంధంతో విజయశాంతి తెలుగుదేశంలో చేరే అవకాశం ఉందనే వార్తలొస్తున్నాయి. తెలంగాణా తెలుగుదేశం పార్టీని పటిష్టం చేసేందుకు రేవంత్ రెడ్డికి విజయశాంతి వంటి జనాకర్షక నేత అవసరమని తెలుగుదేశం అధినాయకత్వం భావిస్తున్నదని, తెలుగుదేశం వచ్చిన పిలుపుకు విజయశాంతి కూడా సానుకూలంగా స్పందించిందని సమాచారం!!