6 నెలల బిడ్డను బలిచ్చిన తల్లి?
posted on Apr 16, 2021 9:29AM
మూఢభక్తి జనాలను మూర్కులుగా మార్చేస్తోంది. అతీత శక్తుల కోసం దారుణాలకు తెగబడుతున్నారు. సొంత వారినే హతమారుస్తున్నారు. దేవుడి పేరుతో మారణహోమానికి పాల్పడుతున్నారు. మదనపల్లిలో అక్కా చెల్లెళ్ల దారుణ హత్యలు మరవకముందే... తమిళనాడులో అలాంటి ఘటనే వెలుగుచూసింది. పిల్లలు ముందే అప్రమత్తం కావడంతో తమిళనాడులో ఘోరం జరగలేదు. ఇప్పుడు అలాంటి దారుణ ఘటనే తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసింది. బీఎస్సీ, బీఈడీ చదివి ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సన్నద్ధమైన ఓ మహిళ మూఢభక్తితో తన ఆరేళ్ల బిడ్డను దేవుడి పటాల ముందు బలిచ్చింది. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారంసూర్యాపేట జిల్లాలోని మోతె మండలం మేకలపాటి తండాకు చెందిన బానోత్ భారతి బీఎస్సీ, బీఈడీ చదువుకుంది. ఉద్యోగాలకు కూడా సన్నద్ధమైంది. ఎనిమిదేళ్ల క్రితం మహబూబాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తితో వివాహమైంది. అయితే మనస్పర్థల కారణంగా కొన్ని రోజులకే విడిపోయారు. అప్పటి నుంచి పుట్టింటిలోనే ఉంటున్న భారతి.. రెండేళ్ల క్రితం తండాకే చెందిన కృష్ణ అనే యువకుడిని ప్రేమించింది. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఆత్మహత్యకు యత్నించింది. దీంతో పెద్దలు వారి పెళ్లి చేశారు. ఆరు నెలల క్రితం వీరికి కూతురు పుట్టింది. అయితే భారతి నిత్యం యూట్యూబ్లో ఆధ్యాత్మిక వీడియోలు చూస్తూ గడిపేది. తనను తాను శివుడిగా భావించేది.
ఇటీవల గ్రామానికి ఓ సాధువు రాగా, ఆమెకు నాగదోషం ఉన్నట్టు చెప్పాడు. అప్పటి నుంచి భారతి మానసిక పరిస్థితి మరింత దిగజారింది. నిత్యం పూజలతోనే గడిపేది. భర్త పనిమీద సూర్యాపేటకు వెళ్లగా, అత్తమామలు పొలం పనులకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన భారతి కుమార్తె రీతును దేవుడి పటాల ముందు పడుకోబెట్టి కత్తితో గొంతుకోసి హతమార్చింది. తర్వాత పుట్టింటికి వెళ్లింది. ఒంటరిగా రావడంతో గమనించిన భారతి తల్లి కుమార్తె ఎక్కడని ప్రశ్నించింది. సమాధానం చెప్పకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికెళ్లి చూడగా దేవుడి పటాల ముందు రక్తపు మడుగులో చిన్నారి విగతజీవిగా కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.