ఈసారైనా "మేయని వారికి" మేయర్ పదవి దక్కుతుందా దొరా.. కేసీఆర్ పై రాములమ్మ ఫైర్
posted on Nov 17, 2020 @ 12:06PM
దుబ్బాక ఎన్నికల సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శలు చేసిన కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ విజయశాంతి తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మరోసారి విరుచుకు పడ్డారు. "మేయరు" పదవి అంటే మేసేవారికే అన్నట్లు తయారైందని… కనీసం ఈసారైనా "మేయరు.." అనే వారికి మేయర్ పదవి ఇస్తారా అని ఆమె సూటిగా ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో స్పందించిన ఆమె ఫేస్బుక్ వేదికగా కేసీఆర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ మేయర్ పదవిని "మేసేవారికి కాకుండా మేయరు " అనే వారికి దక్కాలని తానూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. ‘‘దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దొరహంకార గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వంద సీట్లకు పైగా గెలుస్తామని వాస్తవానికి దూరమైన ప్రకటనలు చేస్తూ.. సీఎం దొర గారు ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అల్లావుద్దీన్ అద్భుతదీపం మాదిరిగా, అసదుద్దీన్ అద్భుతదీపంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అద్భుతాలు జరుగుతాయని సీఎం దొరగారు ఆశలు పెంచుకున్నారని అర్థమవుతోంది".
అంతేకాకుండా "చాలా ఏళ్ల పాటు గెలిచిన నియోజకవర్గాల్లో ఏమాత్రం అభివృద్ధి చేయకుండా… కేవలం విద్వేష ప్రసంగాలతో మాయమాటలు చెప్పి పాతబస్తీ ఓటర్లను మోసం చేయడంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అందె వేసిన చేయిగా మారిపోయారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండానే ఓటర్లను మాయ చేసి.. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునే ఫార్ములా గురించి కెసిఆర్ గారు ఎమ్ఐఎమ్ అధినేతతో మంతనాలు జరిపారన్న ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో కెసిఆర్ గారి హామీలపై భ్రమలు పెంచుకున్న గ్రేటర్ వోటర్లు ఈసారి మాత్రం టిఆర్ఎస్ అభ్యర్ధులకు తగిన గుణపాఠం నేర్పేందుకు సిద్ధమవుతున్నారు. ఎంఐఎం తో కలిసి జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఎన్నో జిమ్మిక్కులు చేయాలనుకుని సీఎం దొరగారు వేసుకున్న లెక్కలన్నీ ఈసారి తారుమారు కాబోతున్నాయని ఈ మధ్య కాలంలో ఓటర్ల నాడిని చూస్తే అనిపిస్తోంది. ఏది ఏమైనా జీహెచ్ఎంసీ మేయరు పదవి ఈ పర్యాయం "మేసేవారికి" కాక "మేయరు..." అనే వారికి దక్కాలని ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారన్నది వాస్తవం’’ అని విజయశాంతి తన పోస్టులో పేర్కొన్నారు.