బెంగాల్ వదిలేసి గుజరాత్ వెళ్లిపోండి! బీజేపీ చీఫ్కు టీఎంసీ కౌంటర్
posted on Nov 17, 2020 @ 11:00AM
సవాళ్లు, ప్రతిసవాళ్లతో పశ్చిమ బెంగాల్ రాజకీయం వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా బెంగాల్ బీజేపీ చీఫ్, ఎంపీ దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు సెగలు రేపుతున్నాయి. ఉత్తర 24 పరగణ జిల్లాలోని బరసాత్లో మాట్లాడిన ఘోష్.. వచ్చే ఎన్నికల్లో తాము కనుక అధికారంలోకి వస్తే బెంగాల్ను గుజరాత్లా మారుస్తామని చెప్పారు. తాము ఈ మాటంటే మమత బెనర్జీ విమర్శిస్తున్నారని, కానీ తాము అధికారంలోకి వస్తే తప్పకుండా ఆ పని చేస్తామని తెలిపారు. అప్పుడు తమ పిల్లలు ఉద్యోగాల కోసం గుజరాత్ వెళ్లాల్సిన పని ఉండదన్నారు. అందరికీ ఎంచక్కా ఇక్కడే ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు దిలీప్ ఘోష్.
దిలీఫ్ ఘోష్ కామెంట్లకు బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీం కౌంటరిచ్చారు. అలా అయితే ఘోష్ వెంటనే రాష్ట్రాన్ని వదిలేసి గుజరాత్ వెళ్లిపోయి అక్కడే స్థిరపడాలని డిమాండ్ చేశారు. గుజరాత్లో అదానీ, అంబానీ లాంటి వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, ఫలితంగా చిరు వ్యాపారులు చితికిపోయారని హకీం ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి బెంగాల్ నుంచి గుజరాత్కు తరలివెళ్లిన నానో కంపెనీని కూడా మూసివేశారని మంత్రి విమర్శించారు. గుజరాత్ అల్లర్లలో దాదాపు 2 వేల మంది చనిపోయారని చెప్పిన హకీం.. ఇష్రాత్ జహాన్ వంటి ఎందరో ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ను గుజరాత్లా మారుస్తామని అంటున్నారని, అదే జరిగితే ఇక్కడి ప్రజలు నిత్యం ఎన్కౌంటర్ల భయంతో బతకాల్సి వస్తుందని చెప్పారు ఫిర్హాద్ హకీం.