విజయాడైరీ మాజీ చైర్మన్ మండవ జానకిరాయ్య కన్నుమూత

విజయ డెయిరీ మాజీ ఛైర్మన్‌ మండవ జానకిరామయ్య గురువారం (నవంబర్ 6)  కన్నుమూశారు. ఆయన వయస్సు 93 ఏళ్లు. గత కొంతకాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గన్నవరం శివారులోని రుషివాటిక వృద్ధుల నిలయంలో  గురువారం (నవంబర్ 5) ఉదయం తుదిశ్వాస విడిచారు.  జానకిరామయ్య 27 సంవత్సరాలపాటు  విజయ డెయిరీ ఛైర్మన్‌గా సేవలందించారు. జానకిరామయ్యకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

డెయిరీ రంగానికి ఆయన అందించిన విశిష్ఠ సేవలకు గాను జానకిరామయ్యకు 2012లో డాక్టర్ కురియన్ అవార్డు లభించింది. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. మండవ జానకిరామయ్య అంత్యక్రియలు గురువారం (నవంబర్ 6) సాయంత్రం ఆయన స్వగ్రామమైన మొవ్వలో జరుగుతాయి. 

పంచాయితీ భయంతో కట్టుకున్న వాడినే కడతేర్చింది!

 అక్రమ సంబంధం బయటపడకూడదని కట్టుకున్న భర్తనే కడతేర్చిన భార్య ఉదంతమిది. ఈ ఢటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం తిమ్మాపూర్ లో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.  తిమ్మాపూర్ గ్రామానికి చెందిన స్వామి, మౌనికలకు 12 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. అయితే మౌనిక తనకన్నా వయస్సులో చిన్న వాడైన సంపత్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం  ఏర్పరుచుకుంది. విషయం తెలిసిన భర్త స్వామి పలుమార్లు ఆమెను తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు. ఫలితం లేకపోవడంతో  గ్రామ పెద్దలు, బంధువుల ముందు పంచాయతీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీంతో విషయం తెలిసిన మౌనిక తన బండారం నలుగురికీ తెలిసిపోతుందన్న భయంతో భర్త హత్యకు పథకం పన్నింది.  ఈ నేపథ్యంలోనే గత నెల 22న ఇంట్లో భర్త నిద్రపోతుండగా.. ప్రియుడు సంపత్ ను ఇంటికి పిలిచింది. ప్లాన్ ప్రకారం ఇరువురూ కలిసి స్వామి గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం అతడి మృతదేహాన్ని నేరెళ్ల కుంటలో పడేశారు.  మద్యం మత్తులో చెరువులో పడి చనిపోయాడు కట్టుకథ అల్లి అందర్నీ నమ్మించాలని ప్రయత్నించిన మౌనికకు స్వామి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. పోలీసుల విచారణలో మౌనిక నేరం ఒప్పుకుంది. ఆమెను, ఆమె ప్రియుడు సంపత్ ను పోలీసులు అరెస్టు చేశారు.  

డమ్మీ గన్ తో బెదరించి..గొడ్డలితో దాడి చేసి బంగారం దోపిడీ!

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం ప్రాంతంలో ఓ జ్యువెలరీ షాప్ దోపిడీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కస్టమర్ల ముసుగులో వచ్చిన ఇద్దరు దుండగులు డమ్మీ గన్‌తో బెదిరించి, షాప్ యజమానిపై గొడ్డలితో దాడి చేసి నాలుగు తులల బంగారం దోచుకున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయ పడిన షాప్ యజమాని సందీప్ చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.  రాంపల్లి, ఘట్‌కేసర్ ప్రధాన రహదారిపై సత్యనారాయణ కాలనీలో బాలాజీ జ్యువెలర్స్  షాప్‌కు శుక్రవారం సాయంత్రం సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కస్టమర్లలా వచ్చారు. సాధారణ కొను గోలుదారుల మాదిరిగా షాప్‌లోకి ప్రవేశించిన వారు. కొద్దిసేపటికి ఒక్కసారిగా తమ వద్ద ఉన్న టాయ్ గన్ తో  షాప్ యజమాని సందీప్ కుమారుడిని చంపేస్తామని బెదిరించారు. అనంతరం షాప్‌లో ఉన్న బంగారు బాక్స్‌లను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. పరిస్థితిని గమనించిన సందీప్ ధైర్యంగా వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో దుండగులలో ఒకడు తన వద్ద ఉన్న గొడ్డలి లాంటి పదునైన ఆయుధంతో సందీప్ తలపై బలంగా దాడి చేశాడు. ఒక్కసారిగా జరిగిన దాడిలో  సందీప్ తీవ్రంగా గాయపడి రక్తగాయాలతో కుప్పకూలిపోయాడు. అనంతరం దుండగులు   నాలుగు తులల బంగారాన్ని తీసుకుని పరారయ్యారు. ఓనర్ తీవ్రంగా ప్రతిఘటిం చడంతో వారు ఉపయో గించిన డమ్మీ గన్‌ను అక్కడే వదిలేసి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.అరుపులు, గట్టి గట్టిగా కేకలు వినిపించడంతో స్థానికులు లోపలికి వచ్చి చూడగా.. సందీప్ రక్తం మడుగులో పడి ఉన్నాడు. స్థానికుల సమాచారం మేరకు  కీసర పోలీసులు  సంఘటనా స్థలానికి చేరుకుని  సందీప్‌ను తక్షణమే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.  ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.   కాగా దోపిడీ జరిగిన షాప్ పరిసరాలను, దుండగులు ప్రవేశించిన మార్గాలను పోలీసు అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి కీలక ఆధారాలు సేకరించారు.  నిందితులు వదిలేసిన డమ్మీ గన్‌తో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. షాప్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు సేకరించి పరిశీలిస్తున్నారు. దుండగుల్ని పట్టుకునేందుకు ఎస్‌వోటీతో పాటు స్థానిక పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఈ దోపిడీ ఘటనతో నాగారం, కీసర పరిధిలోని వ్యాపార వర్గాలు తీవ్ర భయాందోళనకు గురయ్యాయి. ముఖ్యంగా జ్యువెలరీ షాప్‌ల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పట్టపగలే ఇలాంటి ఘటన జరగడం కలవరపెడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

సమష్టిగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని అభివృద్ధి!

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సమష్టిగా అభివృద్ధి చేసుకుందామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. అత్యంత మహిమాన్వితుడైన ఆంజనేయ స్వామి ఓ ప్రాంతానికి మాత్రమే దేవుడు కాదన్న ఆయన.. కొండగట్టు ఆంజనేయస్వామివారి సేవ చేసుకోవడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు.  పవన్ కళ్యాణ్   శనివారం (జనవరి 3)  కొండగట్టు  ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయలం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.  గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన అనంతరం అప్పట్లో కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న పవన్ కల్యాణ్ ఆ సందర్భంగా ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం   35.19 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంలో  నేడు దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణానికి పవన్ కల్యాణ్ శనివారం (జనవరి 3) శంకుస్థాపన చేశారు.  కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ గిరి ప్రదక్షిణ మార్గాన్ని కూడా సమష్టిగా సాకారం చేద్దామని పిలుపు ఇచ్చారు.   రామభక్తులు తలుచుకుంటే సాధ్యం కానిది అంటూ ఏమీ ఉండదన్న ఆయన  త్వరలోనే కొండగట్టు ఆలయంలో మరిన్ని అభివృద్ధి పనులు జరగాలన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులు స్వామి వారి ఆదేశంగా భావిస్తున్నానన్న ఆయన.. బలమైన సంకల్పంతో చేపట్టిన పనికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తగిన సహకారం అందిం చినందుకు ఆనందంగా ఉందన్నారు.  అంతకు ముందు కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి వచ్చిన పవన్ కల్యాణ్ కు వేదపండితులు శాస్త్రోక్తంగా  ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, స్వామి వారి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా కొండగట్టు గిరి ప్రదక్షిణకు మార్గాన్ని సాకారం చేయాలని, అందుకు తానే స్వయంగా వచ్చి కరసేన వేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ  మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్, టీటీడీ చైర్మన్   బీఆర్ నాయుడు, చొప్పదండి ఎమ్మెల్యే  మేడిపల్లి సత్యం, ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రభుత్వ విప్ శ పిడుగు హరిప్రసాద్, తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్, దేవాదాయశాఖ కమిషనర్ హరీష్, జిల్లా కలెక్టర్  సత్యప్రసాద్, టీటీడీ బోర్టు సభ్యులు ఆనందసాయి,  మహేందర్ రెడ్డి, టీటీడీ ఎల్.ఎ.సి. ఛైర్మన్ శంకర్ గౌడ్, పోలీస్ హౌసింగ్ బోర్డు ఛైర్మన్  కళ్యాణం శివ శ్రీనివాస్, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి తదితరులు పాల్గొన్నారు.

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం అభివృద్ధి పనులకు పవన్ కల్యాణ్ శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణలోని   ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.  ఈ సందర్భంగా ఆయన ఆలయ పరిసరాల్లో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.  కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి ఏటా లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా  ముఖ్యంగా అయ్యప్ప మాలధారులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో  35.19 కోట్ల రూపాయల వ్యవయంతో  భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. పవన్ కల్యాణ్ చొరవతో టీటీడీ ఈ నిధులను అందజేసింది. ఈ మౌలిక సదుపాయాలలో ప్రధానంగా  దీక్ష విరమణ మండపం, భక్తుల సత్రం నిర్మాణం వంటివి ఉన్నాయి.   టీటీడీ నిధులతో ఇక్కడ నిర్మించనున్న దీక్ష విరమణ మండపంలో  ఒకేసారి   రెండువేల మంది   భక్తులు అయ్యప్ప దీక్ష విరమణ చేసేలా విశాలంగా నిర్మించనున్నారు. ఆధునిక సదుపాయాలతో పాటు, భక్తులకు అనుకూలంగా డిజైన్ చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. దీని వల్ల శబరిమల నుంచి వచ్చే అయ్యప్ప స్వామి భక్తులకు కొండగట్టులో దీక్ష విరమణ ప్రక్రియ మరింత సులభంగా మారనుంది. అలాగే   సత్రంలో మొత్తం 96 విశ్రాంతి గదులు ఏర్పాటు చేయనున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సౌకర్యవంతంగా విశ్రాంతి తీసుకునేలా ఈ గదులను అభివృద్ధి చేయనున్నారు. తాగునీరు, పారిశుధ్యం, భద్రత వంటి మౌలిక వసతులను కూడా సత్రంలో కల్పించనున్నారు. పవన్ కళ్యాణ్ కొండగట్టు దర్శనం రాజకీయంగా కాకుండా పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగింది. భక్తుల సౌకర్యాలే లక్ష్యంగా చేపట్టిన ఈ అభివృద్ధి పనులు కొండగట్టు ఆలయానికి మరింత ప్రాధాన్యత తీసుకువస్తాయని ఆలయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 14 మంది మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ రేంజ్‌లో  ఈ ఉదయం జరిగిన  రెండు ఎన్ కౌంటర్లలో  14 మంది మావోయిస్టులు ఖతమయ్యారు.  సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో జరిగిన స్పెషల్ సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా శనివారం (జనవరి 3) ఉదయంజరిగిన  రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి.  సుక్మా జిల్లాలో 12 మంది మావోలు మరణించగా,  బీజాపూర్ జిల్లాలో ఇద్దరు నక్సల్స్ మరణించారు.  సుక్మా జిల్లాలోని కొంటా   ప్రాంత అడవుల్లో ఉదయం  నుంచి భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య అడపాదడపా కాల్పులు కొనసాగాయి. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) బృందాలు నిర్వహిస్తున్న ఈ ఆపరేషన్‌లో కొంటా ఏరియా కమిటీకి చెందిన కీలక నాయకుడు సచిన్ మంగ్డు సహా 12 మంది మావోయిస్టులు హతమైనట్లు భద్రతా బలగాలు తెలిపాయి.  మృతులలో కొంటా ఏరియా కమిటీకి చెందిన ముగ్గురు మావోయిస్టులు ఉన్నారు.  సంఘటనా స్థలం నుంచిఏకే-47, ఐఎన్ఎస్ఏఎస్, ఎస్ఎల్ఆర్  రైఫిల్స్‌తో పాటు పెద్ద మొత్తంలో ఆటోమేటిక్ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా శనివారం (జనవరి 3) ఉదయం ఐదున్నర గంటల ప్రాంతంలో బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు హతమయ్యారు. దక్షిణ బస్తర్ ప్రాంతంలో సాయుధ మావోయిస్టుల సంచారంపై అందిన విశ్వసనీయ నిఘా సమాచారం ఆధారంగా భద్రతా దళాలుఈ సెర్చ్ ఆపరేషన్ చేపట్టి రెండు జిల్లాల్లో ఏకకాలంలో కూంబింగ్ నిర్వహించారు.   ఆ ప్రాంతంలో ఇంకా మావోయిస్టులు ఉండే అవకాశముందని భావిస్తున్న భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి.

పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ నంబర్ వన్.. పారిశ్రామిక ప్రగతిలోనూ గణనీయ పురోగతి

దేశంలో పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఆంధ్రప్రదేశ్  అగ్రస్థానంలో నిలిచింది. గడిచిన సంవత్సరంలో దేశంలో నమోదైన మొత్తం పెట్టుబడులలో ఆంధ్రప్రదేశ్ వాటా పాతిక శాతానికి మించి ఉంది. పారిశ్రామిక అభివృద్ధి విషయంలో కూడా గణనీయమైన ప్రగతి సాధించింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ స్వయంగా సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా వెల్లడించారు. గడిచిన ఏడాదిలో దేశం మొత్తం పెట్టుబడులలో ఆంధ్రప్రదేశ్ వాటా 25.3 శాతమని పేర్కొన్నా ఆయన ఇది దేశంలో ఏ ఇతర రాష్ట్రం కన్నా అధికమని పేర్కొన్నారు. ఇక పారిశ్రామిక ప్రగతి విషయంలో ఏపీ ఒడిషా, మహారాష్ట్రాలను దాటి ముందంజలో ఉందన్నారు.  పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుసరించిన విధానాలు, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ఎట్మాస్ఫియర్ కారణంగానే రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయనీ, రానున్న రోజులలో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు రానున్నాయనీ లోకేష్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. తన ట్వీట్ కు దేశంలో పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్‌ అవతరిస్తోందంటూ ఫోర్బ్స్ ఇండియా ప్రచురించిన కథనాన్ని ట్యాగ్ చేశారు. గడిచిన  ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో  దేశ వ్యాప్తంగా నమోదైన  మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం వాటా  ఏపీ దక్కించు కోగా,  ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో  13.1 శాతం వాటాతో ఒడిశా రెండో స్థానంలో  12.8 శాతం వాటాతో మహారాష్ట్ర మూడో స్థానంలోనూ నిలిచింది. ఈ మూడు రాష్ట్రాలూ కలిసి దేశ వ్యాప్తంగా పెట్టుబడులలో 51.2 శాతం వాటా దక్కించుకున్నాయి.  

ఒక్క బ్రిడ్జి.. నాలుగు జిల్లాల ప్రయాణ కష్టాలు హుష్ కాకీ!

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల కష్టాలను తీర్చే విషయంపై దృష్టి పెట్టింది. ఇందుకు తాజా తార్కాణం విశాఖపట్నం, రాజాం రోడ్డులో నాలుగేళ్ల కిందట శిథిలావస్థకు చేరి రాకపోకలకు అనువుగా లేని బ్రిడ్జిని అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే. ఈ ఒక్క బ్రిడ్జితో ఉత్తరాంధ్రలోని నాలుగు జిల్లాల ప్రజల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. ఔను ఎప్పుడో నాలుగేళ్ల కిందట విశాఖపట్నం, రాజాం రోడ్డులో చీపురుపల్లి సమీపంలో కీలకమైన రైల్వే ఓవర్ బ్రిడ్జిని అది శిథిలావస్థకు చేరుకుని ప్రమాదకరంగా మారడంతో మూసివేశారు. ఉత్తరాంధ్ర, ఒడిశాలను కలిపే ఈ కీలక బ్రిడ్జి మూతపడటంతో  వేలాది మంది ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. వీరు గమ్యస్థానాలకు చేరడానికి నిత్యం 50 కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ఈ బ్రిడ్జి మూత వల్ల పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ప్రజల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. రాజాం విశాఖల మధ్య దూరం కేవలం వంద కిలోమీటర్లే అయినప్పటికీ.. అదనంగా ఐదు గంటలు ప్రయాణించాల్సిన పరిస్థితి.  మూతపడిన బ్రిడ్జికి బదులుగా కొత్త బ్రిడ్జి నిర్మాణం ఆరంభమైనప్పటికీ పనులు చాలా చాలా నెమ్మదిగా సాగాయి. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. రైల్వే శాఖతో సమన్వయం కారణంగా నిధుల సమస్య లేకుండా పోయింది. అంతే నిర్మాణం ఏడాది కాలంలో పూర్తయ్యింది. ఈ కొత్త బ్రిడ్జిని సంక్రాంతి కానుకగా ఈ నెల 10న ప్రారంభం కానుంది.  ఈ ఒక్క బ్రిడ్జితో  నాలుగు జిల్లాల ప్రజల ప్రయాణ కష్టాలు హుష్ కాకీ అన్నట్లుగా ఎగిరిపోనున్నాయి.  

గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం

మూడో ప్రపంచ తెలుగు మహాసభలు  గుంటూరు లో  శనివారం (జనవరి 3) ప్రారంభమయ్యాయి. ఈ నెల 5వ తేదీ వరకూ మూడు రోజుల పాటు జరిగే  ఈ ప్రపంచ తెలుగు మహాసభలలో  తెలుగు భాషకు సంబంధించిన అనేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.   తెలుగు ప్రపంచ మహా సభలకు దేశంతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి అనేక మంది తెలుగు భాషాభిమానులు, విద్యావేత్తలూ తరలి వస్తున్నారు.  కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు శనివారం (జనవరి 3) ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీనివాస కల్యాణంలో ప్రపంచ తెలుగు మహా సభలకు అంకురార్పణ జరిగింది.   మూడు రోజుల పాటు జరిగే ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు, సన్మానాలతో పాటు  తెలుగు చలన చిత్ర గీతాలాపనలు జరగనున్నాయి. ఇక ప్రపంచ తెలుగుమహాసభల ముగింపు కార్యక్రమం సోమవారం  ( జనవరి 5) జరగనుంది. ఈ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాల్గొంటారు.  

సిర్గాపూర్ ఎస్సీ బాలుర వసతి గృహం వార్డెన్ సస్పెన్షన్

విద్యార్థుల పట్ల అమానుషంగా ప్రవర్తించడమే కాకుండా, అన్నంలో విషం పెట్టి వారిని చంపేయాలంటూ వ్యాఖ్యలు చేసిన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ ఎస్సీ హాస్టల్ వార్డెన్ ను సస్సెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. సిర్గాపూర్ ఎస్సీ బీలుర సంక్షేమ వసతి గృహం వార్డెన్ హాస్టల్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వారికి వేధిస్తుండటంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గురువారం (జనవరి 1) రాత్రి కడ్పల్, సిర్గాపూర్ రహదారిపై బైఠాయించారు. దీంతో అధికారులు హాస్టల్ కు వచ్చి విచారణ జరిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు వార్డెన్ కిషన్ నాయక్ పై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.    దీంతో  విద్యార్థులపై కక్ష పెంచుకున్న వార్డెన్ శుక్రవారం (జనవరి 2) పూటుగా మద్యం సేవించి హాస్టల్ కు వచ్చి విద్యార్థులను దుర్భాషలాడారు.  హాస్ల్ సిబ్బందికి పోన్ చేసి తన మీద ఫిర్యాదు చేసిన విద్యార్థులకు అన్నంలో విషం కలిపి చంపేయమంటూ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కిషన్ నాయక్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక నుంచి తెలంగాణలో రహదారి భద్రతా సెస్సు

తెలంగాణలో కొత్త వాహనాల కొనుగోలుదారులపై అదనపు భారం పడనుంది. రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ప్రభుత్వం  రహదారి భద్రతా సెస్సు ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. నూతన నిబంధనల ప్రకారం, ఇకపై రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి కొత్త బైక్‌పై రూ. 2 వేలు, కారుపై రూ. 5 వేలు, భారీ వాహనాలపై రూ. 10 వేల చొప్పున రహదారి భద్రతా సెస్సెను వసూలు చేస్తారు. అయితే  ఈ సెస్సు నుంచి ఆటోలు, ట్రాక్టర్ ట్రైలర్లకు  మినహాయింపునిచ్చారు. ఇక పోతే  సరుకు రవాణా వాహనాలకు ఇప్పటివరకు ఉన్న త్రైమాసిక పన్నును రద్దు చేస్తూ, దాని స్థానంలో 7.5 శాతం    లైఫ్ ట్యాక్స్ అమలు చేయాలని నిర్ణయించారు. అలాగే.. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే పాత వాహనాలపైనా  4  నుంచి 6.5 శాతం వరకు పన్ను వసూలు చేయనున్నారు. రోడ్డు భద్రతను మెరుగుపరచడంలో భాగంగా లైసెన్స్ జారీ ప్రక్రియను కూడా కఠినతరం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కంప్యూటర్ ఆధారిత డ్రైవింగ్ పరీక్షలను ప్రవేశపెడుతున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఏటా సుమారు 9 లక్షల కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్న నేపథ్యంలో, ఈ కొత్త సెస్సు ద్వారా ప్రభుత్వానికి రూ. 300 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరనుందని ఆయన చెప్పారు.