Read more!

స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఖర్చు 10 వేల కోట్లు! 

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపలు ఎన్నికలు ముగిశాయి. పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరిలో జరిగిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధించింది. సాధారణంగా ఎక్కడైనా స్థానిక ఎన్నికలు అధికారంలో ఉన్న పార్టీలకే అనుకూలంగా ఉంటాయి. పంచాయతీ ఎన్నికల్లో తాము 80 శాతానికి పైగా గెలిచాయమని వైసీపీ ప్రకటించుకోగా.. 40 శాతానికి పైగా పంచాయతీల్లో తాము బలపరిచిన అభ్యర్థులు గెలిచారని టీడీపీ వెల్లడించింది. అయితే మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. 

ఏపీ ఎడిటర్స్ గిల్డ్ అనే సంస్థ చెప్పిన దాని ప్రకారం వైసీపీ దాదాపు రూ. 10వేల కోట్లకుపైగా స్థానిక ఎన్నికలకు ఖర్చు చేసినట్లు చెప్పిందని దీపక్ రెడ్డి తెలిపారు. ఈ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఈ విషయాన్ని కూడా ప్రజలు ఆలోచించాలన్నారు. ఏపీ ప్రజలకు మూడు ప్రశ్నలు వేశారు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. వైసీపీ అరాచకాలపై ప్రజలు ఆలోచించాలన్నారు. వెన్నుపోటు రాజకీయాలతో వైసీపీ విజయం సాధించిందని విమర్శించారు. ఎన్నికలు సక్రమంగా జరిగాయో లేదో ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు.

మొదటి ప్రశ్న: ‘‘ఇద్దరి మహిళల కథ.. వారికి భర్తలు లేరు.. అయితే పిల్లలు ఉన్నారు. ఇద్దరికీ ఉద్యోగాలు, డబ్బులు లేవు.. ఒక మహిళ కుటుంబాన్ని పోషించేందుకు వేశ్య వృత్తి ఎన్నుకుంటుంది.. మరొక మహిళ కష్టపడి కూలిపనిచేసి కుటుంబాన్ని పోషిస్తుంది. ఈ ఇద్దరిలో మనం ఎవరిని గౌరవిస్తామని’’ దీపక్ రెడ్డి ప్రశ్నించారు.

రెండో ప్రశ్న:  ‘‘యుద్ధంలో వీరులు ముందుకుపోయి పోరాడి గెలుస్తారు. మరొకరు వెనుక నుంచి కత్తితో పొడిచి గెలుస్తారు. వారిలో మనం ఎవరిని గౌరవిస్తామని’’ ప్రశ్నించారు.

మూడో ప్రశ్న: ‘‘ఎన్నికలకు సంబంధించినది.. ఎన్నికలు సరిగ్గా జరిగాయోలేదో అని విమర్శించనని.. అయితే వాస్తవాలు ప్రజలముందు పెడతాను.. ఈ ఎన్నికలు సరైనవా? కాదా? అన్నిది ప్రజలే నిర్ణయించాలని’’ దీపక్ రెడ్డి కోరారు.