మందుబాబులకు సుప్రీం కోర్టు గట్టి షాక్..
posted on Mar 23, 2021 @ 11:01AM
మద్యం సేవించిన తరువాత మందుబాబులు చేసే గలభా అంతా ఇంతా కాదు. ఆ హడావుడిలో వీరు అయితే తమ ప్రాణాల మీదకు తెచ్చుకోవడం.. లేదంటే ఎదుటి వాడి ప్రాణాలు తీయడం కూడా చూస్తున్నాం. ఇక మందుబాబులు తాగి వాహనాలు డ్రైవ్ చేస్తే జరిగే అనర్ధాలు అనేకం మనం చూసాం. ఇక సోమవారం నాడు జరిగిన ఒక కేసు విచారణ సందర్భంలో ఇటువంటి మందుబాబులకు సుప్రీం కోర్టు గట్టి షాక్ ఇచ్చింది.
అతిగా మద్యం సేవించి చనిపోతే వారి కుటుంబానికి బీమా చెల్లించాల్సిన అవసరం లేదంటూ సుప్రీం కోర్టు తాజాగా కీలక తీర్పు చెప్పింది. ప్రమాదంలో మరణిస్తే తప్ప బాధిత కుటుంబానికి ఎటువంటి పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని ఒక స్పష్టమైన తీర్పు చెప్పింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సిమ్లా జిల్లాలోని చోపాల్ పంచాయతీలో హిమాచల్ అటవీ సంస్థలో చౌకీదారుగా పనిచేస్తున్న ఒక వ్యక్తి 1997లో మరణించాడు. అతిగా వర్షాలు కురవడంతోపాటు, విపరీతమైన చలి కారణంగానే అతడు మరణించాడని అధికారులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ వ్యక్తి అతిగా మద్యం తాగడం వల్ల ప్రాణాలు కోల్పోయాడని పోస్టుమార్టంలో తేలింది. అంతేకాకుండా అతడు ప్రమాదంలో మరణించలేదు కాబట్టి పరిహారం చెల్లించేందుకు బీమా సంస్థ నిరాకరించింది.
దీంతో బాధిత కుటుంబ సభ్యులు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. అక్కడ వారికి తీర్పు అనుకూలంగా వచ్చింది. దీంతో బీమా కంపెనీ జాతీయ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించగా.. విచారించిన ఫోరం బీమా కంపెనీకి అనుకూలంగా తీర్పు చెప్పింది. అయితే, పరిహారం మాత్రం అటవీ సంస్థ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. దీంతో ఈ తీర్పును అటవీ సంస్థ సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
దీనిపై విచారించిన జస్టిస్ ఎంఎం శాంతన్ గౌండర్, జస్టిస్ వినిత్ శరణ్లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం జాతీయ వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును సమర్థించింది. అతిగా మద్యం సేవించి చనిపోయిన వ్యక్తి వారసులకు బీమా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎవరైనా వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే బీమా వర్తిస్తుందని.. అయితే అతిగా మద్యం సేవించి చనిపోతే మాత్రం ఇది వర్తించదని ఇన్సూరెన్స్ కంపెనీల పాలసీలలో కూడా ఈ విషయం స్పష్టంగా ఉందని.. ధర్మాసనం తేల్చి చెప్పింది.