బరువు పెరిగితే ముప్పే! కరోనాపై షాకింగ్ రిపోర్ట్
posted on Apr 30, 2021 @ 6:19PM
కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సమయంలో మరో షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. కరోనా వైరస్ ప్రభావంపై యూకే రీసెర్చర్లు అధ్యయనంలో సంచలన అంశాలు వెలుగు చూశాయి. నిర్ధారిత బరువు కంటే కొంత ఎక్కువ బరువున్నా కరోనా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయని ఆ అధ్యయనం వెల్లడైంది. ముఖ్యంగా యువతలో ఈ ఇబ్బంది మరీ ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
వరుస లాక్ డౌన్ల వల్ల జనాలు ఇళ్లలోనే ఉంటుండటంతో... వారు బరువెక్కుతున్నారు. వీరిపైనే యూకే రీసెర్చర్లు అధ్యయనం చేశారు. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 23 కంటే ఎక్కువ ఉన్నవారు ఇప్పటికే హై రిస్క్ లో ఉన్నారని అధ్యయనంలో వారు తెలిపారు. బీఎంఐ ఒక్క పాయింటు పెరిగినా... ఆసుపత్రుల్లో చేరే అవకాశం 5 శాతం, ఐసీయూలో చేరే అవకాశాలు 10 శాతం పెరుగుతాయని హెచ్చరించారు. 40 కంటే తక్కువ వయసున్న వారికి రిస్క్ ఎక్కువగా ఉంటుందని రీసెర్చర్లు తెలిపారు.
ఇతర జాతులతో పోల్చితే నల్లజాతీయులపై కరోనా ప్రభావం అధికంగా ఉంటుందని యూకే రీసెర్చర్లు చెప్పారు. 70 లక్షల మంది హెల్త్ రికార్డులను అధ్యయనం చేసిన తర్వాత వారు ఈ వివరాలను వెల్లడించారు. 80 ఏళ్లు పైబడిన వారు బరువు పెరిగినప్పటికీ... వారిపై ప్రభావం తక్కువగానే ఉంటుందని చెప్పారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు 'ది లాన్సెట్ డయాబెటీస్ అండ్ ఎండోక్రైనాలజీ' జర్నల్ లో ప్రచురితమయ్యాయి.