కేబినెట్ నుంచి ఈటల రాజేందర్ అవుట్?
posted on Apr 30, 2021 @ 6:19PM
కరోనా కల్లోల సమయంలోనూ తెలంగాణలో రాజకీయ సంచలనాలు జరుగుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కేబినెట్ నుంచి తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈటల భూకబ్జాలకు పాల్పడ్డారంటూ కేసీఆర్ కు అనుకూలంగా ఉన్న మీడియాలో వార్తలు వస్తుండటం చర్చగా మారింది. ఈటలకు చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ డైరెక్షన్ లోనే ఇదంతా జరుగుతుందనే చర్చ జరుగుతోంది.
మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులో సుమారు 100 ఎకరాల భూమి అంశంలో మంత్రి ఈటలపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో అప్పడు కలెక్టర్గా పని చేసిన ధర్మారెడ్డి పూర్తి వివరాలు, మంత్రి ఈటల ప్రమేయాన్ని సీఎం కేసీఆర్కు నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం. దాదాపు నాలుగున్నరేండ్ల కిందట ఈ వ్యవహారం జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ భూమికి ఓ రోడ్డు విషయంలో రైతులతో రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై కొంతమంది రైతులు వ్యతిరేకించడంతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది.
మంత్రి ఈటల వ్యవహారం శుక్రవారం మీడియాలో వైరల్గా మారింది. టీఆర్ఎస్ పార్టీ అధికారిక ఛానల్గా గుర్తింపు ఉన్న టీ న్యూస్లో కూడా ‘‘ఆరోగ్య శాఖ మంత్రికి కబ్జారోగం’’ అంటూ ఇదే అంశాన్ని హైలెట్ చేసింది. అటు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే పలు ఛానళ్లలో కూడా ఈ వార్త పదేపదే రావడం సంచలనంగా మారింది. ఈ భూ వ్యవహారంలో ఈటల రాజేందర్ను కేబినెట్ నుంచి తప్పించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రేపో, మాపో మంత్రి ఈటలను కేబినెట్ నుంచి తప్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు.
కొంత కాలంగా టీఆర్ఎస్ లో అసంతృప్తిగా ఉంటున్నారు ఈటల రాజేందర్. సీఎం కేసీఆర్ తీరుపైనా ఆయన గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. పలు సార్లు ఆయన ఓపెన్ గానే తన అసమ్మతిని వ్యక్తం చేశారు. గత సంవత్సరం గులాబీ జెండాకు తామే అసలైన ఓనర్లం అంటూ ఈటల చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. ఇటీవల కూడా కేసీఆర్, టీఆర్ఎస్ ను టార్గెట్ చేసేలా రాజేందర్ మాట్లాడారు. బీసీ సంఘం సమావేశంలోనూ తనను అణగదొక్కాలని చూస్తున్నారనే సంకేతం ఇచ్చేలా ఈటల మాట్లాడారు. తమను వరుసగా టార్గెట్ చేస్తున్నరన్న కసితో అతనికి చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే భూకబ్జాలతో పేరుతో కథ నడిపిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.