దేశం గూటికి శైలజానాథ్?
posted on Apr 27, 2023 @ 2:14PM
కాంగ్రెస్ పార్టీకి చెందిన పవర్ ఫుల్ నాయకులలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఒకరు. ప్రభుత్వ విప్ గా పని చేసిన ఆయన సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఈ మధ్య ఆయన క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే రానున్న ఎన్నికల నేపథ్యంలో శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీ కీలక నేత సాకే శైలజానాథ్ తో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో సమావేశమయ్యారు. సాకే శైలజానాథ్ ను టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించినట్లుగా చెబుతున్నారు. శింగనమల నంచి గతంలో రెండు సార్లు గెలిచిన శైలజానాథ్ మంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం శింగనమలలో టీడీపీ గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణంగా ఇంకా ఇంచార్జిని కూడా నియమించలేదు. బలమైన అభ్యర్థి ఉండాలని.. తాము సూచించిన వారికే టిక్కెట్ ఇవ్వాలని జేసీ బ్రదర్స్ పట్టుబడుతున్నారు. దీంతో టీడీపీ హైకమాండ్ అక్కడ అభ్యర్థిత్వం ఎవరికి అన్నది ఖరారు చేయలేదు. ఈ క్రమంలో జేసీ .. శైలజానాథ్ తో చర్చలు జరపడం హాట్ టాపిక్ గా మారింది.కొంత కాలంగా శైలజానాథ్ టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్ పదవి కాలం పూర్తయిన తర్వాత శైలజానాథ్ కాంగ్రెస్ రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. వచ్చే ఎన్నికల్లో తాను శింగనమల నుంచే పోటీ చేయాలనుకుంటున్నానని శైలజానాధ్ ఇంతకుమునుపే ప్రకటించారు. అయితే, ఏ పార్టీ నుంచి అనేది మాత్రం త్వరలో చెబుతానంటూ వెల్లడించారు. ఇప్పటికే శైలజానాద్ టీడీపీ ముఖ్య నాయకత్వం తో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. శైలజానాద్ 2004, 2009 ఎన్నికల్లో అప్పటి టీడీపీ సీనియర్ నేత శమంతమణి పైన విజయం సాధించారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత శమంతకమణికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. 2014 ఎన్నికల్లో శంమతకమణి కుమార్తె యామినీ బాల టీడీపీ నుంచి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పైన విజయం సాధించారు.2019 ఎన్నికల్లో ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు శ్రావణి పైన జొన్నలగడ్డ పద్మావతి గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో బండారు శ్రావణి టీడీపీ నుంచి తిరిగి సీటు ఆశిస్తున్నారు. శింగనమల నియోజకవర్గంలో కొంత కాలంగా టీడీపీలో విభేదాలు నెలకొన్నాయి. ఇప్పుడు శైలజానాద్ కు సీటు పైన హామీ దక్కుతుందా లేదా అనేది కీలకంగా మారింది.వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తామని టీడీపీ నేతలు అంటున్నారు. అందుకే బలమైన నేతల్ని చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అనంతపురం పార్లమెంట్ నుంచి జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పోటీ చేసే అవకాశం ఉంది. బలమైన అభ్యర్థులు అసెంబ్లీ పరిధిలో ఉండాలని ఆయన కోరుతున్నారు. శైలజానాథ్ బలమైన అభ్యర్థి అవుతారని ఆయన అనుకుంటున్నారు.అనంతపురం జిల్లా ప్రజలు మద్దతిస్తే మొత్తం ఏకపక్షంగా ఒకే పార్టీకి మద్దతుగా నిలుస్తారు. 2014 ఎన్నికల్లో వైసీపీకి కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కాయి. అదే 2019 ఎన్నికల్లో టీడీపీ రెండు సీట్లకే పరిమితం అయింది. వచ్చే ఎన్నికల్లో తిరిగి పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గాల వారీగా చంద్రబాబు కొన్నాళ్లుగా కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేష్ పాదయాత్ర విజయవంతం కావడంతో ఆ పార్టీ నేతలు సంతృప్తిగా ఉన్నారు.శైలజానాథ్ తెలుగు దేశంలో చేరితే విజయావకాశాలు పార్టీలో మెరుగుపడతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.