మావోయిస్టు కీలక నేత బండి ప్రకాష్ లొంగుబాటు

మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆపరేషన్ కగార్ తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న మావోయిస్టులు వరుసగా లొంగుబాట పట్టిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే మరో కీలక మావోయిస్టు నేత మంగళవారం (అక్టోబర్ 28) పోలీసులకు లొంగిపోయారు. తెలంగాణకు చెందిన మావోయిస్టు పార్టీ కీలక నేత బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్  పోలీసుల ఎదుట లొంగిపోయారు. మంగళవారం (అక్టోబర్ 28) ఉదయం తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో బండి ప్రకాష్ లొంగిపోయారు. బండి ప్రకష్ స్వస్థలం మంచిర్యాల జిల్లా మందమర్రి.

-1982-84 మధ్య గో టు ద విలేజెస్ ఉద్యమం ద్వారా ఆర్ఎ‌స్‌యూ తరఫున పోరాడారు. ఆపై మావోయిస్ట్ పార్టీ అనుబంధ సంస్థ సింగరేణి కార్మిక సంఘం అధ్యక్షుడిగా   పనిచేశారు. మావోయిస్ట్ పార్టీలో నేషనల్ పార్క్ ఏరియా అత్యంత కీలక ఆర్గనైజర్ బండి ప్రకాష్. దాదాపు 45 సంవత్సరాలుగా సీపీఐ మావోయిస్టు పార్టీలో వివిధ స్థాయిలలోనూ, రాష్ట్ర కమిటీ సభ్యుడుగానూ  పనిచేసిన బండి  ప్రకాష్ పోలీసుల ఎదుట లొంగపోవడం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బే అనడంలో సందేహం లేదు. 

మెక్సికోలో కంపించిన భూమి

మెక్సికోను భారీ భూకంపం కుదిపేసింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. దక్షిణ మెక్సికోలోని గెరెరో రాష్ట్రంలో  సంభవించిన ఈ భూకంప కేంద్రం  భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉందని అధికారులు వెల్లడించారు. పసిఫిక్ తీరప్రాంతంలోని ప్రముఖ రిసార్ట్ నగరం అకాపుల్కో సమీపంలో ఉన్న గెరెరో రాష్ట్రంలోని శాన్ మార్కోస్ పట్టణం వద్ద భూకంప కేంద్రం ఉందని పేర్కొన్నారు. భూమి కంపించడంతో  జనం తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.  భూకంపం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. నష్టం వివరాలను అంచనా వేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ స్పందించారు. గెరెరో రాష్ట్ర గవర్నర్‌తో మాట్లాడినట్లు ఆమె 'ఎక్స్' వేదికగా తెలిపారు. రాజధాని మెక్సికో సిటీలో ఎలాంటి నష్టం జరగలేదని  పేర్కొన్నారు. ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ భూకంప తీవ్రతకు భారీ భవనాలు సైతం చిగురుటాకుల్లా ఊగిపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 

లేగదూడకు నామకరణ మహోత్సవం!

కన్నబిడ్డగా పెంచుకున్న ఆవు లేగదూడకు జన్మనిస్తే.. ఆ లేగదూడను తన మనవరాలిగా భావించి ఘనంగా నామకరణ మహోత్సవం చేసిన రైతు ఉదంతమిది. తనకు ఆడపిల్లలు లేరన్న చింత తీర్చుకోవడానికి ఓ ఆవును తీసుకువచ్చి, దానికి గౌరి అని నామకరణం చేసి పెంచుకున్న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం దాసరిపల్లె గ్రామానికి చెందిన పెండ్యాల సురేందర్, ఆ ఆవుకు పుట్టిన లేగ దూడకు శుక్రవారం (జనవరి 2) ఘనంగా నామకరణ మహోత్సవం జరిపించాడు. వివరాల్లోకి వెడితే.. పెండ్యాల సురేందర్ స్వరూప దంపతులు ఐదేళ్ల కిందట  వరంగల్‌లోని మహారుషి గోశాల నుండి ఓ ఆవును తెచ్చుకుని  దానికి గౌరి అని నామకరణ చేసారు. దానిని నిత్యం పూజిస్తూ కన్నబిడ్డలా సాకారు. ఆ ఆవు  గత నెల 19న ఓ లేగదూడకు జన్మనిచ్చింది. లేగదూడ పుట్టి 13 రోజులు పూర్తి కావడంతో ఆ లేగదూడకు ఘనంగా నామకరణ మహోత్సవం నిర్వహించారు. ఇందు కోసం శుక్రవారం (జనవరి 2)  దానికి తన కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులను గ్రామస్తులను ఆహ్వానంచి అయ్యప్ప మాలధరణ స్వాముల సమక్షంలో నామకరణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఇళ్లల్లో పిల్లలకు ఏ విధంగా అయితే బాల సారె నిర్వహిస్తారో సరిగ్గా అలాగే ఈ నామకరణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి దానికి నందీశ్వరుడు అని పేరు పెట్టారు.  ఈ నామకరణ మహోత్సవాన్ని గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వారు వచ్చి తిలకించి ఇలాంటి తంతు ఎక్కడా చూడలేదని ఇదే మొదటి సారి అని ఇంత మంచి కార్యక్రమం చూడడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.   

గోవిందరాజస్వామి ఆలయ గోపురంపైకి ఎక్కి హల్ చల్

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం గోపురంపైకి ఎక్కిఎక్కిన తెలంగాణ భక్తుడు.. 3 గంటల పాటూ హైడ్రామా మద్యం మత్తులో ఓ వ్యక్తి తిరుపతి  గోవిందరాజస్వామి ఆలయంలో హల్ చల్ చేశాడు.  మద్యం తాగి ఆలయంలోకి చొరబడిన ఆ వ్యక్తి  ఆలయ గోపురంపైకి ఎక్కి హంగామా చేశాడు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి అతడిని కిందకు దించి అదుపులోనికి తీసుకున్నారు.   ఈ ఘటనతో ఆలయం వద్ద కొద్దిసేపు కలకలం రేగింది.    తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఏకాంత సేవ అనంతరం గుడి మూసివేసిన  విజిలెన్స్ సిబ్బంది కళ్లుగప్పి మహాద్వారం లోపలికి ప్రవేశించాడు. ఆలయం గోపురంపైకి ఎక్కిన నినాదాలు చేశాడు.. వెంటనే గమనించిన విజిలెన్స్ సిబ్బంది, తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. అతడ్ని కిందకు దిగమని అడిగారు.. అతడు మాత్రం కిందకు దిగేందుకు నిరాకరించాడు. దాదాపు మూడు గంటల పాటూ శ్రమించి అతడ్ని కిందకు దించి అరెస్ట్ చేశారు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మద్యం మత్తులో ఆలయం గోపురంపైకి ఎక్కి హల్ చల్ చేసిన వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాకు చెందిన తిరుపతిగా గుర్తించారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని.. మానసిక స్థితి కూడా సరిగా లేదని చెబుతున్నారు. అతడు ఆలయంపైకి తనకు మద్యం బాటిల్ ఇస్తేనే కిందకు దిగుతానని  అరుస్తూ నానా హంగామా చేశాడు.  విజిలెన్స్, పోలీసులు, ఫైర్ సిబ్బంది శ్రమించి గోపురానికి నిచ్చెనలు వేసి తాళ్లతో బంధించి బలవంతంగా కిందకు దించారు. దీంతో గోవిందరాజస్వామి ఆలయం దగ్గర కొద్దిసేపు హైడ్రామా నడిచింది. అంతేకాదు ఆలయంపై ఉన్న కలశాలను కూడా లాగేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించాడు.  సీసీకెమెరాలు తనిఖీ చేసి ఆలయంలోకి ఎలా ప్రవేశించాడు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.  

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంపై సభా తీర్మానం

  మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం  స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ గ్రామీణ్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ చట్టం (వీబీజీ రామ్ జీ) ను తీసుకొచ్చింది. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానం ఆమోదించింది. అసెంబ్లీ ఆమోదించిన ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపనుంది. అత్యంత పేద ప్రజల కోసం రూపొందించిన ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.  నరేగా ద్వారా ఇన్నేళ్లుగా పేదలకు ఉపాధి ఒక హక్కుగా లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఆవరణలో మంత్రి సీతక్క చిట్ చాట్ నిర్వహించారు. ఉపాధి హామీ పథకం పై మాట్లాడాల్సి వస్తుందనే బీఆర్ఎస్ సభ నుంచి వాకౌట్ చేసిందని ఆమె తెలిపారు. బీజేపీ కి బిఆర్ఎస్ సహాకరిస్తుందనే దానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. బీజేపీ- బిఆర్ఎస్ ఎజెండా ఓక్కటే.. కార్పోరేట్ ల కోసమే బీజేపీ, బిఆర్ఎస్ పనిచేస్తున్నాయిని సీతక్క తెలిపారు.  అందుకే ఈరోజు చర్చలో బీఆర్ఎస్ పాల్గొనలేదు. ప్రధాని మోడీ మెప్పు కోసం బీఆర్ఎస్ పెద్దలు సభ ను బైకాట్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ రద్దు చేసినా ఆ పార్టీ నోరు మెదపడం లేదు” అంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కల్పించి, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించేందుకు డా. మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2005లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులోకి తీసుకు వచ్చింది. పేదరికం, నిరుద్యోగం, వలసలు, నైపుణ్యం లేని శ్రామిక వర్గాల దోపిడీ,  స్త్రీ పురుషుల మధ్య వేతన అసమానతలను తగ్గించి అన్ని వర్గాల అభివృద్ధికి తెచ్చిన ఈ చట్టం 2006 ఫిబ్రవరి 2 నుంచి అమలులోకి వచ్చింది. ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి కనీసం 100 రోజుల ఉపాధి కల్పించి, కనీస వేతనం అందించే గ్యారంటీ ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం. గత 20 సంవత్సరాలుగా ఈ పథకం ద్వారా మన రాష్ట్రంలో లబ్ధి పొందిన వారిలో సుమారు 90 శాతం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలున్నారు. వీరిలో 62 శాతం మహిళలు లబ్ధి పొందారు. దళితులు, గిరిజనులు, దివ్యాంగులు, అత్యంత వెనుకబడిన తెగలకు చెందిన ఆదివాసీలు, చెంచులు, పేద వర్గాలే ఎక్కువగా ప్రయోజనం పొందారు.   ప్రస్తుతం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ) చట్టం  VB G RAM G -2025  పేదల హక్కులను దెబ్బతీసేలా ఉంది. ఈ పథకంపై ప్రధానంగా ఆధారపడ్డ గ్రామీణ ప్రాంత మహిళలు,  బలహీన వర్గాల ఉపాధికి హామీ లేకుండా చేస్తోంది. పాత ఉపాధి హామీ పథకం ఆత్మను దెబ్బతీసే నిబంధనలు పేదల పాలిట శాపంగా మారనున్నాయి.    ఆ కారణంగా ఈ సభ కింద తెలిపిన విధంగా తీర్మానిస్తోంది: 1. కొత్త చట్టం పేదల హక్కులకు వ్యతిరేకంగా ఉంది. ఉపాధి హామీ చట్టం యొక్క అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది. డిమాండ్ అనుగుణంగా పనుల ప్రణాళికను తయారు చేసే విధానానికి స్వస్తి పలికింది. డిమాండ్ ఆధారిత పాత విధానాన్ని కొనసాగించాలి.  2. కొత్త చట్టం మహిళా కూలీలకు వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు అమల్లో ఉన్న MGNREGAలో దాదాపు 62 శాతం మహిళలు కూలీ పొందేవారు. కొత్త చట్టంలో పొందుపరిచిన పరిమిత (నార్మేటివ్) కేటాయింపుల విధానం వల్ల పని దినాలు తగ్గిపోతాయి. దీంతో పేద కుటుంబాల్లోని మహిళలు నష్టపోతారు. మహిళా సాధికారత సాధించాలంటే పాత విధానం పునరుద్ధరించాలి.  3. ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో పూర్తిగా కేంద్రమే నిధులు కేటాయించేది. కొత్త చట్టం ద్వారా కేంద్ర-రాష్ట్ర నిధుల వాటా 60:40గా మార్చటం సమాఖ్య స్పూర్తికి విఘాతం కలిగిస్తుంది. ఇది రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుంది. పాత నిధుల వాటా  నమూనాను పునరుద్ధరించాలి. 4. మహాత్మాగాంధీ గారి పేరును ఈ పథకం నుంచి తొలగించటంతో గాంధీ గారి స్ఫూర్తిని నీరుగార్చినట్లయింది.    5. వ్యవసాయ సీజన్ లో 60 రోజుల విరామం తప్పనిసరిగా విధించడంతో భూమి లేని నిరుపేద కూలీలకు అన్యాయం జరుగుతుంది. ఉపాధి హామీ పథకాన్ని సంవత్సరం పొడవునా కొనసాగించాలి. 6. ప్రస్తుతం ఉపాధి హామీ ద్వారా 266 రకాల పనులు చేపట్టే వెసులుబాటు ఉంది. కొత్త చట్టంలో భూముల అభివృద్ధి వంటి శ్రమ ఆధారిత పనులు తొలిగించటంతో చిన్న సన్నకారు రైతులు, దళితులు, గిరిజనులు నష్టపోతారు. ఇప్పుడున్న పనుల జాబితాను యథాతథంగా అనుమతించాలి.  ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకొని, MGNREGA చట్టంలో నిర్దేశించిన ఉద్దేశాలు, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని కూలీ కుటుంబాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మహాత్మగాంధీ NREGA చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని ఈ సభ తీర్మానిస్తుంది.

జనవరి 3 నుంచి రాష్ట్రపతి నిలయంలో రెండో ఉద్యాన్ ఉత్సవ్

  ప్రజా భాగస్వామ్యం, పర్యావరణ స్పృహను ప్రోత్సహించే ప్రయత్నాల్లో భాగంగా భారత రాష్ట్రపతి శీతాకాల నివాసమైన  రాష్ట్రపతి భవన్‌లో 2026 జనవరి 3 నుంచి 11 వరకు ‘ఉద్యాన్ ఉత్సవ్’ రెండవ ప్రదర్శన జరగనుంది. రాష్ట్రపతి నిలయాలను పౌర భాగస్వామ్యానికి, పర్యావరణ స్పృహకు కేంద్రాలుగా మార్చాలనే గౌరవ భారత రాష్ట్రపతి ఆకాంక్ష మేరకు ఈ ఉత్సవం నిర్వహిస్తున్నారు. దీనిని రాష్ట్రపతి నిలయం ఆధ్వర్యంలో  వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ నిర్వహిస్తుండగా.. ‘మేనేజ్’ సహకారం అందిస్తోంది.‘ఉద్యాన్ ఉత్సవ్ 2026’లో సుమారు 120 ప్రదర్శకులతో 50 నేపథ్య స్టాళ్లను ఏర్పాటు చేశారు.  ఇవి వ్యవసాయ రంగంలో ఆవిష్కరణలు, వ్యాపార అవకాశాలు, విలువ ఆధారిత ఉత్పత్తులకు వేదికగా నిలుస్తాయి. ఇక్కడ సందర్శకులు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించే గ్రీన్‌ నాలెడ్జ్‌ హబ్‌..  పోషక విలువలున్న చిరుధాన్యాల ఉత్పత్తులను ప్రొత్సహించే మిల్లెట్ మండి, స్టార్టప్ హబ్.. సేంద్రీయ ఉత్పత్తులు, జీఐ ట్యాగ్ ఉత్పత్తులు, గిరిజన హస్తకళల ప్రదర్శనకు ఎకో బజార్.. బయో ఇన్‌పుట్స్‌, నర్సరీ మొక్కల విక్రయానికి ప్లాంట్ అండ్ ప్రొడ్యూస్.. 59 రైతు ఉత్పత్తిదారుల సంఘాల నుంచి నేరుగా ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు జోన్,ఫామ్-2-ఎంటర్‌ప్రైజ్ వంటి వివిధ విభాగాలను చూడవచ్చు. ఈ ఉత్సవంలో భాగంగా  ప్రతిరోజూ వైవిధ్యభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు.  వీటిలో  భరతనాట్యం, కథక్,  కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్యాలు..పేరిణి శివతాండవం, ఒగ్గు డోలు, మాధురి నృత్యం వంటి ప్రాంతీయ కళారూపాలు.. సంగీత కచేరీలు, హరికథ, బుర్రకథ వంటి వారసత్వ కళలు,  వివిధ రకాల సంగీత కచేరీలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ప్రదర్శనలో సమాజ భాగస్వామ్య ముఖ్య ఆకర్షణగా నిలవనుంది. కుండల తయారీ, కూరగాయలపై చెక్కడాలు, విత్తన బంతుల తయారీ వంటి నేర్చుకుంటూ చేసే పనులు ద్వారా యువతలో పర్యావరణ పరిరక్షణపై అవగాహనను పెంపొందించేందుకు రూపొందించారు.  ఆధునిక వ్యవసాయ పద్ధతులైన హైడ్రోపోనిక్స్, ఆక్వాపోనిక్స్, సహజ రంగుల వెలికితీతపై ప్రత్యక్ష ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. క్విజ్ పోటీ, ‘‘విష్‌ ట్రీ-మై ప్రామిస్‌ టు ఇండియా’’ వంటి ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఈ ఉత్సవం జ్ఞానాన్ని పంచుకునే వేదికగా కూడా నిలవనుంది. ఇందులో భాగంగా నిపుణుల ఆధ్వర్యంలో సహజ, సేంద్రీయ వ్యవసాయం, వాతావరణ మార్పులకు తట్టుకునే వ్యవసాయ సాంకేతికతలు, చిరు ధాన్యాల విలువ ఆధారిత ఉత్పత్తులు వంటి అంశాలపై ఐఐఎంఆర్‌, ఐఐఓఆర్‌ ఏపీఈడీఏ వంటి ప్రముఖ సంస్థలతో వర్క్‌షాప్‌లు, పరస్పర చర్చా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చామంతి, సెలోసియా, బంతిపూలు, పాయిన్‌సెట్టియాలు ఇతర కాలానుగుణ పూలతో రూపొందించిన విభిన్న నేపథ్య పుష్ప అలంకరణలు ఏర్పాటు చేశారు. సృజనాత్మకంగా అలంకరించిన  పుష్ప ప్రదర్శనలు ఉత్సాహభరితమైన పండుగ వాతావరణాన్ని కలిగిస్తాయి. ఈ ఉద్యాన్ ఉత్సవ్ అందరికీ ఉచితంగా ప్రవేశాన్ని కల్పిస్తోంది. ప్రతిరోజూ ఉదయం 10.00 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు రాష్ట్రపతి నిలయం ప్రధాన పచ్చిక బయళ్లలో జరుగుతుంది. ప్రజలకు  గేట్ నంబర్ 2 ద్వారా ప్రవేశం కల్పించారు. సందర్శకులు తమ ప్రవేశాన్ని రాష్ట్రపతి భవన్ విజిట్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు లేదా విజిటర్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన కియాస్క్‌ల వద్ద నమోదు చేసుకోవచ్చు.   11 రోజుల పాటు నిర్వహించనున్న ఉత్సవానికి సంబంధించిన వివరాలను  రాష్ట్రపతి నిలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో   నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్ (మేనేజ్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ సాగర్ హనుమాన్ సింగ్, వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ డైరెక్టర్  జస్బీర్ సింగ్, మేనేజ్‌ డైరెక్టర్ డాక్టర్ శైలేంద్ర, రాష్ట్రపతి నిలయం మేనేజర్ డాక్టర్ కే రజనీ ప్రియ మీడియాకు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ అనుగు నరసింహారెడ్డి, రాష్ట్రపతి నిలయం ప్రజా సంబంధాల అధికారి  కుమార్ సమ్రేష్ కూడా ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.  

కవిత వాహనాలపై భారీగా ట్రాఫిక్ చలాన్లు

  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వాడుతున్న వాహనాలపై భారీగా ట్రాఫిక్ చలాన్లు నమోదైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ రోజు శాసన మండలికి హాజరైన సందర్భంగా కవిత ప్రయాణించిన వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు పరిశీలన చేపట్టగా, వరుసగా నిబంధ నల ఉల్లంఘనలు చేసినట్లు గుర్తించారు. కవిత ప్రయాణించిన మార్సిడీస్ బెంజ్ కారుపై 6 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఆమె వినియోగిస్తున్న మరో లగ్జరీ వాహనం లెక్సస్ 450డి (Lexus 450D)పై 16 ట్రాఫిక్ చలాన్లు నమోదై ఉన్నట్లు వెల్లడైంది. మొత్తం మీద రెండు వాహనాలపై కలిపి 22 సార్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ట్రాఫిక్ శాఖ రికార్డుల్లో నమోదైంది. ఈ రెండు వాహనాలపై నమోదైన చలాన్ల విలువ మొత్తం రూ.17,770గా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఓవర్ స్పీడింగ్, ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ వినియోగం వంటి ఉల్లంఘనలపై ఈ చలాన్లు విధించినట్లు అధికారులు తెలిపారు. అధికారుల వివరాల ప్రకారం, కవిత వాహనాలపై ఎక్కువగా నిజామాబాద్, కరీంనగర్, మెదక్, కామారెడ్డి, సిద్ధిపేట జిల్లాల్లో ట్రాఫిక్ చలాన్లు నమోదయ్యాయి. ఆయా జిల్లాల్లోని ట్రాఫిక్ కెమెరాల ద్వారా ఉల్లంఘనలు గుర్తించి చలాన్లు జారీ చేసినట్లు సమాచారం. ప్రజాప్రతినిధుల వాహనాలైనా సరే, ట్రాఫిక్ నిబంధనల విషయంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎవరైనా సరే చలాన్లు తప్పవని ఈ ఘటన మరోసారి స్పష్టంగా చూపిస్తోంది. ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా, ప్రజల్లోనూ విస్తృత స్పందన వ్యక్తమవుతోంది. ట్రాఫిక్ నియమాల పాటనపై ప్రజాప్రతినిధులు మరింత బాధ్యతగా వ్యవహరించాలనే అభిప్రాయం వినిపిస్తోంది.

జ‌గ‌న్ ఏపీకి ఒక లాస్ అకౌంట్ లాంటోడా...అయితే అదెలా?

  మాజీ సీఎం జ‌గ‌న్ ఏది వేలు పెడితే అదంతా కూడా ఖ‌ర్చేనా.. ఆయ‌న బెయిలుపై బ‌య‌ట ఉండ‌టానికీ ఖ‌ర్చే.. అడుగు బ‌య‌ట పెట్టాలంటే ఖ‌ర్చే. ఇంత ఖ‌ర్చు రాజ‌కీయం న‌వ్యాంధ్ర‌లాంటి రాష్ట్రానికి అవ‌స‌ర‌మా? ఇంత‌కీ జ‌గ‌న్ పెట్టిస్తోన్న అన‌వ‌స‌ర ఖ‌ర్చులేవి?  తాజాగా వెలుగులోకి వ‌చ్చినదేంటి? అని చూస్తే..  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జ‌గ‌న్ ఫోటో తొల‌గించాలంటే కూడా డ‌బ్బు ఖ‌ర్చు అవ‌స‌ర‌మ‌వుతుందా? అయితే ఎందుక‌ని?  జ‌గ‌న్ గ‌త ప్ర‌భుత్వ  హ‌యాంలో చేసిన అవినీతి త‌ద్వారా ఒక్క టీటీడీలోనే ప‌ద‌కొండు వేల కోట్లు లేపేయ‌గా.. మంత్రి అన‌గాని స‌త్య ప్ర‌సాద్ చెప్పిన‌ట్టు 2025 మొత్తం మ‌ద్య‌నామ సంవ‌త్స‌రంగా గ‌డిచిపోయిందా. కార‌ణం జ‌గ‌న్ త‌న హ‌యాంలో చేసిన మ‌ద్యం కుంభ‌కోణం వాటి లొసుగులు వెలికి తీయ‌డానికే స‌రిపోయింది. వీటిలో జ‌గ‌న్ హ‌యాంలో డైరెక్ట్ గా చేసిన లిక్క‌ర్ స్కామ్ విలువే 4 వేల కోట్లు. ఇక న‌కిలీ మ‌ద్యం కుంభ కోణం కొన్ని వేల కోట్ల‌ల్లో ఉంటుంద‌ని అంచ‌నా. ల్యాండ్- శాండ్- మైన్- వైన్- అంటూ జ‌గ‌న్ త‌న ఐదేళ్ల కాలంలో చేసిన అరాచ‌కాలు ఒక్కొక్క‌టి బ‌య‌ట‌కొస్తున్నాయి. ఆపై సంక్షేమం పేరిట ఎటూగాకుండా చేసిన ఖ‌ర్చు సుమారు రెండున్న‌ర ల‌క్షల కోట్లు. ఇవే ఏపీని ఆర్ధిక అంథ‌కారంలో నెట్టేశాయ‌నుకుంటే జ‌గ‌న్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వంటివి తీస్కొచ్చి ఆయ‌న బొమ్మ‌లను తొల‌గించాలన్నా డెబ్భై కోట్లు ఖ‌ర్చవుతుంద‌ని తెలిసి షాక‌వుతున్నారంతా. ఇప్ప‌టికీ స‌రిహ‌ద్దు రాళ్ల కోసం 700 కోట్లు, కాగా రేష‌న్ స‌రుకుల డెలివ‌రీకి మ‌రో 700 కోట్లు, రిషికొండ ప్యాలెస్ కోసం ఇంకో 600 కోట్లు భారీగా ప్ర‌జాధ‌నం వ్య‌యం చేశారు. ఇక‌ ఎగ్ ప‌ఫ్ ల నుంచి మొద‌లు పెడితే.. ఎలుకులు ప‌ట్ట‌డం వంటివి అటుంచితే ఆయ‌న ఇంటి చుట్టూ ఫెన్సింగ్, వైయ‌స్ విగ్ర‌హాల ఖ‌ర్చు, వీటితో పాటు పార్టీ రంగుల పై చేసిన వ్య‌యం  వంటివి త‌డిసి మోపెడ‌య్యాయి.  వీట‌న్నిటి నుంచి విముక్తి క‌లిగించాల‌న్నా కూడా ఎదురు ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తోంది. కేవ‌లం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. జగన్ ఫోటో తొలగించాలంటే రూ.70 కోట్లు కావాల్సిందే అంటున్నారంటే ప‌రిస్తితేంటో ఊహించుకోవ‌చ్చు. ఏ మాట కామాట జ‌గ‌న్ ఏపీకి ఒక లాస్ అకౌంట్ లాంటోడా అంటే అవున‌నే తెలుస్తోంది. అత‌డి జాత‌కం ఎలాంటిదో చెప్ప‌లేం కానీ. ప్ర‌తిదీ ఖ‌ర్చే. ఆయ‌న వ్య‌క్తిగ‌త వియ‌మే తీసుకుంటే బెయిలుపై బ‌య‌ట తిర‌గ‌డానికి లాయ‌ర్ల‌క‌య్యే ఖ‌ర్చులే ఆరు వేల కోట్ల రూపాయ‌ల‌ని అంచ‌నా వేశారు. అలాంటిది జ‌గ‌న్ ఒక రాష్ట్రాన్ని ప‌రిపాలించాడంటే ఇంకెంత ఖ‌ర్చు చేస్తాడో ఊహించుకోవ‌చ్చంటున్నారు పలువురు. ఇదే చంద్ర‌బాబు.. స్వ‌యంగా జ‌నం సొమ్ము ఖ‌ర్చు చేయ‌కుండా ప్ర‌తిదాన్లో ఒక త‌రుణోపాయం ఆలోచిస్తారు. అది మెడిక‌ల్ కాలేజీల పీపీపీ కావ‌చ్చు, పేద‌రికాన్ని నిర్మూలించే పీ-4 ప‌థ‌కం కావ‌చ్చు. ఒక వేళ ఆయ‌న మోడీ కోసం యోగాంధ్ర నిర్వ‌హించ‌డానికి 3వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తే, అందులో మూడు ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చే ఉపాయ‌ముంటుంది.  అదే జ‌గ‌న్ అలాక్కాదు.. ప్ర‌తిదీ వ్య‌య‌మే. ఏమాట‌కామాట ఖ‌ర్చు కూడా ఒక పెట్టుబ‌డిలా చేయాలంటారు వారెన్ బ‌ఫెట్ లాంటి నిపుణులు. కానీ ఇలాంటివేవీ తెలియ‌ని పాబ్లో ఎస్కోబార్ మ‌న జ‌గ‌న్. ఏం చేయ‌ద్దాం.. ఏపీ త‌ల‌రాత అలా త‌గ‌ల‌బ‌డింది. ఇలాంటి లాస్ పొలిటీషియ‌న్ దొరికాడు ఏపీకని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు ప‌లువురు ఆర్ధిక రంగ నిపుణులు.   గ‌త ఎన్నిక‌ల్లో ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ‌ల్లే జ‌గ‌న్ ఘోర ప‌రాజ‌యం పాల‌య్యారు. అప్ప‌టి వ‌ర‌కూ ప‌ట్టాదారు పాసు పుస్త‌కాల‌పై ఏపీ ప్ర‌భుత్వ రాజ‌ముద్ర ఉండేది. అది కాద‌ని త‌న పార్టీ నాయ‌కులు వారించినా విన‌కుండా తుగ్ల‌క్ చ‌ర్య చేప‌ట్టారు జ‌గ‌న్. ఆ పుస్త‌కాల‌పై త‌న ఫోటోలు ముద్రించారు. దీంతో ఆయ‌న కూడా ఈ అరాచ‌క విధానం కార‌ణంగా భారీ మూల్యం చెల్లించాల్సి వ‌చ్చింది. ఇపుడీ ఫోటోల‌ను తొల‌గించ‌డానికి కూడా ఏపీ ప్ర‌భుత్వానికి ఖ‌ర్చ‌య్యేలా తెలుస్తోంది. మ‌రి ఇలాంటి ఇంకెన్ని జ‌గ‌న్ మార్క్ న‌ష్టాలు బ‌య‌ట ప‌డ‌తాయో ఏంటో.. అన్న ఆందోళ‌న వ్యక్త‌మ‌వుతోంది స‌ర్వ‌త్రా.

గండిపేటలో 12 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా

  రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని గంధంగూడ గ్రామంలో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడుతూ హైడ్రా  కీలక చర్యలు చేపట్టింది. సర్వే నంబర్ 43 పరిధిలో ఉన్న 12.17 ఎకరాల ప్రభుత్వ భూమి క్రమంగా కబ్జాలకు గురవుతోందన్న స్థానికుల ఫిర్యాదులు వెల్లువెత్తడంతో హైడ్రా స్పందించింది. భూమి ప్రభుత్వానికి చెందినదని నిర్ధారించిన అనంతరం శుక్రవారం ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎలాంటి అక్రమ ఆక్రమణలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంది. గంధంగూడ గ్రామంలోని సర్వే నంబర్ 43లో మొత్తం 26 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారిక రికార్డుల్లో ఉంది. ఇందులో గతంలో ప్రభుత్వం ఒక ఎకరాను విద్యుత్ సబ్‌స్టేషన్‌కు, మరో 9 ఎకరాలను జీహెచ్‌ఎంసీ చెత్త డంపింగ్ అవసరాల కోసం కేటాయించింది. ఈ కేటాయింపుల అనంతరం మిగిలిన భూమి క్రమంగా కబ్జా అవుతుందని స్థానికుల నుండి హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్  ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు సంబంధిత రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల అధికారుల తో కలిసి హైడ్రా బృందం క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టింది.  భూమి ప్రభు త్వా నిదేనని స్పష్టంగా నిర్ధారించిన తరువాత, వెంటనే చర్యలు తీసుకో వాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.ఆ ఆదేశాల మేరకు ఈరోజు శుక్రవారం 12.17 ఎకరాల భూమి చుట్టూ పటిష్టమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆ భూమిలో ఒక ఆలయం, ఒక మసీదు నిర్మాణం ఉండటంతో, వాటికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మిగిలిన ప్రభుత్వ భూమిని రక్షించారు. అంతేకాకుండా, ఇది ప్రభుత్వ భూమి అని స్పష్టంగా తెలియజేసేలా హైడ్రా బోర్డులను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. సుమారు రూ.1200 కోట్ల విలువైన ఈ ప్రభుత్వ భూమిని కాపాడడం ద్వారా హైడ్రా మరోసారి కబ్జాలపై తన కఠిన వైఖరిని చాటిందని అధికారులు తెలిపారు. ప్రజా ఆస్తుల రక్షణే లక్ష్యంగా హైడ్రా ముందుకు సాగుతుందని, ఎక్కడైనా ప్రభుత్వ భూములపై అక్రమ ఆక్రమణలు జరిగితే ప్రజలు వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు కోరారు. ఈ ఘటనతో గంధంగూడ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల రక్షణపై హైడ్రా చర్యలు చర్చనీయాంశంగా మారాయి.

3 రికార్డులకు చేరువలో విరాట్ కోహ్లీ

  టీమిండియా స్టార్ క్రికెటర విరాట్ కోహ్లీ కొత్త సంవత్సరంలో మూడు ప్రపంచరికార్డులకు చేరువలో ఉన్నాడు. అతడు సౌత్ఆఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో రెండు సెంచరీలు, ఒక అజేయ హాఫ్ సెంచరీతో 2025ను ఘనంగా ముగించాడు. కొత్త ఏడాదిలో అతు మూడు మైలురాళ్లను అధిగమించవే అవకాశముంది.  విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో మరో 339 పరుగులు చేస్తూ.. ఈ లీగ్‌లో 9,000 పరుగులు చేసి తొలి బ్యాట్స్‌మాన్ అవుతాడు. ప్రస్తుతం అతడు 259 ఇన్నింగ్స్‌లో 8,681 పరుగులు చేసి ఐపీఎల్‌లో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.  అతడి తర్వాత 267 ఇన్నింగ్స్‌లో 7,046 పరుగులు చేసిన రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్‌లో మొదటి నుంచి ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక కోహ్లీ వన్డేల్లో మరో 443 పరుగులు చేస్తే 15,000 మైలురాయిని చేరుకుంటాడు. విరాట్ ప్రస్తుతం 296 ఇన్నింగ్స్‌లో 14,557 పరుగులు చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు.  లిటిల్ మాస్టర్ 452 ఇన్నింగ్స్‌లో 28,426 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు సచిన్ ఒక్కడే వన్డేల్లో 15,000పైగా పరుగుల చేశాడు. మరోవైపు న్యూజిలాండ్, టీమ్ ఇండియాల మధ్య జనవరి 11న తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఒక రికార్డు సృష్టించే అవకాశముంది.  ప్రస్తుతం అతడు అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 623 ఇన్నింగ్స్‌లో 27,975 పరుగులు చేశాడు. మరో 42 పరుగులు చేస్తే ఈ విషయంలో శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర 28,016 పరుగుల రికార్డును అధిగమిస్తాడు. అప్పుడు కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మాన్‌గా అవతరిస్తాడు.

మరోసారి సిట్ కస్టడీలో జోగి బ్రదర్స్

  నకిలీ మద్యం తయారీ కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌ , ఆయన సోదరుడు రాములును మరోసారి సిట్ అధికారులు ఇవాళ కస్టడీలోకి తీసుకున్నారు. మూడు రోజుల పాటు ఇద్దిరిని సిట్ విచారించనుంది. గతంలో ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేసులో జోగి బ్రదర్స్‌ను సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో సారి వారిద్దరినీ కస్టడీలోకి తీసుకుని ఈ కేసుకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది.  ఈ కేసులో జోగి బ్రదర్స్ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. మరోవైపు జోగి కుటుంబానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. జోగి భార్య, కుమారులకు 41ఏ నోటీసులు జారీ అయ్యాయి. జోగి రమేష్ అరెస్ట్ సమయంలో వైద్య పరీక్షలకు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి జోగి ఫ్యామిలీకి పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు.