వెంకన్నదేవుడిపై ఎందుకింత కక్ష.. టీటీడీ చైర్మన్ గా నాస్తికుడికి మళ్లీ అవకాశమా?
posted on Aug 7, 2023 @ 11:20AM
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నూతన చైర్మన్గా భూమన కరుణాకర్రెడ్డి నియమితులయ్యారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరసగా రెండు పర్యాయాలు టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియడంతో అయన స్థానంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి పేరును ఖరారు చేశారు.
నిజానికి గతంలో వైవీ నియామకం విషయంలో చెలరేగిన దుమారం నేప్యంలో ఈసారి అయినా హిందూ ధర్మం పట్ల పూర్ణ విశ్వాసం ఉన్న వారికి టీటీడీ చైర్మన్ పదవి దక్కుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి టీటీడీ చైర్మన్ పదవి ఆశించిన ముగ్గురిలోంచి భూమనను ఎంపిక చేశారు. భూమన గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీటీడీ ఛైర్మన్గా పని చేశారు. జగన్ రెడ్డి మరో మారు ఆయనకు ఆవకాశం కల్పించారు. టీటీడీ చైర్మన్ రేసులో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, సిద్ధ రాఘవరావు పేర్లు కూడా వినిపించాయి. చివరకు దేవుని దయతో భూమనకు పదవి వరించింది.
అయితే అదేమీ పాపమో, అదెక్కడి శాపమో కానీ, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు (2006 నుంచి 2008 వరకు) టీటీడీ పాలకమండలి చైర్మన్గా ఉన్నప్పుడే, ఆయనపై అనేక ఆరోపణలొచ్చాయి. నిజ నిజాలు ఏమో కానీ, ఏడుకొండల పవిత్రతను రెండు కొండలకు కుదించాలనే సంకల్పం భూమన కరుణాకర రెడ్డిదే అంటారు. అలాగే, మిగిలిన్ ఐదు కొండలపై చర్చిలు నిర్మించాలనే సంకల్పం విషయంలోనూ భూమన భూమిక ఉందనే ఆరోపణలు వచ్చాయి. అలాగే భూమన పై టీటీడీ నిధుల దుర్వినియోగం వంటి ఇతరత్రా ఆరోపణలు అనేకం ఉన్నాయి. అన్నిటినీ మించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బాబాయ్ టీటీడీ చైర్మన్ అయినప్పటి నుంచి కొండపై యధేచ్చగా సాగుతున్న అన్యమత ప్రచారం, ఆస్తులు విక్రయం, నిధుల కైంకర్యం, తిరుమలను ఆధ్యాత్మిక స్థాయిని దిగజార్చి, వ్యాపార కేంద్రంగా మార్చేందుకు సాగుతున్న ప్రయత్నాల వంటి అనేక ఆకృత్యాలకు భూమన కరుణాకర రెడ్డి ఆద్యుడనే అరోపణలున్నాయి.
అందుకే ఇప్పడు కూడా ప్రతిపక్షాలతో పాటుగా, హిందూ ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థలు కరుణాకర రెడ్డి నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అన్నిటినీ మించి, భూమనపై అప్పుడు, ఇప్పుడు ఎప్పుడూ వినిపించే ప్రధాన ఆరోపణ ఆయన నాస్తికుడు. వెంకన్న స్వామినే కాదు, అసలు దేవుడినే నమ్మని వ్యక్తి గా ముద్ర వేసుకున్నారని అంటారు. కోట్లాది మంది భక్తులు కొలిచే వెంకన్న దేవుడు భూమన వారి దృష్టిలో కేవలం ఓ నల్ల రాయి . అంతే కాదు, మండే ఎండలో అయినా చెప్పులు లేకుండా కాలినడకన కొండనెక్కే భక్తులనూ అదే తీరుగా అవహేళన చేసిన చరిత్ర భూమనకుందని ఆయన ఒకప్పటి మిత్రులు ఇప్ప్సు సోషల్ మీడియాలో పాత సంగతేలపే గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
అలాగే సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, ఐవైఆర్ కృష్ణా రావు మొదలు అనేక మంది భూమన నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే కాదు భూమన నియామకం వెనక రాజకీయ కుట్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సేవా కార్యక్రమల పేరిట తిరుమల తిరుపతి దేవస్థానం నిధులను దారి మళ్ళించి పందేరం చేసిన విధంగా, రేపటి ఎన్నికలలో గెలిచేందుకు టీటీడీ నిధులను సేవ పేరున పందేరం చేసే కుట్ర దాగుందనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.మరో వంక స్వామీ నీ కొద్దీ అన్యమత నాస్తిక చైర్మన్ యాష్ ట్యాగ్ తో భూమన నియామకానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో భక్తులు తమ మొర స్వామి వారికే వినిపించుకుంటున్నారు. అలాగే శాపనార్ధాలు పెడుతున్నారు.