రాహుల్ తొలి విజయం.. లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ
posted on Aug 7, 2023 @ 12:29PM
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తిరిగి పార్లమెంట్ లో అడుగుపెట్టబోతున్నాడు. ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్దరించినట్టు లోక్సభ సోమవారం (ఆగస్టు 7) నోటిఫికేషన్ విడుదల చేసింది. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్ష అమలుపై ఆగస్టు 4న సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. ఈ మేరకు లోక్ సభ సచివాలయం ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ పరిణామంతో 137 రోజుల అనంతరం రాహుల్ ఎంపీగా కొత్త పార్లమెంట్ భవనంలోకి తొలిసారి అడుగుపెట్టబోతున్నారు. రాహుల్ గాంధీని తిరిగి ఎంపీగా గుర్తించడంతో ఢిల్లీలోని 10 జన్ పథ్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. పార్టీ నేతలతో పాటు ఇండియా కూటమి నేతలకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మిఠాయిలు తినిపించి హర్షం వ్యక్తం చేశారు. అసలింతకీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని డిస్ క్వాలిఫై చేసే విషయంలో లోక్ సభ సెక్రటేరియెట్ వాయువేగంతో నిర్ణయం తీసుకోవడానికి కారణమేమిటంటే, ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి గుజరాత్ లోని కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించింది.
దీంతో రాహుల్ పై అనర్హత వేటు పడింది. ఆయన పార్లమెంటు సభ్యుడిగా కొనసాగడానికి అనర్హుడంటూ లోక్ సభ సెక్రటేరియెట్ ప్రకటించింది. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలేమిటంటే.. దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరు ఎందుకు ఉంటుందో అని 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నాటకలో చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం దావా దాఖలైంది. గుజరాత్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే దాఖలుఈ పరువు నష్టం కేసు దాఖలు చేశారు.
ఈ కేసును విచారించిన సూరత్ కోర్టు రాహుల్ కు రెండేళ్ల జైలు, 15 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. దీంతో ఆయనపై అనర్హత వేటు వేస్తూ లోక్ సభ సెక్రటేరియెట్ నిర్ణయం తీసుకుంది. సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆయన గుజరాత్ హైకోర్టును ఆశ్రయించినా అక్కడా చుక్కెదురైంది. దీంతో ఆయన సుప్రీంను ఆశ్రయించారు. అక్కడ ఆయనకు భారీ ఊరట లభించింది. రాహుల్ జైలు శిక్ష, జరిమానాపై స్టే విధిస్తూ సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది.