కరోనాకు టాబ్లెట్..
posted on Apr 5, 2021 @ 4:46PM
కరోనా వాక్సిన్ అంటే బయపడేవాళ్ళకి గుడ్ న్యూస్. కరోనాకి టాబ్లెట్ వచ్చేస్తోంది. రిడ్జిబ్యాక్ బయోథెరప్యూటిక్-మెర్స్క్ అండ్కో సంయుక్తంగా డెవలప్ చేసిన మోల్నుపిరావిర్ ఔషధంపై చేసిన ప్రయోగాలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి. ప్రస్తుతానికి ఈ ప్రయోగాలు మధ్య దశలో ఉన్నాయి. ఐదురోజుల పాటు ఈ ఔషధాలతో చికిత్స చేస్తే వైరస్ లోడు భారీగా తగ్గిపోయిందని ఇన్ఫెక్షియస్ డిసీజ్ సైంటిస్ట్ల వర్చువల్ సమావేశంలో రిడ్జిబ్యాక్ వెల్లడించింది.
ఇప్పటి వరకు ఆసుపత్రిలో చేరిన పేషెంట్లకు రెమిడెసివిర్తో వైద్యం నిర్వహిస్తున్నారు. దీనికి కూడా 100శాతం ఫలితాలు రావడంలేదు. ఫావిపిరవిర్ పిల్స్ ఇస్తున్నారు. ఇది కొవిడ్ కోసం డెవలప్ చేసిన ఔషధం కాదు. దీంతో పూర్తిస్థాయి ఫలితం ఆశించలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి టైములో కరోనా టాబ్లెట్లు రావడం భారీ ఉపశమనం అనే చెప్పాలి. గతంలో ఫ్లూపై టామీ ఫ్లూ ఎలా పనిచేసిందో.. ఇప్పుడు మోల్నుపిరావిర్ కూడా కరోనాపై అలా వర్క్ అవుట్ చేస్తుందని ఆశిస్తున్నారు. ‘‘ఇది కరోనాను అంతం చేసే దిశగా ఆశాజనకంగా ఉంది.. కానీ, వంద శాతం వర్క్ చేస్తుందని చెప్పలేము. దీనికి క్లినికల్ ఉపయోగాలు ఉంటాయని ఫ్రూవ్ చేయడమే మా కర్తవ్యం’’ అని అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్లో ఎయిడ్స్ విభాగ డైరెక్టర్ కార్ల్ డైఫెన్ బ్యాచ్ తెలిపింది.
ఇప్పటికే ఈ ఔషధంపై అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఆంతోనీ ఫౌచీ కూడా సానుకూలంగా ఉన్నారు. సార్స్ కోవ్-2 వైరస్పై డైరెక్ట్ గా వర్క్ చేసే ఔషధాల అభివృద్ధి ముఖ్యమని ఇటీవల ఆయన అధ్యక్షుడికి తెలిపారు. సాధారణ ఔషధాల వలే మోల్నుపిరావిర్ సార్స్కోవ్-2 స్పైక్ ప్రొటిన్పై ఇది పనిచేయదు. ఇది నేరుగా వైరస్ ఉత్పత్తిని తగ్గించేసేలా ఒక ప్రత్యేకమైన ప్రొటీన్పై ప్రభావం చూపిస్తుంది.
ఫేజ్-2 ప్రయోగాల్లో భాగంగా మొత్తం 182 మందిపై ప్రయోగించగా. రెండు పూటలా మోల్నుపిరావిర్ తీసుకున్న వారిలో ఐదురోజుల తర్వాత వైరస్ కనుమరుగైయిందని. అదే ప్లెసిబో (డమ్మీటాబ్లెట్) తీసుకొన్న వారిలో 24శాతం మందిలో మాత్రమే ఇటువంటి రిజల్ట్ వచ్చింది. ఈ విషయాన్ని రిడ్జ్బ్యాక్ వెల్లడించింది. ఈ ఔషధం కరోనావైరస్ శరీరంలో మళ్ళీ రాకుండా సమర్థంగా అడ్డుకుంటోందని రిడ్జిబ్యాక్ సంస్థ ఫౌండర్ వేనే హోల్మన్ తెలిపారు. ఇప్పటికే ఈ సంస్థ ఎబోలాకు చికిత్సను డెవలప్ చేసి .. దానికి అనుమతులు కూడా పొందింది. ప్రస్తుతానికి ఇది మధ్యంతర ఫలితాలే అని.. దీనిపై త్వరలోనే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని మెర్స్క్ సంస్థ తెలిపింది.