బందీగా కోబ్రా కమాండర్!
posted on Apr 5, 2021 @ 4:38PM
ఛత్తీస్గఢ్లో అడవి నెత్తురోడింది. మావోయిస్టులు, ఖాకీల మధ్యన జరిగిన కాల్పుల్లో అడవి గొల్లుమంది.. కాల్పుల్లో మావోల తూటాలకు 22 మంది భద్రత సిబ్బంది నేలకొరిగారు. అంత మంది మరణం పట్ల డిపార్ట్మెంట్ ఒక్క సారిగా నిర్ఘాంత పోయింది. సైనికుల తల్లి దండ్రులు ఆర్తనాదాలు అడవికి వినిపించేలా... కన్నీళ్లు గుండెను తడిపెల రోదించారు. ఆ తుపాకి చప్పుడు ఆగిన తర్వాత ఒక పోలీసులకు మావోయిస్టుల పేరుతో ఫోన్ కాల్ వచ్చింది.. ఆ ఫోన్ కాల్ తో పోలీసుల గుండెల్లో పిడుగుపడింది. కోబ్రా యూనిట్కు చెందిన ఓ కమాండో కన్పించకుండా పోయారు. అయితే ఆ జవాను ఇప్పుడు మావోయిస్టుల చెరలో ఉన్నట్లు సమాచారం. ఆ కమాండో తమవద్దే ఉన్నాడంటూ నక్సల్స్ పేరుతో ఫోన్ కాల్స్ వచ్చాయి. దీంతో ఆ ఫోన్ కాల్స్పై భద్రతాసిబ్బంది దర్యాప్తు చేపట్టారు.
బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు - పోలీసు బలగాల మధ్య జరిగిన హోరాహోరీ కాల్పుల్లో 22 మంది భద్రతాసిబ్బంది అమరులైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన తర్వాత నుంచి 210వ కోబ్రా బెటాలియన్కు చెందిన కమాండో రాకేశ్ సింగ్ మిన్హా కన్పించకుండా పోయారు. ఆయన కోసం అధికారులు గాలింపు చేపట్టారు.
ఇదిలా ఉండగా.. బీజాపూర్లోని ఇద్దరు స్థానిక జర్నలిస్టులకు ఫోన్కాల్స్ వచ్చాయి. తాము మావోయిస్టులమని, కమాండో రాకేశ్ సింగ్ తమవద్ద బందీగా ఉన్నాడని వారు చెప్పినట్లు విలేకరులు తెలిపారు. ప్రస్తుతం రాకేశ్ సింగ్ క్షేమంగా ఉన్నాడని, రెండు మూడు రోజుల్లో అతడిని విడుదల చేస్తామని వారు తెలిపారని విలేకరులు చెప్పారు. దీంతో సదరు ఫోన్కాల్స్పై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ కీలక మావోయిస్టు దళం నుంచి ఆ కాల్ వచ్చిందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. అయితే కమాండోను నక్సల్స్ తీసుకెళ్లారని చెప్పేందుకు స్పష్టమైన ఆధారాలేమీ లేవని అన్నారు. ఆ జవాను కోసం భద్రతా సిబ్బంది గాలిస్తున్నట్లు వెల్లడించారు.
నా భర్తను క్షేమంగా తీసుకురండి.. కమాండో రాకేశ్ స్వస్థలం జమ్మూ. కిడ్నాప్ గురించి తెలియగానే ఆయన భార్య తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. తన భర్తను క్షేమంగా తీసుకురావాలంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆమె విజ్ఞప్తి చేశారు.