ఈ నెల 12 నుంచి రైళ్ల దారి మళ్లింపు
posted on Mar 10, 2024 @ 2:59PM
రైలు ప్రయాణికులకు అలర్ట్ జారీ అయ్యింది. ఈ నెల 12 నుంచి 22 వరకు వివిధ స్టేషన్ల మధ్య నడిచే రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే శాఖ తెలిపింది. దక్షిణ మధ్య రైల్వే జారీ చేసిన ప్రకటన ప్రకారం.. ఈ నెల 12, 15, 16, 19 తేదీలలో కాచిగూడ, మహబూబ్ నగర్ మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ రైళ్లు షాద్ నగర్ మీదుగా వెళ్లవని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ బ్లాక్ కారణంగా వాటిని వేరే మార్గంలో నడిపిస్తున్నట్లు వివరించారు. కొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు పేర్కొన్నారు.
ఈ నెల 20న హౌరా- శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను నంద్యాల, ఎర్రగుంట్ల మీదుగా నడిపిస్తున్నట్లు చెప్పారు. డోన్, గుత్తి స్టేషన్ల స్టాప్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. ఈ నెల 22న శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం - హౌరా, పూరి - యశ్వంత్పూర్ మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైళ్లను గుత్తి ఫోర్ట్, ఎర్రగుంట్ల, నంద్యాల మీదుగా మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు.