ఉల్లితో ఓవర్ నైట్ కోటీశ్వరుడైన రైతు
posted on Dec 16, 2019 @ 2:15PM
ఉల్లిపాయలు కొనాలనుకునే వినియోగదారుల గుండెలు అదురుతుంటే.. ఓ రైతుకు మాత్రం అవే ధరలు కోట్లకు కోట్లు ఆదాయం తెచ్చి పెట్టింది. రాత్రికి రాత్రి అతని కోటీశ్వరుడిని చేసేసింది. కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా దొడ్డి సిద్ధమన్నల్లికి చెందిన మల్లికార్జున 20 ఎకరాల పొలంలో ఉల్లి సాగు చేశాడు. ఈ సారి మార్కెట్ లో విపరీతమైన రేటు ఉండటంతో అతని పంట పండింది. ఇప్పటి వరకు 240 టన్నులను అమ్మితే నాలుగున్నర కోట్ల వరకు ఆదాయం వచ్చింది. అతను ఈ స్థాయిలో డబ్బు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. ప్రస్తుతం మార్కెట్ లో రేటు దాదాపు రూ.200 వరకు ఉండటం కలిసొచ్చింది. చుట్టు పక్కల మరికొందరు రైతులు కూడా ఉల్లి సాగు చేసిన ఎవరికీ ఇంతలా ఆదాయం రాలేదు. దిగుబడి బాగా ఉండడం, ధర కూడా కనీవినీ ఎరుగని రీతిలో ఉండడతో మల్లికార్జున సుడి తిరిగింది. కొన్నేళ్లుగా ఉల్లి పంట మీద ఆదాయం పెద్దగా లేకపోవడంతో ఈ సారి అప్పు చేసి మరీ పెట్టుబడి పెట్టాడు. తనకు ఉన్న 10 ఎకరాల పొలంతో పాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేశాడు. ఈ సారి దిశ తిరిగి కోట్లకు పడగలెత్తాడు. ప్రస్తుతం తన అప్పులు తీరిపోయాయని వచ్చిన డబ్బుతో ఇల్లు కొనుక్కుంటానని మల్లికార్జున చెబుతున్నాడు. అలాగే మరికొంత వ్యవసాయ పొలం కూడా కొనుక్కుంటానంటున్నాడు మల్లికార్జున్. ఏటా ఉల్లి సాగు చేసినప్పుడు దిగుబడి బాగా వచ్చిన 5 లక్షలకు మించి మిగులు ఉండదని రైతు మల్లికార్జున చెప్తున్నాడు. ఈ సారి కూడా రూ.5 నుంచి 10 లక్షల మధ్యలో మిగిలితే చాలనుకున్నానని కానీ అనూహ్యంగా పెరిగిన రేట్లతో తన కుటుంబం దశ మారిపోయిందంటున్నాడు. ఇప్పటికీ 20 లోడ్ల వరకు ఉల్లిపాయలూ అమ్మాడు, మిగతా పంటను కూడా అమ్మితే ఇంకొంచెం ఆదాయం అతని ఖాతాలో పడబోతుంది.