టీపీసీసీ చీఫ్ మార్పు.. ఢిల్లీలో మకాం వేసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు
posted on Dec 16, 2019 @ 2:32PM
తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ చీఫ్ మార్పు పై ఒకటే చర్చ నడుస్తుంది. కొత్త అధ్యక్షుడు ఎవరనే దానిపై ఇప్పటికే నేతల్లో చర్చలు జరిగాయి. భారత్ బచావో కార్యక్రమం కోసం ఢిల్లీకి వెళ్లిన నేతలు ఇదే అదనుగా లాబీయింగ్ మొదలు పెట్టారు. తమ అనుకూల నాయకుడికి పదవి కట్టబెట్టాలని కొందరు తంటాలు పడుతుంటే లేదు మావాడికే ఇవ్వాలని మరికొందరు అధిష్ఠానంలోని కీలక నాయకులకు చెప్పుకొనేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. సోనియగాంధీ అపాయింట్ మెంట్ కోసం పార్టీలో చాలా మంది సీనియర్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే సీతక్క మాత్రం భారత్ బచావో కంటే ముందే సోనియాను కలిశారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులు పీసీసీ చీఫ్ ఉత్తమ్, ఎంపీలు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లాంటి నాయకులంతా అక్కడే ఉండడంతో పీసీసీ చీఫ్ మార్పు పై గట్టిగానే ప్రచారం జరుగుతోంది. అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో శ్రీధర్ బాబు , రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. తాను కూడా రేసులో ఉన్నానని హడావుడి చేసిన కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నారు. అధిష్టానం అవకాశమిస్తుందన్న ఆశతోనే నాయకులు అభిప్రాయ సేకరణ చేస్తున్నారనే ప్రచారం కొనసాగుతోంది. అయితే సోనియగాంధీ మాత్రం పార్టీ నాయకత్వం పై మార్పు ఆలోచన చేస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి చిన్న అవకాశం దొరికినా నాయకులు తమ మనసులోని మాటను అధినేత్రికి చెప్పి పని చక్కబెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.